Friday 2 January 2015

ప్రజలకి తిక్క కుదరాల్సిందే!


"నాకు రాజకీయాలంటే మంట!"

"ఎందుకు!?"

"ఎందుకా? బాబుని చూడండి! ఎన్నికల ముందు ఋణమాఫీ అన్నాడు, ఇప్పుడేమో అర్ధం కాని ఆల్జీబ్రా లెక్కలేవో చెబుతున్నాడు. ఎంతన్యాయం! ఈ లెక్కలు ఎన్నికలప్పుడు చెప్పొచ్చుగా?"

"ఈ లెక్కలు ముందే చెబితే జనాలు ఓట్లెందుకేస్తారు?"

"అది మాట తప్పడం కాదా? అందుకే నాకు రాజకీయాలంటే మంట!"

"దాన్దేవుఁంది! ఎన్నికలన్నాక లక్ష చెబ్తారు. అవన్నీ నమ్మాలని వుందా యేవిఁటి? అయినా - ఈ రోజుల్లో ఎన్నికల వాగ్దానాల్ని పట్టించుకునేదెవరు?"

"మీరు చాలా సినికల్‌గా మాట్లాడుతున్నారు. కేంద్రంలో మోడీని చూడండి! ఎన్నికల ముందు దేశాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు. ఇప్పుడేమో చేతికి చీపుళ్ళిచ్చి రోడ్లూడిపిస్తున్నాడు. టీవీల్లో రోజుకో సన్యాసి హిందూ మతానికి అన్యాయం జరుగిపోతుందని గుండెలు బాదుకోడం తప్ప అభివృద్ధి కనుచూపు మేర కనిపట్టం లేదు. 'అచ్చే దిన్' అంటే ఇవేనా?"

"వాళ్ళ దృష్టిలో ఇవే అచ్చే దిన్! ఈ సంగతి ముందే చెబితే జనాలు ఓట్లెందుకేస్తారు?"

"అది మాట తప్పడం కాదా? అందుకే నాకు రాజకీయాలంటే మంట!"

"దాన్దేవుఁంది! ఎన్నికలన్నాక లక్ష చెబ్తారు. అవన్నీ నమ్మాలని వుందా యేవిఁటి? అయినా - ఈ రోజుల్లో ఎన్నికల వాగ్దానాల్ని పట్టించుకునేదెవరు?"

"అయ్యా! ఇంతకీ తమరెవరు?"

"అయ్యో నా మతి మండా! మాటల్లో పడి మర్చేపొయ్యాను సుమండీ! నాపేరు పేరయ్య. పెళ్ళిళ్ళు కుదురుస్తుంటాను. నన్నందరూ పెళ్ళిళ్ళ పేరయ్య అంటారు."

"పేరయ్య గారూ! నమస్కారం! గత కొంతకాలంగా మా అబ్బాయి పెళ్ళి చెయ్యడానికి నానా తిప్పలు పడుతున్నాను. ముల్లోకాలు వెదికినా మావాడికి పిల్లనిచ్చే దౌర్భాగ్యుడు ఒక్కడూ దొరకట్లేదు! కొడుక్కి పెళ్ళి చెయ్యలేని వాజమ్మనని నా భార్య రోజూ నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. అయ్యా! ఇవి చేతులు కావు, కాళ్ళనుకోండి. మావాడి పెళ్ళి మీరే చెయ్యాలి! చచ్చి మీ కడుపున పుడ్తాను!"

"ఇంక మీరు నిశ్చింతగా వుండండి, మీవాడికి బ్రహ్మాండమైన సంబంధం కుదిర్చే పూచీ నాది - సరేనా? ఇంతకీ కుర్రాడేం చేస్తుంటాడో?"

"పది పదిసార్లు తప్పాడండీ! కష్టపడి టీసీఎస్‌లో ఆఫీస్ బాయ్ వుద్యోగం వేయించాను."

"దానికేం! సలక్షణమైన ఉద్యోగం. కాకపోతే కొంత మార్చి చెబ్దాం. మీవాడు ఏమ్సీయే చేశాడనీ, టీసీఎస్‌లో టీమ్ లీడర్‌గా చేస్తున్నాడనీ చెప్పండి. ఆస్తిపాస్తులేమాత్రం వున్నాయేమిటి?"

"సెంటు భూమి కూడా లేదండీ!"

"శుభం! తుళ్ళూరులో పదెకరాలు కొని పడేశానని చెప్పండి."

"కానీ - అవతలివాళ్ళు నమ్మాలి కదండీ?"

"ఎందుకు నమ్మరు! రాజకీయ నాయకుల్ని జనాలు నమ్మట్లేదా?"

"అయ్యా! ఇట్లా అడ్డగోలుగా అబద్దాలు చెబితే రేపు పెళ్ళయ్యాక ప్రాబ్లం కదండి!"

"వెయ్యబద్దాలాడి ఒక పెళ్ళి చెయ్యమన్నారు. ఒక్కసారి ఆ మూడుముళ్ళు పడ్డాక ఎవడైనా చేసి చచ్చేదేవుఁంది గనక! ఇందాక తమరు రాజకీయ నాయకుల గూర్చి గుండెలు బాదుకుంటున్నారు కదా! రేపు పెళ్ళికూతురు తండ్రీ అంతే!"

"అంతేనంటారా?"

"అంతేనండీ బాబూ! అంతే! ఈ రోజుల్లో నిజాయితీ గా వుంటే నీళ్ళు కూడా పుట్టవు సుమండీ! మరి నే వస్తాను, నా కమిషన్ సంగతి మాత్రం మర్చిపోకండేం!"

"అయ్యో! ఎంత మాట? మిమ్మల్ని సంతోషపెట్టడం నా విధి!"

"ఇంకోమాట - నాకు రాజకీయాలు ఆట్టే తెలీదు. ఇందాక నేనన్న మాటలు పట్టించుకోకండి."

"నాకూ రాజకీయాలు ఆట్టే తెలీదు లేండి - ఏదో న్యూస్ పేపరుగాణ్ని, నోరూరుకోక వాగుతుంటాను! రాజకీయ నాయకులన్నాక ఎన్నికల్లో లక్ష వాగ్దానాలు చేస్తారు, అవి తీర్చేవా చచ్చేవా? నన్నడిగితే అసలు జనాలే దొంగముండా కొడుకులంటాను. వేసేది లింగులిటుకు మంటూ ఒక్క ఓటు, అందుకు సవాలక్ష డిమాండ్లు! వాళ్ళకా మాత్రం తిక్క కుదరాల్సిందే!"

"అంతేకదు మరి! వుంటాను." 

(picture courtesy : Google)

20 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. కాంగ్రెసుకి పదేళ్ళు టైము ఇచ్చారు. వీళ్ళకి పది నెలలు కూడ ఇవ్వరా? వీళ్ళకంటే మేలైన ఆప్షన్ కూడ లేదు ప్రజలకి.
    అయినా ఏదో, ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా!

    మరో మాట, ఈ మధ్య అమ్మాయిల తల్లితండ్రులు అబ్బాయిల ఆస్థుల డాక్యుమెంట్లు చూపించమని అడుగుతున్నారు. అబ్బాయిల పెళ్ళి చెయ్యడం అంత వీజీ కాదు ఇప్పుడు.

    ReplyDelete
    Replies
    1. మీలాంటి బిజెపి వ్యతిరేకులంతా కలసి ప్రభుత్వానికిచ్చే గడువేమిటి? కామేడి కాకపోతే :) కాలం మారింది భయ్యా! అంటే కోపమొస్తుందేమోగాని, రాష్ట్ర విభజన తరువాత తెలుగువారికి దేశ రాజకీయాలలో చక్రం తిప్పేటంతటి సీన్ లేదు. ఆ రోజులైప్పుడో గతించాయి. కోస్తా ఆంధ్రులింకా సూపర్ హీరోలనుకొంట్టు, బిజెపిని ఎదో చేయగలం అనే భ్రమలో ఉన్నారు. కొంచెం భూమ్మీదకు రండి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు సామంత రాజ్యాలైతే, కింగ్ మేకర్స్ లా ఫీలైతే ఎలా? తెలుగు రాష్ట్రాలలో తె.దే,వై.యస్.ఆర్, తె.ర.స. ఏపార్టి అధికారంలోకి వచ్చినా కేంద్రంలో ని జాతీయపార్టిల తో జట్టుకట్టాల్సిందే. ఇరురాష్ట్రాల వారు అత్యధిక సీట్లు గెలిచినా, మహా ఐతే 20 యం.పి.లను గెలవ గలరు. ఆ యం.పి.ల సంఖ్యతో జాతీయ రాజకీయాలలో తెలుగువారు చూపించే ప్రభావం ఎమి ఉండదు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పని అయిపోయింది. బిజెపి తో కలసి మెలసి ఉండట మొక్కటే తెలుగువారికి ఉన్న ఏకైక ఆప్షన్. లేకపొతే ఆ వచ్చే నాలుగు కేంద్ర మంత్రిపదవులు కూడా రావు. థార్డ్ ఫ్రంట్ ఆశ ఆడియాసైపోయింది. మొన్న జరిగిన జార్ఖండ్ అసెంబ్లి ఎన్నికలలో నితిష్, లాలు పార్టిలులో సున్నా స్థానాలను కైవసం చేసుకొన్నాయి. రోజు రోజుకి జనతా పరివార్ గ్రాఫ్ పడిపోతోంది.

      మిత్రోత్తములారా! తెలుగువారు బిజెపి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాసి,ప్రజలను చైతన్యవంతులు చేసి,సాధించగలిగేది ఎమీ లేదని గ్రహించాలి. ఎంతో సమయం వృథా.ఉన్నత చదువులు చదువుకొన్న, తెలివిగల వారు ఎవ్వరు సమయం వృథా చేసుకోరు కదా!

      Delete
    2. నేను బిజెపి వ్యతిరేఖిని కాదు.

      Delete
  3. మీకు మరీ ఇంత తొందర పనికిరాదు . మన 'మౌన మహా ముని' సింగ్ కన్నా కొంచెం బెటరేమో .. ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు .
    మోడీ చేస్తాడో లేదో తెలియదు కాని మీరు మాత్రం తీవ్రమైన అసహనం తో ఉన్నారని అర్ధం అవుతుంది .
    ఈ మధ్య మీ రాతలు లేత ఎరుపు నుండి ముదురు ఎరుపు లోకి మారుతున్నాయి . :)

    ReplyDelete
    Replies
    1. మోడి ప్రభుత్వం అధికారంలో కి రావటానికి ప్రధాన కారణాలలో ఒకటి అవినీతి. అంతర్జాతీయ నివేదికల ప్రకారం మోడి ప్రధాని అయిన తరువాత, ఆరునెలల సమయంలో మనదేశ స్థానం మెరుగుపడి పదిస్థానకన్నా ముందు జరిగింది. అదే చైనా ది 20స్థానలు కిందకి దిగజారింది. రెండు ధరలు ఎంతో తగ్గాయి.ఇవ్వన్ని మేధావులు చాలా వీజిగా తీసుకొంటారు. అవి పెద్ద అంశాలు కావని వాటిని మరచిపోతూంటారు. టి.సి.యస్.లే ఆఫ్ కి, మోడికి సంబంధం ఎమిటి? ఇదేమి 60వ,70 వ దశకం కాదు. నేటి ఉద్యోగులు, గతంలో వలే తక్కువ క్వాలిఫికేషన్, గంపెడంత సంసార బాధ్యతలు గల కార్మికులు కారు. పెద్ద చదువులు చదివి, దేశవిదేశాలు తిరిగిన అనుభవం ఉన్నవారు. వీరేమి అమాయకులు కాదు. ఉద్యోగం ఉన్నపుడు కేపిటలిజాన్ని 200% సమర్ధించేవారు,వారిలో ఎంతో మంది ఉంటారు. కనుక అన్యాయం జరిగిందనుకొంటే ముందర వారే పోరాడాలి. ఆ తరువాత అవసరమైతే ప్రభుత్వ సహాయం. అంతేగాని ఎదో ఒక కంపెనిలో జాబ్స్ ఉడబెరికితే ప్రధాని అచ్చేదిన్ అన్నాడు ఇప్పుడు మా ఉద్యోగాలు పోయాయని దేశప్రధాని కారణం అనటం బాగాలేదు.

      Delete
  4. "వెయ్యబద్దాలాడి ఒక పెళ్ళి చెయ్యమన్నారు. "
    అయ్యా, ఎందుకన్నారు? ఒక ఇంటి వాన్ని చేసేటందుకు. పదిమంది నైనా చంపకుండా ఒక డాకటేరు కాలేరు అంటారు :). వెయ్యి మందికి ఇచ్చిన మాట తప్పితే తప్పేమిటి? అతన్ని చాణక్యుడు అంటారు. ఇలా గొప్ప తనాల కిరీటాలు పెడతారు. కిరీటాలు పెట్టు కోవాలంటే ఏమి చేయ్యాలి ప్రజలకు టోపీలు పెట్టాలి. ఈ ఛాణక్యుడు పుట్టిన దేశం లో అందరి కోరిక ఛాణక్యులవ్వాలనే గదా? ఇంత మంది చాణకులవ్వాలనకున్నప్పుడు ఆ అనుకునే గొర్రెల- సారీ,చాణక్య మందలను ఒకే గాట కట్టడమంటే పెద్ద చాణక్య తనం కావాలా? అదీ- ఒక్కసారి గాదు, రెండు సార్లు గాదు మూడో సారి కూడా ఛాణక్యున్నీ నమ్మడమంటే ఏంటీ? వాళ్ళకా మాత్రం తిక్క కుదరాల్సిందే!
    "నాకూ రాజకీయాలు ఆట్టే తెలీదు లేండి !

    ReplyDelete
    Replies
    1. మీరు పదినెలల గడువి ఇవ్వరా? అని రాస్తే, అసలికి తెలుగువారేంది నమో ప్రభుత్వానికి గడువిచేదనిపించింది. మొన్నటి ఎన్నికలలో మోడినే తెలుగుదేశంపార్టికి ప్రాణవాయువు ఇచ్చాడు. మీరు బిజెపిని వ్యతిరేకించినా ఎమీ చేయలేరు. వచ్చేఎన్నికలలో తె.దే, వై.కా.పా, పార్టీల మధ్యనే పోటి ఉంట్టుంది. కాంగ్రెస్ ఖాళీ అయ్యింది కనుక ఎవరు గెలిచినా, వాళ్ళు కేంద్రంలో బిజెపికే మద్దతు ఇస్తారు.

      Delete
    2. మీకు తెలుగువాళ్ళంటే ఎందుకంత లోకువ? అసలు మీరు తెలుగువారేనా?
      తెలుగువాళ్ళ సీట్ల కోసం కాకపోతే మొన్న ఎన్నికల్లో మోదీ ఇక్కడ ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? ఇక్కడ ఎందుకు ప్రచారం చేసాడు? పొత్తు పెట్టుకోకపోతే ఆ రెండు సీట్లు కూడ వచ్చేవి కావు. ఏదో ఇప్పుడు స్వంతంగా మెజారిటీ వచ్చిందని రాబోయే ఎన్నికలలో కూడ వస్తుందని అనుకోకండి. గతంలో వాజ్‌పేయీ ప్రభుత్వం తెలుగు వారి మద్దతుతోనే మనుగడ సాగించిందని గుర్తుంచుకోండి. 2019లోనే బిజెపి కి తెలుగు పార్టీల మద్దతు అవసరం రావచ్చు. బహుశా అందుకే, ఇప్పుడు మద్దతు అవసరం లేకపోయినా 2 మంత్రి పదవులు ఇచ్చారు.
      అలాగే ఇండియాలో ప్రజాస్వామ్యం ఉన్నంత కాలం కాంగ్రెస్ చచ్చిపోదు. వాజ్‌పేయీ ప్రభుత్వం బాగా పనిచేసినా, 2004లో కాంగ్రెస్ ఎందుకు గెలిచిందో ఆలోచించండి.

      Delete
    3. అయిదేళ్ళ తరువాత ఏం జరుతుందో ఇప్పుడే అంచనా వేయలేం. ప్రస్తుతానికి ఇప్పటి పరిస్తితిని మాత్రమె చూడడం బెటర్.
      మొన్నటి ఎన్నికలలో టీడీపీ, వైకాపాల మధ్య వోట్ల వ్యత్యాసం లక్షన్నర మాత్రమె. టీడీపీ మానిఫెస్టోలో ఉన్న ముఖ్యవాగ్దానాలు అమలు చేయాలంటే కేంద్ర సహాయం కీలకం. ఎలా చూసినా పొత్తులో లాభం టీడీపీకే తప్ప భాజపాకు కాదు.

      Delete
    4. *ఇండియాలో ప్రజాస్వామ్యం ఉన్నంత కాలం కాంగ్రెస్ చచ్చిపోదు*
      మీరాన్నది నిజమే. కోటీశ్వరులకు ఆరోగ్యం విషమిస్తే వెంటిలేటర్ పెట్టి ,పేషంట్ బ్రతికి ఉన్నాడని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టి దగ్గర నిధులున్నంత వరకు,అవి పూర్తిగా ఖర్చయ్యే వరకు లాలు, ములాయం,నితిష్ కుమార్,సీతారం ఏచురి,డి.రాజ వీలైతే కె.సి.ఆర్. మొదలైనవారు,కాంగ్రెస్ పార్టి సెక్యులర్ గొడుగు కింద వస్తూ పోతూ నాటకం కొనసాగిస్తూంటారు. ఈ నాటకం కథ చాలా పాతబడింది,నటినటులు ముసలివాళ్ళయ్యారు. ప్రేక్షకులేమో కుర్రవారు. మీరే చెప్పండి, సుమంతా హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ రోజుల్లో, శ్రీదేవిని హీరొయిన్ గా పెట్టి "వినై తాండి వరువాయ" లాంటి టినేజ్ లవ్ స్టొరి సినేమాను తీస్తే ఎలా ఉంట్టుంది. మీడియావారికి యాడ్స్ వస్తాయి కనుక ఇదొక గొప్ప ప్రేమ కథా చిత్రం అని ప్రచారం చేస్తారు. కాని ప్రజలు ఆదరించరు.

      *ఇప్పుడు స్వంతంగా మెజారిటీ వచ్చిందని రాబోయే ఎన్నికలలో కూడ వస్తుందని అనుకోకండి*

      మీ ప్రధాని అభ్యర్ధి నితిష్ కుమార్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడాలేడు. అది మీరు గమన్నించాలి :) మీడీయాలో చెప్పే మాటలను నమ్మి, మీవంటి వారి మాట వింటే అంతే సంగతులు. అదేదో కాలమేనిర్ణయిస్తుంది లేండి. రెండో సారి కేంద్రమంత్రి వర్గ విస్తరణలో తెదే మంత్రి పదవి అడగకపోయినా కమిట్ మెంట్ కి కట్టుబడి ఇచ్చాడు. ఇవ్వకపోతే తెదె వారు కనీసం ప్రొటెస్ట్ చేసే పరిస్థితి లో లేరు. ఎనిరోజులు అధికారంలో ఉండేది కాదు ముఖ్యం. వ్యవస్థ లో మార్పు ఎలా తెస్తున్నాడో అనేదే ముఖ్యం.
      వీఈలైతే ఈ రెండు ఆర్టికల్స్ చదువుకోండి.

      మోడి ప్రభుత్వం ధరలు ఎలా తగ్గించగలిగింది?
      http://kbhaskaram.blogspot.in/2014/10/blog-post_23.html


      Government constitutes National Institution for Transforming India (NITI) Aayog Press Note
      http://pib.nic.in/newsite/PrintRelease.aspx?relid=114268

      An important evolutionary change from the past will be replacing a centre-to-state one-way flow of policy by a genuine and continuing partnership with the states. The institution must have the necessary resources, knowledge, skills and, ability to act with speed to provide the strategic policy vision for the government as well as deal with contingent issues.

      Perhaps most importantly, the institution must adhere to the tenet that while incorporating positive influences from the world, no single model can be transplanted from outside into the Indian scenario. We need to find our own strategy for growth. The new institution has to zero in on what will work in and for India. It will be a Bharatiya approach to development

      Delete
    5. *మీకు తెలుగువాళ్ళంటే ఎందుకంత లోకువ? అసలు మీరు తెలుగువారేనా?*
      నేను మొదట భారతీయుడిని, ఆ తరువాతే తెలుగు వాడిని. తెలుగువారంటే కోపమేమి లేదు, కాకపోతే దశాబ్దాలుగా కలసి ఉన్న తరువాత రెండు రాష్ట్రాలుగా విడిపోయిన చరిత్ర తెలుగువారిదే. వెంటనే మరచిపోవాటానికి అది చిన్న విషయం కాదు . దేశంలో ఉండే ఎన్నో చిన్న రాష్ట్రలలో నేడు సీమాంధ్ర రాష్ట్రం ఒకటి. రమణగారి లాంటి వారు బిజెపిప్రభుత్వ పాలన గురించి, ఇంకా పూర్వ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పౌరునివలే, అభిజాత్యంతో జాతీయ స్థాయిలో అద్భుతవిజయాలు సాధించిన బిజెపిపార్టిపై అలవాటు ప్రకారం సేటైర్ వేయడం నచ్చలేదు. చింతచచ్చినా పులుపు చావదన్నట్లు, కింద బడ్డా పై చేయినాదన్నట్లు సా మేతలు గుర్తుకొస్తున్నాయి. స్వంత ఊరులో కూచొని ఉంటే వారికి, మార్పులు ఎమి తెలియకపోవచ్చు. కనుక రాష్ట్ర విభజనానంతరం వాస్థవ పరిస్థితి గుర్తుచేయదలిచాను.

      Delete
    6. మోది ప్రభుత్వం పని చెయ్యటం లేదని నేను అనలేదు.
      వాజ్‌పేయీ ప్రభుత్వం బాగా పనిచేసినా, 2004లో కాంగ్రెస్ ఎందుకు గెలిచిందో ఆలోచించమని అన్నాను.
      తెలుగువాళ్ళని కించపరచవద్దని అన్నాను.

      Delete
    7. తెలుగువారిని కించపరచలేదు. వాస్థవ పరిస్థితి అద్దంలో చూపటానికి ప్రయత్నం చేశాను. కలసి ఉండటమనేది పరిణితికి చిహ్నం. అది అన్నదమ్ములైన, భార్యాభర్తలైనా,రెండూ ప్రాంతాలవారైన, మనవారు విడిపోయి వీకయ్యామని ,మనలో ఎక్కడో లోపం ఉందని గ్రహించకుండా, అందరిని కలుపుకుపోతు, విభజన మంత్రం జపించే కాష్మీర్ లో సైతం ఎన్నికలు విజయవంతంగా జరిపి,అక్కడ గెలిచిన బిజెపి పార్టి బలాన్ని తక్కువగా అంచనా వేస్తూ, మన బలాన్ని మునుపటివలె ఊహించుకొంట్టూ విశ్లేషణలు చేయటం తమాషాగా అనిపిస్తుంది. నాకు తెలిసింది రాస్తాను. ఎవి రాయాలో ఎంత వరకు రాయాలో కూడా రాసేటప్పుడు తెలియదు. నేను రచయితని కాను. సుతిమెత్తగా సెటైరైకల్ రాయటం నాకు రాదు. కొన్నిసార్లు ఎవరైనా బాధపడ్డారని అనిపిస్తే సారి చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

      Delete
    8. శ్రీ రాం గారు,
      మీరు పెటిన లింక్ లు , సమాచారం చాలా బాగున్నాయి. అలాగే మీ వాఖ్యలు కూడా!
      కృష్ణ

      Delete
    9. థాంక్స్. మీడియాలో నమో గురించి ఏకపక్షంగా నియంత లాగా వ్యవహారిస్తాడు అని ప్రచారం చేస్తారు. ఇంతాకాలం ప్రణాలిక సంఘం పై ఆధిపత్యం చేలాయించే కేంద్రం అధికారాలకిఉ కత్తెర వేశాడు. నీతి ఆయోగ్ లో అన్ని రాష్టాల ముఖ్యమంత్రులకు స్థానం కలిపించాడు. అధికార వికేంద్రీకరణ చేయటమే కాక, ఇంతకు మునుపు ఉన్న విదేశి మోడల్ ను పూర్తిగా తిరస్కరించాడు. ఈ భారతీయ మొడల్ వలన ముందో వెనకో దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. భవిషత్ లో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ నిర్ణయాన్ని తిరగతోడటానికి సాహసించరు. కారణం అధికార పక్షం తిరగదోడాలనుకొంటే ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తారు. కనుక నీతి ఆయోగ్ కి లైఫ్ స్పాన్ చాలా రోజులు ఉంట్టుందనుకొంటాను.

      Delete
  5. మొదట్లొ ఈ డాక్టరు బాబు రాసేవి బాగానే ఉన్నాయి, సునిసితమైన విమర్శలు అని అనిపించెవి. కాని కొద్ది కొద్దిగా ఆయన రంగు తెలుస్తుంది. ఈ రకమైన వాళ్ళను చెప్పటానికి ఈమద్యే ఒక వర్గాని (క్యాటగిరి ) కనిపెట్టారు. అది
    ISIS (Indian Sickular, so called Intelligent Society)

    ఈ చాలా తెలివి వున్న ఉదార వాదులకి, తమ వాళ్ళన్నా , తమ చరిత్ర అన్నా, వాళ్ళది ఎదైనా సరే నచ్చదు! వీళ్ళది నల్ల తోలే. కాని, రాజు గారు తిని పారేసిన బొమికలు తిన్న రాజు గారి ఇంటి ముందు వున్న కుక్క, అదే వీధిలొ వున్న మిగతా కుక్కల కంటె తను గొప్ప అనుకుటుంది.
    నేను ఆకలితొ అల్లాడుతూ, డొక్కలు ఎండిన కుక్కనే అవ్వొచు, కాని, ఈ (ISIS) కుక్కల లాగ నన్ను నేను తక్కువ చేసుకొను!!

    ReplyDelete
  6. ఈ పొస్టుని ఓపిగ్గా చదివినవారికి, తీరిక చేసుకుని కామెంట్ రాసినవారికి ధన్యవాదాలు - థాంక్యూ!

    ReplyDelete

  7. అబ్బ,

    కథ మా రంజు గా ఉందండీ ! ఆ పై ఏమి జరిగింది ? పేరయ్య అమ్మాయని తెచ్చేడా ? పెళ్లి జరిగిందా ?

    జరిగాక అమ్మాయి అయ్య కి విషయం మొత్త తెలిసిందా ??

    ఈ టపా కథ కి సీక్వెల్ ఎప్పుడు వస్తుందో ఆతురత తో ఎదురు చూస్తున్నా !!

    జిలేబి

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.