Tuesday 20 August 2013

జరుగుతున్న కథ



పైనేదో మర్డర్ జరిగినట్లు నెత్తుటి గడ్డలా ఎర్రగా ఉంది ఆకాశం. ఫ్యాక్షనిస్టు సినిమాల్లో విలన్ కొంపలా విశాలంగా ఉందా ఇల్లు. హాలు మధ్యనున్న ఓ పేద్ద సోఫా.. ప్రజల రక్తం తాగే దుర్మార్గపు రాజు కూర్చునే సింహాసనంలా ఉంది. దానిపైనున్న ఆకారం రావు గోపాలరావు లాంటి ఆ ఊరి ప్రెసిడెంటుది.

ప్రెసిడెంటు చుట్ట తాగుతూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఎదురుగా అల్లు రామలింగయ్య లాంటి జోగినాధం వినయంగా వంగిపోతూ నించునున్నాడు. వాతావరణం కడు గంభీరంగా ఉంది.

"జోగినాధం! ఏంటి ఊళ్ళో హడావుడి?" చుట్ట పొగ గుప్పున వదుల్తూ అడిగాడు ప్రెసిడెంటు.

ఇబ్బందిగా కదిలాడు జోగినాధం.

"చిత్తం. ఏదో చిన్నపాటి గొడవే లెండి. ఆ ఈరిగాడి కొడుకుల ఆస్థి తగాదా ఈనాటిదా? యాభయ్యారేళ్ళుగా నలుగుతుంది. తమరు ధర్మప్రభువులు.  ప్రజల కోరికపై ఎంతో ధర్మబద్దంగా ఆస్థి పంపకాలు కావించారు. ఇప్పుడా ఇల్లు తమ్ముడి వైపు పోయిందని అన్న నానా యాగీ చేస్తున్నాడు."

"అదేంటి జోగినాధం? ఈ సమస్య చాల్రోజుల్నించి పెండింగులో ఉందనీ, మనం చెప్పినట్లు నడుచుకుంటామని అన్నది వాళ్ళే కదా?" చిటపటలాడాడు ప్రెసిడెంటు.

"చిత్తం. కూలెదవలు కదండీ? పూటకో మాట మారుస్తారు. రెండ్రోజులు కడుపు కాల్తే వాళ్ళే దారికొస్తారు." భరోసాగా అన్నాడు జోగినాధం.

ఇంతలో హడావుడిగా వచ్చాడు సాక్షి రంగారావు లాంటి పంతులు.

"అయ్యా అయ్యా దొరవారు! ఘోరం జరిగిపోతుంది. రేపు రాబోయే ఎలక్షన్లో లబ్ది పొందడం కోసమే మీరు తప్పుడు తీర్పు చెప్పారని ఆ నాగభూషణం మనుషులు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇట్లా అయితే మనకి ముందుముందు కష్టమే సుమండీ." అంటూ నశ్యం ఎగబీలుస్తూ దీర్ఘం తీశాడు పంతులు.

'నువ్వు నోర్మూసుకో' అన్నట్లు పంతులు వైపు గుడ్లురుమి చూశాడు జోగినాధం. విషయం అర్ధం కాక బుర్ర గోక్కున్నాడు పంతులు.

"నాయాల్ది. ఆ భూషణం గాణ్ని యేసెయ్ మంటారా దొరా?" కర్ర తీసుకుని లేచాడు ఆర్. నాగేశ్వర్రావు లాంటి బాబులు గాడు.

"నువ్వూరుకోవో. ఎప్పుడు ఏది చెయ్యాలో అదే చెయ్యాల. ఇప్పుడు కాదు.. ముందుముందు నీకు చాలా పనుందిలే." అంటూ బాబులు గాణ్ని ముద్దుగా విసుక్కున్నాడు ప్రెసిడెంటు.

ఆపై ఆరిపోయిన చుట్ట వెలిగించుకుంటూ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు ప్రెసిడెంటు.


'అంటే ఊళ్ళో నాగభూషణం నాయకత్వంలో నామీదే ఎగస్పార్టీ తయారవుతుందన్న మాట. విషయం అందాకా వచ్చిందా! ఇప్పుడేం చెయ్యాలి?'

"మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపులు. మీరు వాళ్ళ గూర్చి పట్టించుకోకండి. వాళ్ళ మొహం, వాళ్ళెంతా? వాళ్ళ బతుకులెంతా?" కళ్ళజోడు పైకి లాక్కుంటూ అన్నాడు జోగినాధం .

జోగినాధం వైపు సాలోచనగా చూసాడు ప్రెసిడెంటు.

ఆ విధంగా తీవ్రంగా యోచించిన ప్రెసిడెంటు కొద్దిసేపటికి చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు చూసి భయపడ్డాడు పంతులు. ప్రెసిడెంటు నవ్వులో సంతోషం లేదు. లేడిని చంపబోయ్యే ముందు పులిలో కనిపించే క్రూరత్వం ఉంది. ప్రెసిడెంటు నవ్వులో అమాయకత్వం లేదు. ముక్కుపుడక్కోసం ముక్కుపచ్చలారని చిన్నారిని నలిపెయ్యబొయ్యే కసాయివాడి కఠినత్వం ఉంది.

దొరవారు కొద్దిసేపు వారి నీచదుర్మార్గపు నవ్వు నవ్వి జోగినాధం వైపు సర్దాగా చూశారు.

"జోగినాధం! నీకో పని చెబుతున్నాను. జాగర్తగా విను. కొన్నాళ్ళపాటు నువ్వు నా గడప తొక్కరాదు." అన్నాడు ప్రెసిడెంటు.

తుఫానులో చిక్కుకుపోయిన కుక్కపిల్లలా గజగజలాడిపొయ్యాడు జోగినాధం.

"అయ్యా ఆయ్యా! తమ చల్లని పాదాల నీడన బతుకుతున్నాను. కావాలంటే ఇక్కడే ఇప్పుడే కత్తితో పొడిచేసి చంపెయ్యండి. అంతేగాని నాకంత పెద్ద శిక్ష విధించకండి." బావురుమంటూ దొరగారి కాళ్ళపై పడిపొయ్యాడు జోగినాధం.

ప్రెసిడెంటు మళ్ళీ నవ్వాడు. తన శిష్యుడైన నక్క చూపిస్తున్న వినయానికి మెచ్చిన తోడేలు నవ్వులా ఉందా నవ్వు.

"నీ స్వామి భక్తి నాకు తెలీదా జోగినాధం? అగ్గిపుల్లే కదాని ఆర్పకుండా పడేస్తే అడివంతా అగ్గెట్టేస్తది. రాజకీయాల్లో అన్ని వైపులా కాచుకుని ఉండాలి. జాగర్తగా లేకపోతే రేపా కూలెదవలే కొంప ముంచుతారు. అంచేత నే చెప్పొచ్చేదేంటంటే.. నువ్వూళ్ళోకెళ్ళి ఆ గొడవల్లో దూరు. ఆవేశపడు. అవసరమైతే నన్నో నాలుగు తిట్టు. ఏదోక రకంగా ఆ కూల్జనాల విశ్వాసం సంపాదించు. వారిపై పట్టు సంపాదించి వారికి నాయకుడివైపో, నాగభూషణాన్ని పడగొట్టెయ్."

జోగినాధం మళ్ళీ ప్రెసిడెంటు కాళ్ళ మీద పడ్డాడు.

"ఆహాహా! తమరి బుర్రే బుర్రండి. లక్షల కోట్ల ఆలోచన చెప్పారు."


"అర్ధమైందిగా జోగినాధం? ఈ ఊళ్ళో నాకు ఎగస్పార్టీ ఉండకూడదు. ఉన్నా అది నా మనిషే అయ్యుండాల. అంచేత మన ప్లాన్లో ఎక్కడా తేడా రాకూడదు. ఈ క్షణం నుండి నువ్వూ నేనూ ఎగస్పార్టీ వాళ్ళం. నీకూ నాకు మధ్యన పచ్చ గడ్దేస్తే అది సర్రున మండాలా. ఎప్పటికప్పుడు అక్కడ కూపీలన్నీ పంతుల్తో నాకు చేరెయ్యి." గర్వంగా మీసాలు దువ్వుకుంటూ అన్నాడు ప్రెసిడెంటు.

"చి.. చి.. చిత్తం" వంగివంగి నమస్కారం చేస్తూ నిష్క్రమించాడు జోగినాధం.

పంతులుకి భయం వేసింది. అతనికి భయంకర కీకారణ్యంలో, అంతకన్నా భయంకరమైన క్రూరమృగాల మధ్యన ఉన్నట్లుగా అనిపించింది.

(picture courtesy : Google)

21 comments:

  1. ఒక్క జొగినాధమే కాకుండా సింగినాధం,గురునాధం లు కూడా వున్నారు.రేపు ఓట్ల పండుగ లో ఊరేగే ఈ చిల్లర దేవుళ్ళ నే మేము ఎన్నుకోబోతున్నాము.ఎందుకంటే 'నాధం' లేడు కాబట్టి ఈ ముగ్గురు నాధాల్లొ ఒకరు మా నాధుడై మా కూలిజనాల చెమట ను scotch లా తాగాలి కదా?

    ReplyDelete
    Replies
    1. @srinivas reddy.gopireddy,

      అవును. నేనూ అదే అనుకుంటున్నాను.

      Delete
  2. ఆల్రేడీ ఈ తంతు 2009 ఎలచ్చన్లలో జరిగిపొయిందనుకుంటా... సిరంజీవి జొగినాధం తో మళ్ళీ ఇప్పుడు పాత పాచికే వాడరేమో!!!

    ReplyDelete
    Replies
    1. @Narsimha,

      1972 జైఆంధ్ర ఉద్యమ సమయంలో.. మా ఊళ్ళో కొందరికి పి.వి.నరసింహారావు వేషం వేసి, కొంతసేపు గాడిదపై ఊరేగించి, చెప్పుల్తో కొట్టేవారు ('జైఆంధ్ర'కి పివికి కల సంబంధం ఆరోజుల్లో నాకు తెలీదు). ఎలక్షన్లోనేమో కాంగ్రెస్ ని గెలిపించారు!

      (ఇవన్నీ మనవంటి సామాన్య జనులకి అర్ధం కావు.)

      Delete
  3. డాక్టర్ గారు,

    అంతా బాగానే వుంది కాని
    రియల్ లైఫ్ లో ఈ జోగినాదం కారక్టర్ ఎవరో అర్దం కాలేదు సార్.

    సార్ మీరు ఇక్కడ మరొక విషయం కూడా చెప్పాలి.అదేంటంటే మీరు ఇంతకి జై ఆంధ్రనా, జై సమైక్యాంద్రాన.

    జి రమేష్ బాబు
    గుంటూరు

    ReplyDelete
    Replies
    1. @ramaad-trendz,

      ఈ కథకి రావిశాస్త్రి చెప్పిన గూఢచారి 666 పిట్టకథ అధారం.

      సమైక్యాంధ్ర అంటే నాకు అర్ధం కావట్లేదు. సమైక్యవాదం వినిపించాల్సింది వరంగల్, కరీంనగర్లలో అనుకుంటా.. ఎట్లాగూ సమైక్యమే అంటున్న మనూళ్ళో కాదు. సమైక్యం అంటే 'హైద్రాబాద్ మాది' అని అర్ధం అంటాడు సుబ్బు.

      (సమైక్యం అంటే ఏంటో కూడా తెలీని నన్ను ఎవరోకరి జై చెప్పమంటారు! ఇదన్యాయం.)

      Delete
  4. కాంగ్రెస్సు వారి ఇంకో అలోచన - చిరంజీవి చేత సమైక్యాంధ్ర నినాదంతొ ఇంకొ పార్టీ పెట్టించి ప్రభుత్వ వ్యతిరేక వొట్లు చీల్చటం. ఎంత వరకు నిజమొ తెలియదు. ఇప్పటికె జనాలు గత 9 సంవత్సరాలుగా జరిగిన కుంభకొణాలు అన్నీ మర్చిపొయారు.
    అసలు తె దె పాను పడగొట్టటానికి YSR, TRS ను తెర మీదకి తెచారు.
    7 ఎళ్ళ పాటు కనపడని అవినీతి, హఠాత్తుగ YSR కొడుకు CM పదవి అడిగే సరికి కనపడింది సోనియమ్మకు . మళ్ళీ అదె YSR కొడుకు ఇప్పుడు సమైఖ్యంధ్ర అంటాడు.
    వీటన్నిటికి మించి, నాకు అర్దం కానిదేమిటంటే, ఇంత జరిగినా కాని, జనాలు వీళ్ళకి ఎలా వోట్లు వెస్తారు( ఇందులో నాకు ఈషన్మాంతము అనుమానం లేదు!!!) అసలు జనాలు ఎందుకు ఎవరికి వోటు వెస్తారు??

    ReplyDelete
    Replies
    1. @GK,

      >>అసలు జనాలు ఎందుకు ఎవరికి వోటు వెస్తారు??<<

      ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే.. భుక్తి కోసం మనం చేస్తున్న రోజువారీ కూలి పనులు మానేసి.. ఇంచక్కా మనమే ప్రజాప్రతినిధులం అయిపోవచ్చు. హాయిగా వేల కోట్లు దండుకోవచ్చు.

      మా ఊళ్ళో జనాలు simple thinkers. ఎవరెన్ని చెప్పినా / చేసినా.. YSR పార్టీకి ఒక కులం, TDP కి ఇంకో కులంవారు ఓట్లు వేసేస్తారు. చిరంజీవిని CM చేస్తామని చెబితే, మరొక కులం wholesale గా కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యడానికి ఆత్రంగా ఎదురు చూస్తుంది. అందువల్ల ఈ కులాలవారికి ఎప్పుడూ పెద్ద confusion ఉండదు. ఆలోచించవలసిన అవసరమూ లేదు. కావున మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. వారికి నా అభినందనలు.

      ఇకపోతే 'పాలింపబడేవారు' ఎప్పుడూ వెనుకబడ్డ కులాలు, దళితులు, మైనారిటీలే. అధికారంలోకి రావడానికి వారి ఓట్లే కీలకం. ఆ ఓట్ల కోసం ఎవరు వారిని బాగా నమ్మించగలరో వారికే అధికారం. మీరు చెప్పిన 'జనాలు' వీరే! వీరు ఎలక్షన్ల సమయంలో, అప్పటి పరిస్థితి బట్టి ఒట్లేస్తారు (బొత్తిగా నిలకడ లేని మనుషులు, రావిశాస్త్రి భాషలో చెప్పాలంటే అలగా జనం).

      Delete
    2. ప్రజాస్వామ్యం = ప్రజల (చేత + కొరకు + యొక్క) అన్న ఒకే ఒక్క చెదలు పట్టిన ఫార్ములా, అదీ చదువుకున్న వారికి మాత్రమే, తెలిసిన గొప్ప దేశం మనది. నిజానికి మన విద్యా వ్యవస్థ ఏనాడూ డెమోక్రసీకి సంబంధించిన అవగాహనను అందించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే చైతన్యాన్ని ప్రజలకు అందించలేదు. ఇక అడ్మినిస్ట్రేటివ్, బ్యూరాక్రటిక్, జ్యూడీషియల్ విభాగాలకు సంబంధించిన విషయాలపై అవగాహన గురించి అస్సలు మాట్లాడుకోకపోవడమే మంచిదేమో. Rulers' (Govt's) strength lies in people's ignorance అని ఎక్కడో చదివినట్టు గుర్తు. ఈ 66 ఏళ్లలో ప్రజల్ని అంధకారంలో, అజ్ఞానంలో ఉంచడంలో ప్రభుత్వాలు అద్భుతంగా సక్సెస్ అయ్యాయి. అందుకే అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వాలు, పొలిటీషియన్స్ ఏం చేసినా చెల్లుబాటవుతోంది. అడిగే నాథుడే లేడు. ప్రజల్లో జ్ఞానం అనే ఆయుధం లేదు. దీనికి ప్రజల్ని నిందించలేము. ఈ నేపథ్యంలో ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగలో సాధారణ ప్రజల్లో చాలా తక్కువ శాతం ఓట్లు వేస్తారు, చదువుకున్న వాళ్లు వ్యవస్థ మీద కోపంతోనో, ఇతర కారణాల వల్లో ఓటింగులో పాల్గొనరు. నిజం చెప్పాలంటే, ఓటింగులో మాగ్జిమమ్ 40శాతం కంటే ఎక్కువగా పాల్గొంటారని నేననుకోను. అసలు ప్రజలెవరూ ఓటింగులో పాల్గొనట్లేదని వార్తలు బయటకు ప్రచారమైతే, మొత్తంగా సో కాల్డ్ ప్రజాస్వామ్యానికి, ప్రభుత్వాల ఉనికికే ప్రమాదం కాబట్టి పాలకులు కుట్రపూరితంగా 75 శాతం, 85 శాతం పోలింగ్ జరిగిందనో తప్పుడు లెక్కలు ప్రచారం చేస్తారు. వావ్... గ్రేట్ అని చదువుకున్న వాళ్లందరూ భుజాలెగరేస్తారు. మరో విషయం ఏమంటే, ఇటీవలికాలంలో మరీ ఘోరం... ఎవరైనా ఓట్లు వేద్దామని వెళ్లినా, పోలింగ్ బూత్ దగ్గర వాళ్ల పేర్లే జాబితాలో ఉండవు. అప్పటికే అవన్నీ రిగ్గింగ్ లిస్టులోకి చేరిపోయుంటాయ్. ఒక్కమాటలో చెప్పాలంటే, నేటి కుహనా పార్లమెంటరీ ఓటింగు ప్రక్రియలో... Money, Media & Muscle power (3M) ఈ మూడు ఎవరికి ఎక్కువగా ఉంటే వాళ్లదే అధికారపీఠం. పవర్ లో ఉన్నవాళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్మినిస్ట్రేటివ్ రిగ్గింగుకు పాల్పడుతున్నారన్నది కొత్త ఫైండింగ్. మరో లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే, పాలిటిక్సును ఎలాగూ అత్యంత లాభసాటి బిజినెస్సుగా మార్చేశారు కాబట్టి అడ్డగోలుగా సంపాదించిన బ్లాక్ మనీని ఎన్నికల టైంలో ఓటుకు నోట్లుగా మార్చి విశృంఖలంగా వెదజల్లుతూ ప్రజల్ని కూడా ఈ అనైతిక వ్యవహారంలో భాగస్వాముల్ని చేసి, మీరంతా (కొద్దిమంది కూలీచేసేకునేవారు, పూటగడవని వారు) ఎలాగూ నోట్లకు, సారాకు అమ్ముడుపోయారు కాబట్టి అధికారంలోకి వచ్చింతర్వాత మేమేం చేసినా మీకు అడిగే, ప్రశ్నించే హక్కు లేదనే సరికొత్త డెమోక్రటిక్ ట్రెండును మన నాయకులు తీసుకురాగలిగారు. Thanx to the great political leaders who are running the world's largest democracy!! అలాగే, ఎంతైనా బ్రిటిష్ వాళ్లతో కాళ్లావేళ్లా పడి, బేరసారాలాడి, అన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయి... రాత్రికిరాత్రి చీకట్లో స్వేచ్ఛ సాధించుకున్న జాతి కదా మనది. మన రక్తం నిండా రాజీతత్వం, అణువణువునా, నరనరానా పనికిరాని శాంతిమంత్రం నిండిపోయింది. అందుకే మనం లక్షల కోట్లు అవినీతి జరిగినా స్పందించం. విద్యావైద్య రంగాలను ప్రైవెటైజ్ చేసినా, ప్రభుత్వ ఉద్యోగాల్లేవన్నా నోర్మూసుకు కూచుంటాం. ఒకే నెలలో వందసార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా కిమ్మనకుండా పెట్రోల్ బంకుల దగ్గర క్యూల కోసం మనలో మనమే గొడవపడతాం. మనమంతా గానుగులం, పీనుగులం... అని శ్రీశ్రీ అన్నమాటలు నిజమేనేమో! ఎంతైనా...పోరాడి, ప్రాణాలొడ్డి, రక్తం చిందించి స్వేచ్ఛ సాధించుకున్న జాతికే దాని విలువ, ప్రాధాన్యత తెలుస్తాయి. అవి మనకు ఏ కోశానా లేవు. Thanx to the greatest compromising leadership who brought us freedom !! చివరి వాక్యాలు నిష్ఠూరంగా రాస్తున్నందుకు క్షమించండి. అందుకు దయవుంచి నాపై కోపంగానీ, యుద్ధం గానీ ప్రకటించవద్దని మనవి. తమసోమా జ్యోతిర్గమయా! థాంక్యూ!!

      Delete
    3. నాగరాజ్ గారు,

      నా బ్లాగులో అద్భుతమైన కామెంట్లు రాస్తున్నారు. థాంక్యూ!

      నా పోస్టు కన్నా మీ కామెంటే బాగుంది. in other words, ఇడ్లీ కన్నా చట్నీయే బాగుంది (నండూరి రామ్మోహన్రావు ఇలా అనేవారని ముళ్ళపూడి రమణ రాశాడు).

      Delete
    4. వైద్యులుగారు,
      మీరు చెప్పినట్లు, నాగరాజు గారి కామెంట్లు బాగున్నాయి. కానీ మీ సమాధానం చూస్తె, మీరు కూడ కులాన్ని దాటి చూడట్లెదెమో అనిపిస్తుంది. దళితుల గురుంచొ, మైనారిటీల గురుంచో మాట్లాడితె వాళ్ళకు కుల పిచి లేనట్లు, అదే ఈ కమ్మ, రెడ్డి , కాపు గురుంచో మాట్లాదితేనే కుల పిచి వున్నట్లు కాదేమో.
      ప్రస్తుతం మన కున్న నాయకుల్లొ ఒకళ్ళు కూడ 'మనం అందరం ఒకటి, మనం అందరం భారతీయులం' అని చెప్పిన ల..కొడు.., ల.. ముం.. లేదు. మన పనికి మాలిన ప్రధానిగారు, ఎర్రకొట మీదనుంది, మనల్ని మైనారిటీలు , మెజారిటీలు అని వేరు చెసి మాట్లాడుతారు. మొదట ముస్లింస్ కి పెట్టి తరువాత మనం తినాలంటారు. అదేదొ పేదలనే అనొచు కదా!! ప్రతి వొక్కళ్ళూ కులాన్ని బట్టే చూస్తున్నారు.
      కులం ఇంతలా ఎక్కిన మనకి, ఈ వీడియో చూపించాలి అనిపిస్తుంది.
      http://www.youtube.com/watch?v=ru7tF4YzWPM
      listen from 8:01- for 5 mins if you are in hurry.


      కృష్ణ

      Delete
    5. ఇంకో విషయం , కాంగ్రెస్స్ పార్టీకి , జోగినాధం దొరికినట్లునాడు !!! అదే మన జగన్...
      పరిస్తితిని బట్టి, మన జగన్, ఎన్నికల సమయంలొ బయటకు రావచు !!!

      కృష్ణ

      Delete
    6. రమణ గారు,
      సునిశితమైన వ్యంగ్యం, ఆరోగ్యకరమైన హాస్యం కలగలిపి విభిన్న అంశాలపై అద్భుతమైన అభిప్రాయాలు, విశ్లేషణలు రాస్తూ అందరిలో ఆలోచన రేకెత్తిస్తున్నందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి మేమంతా. ధన్యవాదాలు.

      అన్నట్టు, అసలు ఇడ్లీయే లేకపోతే చట్నీ బోల్డంత బాగుండీ ఏం లాభం, అన్నది బుడుగు లాజిక్కు! ఇక గిరీశమైతే ఏకంగా.... ప్రశంసిస్తే పోయేదేమీ లేదు, ఈర్ష్యాద్వేషాలు తప్ప.. అని సిద్దాంతీకరించేశారు. సో, ఏ రకంగా చూసినా మీరే మార్గదర్శకులు. మీ శుభాసీస్సులకు నమస్సులు. థాంక్యూ :)

      Delete
  5. Sir,

    If you are in the postion to take the decission ( on separate state or united sate), what will be your decission and what do you think which is the best solution for this problem.

    ReplyDelete
    Replies
    1. @sasi kiran n,

      ఒక ప్రజాస్వామ్య దేశంలో.. రాచరిక వ్యవస్థ కూడా సిగ్గు పడేంతగా అధికార భోగాన్ని అనుభవిస్తూ.. లక్షల కోట్లు వెనకేసుకునేవారిని.. కొడుకుల్ని పెద్ద పదవిలో కూర్చోబెడదామనే తాపత్రయంతో ఉన్నవార్ని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు!

      నా అభిప్రాయం.. సమైక్య వాదనలోనే డొల్లతనం ఉంది. హైదరాబాద్ లేని తెలంగాణా ఇచ్చినట్లైతే 'సమైక్య' వాదులకి ఏ అభ్యంతరమూ లేదు! మరి తెలంగాణా జిల్లాలవారు తెలుగువారు కాదా?

      (మీరు నన్ను నా పేరుతో సంబోధిస్తే సంతోషం.)

      Delete
    2. As a Hyderabadi of non Telugu origin , I can say, the culture of Hyderabad is different from both Andhra culture and Telangana culture. But a bit more close to telangana culture.The culture of nizams has it's own flavor, color and taste. My personal opinion is, both Telangana and Samaikya movements are hollow. They are both "grab Hyderabad" movements.

      Delete
    3. @bandi,

      the present political scenario of Andhra reminds me an old hollywood classic 'it's a mad, mad, mad, mad world'.

      Delete
  6. inni rojulu mee blog ela miss ayyana anipinchindhi...anyway...better late than never...

    started reading all your blogs and enjoying...Great keep going...

    I enjoyed another humorous blog ..http://thotaramudu.blogspot.in/

    ReplyDelete
    Replies
    1. @kotiravi,

      thanks for the compliment.

      (i'll try to read the blog you mentioned.)

      Delete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. నాగరాజ్ గారూ,
    మీ విశ్లేషణ చాలా బాగుంది.ఆవేశం కూదా మెచ్చదగిందే!కాని కులాన్ని యెవరు పెంచి పోషిస్తున్నారో తెలుసా?కొద్దికాలం క్రితం వరకూ నేను నిరక్షరాస్యత వల్ల ఇలా కులం కార్డు యెన్నికల్ని ప్రభావితం చేస్తుందని అనుకునే వాణ్ణి.కానీ ఈ మధ్యనే బల్బు వెలిగింది.(నా తలివి బల్బు వెలగటంలో కొంచెం లేటు:-)). ఇవ్వాళ చదువు రాని వాళ్ళంతా రోడ్డు కూలీలుగానో మరో రకం కూలీలుగానో ఉంటున్నారు. కొంచెం చదువుకున్న వాళ్ళు మిల్లుల్ల్లో కార్మికులు అని పిలిచే విధంగా సెటిల్ అవుతున్నారు. వీళ్ళందరూ యెవరైనా తమకు యే చిన్నా సాయం చేసినా దేముడికి మల్లే కొలిచే కులం చూదని అమాయకులు. వీళ్ళ రోజు వారీ పనుల్లో గానీ మొత్తం జీవితాల్లో గానీ కులం తో అవసరమే లేదు, పెళ్ళీళ్ళ్ల లో తప్ప.
    అసలు కీలకమంతా గొప్ప వాళ్ళమని యెక్కువగా భ్రమసే చదువుకున్న వాళ్లలోనే ఉంది. ఒకే ఉద్యొగానికి వేలమంది పోటీ పదే చోట (శ్రీ శ్రీ చెప్పినట్టు)రిఫరీని తార్చి గెలవాలనుకునే సందర్భం లోనే కులం కార్డు మరియు మతం కార్డ్ అవసరమవుతాయి.నువ్వూ నేనూ ఒకటి, వాడు వేరే - కాబట్టి నా దగ్గిర సరుకు లేకపోయినా నాకే మార్కులు యెక్కువ వెయ్యి అనే విధంగా రెఫరీని తార్చడానికి యే మాత్రమూ సిగ్గు పడకుందా వాడుకుంటున్నారు.యెన్నికల సమయం లో పత్రికల్లో ఆయా నియోజక వర్గాల్లో కులాల వారీ జనభా లెక్కలూ, అభ్యర్ధి కులమూ చెప్పి విజయావకాశాల్ని అంచనాలు వేస్తున్నారు. అవి నిజమూ అవుతున్నాయి. కాని ఆ డాటా లో మిస్ అవుతున్నది. ఆయా కులాల్లో విద్యాధికుల శాతమెంత అనేది. ఆ దాటా ని మనం పట్టుకోగలిగితే నా పాయింటు - కులం కార్డులూ మతం కార్డులూ చదుకున్న వాళ్ళ వల్లనె పని చెస్తున్నాయనే దానికి రుజువు దొరుకుతుంది.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.