Wednesday 15 May 2013

పిల్లల పాట్లు.. 'పింక్ ఫ్లాయిడ్' పాట


సమాజం అనగా వ్యక్తుల సమూహం. వ్యక్తుల అవసరాలు, మారుతున్న ఆలోచననా ధోరణుల ప్రభావంతో సమాజంలో మార్పుచేర్పులు జరుగుతుంటాయి. ఆ మార్పుచేర్పుల వల్ల సమాజం ఏ దిశగా సాగుతుందనేది చూసేవాడి ద్రుష్టికోణాన్ని అనుసరించి ఉంటుంది.

నా చిన్నప్పుడు 'చదువు' అనగా జ్ఞానం. జ్ఞానం రెండు విధాలు. పుస్తక జ్ఞానం, అనుభవ జ్ఞానం. (అనుభవ జ్ఞానం లేకుండా కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే ఉన్న వ్యక్తి వల్ల సమాజానికి ప్రయోజనం లేదు.) ఈ జ్ఞానమే వ్యక్తుల మెరుగైన ఆలోచనా సరళినికి మూలం. ఈ జ్ఞానమే సమాజ హితానికి పునాది. చివరగా.. ఈ జ్ఞానం భుక్తి కోసం కూడా ఉపయోగపడుతుంది.

ఇప్పుడు 'చదువు' అనగా పుస్తక జ్ఞానం మాత్రమే. ఈ చదువుతోనే మెరుగైన జీవితం, సుఖమయ జీవనం సాధ్యం. చదువు ఎంత ఎక్కువ చదివితే అంత గిట్టుబాటు. మంచి చదువు.. మంచి ఉద్యోగం.. మంచి జీతం.. మంచి పెళ్లి సంబంధం.. మంచి జీవితం. జీవితానికి ఇంతకన్నా అర్ధం లేదు.. పరమార్ధమూ లేదు. అందుకే చదువే సర్వస్వం. చదువే లోకం.

నీ పిల్లల్ని చదివించడం.. అందుకు తగిన ప్రణాళికల్ని రచించడంలోనే నీ ప్రతిభాపాటవాలు వెల్లడవుతాయి. నువ్వు బాగా చదువుకున్నావా? అందులో గొప్పేముంది! నీ పిల్లల్ని బాగా రాపాడించి గొప్ప చదువుల్లో ప్రవేశపెట్టలేకపోయ్యావ్. అంచేత నువ్వో వెధవ్వి. ఇంకా నీతో మాటలు కూడానా! తప్పుకో.

'అయ్యా! నా పిల్లలకి చదువబ్బలేదు. నా భార్య నన్ను రోజూ అసహ్యించుకుంటుంది. చుట్టపక్కాలు గేలి చేస్తున్నారు. నాకు బతకాలని లేదు. చావాలని ఉంది.' దానికేం భాగ్యం! తప్పకుండా చద్దువులే. కాకపొతే ఈ చావుక్కూడా అక్కడో పెద్ద క్యూ ఉంది. నువ్వెళ్ళి ఆ వరసలో నిలబడు.


మీ పిల్లల్ని రోజుకి ఇరవై గంటలు చదివిస్తాం. మిగిలిన నాలుగ్గంటలు కూడా చదువుకు వినియోగించుకోవాలనుకుంటే.. మేం పిలిపించే వ్యక్తిత్వవికాస నిపుణులు టిప్స్ చెప్పెదరు. మీ పిల్లాడిని మా స్కూలుకే పంపండి. మా దగ్గర MBBS సీటు గ్యారంటీ పథకము కూడా కలదు. మీ పిల్లవాని భవిష్యత్తు బంగారు బాటలో పెట్టండి.

సరే! ఈ విషయం పట్ల నా అభిప్రాయాల్ని స్పష్టంగా వివరిస్తూ "కోడి విలాపం! (బ్రాయిలర్ విద్యార్ధుల కథ కూడా.. !)" అని ఓ టపా రాశాను. ఓపికున్నవారు చదువుకోవచ్చు. ఇప్పుడీ టాపిక్ మీద కొత్తగా రాసేదేమీ లేదు.

'పాపం! పిల్లలు.' అని నాకనిపించినట్లే 'పింక్ ఫ్లాయిడ్' అనే ఓ బ్రిటీష్  రాక్ బ్యాండ్ క్కూడా మూడు దశాబ్దాల క్రితం అనిపించింది.

వాళ్ళు సంగీతకారులు కావున బోర్డింగ్ స్కూళ్ళని నిరసిస్తూ 1979 లో ఓ పాట రిలీజ్ చేశారు. ఆ రోజుల్లో 'ఎనదర్ బ్రిక్ ఇన్ ద వాల్' (గోడలో మరొక ఇటుక' అని నా స్వచ్చమైన అనువాదం) పాట ఓ సెన్సేషన్.

గుంటూర్లో రేడియో BBC మ్యూజిక్ చానెల్ తుఫానులో మృత్యుఘోషవలె తెరలుతెరలుగా వచ్చేది. ట్రాన్సిస్టర్ని చెవికి ఆనించుకుని (చెవులు రిక్కించి వినడం అంటే ఇదేనా?).. కళ్ళు మూసుకుని దీక్షగా వినేవాణ్ని.

'పింక్ ఫ్లాయిడ్' సౌండ్ బాగుంటుంది. పాడే విధానం ఇంకా బాగుంటుంది. వీరి పాటల్లో 'సామాజిక స్పృహ' కూడా ఉంటుంది.

ఈ విడియో చూడండి.



విడియో అచ్చు ఇప్పటి మన కార్పోరేట్ విద్యాసంస్థలు అనబడే చదువుల దుకాణాల గూర్చి తీసినట్లుగా ఉంది కదూ! ప్రస్తుతం మన పిల్లల్ని ఈ దుష్టదుర్మార్గ కార్పోరేట్ బూచిగాళ్ళ నుండి కాపాడుకునే మార్గం లేదు.

అంచేత.. మనం 'ఎవరో రావాలి.. నీ హృదయం కదిలించాలి.' అంటూ ప్రేమనగర్లో వాణిశ్రీలా వీణ పాట పాడుకోవాలి.. లేదా వేళ్ళు నొప్పెట్టేలా కీ బోర్డు నొక్కుతూ టపా అయినా రాయాలి. అంతకు మించి చేసేదేం లేదు. నాకు వీణ తెలీదు. కాబట్టి రెండోది చేస్తున్నాను.

ఈ 'పింక్ ఫ్లాయిడ్' రికార్డ్ నా దగ్గర ఉండేది. నా స్నేహబృందంతో మైసూర్ కేఫ్ లో వేడివేడి ఇడ్లీసాంబార్ కడుపారా లాగించి.. నిద్ర ముంచుకొస్తుండగా.. అరమోడ్పు కన్నులతో ఈ పాట మళ్ళీమళ్ళీ వినేవాణ్ని.

సరే! ఎలాగూ ఇక్కడదాకా చదువుకుంటూ వచ్చారుగా. ఇంకొంచెం ఓపిక చేసుకుని.. 'పింక్  ఫ్లాయిడ్' లైవ్ పెర్ఫార్మెన్స్ విడియో కూడా తిలకించి ఆనందించండి.



(photos courtesy : Google)

17 comments:

  1. ఈ టపా నా బ్లాగ్జీవితంలో ఓ రికార్డ్ సృష్టించింది.. ఒక్కరూ కామెంటలేదు!

    ReplyDelete

  2. అంతే మరి. క్యామెడీ రాయకుండ ఇలా మెటల్ మ్యూజిక్కు పెడ్తే ఎవరు సదువుతారండి బాబూ?

    come back to life, sir! సందర్భానుసారం, మీకోసం
    http://www.youtube.com/watch?v=nVxnNNGjubg

    ReplyDelete
    Replies
    1. ఈ పాట మన ప్రస్తుత దుస్థితిని రిఫ్లెక్ట్ చేస్తుందనుకున్నాను. మనవాళ్ళకి పెద్దగా పట్టలేదు.

      (మీ విడియో లింక్ కి ధన్యవాదాలు.)

      Delete
  3. corporate schools,colleges తప్ప వేరే అవకాశమే లేని వ్యవస్థ లో వున్న మేము ఎలా స్పందించ గలము?

    ReplyDelete
  4. రమణగారు,
    ఈ మధ్య కాలంలో చదువుల వత్తిడి ఎక్కువై చాలామంది విద్యార్దులు మానసికంగా అభద్రత భావానికి లోనౌతున్నారు. కొంతమంది విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకోవటం, రైలు కిందపడి చనిపోవటం ఇటువంటి సంఘటనలు గత కొంతకాలంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజుల్లో మధ్యతరగతి ఆడవారందరు చదువుకొన్నవారు. పిల్లల పెంపకంపైనా, వారి చదువులపైన వారి ప్రభావం చాలా చాలా ఎక్కువ. చదువుల పేరుతో మన వ్యవస్థ పిల్లలను హింసిస్తూంటే , ఈ హింస ఇంట్లో వాళ్ల కళ్ల ముందు జరుగుతున్నా లేక హాస్టల్ లో జరుగుతుందని తెలిసినా వారు చూసి చూడనట్లుగా మౌనంగా ఉంటారేందుకు? అదే ఎక్కడో డిల్లిలో మహిళలపై అత్యాచారం జరిగితే, దానిపైన అందరు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ, వాళ్ల నిరసన మీడీయాలో తెలియజేస్తారు, బ్లాగులలో టపాలు, కవితలు రాస్తారు కదా! నేటి చదువులపైన వాళ్ళు/ మహిళా సంఘాల వారుకాని పెద్ద ఆందోళన చేసినట్లు గా నాకు అనిపించలేదు.

    మీకొక చిన్నప్రశ్న, పిల్లల పైన జరిగే హింస తల్లులకు తెలిసినా, అదివారికి ఆమోదయొగ్యమైతే హింస కిందకు రాదా? ఈ ప్రశ్నకు మీరు జవాబిస్తారని ఆశిస్తాను.

    ReplyDelete
    Replies
    1. శ్రీరాం గారు,

      'చైనా ఆటలు - ఇండియా చదువులు' అని గతంలో నేనో టపా రాశాను. అప్పుడీ విషయంపై కొంత చర్చ నడిచింది.

      మనది అనాదిగా వ్యవసాయాధారిత దేశం. ఒకప్పుడు కొంత భూమి ఉన్నా చాలు.. 'ఒకడి కింద పనిచేసే ఖర్మ' ఉండేది కాదు. తరవాత 'ఉద్యోగస్తుడు' రైతు కన్నా విలువైనవాడిగా మారాడు. ప్రభుత్వ విధానాల వల్ల రైతు గ్రాఫ్ క్రమేణా దారుణంగా పడిపోయింది.

      ఈలోగా సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ పుణ్యమాని గ్రామాల్లో సోషల్ డైనమిక్స్ మారిపోయ్యాయి. ఇరవై ఎకరాల రైతు కన్నా అమెరికా ఉద్యోగం చేస్తున్న కొడుకుని కలిగున్న దిగువ మధ్యతరగతి కుటుంబం ఆర్ధిక పరిస్థితి ఎంతో మెరుగ్గా తయారైంది. కొడుకు సంపాదన వల్ల.. ఒకప్పుడు ఎర్ర బస్సెక్కి పట్టణంలో గవర్నమెంట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకునేవారు నేడు ఏసీ కార్లో కార్పోరేట్ ఆస్పత్రికి వెళ్తున్నారు.

      సామాజికంగా, ఆర్ధికంగా చోటు చేసుకున్న ఈ మార్పులు.. తరవాత తరం పిల్లలపై ప్రభావం (సహజంగానే) చూపుతుంది. వారిపై వత్తిడి పెంచుతుంది. చదువు అనేది ఒక లాభసాటి అయిన పెట్టుబడిగా మారిపోయింది. పోనీ ఆ చదువైనా ఓ సైంటిఫిక్ పద్ధతిలో బోధించబడుతుందా? లేదు.

      సమస్యేమంటే చదువు చేప్పేవాడిక్కూడా చదువంటే ఏంటో అవగాహన ఉండదు. అంచేతనే బండ కొట్టుడు, రుద్దుడు. పొద్దున్నుండి రాత్రి దాకా 'జ్ఞాపకం' ఉంచుకోవడానికి మాత్రమే వల్లె వేయిస్తుంటారు. వాస్తవానికి పిల్లల్ని వత్తిడికి గురి చెయ్యకుండా.. వారిలోని ఆసక్తిని పెంచుతూ.. చక్కగా చదువుకునేట్లు చెయ్యొచ్చు.

      ప్రస్తుతం మనం ఓ సంధియుగంలో ఉన్నామని నా అభిప్రాయం. చైనావాడు చౌక వస్తువులు ప్రపంచమంతా అమ్ముతున్నట్లు.. మనం 'చదువుకున్న మేధావుల్ని' ప్రపంచమంతా ఎగుమతి చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందనే ఆశాభావం ఉంది.

      అసలు సంగతి ఏమంటే.. ప్రభుత్వాలకి ఓట్ల గేలం వెయ్యడంలో ఊపిరి సలపట్లేదు. విద్యారంగం నుండి నిశ్శబ్దంగా తప్పుకుని.. చదువుల మాఫియాగాళ్ళని ప్రోత్సాహిస్తూ పబ్బం గడుపుకుంటుంది.

      అంచేత ఈ చదువుల కార్ఖానాలు ప్రస్తుతానికి ఓ జగన్నాధ రధచక్రాలు. దానికింద పడి నలిగి చావడం మినహా ప్రస్తుతం పిల్లలకి వేరే గతి లేదు.

      మీరన్నది నిజమే. పిల్లల చదువుల పట్ల తల్లులు తల్లడిల్లిపోతుంటారు. పిల్లాడు సరీగ్గా చదవట్లేదని ఆత్మహత్యా ప్రయత్నాలు చేసిన తల్లులు నా పేషంట్లుగా ఉన్నారు. తండ్రులు తల్లులంత సీరియస్ గా ఉండరు. ఒకరకంగా చాలా వాస్తవిక దృక్పధంతో కూడా ఉంటారు. పిల్లల చదువు పట్ల భర్త 'సీరియస్'గా పట్టించుకోటల్లేదని భర్తని తిట్టిపోసే భార్యలూ నా పేషంట్లుగా ఉన్నారు. ఈ ఆడవారు డిగ్రీ వరకు చదువుకున్నవారే. ఇది నన్ను ఆశ్చర్యపరుస్తుంది.

      పిల్లల్ని 'చదివించడం'లో తల్లులే ఇంత సెలెక్టివ్ గా 'బాధలు' పడటం గూర్చి ఆలోచించవలసి ఉంది. బహుశా ఆడవారిలో 'న్యూరోటిక్ ట్రైట్స్' ఎక్కువ అయ్యుండొచ్చు. హార్మోనల్ ప్రభావం కూడా కారణమేమో. ఈ విషయం గూర్చి మీరడిగేదాకా నేనూ ఆలోచించలేదు.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  5. రమణ గారు,
    మీరు కుటుంబం వ్యవస్థ పైన చాలా ఆశావహ దృక్పథంతో ఉన్నారని పిస్తున్నాది. నాకైతే అంత ఆశావహ పరిస్థి కనపడటం లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. వ్యవస్థ పరంగా చూస్తే ప్రభుత్వఒ ఉచిత పథకాలతో కుటుంబ వ్యవస్థ పైన పరోక్ష దాడి పెద్ద ఎత్తున దిగుతున్నాది.
    ఇప్పుడుగాని పార్లమెంట్ లో ఆహార భద్రత బిల్ పాస్ అయితే కుటుంబ వ్యవస్థ ఇంకా తీవ్రమార్పులకు లోనై కుప్పకూలటం ఖాయం. దాని ప్రభావం దేశ వ్యాప్తంగా పడుతుంది. మొదట అది పేదవర్గాలతో మొదలై మధ్యతరగతి తో ముగుస్తుంది.
    ఒకప్పుడు బెంగళూర్ నగర నిర్మాణం లో ఎంతో ప్రముఖ పాత్ర పోషించిన తమిళ కార్మికులు,ఇప్పుడు అక్కడికి రావటం చాలా తగ్గి పోయింది.కూలివారిగా ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్ళు పని చేస్తున్నారు. లేబర్ చార్జెస్ విపరీతంగా పెరిగాయి.బెంగుళూరు లో తమిళ కార్మికులు నైపుణ్యం కలవారని,కష్టపడతారని ఎంతో పేరు ఉంది. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాల వలన బెంగళుర్ కి రావటం పూర్తిగా తగ్గించేశారు. అంతా నార్త్ ఇండియన్స్ దే హవా. వీళ్లు హాయిగా, వాళ్ల ఉరిలోనే ఉంట్టు, ప్రభుత్వం ఇచ్చే బియ్యం అమ్ముకొని,మందు తాగి నిద్రపోతున్నారు. పనిచేసినా మందుకు సరిపడా సంపాదించుకొంట్టున్నారు. అంతే. ఒకసారి తమిళనాడులోని మధ్యం సేల్స్ పైన వచ్చే ఆదాయం చూస్తే అర్థమైపోతుంది. వీళ్లు పిల్లల పెంపకం సరిగా పట్టించుకోక పోవటమేగాక, అసలికి వాళ్ళు పిల్లల్ను రక్తసంబందీకులుగా కూడా గుర్తించటంలేదు (బాధ్యత తీసుకోవటంలేదు).
    ఇక మన మధ్యతరగతి ప్రజలు పూర్తిగా కేపిటలిస్ట్ వ్యవస్థను అనుసరిస్తున్నారు. ప్రపంచంలో కేపిటలిస్ట్, కమ్యునిస్ట్ మోడల్స్ (పైకి వేరుగా కనిపించినా, ఇవి రెండు రూపాయి బిళ్లలోలా ఉండే బొమ్మాబొరుసు లాంటివి) తలకెత్తుకున్నఅన్ని దేశాలలో కుటుంబ వ్యవస్థ బాగా దెబ్బతిన్నది. అది అమేరికా,రష్యాలలో మనం చూడవచ్చు. ఇదే మోడల్ మన మధ్యతరగతి వారికి కూడా అప్లై చేయవచ్చు.
    ఈ మధ్య కాలమో పెరిగిన మధ్య తరగతి వారి సంపద వాళ్ల ప్రవర్తనని చాలా మర్చేసింది. సమాజం గురించి, దానికట్టుబాట్లు గురించి పెద్దగా పట్టించుకోవటంలేదనెది అందరికి తెలిసిన విషయమే కదా! మద్రాస్ నగరం లొ జరిగే మర్డర్ లలో ఎక్కువ భాగం ఒకప్పుడు ఆస్థుల కోసం జరిగితే, ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబందాల వలన ఎక్కువగా జరుగుతున్నట్లు పోలిస్ కమిష్నర్ స్టేట్మెంట్ ఇచ్చాడని పేపర్లో చదివాను. మధ్యతరగతిలో పెరిగిన అంచనాలవలన కానివ్వండి, సంపదవలన కానీవ్వండి,అమ్మాయీల ప్రవర్తనలో వచ్చిన మార్పులవలన కానివ్వండి, భవిషత్ లో (10సం||)వివాహం చాలా ఖరీదైన వ్యవహారం గా మారనుంది. చిన్నా చితకా ఉద్యోగం చేసుకొనే మధ్య తరగతి వారు దాని భారాన్ని మోయలేరేమో! పెళ్లిళు చేసుకొనే వారి సంఖ్య అమాంతం పడిపోయినా ఆశ్చర్య పడనవసరంలేదనిపిస్తుంది. పెళ్లి అనేదిమన సమాజంలో హోదాకు చిహ్నంగా మిగిలిపోతుందేమో!

    ReplyDelete
    Replies
    1. సమాజంలో పెళ్ళిళ్ళు బాగా తగ్గిపోవడం అనేది Scandinavian countries లో ఎప్పట్నుండో ఉంది గదా. అందువల్ల అక్కడ సమాజానికి ఏ మాత్రం హాని / మేలు జరిగిందో నాకు తెలీదు.

      (ఈ రుద్దుడు చదువుల పీడా విరగడయ్యే మార్గం కోసం ఎదురు చూస్తున్నాను.)

      Delete
  6. అయ్యా వైదులుగారు,
    నాకు మాత్రం ప్రతీ దానికి డబ్బుతో ముడి పడి వుంటుందని నా అభిప్రాయం. మన దరిద్రపు చదువుల విధనం కూడ అందుకు మినహాఇంపు కాదు. ఎందుకంటే
    "ఎక్కువ మార్కులు == మంచి కళాశాలలొ సీటు == మంచి వుద్యొగం == ఎక్కువ డబ్బు"
    కాని 'ఎక్కువ మార్కులు == మంచి కళాశాలలొ సీటు ' అనేది సరి ఐన పద్దతి కాదు అని కంపనీలు చెప్పాలి. ఎప్పుడైతె కంపనీలు మాకు కవలసింది " ఈ బట్టీ కొత్తిన వాళు కాదు, అలొచించగలిగిన వాళు ", అని మార్కులని కొలబద్ద కింద తీసుకొనటం మానెస్తాయొ , వెంటనే ఈ విధానం మారి పొతుంది అని నా నమ్మకం.

    ఇక మామూలుగానె, ఎంతొ చేయగలిగి, మరియు అధికారం, దండిగ వనరులు వున్నా ప్రభుత్వం అనేది ఎమీ చెయదు. ఎందుకంటె మనం దెశం గురుంచి అలొచించే సామర్ధ్యం వున్న వాళ్ళెవరిని మనం ఎన్నుకోము. మనకి కులం, మతం, ప్రాంతం , డబ్బు/మందు అవి మాత్రమె ముఖ్యం. వాళ్ళ దగ్గరినుండి దరిద్రం తప్పించి ఎమి కొరుకున్న అది అత్యాశే అవుతుంది!!!
    కృష్ణ

    ReplyDelete
    Replies
    1. అవును. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.

      మనం చెయ్యగలిగింది ఏమీ లేదు. కాకపోతే.. హింసాత్మక, బలాత్కారయుతమైన చదువు బాధిత విద్యార్ధుల కేసులు చూసినప్పుడు బిపి తెచ్చుకుని ఆవేశంతో ఇట్లాంటి టపాలు రాస్తుంటాను. నాకు ఇదో ventilation. అంతే!

      Delete
  7. మీరు రాసిన దానిలో ప్రభుత్వపాత్ర చూసి పైన వ్యాఖ్య రాయవలసి వచ్చింది. అది సందర్భానుసారంగా లేదేమో! క్షమించాలి. కాకపోతే మనదేశం వరకు పిల్లల చదువులపై కుటుంబం పాత్ర చాలా ఎక్కువ. మనం చేసే ప్రతిపని కుటుంబం దృష్టిలో ఉంచుకొని చేస్తాం కనుక రానున్న రోజుల్లో దానిని అస్తిత్వానికే ముప్పు ఉందని అనిపించి రాశాను.

    ReplyDelete
  8. *ఈ బట్టీ కొట్టిన వాళ్ళు కాదు, ఆలొచించగలిగిన వాళ్ళు*

    చదువుకొనే రోజుల్లో ఇలానే అనుకొనే వాడిని. ఉద్యోగం లో చేరిన తరువాత అంత తెలివిగల వాళ్ల అవసరం కంపేనీలకు లేదు అని అర్థమైంది. క్ర్రియేటివిటి ఎక్కువైతే కంపేనిలు వ్యాపారం చేయలేవు. ఎందుకంటే తరచుగా మార్పులు చేర్పులు చేస్తూంటే అది ప్రత్రిసారి లాభాలను తెచ్చిపెడుతుంది అన్న నమ్మకం లేదు. ప్రభుత్వ పాలసిలతో కంపేని పాలసిలు అలైన్ కావాలి. పైగా ఉద్యోగులలో జాబ్ ఇన్సెక్యురిటి కి దారి తీస్తుంది. అది కంపెనీల మనుగడకే ప్రమాదం. కొన్ని పెద్ద కంపెనీలలో కొన్ని డిపార్ట్ మెంట్ల లో ఆలోచించగలిగిన వారి అవసరం ఉంట్టుంది. మిగతా అందరు చేసేది అదే రోటిన్ వర్క్. పైగా ఇప్పుడు ఆ వర్క్ ను కూడా పూర్తిగా ఆటోమేషన్ చేసిపారేస్తున్నారు. సాఫ్ట్ వేర్, షిప్పింగ్, ఫైనానిషియల్ సెక్టర్ లను దగ్గర గా పరిశీలించి చెబుతున్న అభిప్రాయం ఇది.
    ఒక్కపుడు సాఫ్ట్ వేర్ కంపేనీలు ఎంతో క్లిష్టమైన పరిక్షలను నిర్వహించి సెలెచ్ట్ చేసుకొనే వారు. వారికి వర్క్ ఫోర్స్ కావలని అనుకొంటే ఆప్రశ్నా పత్రం ఎవిధంగా ఉంట్టుందో, ఇంటర్వ్యు హాజరయ్యే విద్యార్దులకు చెప్పి పరిక్షలను నిర్వహించి తీసుకొంట్టున్నారు. ప్రపంచమoతా డిమాండ్ అండ్ సప్లై మీద నడుస్తుంది. స్టాండర్డ్స్ విలువలు ఉన్నట్లు అనిపిస్తాయి. కాని దగ్గరావెళ్లి చూస్తే ఎమీ ఉండవు.

    ReplyDelete
    Replies
    1. కేండిడేట్లు ఎక్కువ, సీట్లు తక్కువ అయినప్పుడు ఏ కోర్సుకైనా సెలక్షన్ ప్రాసెస్ ఉండక తప్పదు. కాకపొతే ఆ ప్రాసెస్ పట్లనే అభ్యంతరం. ఈ కార్ఖానా చదువు ప్రాసెస్ పూర్తిగా తప్పు.

      నా సంగతే తీసుకోండి. నాకు ఇంటర్లో, అటు తరవాత మెడికల్ ఎంట్రన్స్ లో మార్కులు విపరీతంగా వచ్చాయి. అప్పుడు నే చదివిన (బట్టీ అనుకోవచ్చు) కప్పలు, వానపాముల్ని మెడిసిన్ సీటు రాంగాన్లే వదిలేశాను. నా తెలివితేటలు నాకు తెలుసు. అదృష్టవశాత్తు నా తెలివి ఇప్పటిదాకా పరీక్షింపబడలేదు. మంచి డాక్టర్ కావడానికి తెలివి అవసరం లేదు. ఓపిక, హార్డ్ వర్క్ సరిపోతుంది.

      (దూరపు కొండలు నునుపేమో! నాకు ఇంజనీర్లు తెలివైనవాళ్ళుగా అనిపిస్తారు.)

      Delete
  9. లేదు సార్ , ఈ విషయంలొ దూరపు కొండలు నునుపు కాదు... ఇంజినీర్లు నిజంగా తెలివైన వాళ్ళే...(మీకీపాటికి అర్ధం అయే వుంటుంది, నెనూ ఇంజినీరే )

    శ్రీరాం గారు, "ఉద్యోగం లో చేరిన తరువాత అంత తెలివిగల వాళ్ల అవసరం కంపేనీలకు లేదు అని అర్థమైంది. "
    మీరు అలా అంటున్నారంటే, అది ఒకరకంగా మన క్రొనీ కాపిటలిసమ్మ్ మరియు సామ్య వాద ప్రజా స్వామ్య విధానాల ఫలితం. (మీకు ఇదెదో, వీపు మీద కొడితే పళ్ళు రాలాయంటరు సామెత లాగ అనిపించవచు ). ఇంకా చెప్పాలంటె అవినీతి ఫలితం. వాటి గురుంచి మాట్లాడాలంటె ఈ సంభాషణ ఇంకో స్ఠాయికి వెళ్ళాలి. లెఖిని లో రాయటం కష్టంగా వుంది. పైగా ఇక్కడ అది అప్రస్తుతం.

    కృష్ణ

    ReplyDelete
  10. నాకెందుకో ఇంజనీర్లంటే ఫేసుబుక్కులో పోసికోలు కబుర్లు రాసుకునే సన్నాసులు ఙ్ఞప్తికి వస్తారు.... డాక్టర్లంటే ప్రాణాన్ని నిలుపుతామనే భరోసా ఇచ్చే దేవుళ్ళా కనిపిస్తారు.

    ReplyDelete
  11. Some how I missed this one. I still listen to this song and it is on my music collection on the phone. My children also got interest in the music I like. Of course, my son plays guitar as well. I read your previous blog about kids education in India and I wrote my comments. Nothing more to add apart from feeling sorry for them.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.