Monday 12 August 2013

ఎందుకిలా జరిగింది?


ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా వ్యక్తి కన్నా సమాజం గొప్పది. ఏ వ్యవస్థకైనా సర్వకాల, సర్వావస్థలలో సమాజహితం మించిన పరమార్ధం లేదు. అలాగే రాజకీయాలు వ్యక్తి మనుగడకి, సమాజ పురోగతికి నిరంతరంగా దోహదపడుతూ ఉంటాయి.. ఉండాలి కూడా. ఏ దేశంలోనైనా రాజకీయాలకి ఇంతకు మించిన పవిత్ర కార్యాచరణ మరొకటి లేదు.

అమెరికావాడు అందలంలో విహరించినా, ఆఫ్రికావాడు అడుక్కు తింటున్నా అందుకు కారణం రాజకీయాలే. రాజకీయాలు రెండే రకాలు. ఒకటి ప్రజలకి మంచి చేసేవి, రెండు ప్రజలకి చెడు చేసేవి. ఇవన్నీ చాలా ప్రాధమికమైన విషయాలైనా, ప్రస్తుతం ఆంధ్రదేశంలో గోడల మీద రాసుకునే సుభాషితాల స్థాయికి దిగజారిపొయ్యాయి. ఏ సమాజానికైనా ఇంతకు మించిన విషాదం మరొకటి ఉంటుందనుకోను.

ఇక్కడ కోస్తాంధ్ర ప్రాంతంలో (చాలామంది) తెలంగాణా ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అని గట్టిగా నమ్ముతున్నారు. మంచిది. డిసెంబర్ తొమ్మిది ప్రకటన లాగానే ఆచరణలో ఆగిపోయిందనే అనుకుందాం. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? తెలంగాణావారు ఖచ్చితంగా ఊరుకోరుగదా. వాళ్ళు మళ్ళీ ఉద్యమం మొదలెడతారు. అంటే పరిస్థితి కొద్దిరోజుల క్రితం జరిగిన CWC ప్రకటన స్థితికి వెళ్తుందే గానీ.. 1956 పరిస్థితి మాత్రం రాదు.

ఇప్పుడు ఇంత తీవ్రంగా స్పందిస్తున్న మన కోస్తాంధ్ర ప్రజలు ఆనాడు అవసమైనప్పుడు ఎందుకు స్పందించలేదు? ఈ ప్రశ్న నన్ను వేధిస్తుంది. తెలంగాణా ఏర్పాటే మా ఏకైక లక్ష్యం అంటూ ఏర్పడ్డ ఒక రాజకీయ పార్టీతో ఒకసారి కాంగ్రెస్, ఇంకోసారి తెలుగు దేశం పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నప్పుడు మనం నిద్ర పొయ్యామా? ఈ రెండు ప్రధాన పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణా అంశం చొప్పించినప్పుడు మనం పెద్దగా పట్టించుకోలేదెందుకు?

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల మ్యానిఫెస్టోలు, పొత్తులు ఒక రాజకీయ అంగీకారానికి అత్యంత ముఖ్యమైనవని ఆనాడు ఎందుకు మర్చిపొయ్యాం? ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికి, మన ప్రాంత ప్రయోజనాలకి దెబ్బగొట్టే విధంగా అవతలవారితో అవగాహన కలిగించుకుంటున్నప్పుడు మనం ఎందుకు ప్రశ్నించలేదు? పైగా తెలంగాణావారి ఓట్లు దండుకోడానికి మన నాయకుడు వేసిన చాణక్యుని ఎత్తుగడగా, గొప్ప రాజకీయ క్రీడగా మురిసిపోలేదా? అంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతో ముఖ్యమైన రాజకీయ పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోలని మనం పట్టించుకోలేదన్న మాటేగా?

ఇప్పుడు రోడ్ల మీద కొచ్చిన వారు 'హైదరాబాదు మాది. దాన్ని మేమే అభివృద్ధి చేశాం.' అంటున్నారు. ఆ అభిప్రాయం కలిగి ఉండటం ఎంతమేరకు సబబు అన్నది ఇక్కడ చర్చనీయాంశం కాదు. ఇప్పుడు హైదరాబాద్ మీద ప్రేమ కలిగి ఉన్నవారికి కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. గత కొంతకాలంగా క్షేత్రస్థాయిలో ఎంతోవేగంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటుంటే (రాజకీయంగా ఒక్కో అడుగు తెలంగాణా వైపు పడుతుంటే) మీరు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? కనీసస్థాయిలో కూడా (కేంద్రప్రభుత్వానికి ఒక హెచ్చరికగా) ఉద్యమం ఎందుకు చెయ్యలేదు? నాయకులపై, వారి లాబీయింగ్ పై (ప్రజాస్వామ్యంలో 'లాబీయింగ్' అన్నది ఒక నీచమైన పదం) అచంచల విశ్వాసంతో మొద్దునిద్ర పోవడం ఏరకమైన రాజకీయ కార్యాచరణ?

'ఒక పార్టీ అధికారంలో రావడానికో, ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికో మా హైదరాబాదు విషయంలో మేం రాజీపడే ప్రసక్తి లేదు. హైదరాబాద్ మాది. ఈ హైదరాబాదు అంశంపై మాకు ఖచ్చితమైన హామీ ఇస్తేనే మీకు మా ఓటు. లేదా మీరూ, మీ నాయకులు పొయ్యి ఏ గంగలోనైనా దూకండి.. మాకనవసరం.' అనే స్పష్టమైన వైఖరి మొదట్నుండి తీసుకుని ఉండాల్సింది. సీట్ల కోసం తెలంగాణావాద పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకి మన ఆంధ్రా ప్రాంతంలో డిపాజిట్లు కూడా రాకుండా చేసి చుక్కలు చూపించి ఉండాల్సింది. డెమాక్రసీలో ఓటుతోనే కదా బుద్ధి చెప్పేది? మనకి ఇంతకు మించి వేరే మార్గం ఉందా?

ఆ రకంగా చేసినట్లైతే దేశానికి, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చి ఉండేవాళ్ళం కాదా? ('హైదరాబాదు విషయంలో ఆంధ్రావారితో రాజకీయం చేస్తే మాడు పగులుతుంది' అని). రాజకీయ పార్టీలు శూన్యంలో రాజకీయాలు చెయ్యవు. వారికి మన ప్రాంతప్రజల ఆకాంక్ష కుండ బద్దలు కొట్టినట్లు అర్ధమైనట్లయితే, వారి వ్యూహప్రతివ్యూహాలు అందుకు తగ్గట్టుగా రచించుకునేవారు. కానీ మనం ఏనాడూ అటువంటి స్పష్టమైన, నిర్దిష్టమైన పొలిటికల్ మెసేజ్ ఏ ఎలక్షన్లోనూ ఇవ్వలేదు. పైగా తెరాసతో పొత్తు పెట్టుకున్న పార్టీలక్కూడా దండిగా సీట్లు కట్టబెట్టాం.

'లేదు. లేదు. కేంద్రం తెలంగాణా ఇస్తుందని మేం అనుకోలేదు. అందుకే ఖాళీగా ఉన్నాం.' అంటే దాన్ని రాజకీయ అలసత్వం అంటారు. రాజకీయంగా ఏదీ 'అనుకోరాదు'. ముందే నిరసన తెలిజేస్తూ ఉండాలి. అదొక పవిత్రమైన విధి. అలా చెయ్యకపోవటం వల్లనే ఇప్పుడు నష్టం జరిగింది. అందుకే ఎవరైనా, ఎక్కడైనా తమ రాజకీయ అభిప్రాయాల్ని (మన హక్కులకి భంగం కలుగుతుందని అనుమానం కలిగినా చాలు) వీలైనంత గట్టిగా, బలంగా ప్రపంచానికి తెలియజెయ్యాలి. అలా చెయ్యకపోతే మన భవిష్యత్తు తరాలు దెబ్బతింటాయి.

మన ఆంధ్రా ప్రాంతం వాళ్ళు పార్టీలకి అతీతంగా ఎప్పుడైనా అట్లాంటి కార్యక్రమాలు చేశారా? చెయ్యలేదని నేను అనుకుంటున్నాను ( ఏం చేసినా మన నాయకులకి కలిగే లాభనష్టాలు లెక్కలెసుకునే చేశాం). చెయ్యవలసినప్పుడు ఏమీ చెయ్యకుండా ఆలస్యంగా మేలుకోవడం.. ఇల్లు కాలుతున్నప్పుడు ఫైర్ ఇంజన్ కోసం హైరానా పడటం వంటిది. అసలు ఇల్లే అంటుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లైతే ఈనాడు మనకీ దుస్థితి దాపురించేది కాదు. పరిస్థితి ఇంత అగమ్యగోచరంగా ఉండేదికాదు.

(photo courtesy : Google)

33 comments:

  1. ఆంధ్ర వాళ్ల కున్నంత అహంకారం, డబ్బులు ఉంటే అన్ని పనులు జరుగుతాయనే నమ్మకం దేశం లో ఏ ఇతర ప్రాంతాల వారిలో ను చూడం. వీరికి ఉన్న కులగజ్జి వల్ల , వాళ్ల నాయకుల దగ్గర ఉన్నడబ్బుల వలన ,వీళ్ల నాయకులపై ఎంత నమ్మకమంటె వాళ్లని సూపర్ హీరొ లు అనుకొంటారు. కాని వాస్తవం వేరు. చేతులు కాలాక ఆకులు పట్తికొన్నా ప్రయోజనమేమిటి?

    ReplyDelete
    Replies
    1. అవునా? అసలు తమరు సువిశాల భారతదేశం లో ఎన్ని ఇతర ప్రాంతాలవారిని చూశారు మహానుభావా? ఇలా బ్లైండ్ గా ఒక్క వాక్యం లో తేల్చేశారు?

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. Reposting after correcting an error:

    Dr. Ramana, I assume this is one of the rare posts where you are totally serious instead of the more common nuanced humor laced treatment of important subjects. My own "socio-psycho" analysis:

    Till December 9, most Andhra educated/urban folks treated Telangana as a joke. They believed the often repeated story that Telangana is only an unemployed politician's demand. They failed to ask the people of Telangana what they want. This is because of a mixture of cynicism (all politicians will lie), ignorance (Telangana people don't care about the demand), arrogance (we know what is better for Telangana) & a sense of superiority (who are these alaga janam to ask for a state).

    We see the same everyday in Hyderabad when people walk in as "owners" rather than "newcomers entering a strange place". Witness the ridicule heaped on Urdu, old city, bonalu etc. etc.

    Ordinary Andhras never cared then or now. This is why BJP did OK in 1998, TDP & PRP did OK in 2009 and Congress & TDP did quite well on July 31 panchayat last phase. They took things at face value without bothering to delve into చాణక్యుని ఎత్తుగడ or గొప్ప రాజకీయ క్రీడ.

    I don't believe these simple souls will vote for those who are planning to cheat T-folks. They will probably argue "what is the guarantee you won't cheat us next"?

    The "unexpected" happened on December 9. Sonia decided to call the bluff. This turn of events forced the urban Andhras into a tail spin.

    December 23 changed the situation again. Anxiety turned to arrogance once more.

    In the mean time, people started believing their own propaganda. This resulted in "guilt transposal" i.e. they started saying "we did not steal your jobs, you stole ours". They also started thinking "we can reverse/veto any decision again".

    Andhra politicos went back to their old game. They added "new villians" like Chidambaram or Moily. Some said bifurcation will hurt Telangana. Others started random theories on no safety for Andhras in Hyderabad, Maoism, dorala rajyam etc. Urban Andhras lapped it eagerly: cognitive dissonance? Yet they also continued "2 eyes", "we respect T-sentiment" etc. because you can't win 147 seats from 175.

    July 30 was a shock in more ways than one. First, we find lobbyists have failed. Secondly we find the real problems (fear of unemployment, loss of water etc.) were never presented.

    The spin masters are promising another brahmastram. Anything is better than admitting to their own past mistake of believing the conmen. Ergo one more round of "guilt transposal".

    This is a vicious cycle that could end like a Greek tragedy. I only hope they will learn. I am not very optimistic if this will happen as I see the same mistakes vis-à-vis Rayalaseema & Uttarandhra.

    PS: 1. The above is over simplified to avoid writing a dozen page comment; 2. I only picked the Andhras as they are the subject of this post. This does not mean I endorse everything T-vadis did/said.

    ReplyDelete
    Replies
    1. dear Jai Gottimukkala గారు,

      ఒక్కోసారి నేన్రాసిన పోస్టు కన్నా ఆ పోస్టుకొచ్చిన కామెంట్లే బాగుంటాయి. అందుకు ఉదాహరణ మీర్రాసిన ఈ కామెంట్. థాంక్యూ.

      Delete
    2. Agree. Excellent comment by Jai garu.

      I think the issue boils down to two things. The apathy or political naïveté of the public and lack of independence of the political leaders who are beholden to high commands. The intelligentsia and the media failed to communicate issues at hand to the people at large to make informed choices.

      In any event, there is no use crying over spilt milk. The order of the day is to bring bright minds together in building the new capital and figuring out issues like water, division of defense and other high-tech industries and elite educational and research institutions, flow of oil and natural gas from KG basin and development of maritime industries and ports, etc. It is a rare opportunity to build something brand new from scratch unhindered by legacy. A clean canvas is being given to Andhras and I hope they don't blow the opportunity.

      Delete
    3. @Y.V.Ramana: I was actually looking forward to your criticizing my "theory" based on your knowledge of psychology. Hopefully next time.

      @GIdoc: Yes, it is a rare opportunity to start afresh. I am not however very optimistic & hope I will be proved wrong. I see ominous signs (denial, for instance) that the opinion leaders are not learning from current events.

      Delete
    4. @Jai,
      What is the future of telugu desam paarti in telamgaana? What benifit baabu is going to get by supporting Telangana issue.

      Delete
    5. I think TDP & YCP are dead in Telangana. This is because the credibility has been battered by flip-flops.

      It still makes sense for these parties to support bifurcation. Getting 88 seats from 175 is easier than 147/175.

      Delete
    6. @Jai,
      It is better merging telangana TDP with bjp. Nagam janardhan reddi took right decision. TDP peolple can not join congress and TRS. At the same time they cannot maintain their seperate identity coming days. This is my guess. What do you say.

      Delete
    7. Ramana Garu,

      I believe, it is simplistic to think that voters 'vote' only based on a Party's Manifesto! More often than not, even the Party folks themselves don't take them seriously.

      I don't have any formal background in electoral analysis nor I have intellectual faculties to do 'Socio-psycho' analysis. However, just look at the CEOANDHRA website http://www.ceoandhra.nic.in/GE_2009/Statistical_Report_2009_1.pdf. Even by cursor analysis, the reason why Congress won the election in 2009 is because of split in anti-congress vote by PR and LS. This includes even in Telengana region.

      In my opinion, common voters are swayed by local issues along with caste & creed considerations only.

      Counter question to Mr. Jai -> Why is that Telengana leaders, painting the current agitation in A&S region as stage managed (by CM, by police etc) and has no people support? Are they not doing the same mistake?

      Delete
  4. ఈ పరిస్థితి నిజంగా సీమాంధ్ర నాయకులకు, ప్రజలకు చక్కటి గుణపాఠం.
    నాకు ఒక్క విషయం నవ్వు తెప్పిస్తోంది. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులలో ఒక్కరు కూడా సీమాంధ్రుల ఆవేదన ఏంటి అని హిందీలో గానీ, ఇంగ్లీషులో గానీ అర్ధమయ్యేటట్లు తోటి సభ్యులకు చెప్పలేకపోయారు. ఒకడ్ని పార్లమెంటుకు పంపేటప్పుడు కనీస అర్హతలు కూడా చూడకుండా పంపిన సీమాంధ్రులకు ఇప్పుడు ఒక వాయిస్ కూడా లేకుండా పోయింది పార్లమెంటులో. తెలంగాణా సభ్యులు కొంతలో కొంత నయం. కనీసం హిందీలో అయినా మేనేజ్ చెయ్యగలరు.
    సరిగా మాట్లాడటం చేతకాని సీమాంధ్ర సభ్యులు కృష్ణుడి వేషం వేసుకుని సభకు వెళ్ళడం, తెలుగులోనే మాట్లాడుతా అని పట్టు బట్టి మాట్లాడటం, నువ్వేం మాట్లాడుతున్నావో మాకర్ధం కావట్లేదు బాబూ అంటే, తెలుగు వారికిచ్చే గౌరవం ఇదేనా అని మండిపడటం.
    ఇవన్నీ చూసైనా సీమాంధ్ర ప్రజలు మారాలి. ఒకడ్ని ఎన్నుకునేటపుడు వాడు తమ సమస్యలను సభలో అందరికీ అర్ధమయ్యేలా చెప్పగలడా అని కనీసం ఆలోచించాలి.
    కేవలం కులం చూసి వోట్లు వేస్తే సరైన రోజున వీళ్ళందరూ మన పరువు తీస్తారు. నలుగురు నవ్వుకునేలా చేస్తారు. ఏకంగా మన పుట్టి ముంచుతారు.

    ReplyDelete
    Replies
    1. I completely agree. Until we can learn how to make our case in languages that are broadly understood and win support for our causes, we will not be successful.

      Delete
    2. ఈ విషయంపై నా సొంత థియరీ:

      కొన్నేళ్ళ కిందటి వరకూ దాకా నెల్లూరు, తిరుపతి లాంటి నగరాలలో ఎందరో తమిళం మాట్లాడేవారు. అలాగే అనంతపురం, ఆదోనీ, గద్వాల్ నగరాలలో కన్నడ దాదాపు సగం మందికి వచ్చేది. శ్రీకాకుళం జిల్లాలో ఒడియా భాషే కాక బాంగ్లా మాట్లాడే వారు కొల్లలుగా ఉండేవారు. దీనివల్ల ఆ నగరాలకు వచ్చిపోయే ఇతర భాషేయులకు సులభంగా ఉండేది. అంతకంటే ముఖ్యంగా మనవారికి బెంగుళూరు, మదరాసు లాంటి మహానగరాలలో ఉపాధి అవకాశాలు సులువు అయ్యేవి.

      This was a win-win situation for everyone.

      తెదేపా ఆవిర్భావముతో సీను మారింది. మనం తెలుగు వాళ్ళం, వేరే భాషలు మనమెందుకు అనే పోకడలు వచ్చాయి. దేశదేశాల్లో తెలుగువారు పెరగడంతో ఆ భావం పెరిగింది. కాలక్రమాన మనకు తెలుగు తప్ప ఇతర భాషల మీద పట్టు పోయింది.

      I am not criticizing any region, language or party. This comment is about mindset. My theory is based on the cosmopolitan culture will eventually prevail over a "closed" culture stressing homegenity.

      Delete
    3. ఆజ్ఞాత గారికి,వాళ్ళకి హిందీ రాదని నవ్వడం వరకూ బాగుంది. ఇప్పటి వరకూ అంధ్ర ప్రంతం లో లాగే యెన్నికలు జరిగినా మీ ప్రాంతానికి యేమి కావాలో దాని గట్టిగా అడగ లేని అసమర్ధులని యెన్నుకున్నందుకు మిమ్మల్ని చూసుకుని మీరు జాలి పడాలి, అది తెలుసా? ఇదే రాజకీయ చట్రం తో ఇవ్వాళ చెయ్యలెనిది రేపు యేమి చెయ్యగలరు మీరు?నిన్నటి నుంచీ ఇప్పటి దాకా మీరు సరైన ప్రద్తినిధుల్ని యెన్నుకోలేకపోవడం వల్లనె కదా మీరు వెనుకబడి ఉంది

      Delete
    4. ఇంతకాలం హిందీ లో మానేజ్ చెయ్యగలిగిన తెలంగాణా ప్రాంత సభ్యులు మీ ప్రాంతానికి మేలు జరిగే విధంగా యేమి ఊడబొడిచారు? దాని తల్చుకుని కూదా నవ్వుకోండి!

      Delete
    5. @Gottimukkala gaaru: మరి ఏ భాషా రాని గోదావరి జిల్లాల వాళ్ళు కుడా మీరు చెప్పే బెంగుళూరు చెన్నై లలో ఉన్నారనుకుంటా . తెదేపా ని సమర్దించడం లేదు కాని, తెదపా వచ్చింది ఆత్మగౌరవం నినాదం తో అనుకుంటా , అప్పటి కాంగ్రెస్ తరుచు ముఖ్యమంత్రులను మార్చడం, ఒకే పార్టి ఎక్కువ రోజులు అధికారం లో ఉండటం, రామారావు కి జనం లో ఉన్న అభిమానం. ఇతర భాషల మీద పట్టు ఈ మధ్యనే ఎక్కువైంది , ఒకప్పుడు మా ఊళ్ళో హిందీ మాట్లాడే వాణ్ని ఆశ్చర్యంగా చూసేవాళ్ళు , ఇప్పుడు కుప్పలు కుప్పలు గా ఉన్నారు, అందరికి తమిళ్ , కన్నడ, భాషలు గురించి కొంచెం తెలియడం నాకే ఆశ్చర్యంగా ఉంది .
      మనం తెలుగు వాళ్ళం అనే మాట కరెక్ట్ కాని, మనకి వేరే భాషలు ఎందుకు అన్న ఆలోచన లేదు.

      Delete
    6. Anon, please read my comment again. "I am not criticizing any region, language or party".

      Delete
    7. Anonymous12 August 2013 21:55: మీరు చెప్పినదాంతో పూర్తిగా ఏకీభవిస్తాను. పోడియమ్ లో నిలబడి గోల చెయ్యడం, తెలుగులోనే మాట్టాడతా అని సభను, సభ్యులనూ ర్యాగింగు చెయ్యడం -ఇలాంటి బండ పనులే తప్ప తమ బాధేంటో వివరించి చెప్పిన వాళ్ళే లేరు. తెలుగులోనే మాట్టాడుతానని అతడంటూ ఉంటే మూర్తీభవించిన మూర్ఖత్వం అనిపించాడు.

      Delete
    8. రాష్ట్రం ఏర్పడకముందు కలిసి ఉండటంతో వివిధ భాషలు మాట్టాడుతూ ఉండి ఉండవచ్చు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక సహజంగానే దూరాలు పెరిగి కొత్త తరాలకు ఆయా భాషలు మాట్టాడాల్సిన అవసరం తగ్గిపోతూ ఉంటుంది. అది సహజ పరిణామం. "మనం తెలుగు వాళ్ళం, వేరే భాషలు మనమెందుకు అనే పోకడలు వచ్చాయి." - ఇది సరికాదనుకుంటాను. తెలుగెందుకు, కూటికా గుడ్డకా అని జనం ఓ పక్కన అనుకుంటూంటే.., వేరే భాష మనకెందుకనుకుంటున్నారని అనడం కించిదాశ్చర్యకరంగానూ, కొంచెం హాస్యస్ఫోరకంగానూ అనిపిస్తోంది.

      Delete
    9. Chaduvari:

      My point is that these places have certain natural advantages due to geography. This has been lost due to "attitude problems".

      Contrast this with neighboring states. Despite the deep rooted Tamil-Kannada animosity, Hosur (in TN) reverberates with Kannada. The town is today virtually a suburb of Bangalore and thriving. Hindupur could have similarly leveraged its geography but tragically did not do so.

      "తెలుగెందుకు, కూటికా గుడ్డకా"

      This is the other extreme and equally wrong. However, I don't see it much. Just look at Tollywood collections, the plethora of Telugu channels (highest in India), the proliferation of Telugu blogs etc. True Telugu literature has lost readers but that is because the reading culture is disappearing, not disregard for the language.

      Delete
  5. మన వాళ్ళకి కావాల్సిన అర్హతలు ఉన్నాయి, మీరు ఆవేదన చెందనక్కరలేదు. సీమాంధ్ర ఆవేదన ఏంటో చెప్పలేకపోవడానికి సమస్య భాష కాదు ... భావం , అది లేకుండా చేస్తున్న ఉద్యమాన్ని యేమని వివరిస్తారు ?

    ReplyDelete
  6. 1. ఒక సమస్యకి పరిష్కారం అనుకున్నది కొత్త సమస్యల్ని సృష్టించేదిగా ఉంటే, కొంతకాలం తర్వాత మళ్ళీ సమస్య మొదటికొస్తుందేమో అనిపించేటట్లు ఉంటే అది నిజమైన పరిష్కారం అనిపించుకుంటుందా? ఇప్పుడు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ప్రతిపాదన మొదలవ్వగానే గుర్ఖాలాండు గొడవ మొదలు పెట్టింది. మిగతా వాళ్ళు కూదా నేడో రేపో మొదలు పెదతారు.నిజంగా విభజన వల్లనే వెనుకబాటుతనం పోతుందా? ఇప్పటికి ఉత్తరాదిన విడిపొయిన రాష్ట్రాలలో అలాంటి గుణాత్మకమైన మార్పులు జరిగాయా?

    2. తెలంగాణా వాదులకి తెలుసో లేదో గాని విభజన నిర్ణయం జరిగాక సమైక్యాంధ్ర ఆందోళనల వెనక రాష్త్ర స్థాయి కాంగ్రెసు పెద్దలే ఉన్నారనేది యెమి చెబుతున్నది? ఇస్తారేమో అన్నప్పుదు హడావుడి చెసి ఇవ్వరని ధీమాగా ఉన్నప్పుదు ఆగిపోవటంలా నత్త నదక నడిచే ఉద్యమానికి చురుకు తెప్పించటం కొసమే వాళ్ళు ఈ ప్రకటన చేసారు. దాన్ని వేడెక్కించి ఆ బూచిని చూపించి విభజనని యెన్నికల తర్వాతకి వాయిదా వెయ్యటం కోసం అక్కడి పెద్దన్నలూ ఇక్కడి చిన్నన్నలూ కలిసి ఆడుతున్న దొంగాట ఇది.

    3. అవును అది మాకూ తెలుసనే తెలంగాణా వాదులకి నేనొక సూటి ప్రశ్న వేస్తాను. ఇట్లాంటి కాంగ్రెసుతో కచరా గారు యెందుకంత మమేకమయ్యారో, రాష్ట్రం రావటమంటూ జరిగితే అది కాంగ్రెసు వల్లనే అని నొక్కి చెప్పారో నిన్న గాక మొన్న రాష్ట్రం ఇస్తే కాంగ్రెసులో కలిసి పోవడానికి గూడా సిద్దపడ్దారో మీరు తేల్చుకోవల్సి వొస్తుంది.

    4. మొత్తం సమస్యని మొదటి నుంచీ చివరి వరకూ రాగద్వేషాల కతీతంగా చూస్తే అటు తెలంగాణా వాదులూ ఇటు సమైక్య వాదులూ చేస్తున్న పొరపాటు ఒకటి కనిపిస్తున్నది. సమస్యకి మూలం యేమిటో ఇద్దరిలో యెవరూ పసిగట్ట లేదు. ఒక సమస్యని మూలాన్ని వెదక్కుండా పైకి కనబడే చిహ్నాల్ని మాత్రమే చూసి మూలం దగ్గిర ఒక్క దెబ్బతో పడిపొయే విషవృక్షాన్ని ఆకుల మీద యెన్ని దెబ్బలేసినా లాభమేముంది?

    5. తెలంగాణా వాదులకి తప్పనిసరిగా జవాబు చెప్పాల్సిన ప్రశ్న ఒకటి వేస్తున్నా.ఇవ్వాళ మా వెనకబాటుతనానికి ఆంధ్రోళ్ళు కారణం, ఇన్నేళ్ళుగా మమ్మల్ని నిర్లక్ష్యం చేసారు గనక విడిపోవటమే సరైనదంటున్నారు. విడిపొయిన ఒక నాలుగేళ్ళ తర్వాత ఒక మూడు జిల్లాలు మాత్రమే ముందుకెళ్ళి మిగతావి ఇంకా వెనకబడి ఉంటే, వాళ్ళు ఇలాంటి వాదన తోనే మాకు వేరే రాష్త్రం కావాలని అడిగితే వెంటనే అప్పటి మీ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇచ్చేస్తారా?

    ReplyDelete
  7. 6. అలా సాగదీస్తూ పోతే యెక్కడాగుతుంది? విడిపోవడం ద్వారానే బాగుపడగలగటం నిజమైతే ప్రతి జిల్లా ఒక రాష్తంగా విదిపోవాల్సి ఉంటుంది.నిజంగానే రాష్త్రం విడిపోకుండానే మీకు కావలసిన స్వయం పరిపాలన అనేది సాగించుకోలేని విషయమేనా? ఇవ్వాళ పరిపాలనకి సంబంధించిన చట్రం యెలా ఉంది?కేంద్రంలో పార్లమెంటూ రాష్త్రాలలో అసెంబ్లీలూ ఉద్దరిస్తున్న ఘనకార్యమేమిటి? కేవలం కాగితాల మీదకి శాసనాల్ని యెక్కించటం. వాళ్ళు నిజంగా పనులు చెయ్యటానికి జిల్లా స్థాయి యంత్రాంగం మీదే ఆధార పడుతున్నారు.యెందుకంటే జిల్లాలకి భౌగోళికమైన,రాజకీయపరమైన మరియు సాంస్కృతికమైన సరిహద్దులు ఖచ్చితంగా వివాద రహితంగా యేర్పాటయి ఉన్నాయి.పనులు చెయ్యటానికి కావలసిన యంత్రాంగమంతా అక్కడ బలంగా ఉంది.

    7. ఆ జిల్లాలకి రాజకీయపరమైన స్వయం పరిపాలన ఇవ్వడం కొసమే జిల్లా ప్రజా పరిషత్తులనే వ్యవస్థని ప్రతిపాదించారు. వాటికి యెన్నికలు జరుగుతున్నాయి,కార్యాలయాల్ని సమకూర్చారు, చాలా హడావుడి చేసారు - అఖరికి ఇవ్వల్సిన శాసనాధికారం మాత్రం ఇవ్వకుందా చేటపెయ్యల్లాగా వాటిని నిలబెట్టినందువల్ల ఆ యెన్నికలకయ్యే ఖర్చంతా వృధా అయిపోతున్నది. అవి అసమర్ఢులకి రాజకీయ పునరావాస కేంద్రాలు గా మిగిలిపొయినాయి.

    8. తెలంగాణా వాదులు ఆ పది జిల్లల కోసమూ, సమైక్య వాదులు ఆ హైదరాబాదు ఒక్కదాని కొసమూ గాకుండా జిల్లాలకి స్వయం ప్రతిపత్తి కోసం ఉమ్మడిగా పోరాడితే మొత్థం 23 జిల్లాల వాళ్ళూ బాగుపదతారు కదా! అధికార వికేంద్రీకరణ కోసమనే ఒక వ్యవస్థని ప్రతిపాదించి కూడా దాన్ని పూర్తిగా యెందుకు అమలు చెయ్యలేదో తెలుసా?అధికారం కేంద్రీకృతమవడం వల్ల లాభపడే వాళ్ళు ఆ అధికారాన్ని వికేంద్రీకరిస్తే తమ లాభం గూబల్లోకి వొస్తుందని తెలియదం వల్ల అలా వికేంద్రీకరణని తొక్కి పట్టి ఉంచారు.రెండు రాష్ట్రాలు గా విడిపోతే ఇలాంటి అధికార కేంద్రం దగ్గిర గుమిగూడి సొంతానికి దండుకునే వాళ్ళు మాత్రమే బాగుపడతారు.

    9. అవినీతి మచ్చ లేని వాళ్ళూ మంత్రులు గా కొందరు మంచి పేరు తెచ్చుకున్న మంచి వాళ్ళూ తమ జీవితానుభవాల్ని గురించి చెబుతూ వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్లు గా ఉన్నప్పటి అనుభవాల్ని యెకరువు పెట్టగా నేను చదివాను.అనుభవాలు అంటే పని చేసిన అనుభవాలు కాదు - జిల్లా అంతా కలయ దిరిగి యెమి చెయ్యాలో తెలిసి కూదా పని చెయ్యటానికి అధికారాలు లేని దరిద్రాన్ని గుర్తు చేసుకోవటమే. మంత్రిగా ఉన్నప్పటి అధికారాలు అప్పుడే ఉంటే యెంతో కాలం కలిసొచ్చేదనే నిట్టూర్పులే.ఇవ్వాళ ఇంకొ దరిద్రం కూడా కనబడుతూ వినబడుతూ ఉంది. వెనకబడిన జిల్లాల వాళ్ళు రాష్త్ర ప్రభుత్వాల్ని మేము కాస్త బాగుపడాలి బాబూ మా జిల్లా నించి ఒకరిని మంత్రిని చెయ్యండని దేబిరించటం.అంటే ఒక జిల్లా బాగుపడాలంటే ఆ జిల్లా వాడు మంత్రివర్గంలో ఉండాలన్నమాట. అంటే మొత్తం ర్రాష్త్ర పరిధి లో అలోచించాల్సిన మంత్రి తన సొంత జిల్లాని గురించి మాత్రమే అలొచించటం అనేది అందరికీ న్యాయమే అనిపిస్తున్నదన్నమాట.

    10. ఆ దరిద్రాలకీ ఈ శషభిషలకీ మూలం ఒక్కటే ననేది నాకు అనిపిస్తున్నది. జటిలమైన సమస్యలకి కూడ లోతెరిగి చూడకుందా దీర్ఘకాలిక పరిష్కారాలకి కాకుండా అప్పటికి నెత్తిన పడ్డ పెంటని వొదిలించుకుంటే చాలనే విధంగా అలోచించటమే.తెలంగాణా వాదుల కోరిక ప్రజలు సుఖపడే స్వయం పరిపాలన అయితే అది రాష్త్రంగా విడిఫొయినా జిల్లాలకి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం వల్లనే జరుగుతుంది. జిల్లాలకు పూర్తి అధికారాలిచ్చి అన్ని జిల్లాలనీ స్వయం పోషకంగా చెయ్యడం విడిపోకుండానే చేసుకొవచ్చ్చు.కాదు మాకు వేరే అధికార కేంద్రం కావలసిందే తింటే తింటారు తిననియ్యుండ్రి మావాళ్ళేగా మేమేమీ అనం అంటే నేనేమీ చెప్పలేను. ఒకసారి నేనే ఆ జవాబును వారినుంచి పొంది ఉన్నాను:-)

    ReplyDelete
  8. ఇక ఆఖరుగా రెండు మాటలు చెప్పి నా వాదనని ముగిస్తాను.ఒకనాడు దేశం కొత్తగా స్వతంత్రం తెచ్చుకున్న రోజున భాషాప్రయుక్త రాష్త్రాల పేరుతో మనం ఒక ఒరవడి దిద్దాం. అదే దారిలో మిగతా వాళ్ళూ నడిచారు. ఇవ్వాళ మళ్ళీ అధికార వికేంద్రీకరణ సాధిస్తే మళ్ళీ మనం అందరికీ కొత్తదారి చూపించిన వాళ్ళ మవుతాం.నాకు చాలా బాధగా అనిపించే విషయం ఒకటి ఉంది. తెలంగాణా వాదులు మా భాష వేరు అంటున్నారు. అది చాలా తప్పు.మనం ఆ రొజున వేరే వాళ్ళకి వొదిలేసిన రాష్త్రాల్లో ఉన్న వాళ్ళతో సహా అందరం తెలుగు వాళ్ళమే. నేను క్రిష్ణా జిల్లా వాడినే అయినా రాగద్వేషాలు లేని నిందు మనస్సుతో ఒక మాట చెబుతున్నా. క్రిష్ణా జిల్లా నించి అధికార కేంద్రాన్ని అంటకాగి బాగా బలిసిన వాళ్ళు ఇతర జిల్లాల వాళ్ళని చాలా హీనంగా చూసారు, చూస్తున్నారు,ఇకముందు కూదా వాళ్ళు సంస్కారం గలిగి ప్రవర్తిస్తారని నేననుకోవదం లేదు. వాళ్ళీ రోజున మా భాష నీటైనది అనుకోవడం సంస్కృతం తో అవసరమైన దానికన్న యెక్కువగా సంకరం అవ్వడం వల్ల వొచ్చిందే. తెలంగాణా లో మాట్లాడేదీ, రాయల సీమలో మాట్లాడేదీ, అంధ్రా జిల్లాల్లో మట్లాడేదీ అంతా తెలుగే. అన్నీ మాండలికాలు మాత్రమే.అవి వాడుక ఈజీ గా ఉండడం కోసం యేర్పడిన యాసలు మాత్రమే. ఉపనిషత్తులలో శ్రేయము ప్రేయము అని ఒక భావన ఉంది. దాని అర్ధమేమిటంటే శ్రేయం కలిగించేది ఇష్టమైనది కూదా అయితే వెంటనే తీసేసుకో - నిన్నెవరూ అపలేరు కూడ. ప్రియమైనది శ్రేయము కాదని తెలిసినప్పుదు తొందర పడగూడదు. అలా తీసుకుంటే తర్వాత నష్టం నీకే. అలాగే ఒకటి మనకు శ్రేయస్సు నిచ్చేది అయితే అప్పటికి ఇష్టం లేకపోతే బలవంతంగా ఇష్టం కలిగించుకోవలసిందే, యెందుకంటే అది నీకు మంచి చేస్తుంది గనక.ఈ ఉపనిషత్తుల సుత్తిని నా స్వంత అవసరానికి వేస్తున్నానండీ యేమనుకోకండేం:-) పైన నేను చెప్పినవన్నీ నా వైపు నుంచి అన్ని జాగ్రత్తలూ తీసుకుని నా మాటల వల్ల అసలే వేడిగా ఉన్న వాతావరణం ఇంకా వేడెక్కని విధంగానే చెప్పినా తమకిష్టం లేని సంగతి కనబడగానే నన్ను మాత్రం ద్వేషించకుండా ఉంటారని:-)


    నా మనసులో ఉన్న అసలైన భవిష్యత్తు చిత్రపటం యేమిటంటే "జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వమూ ప్రాంతీయ స్థాయిలో జిల్లా ప్రభుత్వాలూ" మాత్రమే ఉండి అవి డైరెక్టు కాంటాక్టులో ఉండాలని. అసలు రాష్ట్రాలే అంతర్ధానమై పొవాలని. జిల్లాలకి అరకొర అధికారాలిచ్చి రాష్ట్రాలనే అంతరువులు అలాగే ఉంటే అవి మళ్ళీ ఇప్ప్పటి దళారి పనులే చేస్తాయి.


    విభజనా? వికేంద్రీకరణా? యేది ఉత్తమం?

    ReplyDelete
  9. ఎందుకిలా AP ఖర్మ కాలిపోయింది?

    ReplyDelete
  10. sIR,
    BAAGUNDI SIR,

    G rAMESH BABU
    GUNTUR

    ReplyDelete
  11. ఒకడ్ని ఎన్నుకునేటపుడు వాడు తమ సమస్యలను సభలో అందరికీ అర్ధమయ్యేలా చెప్పగలడా అని కనీసం ఆలోచించాలి.


    ---->
    బాగా చెప్పారు. రామారావు వొచ్చే వరకూ యెడం లేకుందా పరిపాలించి మీతో చేసుకున్న పెద్ద మనుషుల ఒప్పందాని నిర్లక్ష్యం చేస్తున్నప్పుదు, ఇదివరకు జరిగిన ఉద్యమాల్లో ఊదబొదుస్తామని బయల్దేరి మద్యలో సొంత లాభం కోసం తెప్ప తగలేసిన మీ వాళ్ళని మీరెంత వివేకం గా యెన్నుకున్నారో ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ మాట మీకే తగుల్తుంది.

    ReplyDelete
  12. డాక్టరు గారూ, మీ పోస్టు లో అంటే విషయం లోనూ దాన్ని ప్రజెంట్ చేసిన పధ్ధతి లోనూ ఒక పొరపాటు చేశారు.అది యేమిటో తెలుసుకోవాలని ఉందా? మీకు ఆసక్తి ఉంటేనే చెప్పదల్చుకున్నాను. మీ రెస్పాన్స్ కోసం చూస్తున్నాను.వీలున్నంత త్వరగా స్పందించగలరు.

    ReplyDelete
    Replies
    1. hariSbabu గారు,

      మీ కామెంట్లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. థాంక్యూ.

      ఈ పోస్టులో పొరబాటు చెప్పడానికి నా పర్మిషనెందుకు? హాయిగా రాసెయ్యండి. చదివి ఆనందిస్తాను.

      (అవసరం అనుకుంటే పోస్టుని ఎడిట్ చేస్తాను.)

      Delete
  13. హైదరాబాదు తెలంగాణా హక్కు అని ప్రత్యేక వాదులు చెబుతున్నారు. అసలు వారికి మాత్రమే హైదరాబాద్ పై ఎలా హక్కు ఉంటుందో అర్థం కావడం లేదు. యాభై ఏడేళ్లు వెనక్కి వెళితే... ఇవాళ్టి తెలంగాణాలోని చాలా భాగాలు మరాఠాడ్వా, కర్నాటక రాష్ట్రాల్లో భాగంగా ఉండేవి. హైదరాబాద్ ప్రాంతం అంతా సంస్థానం రూపంలో నిజాం పాలన కింద ఉండేది. విశాలాంధ్ర ఏర్పాటు అయిన తర్వాతనే మొత్తం తెలంగాణా ప్రాంతం, ఇటు ఆంధ్ర ప్రాంతం అంతా ఒక సువిశాలమైన రాష్ట్రంగా హైదరాబాదు రాజధానిగా ఏర్పాటు జరిగింది. హైదరాబాదు నగరం కేవలం భౌగోళికంగా మాత్రమే తెలంగాణా ప్రాంతంలో ఉంది. ఈ ఒక్క కారణంతోటే ప్రత్యేక వాదులు ఇవాళ హైదరాబాదును సీమాంధ్రుల నుంచి లాక్కోవాలని చూస్తున్నారు. అరవై ఏళ్ల నుంచి ఉద్యమం అంటున్నారు. మరి అరవై ఏళ్ల నుంచి రాజధాని మనది అనుకునే వాళ్ల మనోభావాలు పట్టించుకోరా? ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆంధ్ర అనే ఒక పెద్ద రాష్ట్రంలో తెలంగాణా ప్రాంతం వచ్చి విలీనం అయింది. అలాంటపుడు పెద్ద రాష్ట్రానికి రాజధానిగా ఉన్న నగరాన్ని ఒక చిన్న ప్రాంతం తనకు కావాలని ఎలా అడగగలదు? విడిపోవాలనుకున్న ప్రాంతం తనకు తానుగానే రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి. అది సంప్రదాయం కూడా. ఇదంతా చూస్తుంటే తెలంగాణ వాళ్లు ఉద్యమం చేసి సీమాంధ్రులకు కొత్తగా ప్రత్యేక రాష్ట్రాన్ని, ప్రత్యేక రాజధానిని ఏర్పాటు చేసి ఇస్తున్నట్లు ఉంది.

    ReplyDelete
  14. బ్లాగు యజమాని ఐన దాక్టరు గారికి మరియు సాటి వ్యాఖ్యాతలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! నా పని మొదలెడుతున్నాను. ప్రతి ప్రశ్నకీ ఒక ప్రయోజనం ఉంటుంది. జవాబు రాబట్టాల్సిన అవసరం ఉంటుంది.పైన నా కామెంటులో కొదవలి గుర్తున్న ప్రతి వాక్యానికీ ఒక లక్ష్యం ఉంది. ఇదే కామెంటుని నే చాలా బ్లాగుల్లో పెట్టాను. నేనెవరి నుంచి జవాబు ఆశించానో వారి నుంచి జవాబు కూడా వొచ్చింది. మరి మీ ప్రశ్నలకి టార్గెట్ యెవరు?

    ReplyDelete
  15. ఇటు ఆంధ్ర వాళ్ళకు రాష్ట్రాన్ని ఎందుకు విడదీయాలో లేదా అటు తెలంగాణా వాళ్ళకు ఎందుకు విడదీయకూడదో చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం జరిగుంటే బాగుండేది. ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం జరగకపోవడమే అన్ని అనర్థాలకు మూలం. అన్ని పార్టీలూ తమ రాజకీయ క్రీడలో ప్రజలను పావులుగా భావించడమే మన ఖర్మ.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.