Friday 27 July 2012

రావిశాస్త్రి 'వేతనశర్మ కథ'.

పూర్వం మగధ దేశాన్ని సుందరసేనుడనే మహారాజు పాలిస్తుండేవాడు. అతను ప్రజలని దోచుకుంటూ అన్యాయాలు, అక్రమాలు చేయసాగాడు. పన్నుల భారంతో ప్రజలనడ్డి పూర్తిగా వంచేశాడు.

ఆ కాలంలో ఈ రోజుల్లో భారతదేశంలోలాగే నిరక్షరాస్యులు ఎక్కువ. చదువుకున్న అతికొద్దిమందీ.. ఈ దినాల్లో ఉద్యోగస్తులవలె కరణాలుగా పనిచేసేవారు. పల్లెసీమల్లో పన్నులన్నీ వసూలు చేసి భటుల ద్వారా రాజధానికి పంపిస్తుండేవారు. అయితే కరణాలు చిన్నజీతాలతో బతుకుతుండేవారు. వారికి వేతనశర్మ అనేవాడు నాయకుడు.

మగధ దేశంలో ఓసారి క్షామపరిస్థితి ఏర్పడింది. ఆ క్షామంలో చాలామంది పేదలు పిట్టల్లా రాలిపోయేరు. అన్యాయాలు, అత్యాచారాలు చాలా ఎక్కువయేయి. రాజబంధువులంతా చాలా బాగుపడ్డారు.

ఆ రాజ్యంలో మార్కండేయులు అనే ఋషిసత్తముడు ఉండేవాడు. ప్రజలే రాజులైతే తప్ప ప్రజలు మరింక బాగుపడరని ఆ మహర్షి గ్రహించేడు. "రాజుని పారదోలండి. మీ రాజ్యం మీరేలుకోండి!" అంటూ ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తాడు. ఆ తిరుగుబాటులో రాజు తరఫున గ్రామాల్లో పన్నులు వసూలు చేస్తుండే కరణాలు కూడా పాల్గొంటారు. రాజు కుయుక్తులతో మార్కండేయుణ్ణి దోషిగా చిత్రించి చంపించివేస్తాడు.

ఆ వెంటనే, తిరుగుబాటుదార్లందరినీ ఏ విచారణా అవసరం లేకుండానే హింసించి చంపమని సుందరసేనుడు తన సైన్యానికి ఆజ్ఞ జారీ చేసేడు. నేలంతా నెత్తురుమయమయింది. గాలంతా హాహాకారమయింది. ఆకాశం చేతగాని సాక్షిగా మిగిలిపోయింది.

సైన్యం అందర్నీ వేటాడినట్లే కరణాలని కూడా వేటాడనారంభించింది. చదువుకున్న గాడిద కొడుకులకి బుద్ధి చెప్తే మిగతావాళ్ళక్కూడా బుద్ధొస్తుందనే నమ్మకం వల్ల మహారాజు సైన్యం కరణాలని ఎక్కువగా హింసించసాగింది.
                 
ఆ పరిస్థితుల్లో, కరణాల నాయకుడైన వేతనశర్మ ఓ పగలూ, ఓ రాత్రీ కూర్చొని ఆత్మవిమర్శ చేసుకొని "నేనెవర్ని?" అని ప్రశ్నించుకొని  "నేను కరణాన్నే కాని మరెవణ్నీకాను." అని ఖచ్చితంగా తేల్చుకొని, అందువల్ల ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చి, తన కరణపు అనుయాయుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తాడు.
               
"ఈ దోపిడీ అనేది ఉండటం వల్ల మనకి ఏం నష్టం ఉంది? ఈ దోపిడీ నశిస్తే మనకి ఏమి లాభం చేకూరుతుంది? ఈ దోపిడీ రాజ్యం నశించిపోయి ప్రజారాజ్యం వచ్చిందనే అనుకుందాం. అప్పుడు మనకి వచ్చేదేముంది? ఏ మనిషయినా, సంఘమైనా తనకి కావలసినదేమిటో తెలుసుకుని మరీ వ్యవహరించాలి. సమాజాలు పూర్తిగా మారితేనేగానీ జీవితాలు బాగుపడనివాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు విప్లవాలు తెస్తారు. చావుకి తెగిస్తారు. మనం ఆ కోవకి చెందుతామా? చెందం. మాకు వేతనాలతోనే సంబంధం ఉంది, కానీ విప్లవాలతో సంబంధం లేదు అని రాజుకి స్పష్టంగా చెప్పినట్లయితే వారు మనకి ఓ పిడెకెడు జీతం పెంచుతారు." అంటూ తోటికరణాల్ని 'ఎడ్యుకేట్' చేస్తూ సాగుతుంది వేతనశర్మ ఉపన్యాసం.
                 
ఉపన్యాసం విన్న కరణాల కళ్ళన్నీ జ్ణానకిరణాలతో మెరిసిపోయేయి. జీవితంలో వారు సాధించుకోవలసిన లక్ష్యాలని వేతనశర్మ స్పష్టంగా తెలియజేసినందుకు మురిసిపోయేరు. వేతనశర్మని ఆశీర్వదించి.. రాజవర్గంతో తమ తరఫున సంప్రదింపులకి పంపారు. చర్చలు సఫలం అయ్యాయి. అందరికీ తలా చిటికెడు చొప్పున జీతాలు పెరిగాయి.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రభుత్వోద్యోగులంతా ప్రభువు నుండి జీతాలు తీసుకోడమే కాకుండా, వారికి ప్రజల నుండి పారితోషకాలు కూడా పొందే హక్కు కలదని ఆనాటి నుండి గుర్తింపబడింది. ఇది వేతనశర్మ సాధించిన విజయాల్లో చాలా ఘనవిజయం.  

రావిశాస్త్రి కథని ఈ మాటలతో ముగిస్తాడు.
                 
"ప్రభుత్వోద్యోగులకి వేతనశర్మే మొట్టమొదటి పీఠాధిపతి. ఆ తరవాత వేతనశర్మలే కార్మికనాయకులుగా కూడా రూపొందడంతో ప్రభువులంతా సకల ధనకనకవస్తువాహనాలతో తులతూగుతూ ప్రశాంతంగా జీవించుకు వస్తున్నారు. ఎక్కువ జీతాల కోసం సమ్మెలే తప్ప, సమసమాజం కోసం విప్లవాలు వద్దంటారు ప్రభువులు. అవునంటారు ప్రభుత్వోద్యోగులు."
  
1971లో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఈ కధని.. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి జరిగిన ప్రభుత్వోద్యోగుల సమ్మె సందర్భంగా అదే ఆంధ్రజ్యోతిలో అప్పటి సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్యశర్మ పునర్ముద్రించారు.

'అసలేం జరుగుతుంది? మనం ఎవరం? ఎటువైపు? ఎందుకు?' అంటూ చిన్నచిన్న లాజిక్ లతో సాగే వేతనశర్మ ఉపన్యాసం.. ఈ కథకి హైలైట్. ఈ కధలో రావిశాస్త్రి ట్రేడ్మార్కైన సిమిలీలు తక్కువ. అయినప్పటికీ.. చదువరిని కట్టిపడేసే ఆయన మాటల మాయాజాలం, 'కిక్'.. షరా మామూలే!  
                 
ఈ చిన్నకథ రాజ్యం, రాజ్యస్వభావం గూర్చి చర్చిస్తుంది. ప్రజలని దోపిడీ చేసే వర్గసమాజంలో ఉద్యోగులు ఎటు ఉంటారో వివరిస్తుంది. ఒక క్లిష్టమైన రాజకీయ అంశాన్ని సరళతరం చేస్తూ, కధారూపంగా మలచటానికి రావిశాస్త్రి జానపద నేపధ్యాన్ని ఎన్నుకున్నాడు. ఈ కధ 'బాకీ కధలు' సంపుటంలో ఉంది. వేతనశర్మ కథాశిల్పాన్నే.. ఇదే సంపుటంలోని 'పిపీలికం' లో కూడా రావిశాస్త్రి అనుసరించాడు.
              పురాణం సుబ్రహ్మణ్యశర్మ 

(photos courtesy : Google)   

Saturday 21 July 2012

యోగాసనాలు.. కొన్ని సందేహాలు

"యోగాసనాల వల్ల ఉపయోగం వుంటుందా?" ఇది నన్ను నా పేషంట్లు తరచుగా అడిగే ప్రశ్న. 

"నాకు తెలీదు." ఇది నా స్టాండర్డ్ సమాధానం.     

నేనెప్పుడూ ఆసనాలు వెయ్యలేదు. అప్పుడెప్పుడో ఓసారి టీవీలో నేచూసినప్పుడల్లా ఒకతను చాపమీద పడుకుని.. వివిధభంగిమలలో శరీరాన్ని మడతబెడుతూ.. ఘాట్టిగా గాలిపీల్చి వదిలాడు. నాకవి స్ట్రెచింగ్ ఎక్సర్సైజుల్లా అనిపించాయి. అసలు - యోగా, యోగాసనాలు ఒకటేనా? తెలీదు. ధ్యానం చేసుకోవటం యోగాసనం వెయ్యడం అవుతుందా? అదీ తెలీదు. ఇన్ని 'తెలీదు'లు వున్నాయి కాబట్టే నా సమాధానం - 'తెలీదు.

బరువు తగ్గాలంటే మనం కేలరీలని burn చెయ్యాలి. కొంత ఆహారనియంత్రణ ద్వారా.. ఇంకొంత వ్యాయామం ద్వారా కేలరీల్ని మైనస్ చెయ్యొచ్చు. నడవడం, పరిగెత్తడం, టెన్నిస్, స్విమ్మింగ్ మొదలగు ఏరోబిక్ ఎక్సర్సైజుల ద్వారా కేలరీలని ఫైర్ చెయ్యొచ్చు. అయితే.. చాపమీద పడుకుని, కూర్చుని, ఒంగొని కేలరీల్ని ఎలా burn చేస్తాం?!

ఆసనాలు వేస్తే ఎక్కువరోజులు బ్రతుకుతారంటే తప్పకుండా చెయ్యొచ్చు. అయితే 'యోగా చేస్తే దీర్ఘాయుష్షు' అనేదానికి ఋజువుల్లేవు. అనేకమంది యోగా గురువులు రోగాల్తో తీసుకుంటున్నారు. అర్ధంతరంగా 'హరీ'మంటున్నారు. ముప్పైయేళ్ళగా క్రమం తప్పకుండా యోగాసనాల్ని వేసే మా మేనమామ.. ఆసనాల వల్ల తన మనస్సు ప్రశాంతంగా ఉందంటాడు. ఏనాడూ పట్టుమని పద్మాసనం కూడా వెయ్యని నా మనసు కూడా ప్రశాంతంగానే ఉంది మరి!

మనదేశంలో మనిషి ప్రాణానికి భత్రత లేదు. దోమలు, ఈగల వల్ల ప్రతియేడాదీ లక్షలమందిమి చనిపోతుంటాం. వర్షమొస్తే మునిసిపాలిటీ manhole లో కూడా పడి చస్తుంటాం. ఇన్నిరకాలుగా మనకి చావు పొంచిఉండగా - కడుపు మాడ్చుకుని, మెలికలు తిరుగుతూ, ఆసనాలు వేసినా.. యే దోమకాటుకో చస్తే? పడ్డ కష్టం వృధా అయిపోతుంది కదా! ఫలానా విధంగా చస్తామని ముందుగానే తెలిస్తే - ఆ దిశగా నివారణోపాయాలు తీసుకోగలం. సమస్యేమంటే - మనం యెలాంటి చావు చస్తామో తెలిచ్చావదు!
       
మనది పేదదేశం. యెంతోమంది సరైన తిండిలేక పోషకాహార లోపాల్తో రోగాల బారి పడుతుంటారు. మెజారిటీ ప్రజలు వ్యవసాయ పనులు చేసుకుంటారు. పన్లేనప్పుడు దర్జాగా కాలుమీద కాలేసుకుని బీడీలు కాల్చుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్ళకి ఆసనాలతో అసలు పనే లేదు.

నగరాల్లో జిమ్ములుంటాయి. ఇవి ప్రధానంగా డబ్బున్నవారికి ఉపయోగపడుతుంటాయి. ఎటొచ్చీ మధ్యతరగతివాళ్లకే సమస్య. డబ్బు ఖర్చు కాకూడదు, కానీ వ్యాయామం కావాలి. అంచేత వీరు ఉచిత యోగాసనాల క్యాంపుల్లో ఆసనాలు నేర్చుకుంటారు (ఎంట్రీ ఫీజు ఒక్కరూపాయి పెట్టినా ఎవరూ వెళ్లరని మా సుబ్బు అంటాడు). 

ఇట్లా ఆసనాలు నేర్చుకున్న కొన్నాళ్ళకి.. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని, కొద్దిసేపు తెలుగు న్యూస్ పేపర్ తిరగేసి (తెలుగు న్యూస్ పేపర్లో న్యూస్ ఉండదు, అందుకే తిరగేస్తే చాలు.).. చాపెక్కేస్తారు (అనగా - చాప పరుచుకుని, దానిపై కూర్చుంటారని అర్ధం). ఇక ఆసనాలు అనబడు కాళ్ళూచేతులు ఆడించు కార్యక్రమం మొదలెడతారు. కాకపొతే ఇంట్లోవాళ్ళ కాళ్ళకీ, చేతులకీ అడ్డం పడకుండా చూసుకోవలసివుంది.

మనం తెలుగువాళ్ళం. ఆకల్లేకపోయినా ఆహారాన్ని అదేపనిగా పొట్టలోకి నెట్టడం తెలుగువాడి జన్మహక్కు. పరిమిత ఆహారం ఆసనాలలో ఒక భాగం కాబట్టి తిండిమీద కంట్రోల్ వచ్చే అవకాశముంది. కాకపోతే ఆసనాలు వేసి, నీరసంగా ఉందని నాలుగు నేతిపెసరట్లు లాగించే యోగాగ్రేసురులు కూడా వున్నారు.

ఈ ఆసనాలు అనేవి స్వదేశీ వ్యవహారం. నా సైకియాట్రీ సబ్జక్ట్ పూర్తిగా విదేశీగోల. ఆసనాల వల్ల కలిగే లాభనష్టాలు శాస్త్రబద్దంగా సరైన విధానంలో బేరీజు వెయ్యబడలేదు. జాకబ్సన్ అనే ఆయన అప్పుడెప్పుడో PMR (progressive muscle relaxation) అనే టెక్నిక్ చెప్పి వున్నా.. ఆ టెక్నిక్కీ, మన ఆసనాలకీ సంబంధం లేదు. 

ఆసనాలని తెల్లతోలు విదేశీయులు కూడా వేసేస్తున్నారనీ, మన భారతీయ వ్యాయామానికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని మనం గర్వించనక్కర్లేదు. వాళ్ళు మనకన్నా బుర్ర తక్కువ సన్నాసులు. అందుకనే మన ఆధ్యాత్మిక వ్యాపారంగాళ్ళంతా తెల్లతోలు వెధవల్ని భక్తులుగా ముందువరసలో కూర్చుండబెట్టి ఫ్రీ పబ్లిసిటీ కొట్టేస్తున్నారు.

మానసిక వైద్యంలో ఆసనాల ఉపయోగం గూర్చి కొన్ని స్టడీస్ ఉన్నాయి. నాకవి 'చేసినట్లు'గా కాదు, 'రాసినట్లు'గా తోస్తుంది. అంచేత ఈ స్టడీస్ ని ఆధారం చేసుకుని మనం ఒక నిర్ధారణకి రాలేం. నన్ను నా పేషంట్లు అడిగేది 'వైద్యుడి'గా నా సలహా, కాలక్షేపం సలహా కాదు.  

మనదేశంలో చదువుకున్నవాడు సర్వజ్ఞుడని, వాడికి తెలీనిదేదీ వుండదని నమ్ముతారు. ఈ లక్జరీ ఎంజాయ్ చెయ్యడానికి బానే ఉంటుందిగానీ, కొన్నిసందర్భాల్లో ఇబ్బందిగా ఉంటుంది. నాకీ ఆసనాల గోల తెలీదు. నాకేమాత్రం తెలీని విషయంలో రొగోత్తముడకి (ఫీజ్ ఇస్తాడు కాబట్టి రోగి ఎప్పుడూ ఉత్తముడే) ఎలా సలహా చెప్పేది? 

"మన్దగ్గర్నుండి సమాధానం రాబట్టాలనే కుతూహలం తప్ప అడిగేవాడెప్పుడూ ఆసనాలు వెయ్యడు. మనమిచ్చే మందులు సరీగ్గా పని చెయ్యకపొతే ఆ నెపం ఆసనాల మీదకి నెట్టేసే సౌలభ్యం వస్తుంది. అంచేత యోగా చేయ్యమని చెబితేనే మన వృత్తికి మంచిది." అని నా మానసిక వైద్యమిత్రులు అంటారు.

అదీ నిజమే! ప్రతిదీ సందేహాల తోమసయ్య (doubting Thomas) లాగా ఎక్కువ ఆలోచించేకన్నా, లౌక్యంగా తోచిన సలహాలిచ్చిన - స్వామికార్యము, స్వకార్యము చక్కబెట్టుకొనవచ్చును! ఇంత చిన్నవిషయం నా బుర్రకి తట్టలేదేమి?!

Sunday 15 July 2012

మిత్రుడు బి.చంద్రశేఖర్‌కి అభినందనలు


'న్యాయవాది' అనగా ఎవరు? న్యాయం తరఫున నిలబడేవాడే కాదు, న్యాయం కోసం పోరాడేవాడు అని అర్ధం. అయితే - కాలక్రమేణా అనేక వృత్తుల్లాగే 'న్యాయవాది' అర్ధం కూడా మారిపోయింది. రావిశాస్త్రి న్యాయవ్యవస్థ గుట్టు విప్పేసి నడిబజార్లో నిలబెడ్డేసినాక 'చట్టం, న్యాయం' లాంటి పదాల పట్ల నాకు భ్రమలు తొలగిపొయ్యాయి. 

లోకంలో అవినీతి, అన్యాయాలు మాత్రమే సూర్యచంద్రుల్లా పోటీ పడుతూ ప్రకాశిల్లుతుంటాయనీ.. ఆ ప్రకాశం తరిగిపోకుండా న్యాయవాదులు కడు అన్యాయంగా వాదిస్తూ తమవంతు పాత్ర పోషిస్తూ వుంటారనీ, కోర్టులనేవి అన్యాయపు దేవాలయలనీ అర్ధమయ్యాక - నేను న్యాయవాదుల గూర్చి పట్టించుకోవటం మానేశాను.

ఇక్కడంతా మట్టిగడ్డలే, అన్నీ కంకర్రాళ్ళే అని తీర్మానించేసుకున్నవాడు.. హఠాత్తుగా ఒక బంగారపు రాయో, వజ్రపు తునకో కనపడితే ఆశ్చర్యపోతాడు. సరీగ్గా ఇట్లాంటి ఆశ్చర్యం నాకు మిత్రుడు భువనగిరి చంద్రశేఖర్‌ని చూసినప్పుడు కలిగింది. చంద్రశేఖర్ న్యాయవాది! అటు తరవాత కొన్ని కేసుల్లో చంద్రశేఖర్ నిబద్దతా, తపనా చూసినప్పుడు న్యాయవాద వృత్తి పట్ల గౌరవం కలిగింది. 

భవనగిరి చంద్రశేఖర్ నాకు చాలాకాలంగా స్నేహితుడు. చంద్రశేఖర్ని స్నేహితులం 'చంద్రా' అని పిలుచుకుంటాం. మొదటిసారిగా మిత్రుడు గోపరాజు రవి ఇంట్లో ఏసీ కాలేజ్ లా విద్యార్ధిగా వున్నప్పుడు కలిశాడు. ఇద్దరికీ సిగరెట్లు కాల్చే అలవాటు, ఇద్దరికీ పుస్తకాలు చదివే అలవాటు, ఇద్దరికీ కబుర్లు చెప్పే అలవాటు. అందువల్ల మా స్నేహం మా ప్రమేయం లేకుండానే, ఎటువంటి ప్రయత్నం లేకుండానే బలపడింది!

చంద్రశేఖర్ పుస్తకాలు విపరీతంగా చదువుతాడు, మంచి పుస్తకాలు మన్చేత చదివించడానికి ప్రయత్నం చేస్తాడు. 'సమాజంలో బలహీనుల హక్కులు కోసం పోరాడతావు గానీ - బలవంతంగా పుస్తకాలు చదివిస్తూ స్నేహితుల హక్కులు హరిస్తున్నావ్!' అని నేను విసుక్కున్న సందర్భాలు వున్నయ్! చంద్రశేఖర్ న్యాయానికి అన్యాయం చెయ్యడు. అన్యాయానికి మాత్రం అన్యాయమే చేస్తాడు. ప్రత్యక్షంగా చూసాను కనుక ఈ విషయం గట్టిగా చెప్పగలను. 

చంద్రశేఖర్ ఇంగ్లీషు రాసినా, తెలుగు రాసినా ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ రాసినట్లు అక్షరాలు ముత్యాలు పేర్చినట్లుగా ముచ్చటగా వుంటాయి. నేనేది రాసినా మలయాళీ మాంత్రికుడు పాళీ భాషలో రాసినట్లు అడ్డదిడ్డంగా వుంటుంది. అందువల్ల నాకు చంద్రా అంటే జెలసీ! చంద్రశేఖర్ మంచి వక్త. ఆంధ్రాంగ్లముల్లో అనర్గళంగా ఆలోచింపజేసే ఉపన్యాసాలు ఇవ్వగలడు. అందువల్ల కూడా నాకు చంద్రా అంటే జెలసీ!

చంద్రశేఖర్ భార్య చంద్రిక. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. నాకు స్నేహితురాలు, మేమిద్దరం హాయిగా కబుర్లు చెప్పుకుంటాం. కొడుకు శశాంక్ కూడా న్యాయశాస్త్రాన్ని చదువుకుంటున్నాడు. వాణ్ని చిన్నప్పుడు ఎత్తుకున్నాను, ఇప్పుడు బారుగా ఎదిగిపొయ్యాడు.

బి.చంద్రశేఖర్ గూర్చి కొన్ని వివరాలు -

కె.జి.కన్నాభిరాన్‌కి ప్రియశిష్యుడు.

1927 లో అమెరికాలో ఉరిశిక్షకి గురికాబడ్డ 'శాక్కో - వాంజెట్టి' (వ్యధార్త జీవిత యధార్ధ దృశ్యం) కేసు పూర్వాపరాలతో  1995 లో పరిశోధానాత్మకమైన పుస్తకాన్ని వెలువరించాడు. (పర్‌స్పెక్టివ్స్ ప్రచురణ)

2003 లో 'ఏన్జీవోల కథ' అంటూ విదేశీ నిధులతో నడిచే స్వదేశీ స్వచ్చంద సంస్థల గుట్టు విప్పుతూ ఒక పుస్తకాన్ని రాశాడు. (పర్‌స్పెక్టివ్స్ ప్రచురణ)

చిలకలూరిపేట బస్ దహనం కేసులో ఉరిశిక్ష రద్దు కోసం రాష్ట్రపతి భవన్ గేట్లు తట్టాడు. 

చుండూరు మారణకాండ కేసులో సుదీర్ఘకాలం (స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా) దళితుల తరఫున వాదించాడు. ఇప్పుడీ కేసు హైకోర్టులో నడుస్తుంది. ప్రస్తుతం హైకోర్టులో కూడా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధితుల తరఫున వాదిస్తున్నాడు.

'చట్టబద్ద పాలనలో శిక్షలు విధించాల్సింది కోర్టులే కానీ - పోలీసు వ్యవస్థ కాదు.' నిందితుల్ని తనదైన స్టైల్లో శిక్షించిన ఒక పోలీసుకి (ఐపీఎస్ ఆఫీసర్) వ్యతిరేకంగా జాతీయ మానవ హక్కుల కమీషన్ నుండి నేడు న్యాయాన్ని రాబట్టాడు.

'ఆల్ ద బెస్ట్ చంద్రా! వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్!'

చంద్రా, చంద్రిక, శశాంక్‌లకి అభినందనలతో -

(photo courtesy : B.Chandrasekhar)

Friday 13 July 2012

బీనాదేవి 'ఫస్ట్ కేస్'.. కొన్ని ఆలోచనలు!


కొన్నికథలు చదుతున్నప్పుడు బాగుంటాయి. మరికొన్ని కథలు చదివిన తరవాత కూడా బాగుంటాయి. అతికొన్ని కథలు చదివిన తరవాత చాలాకాలం వెంటాడుతుంటాయి, మన  ఆలోచనల్ని  ప్రభావితం  చేస్తుంటాయి. నన్నలా వెంటాడిన కథ 'ఫస్ట్ కేస్'. ఈ కథని 'బీనాదేవి' 1967 లో రాశారు. ఈ కథ సంక్షిప్తంగా - (ఎర్ర అక్షరాలు బీనాదేవివి).

డబ్బులో పుట్టి పెరిగిన ఆనందరావు డాక్టర్ పట్టా పుచ్చుకున్నాడు. అతని సూట్లు టెర్లిన్వి. అతని సిగరెట్లు ఇంగ్లీషువి. అతని కారు ఫ్రెంచిది. అతని ఊహలు అమెరికన్వి. అమెరికా వెళ్దామన్న ఆలోచన ఉంది. అతనెలాంటివాడన్న ప్రశ్నకి, బహుశా అతనే చెప్పలేడేమో! అతని జీవితమంతవరకు కరగని కలలా ప్రశాంతంగా జరిగిపోయింది.

మిత్రుడు రాజు ఆహ్వానం మేరకు డాక్టర్ ఆనందరావు ఒక పల్లెటూరుకి వెళ్తాడు. రాజు ఇంటి నుండి కొంతదూరంలో పల్లె వస్తుంది. దాన్ని దాటుకుని పోతే రాజుగారి తోట వస్తుంది. ఒక శీతాకాలపు సాయం సమయాన ఆనందరావు ప్రకృతి అందాలని ఆస్వాదించు చుండగా -

ఎనిమిదేళ్ళ పిల్లొకర్తె వచ్చి నిలబడింది. దూరం నుండి చూస్తే కాకిపిల్లలా అసహ్యంగా ఉంది. ఆర్రోజులై అన్నం మొహం ఎరగనట్లుందా పిల్ల. "డిస్టింక్టిలీ ఏన్ ఎడ్వాన్సెడ్ కేస్ ఆఫ్ మాల్‌న్యూట్రిషన్." అనుకున్నాడానందరావా పిల్లని చూడగానే. ఆ కాకిపిల్ల తన చెల్లికి చాలా అనారోగ్యంగా ఉందని, వైద్యం చెయ్యమని ప్రాధేయ పడుతుంది.

డాక్టర్ పట్టా మాత్రమే పుచ్చుకున్న ఆనందరావు ఇంతవరకూ పేషంటుని చూళ్ళేదు. చూడమని అతన్ని ఎవరూ బ్రతిమాలనూ లేదు. ఈ కొత్త అనుభవాన్ని ఎంజాయ్ చెద్దామని ఆనందరావు ఆ  పిల్లతో పాటు వాళ్ళ గుడిసెకి వెళ్తాడు. అక్కడ కనిపించిన దరిద్రానికి ఖిన్నుడవుతాడు.

ఇంత దరిద్రం, ఇంత మంచిగా కనిపించే తన ప్రపంచంలోనే వుంటుందని అతనూహించలేకపోయాడు.

ఒక మూల తాళ్ళు తెగిన నులక కుక్కిమంచంలో విరిగిన బొమ్మలాంటి ఒక ఆరేళ్ళ పిల్ల పడుకునుంది. ఆరేళ్ళు కేవలం వాయుభక్షణం మాత్రం చేసినట్లుంది. చేపల్లాంటి ఆ పిల్ల కళ్ళు తెరచి వుండటం వల్ల చచ్చితేలిన ఎర్రచేపల్లా వున్నాయి.

నశించిపోతున్నాశలా మంచంవారనే ఆ పిల్ల తల్లి నిల్చొనుంది. ఆమెకెన్నేళ్ళుంటాయి? ఎన్నున్నా నూరేళ్ళు నిండిపోయినట్లుంది.

తిండిలేక ఎండిపోయిన ఆ పిల్లకి మందులతో పాటు ఆహారం కూడా కావాలని ఆనందరావుకి అర్ధమౌతుంది.

"పిల్లకేదేనా అర్జంటుగా తింటానికివ్వాలి."

"బిందెలో నీల్లూ, బొందిలో పానాలు తప్ప నాకాడేట్నేవు."

"దేశంలో ఇంత దరిద్రమా?" అని బాధపడ్డాడానందరావు. తను నమ్మిన దేవుడు తనని మోసం చేసినట్లూ, తను పెంచిన పావురం పెనుపక్షై గోళ్ళతో తన పీక పట్టుకున్నట్లు ఫీలయ్యాడు.

ఇది తన 'ఫస్ట్ కేస్'. ఎలాగైనా ఈ పిల్లని బ్రతికించాలి. అంచేత ఆ పిల్ల అక్కని తనతోబాటు మిత్రుడి ఇంటికి తీసుకెళ్ళి ఒక ఫ్లాస్క్ నిండా హార్లిక్స్ పోసి, త్వరగా ఇంటికెళ్ళి చెల్లికి తాగించమంటాడు. మందుల బీరువా తాళాలు వెతుక్కుని, సిరెంజి బోయిల్ చేసుకుని పరుగుపరుగున తన ఫస్ట్ కేస్ దగ్గరకి వెళ్తాడు ఆనందరావు.

ఆనందరావు వెళ్ళేప్పటికి ఆకలితో ఆ పేషంట్ చనిపోతుంది. ఆ పిల్ల అక్క దరిదాపుల్లో కనబడదు. తన ఫస్ట్ కేస్ ఇలా ఫెయిల్ అయినందుకు.. కాళ్ళు మొయ్యలేనంత బరువెక్కిపోయిందతని మనసు.

కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే! బాధతో మిత్రుడి ఇంటికి తిరిగి వెళ్తున్న ఆనందరావుకు దారిలో ఓ గోడకి ఆనుకుని నిద్రపోతున్న రోగి అక్క కనపడుతుంది. ఆ పిల్ల వెనక కసిగా పడగ విప్పి ఒక నల్లత్రాచు ఉంది. ఆ పిల్ల వెనకాల రాతిపలక మీదున్న ఖాళీఫ్లాస్కుని చూస్తాడు. ఆ పిల్ల అతనికి మరోపాములా కనబడుతుంది!

రోగికి చేరవలసిన హార్లిక్స్‌ని మధ్యలోనే అక్క తాగేసింది! చెల్లి ఆకలితో చచ్చిపోయింది! ఆకలితో కాలే కడుపుకి అనుబంధం, ఆత్మీయత గుర్తుండవు. మనిషిలోని అన్ని బంధాల్ని చెరిపేసే శక్తివంతమైనది ఆకలి.

కొంత ద్వైదీభావం తరవాత - ఆర్నెల్లలో అమెరికా వెళ్ళిపోవడం ద్వారా ఆనందరావు సమస్య పరిష్కారమైపోతుంది. టూకీగా ఇదీకథ.

నా మాట -

సరే! ఈ బీనాదేవి కథ తెలుగు సాహిత్యంలో చాలా ప్రముఖమైనది. ఈ కథ గుణగణాలని విశ్లేషించే ఉద్దేశం నాకు లేదు. ఫస్ట్ కేస్ కథావస్తువు, శిల్పం వంటి ఎకడెమిక్  అంశాల్ని కొందరు విశ్లేషించారు. కాబట్టి ఆ విషయాలు పక్కన పెడదాం. అయితే - ఈ కథ నలభై అయిదేళ్ళ కన్నా ఇప్పుడే రిలవెంట్ అనుకుంటున్నాను.

మారుతున్న కాలం.. మారుతున్న సమాజం.. మారుతున్న విలువలు.. పెరుగుతున్న డబ్బు ప్రాధాన్యత.. వేగంగా వ్యాపారీకరించబడుతున్న వైద్యవిద్య, వైద్యం - ఈ కథ విలువని మరింతగా పెంచుతున్నాయి. ఎల్కేజీ నుండే వేల ఖర్చుతో.. సమాజానికి దూరంగా.. మెరిట్ కి దగ్గరగా.. కేవలం సబ్జక్ట్ విషయాల్నే వల్లె వేయిస్తూ.. డబ్బు సంపాదనే ధ్యేయంగా, ఆశయంగా ఈ సమాజం అనేక ఆనందరావుల్ని తయారుచేస్తుంది. మనం ఆనందరావుల్ని నిందించి ప్రయోజనం లేదు. బీనాదేవి కూడా ఆనందరావుని చెడ్డవాడిగా చెప్పలేదు.

కథ మొదటిసారి చదివినప్పుడు చెల్లి చావుకి కారణమైన అక్కని కోపగించుకున్నాను. పాఠకుణ్ణి ఆకట్టుకోవడానికి రచయిత చేసిన జిమ్మిక్ లాగా కూడా అనిపించింది. కడుపు నిండినవాడికి కడుపు కాలేవాళ్ళ పనులు అరాచకంగానూ, అకృత్యాలుగానూ కనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడయితే ఈ ముగింపే ఈ కథని ఎంతో గొప్పగా ఎలివేట్ చేసిందని నమ్ముతున్నాను.

ఈ కథ ప్రతి మెడికల్ కాలేజి వార్షిక మ్యాగజైన్లలో ప్రచురించాలని, ప్రతి వైద్యుడూ తప్పక చదవాలని - ఆ రోజుల్లో మా స్నేహితులం అనుకుంటుండేవాళ్ళం. తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రముఖమైన ఈ కథని చదవనివారు ఉండకపోవచ్చు. ఒకవేళ ఎవరైనా చదవనివారు ఉంటే దయచేసి చదవండి. ఈ పోస్ట్ ఉద్దేశ్యం కూడా ఇదే!

(photo courtesy : Google)

Monday 9 July 2012

తెలుగుజాతికి అవమానం! ఎంత ఘోరం!!


"రమణ మామ! కాఫీ." అంటూ హాడావుడిగా వచ్చాడు సుబ్బు.


"కూర్చో సుబ్బు! ఒక తెలుగువాడికి ఘోరమైన అన్యాయం జరుగుతుంది. నాకు బాధగా ఉంది." దిగులుగా అన్నాను.

"ఎవరా తెలుగువాడు? ఏమా అన్యాయం?" ఆసక్తిగా అడిగాడు సుబ్బు.

"మన పి.వి.నరసింహారావు మీద ఏదో కుట్ర జరుగుతుంది సుబ్బు. పేపర్ చదవలేదా?" ఆశ్చర్యంగా అన్నాను.

"ఓ అదా! నేనింకేదో అనుకున్నాను." అంటూ నవ్వాడు సుబ్బు.

"సుబ్బు! నీ నవ్వు పరమ దరిద్రంగా ఉంది. ఒకపక్క తెలుగుజాతి పరువు నట్టేట మనిగిపోతుంది." చికాగ్గా అన్నాను.

"ఇందులో తెలుగుజాతికి జరిగిన నష్టమేంటో నాకర్ధం కావట్లేదు. పి.వి.నరసింహారావు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఎమర్జన్సీలో కూడా పార్టీలో కీలక వ్యక్తి. ఒకానొక ప్రత్యేక పరిస్థితుల్లో.. అదృష్టవశాత్తు ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రధానమంత్రి అయ్యాడుగానీ.. తెలుగువాడు కాబట్టి ప్రధానమంత్రి కాలేదు." అన్నాడు సుబ్బు.

"కానీ ఆయన తెలుగువాడు.. "


"అవును. నే చెప్పేదీ అదే! ఆయన మాతృభాష తెలుగు. గొప్పపండితుడు. వేయిపడగల్ని హిందీలోకి అనువదించాడు. ఆయన భాషాశాస్త్ర పాండిత్యానికి శతకోటి వందనాలు. అయితే పి.వి.నరసింహారావు ప్రధానమంత్రి కావడానికి ఇవేవి కారణం కాదు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలే కారణం. కానీ.. మనం ప్రముఖులైనవారికి మన తెలుగుభాష ముద్ర వేసుకుని వారిని మనలో కలిపేసుకుని ఆనందిస్తాం. వారి గూర్చి తెగ తాపత్రయ పడిపోతాం. మంచిదే. ఇక్కడిదాకా నాకు పేచీ లేదు."

ఇంతలో కాఫీ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ  చెప్పసాగాడు సుబ్బు.

"కానీ ఈ కారణాన ఆ వ్యక్తిని ఆ వ్యక్తికి చెందిన రంగంలో గుడ్డిగా సమర్ధించడాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఉదాహరణకి ఆల్ ఇండియా ఇన్స్టిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ లో కార్డియాక్ సర్జన్ వేణుగోపాల్ కి, కేంద్ర ఆరోగ్యమంత్రి అంబుమణి రాందాస్ కి గోడవయింది. అది కేవలం రెండుగ్రూపుల మధ్య తగాదా. అప్పుడుకూడా ఆ డాక్టరుకి 'తెలుగు తేజం' అంటూ ఒక కిరీటం తగిలించి ఏదో ఘోరం జరిగిపోయిందని గగ్గోలు పెట్టాం. మనకిదో రోగం."

"సుబ్బు! నీకసలు భాషాభిమానం లేదు. నీ చెత్త ఎనాలిసిస్ ఆపెయ్యి." విసుగ్గా అన్నాను.

"నాకు భాషాభిమానం లేకపోవచ్చు. కానీ నీది భాషా దురభిమానం. ఇప్పుడు ఢిల్లీలో రాబోయే ఎన్నికలకి సన్నద్ధమయ్యే తతంగం నడుస్తుంది. బాబ్రీ మసీదు కూలగొట్టినప్పటి అలసత్వం ఒక మరకగా కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెడుతుంది. ఎలాగైనా ఆ మరక తుడిచేసుకోవటానికి తంటాలు పడుతుంది. అందులో భాగంగానే ఆ మురికంతా పి.వి.నరసింహారావుకి పూసే ప్రయత్నం జరుగుతుంది. 'మసీదు కూల్చివేత సమయంలో ఆయన పూజామందిరంలో ఉన్నాడా? బాత్రూంలో ఉన్నాడా?' అన్నవి ప్రజలకి సంబంధం లేని అనవసర విషయాలు. పి.వి. తెలుగువాడయినా, బెంగాలీవాడయినా ఈ ప్రచారం జరగక మానదు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. మధ్యలో మనమెందుకు బాధ పడటం?" అంటూ చిన్నగా నవ్వాడు సుబ్బు.

"కానీ తెలుగువాడి రక్తం.. "


"రక్తం లేదు. రసనా లేదు. ఎవడి రాజకీయ అభిప్రాయాలు వాడికున్నాయి. గ్లోబలైజేషన్ అనుకూలం వాళ్ళకి  పి.వి. దేవుడు. వ్యతిరేకులకి ఆయనొక దెయ్యం. హిందూమత రాజకీయ భావాలు కలవారికి పి.వి. రాజకీయ చాణుక్యుడు. సెక్యులర్ భావాలవారికి ఆయనొక అసమర్ధ ప్రధాని. రాజకీయాలు మనం చూసే దృష్టికోణం బట్టి ఉంటాయి." అన్నాడు సుబ్బు.

"కానీ పి.వి.నరసింహారావు దేశప్రధానిగా చేశాడు. ఇవ్వాళ కాంగ్రెస్ ఆయన్ని గడ్డిపోచ కన్నా హీనంగా చూస్తుంది." అన్నాను.

"రాజశేఖరరెడ్డి నిన్నగాక మొన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేసినవాడు. ఇప్పుడు రాజశేఖరరెడ్డి ఫొటో గాంధీభవన్లో పెట్టటానికి ప్రయత్నించి చూడు. కాంగ్రెస్ నాయకులు నిన్ను పిడిగుద్దులతో చంపేస్తారు. ఇవి రాజకీయాలు నాయనా! అత్యంత క్రూరమైనవి. ఇవ్వాళ నిన్ను ఒకందుకు పల్లకిలో ఎక్కిస్తారు. రేపు మరొకందుకు కుళ్ళబొడుస్తారు." అంటూ ఖాళీ కప్పు టేబుల్ పై పెట్టాడు సుబ్బు.

"నువ్వు చెప్పేది బాగానే ఉంది. కానీ నాకు నచ్చలేదు." అన్నాను.

"నీకు నచ్చకపోతే కొంపలేమీ మునగవులే! స్వాతంత్ర్యానంతరం మనదేశంలో సంభవించిన అత్యంత ముఖ్యమైన ఘటనని రాజకీయ కోణం నుండి కాక.. ప్రాంతీయ, భాషాకోణం నుండి ఆలోచించే నీకు నేను అర్ధం కాను. పి.వి.నరసింహారావుకి జరుగుతున్న అన్యాయానికి నువ్వు తీరిగ్గా బాధపడు. నాకు పనుంది. వెళ్ళాలి!" అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు!

(photo courtesy : Google)

Friday 6 July 2012

తెల్లతోలు 'తెలుగు' హీరోయిన్లు.. ఒక పిచ్చిథియరీ!

'తెలుగు సినిమాల్లో తెలుగెప్పుడో చచ్చిపోయింది, కొన్నాళ్ళుగా హీరోయిన్‌గా తెలుగమ్మాయీ చచ్చిపొయ్యింది. ఇప్పుడు బొంబాయి నుండి దిగుమతైన తెల్లతోలు అమ్మాయిలు మాత్రమే హీరోయిన్లు.' 

అతగాడు నా చిన్ననాటి స్నేహితుడు, సినిమా ప్రేమికుడు. ఇప్పటి తెలుగు సినిమాల దుస్థితి గూర్చి బోల్డంత బాధ పడ్డాడు. నాకతని బాధ అర్ధం కాలేదు. నా దృష్టిలో - సినిమా చూడ్డం దురదేస్తే గోక్కోడంలాంటిది. సిగరెట్లు తాగనివాడికి సిగరెట్ రేటు ఎంత పెరిగితే మాత్రం లెక్కేంటి! అలాగే - సినిమాలు చూడ్డం నేనెప్పుడో మానేశాను. నేను చూడని సినిమా బ్రతికినా చచ్చినా నాకనవసరం.

'మేం సినిమాలు కళాపోషణ కోసం తియ్యట్లేదు, మిర్చివ్యాపారంలా మాదీ ఒక వ్యాపారం' అని సినిమావాళ్ళే చెబుతున్నారు - కాబట్టి వాళ్ళతో పేచీ లేదు. తెల్లతోలు అమ్మాయిల్ని తెలుగువాళ్ళు చూస్తున్నారు కాబట్టే వాళ్ళని బొంబాయి నుండి నిర్మాతలు దిగుమతి చేసుకుంటున్నారు. నిర్మాతలకి వ్యాపార ప్రయోజనం తప్ప ఇంకే ప్రయోజనం వుంటుంది? వాళ్ళెవరికైనా డబ్బులివ్వాల్సిందే గదా! తెలుగు అమ్మాయిలు ఫ్రీగా నటిస్తారా?

ఇప్పుడు - 'తెలుగు ప్రేక్షకుడు తెల్లతోలు అమ్మాయిల్ని ఎందుకంతగా ఇష్టపడుతున్నాడు?' అనే ప్రశ్నకి సమాధానం ఆలోచిద్దాం. 

సినిమా అంటే వెండితెరపై కథ చెప్పడం. రచయిత కథని కాగితంపై రాసినట్లే, దర్శకుడు సినిమాని వెండితెరపై రాస్తాడు. కొన్ని కథలు బాగుంటాయి, మరికొన్ని బాగోవు. ఈ బాగోగులు అనేది మనం కథతో కనెక్ట్ కావడంపై ఆధారపడి వుంటుంది. ఇలా కనెక్ట్ కావడం అనేది విజయానికి కీలకం.

ఇప్పుడు కొన్ని ఉదాహరణలు - డెబ్భయ్యో దశకంలో యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి మొదలగు రచయిత్రీమణులు తెలుగు నవలా ప్రపంచాన్ని యేలేశారు. పడవకార్లు + రాజ భవంతులు + ఉన్నిసూట్లతో ఆరడగుల ఆజానుబాహు హీరోల్ని పాపులర్ చేశారు. హీరోలు - కల్యాణ్, రాజేష్, అవినాష్, సునీల్.. ఇలా కళకళ్ళాడే పరభాషా పేర్లతో వెలిగిపొయ్యారు. వీళ్ళందరికీ గురువు శరత్‌చంద్ర చటర్జీ అనే బెంగాలీ రచయిత. 

ఖరీదైన హీరో ఒక మధ్యతరగతి అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు. ఆ అమ్మాయికేమో డబ్బున్నవాడు వెధవనీ, వాజమ్మనీ నమ్మకం. అంచేత హీరోగారి ఖరీదైన ప్రేమని కూడా గడ్డిపోచలా తిరస్కరిస్తుంది. ఆ అమ్మాయికి కావలసింది నీతి + నిజాయితీ +  ప్రేమించే స్వచ్చమైన మనస్సు!

ఆరోజుల్లో మధ్యతరగతి అమ్మాయిలు స్కూల్ ఫైనల్ (అంతకన్నా ఆడపిల్లలకి చదువెందుకు? ఉద్యోగాలు చెయ్యాలా? ఊళ్ళేలాలా?) తరవాత తీరిగ్గా పెళ్లికోసం ఎదురుచూస్తూ వుండేవాళ్ళు. రాబోయే భర్త కోసం అందమైన కలలు కన్డానికి వాళ్ళోకో ముడిసరకు కావాలి. సరీగ్గా ఈ అవసరం కోసమే రచయిత్రుల నవలా సాహిత్యం పుట్టింది. అమ్మాయిలు ఆ నవలా హీరోయిన్లో తమని చూసుకుని మురిసిపోయ్యారు. దీన్నే 'ఐడెంటిఫికేషన్' అంటారు. 

హీరో అందగాడు, ధనవంతుడు. అతను తమవెంట పడటం అనే ఊహ (నిజజీవితంలో గుడికి వెళ్ళాలన్నా తమ్ముడు తోడు లేకుండా వెళ్ళలేని పరిస్థితి) ఆ అమ్మాయిలకి భలే 'కిక్' ఇచ్చి ఉంటుంది. ఇదీ ఐడెంటిఫికేషన్ గొప్పదనం. ఇట్లాంటి నవలలు రాయడం అనేది గుడి ముందు కొబ్బరికాయల వ్యాపారంలా మంచి గిట్టుబాటు వ్యవహారం.

మనమిప్పుడు 'ఐడెంటిఫికేషన్' పవర్ అర్ధం చెసుకున్నాం. ఇదే అవగాహనతో తెలుగు సినిమాల్ని అర్ధం చేసుకోడానికి ప్రయత్నిద్దాం. అనాదిగా తెలుగు సినిమాల పోషకులు ఆటోడ్రైవర్లు, మెకానిక్కులు, చేతిపనివాళ్ళు, రైతుకూలీలు మొదలైనవాళ్ళు. వీరిలో ఎక్కువమంది డార్క్ స్కిన్‌తో అయిదున్నర అడుగులు మించకుండా వుంటారు. ఈ వర్గాలవాళ్ళు హీరోతో ఐడెంటిఫై అవ్వగలిగితే హీరో విజయవంతంగా నిలబడగలడు. 

సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి హీరో స్థానంలో తనని ఊహించుకోవడం చాలా ఈజీ అవ్వాలి. అందుకే తమలో వొకడిగా కనపడే చిరంజీవిని తెలుగువాళ్ళు, రజనీకాంత్‌ని తమిళంవాళ్ళు పెద్ద హీరోలుగా మార్చేశారు. దీన్నే సినిమా పండితులు 'ఇమేజ్' అంటారు. చిరంజీవి సొఫెస్టికేటెట్‌గా ఉన్నా, రజనీకాంత్ నల్లగా లేకున్నా వారికిప్పుడున్న స్టార్‌డమ్ వచ్చేది కాదు. ఇలా తమకంటూ వొక ఇమేజ్ వున్న నటులతో కథ నడిపించడం దర్శకుడికి సులువు.  

సగటు సినిమా ప్రేక్షకుడి నిజజీవితం యెలా వుంటుంది? అతనికి గర్ల్ వుండదూ, ఫ్రెండూ వుండదు. యే అమ్మాయీ అతన్ని కన్నెత్తి చూడదు. తను కూలిపని చేస్తున్న ఇంటి యజమాని కూతురు.. రోజూ తన ఆటో ఎక్కే ఆంటీ.. తను కాలవలు క్లీన్ చేస్తుండే లేడీస్ హాస్టల్ అమ్మాయిలు.. వీరంతా అందంగా ఉంటారు (డబ్బుకీ అందానికి అవినాభావ సంబంధం వుంది). మనవాడికి వాళ్ళని తీరిగ్గా చూసే ధైర్యం ఉండదు. జీవితంలో వెలితి, అసంతృప్తి, చికాకు, అసహనం.

ఇప్పుడు 'ఫాంటసీ థింకింగ్' గూర్చి రెండుముక్కలు. మానవుడికి వాస్తవ ప్రపంచంలో అనేక సమస్యలు. ఈ సమస్యల ప్రపంచం నుండి గొప్పరిలీఫ్ ఫాంటసీ థింకింగ్! పేదవాడు పచ్చడి మెతుకులు తిని.. తన మహరాజా పేలెస్‌లో కన్యామణులు వింజామరలు వీచుచుండగా.. వైన్ సిప్ చేస్తూ బిరియానీ భోంచేస్తున్నట్లు ఈష్ట్‌మన్ కలర్లో (కనీసం గేవా కలర్లో) ఊహించుకోవచ్చు. దీనిక్కావలసిందల్లా దిండూ, దుప్పటి.. కించిత్తు ఇమాజినేషన్ (ఈ 'ఫాంటసీ థింకింగ్' ఒకస్థాయి దాటితే మానసిక రోగం అవుతుంది).

సినిమావాళ్ళు కలల వ్యాపారాలు. సామాన్యూల కలలకి అందమైన రంగులద్ది ఒక ఊహాప్రపంచం సృష్టించి ఆ ప్రపంచానికి ఎంట్రీ ఫీజు వసూలు చేసుకుంటారు. ఆ చీకటి గదిలో ప్రేక్షకుడే హీరో. ప్రేక్షకుది కలల ప్లాట్‌కి తగ్గట్టుగా చిరంజీవి, రజనీకాంత్‌లు భావాలు వ్యక్తీకరిస్తుంటారు. ఇదోరకమైన ప్లే స్టేషన్ విడియో గేమ్! 

ఈ ప్రేక్షకుడికి అర్జంటుగా ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. మనకి తెల్లతోలంటే పిచ్చి. ఇక్కడ తెల్లబడ్డానికి సబ్బులు, క్రీములకి మంచి గిరాకి. పెళ్ళప్పుడు పెళ్ళికూతుళ్ళకి మేకప్ తెల్లగా వేస్తారు. ఫొటోల్లో మొహం గొడకి కొట్టిన సున్నంలా తెల్లగా ఉండటానికి ఇష్టపడతారు. కాబట్టి హీరో పక్కన తెల్లతోలు పిల్లే కావాలి (రంగువిషయంలో రాజీపడే సమస్యే లేదు). ఆ తెల్లపిల్లతో విరగదీసుకుంటూ విచ్చలవిడిగా వొళ్ళంతా విరగదీసుకుంటూ భీభత్సంగా డ్యాన్సులు చెయ్యాలి. మన తెలుగువాళ్ళల్లో తెల్ల పిల్లలు తక్కువ, వున్నా వాళ్ళు exposing కి బిడియపడొచ్చు? ఈ సమస్యలేమీ లేకుండా అవకాశాల కోసం యెదురు చూస్తున్న తెల్ల పిల్లలు బొంబాయిలో బొచ్చదంతమంది. కాబట్టే హీరోయిన్లని దిగుమతి చేసుకోవడం!

సరే! మన ప్రేక్షకుడు (హీరో ద్వారా) హీరొయిన్‌తో డ్యూయెట్లు పాడేశాడు. కానీ.. ఇంకా ఏదో మిస్సవుతున్నాడు.. అదే ego satisfaction. ఇందుకోసం ఇద్దరు ఇద్దరు హీరోయిన్లుంటే బాగుంటుంది. హీరో 'నావాడంటే నావాడు' అంటూ ఆ ఇద్దరూ తన్నుకుచావాలి. అందుకోసం తమ చౌకబారు ప్రేమని వొలకబోస్తూ హీరోగారి కోసం వెంపర్లాడిపోవాలి. నడ్డి తిప్పుతూ, మెలికలు తిరిగిపోతూ హీరోగారితో పూనకం వచ్చినట్లు గంతులేయ్యాలి. అప్పుడా మజానే వేరు!

అంతేనా? ఇప్పుడు ఇంకొంచెం మసాలా! (ప్రేక్షకుల తరఫున 'నటన' అనబడే కూలి పని చేస్తున్న) హీరో ఆ అమ్మాయిల్ని గడ్డిపోచల్లా చూస్తాడు. ఛీ కొడుతూ humiliate చేస్తాడు. దీంతో పురుష దురహంకారం కూడా సంతృప్తి నొందుతుంది. అసలైన ego satisfaction అంటే ఇది! ఈ విధంగా - నిజజీవితంలో తనకి అందని ద్రాక్షపళ్ళయిన డబ్బున్న అందమైన ఆడపిల్లకి సినిమాహాల్లో రివెంజ్ తీర్చుకుంటాడు మన వర్కింగ్ క్లాస్ ప్రేక్షకుడు!      
                                           
మన సినిమా వ్యాపారస్తులు ఫ్రాయిడ్, ఎడ్లర్ కన్నా తెలివైనవాళ్ళు. అందుకే యెప్పుడూ నేలక్లాసు ప్రేక్షకుల కోసమే సినిమాలు తీశారు. హిందీ దర్శకుడు మన్‌మోహన్ దేశాయ్ 'క్లాస్' ప్రేక్షకులకి సినిమా నచ్చితే సినిమా ఫ్లాప్ అవుతుందేమోనని కంగారు పడేవాట్ట! సినిమావాళ్ళకి ఎవరికోసం ఏం తియ్యాలో ఖచ్చితమైన అవగాహన ఉంది. లేనిదల్లా నా స్నేహితుడులాంటి అమాయకులకే!