Sunday 31 March 2013

బీరువాల్లో పుస్తకాలు - బీభత్స అనుభవాలు


పై ఫోటో చూడండి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. సోనియా గాంధి వెనక ఎన్ని పుస్తకాలో!

'అక్కడున్న పెద్ద మనుషులకి కనీసం ఆ పుస్తకాల టైటిల్స్ అయినా తెలుసునా?'

'ఓయీ అజ్ఞాని! వాళ్ళంతా ఎవరనుకున్నావ్? ఈ దేశాన్ని నడిపిస్తున్న మహామేధావులు. వారికి ఆ పుస్తకాలన్నీ కొట్టిన పిండి. దంచిన కారం. వండిన కూర. పిండిన రసం.'

అలాగంటారా! అయితే మీరు నన్ను క్షమించాలి. ప్రతి మనిషి తన అనుభవాల నుండే జీవిత పాఠాలు నేర్చుకుంటాడు. ఆ దృక్కోణంతోనే జీవితాన్ని చూస్తుంటాడు. ఈ బీరువాలు, పుస్తకాలు పట్ల అనుమానాలు, అపార్ధాలు కలగడానికి చిన్నతనంలో నాక్కలిగిన కొన్ని బీభత్స అనుభవాలే కారణం.

కేస్ నంబర్ 1. ఎదురింటి ప్లీడరుగారు.


చిన్నప్పుడు మా ఇంటెదురు ఒక ప్లీడరుగారు ఉండేవారు. ఇంటి నిండా బీరువాలే! బీరువాల్నిండా దున్నపోతుల్లాంటి పుస్తకాలే! ఆయనెప్పుడూ వాటి మొహం చూసిన పాపాన పోలేదు. పొద్దస్తమానం ఇంటి ముందున్న మామిడి చెట్టు కాయలు ఎవరు కోసేసుకుండా కుక్క కాపలా కాస్తుండేవాడు. ఆయనకి బెయిల్ పిటిషన్ వెయ్యడం కూడా రాదని నాన్న చెప్పేవాడు. మరాయనకి అన్ని పుస్తకాలెందుకబ్బా!

కావున బీరువాల్లో పుస్తకాలకి, ఆ పుస్తక సొంతదార్లకీ సంబంధం ఉండవలసిన అవసరం లేదనే అనుమానం నాలో మొదలైంది. సంబంధం లేకపోతే మానె.. అసలీ బీరువా పుస్తకరాయుళ్ళ శీలాన్నే శంకించాల్సిన సంఘటనలు అటు తరవాత నా జీవితంలో చోటు చేసుకున్నాయి.

కేస్ నంబర్ 2. మామా! ఇదా నీ అసలు రహస్యం!


నా మేనమామ ఒకాయన మంచి ఇల్లు కట్టించాడు. ఇంట్లో టేకు బీరువాలు. వాటి నిండా సాహిత్య పుస్తకాలు! షేక్స్పియర్, మిల్టన్, కీట్స్.. గురజాడ, శరత్ చంద్ర చటర్జీ.. అన్ని పుస్తకాలు నీటుగా, ముద్దొచ్చేలా సర్ది ఉండేవి. ఏ యాంగిల్లో చూసినా నాకాయన ఓ గొప్ప మేధావిలా అనిపించేవాడు. తీరిక సమయాల్లో ఆ పుస్తకాల్ని సర్దుకుంటూ ఆయన కాలక్షేపం చేసేవాడు.

అయితే.. ఆయన అత్తతో ఒక విషయంలో తీవ్రంగా గొడవ పడుతుండేవాడు. మా మేనమామ మామ.. అనగా మా అత్త తండ్రి.. ఇస్తానన్న కట్నం పూర్తిగా ఇవ్వలేక బాకీ పడ్డాట్ట. ఆ బాకీకి వడ్డీ, ఆ వడ్డీకి చక్రవడ్డి వసూలు చేసాడు మా మామ మహానుభావుడు. ఆ బాకీ వసూలు నిమిత్తం మా అత్తని అప్పడంలా వణికించేవాడు. ఇంట్లో దుర్భర వాతావరణాన్ని సృష్టించేవాడు.

ఆంగ్లాంధ్ర సాహిత్యాలని నమిలి మింగేసిన నా మేనమామ ఇంత ఘోరానికి తలపడుతున్నాడేమి? ఎక్కడో ఏదో తేడాగా ఉంది. ఏమది? ఈ అనుమానం కలిగిన మీదట ఆయన సాహిత్య జ్ఞానంపై డిటెక్టివ్ యుగంధర్ లా పరిశోధన చేశాను.

దరిమిలా దిమ్మ తిరిగే వాస్తవాలు తెలిశాయి. మా మేనమామ ఆ పుస్తకాలేవీ చదవలేదు. చదవని ఆ పుస్తకాల పట్ల ఏల ఆయనకీ మమకారం! ఆయన పోయిన నాల్రోజులకే ఆ పుస్తకాలన్నీ కిలోల్లెక్కన అమ్మేసి మా అత్త తన కసి తీర్చుకుంది. అది వేరే విషయం.

కేస్ నంబర్ 3. పుస్తకం రూముకే భూషణం!


డిగ్రీ చదివే రోజుల్లో నాకో స్నేహితుడున్నాడు. అతగాడికి ఆంగ్ల భాషయన్న మిక్కిలి ఎలర్జీ. అంచేత వెర్బులు, నౌన్లు లేకుండా.. ఆంగ్లభాషని ఖండఖండములుగా ఖండించి మాట్లాడుతూ కసి తీర్చుకునేవాడు.

ఉన్నట్టుండి అతగాడి హాస్టల్ రూములో ఆంగ్ల పుస్తక దిండ్లు! విశాలాంధ్ర పుస్తకాల షాపు నుండి టన్ను పుస్తకాలు కొనుక్కొచ్చాడు. పెత్రోవ్, తీస్తొనాస్కీ.. అంటూ అర్ధం కాని పేర్లతో రచయితలు. అన్నీ కలిపి వంద రూపాయలు కూడా అవలేదుట!

'వామ్మో! మనోడిలో ఇంత విషయం ఉందా!' అని కంగారు పడ్డా.

నా కంగారు చూసి మావాడు చిద్విలాసంగా నవ్వాడు. కొద్దిసేపటికి అసలు రహస్యం చెప్పాడు.

'మనం తెలివైన వాళ్ళం. ఆ విషయం నీకూ నాకూ తెలుసు. కానీ ఎదుటి వాడికి ఎలా తెలుస్తుంది? మన గొప్ప మనమే చెప్పుకోలేం గదా! ఆ పని ఈ పుస్తకాలు చేస్తాయి.' అన్నాడు.

'నిజవే! కానీ ఇవి చదవాలంటే కష్టం కదా?' అన్నాను.

'ఓరి అమాయకుడా! ఇవి చదవడానికి కాదు. ఎదుటి వాణ్ని భయపెట్టడానికి. రూములో టేబుల్, టీపాయిల్లాగా ఈ పుస్తకాలూ ఫర్నిచర్లో భాగవే!' అన్నాడు.

దుర్మార్గుడు! పుస్తకం హస్త భూషణం అన్నారు పెద్దలు. వీడు పుస్తకాన్నిరూముకే భూషణంగా మార్చాడు.

కేస్ నంబర్ 4. పుస్తకాలు చేసిన పెళ్లి!


అతను నా జూనియర్. ఓ రోజు హడావుడిగా వచ్చాడు.

"గురూ గారు! మీ ఇంగ్లీష్ నవల్స్ ఓ రెండ్రోజులు అప్పివ్వాలి."

"అన్నీ ఒక్కసారిగా ఎందుకు! ఒకటొకటిగా తీసుకెళ్ళి చదువుకో."

"భలేవారే! అవన్నీ చదవడానికి నాకు పనీపాటా లేదనుకున్నారా! నాకు అమెరికా సంబంధం వచ్చింది. పిల్ల US సిటిజన్. పెళ్లివారు రేపు మా ఇంటికి వస్తున్నారు. నా దగ్గర మన్లెవలుకి తగ్గట్లుగా మధుబాబు, మల్లాది నవల్స్ ఉన్నాయి. నిన్నవన్నీ కట్టగట్టి అటక మీద పడేశాను. ఇప్పుడు మీరిచ్చే ఇంగ్లీషు పుస్తకాలు అద్దాల బీరువాలో నీటుగా సర్దాలి. పెళ్లి వాళ్ళ దగ్గర మార్కులు కొట్టెయ్యాలి." అన్నాడు.

"అన్నీ ఇంగ్లీషు పుస్తకాలైతే నమ్మరేమో! అంచేత పన్లో పని.. రావిశాస్త్రిని కూడా తీసుకెళ్ళు."

"రావిశాస్త్రా! ఎవరాయన?"

"ఆయన తెలుగు సాహిత్యవనంలో రావి వృక్షం వంటివాడు."

"వామ్మో! నాకు వృక్షాలు వద్దు. పుస్తకాలు చాలు. అయినా ఆ అమెరికా వాళ్ళ ముందు నేను తెలుగు పుస్తకాలు చదువుతున్నట్లు కనిపించకూడదు. చీప్ గా ఉంటుంది." అన్నాడు.

నా ఇంగ్లీషు నవల్స్ అట్టపెట్టెలో తీసుకెళ్ళాడు. ప్లాన్ విజయవంతంగా అమలు చేశాడు. అదే అట్టపెట్టెలో జాగ్రత్తగా పుస్తకాలు తీసుకొచ్చి థాంక్సులు తెలిపి వెళ్ళాడు. ఒక్క పుస్తకం కూడా మిస్సవ్వలేదు! పుస్తకాలు చదివేవాడైతే పుస్తకాలు కొట్టేస్తాడు గానీ.. చదవనివాడు నిజాయితీగా తిరిగిచ్చేస్తాడన్న సత్యం బోధపడింది. ఇప్పుడతను అమెరికాలో ఓ పెద్ద డాక్టరు. ఆ విధంగా పుస్తకాల వల్ల పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకోవచ్చని నిరూపించిన మేధావి.

ఇన్ఫరెన్స్ :-


అటు తరవాత పుస్తక ప్రియుల్ని రెండు రకాలుగా విభజించుకున్నాను. మొదటిరకం పుస్తకాలు కొంటారు. లేదా సంపాదిస్తారు. కానీ చదవరు. వారికి పుస్తకాలు కేవలం అలంకార ప్రాయం. స్టేటస్ సింబల్.

రెండోరకం వాళ్ళు పుస్తకాలు చదువుతారు. కొని చదువుతారా, కొనకుండా చదువుతారా సెకండరీ.. మొత్తానికి చదువుతారు. కానీ చదివినట్లు కనపడరు. వారి దగ్గర పుస్తక వాతావరణం కూడా ఉండదు. ISI ఏజంట్ల వలె గుంభనంగా ఉంటారు.

డిస్కషన్ (చర్చ) :-


ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ విషయంకి వద్దాం. పార్టీని గానీ, ప్రభుత్వాన్ని గానీ నడపడానికి ఆ పుస్తకాల అవసరం ఉందా? ఉండదని నా అభిప్రాయం.

'రాహుల్ ని ప్రధాని పదవికి ఒప్పించుట ఎలా? కరుణ లేని కరుణానిధి కరుణా కటాక్షములు తిరిగి సంపాదించుట ఎలా? మూలాయం మూలములేమి? మమత మమతానురాగములను ఏ విధమున పొందవలయును? మాయావతిని మాయలో పడవేయుట ఎట్లు?'

ఈ ప్రశ్నలకి సమాధానాలు ఆ పుస్తకాల్లో ఉండవు. ఆ సమాధానాల్లేని పుస్తకాలతో కాంగ్రెస్ పార్టీకి పన్లేదు. మరైతే అన్నేసి పుస్తకాలు ఆ పార్టీ మీటింగ్ హాల్లో ఎందుకు?!

మన మైండ్ అనేక విషయాలకి ట్యూన్ అయిపోయి ఉంటుంది. రోజువారి పనులకి అనుగుణంగా అనేక ప్రతీకలు మెదడు రిజిస్టర్లో ముద్రించుకుని ఉంటాయి. వాటిననుసరించి యాంత్రికంగా బ్రతికేస్తుంటాం. తేడా వస్తే మెదడులో రిజిస్టర్ ఒప్పుకోదు.

ఉదాహరణకి కాఫీ హోటల్లో గుడి గంట ఉందనుకోండి. కాఫీ పట్ల అనుమానం కలుగుతుంది. అదే విధంగా గుళ్ళో ప్రసాదంగా ఉప్మా పెసరట్టు పెడితే.. ఆ దేవుడి మహిమ పట్ల లేనిపోని అనుమానాలొస్తాయి. అంటే మనకి తెలీకుండానే.. ఒక గదిలో సామాను సర్దినట్లుగా.. మెదడులో రొటీన్ సమాచారం స్టోర్ అయి ఉంటుంది. అందుకే కొద్దిగా తేడా వచ్చినా బుర్రలో తికమక!

కంక్లూజన్ (ముగింపు) :-


అంచేత.. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ హాల్లో బీరువాలు, వాటి నిండా పుస్తకాలు ఉండటం చాలా సబబు. వెనకాల ఆ బీరువాలు, పుస్తకాల ఉండటం మూలానే వాళ్ళంతా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లుగా ఉంది. అవే లేకపోతే వాళ్ళు మేధోమధనం చేస్తున్నట్లుగా ఉండదు. మసాలా దోశలు ఆర్డరిచ్చి.. తినడం కోసం ఆశగా, ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది.

అప్పుడు దేశ ప్రజలకి కోపం వస్తుంది. పిమ్మట ప్రభుత్వాలు పడిపోతాయి. అలా జరగకుండా ఉండాలనే ఆ హాలు నిండా బీరువాలు, పుస్తకాలు ఉంచి.. పార్టీలు, ప్రభుత్వాలు ప్రజాక్షేమం గూర్చి సీరియస్ గా 'ఆలోచిస్తున్న' వాతావరణం కల్పిస్తుంటాయి. చూశారా! బీరువాలకి.. బీరువాల్లో పుస్తకాలకి ఉన్న పవర్!

చివరి తోక.. 

'అవునురే! పుస్తకాల బీరువాల గూర్చి ఇన్ని ఎదవ ఆలోచనలు రాశావు గదా! ఇంతకీ నువ్వే జాతి?'

'అదేందన్నా! ఇదంతా ఎలా రాశాననుకున్నావ్? ఒకప్పుడు నేను పుస్తకాలు చదివేవాణ్ని. ఇప్పుడు పుస్తకాలు కొని బీరువాల్లో 'దాచుకుంటున్నాను'. దొంగతనాల గూర్చి దొంగే చక్కగా రాయగలడు. ఆ మాత్రం తెలీదా!'


(photos courtesy : Google)

Monday 25 March 2013

హ్యాట్సాఫ్ టు రంగనాయకమ్మ!


"ఉతికి ఆరవేయుట!"

"చీల్చి చెండాడుట!"

"చావగొట్టి చెవులు మూయుట!"

ఇవన్నీ అర్ధం చేసుకోవాలంటే ఇవ్వాళ 'ఆంధ్రజ్యోతి' సాహిత్య వేదిక 'వివిధ'లో రంగనాయకమ్మ వ్యాసం "విప్లవాలు కుప్పకూలేది ఇందుకే!" చదవండి.


నా చిన్నప్పట్నించి రంగనాయకమ్మ సాహిత్య విమర్శ చదువుతున్నాను. అప్పటికీ, ఇప్పటికీ ఆమెలో అదే స్పష్టత, సూటిదనం! సాధారణంగా వయసు పైబడుతున్నవారి వాదనలో వాడి, వేడి తగ్గుతుంది. కలంలో పదును బండబారుతుంది. అయితే రంగనాయకమ్మ వీటన్నింటికీ అతీతం!

తెలుగు సాహిత్య విమర్శనా రంగం మర్యాదస్తుల వేదిక. అందుకే విమర్శకులు 'ఎందుకొచ్చిన గోల!' అనుకుంటూ తప్పుకుంటారు. అందుకు ఒక కారణం వారికి ఆ రచయితతో ఉండే సాన్నిహిత్యం. అంచేత మొహమాటం. అలాగే తెలుగు సాహిత్యంలో విమర్శల్ని సహృదయంతో స్వీకరించే వాతావరణం కూడా లేదు. పైగా విమర్శకులపై రచయిత ఎదురుదాడి చేసే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది (ఉదాహరణ.. డా.కేశవరెడ్డి 'మునెమ్మ').

'నామిని' రచనల్ని గోర్కీతో పోలుస్తూ ఎంతగానో మెచ్చుకోవడం.. అటు తరవాత అతని వ్యక్తిత్వం నచ్చక తీవ్రమైన విమర్శ చేయడం.. ఒక్క రంగనాయకమ్మకే చెల్లింది. సన్మానాల కోసం, పురస్కారాల కోసం వెంపర్లాడే రచయితలకి తెలుగు సాహిత్యం పుట్టినిల్లు. ప్రముఖ రచయితలు తమ భజన మండళ్ళని ప్రోత్సాహిస్తూ పీఠాధిపతులుగా చలామణి అవుతుంటారు. ఈ వాతావరణం కారణంగా నిష్కర్షగా, నిర్మొహమాటంగా రాసేవారి సంఖ్య రోజురోజుకీ చిక్కిపోతుంది.


రంగనాయకమ్మ 'విరసం'ని ఇంత తీవ్రంగా విమర్శించడం నాకు విశేషంగా అనిపించడానికి ఇంకో కారణం కూడా ఉంది. రంగనాయకమ్మ రాసుకున్నట్లుగానే.. ఆవిడ వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు చలసాని ప్రసాద్ ఎంతగానో సహాయం చేశాడు. ఇవ్వాళ రంగనాయకమ్మ తీవ్రంగా విమర్శించిన కొడవటిగంటి కుటుంబరావు వ్యాసాల ప్రచురణకి కారకుడు కూడా చలసాని ప్రసాదే! కానీ రంగనాయకమ్మకి దయాదాక్షిణ్యాలు ఉండవు!

సరే! కుటుంబరావు దయ్యాల వ్యాసాల పట్ల నా అభిప్రాయాల్ని "'విరసం' పై నాదీ రంగనాయకమ్మ మాటే!" అంటూ ఇంతకు ముందే రాసేశాను. ఇప్పుడు ఈ టాపిక్ మీద కొత్తగా నే రాసేదేమీ లేదు.. ఒక్క రంగనాయకమ్మని అభినందించడం తప్ప!

"హ్యాట్సాఫ్ టు రంగనాయకమ్మ!"

(photos courtesy : Google)

Wednesday 20 March 2013

"తెలుగు న్యూస్ పేపర్లు చదవకురా చెడేవు."


"తెలుగు న్యూస్ పేపర్లు చదవకురా చెడేవు."

"ఇచట తెలుగు వార్తాపత్రికలు నిషేధించబడినవి."

"తెలుగు వార్తాపత్రికలు చదివినవాడు గాడిద."

"ఈ ప్రాంగణమున తెలుగు వార్తాపత్రికలు వీక్షించిన యెడల శిక్షింపబడెదరు."

"తెలుగు వార్తాపత్రికలు చదివినచో పరీక్షల్లో మీకు గుండు సున్నా ఇవ్వబడును."

అదొక హై స్కూల్. ఆ స్కూల్ గోడల నిండా ఇట్లాంటి వాక్యాలు పెద్దపెద్ద అక్షరాలతో నీతివాక్యాల్లా రాయబడి ఉన్నాయి.

ఒక పక్కగా హెడ్మాస్టర్ గారి ఆఫీస్. ఆ గదిలో ఇద్దరు కుర్రాళ్ళు గోడకుర్చీ వేసి ఉన్నారు. ఇంకో ఇద్దరు కుర్రాళ్ళు గుంజిళ్ళు తీస్తున్నారు. వాళ్ళు చేసిన నేరం.. పొరబాటున ఆ రోజు తెలుగు వార్తాపత్రిక చూశారు!

హెడ్మాస్టర్ గారు ఏవో కాయితాలపై సంతకాలు చేసుకుంటూ అంటున్నారు.

"వెధవల్లారా! ఎంత చెప్పినా మీకు బుద్ధి రాదా? 'ఇంక జన్మలో తెలుగు పేపర్లు చదవం' అని రేపటికల్లా వందసార్లు రాసుకు రండి. అర్ధమైందా?"

ఏమిటీ అనర్ధం? ఎందుకీ అరాచకం? ఇక్కడింత జరుగుతున్నా 'అధికార తెలుగు భాషా సంఘం' ఏం చేస్తుంది? హతవిధీ! ఈ దురాగతాన్ని అరికట్టేవారే లేరా?

అసలేం జరిగిందంటే (ఫ్లాష్ బ్యాక్)..

కొన్నాళ్ళ క్రితం ఆ స్కూలుకి స్కూళ్ళ ఇనస్పెక్టర్ గారు వచ్చారు. పిల్లల హాజరు పట్టీ, ఉత్తీర్ణతా శాతాన్ని పరిశీలించిన పిమ్మట స్కూళ్ళ ఇనస్పెక్టర్ గారు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అందుకు కారకుడైన హెడ్మాస్టర్ గారిని ఎంతగానో అభినందించారు.

'ఈ స్కూల్ బహు ముచ్చటగా యున్నది. పిల్లల తెలివితేటలు ఇంకెంత గొప్పగా యుండునో?' అనుకున్న ఇనస్పెక్టర్ గారికి చివరి క్షణంలో పిల్లల జనరల్ నాలెడ్జ్ పరీక్షిద్దామనే గొప్ప ఆలోచన వచ్చింది. అందుకు అనుగుణంగా హెడ్మాస్టర్ గారు పిల్లల్ని సమావేశపరిచారు.

ఆ పిల్లల్లో ఒకడు చురుకుగా, ధైర్యంగా కనిపిస్తున్నాడు. ముందుగా వాణ్ని లేపారు ఇనస్పెక్టర్ గారు.
"నీ పేరేంటి బాబూ?"

"నిఖిల్ రెడ్డి."

"భారత దేశ స్వాతంత్ర్యోద్యమాన్ని ఎవరు నడిపించారు?" ఉల్లాసంగా నవ్వుతూ ప్రశ్నించారు ఇనస్పెక్టర్ గారు.

"వై.యస్. రాజశేఖర రెడ్డి." తడుముకోకుండా చెప్పాడు నిఖిల్ రెడ్డి.

ఇనస్పెక్టర్ గారు ఆశ్చర్యపోయారు.

"రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడెవరు?"

"చంద్రబాబు నాయుడు." ఠకీమని చెప్పాడు నిఖిల్ రెడ్డి.

ఇనస్పెక్టర్ గారికి సమాధానం అర్ధం కాలేదు. బట్ట బుర్ర గోక్కున్నారు.

"నోబెల్ ప్రైజ్ సంపాదించిన ఒక భారతీయుని పేరు చెప్పు."

"వై.యస్. జగన్మోహన రెడ్డి." బుల్లెట్లా సమాధానం వచ్చింది.

ఇనస్పెక్టర్ గారు హెడ్మాస్టారుని చిరాగ్గా చూశారు. హెడ్మాస్టర్ సిగ్గుతో తల దించుకున్నారు.

ఇనస్పెక్టర్ గారు నిఖిల్ రెడ్డి కూర్చోమని చెప్పి ఇంకొకణ్ని లేపారు.

"నీ పేరేంటి?"

"నవీన్ చౌదరి."

"ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎవరు?" మృదువుగా అడిగారు ఇనస్పెక్టర్ గారు.

"ఎన్టీరామారావు." గర్వంగా చెప్పాడా కుర్రాడు.

ఇనస్పెక్టర్ గారికి కళ్ళు తిరిగాయి.

"భారతదేశ ప్రధాన మంత్రిగా ఒకే ఒక్క తెలుగు వ్యక్తి పనిచేశారు. ఎవరాయన?"

"చంద్రబాబు నాయుడు." బల్ల గుద్దినట్లు చెప్పాడు నవీన్ చౌదరి.

ఇనస్పెక్టర్ గారికి గుండె పట్టేసినట్లైంది. నీరసంగా అడిగారు.

"జలియన్ వాలా బాగ్ దురంతానికి కారకుడెవరు?"

"వై.యస్.జగన్మోహన రెడ్డి." సమాధానం బాణం కన్నా వేగంగా దూసుకొచ్చింది.

ఇనస్పెక్టర్ గారు హెడ్మాస్టార్ని కొరకొరా చూశాడు. ఆయన చూపులకి హెడ్మాస్టర్ గారు విలవిలలాడిపొయ్యారు. ఒక్క ఉదుటున లేచి.. విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపొయ్యారు ఇనస్పెక్టర్ గారు. రెండు చేతులూ నెత్తిన బెట్టుకుని ఉసూరుమంటూ కుర్చీలో కూలబడ్డారు హెడ్మాస్టర్ గారు.

పది రోజుల్లో స్కూళ్ళ ఇనస్పెక్టర్ గారి కార్యాలయం నుండి తాఖీదు. మీ స్కూల్ విద్యార్ధుల నాలెడ్జ్ బిలో యావరేజ్ గా ఉన్నందున మీపై ఎందుకు చర్య తీసుకోరాదంటూ షో కాజ్ నోటీస్. హెడ్మాస్టర్ గారు లబోదిబోమన్నారు. ఆనక నిఖిల్ రెడ్డి, నవీన్ చౌదరిలని పిలిపించారు.

"మీ అమ్మ కడుపులు మాడ! మీరు చక్కగా చదివే స్టూడంట్లే కదర్రా! ఆ ఇనస్పెక్టర్ కి తలతిక్క సమాధానాలు చెప్పి నా కొంప కొల్లేరు చేసారేం?" అంటూ ఫేనంత ఎత్తు ఎగిరారు.

నిఖిల్ రెడ్డి, నవీన్ చౌదరిలు ముఖముఖాలు చూసుకున్నారు. తమ తప్పేమీ లేదనీ.. తాము తమ ఇంట్లో తెప్పించే తెలుగు వార్తాపత్రిక క్రమం తప్పకుండా చదువుతున్నామని.. అందులో రాసిన విధంగానే సమాధానాలు చెప్పామని బావురుమన్నారు.

"వార్తాపత్రికల్లో అలా రాశారా!? ఏం పేపర్లురా అవి?"

"......" అని ఒక పేపర్ పేరు చెప్పాడు నిఖిల్ రెడ్డి.

"....." అని ఇంకో పేపర్ పేరు చెప్పాడు నవీన్ చౌదరి.

హెడ్మాస్టర్ గారు ఆశ్చర్యపోయారు. పిమ్మట ప్యూన్ పుల్లారావుతో ఆ రెండు పేపర్లు తెప్పించారు. పావుగంట పాటు రెండు పేపర్లు తిరగేశారు.

'నిజమే! పాపం పసిపిల్లలు! వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఆ పేపరోళ్ళు రాసిందే నిజమని నమ్మారు. నమ్మిందే చెప్పారు.' అనుకుంటూ దీర్ఘాలోచనలో పడ్డారు హెడ్మాస్టర్ గారు.

అటు తరవాత ఇనస్పెక్టర్ గారి షో కాజ్ నోటీస్ కి ఏదో సమాధానం చెప్పుకుని బయటపడ్డారు హెడ్మాస్టర్ గారు. ఆపై స్కూల్ విద్యార్ధులెవరూ తెలుగు వార్తాపత్రికలు చదవరాదనే నిబంధన పెట్టారు. ఆ నిబంధన కనుగుణంగా స్కూల్ గోడల నిండా కొత్త నీతివాక్యాలు రాయించారు. క్రమశిక్షణ తప్పిన పిల్లల్ని కఠినంగా శిక్షించసాగారు.

అయ్యా! అదండీ కథ!

(photos courtesy : Google)

Saturday 16 March 2013

ఉపన్యాసం.. ఒక హింసధ్వని!



"ఉరేయ్! మన దేశానికి అనవసరంగా సొతంత్రం వచ్చింది. రాకపోతేనే బాగుండేది. ఈ సుత్తి భరించలేకపోతున్నా!" పక్కనున్న రావాయ్ గాడితో విసుగ్గా అన్నాను.

"ష్! హెడ్మాస్టర్ జగన్నాథరావుగారు మననే చూస్తున్నారు." పెదాలు కదపకుండా సమాధానం చెప్పాడు రావాయ్ గాడు ఆలియాస్ రాము.

నిజంగానే మా హెడ్మాస్టర్ గారు పిల్లలందర్నీ సునిశితంగా గమనిస్తున్నారు. అసలే ఆ రోజు ఇండిపెండెన్స్ డే. దొరికితే ఇంతే సంగతులు. అబ్బబ్బా! ఈ హెడ్మాస్టర్ గారితో చస్తున్నాం. దేశానికైతే ఇండిపెండెన్స్ వచ్చింది గానీ.. మాకు మాత్రం హెడ్మాస్టర్ గారి బలవంతపు దేశభక్తి పాఠాల నుండి విముక్తి రాలేదు.

ఆ వచ్చినాయన స్వాతంత్ర్య సమర యోధుడుట. నెత్తి మీద గాంధీ టోపీ. బక్కగా, పొట్టిగా ఆర్కేలక్ష్మణ్ కార్టూన్లా ఉన్నాడు. ఆయన దేశం కోసం ఎంతో త్యాగం చేశాట్ట. బ్రిటీష్ వాడి గుండెల్లో నిద్ర పోయాట్ట. గంటన్నరగా స్వాతంత్ర్యోద్యమం గూర్చి ఆవేశంతో ఊగిపోతూ చెబుతున్నాడు. గాంధీ, నెహ్రూ పేర్లు తప్ప ఒక్క ముక్క అర్ధం అయ్యి చావట్లేదు. మొత్తానికి ఉపన్యాసం అయిపోయింది. చప్పట్లతో ఓపెన్ ఆడిటోరియం మార్మోగింది. ఆ రోజుల్లో పెద్దగా చప్పట్లు కొట్టి ఉపన్యాసం ముగియడం పట్ల మా సంతోషాన్ని (నిరసనని) వ్యక్తం చేసేవాళ్ళం.


మా మాజేటి గురవయ్య హైస్కూల్లో 'ఇండిపెండెన్స్ డే', 'రిపబ్లిక్ డే'లు మాకు ఇష్టమైన దినాలు. జెండా కర్ర దగ్గర కట్టి ఉంచిన తాడు లాగంగాన్లే.. జెండా తెరుచుకుంటూ.. అందులోంచి పూలు రాలడం.. పి. సి.సర్కార్ మేజిక్కులా అనిపించేది. ఒక్కోసారి తాడు ఎంత లాగినా జెండా తెరుచుకునేది కాదు. అది ఇంకా సరదాగా ఉండేది.

నా ఇష్టానికి ఇంకో కారణం.. మా స్కూల్లో ఇండిపెండెన్స్ డే నాడు ఐదు బ్రిటానియా బిస్కట్లు, రిపబ్లిక్ డే నాడు ఒక రవ్వలడ్డు ఇస్తారు. ప్రోగ్రాం అయిపోయి తరవాత మెయిన్ గేటు సగం తెరిచి ఉంచేవారు. బయటకి వెళ్ళేప్పుడు మా బుల్లి చేతుల్లో బిస్కెట్లో, లడ్డో పెట్టేవాళ్ళు. ఆ పెట్టేవాళ్ళు కూడా విద్యార్ధులే.అంచేత ఫ్రెండ్షిప్పు కొద్దీ ఎవడికైనా ఎక్కువ ఇచ్చేస్తారేమోనని కొండా ఆంజనేయులు మాస్టారు వంటి చండశాసన ఉపాధ్యాయుల్ని డిస్ట్రిబ్యూషన్ దగ్గర పర్యవేక్షకులుగా ఉంచేవారు.

సరే! కాలచక్రం గిర్రున తిరిగి.. నేను పెద్దవాడనైనాను. ఆ విధంగా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ల సందర్భంగా ప్రముఖులు వాకృచ్చే గంటల కొద్దీ ఉపన్యాసాలు తప్పించుకుని.. జీవితాన్ని మిక్కిలి సంతోషంగా గడపసాగాను. అయితే విధి బలీయమైనది. దాని చేతిలో మనమందరమూ పాపులమే.. క్షమించాలి.. పావులమే!

అందుకే ఒకానొక ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక స్కూల్లో ఉపన్యసించవలసిన అగత్యం ఏర్పడింది. అగత్యం అని ఎందుకుంటున్నానంటే.. తప్పించుకోడానికి అనేక ఎత్తులు వేశాను. ఉపన్యాసాలు వినడమే ఒక శిక్ష. ఇంక చెప్పడం కూడానా! కానీ కుదర్లేదు. ఆ స్కూల్ వారికి సైకియాట్రిస్ట్ మాత్రమే కావాల్ట (నా ఖర్మ). నాకు అతి ముఖ్యమైన స్నేహితుల నుండి ఒత్తిడి, మొహమాటం.

జెండా ఎగరేసేందుకు ముఖ్య అతిధిగా ఒక పెద్ద ప్రొఫెసర్ గారట. ఆయన మాట్లాడిన తరవాత నేను మాట్లాడాలిట. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచుకోవడం లాంటి చిత్రవిచిత్ర అంశాల గూర్చి నేను ఆంగ్లంలో ఉపన్యసించాలి. అదీ నాకిచ్చిన టాస్క్. ఇట్లాంటి నీతిబోధనలపై నాకంత గౌరవం లేనప్పటికీ ఒప్పుకోక తప్పలేదు.

ఉదయం ఎనిమిదిన్నర కల్లా స్కూలుకి చేరుకున్నాను. ప్రొఫెసర్ గారు జెండా ఎగరేసి వందన సమర్పణ గావించారు. అక్కడ పిల్లల్ని చూసి ఆశ్చర్యపొయ్యాను. చిన్నపిల్లలు. ముద్దొస్తున్నారు.మరీ ఇంత పసిపిల్లలు విద్యార్ధులుగా ఉంటారని నేనూహించ లేదు. కొందరు పిల్లలైతే తప్పటడుగులు వేస్తున్నారు. (ఆ పసిపిల్లలు ఎల్కేజీ వారని స్కూల్ హెడ్ చెప్పాడు.)

పిల్లల్ని తరగతుల వారీగా నేలపై కూర్చోబెట్టారు. ముందు చిన్న తరగతులు. చివర్లో పదో తరగతి. నేనెప్పుడూ ఏ స్కూల్లోనూ స్టేజ్ మీద కుర్చీలో కూర్చోలేదు. అంచేత ఆ అనుభవం నాక్కూడా కొత్తగానే ఉంది. అంతమంది పిల్లలు బారులు తీరి కూర్చోవడం చూడ్డానికి ముచ్చటగా కూడా ఉంది.

ఆ పిల్లలు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవడం గమనిస్తే.. వారికి ఇంగ్లీష్ సరీగ్గా రాదని తెలిసిపోయింది. అసలే నాది డ్రై టాపిక్. కాబట్టి వారికర్ధమయ్యే భాషలోనే ఏడిస్తే మంచిది. అంచేత నా ప్లాన్ మార్చుకున్నాను. నే చెప్పదలుచుకున్న అంశాన్ని మనసులోనే తెలుగులోకి తర్జుమా చేసుకున్నాను. అయినా వీరికి అర్ధమయ్యేట్లు చెప్పడం కష్టమే! అసలు నాకిచ్చిన ఉపన్యాస అంశమే ఇక్కడ ఇర్రిలవెంట్ టాపిక్. ఇప్పుడెలా? ఇరుక్కుపోయ్యానే!

ప్రొఫెసర్ గారు ఇండిపెండెన్స్ డే గూర్చి ఆంగ్లంలో ఉపన్యాసం మొదలెట్టాడు. ఆయనకి ఆంగ్లభాషపై మంచి పట్టు ఉన్నట్లుంది. వింటుంటే హిందూ పేపర్ ఎడిటోరియల్ చదువుతున్నట్లుగా అనిపించింది. కొద్దిసేపటికి ఆయన చెప్పేది నాకు అర్ధం అవ్వట్లేదు! అర్ధం కానప్పుడు వినడం దండగ. అంచేత వినడమే మానేశాను.

స్టేజి మీద ఉన్నాను కాబట్టి దిక్కులు చూస్తుంటే బాగోదు. అందువల్ల ఎదురుగానున్న పిల్లల్ని గమనించసాగాను. వారి మొహంలో కొట్టొచ్చినట్లు విసుగు కనిపిస్తుంది. హఠాత్తుగా నా గురవయ్య హైస్కూల్ రోజులు జ్ఞాపకం వచ్చాయి. ఆ పిల్లల్లో నాకు నేనూ, నా స్నేహితులూ కనిపించసాగారు. ముఖ్యంగా ఆ చివరి వరసలో ఒకడు కోపంగా గుడ్లు మిటకరిస్తున్నాడు. వాడిలో నన్ను నేను దర్శించుకున్నాను!

పక్కనే కూర్చునున్న స్కూల్ హెడ్ ని వాకబు చేశాను. 'వీరికి ప్రోగ్రాం అయిన తరవాత స్నాక్స్ ఇస్తున్నారా?'. ఆయన అట్లాంటి ప్రోగ్రామేమీ లేదన్నాడు. నాకు ఇబ్బందిగా అనిపించింది. గిల్టీగా కూడా అనిపించింది. ఇవ్వాళ దేశానికి పండగ అని చెబుతున్నాం. కనీసం ఒక బిస్కట్ అయినా ఇస్తే పిల్లలు ఎంతగానో సంతోషిస్తారు గదా (అందుకు సాక్ష్యం నేనే)!

ప్రొఫెసర్ గారి ఆవేశపూరిత, ఉద్వేగపూరిత, స్పూర్తిదాయక ఆంగ్లోపన్యాసం పూర్తయింది. పెద్దగా చప్పట్లు. ప్రొఫెసర్ గారి మొహంలో గర్వం. పిల్లలు అంత గట్టిగా చప్పట్లు ఎందుకు కొట్టారు!? ఈ చప్పట్లు మా నిరశన చప్పట్ల వంటివా? ఏమో! కొన్ని ఆనవాయితీల్ని ఎవరూ చెప్పకుండానే ఫాలో అయిపోతుంటాం.

ఇక నా వంతొచ్చింది. స్కూల్ హెడ్ మైకులో నా గూర్చి గొప్పగా చెప్పి పిల్లలకి పరిచయం చేశాడు (నిజానికి నేనంత సమర్దుడనని అప్పటిదాకా నాకూ తెలీదు). మైక్ ముందుకోచ్చాను. గొంతు సరిచేసుకున్నాను. పిల్లల మొహాల్లో చికాకు. 'నాటకంలో రెండో కృష్ణుళ్ళా మళ్ళీ ఇంకోడు' అని వారు అనుకుంటున్నారా!?

ఒక్క క్షణం ఆలోచించాను. నా చిన్నతనంలో నేను ఉపన్యాసాల బాదితుడను. ఇప్పుడు వీరిని నేను అదే ఉపన్యాసంతో ఎందుకు పీడించాలి? పీడితుడు పీడకుడు కారాదు. స్కూల్ యాజమాన్యాన్ని సంతృప్తి పరచడానికి పిల్లల్ని హింసించలేను. వెంటనే నాకు జ్ఞానోదయం అయ్యింది. నేను ఏం చెప్పకూడదో కూడా అర్ధమైంది. ఖచ్చితంగా ఇక్కడ ఎడ్యుకేషనల్ సైకాలజీ మాట్లాడరాదు. మరేం చెప్పాలి?

"పిల్లలూ! బాల్యం చాలా విలువైనది. రోజూ కనీసం గంటసేపు ఆడుకోండి. స్నేహితులతో చక్కగా కబుర్లు చెప్పుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. రోజూ మూడు పూటలా మంచి ఆహారం కడుపు నిండా తీసుకొండి. పాలు తాగండి. గుడ్డు తినండి. పప్పు ఎక్కువగా తినండి." అంటూ తెలుగులో మాట్లాడటం మొదలెట్టాను. ప్రొఫెసర్ గారు నన్ను విచిత్రంగా చూశారు.

నేను మాట్లాడటం కొనసాగించాను.

"జీవితంలో చదువు చాలా ముఖ్యం. కానీ చదువే జీవితం కాదు. సబ్జక్ట్ అర్ధం చేసుకుంటూ చదవండి. డౌట్స్ ఉంటే మీ టీచర్స్ తో చర్చించండి. మార్కుల కోసం పడీపడీ చదవద్దు. మార్కులనేవి అసలు ముఖ్యం కాదు. చదవడం చికాకనిపిస్తే పుస్తకం అవతల పడేసి హాయిగా ఫ్రెండ్స్ తో ఆడుకోండి. నేనదే చేశాను. బీ హేపీ! ఎంజాయ్ యువర్ సెల్ఫ్!" అంటూ ముగించాను. స్కూల్ హెడ్ ఆశ్చర్యంగా నన్నే చూస్తున్నాడు.

మళ్ళీ చప్పట్లు. అయితే ఈసారి చప్పట్లు మరింతగా ఎక్కువసేపు వినిపించాయి. బహుశా నేను నా టాపిక్ మాట్లాడకపోవడం వారికి నచ్చినట్లుంది!

అంకితం..

ఎందఱో మహానుభావులు. అందరికీ వందనములు. స్కూల్స్, కాలేజీలకి ఉపన్యాసకులుగా వెళ్లి.. సుభాషితాలు, హితబోధలు గావిస్తూ విద్యార్ధుల జీవితాలతో ఆడుకునే ఉపన్యాస దుర్జనులకి.. క్షమించాలి.. దురంధరులకి..

కృతజ్ఞత..

'హింసధ్వని' మిత్రులు వల్లూరి శివప్రసాద్ గారి రచన. బంగారు నందితో పాటు ఎన్నో ఎవార్డులు పొందిన 'హింసధ్వని' నాటిక.. ఈ టపా శీర్షికకి ప్రేరణ. 


(photos courtesy : Google)

Monday 11 March 2013

నాన్నా! నన్ను క్షమించు


సమయం రాత్రి ఒంటిగంట. అంతా నిశ్శబ్దం. ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. 'జర్నల్ ఆఫ్ క్లినికల్ సైకియాట్రీ'లొ రివ్యూ ఆర్టికల్ చదువుతున్నాను. విసుగ్గా ఉంది. తల పైకెత్తి చూస్తే ఎదురుగా నాన్న ఫోటో. ఫోటోలోంచి నన్నే చూస్తూ నవ్వుతున్నట్లనిపించింది.

పుస్తకం మూసేశాను. నాన్న! నా జీవితంలో కొన్నేళ్ళపాటు ప్రతిరోజూ ప్రధానపాత్ర వహించిన నాన్న ఇవ్వాళ లేడు. మేమిద్దరం మంచి స్నేహితులం. సినిమాలు, సాహిత్యం, రాజకీయాలు, మానవ సంబంధాలు.. మాకన్నీ చర్చనీయాంశాలే. ఇన్ని కబుర్లు చెప్పిన నాన్న.. పెద్దవాడైనాక.. నన్ను ఏదోక విషయంలో తిట్టేవాడు. కొన్నిసార్లు ఆయన నన్నెందుకు తిడుతున్నాడో ఆయన మర్చిపోయ్యేవాడు.. నాకూ గుర్తుండేది కాదు. ఆయన తిట్లు నాకంతగా అలవాటైపొయ్యాయి!

నాన్న 'బ్రోకర్ మాటలు!' గూర్చి ఒక పోస్ట్ రాశాను. 'బ్రోకరు మాటలు' అన్న మాట నాన్న సొంతం! ఆయనకి  మతమన్నా, దేవుడన్నా చికాకు. పూజలు, పునస్కారాలు చేసే వాళ్ళని విసుక్కునేవాడు. ఆ లిస్టులో అమ్మ కూడా ఉంది. ఆ రకంగా నాన్నకి నేను కృతజ్ఞుడను. నాకెప్పుడూ 'దేవుడున్నాడా?' అనే  సంశయం కూడా కలగకుండా చేశాడు.

ఆయన సిపీయం పార్టీ అభిమాని. ఆ పార్టీ వాళ్ళతో సంబంధాలు ఉండేవి. పుచ్చలపల్లి సుందరయ్యకి భయంకరమైన అభిమాని. ఆశ్చర్యమేమంటే.. నంబూద్రిపాద్ ని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిలా భావించేవాడు. ఎ.కె.గోపాలన్ కారణజన్ముడనేవాడు. ఇదేమి కమ్యూనిజం!

ఆయనో చిన్నపాటి ఉద్యోగం చేసేవాడు. బ్రాడీపేటలోనే పుట్టి పెరిగిన కారణాన వీధివీధికి 'ఏరా!' స్నేహితులుండేవారు.  ఆయన పేరు ధనుంజయరావు. స్నేహితులకి మాత్రం 'ధనంజి'. కనిపిస్తే రోడ్ల మీదే వాళ్ళతో కబుర్లు. ఆయన కబుర్లు ఎక్కువగా రాజకీయాల చుట్టూతానే. ఆయన స్నేహితులు ఇందిరాగాంధీని తిడుతుండేవాళ్ళు. మొరార్జీ దేశాయ్, కామరాజు నాడార్, వి.వి.గిరి మొదలైన పేర్లు విరివిగా వినబడుతుండేది.

నాన్న నన్ను చదువుకొమ్మని ఏ నాడు ఇబ్బంది పెట్టలేదు. కానీ ఆయన వల్ల చిత్రమైన హింసకి గురైనాను. ఆయనకి పులుసులంటే ఇష్టం. కాకరకాయ పులుసు, బెండకాయ పులుసు, వంకాయ పులుసు, సొరకాయ పులుసు.. ఇదొక ఎండ్లెస్ లిస్ట్. ఆ రోజుల్లో అమ్మలు నాన్న మాట వినేవాళ్ళు! ఆయన తన పులుసులతో తీవ్రంగా బాధించేవాడు.

పోనీ సినిమాలైనా మంచివి చూపిస్తాడా అంటే అదీ లేదు. ఆయన కాంతారావు నటించిన కత్తి యుద్ధం సినిమాలన్నీ వరసగా చూపెట్టేవాడు! అన్నీ ఒకేరకంగా ఉండేవి. రాజ్ కపూర్ సినిమాలు చూపించేవాడు. ఒక్క ముక్క అర్ధమయ్యేది కాదు.

ఆయనది తన అభిరుచులే కరెక్ట్ అనుకునే హిట్లర్ మనస్తత్వం. కొంత వయసు వచ్చాక మాకు స్వాతంత్ర్యం లభించింది. పులుసుల నుండి విముక్తీ లభించింది. ఇంట్లో రకరకాల కూరలు. "ఛీ.. ఛీ.. ఇదేం వంట? గేదెలు కూడా తినవు. ఇంతకన్నా జైలు కూడు నయం." అంటూ ఒకటే సణిగేవాడు. ఇంట్లో పులుసులు తగ్గిపోడం ఒక ఇన్సల్ట్ గా భావించేవాడు.


నాన్న నేను పదో క్లాసు ఫస్ట్ క్లాస్ లో పాసయితే వాచ్ కొనిస్తానన్నాడు. పాసయ్యాను. కొన్లేదు. ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాసైతే కొనిస్తానన్నాడు. పాసయ్యాను. కొన్లేదు. మెడిసిన్ సీటొస్తే కొనిస్తానన్నాడు. సీటొచ్చింది. ఇంక తప్పలేదు. ఊరంతా తిప్పితిప్పి బేరం చేసిచేసి 173 రూపాయలతో హెన్రీ శాండెజ్ వాచ్ కొనిచ్చాడు. కొన్న వేళావిశేషం! దాన్ని ఎనాటమీ థియేటర్లో మూడో రోజే పోగొట్టుకున్నాను. ఆయన ఆ రోజు నన్ను తిట్టిన తిట్లకి చెవుల్లోంచి రక్తం వచ్చింది!
                               
గుడిపాటి చలం చివర్లో ఆధ్యాత్మికత వైపు మళ్ళినట్లుగా.. నాన్న చివర్లో ఎన్టీఆర్ ని అభిమానించాడు. ఎన్టీఆర్ దేశాన్ని ఉద్ధరిస్తాడని నమ్మేవాడు. పార్టీల పట్ల లాయల్టీలు మారినా ఆయనకి 'ఉద్ధరింపుడు నమ్మకాలు' మాత్రం మారలేదు! అయితే ఎందుకో ఆయన తను టిడిపి అభిమానిగా ఐడెంటిఫై అవడం ఇష్టపళ్ళేదు. బయటకి మాత్రం సిపియం అభిమానిగానే ఉండిపోయ్యాడు.


ఇక్కడే నేను ఆయన వీక్ పాయింట్ పట్టేశా. ఆయన సిపియం వన్నె టిడిపి! ఆయన మీద 'పులుసు' ప్రతీకారం, సినిమాల రివెంజ్ తీర్చుకోడానికి నాకో మంచి అవకాశం దొరికింది! ఆయనతో కలిసి భోంచేస్తున్నప్పుడు ఎన్టీఆర్ ని భయంకరంగా విమర్శించేవాణ్ణి. నా మీద విపరీతంగా ఆవేశపడేవాడు.

"ఎన్టీఆర్ ని అంటే నీకెందుకు కోపం? సిపియం పార్టీని ఏమన్నా అంటే అప్పుడను. టిడిపి ఒక బూర్జువా పార్టీ. అవునా? కాదా?" ఇదీ నా వాదన.

పాపం! ఆయన మింగలేక కక్కలేక సతమతమయ్యేవాడు. ఏమీ చెప్పలేక.. తన ఫేవరెట్ పంచ్ లైన్ వాడేవాడు.

"బ్రోకరు మాటలు మాట్లాడకు. నీలాంటి బ్రోకరు ఇంట్లో ఉంటేనే శని.. "

అమ్మ విసుక్కునేది. "భోజనాల దగ్గర ఈ గోలేంటి. వాళ్ళెవరో ఏదో చేస్తే మీరెందుకు పోట్లాడుకుంటారు?"

నా వాదనకి  సమాధానం చెప్పలేక కుతకుతలాడిపోతున్న నాన్న కోపం అమ్మ మీదకి మళ్ళించేవాడు. ఆ రోజులు భర్తలకి స్వర్ణయుగం. అంచేత భర్తలు భార్యల్ని ఇంచక్కా తిట్టుకునేవాళ్ళు.

"అసలు దీనంతటికీ కారణం నువ్వే. వీడితో పాటు నాకు భోజనం పెట్టి నన్ను తిట్టిస్తావా?  ప్రపంచంలో నిన్ను మించిన  బ్రోకరు ఎవ్వరూ లేరు." అంటూ అమ్మ మీద ఎగిరేవాడు.

"నాన్నా! నేను నిన్ను తిట్టానా? లేదు కదా! నాకు టిడిపి అంటే ఇష్టం లేదు. అది నా ఇష్టం. ఇంతకీ మీ సిపియం వాళ్ళు టిడిపితో పొత్తు పెట్టుకుంటున్నారా?" అలవోకగా నవ్వేవాణ్ని.

"ఈ దేశాన్ని రెండు శనిగ్రహాలు పీడిస్తున్నయ్యి. ఒకటి ఇందిరాగాంధీ. రెండు నువ్వు." అంటూ నాన్న ఆవేశపడేవాడు.

"మరి ఎన్టీఆర్ ఏ గ్రహమో?" వ్యంగ్యంగా నవ్వేవాణ్ని.

"ఇంట్లో బ్రోకరు ముండాకొడుకులు ఎక్కువైపోయారు. నా సొమ్ము తింటూ ఎద్దుల్లా బలిసి కొట్టుకుంటున్నారు." అంటూ పళ్ళు పటపట లాడించేవాడు.


తనకి నచ్చని వాదనల్ని బ్రోకర్ మాటలంటూ విసుక్కునే నాన్నని తన బ్రోకర్ మాటలతో బుట్టలో వేసుకున్నాడు ఒక మాయల మరాఠి. పేరు ఎన్వీరమణమూర్తి. రమణమూర్తి గూర్చి నా 'ఖడ్గతిక్కన' ఖష్టాలు అంటూ ఒక పోస్ట్ రాశాను.

ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో అమ్మానాన్న. మేడ పైన రెండు గదుల్లో నేనూ, నా చదువుల డెన్. డెన్ కీపర్స్ లో రమణమూర్తి ముఖ్యుడు. మెడిసిన్ టెక్స్ట్ బుక్స్ తక్కువగానూ, సినిమా మేగజైన్స్ ఎక్కువగానూ చదివేవాడు. శ్రీదేవి, రేఖ, దీప బొమ్మల్ని తదేకదీక్షగా చూస్తూ.. వేడిగా నిట్టూరుస్తుండేవాడు.

కొన్నాళ్ళకి నాన్న రమణమూర్తిని పైనుండి పిలిపించి మరీ సహభోజనం చెయ్యసాగాడు. ఓ నాడు ఆయన ఉన్నట్లుండి "మీ ఫ్రెండ్స్ అందర్లోకి రమణమూర్తి ఎంతో ఉత్తముడు. అతని తలిదండ్రులు అదృష్టవంతులు." అని ఓ భారీ డైలాగ్ కొట్టాడు. ఆశ్చర్యపోయాను. వీళ్ళిద్దరి మధ్యా ఏదో జరుగుతుంది! ఏమిటది? మర్నాడు వాళ్ళిద్దరూ భోంచేస్తున్నప్పుడు.. డిటెక్టివ్ యుగంధర్ లా వారి సంభాషణ పై ఓ చెవేశాను.


రమణమూర్తి ఎదురుగా డైనింగ్ టేబుల్ మీద కంచంలో తిరపతి కొండంత అన్నం రాసి! అందులో పప్పు కలుపుతూ మాట్లాడుతూనే ఉన్నాడు. "ఎన్టీరామారావు ఇంటర్నేషనల్ ఫిగర్. అయన్ది అమెరికా ప్రెసిడెంట్ అవ్వాల్సినంత రేంజ్. కనీసం భారతదేశానికి ప్రధాని అవ్వాలి. అవుతాడు కూడా. రవణ గాడి (అనగా నేను)కి బుద్ధి లేదు. అందుకే వాడికి ఎన్టీఆర్ గొప్పదనం అర్ధం కాదు. ఇందిరాగాంధీ ఎక్కడా? రామారావెక్కడా?" చెబుతూనే ఉన్నాడు.

ఆశ్చర్యపోయ్యాను. ఆరి దుర్మార్గుడా! నాకు తెలిసి రమణమూర్తికి రేఖ, రాఖీల మధ్య తేడా మాత్రమే తెలుసు. మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీల మధ్య తేడా మాత్రం ఖచ్చితంగా తెలీదు.

నాన్న ఆనందం పట్టలేకపోతున్నాడు. "మీ ఫ్రెండ్ గాడిదకి బుద్దొచ్చేట్లు నువ్వే చెయ్యాలయ్యా. ఏవే! పాపం రమణమూర్తి ఎంతో కష్టపడి చదువుకుంటున్నాడు. పప్పు మళ్ళీ వడ్డించు. ఇంకొంచెం వంకాయ కూర వేసుకోవయ్యా. నెయ్యి సరిపోదేమో.. "

ఇది మా రమణమూర్తి గాడి కుతంత్రం. నాకు నాన్నని చూస్తే జాలేసింది. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్లు.. బ్రోకర్ మాటలంటూ ఎంతోమందిని విసుక్కున్న నాన్న రమణమూర్తి గాడి బ్రోకర్ మాటలకి పడిపొయ్యాడు. పాపం!

ఆయన నాతో కనీసం బిపి కూడా చూపించుకునేవాడు కాదు. "నువ్వు మెంటల్ డాక్టరువి. బిపి చూడ్డం నీకేం తెలుసు." అనేవాడు. ఎన్టీఆర్ ని విమర్శించే నేను.. ఒక పెద్ద తెలివితక్కువ దద్దమ్మనని ఆయన ప్రగాఢ విశ్వాసం. ఆయనకి తన కోడలు కొడుక్కన్నా మంచి డాక్టరని కూడా నమ్మకం. అంచేత ఆవిడ సలహాలే తీసుకునేవాడు.

ఆయన చివరి రోజుల్లో మంచాన పడ్డాడు. మనిషి ఎముకల గూడులా అయిపొయ్యి మంచానికి అతుక్కుపోయ్యాడు. మనం చెప్పేది అర్ధమయ్యేది కాదు. ఒకసారి ఆయన చెవిలో "నాన్నా! ఎన్టీఆర్ ప్రధానమంత్రి అయ్యాడు." అన్నాను. ఆయన కళ్ళల్లో వెలుగు! ఆయన చనిపోయినప్పుడు ఆయనకి తన బాధల నుండి విముక్తి లభించినందుకు సంతోషించాను. తను ఎంతగానో అభిమానించిన సుందరయ్య, ఎన్టీఆర్ ల దగ్గరకి వెళ్ళిపొయ్యాడనుకున్నాను.

నాన్న నాకు గడియారంలో టైం చూడ్డం నేర్పాడు. సైకిల్ తొక్కడం నేర్పించాడు. ఆంధ్రపత్రిక చదవడం నేర్పించాడు. క్యారమ్స్ ఎలా ఆడాలో నేర్పించాడు. అమ్మకి తెలీకుండా ఆనందభవన్ లో మసాలా అట్టు తినడం ఎలానో నేర్పాడు. ఆయన మహానుభావుడు కాదు. ఒట్టి భావుడు మాత్రమే! చాలా సాదాసీదాగా జీవించిన ఏ ప్రత్యేకతా లేని సగటు జీవి.

నాన్న ఫోటోని చూస్తూ..

"నాన్నా! ఎన్టీఆర్, నంబూద్రిపాద్, సుందరయ్యలు అసలు లీడర్లే కాదు! ఇందిరా గాంధీ నా అభిమాన రాజకీయ నాయకురాలు" అన్నాను.

సమాధానం లేదు. నిశ్శబ్దం! నాన్నకి కోపం రాలేదు. ఫోటోలోంచి అలాగే నన్ను నవ్వుతూ చూస్తున్నాడు! నాన్న నన్ను ఇక ఎప్పటికీ తిట్టడు. తిట్టలేడు. కాలం ఎంత క్రూరమైనది!

"నాన్నా! ఐ మిస్ యు. ఐ మిస్ యువర్ తిట్లు."

నా కళ్ళల్లో తడి.. కళ్ళు మసకబారాయి!

క్షమాపణ..

నేను చాలా తప్పు చేశాను. నాన్నతో నా వాదనల సమయానికే ఆయనలో డిమెన్షియా లక్షణాలు మొదలయ్యాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గాయి. అంచేత.. నాతో వాదించలేక.. మొండిగా మారిపోయ్యాడు. అందుకే ఆయనకి విపరీతమైన కోపం వచ్చేది. నాకా విషయం అప్పుడు తెలీదు. అందుకే ఆయన్ని నా చెత్త వాదనలతో ఇబ్బంది పెట్టాను.

"నాన్నా! నన్ను క్షమించు!"

(photos courtesy : నాన్న ఫోటో : బుడుగు, others : Google)

Wednesday 6 March 2013

'ఎ బ్యూటిఫుల్ మైండ్'.. మరీ అంత బ్యూటిఫుల్లేం కాదు!


ఈమధ్య 'ఎ బ్యూటిఫుల్ మైండ్' అనే ఇంగ్లీషు సినిమా చూశాను. ఇది అప్పుడెప్పుడో ఆదుర్తి సుబ్బారావు తీసిన మన తెలుగు 'మంచి మనసులు' సినిమాకి డబ్బింగ్ కాదు, అనేక ఆస్కార్ అవార్డులు పొందిన ఘనచరిత్ర కలిగిన ఒక హలీవుడ్ చిత్రరాజము. 

ఈ సినిమా చూడాలని కొంతకాలంగా అనుకుంటున్నాను, కారణం - ఈ సినిమా స్కిజోఫ్రీనియా అనే మానసిక వ్యాధితో బాధపడిన ఒక ప్రొఫెసర్ ఆత్మకథ ఆధారంగా తీసార్ట, కొద్దిగా ప్రొఫెషనల్ ఇంటరెస్ట్. ఆడవాళ్ళకి ఏడుపు సినిమాలంటే, పిల్లలకి ఫైటింగు సినిమాలంటే, ఫ్యాక్షనిస్టులకి ఫ్యాక్షనిస్టు సినిమాలంటే ఆసక్తి. నాకూ అంతే!

నేనొక సినిమా చూడాలంటే, ముందు ఆ CD దొరకాలి. తరవాత తీరిగ్గా నా ట్రెడ్మిల్ (ట్రెడ్మిల్ అనగానేమి? కాళ్ళ కింద ఒక పట్టా కరెంటు సాయంతో కదుల్తుంటుంది, మనం పరిగెట్టకపోతే కిందపడి మూతిపళ్ళు రాల్తాయి. అంచేత - రొప్పుతూ, రోజుతూ.. కింద పడిపోకుండా మనని మనం కాపాడుకోటం కోసం ఆ పట్టా మీద పరిగెడుతూనే ఉండాలి. దీన్నే 'వ్యాయామం' అని కూడా అంటారు) సమయంలో చూస్తాను.

సరే! ఈ 'ఎ బ్యూటిఫుల్ మైండ్' సినిమా CD సంపాదించాను. సినిమా చూడ్డం కోసం రొండ్రోజుల నా ట్రెడ్మిల్ సమయం ఖర్చు పెట్టాను. ఈ సినిమా నేను ఒక సాధారణ ప్రేక్షకుడిలా వినోదం కోసం చూడలేదు. అనేకమంది స్కిజోఫ్రీనియా పేషంట్లని వైద్యం చేస్తున్న సైకియాట్రిస్టుగానే చూశాను (చూశారా! ట్రెడ్మిల్ సమయంలో కూడా నా వృత్తి ధర్మాన్ని ఎంత దీక్షగా నిర్వహించానో)!

ఇప్పుడు స్కిజోఫ్రీనియా వ్యాధి గూర్చి  సంక్షిప్తంగా రెండు ముక్కలు. స్కిజోఫ్రీనియా రోగులకి చెవిలో మాటలు (వారికి మాత్రమే) వినబడుతుంటాయి. ఇలా వినబడడాన్ని 'ఆడిటరీ హేలూసినేషన్స్' అంటారు. రోగులు తీవ్రమైన అనుమానాలు, భయాలకి గురి అవుతుంటారు. వీటిని 'డెల్యూజన్స్' అంటారు. వీరికి సరైన సమయంలో వైద్యం చేయించకపోతే రోగికి, కుటుంబానికి, సమాజానికి చాలా ప్రమాదం.

స్కిజోఫ్రీనియా వ్యాధితో (వైద్య సహాయం లేక) బాధ పడుతున్నవారిని మనం రోడ్ల మీద చూస్తూనే ఉంటాం. చిరిగిన బట్టలతో, పెరిగిన జుట్టుతో, తమలో తామే మాట్లాడుకుంటూ, తిట్టుకుంటూ.. కాయితాలు, చెత్త ఏరుకుంటూ.. మురుక్కాలవల్లో నీళ్ళు తాగుతూ.. కనబడుతుంటారు. ఈ స్కిజోఫ్రీనియా వ్యాధి (వైద్యం చేయించకపోతే) అత్యంత తీవ్రమైనది.

'సినిమాలో స్కిజోఫ్రీనియాని ఎలా చూపించారు?'. ఈ సినిమాలో ఒక గొప్ప టెక్నిక్ వాడారు. సినిమా సగంలో మనం ఆశ్చర్యపోయే నిజాలు తెలుస్తాయి. సినిమాలో అప్పటిదాకా మనం చూస్తున్న కొన్ని ప్రధాన పాత్రలు, సంఘటనలు నిజం కాదు. అవి హీరో ఊహల్లోని పాత్రలు. అతని ఆలోచనలకి దృశ్యరూపం. (అతడు అనుమానాలు, భయాలతో కొన్ని ఊహాజనిత పాత్రలు సృష్టించుకుని, వాటితో సంభాషిస్తుంటాడు.)

స్కిజోఫ్రీనియా వ్యాధిలో రోగికి చెవిలో మాటలు వినిపించడం (ఆడిటరీ హేలూసినేషన్స్) చాలా సాధారణం. ఆ మాట్లాడే మనుషులు కనబడటం (విజువల్ హేలూసినేషన్స్) అత్యంత అరుదు. అయితే సినిమాలో కొన్ని సంవత్సరాల తరబడి హీరోకి మూడు పాత్రలు కనబడుతూనే ఉంటాయి. ఆ పాత్రలు హీరోతో సంభాషిస్తూనే ఉంటాయి!

ఒక సీనియర్ సైకియాట్రిస్ట్ (Christopher Plummer) యూనివర్సిటీ కేంపస్ లోకి వెళ్ళి, హీరోతో చెంప దెబ్బ తిని మరీ ఇంజెక్షన్ పొడిచి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు (ఇదేదో 'ప్రజల వద్దకు పాలన'లా ఉంది). అమెరికాలో అలా పేషంట్ల దగ్గరకి డాక్టర్లే వెళ్ళి, ఇంజక్షన్లు పొడిచి, వేన్లలో వేసుకుని మెంటల్ హాస్పిటల్స్ లో పడేస్తారేమో నాకు తెలీదు. మన డాక్టర్లకి మాత్రం హాస్పిటల్ దాటి బయటకి వెళ్ళే అలవాటు లేదు (రావిశాస్త్రి చెప్పినట్లు, ఇక్కడ పులి ఆహారం కోసం వెదకదు. ఆహారమే పులిని వెతుక్కుంటూ వస్తుంది).

స్కిజోఫ్రీనియా వ్యాధి, అందునా తీవ్రమైన హేలూసినేషన్స్ (భ్రమల) తో బాధ పడుతూ command hallucinations ని అనుసరించి కొడుకు చచ్చిపోయేంత పరిస్థితి తెచ్చుకుని భార్యపై దాడి చేసిన పేషంట్, అటు తరవాత మందులు వేసుకోకుండా, ఆ రోగంతోనే సహజీవనం చేసెయ్యడం ఆశ్చర్యమే కాదు, అసాధారణం కూడా. 

ఈ సినిమాలో చూపించినంత తీవ్రస్థాయిలో రోగ లక్షణాలు ఉన్నవారు, వైద్యం మానేస్తే వ్యాధి ముదిరిపోతుంది. వారికి క్రమేపీ బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడం, జీవితం ఆసక్తి తగ్గి ఒక్కోసారి ఆత్మహత్యకి దారి తీయడం జరుగుతుంది. నా పేషంట్లలో కొందరు, పట్టించుకునేవారు లేక అలాగే ఉండిపోయి (catatonic state), ఆహారం లేక ఆకలితో మాడి చనిపోయినవారు ఉన్నారు (starvation deaths). అయితే - కొందరు స్కిజోఫ్రీనిక్స్ తమకి మాత్రమే వినబడే మాటలకి (auditory hallucinations) కి అలవాటైపోతారు. అయితే ఆ మాటలు స్నేహపూర్వకంగా కబుర్లు చెబుతుంటాయి, ఒక్కోసారి రోగిని మెచ్చుకుంటుంటాయి కూడా!

అయితే - సినిమాలో (హీరో ఊహాజనిత) డిటెక్టివ్ పాత్ర (Ed Harris) హీరోని చాలా డిస్టర్బ్ చేస్తుంటుంది. ఆ డిటెక్టివ్ హీరో చెవిలో అదే పనిగా మాట్లాడుతూ (running commentary hallucinations) తో ఇబ్బంది పెడుతుంటాడు. ఆ ఊహాజనిత పాత్రలు హీరోని నీడలా వెంటాడుతుంటాయి! (నాకు Guy de Maupassant దెయ్యం కథకొటి గుర్తొచ్చింది.)

మానసిక వ్యాధితో బాధపడిన ప్రొఫెసర్ గారు తన కథ గొప్పగా రావడం కోసం నాటకీయత సృష్టించాడా? లేక కథ రాయడంలో ఆయనేమన్నా తికమక పడ్డాడా? లేక సినిమా కోసం కథలో మసాలా దినుసులు దట్టించారా? తెలీదు! అందుకే - symptoms ఇంత తీవ్రంగా ఉండి కూడా ఎకడెమిక్స్ లో బ్రిలియంట్ గా కంటిన్యూ అయిపోతాడు, నోబెల్ ప్రైజ్ కూడా కొట్టేస్తాడు!

ఆశ్చర్యం! ఇది ఒక నోబెల్ లారెట్ బయోగ్రాఫిక్ స్టోరీ. సినిమా కోసం 'వినబడే' మాటల్ని 'కనబడే' పాత్రలుగా మార్చేసి డ్రామా సృష్టించారు.. ట! హీరో నోబెల్ ప్రైజ్ తీసుకుంటూ (ఆస్కార్ అవార్డ్ అందుకున్నట్లు) గొప్ప ఉపన్యాసం ఇచ్చేస్తాడు! అంతా గందరగోళంగా లేదు?

ఈ సినిమా గూర్చి ఇంత వివరంగా ఎందుకు రాస్తున్నానంటే, నాకు తెలిసిన ఒకళ్ళిద్దరు ఈ సినిమా గూర్చి చెబుతూ, ఇదొక సీరియస్ రోగం గూర్చి గొప్ప రీసెర్చ్ చేసి తీసిన మంచి సినిమాగా చెప్పారు.. అందుకని. వాస్తవానికి ఈ సినిమాలో ఎక్కువ సీన్లు డ్రామా కోసం మాత్రమే సృష్టించబడ్డాయి.

సరే! హాలీవుడ్ వాడిని ఏదైనా అనేముందు 'మన సంగతేంటి?' అని మీరు అనొచ్చు. మన తెలుగు సినిమా దర్శకుల గూర్చి రాసేంత సాహసం నేను చెయ్యలేను (బియ్యంలో మట్టి గడ్డలు ఏరడం ఈజీ, బియ్యం ఏరడం కష్టం). మనవాళ్ళు అనాదిగా మానసిక రోగుల్ని జోకర్లుగా, శాడిస్టులుగా చిత్రీకరించారు. కారణాలు అనేకం. వారికి మానసిక రోగుల పట్ల కనీస గౌరవం, అవగాహన లేకపోవడం.. కథ రాసుకునేప్పుడు కనీసస్థాయిలో రీసెర్చ్ చెయ్యకపోవడం ప్రధాన కారణాలు.

చివరి తోక :

సుబ్బు ఈ సినిమా చూస్తే ఏమంటాడు?

"రమణ మామ! ఇదేం సినిమా? ఇదసలు సినిమానేనా? ఇంతా చేసి హీరో చివరాకరికి మానసిక రోగిగానే మిగిలిపొయ్యాడు. ఈ సినిమా బాపురమణలు తీసినట్లైతే హీరో భార్యతో రామకోటి రాయించి, ఆ భద్రాద్రి రాముడి కృపతో భర్త రోగం నయమైనట్లు చూపించేవాళ్ళు. ఆ విధంగా బాపురమణలు రామాయణంపై తమ భక్తిని నలభై లక్షల రెండోసారి ప్రదర్శించుకునేవారు.

కె.విశ్వనాథ్ అయినట్లైతే నృత్యసంగీతాలతో హీరోగారి బుర్ర తిరిగిపొయ్యేట్లు చేసి, సారీ - నయం చేసి, మన కళల గొప్పదనాన్ని ఇరవై లక్షల నాలుగోసారి నిరూపించేవాడు. కనీసం దాసరి స్టైల్లో హీరో తలకి దెబ్బ తగిలి రోగం కుదిరినట్లు చూపించినా బాగుండేది. అసలీ సినిమానే రుచీపచీ లేని పెసరట్టులా ఉంటే, అందులో మళ్ళీ నీ బోడి ఎనాలిసిస్సొకటి!"

(photos courtesy : Google)

Friday 1 March 2013

టెర్రరిజం - కొవ్వొత్తిజం


"రమణ మామ! కాఫీ!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.

"కూర్చో సుబ్బు! దేశంలో టెర్రరిస్టులు పెట్రేగిపోతున్నారు. దుష్టులు. దుర్మార్గులు. దున్నపొతులు. నా కడుపు మండిపోతుంది. ఇవ్వాళ సాయంకాలం సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన ఉంది. వెళ్దాం రాకూడదూ?" అడిగాను.

"టెర్రరిస్టు దాడుల్ని కొవ్వొత్తులతో నిరసించడం ఎప్పుడూ ఉండేదేలే! దీన్నే 'కొవ్వొత్తిజం' అందురు. నాకు 'వేలెంటైన్స్ డే' అంటే ఏంటో తెలీదు. అట్లాగే ఈ కొవ్వొత్తులకీ, నిరసనలకీ సంబంధం కూడా తెలీటల్లేదు. తెలీని విషయాల్ని తెలుసుకునే ఓపిక లేదు. కొవ్వొత్తి పట్టుకునేంత ఓపిక అస్సలు లేదు. మరోసారెప్పుడైనా 'కొవ్వొత్తిజం'కి వస్తాన్లే!" అంటూ కుర్చీలో కూలబడ్డాడు.

"దుర్మార్గుడా! నీకోసం మళ్ళీమళ్ళీ దాడులు జరగాలని కోరుకుంటావా? నీకా అవకాశం లేదు. ఉప్పల్ క్రికెట్ మ్యాచ్ కి ఎంతటి భారీ భద్రత ఉందో పేపర్లో చదివావుగా?" అడిగాను.

"ఆ క్రికెట్ మ్యాచ్ లో ఏమీ జరగదు. ఆ విషయం ప్రభుత్వానికీ తెలుసు. ఇది సామాన్య ప్రజల ఆగ్రహం నుండి రక్షించుకోడానికి ప్రభుత్వం వేస్తున్న ఎత్తు. ఎంత బుర్ర తక్కువ దొంగెదవైనా ఓ ఇంట్లో దొంగతనం చేస్తే.. కొన్నాళ్ళదాకా ఈ వీధి మొహం చూడడు. అట్లాంటిది బాంబులు పెట్టేవాడు.. ఇంకెంత తెలివిగా ఉంటాడు?" అన్నాడు సుబ్బు.

"అంటే నిఘా వద్దంటావా?" చికాగ్గా అన్నాను.
"కావాలి. మనకి చాలా కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థ కావాలి. అయితే.. ప్రస్తుతం ఉన్న నిఘా ఒక స్పెషల్ డ్రైవ్ వంటిది. ఆ క్రికెట్ మ్యాచ్ రోజు ఉప్పల్ ఏరియా తప్పించి, హైదరాబాద్ లో మిగిలిన అన్ని ప్రాంతాలు చాలా వల్నరబుల్ గా ఉంటాయి. మనకిది అలవాటేగా!" అంటూ నవ్వాడు సుబ్బు.

ఇంతలో కాఫీ వచ్చింది. సిప్ చేస్తూ.. ఆలోచిస్తూ.. నిదానంగా చెప్పసాగాడు.

"స్కూల్ బస్ ప్రమాదం జరిగితే.. కొన్నాళ్ళపాటు స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై తీవ్ర నిఘా. అలాగే ప్రైవేటు బస్సులపై ఇంకొంతకాలం. జోకేంటంటే.. లంచం తీసుకుని ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన ఉద్యోగులే ఈ స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తారు! అసలు డ్రైవ్ సరీగ్గా లేనప్పుడే స్పెషల్ డ్రైవ్ లు అవసరం. లోగుట్టు ఏమనగా.. మన రాజకీయ వ్యవస్థ తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు.. తాము భద్రతగా ఉన్నామనే భ్రమలో ప్రజల్ని ఉంచేందుకు.. తమ యత్రాంగంతో ఇట్లాంటి ఓవరేక్షన్లు చేయిస్తుంటుంది!"

"మన పోలీసు బలగాల సంఖ్యాబల ప్రదర్శన ఉగ్రవాదుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తాయి." నవ్వుతూ అన్నాను.

"అలాగా! నాకు తెలీదులే! అందుకనేనా? మనవాళ్ళు రైళ్ళ సంఖ్య పెంచమని గోల చేస్తుంది?" సుబ్బు కూడా నవ్వాడు.

"సుబ్బు! నీ వాదన నీదే కదా. దీనికి సమాధానం చెప్పు. అమెరికాలో 9/11 తరవాత మళ్ళీ ఉగ్రవాద దాడులు జరగలేదు. అదెలా సాధ్యం?" బాగా అరిగిపోయిన ప్రశ్నని సంధించాను.

"అందుకు అమెరికాని అభినందించి తీరాలి. అయితే మన దేశాన్ని అమెరికాతో ఎలా పోలుస్తావ్? ఆ మాటకొస్తే ఏ దేశాన్నీ అమెరికాతో పోల్చలేవు. అమెరికా చరిత్ర నిన్నమొన్నటిది. ఆ దేశమే ఒక ఆక్రమిత ప్రాంతం. బ్రతుకుతెరువు కోసం ఎందరో, ఎన్నో దేశాల నుండి వెళ్లి అక్కడ సెటిలయ్యారు. అందుకే వారికి ప్రతి పౌరుడిపై నిఘా పెట్టగల అవకాశం ఉంది. వనరులూ ఉన్నాయి." అన్నాడు సుబ్బు.

"ఆ మాత్రం మనం చెయ్యలేమా?" అడిగాను.

"చెయ్యలేకేం? భేషుగ్గా చెయ్యొచ్చు. అప్పుడు మన చిదంబరం బజెట్ లో విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధికి నిధులుండవు. ఉన్న సొమ్మంతా పోలీసు, రక్షణ శాఖలకి కేటాయించాలి. పోలీసు స్టేషన్లు ఫైవ్ స్టార్ హోటళ్ళలా ఉంటాయి. స్కూళ్ళు మూతబడతాయి. గవర్నమెంట్ హాస్పిటళ్ళు పాడుబడిపోతాయి. సాధారణ జ్వరాలు, దగ్గులకి కూడా చస్తుంటాం. దరిద్రంలో మగ్గిపోతుంటాం. ఒకరకంగా ఈ చావుల కన్నా ఆ నష్టమే అధికం. అప్పుడు ఉగ్రవాదుల లక్ష్యం పూర్తిగా నెరవేరినట్లే." అన్నాడు సుబ్బు.

"అదెలా?" ఆశ్చర్యంగా అడిగాను.

"ఉగ్రవాదం అసలు లక్ష్యం ఒక దేశ ఆర్ధిక మూలాలు దెబ్బ తీసి.. ఆ దేశ ఆర్ధిక ప్రగతిని నిరోధించడమే. ఒక అసమర్ధ రాజకీయ నాయకత్వం మాత్రమే ప్రజల సొమ్ముని దేశరక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం సింహభాగం ఖర్చు పెడుతుంది. అప్పుడు ప్రధాన మంత్రి కన్నా రక్షణ మంత్రి, హోం మంత్రి ముఖ్యులైపోతారు." అన్నాడు సుబ్బు.

"మరప్పుడు అమెరికాకి కూడా ఇదే సమస్య రావాలి గదా." కుతూహలంగా అడిగాను.

"న్యాయంగా అయితే రావాలి. అలా రాకుండా ఉండేందుకు అమెరికా తెలివిగా ఆయుధ వ్యాపారం చేస్తుంటుంది. ఆయుధాల్ని అమ్ముకోడానికి దేశాల మధ్య తగాదాలు, యుద్ధవాతావరణం సృష్టిస్తుంది. వనరుల సమీకరణ కోసం చమురు యుద్ధాలూ చేస్తుంది. అమెరికా కోటి విద్యలూ ఆయుధాల వ్యాపారం కొరకే!" అంటూ నవ్వాడు సుబ్బు.

"అమెరికా మోడెల్ కరెక్ట్ కాదని చెప్పడానికి.. "

"అమెరికా మోడెల్ నీకూ, నాకూ కరెక్ట్ కాదేమో గానీ.. అమెరికన్లకి మాత్రం కరెక్టే అని అనుకుంటున్నాను. అందుకేగా.. మనం రకరకాల కారణాలతో చస్తుంటే.. అమెరికా పౌరులు మాత్రం హాయిగా బీరు తాగుతూ.. నరాలు తెగేంత ఉత్కంఠతో.. బాస్కట్ బాల్ (NBA) ని ఫాలో అవుతుంటారు." అన్నాడు సుబ్బు.

"మరప్పుడు మనమేం చెయ్యాలి? ఒకపక్క డబ్బులు లేవంటావు. ఇంకోపక్క టెర్రరిస్టు దాడుల్ని ఆపాలంటావు." విసుగ్గా అన్నాను.

"ఉగ్రవాద దాడుల్ని నిరోధించేందుకు కావలసింది ప్రజల పట్ల, దేశం పట్లా కమిట్మెంట్ ఉండి.. గొప్ప విజన్ కలిగి ఉండే రాజకీయ నాయకత్వం. ఇందుకు ఏ బజెట్ కేటాయింపులు అవసరం లేదు. అందుకే ఇందుకు బాధ్యత వహించాల్సింది రాజకీయ నాయకత్వం. ఏ దేశంలోనైనా టెర్రరిస్టు దాడులు ముమ్మాటికీ ఆ దేశ రాజకీయ వ్యవస్థలోని వైఫల్యమే." అంటూ ఖాళీ కప్ టేబుల్ పై పెట్టాడు సుబ్బు.

"ఏమిటోయ్ నీ గోల? రాజకీయ నాయకుల్ని ఆడిపోసుకోడం ఒక ఫేషనైపోయింది." KFC లో చికెన్ రుచి చూసిన వాడిలా మొహం పెట్టి విసుక్కున్నాను.

"హోటల్ వాడు చల్లారిన ఇడ్లీలిస్తేనే పోట్లాడతాం. అట్లాంటి మనం ఓట్లేసి రాజకీయ పార్టీలకి అధికారం కట్టబెడుతున్నాం. వీళ్ళు కాశ్మీర్ సమస్య పరిష్కరించరు. పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లతో ఎలా వ్యవహరించాలో స్పష్టత లేదు. కనీసం శ్రీలంకతో ఎలా ఉండాలో కూడా అర్ధం కాదు. ఈ రాజకీయ వ్యవస్థ తన పని నిజాయితీతో చేస్తే.. అప్పుడు వైఫల్యం ఎదురైనా ప్రజల మద్దతు ఉంటుంది. కానీ ఇప్పుడు అలా జరుగుతుందా?" అన్నాడు సుబ్బు.

ఆనందభవన్ పెసరట్టు మహత్యం! మా సుబ్బు అంతర్జాతీయ రాజకీయాలు అనర్గళంగా మాట్లాడేస్తున్నాడు!

"సర్లే! సాయంకాలం కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం ఉంది. నే వెళ్తున్నా. భాధ్యత గల భారతీయుడిగా, ఒక దేశభక్తుడిగా నా నిరసన తెలియజేస్తా!" నొక్కి పలుకుతూ అన్నాను.

"అయితే మీ 'కొవ్వొత్తిజం' వాళ్ళకి నా తరఫున ఓ సలహా ఇవ్వు." నొసలు వెక్కిరిస్తున్నట్లు పెట్టాడు సుబ్బు.

"సలహానా!?" ఆశ్చర్యపోయాను.

"అవును. ఆ 'కొవ్వొత్తిజం' లో డాక్టర్లుంటారు.. రోగుల్ని మోసం చెయ్యొద్దని చెప్పు. ప్లీడర్లుంటారు.. సాక్ష్యాలు తారుమారు చెయ్యొద్దని చెప్పు. వ్యాపారస్తులుంటారు.. ట్యాక్సులు సక్రమంగా కట్టమని చెప్పు. ప్రభుత్వోద్యోగులుంటారు.. లంచాలు మెయ్యొద్దని చెప్పు. జర్నలిస్టులుంటారు.. నిజాయితీగా రిపోర్ట్ చెయ్యమని చెప్పు. సినిమా యాక్టర్లుంటారు.. వెకిలి పాత్రలు వెయ్యొద్దని చెప్పు. ఇవన్నీ టెర్రరిజం అంత ఎమోషనల్ ఇష్యూస్ కాదు. అయితే ఇవి మన దేశానికి ఉగ్రవాదం కన్నా ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయి." అంటూ రిస్ట్ వాచ్ లో టైం చూసుకుంటూ లేచి నిలబడ్డాడు సుబ్బు.

తలుపు తెరుచుకుని.. ఏదో గుర్తొచ్చినవాడిలా ఆగి.. వెనక్కి చూస్తూ నవ్వుతూ అన్నాడు.

"నాకో అనుమానం. బంగారం వ్యాపారస్తులు 'అక్షర తృతీయ' అంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే కొవ్వొత్తుల వ్యాపారస్తులు ఈ టెర్రరిస్టు వ్యతిరేక దేశభక్తులతో 'కొవ్వొత్తిజం' మొదలెట్టించి సొమ్ము చేసుకుంటున్నారా?" అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు మా సుబ్బు!

వర్షం వెలిసినట్లైంది!

(photos courtesy : Google)