Wednesday 13 July 2016

మిస్టర్ గోస్వామి! ద నేషన్ లాఫ్స్ ఎట్ యు!!


"ప్రధాన మంత్రిని అర్నబ్ గోస్వామి చేసిన ఇంటర్‌వ్యూ చూశావా?" అడిగాడు నా స్నేహితుడు.

"చూళ్ళేదు." అన్నాను.

"అదృష్టవంతుడివి. నాకా ఇంటర్‌వ్యూ ఉప్మా లేని పెసరట్టులా చప్పగా అనిపించింది. అర్నబ్ గోస్వామికి బుద్ధిమంతుడి వేషం నప్పలేదు. థాంక్స్ టు మోడీ, అర్నబ్ నోర్మూసుకుంటే యెలా వుంటాడో మొదటిసారి చూశాను." అంటూ నవ్వాడు నా స్నేహితుడు.

గత కొన్నేళ్లుగా టీవీ మీడియంలో అర్నబ్ గోస్వామి పేరు మోగిపోతుంది. మోడెస్టీ కోసం తానో జర్నలిస్టునని చెప్పుకుంటాడు కానీ, అర్నబ్ జర్నలిస్టు స్థాయి ఎప్పుడో దాటిపొయ్యాడు! అతను ఒక షోమేన్, ఒక పెర్ఫామర్! సినిమా నటులు పాత్రోచితంగా అనేక రసాలు పండిస్తారు. అర్నబ్ 'చర్చో'చితంగా కోపావేశాల్ని పండిస్తాడు. సినిమావాళ్ళది బాక్సాఫీస్ దృష్టైతే, అర్నబ్‌ది టీఆర్పీ దృష్టి!

అర్నబ్ గోస్వామి పాపులారిటీకి కారణం యేమిటి? యే దేశంలోనైనా సుఖమయ జీవనం సాగిస్తూ కులాసాగా ఆలోచించే వర్గం ఒకటి వుంటుంది. వీళ్లు రాజకీయంగా కలర్ బ్లైండెడ్‌. అంటే - ప్రతి సమస్యనీ బ్లాక్ వైట్‌లోనే ఆలోచిస్తారు, అధికారిక (ప్రభుత్వ) వెర్షన్‌ని సమర్ధించేందుకు రెడీగా వుంటారు, ప్రభుత్వ అభివృద్ధి నమూనాల పట్ల విశ్వాసం కలిగుంటారు (తమకీ ఓ రవ్వంత వాటా దొరక్కపోదా అన్న ఆశ కూడా వుంటుందనుకోండి). వీరిలో ఎక్కువమంది వేతనశర్మలు (చూడుము - రావిశాస్త్రి 'వేతనశర్మ కథ').

ఈ అర్నబ్ గోస్వామి వీక్షక వర్గం సోషల్ మీడియాని ప్రతిభావంతంగా వాడుతుంది. ఆపరేషన్ గ్రీన్ హంట్ గూర్చి కేంద్ర హోమ్ శాఖ చెప్పింది కరెక్ట్. వ్యతిరేకించావా? - నువ్వు 'మావోయిస్టు టెర్రరిస్టువి'.  కల్బుర్గి హంతకుల కోసం ప్రభుత్వం ఇంకా వెదుకుతూనే వుంది. ప్రశ్నించావా? - నువ్వు 'సూడో సెక్యులరిస్టువి'. రోహిత్ వేముల ఆత్మహత్య కేంద్రాన్ని కలచివేసింది! సందేహించావా? - నువ్వు 'దేశద్రోహివి'.

ఈ వర్గంవారి అభిప్రాయాల పట్ల ఎవరూ ఆశ్చర్యపడనక్కర్లేదు. ఆసక్తికర అంశం యేమంటే - 'రాజకీయాలు చెత్త, అవి మాట్లాడ్డం టైమ్ వేస్ట్' అన్న లైన్ తీసుకున్న 'న్యూట్రల్' వ్యక్తులు కొన్నాళ్లుగా ఘాటైన రాజకీయ అభిప్రాయాలు వెలిబుచ్చడం! అవి అచ్చు అర్నబ్ గోస్వామి అభిప్రాయాలే! ప్రతి అంశాన్నీ సింప్లిఫై చేసి బ్లాక్ ఎండ్ వైట్‌లో ప్రెజెంట్ చేసే అర్నబ్ గోస్వామి స్టైల్ వీళ్ళకి బాగా నచ్చింది.

మర్నాడు న్యూస్‌పేపర్లలో పదోపేజీలో కూడా రిపోర్ట్ కాని అంశాన్ని కొంపలు మునిగిపొయ్యే సమస్యలా చిత్రించ గలగడం అర్నబ్ గోస్వామి ప్రతిభ. అతని డిబేట్లు WWE కుస్తీ పోటీల్లా స్క్రిప్టెడ్ కేకలు, అరుపుల్తో గందరగోళంగా వుంటాయి. చూసేవాళ్ళకి 'ఈ వీధిపోరాటంలో ఎవరు గెలుస్తారు' లాంటి ఆసక్తి కలుగుతుంది. ఇట్లాంటి చౌకబారు ఆసక్తిని రేకెత్తించి వ్యూయర్‌షిప్ పెంచుకోవటమే టైమ్స్ నౌ చానెల్ వారి ఎజెండా. ప్రతిభావంతులైన నటుల్ని అభినందించినట్లుగానే అర్నబ్ గోస్వామిని కూడా అభినందిద్దాం.

టీవీల్లో వార్తల్ని విశ్లేషించే చర్చా కార్యక్రమాలకి కొంత ప్రాముఖ్యత వుంటుంది. వీక్షకులకి ఎదుటివారి వాదన యేమిటనేది తెలుసుకోడానికీ, తమకంటూ ఒక అభిప్రాయం ఏర్పరుచుకోడానికి ఈ చర్చలు ఉపయోగకరంగా వుంటాయి. కానీ - అర్నబ్ గోస్వామి స్టూడియోలో కూర్చుని ప్రతి సబ్జక్టు పైనా ముందుగానే ఒక ఖచ్చితమైన అభిప్రాయం యేర్పరచుకుని వుంటాడు. ఆ అభిప్రాయంలో తీవ్రమైన దేశభక్తీ, భీభత్సమైన ధర్మాగ్రహం వుంటాయి. ఈ కారణాన - తన అభిప్రాయాన్ని వొప్పుకోనివారికి తిట్లు తినే సదుపాయం తప్ప, మాట్లాడే హక్కుండదు. ఈ సంగతి తెలుసుకోకుండా అర్నబ్ షోలో పాల్గొన్న JNU విద్యార్ధులకి యేమైందో మనకి తెలుసు.

"టీఆర్పీ రేటింగ్ కోసం చర్చా కార్యక్రమాన్ని వినోద స్థాయికి దించడం దుర్మార్గం." ఒక సందర్భంలో నా స్నేహితుడితో అన్నాను.

"నీకు మర్యాదస్తుల న్యూస్ డిబేట్ కావాలంటే బిబిసి చూసుకో! మజా కావాలంటే అర్నబ్‌ని చూడు. అది సరేగానీ, అర్నబ్ డిబేట్లలో స్క్రీన్ మీద మంటలు మండుతుంటాయి. ఎందుకో తెలుసా?" అడిగాడు నా స్నేహితుడు.

"తెలీదు." ఒప్పేసుకున్నాను.

"అరుంధతి రాయ్, తీస్తా సెటిల్వాడ్ లాంటి దేశద్రోహుల్ని అందులో పడేసి రోస్ట్ చేసెయ్యడానికి." కసిగా అన్నాడతను.

ఈ విధంగా ప్రజలు ప్రశాంతంగా టీవీ చూసేస్తూ చాలా విషయాల పట్ల చక్కటి అవగాహన యేర్పరచుకుంటున్నారు! 'ముఖ్యమైన' సమాచారం ప్రజలకి చేరే విషయంలో ప్రభుత్వాలు అప్రమత్తంగా వుంటాయి. తమకి ఇబ్బందిగా ఉండే విషయాల్లో (రాజకీయాలకి బయటనున్న ప్రజల) ఒపీనియన్ మేకింగ్ అన్నది అధికారంలో వున్నవాళ్ళకి చాలా అవసరం. ఈ వ్యవహారం సాఫీగా సాగడానికి అనేకమంది స్టేక్‌హోల్డర్స్‌ పాటుపడుతుంటారు (చూడుము - Noam Chomsky 'Media Control').

ఇంతటితో నేను చెబ్దామనుకున్న విషయం అయిపోయింది. అయితే - చెప్పుల షాపులో పన్జేసే వ్యక్తి దృష్టి తనకి తెలీకుండానే ఎదుటివారి చెప్పుల వైపు పోతుంది. దీన్ని occupational weakness అనుకోవచ్చు. వృత్తిరీత్యా నేను సైకియాట్రిస్టుని కాబట్టి చాలా అంశాల్లో సైకలాజికల్ యాస్పెక్ట్స్ కూడా ఆలోచిస్తాను. అంచేత కొద్దిసేపు - సైకాలజీ బిహైండ్ అర్నబ్ గోస్వామి సక్సెస్.

ఒక వ్యక్తి 'చర్చా కార్యక్రమం' అంటూ గెస్టుల్ని పిలిచి మరీ చెడామడా తిట్టేస్తుంటే, చూసేవారికి ఎందుకంత ఆనందం? సైకాలజీలో Frustration-Aggression అని ఒక థియరీ వుంది. సగటు మనిషికి దైనందిన జీవితంలో నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, చిరాకు.. ఇవన్నీ frustration కలిగిస్తాయి. ఈ frustration ఒక స్టీమ్ ఇంజన్ లాంటిదని సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటాడు. ఇంజన్ స్టీమ్ వదలాలి, లేకపోతే పేలిపోతుంది. అంచేత frustration అనేది తప్పనిసరిగా aggression కి దారితీస్తుంది. సగటు మనిషిలో వున్న ఈ aggression కి అర్నబ్ గోస్వామి కార్యక్రమం ఒక విండోగా ఉపయోగపడుతుంది. అందుకే చూసేవారిలో అంత ఆనందం!

అన్ని వృత్తుల్లాగే - జర్నలిస్టులకీ వృత్తి ధర్మం వుంటుంది. వాళ్ళు అధికారంలో వున్నవాళ్ళని ప్రజల తరఫున ప్రశ్నలడిగి, సమాధానాలు రాబట్టాలి. మరప్పుడు అర్నబ్ గోస్వామి - "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్! విదేశాల నుండి నల్లడబ్బు తెచ్చే విషయం ఎందాకా వచ్చింది? NSG కి చైనా అడ్డుపడకుండా ఎందుకు ఆపలేకపొయ్యారు? అదానీ వ్యాపారానికి అన్నేసి రాయితీలు ఎందుకిస్తున్నారు?" అని అడగాలి. అతనికి ప్రధాన మంత్రి ఆఫీసు నుండి ఫలానా ప్రశ్నల్ని అడక్కూడదనే ఆదేశాలు వొచ్చి వుండొచ్చు. అయితే చండప్రచండులైన గోస్వాములువారు ప్రధాన మంత్రి ఆఫీసు ఆదేశబద్దులై వుంటారా? వుండకూడదు కదా! స్టూడియోలో కూర్చుని కేకలేస్తూ గెస్టుల్ని తిట్టేసే అర్నబ్ గోస్వామి, ప్రధానమంత్రి దగ్గర వినయపూర్వకంగా ఎందుకు వొదిగిపొయ్యాడు?

సోషల్ సైకాలజీలో Obedience to Authority అని ఒక థియరీ వుంది. ఇది 'పైనుండి' వచ్చే అదేశాల్ని తుచ తప్పకుండా పాటించేవారి మనస్తత్వాన్ని చర్చిస్తుంది. లక్షలమంది యూదుల్ని హిట్లర్ వొక్కడే చంపలేదు, చంపలేడు. అతనికి తన ఆదేశాల్ని గుడ్డిగా అమలు చేసిన నాజీ అధికారులు తోడయ్యారు. మన సివిల్ పోలీసులు పై ఆధికారుల ఆదేశాలని పాటిస్తూ నిరసన చేస్తున్న వికలాంగులు, వృద్ధులు, స్త్రీలని చావ చితక్కొడతారు. ఈ పోలీసులే పోలీసు అధికారుల ఇళ్లల్లో ఆర్దర్లీలుగా మగ్గిపోతుంటారు (చూడుము - పతంజలి 'ఖాకీవనం', స్పార్టకస్ 'ఖాకీబ్రతుకులు').

అర్నబ్ గోస్వామి టీఆర్పీ కోసం aggression చూపిస్తాడు, తన కెరీర్ కోసం Obedience to Authority కూడా చూపిస్తాడు. స్టూడియోలో కూర్చుని చిన్నాచితకా నాయకుల్ని మందలిస్తూ, దేశభక్తిపై లెక్చర్లిచ్చే అర్నబ్ గోస్వామి బ్రతక నేర్చినవాడు. అందుకే ఎక్కడ ఎలా వుండాలో అర్ధం చేసుకుని సెలబ్రిటీ జర్నలిస్టయ్యాడు. ఇతగాడి విజయ యాత్ర యెందాకా సాగుతుందో తెలీదు గానీ, అది ఎంత తొందరగా ముగిసిపోతే దేశానికీ, ప్రజలకీ అంత మంచిదని నమ్ముతూ -

"మిస్టర్ గోస్వామి! ఐ హేవ్ ద ఇన్‌ఫర్మేషన్ విత్ మి! ద నేషన్ లాఫ్స్ ఎట్ యు!!"

(published in సారంగ web magazine on 7 - 7 - 2016)

Saturday 2 July 2016

పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!


మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే పాలకులు. ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగినవారెవరైనా సరే - ఎన్నికల్లో పోటీ చెయ్యొచ్చు, గెలవచ్చు. ప్రజలకి పజ్జెనిమిదేళ్ళు నిండగాన్లే ఓటుహక్కు వస్తుంది, ఈ హక్కుతో వారు ప్రజాప్రతినిథుల్ని ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైనవారు ప్రభుత్వాల్ని యేర్పాటు చేస్తారు. ఇంత పారదర్శకమైన ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఇంకోటి వున్నట్లు నాకైతే తెలీదు.

మన్దేశంలో రాజ్యం అనుక్షణం ప్రజల సంక్షేమం గూర్చే తపన పడుతుంటుంది. అందువల్ల ప్రజలు తమగూర్చి తాము ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం యేది తినాలో, యేది తినకూడదో పాలకులే నిర్ణయిస్తారు. ఇది కేవలం ప్రజారోగ్య పరిరక్షణ కోసం మాత్రమేనని మీరు అర్ధం చేసుకోవాలి. ఓటేసే హక్కుంది కదాని యేదిబడితే అదితింటే ఆరోగ్యం పాడైపోతుంది. పాలకులకి ప్రజలు బిడ్డల్లాంటివారు. మనం మన పిల్లల మంచికోసం జాగ్రత్తలు తీసుకోమా? ఇదీ అంతే!

ఇక సినిమాల సంగతికొద్దాం. ఈ దేశంలో సామాన్యుల వినోద సాధనం సినిమా. తినేతిండి విషయంలోనే సరైన అవగాహన లేని ప్రజలకి యేం చూడాలో యేం చూడకూడదో మాత్రం యెలా తెలుస్తుంది? తెలీదు. అందుకే ప్రజలకి మంచి సినిమాలు మాత్రమే చూపించేందుకు పాలకులు 'సెన్సార్ బోర్డ్' అని ఒక సంస్థ నెలకొల్పారు. ఇందుగ్గాను మనం ప్రభుత్వాలకి థాంక్స్ చెప్పాలి.

'సినిమా చూసే విషయంలో ఒకళ్ళు మనకి చెప్పేదేంటి?' అని ఈమధ్య కొందరు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు అనార్కిస్టులు. రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పాటిస్తాం? మన మంచి కోసమేగా? ఇదీ అంతే! ఆ తెలుగు సినిమావాళ్ళని చూడండి.. బుద్ధిగా రూల్స్ పాటిస్తూ పాటలు, ఫైట్సు, పంచ్ డైలాగుల్తో మాత్రమే సినిమా తీసేస్తారు. ఒక్క తెలుగు సినిమానైనా సెన్సారువాళ్ళు అభ్యంతర పెట్టారా? లేదు కదా! అంటే ట్రాఫిక్ రూల్సు పాటించనివారి వాహనం సీజ్ చేసినట్లే.. సమాజం, సమస్యలు అంటూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే సినిమాల్ని మాత్రమే సెన్సారువాళ్ళు ఆపేస్తున్నారు.

అసలు సెన్సార్ బోర్డ్ అంటే యేంటి? అమాయకులైన ప్రజలు యేదిపడితే అది చూసి చెడిపోకుండా వుండేందుకు ప్రభుత్వంవారిచే నియమింపబడ్డ సంస్థ అని ఇందాకే చెప్పుకున్నాం. సెన్సారు బోర్డులో దేశం పట్ల, దాని బాగోగుల పట్లా అవగాహన కలిగినవారు మాత్రమే సభ్యులుగా వుంటారు. వారు మిక్కిలి నీతిపరులు, జ్ఞానులు, మేధావులు. కనుకనే రాముడి కోసం శబరి ఫలాల్ని ఎంగిలి చేసినట్లు, అన్ని సినిమాల్ని ముందుగా చూస్తారు. ఆపై మనం యేది చూడొచ్చో, యేది చూడకూడదో వడపోస్తారు (దుఃఖంతో గొంతు పూడుకుపోయింది, కొద్దిసేపు ఆగుతాను).

ఈ విధంగా దేశసేవలో పునీతమవుతూ ప్రశాంతంగా వున్న సెన్సార్ బోర్డుకి అనురాగ్ కాశ్యప్ అనే తుంటరివాడు తగిలాడు. ఆ అబ్బాయి వర్తమాన సాంఘిక సమస్యల ఆధారంగా వాస్తవిక సినిమాలు తీస్తాట్ట. దేశమన్నాక సమస్యలుండవా? వుంటాయి, వుంటే యేంటి? అవన్నీ చూపించేస్తావా? ఒకప్పుడు సత్యజిత్ రే అని ఓ దర్శకుడు వుండేవాడు, ఆయనా అంతే! భారద్దేశం పేదరికాన్ని ప్రపంచానికంతా టముకు వేసి మరీ చూపించాడు. ఆయనకి ఎవార్డులొచ్చాయి, మన్దేశానికి మాత్రం పరువు పోయింది! సమస్యలు ఎవరికి మాత్రం లేవు? మాంసం తింటామని బొమికలు మెళ్ళో వేసుకుని తిరుగుతామా!

ఆ అనురాగ్ కాశ్యపో, హిరణ్యకశ్యపో.. ఆ కుర్రాడి సినిమాకి సెన్సార్ బోర్డు బోల్డెన్ని కట్స్ చెప్పిందట, సినిమా పేరులో 'పంజాబ్' తీసెయ్యమందిట. ఇందులో అన్యాయం యేమిటో మనకి అర్ధం కాదు - సెన్సారు బోర్డు వుంది అందుకేగా! పైగా ఆ కుర్రాడు ఒక ఇంటర్వూలో - "పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం వల్ల యువత చాలా నష్టపోతుంది. ఒక సమస్యని గుర్తించడంలో సమస్యేంటి?" అని ప్రశ్నించాడు. అంటే ఒక సమస్య వుంటే, దానిమీద యెడాపెడా సినిమాలు తీసేస్తావా? దేశం పరువు బజార్న పడేస్తావా? ఇప్పుడు నీలాంటివాళ్ళ ఆటలు సాగవ్, ప్రజల కోసం నిరంతరం శ్రమించే ప్రభుత్వం వచ్చేసింది.

మా పక్కింటాయనకి ముంజేతి మీద యేదో మచ్చ వుంది, ఆయన దాన్ని ఫుల్ హాండ్స్ చొక్కా వేసుకుని కవర్ చేసుకుంటాడు. మా ఎదురింటాయన తెల్లజుట్టుకి రంగేసుకుంటాడు! వాళ్ళ అందానికొచ్చిన ఇబ్బందుల్లాంటివే దేశానికీ వుంటాయి. నీ సినిమాలు యే సౌదీ అరేబియాలోనో తీసిచూడు, దూల తీరిపోతుంది. ఎంతైనా - మన్దేశంలో ఫ్రీడమాఫ్ ఎక్స్‌ప్రెషన్ మరీ ఎక్కువైపోయింది, అందుకే దేశాన్ని విమర్శించడం ఈమధ్య ప్రతివాడికి ఓ ఫేషనైపోయింది.

సెన్సార్ బోర్డుని విమర్శించేవాళ్ళు విదేశీ ఏజంట్లు. పవిత్రమైన సెన్సారు వ్యవస్థని కాపాడుకోకపోతే మన దేశభవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. హీనమైన పాశ్చాచ్య సంస్కృతిని వొంటబట్టించుకున్న కుహనా మేధావులు మన్దేశంలో చాలా సమస్యలున్నట్లు చూపించేస్తారు, అతంతా నిజమని అమాయక ప్రజలు నమ్మేస్తారు. చివరాకరికి ప్రజల వల్ల ఎన్నుకోబడి, ప్రజల బాగుకోసం నిరంతరం శ్రమిస్తున్న పాలక వర్గాలపైన నమ్మకం కోల్పోతారు. ఇలా జరగకుండా దేశభక్తులమైన మనం ప్రతిఘటించాలి.

భారత సెన్సార్ బోర్డుకి ప్రస్తుత హెడ్ శ్రీమాన్ పెహ్లాజ్ నిహలానిగారు. ఆయన భారతీయ సంస్కృతి పరిరక్షణకి కంకణం కట్టుకున్న వ్యక్తి, గొప్ప దేశభక్తుడు. సినిమా సెన్సార్ విషయాల్లో చంఢశాసనముండావాడు. అందుకే కాశ్యప్‌గాడికి జెల్ల కొట్టాడు. ఆ మేరకు ఒక సందేశం ఆల్రెడీ ఈ సోకాల్డ్ రియలిస్టిక్ సినిమాగాళ్ళకి చేరిపోయింది, ఇక ఇట్లాంటి జాతివ్యతిరేక సినిమాలు తియ్యాలంటే వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అసలు వీళ్ళెందుకు పాజిటివ్ సినిమాలు తియ్యరు? చాయ్ అమ్మిన ఒక మహానుభావుడు ప్రధాని అయ్యాడు. ఈ ఆలోచనే గొప్ప ఉత్తేజాన్నిస్తుంది! ఇట్లాంటి గొప్ప కథాంశంతో యే వెధవా సినిమా తియ్యడు, ఇది మన దురదృష్టం. 

సెన్సార్ బోర్డుని విమర్శించేవాళ్ళు దేశద్రోహులని కూడా నా అనుమానం. సెన్సారే లేకపోతే విపరీతంగా బూతు సినిమాలు వచ్చేస్తాయి, యువకులంతా రేపిస్టులుగా మారిపోతారు. ఆడవాళ్ళల్లో పతిభక్తి తగిపోతుంది, బరితెగించిపోతారు. సీతామహాసాధ్వి జన్మించిన ఈ పుణ్యభూమి విచ్చలవిడి భూమిగా మారిపోతుంది.

ఇంకో ముఖ్య విషయం - సెన్సార్ బోర్డు వల్లనే సాంఘిక సమతుల్యత రక్షించబడుతూ వస్తుంది. అదే లేకపోతే - దళితుల సమస్యని హైలైట్ చేస్తూ కారంచేడు, చుండూరు మారణకాండల మీద సినిమాలొస్తాయి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న సహజ సంపదల లూటీకి అడ్డుగా వున్న ఆదివాసీల దారుణ అణచివేతపై సినిమాలొస్తయ్. ఇవన్నీ ప్రజలకి తెలిసిపోతే దేశానికి ఎంత ప్రమాదమో మీరే ఆలోచించండి.

సినిమాల్ని నలిపేసే భారత సినిమాటోగ్రాఫ్ చట్టం (1952) యెంతో పవిత్రమైనది. సెడిషన్ యాక్ట్ (1870) లాగే సినిమాటోగ్రాఫ్ చట్టం కూడా నిత్యనూతనమైనది! ఈ పురాతన చట్టాల్ని మార్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు, వీరిని పట్టించుకోరాదని ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాను. మన కంట్లో మనమే ఎలా పొడుచుకుంటాం!

పోలీసులంటే దొంగలకి పడదు. కానీ - పోలీసులు చెడ్డవాళ్ళు కాదు, సమాజ రక్షకులు. సెన్సార్ బోర్డూ అంతే! అంచేత - తనకి అప్పజెప్పిన బాధ్యతల్ని అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తున్న పూజ్య పెహ్లాజ్ నిహలానిగారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్! గో ఎహెడ్, వుయార్ విత్ యు సర్! 

చివరి మాట -

ఈ రచనకి స్పూర్తి - "పేదలెవ్వరూ ఇది చదువరాదు. చదివినచో వారు శిక్షలకు పాత్రులగుదురు" అని డిక్లేర్ చేసి 'గోవులొస్తున్నాయి జాగ్రత్త!' కథ చెప్పిన కిరీటిరావు. 

(ప్రచురణ - సారంగ 16 June 2016)

Tuesday 21 June 2016

యోగాసనాలు


"యోగాసనాల వల్ల ఉపయోగం వుందా?" పేషంట్లు తరచుగా అడిగే ప్రశ్న ఇది. 

"చేస్తే చెయ్యండి. చేసినందువల్ల నష్టం లేదు." ఇది నా స్టాండర్డ్ సమాధానం. 

నేనెప్పుడూ ఆసనాలు వెయ్యలేదు. అప్పుడెప్పుడో టీవీలో ఒకసారి చూశాను. ఒక వృద్ధుడు వివిధభంగిమల్లో కాళ్ళూ చేతులూ మడత పెడుతూ, ఘాట్టిగా గాలిపీల్చి వదుల్తున్నాడు. ఆయన అలా చేయడాన్ని ఆసనాలు అన్నాడు గానీ, అవి కేవలం స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు మాత్రమే!

బరువు తగ్గాలంటే రోజువారీగా కేలరీలని ఖర్చు పెట్టాలి. కొంత డైటింగ్ ద్వారా, ఇంకొంత వ్యాయామం ద్వారా కేలరీల్ని మైనస్ చెయ్యొచ్చు. నడవడం, పరిగెత్తడం, టెన్నిస్, స్విమ్మింగ్ మొదలగు ఏరోబిక్ ఎక్సర్సైజుల ద్వారా కేలరీల్ని ఖర్చు చెయ్యొచ్చు.

యోగాసనాలు చేస్తే ఎక్కువరోజులు బ్రతుకుతారా? ఇందుకు ఋజువుల్లేవు, చాలామంది యోగా గురువులే రోగగ్రస్తులై వున్నారు. ముప్పైయేళ్ళగా క్రమం తప్పకుండా యోగాసనాల్ని వేస్తున్న మా మేనమామ, ఆసనాల వల్ల తన మనస్సు ప్రశాంతంగా ఉందంటాడు. ఏనాడూ ఆసనం వెయ్యని నా మనసు కూడా ప్రశాంతంగానే ఉంటుంది!
       
మనది పేదదేశం. అత్యధికులకి తింటానికి తిండి లేదు. పోషకాహార లోపాల్తో మన పిల్లలు ఆఫ్రికా దేశస్తులతో పోటీ పడుతుంటారు. మెజారిటీ ప్రజలు పొలం పనులు చేసుకుంటారు. పన్లేనప్పుడు బీడీలో, చుట్టలో కాల్చుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్ళకి ఆసనాలు అనవసరం.

డబ్బున్నవాడు ట్రాక్ సూట్ వేసుకుని రోజూ జిమ్ముతుంటాడు, ఏరోబిక్సంటూ ఎగురుతుంటాడు. కొందరు తెలివైనవాళ్ళు డబ్బు ఖర్చు కాకుండా వ్యాయామం చేసే ఆలోచన చేస్తారు. దాని ఫలితమే ఉచిత యోగాసనాల క్యాంపులు. ఈ యోగా క్యాంపుల్లో ఎంట్రీ ఫీజు ఒక్కరూపాయి పెట్టినా ఎవరూ వెళ్ళరని మా సుబ్బు చెబుతుంటాడు. 

యోగాసనాలు శరీరానికి చాలా మంచిది అని శాస్త్రబద్దంగా స్టడీ చేశారని కొందరు వాదిస్తారు. అవును, ఆసనాల గూర్చి కొన్ని స్టడీస్ వున్నాయి. నాకయితే అవి 'చేసినట్లు'గా అనిపించలేదు. 'రాసినట్లు'గా తోస్తుంది.  ఇక సైకాలజీ విషయానికొస్తే జాకబ్సన్ అనే ఆయన PMR (progressive muscle relaxation) అనే టెక్నిక్ చెప్పి ఉన్నాడు. కానీ ఆ టెక్నిక్కీ, మన ఆసనాలకీ సంబంధం లేదు. 

ఆసనాలని తెల్లతోలు దేశాలవాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారనీ, ఇదొక అంతర్జాతీయ గుర్తింపనీ చంకలు కొట్టుకోనక్కర్లేదు. అజ్ఞానం అంతర్జాతీయం, కానీ మనకి మాత్రం తెల్లతోలు జ్ఞానానికి చిహ్నం! ఈ సంగతి గ్రహించిన ఆధ్యాత్మిక వ్యాపారంగాళ్ళు తెల్లతోలుగాళ్ళని భక్తులుగా ముందు వరసలో కూర్చోబెట్టి సొమ్ము చేసుకుంటున్నారు.

నన్ను నా పేషంట్లు అడిగేది 'వైద్యుడి'గా నా అభిప్రాయం మాత్రమే. నా సమాధానం కూడా వైద్యుడిగానే వుండాలి గానీ, నాకు నమ్మకం లేని ఆసనాల గూర్చి సలహా ఎలా ఇవ్వాలి? ఏం ఇవ్వాలి? మన్దేశంలో డాక్టర్లకి 'తెలీదు' అని చెప్పే సదుపాయం లేదు. 

"డోంట్ వర్రీ, వాళ్ళలా అడిగేది మన సమాధానం వినాలనే కుతూహలంతోనే. మందులతో సరైన రెస్పాన్స్ రాకపోతే, ఆ నెపం ఆసనాల మీదకి నెట్టేసే సౌలభ్యం కూడా మనకి వస్తుంది. కాబట్టి ఆసనాలు వేసుకొమ్మని చెబితేనే మనకి సేఫ్." అని నా వైద్యమిత్రులు అంటుంటారు. నిజమే! 

"ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో యోగాసనాలు వెయ్యకపోతే వచ్చే ప్రమాదం కన్నా యోగాసనాల గూర్చి సందేహం వ్యక్తం చెయ్యడం వల్ల వచ్చే ప్రమాదమే ఎక్కువ." అంటాడు సుబ్బు. ఇదీ నిజమే!

(this is an edited and revised version of an earlier post.)

(picture courtesy : Google)

Wednesday 1 June 2016

అవినీతిని అంతం చేసేద్దాం!


'ఈ సమాజానికి పట్టిన చీడ అవినీతి, ఇది అంతరించిపోవాలి.' సినిమా డైలాగులాంటి ఈ స్లోగన్ ఎంతందంగా వుంది! నా చిన్నప్పట్నుండీ గొంతు పగలేసుకుంటూ ఈ స్లోగన్ని అరిచేవాళ్ళు అరుస్తూనే వున్నారు. అవినీతి మాత్రం కులాసాగా, హాయిగా తన మానాన తను పెరిగిపోతూనే వుంది. అంచేత ముందుగా ఈ స్లోగనీర్స్‌కి నా సానుభూతి తెలియజేసుకుంటున్నాను.

ఇవ్వాళ నీతి అడ్రెస్ లేకుండా అంతరించిపోయింది. అడ్రెస్ లేనివాటి గూర్చి చర్చ అనవసరం, టైం వేస్ట్! కానీ, అవినీతి గూర్చి ఎంతైనా రాయొచ్చు - ఎందుకంటే అదిప్పుడు సినీతారల సౌందర్య రహస్యంలా తళతళా మెరిసిపోతుంది కనుక. అవినీతి కొంత కష్టమైనది, మరెంతో క్లిష్టమైనది! అందుకే ఈ అవినీతిలో ఎప్పుడూ రాజకీయ నాయకులు, బ్యూరాక్రసీ, పారిశ్రామికవేత్తలు.. ఇంకా చాలామంది పార్ట్నర్లుగా వుంటారు. వాళ్ళంతా అలా భాగస్వామ్యం కలిస్తేనే, అవినీతి అదేదో సిమెంటుతో కట్టిన గోడలాగా మన్నికగా, ధృఢంగా వుంటుంది.

గవర్నమెంటు ఆఫీసుల్లో వాడే గుండుసూదుల దగ్గర్నుండీ, సాంఘిక సంక్షేమ హాస్టళ్ళల్లో పసిపిల్లల తినే తిండి దాకా కమీషన్లు లేకుండా ఉద్యోగులు పని చెయ్యరు (ఇది వారి ఉద్యోగ ధర్మం). ప్రభుత్వాసుపత్రుల్లో మందులు, దుప్పట్ల కొనుగోళ్ళల్లో కమీషన్ ఫస్ట్, క్వాలిటీ లాస్ట్ (ఇది వారి వృత్తిధర్మం). ఈ అవినీతి మునిసిపాలిటీ చెత్తలాగా అందరికీ కనబడుతుంటుంది కాబట్టి - మధ్యతరగతి మేధావులు తీవ్రంగా ఖండిస్తుంటారు (వీళ్ళకోసమే 'భారతీయుడు' సినిమా తీశారు).

ఇప్పుడు ఇదే అవినీతి మోడల్ని దేశస్థాయిలోకి తీసుకెళ్దాం. దేశం అన్నాక దానికో రక్షణ వ్యవస్థ అవసరం. ఈ రక్షణ వ్యవస్థ కోసం గన్నులు, యుద్ధ ట్యాంకులు, ఓడలు, విమానాలు, హెలీకాప్టర్లు.. ఇలా చాలా సామాగ్రి కావాలి. కళ్ళముందు జరిగే అవినీతి గూర్చి సామాన్య ప్రజలకి తెలుస్తుంది కానీ రక్షణ వ్యవస్థ - దాని అవసరాలు, కొనుగోళ్ళ గూర్చి తెలీదు.

అందువల్ల యే దేశప్రభుత్వాలకైనా రక్షణ సామాగ్రి కొనుగోళ్ళల్లో రిస్కు తక్కువ, సేఫ్టీ ఎక్కువ! ఇంకోకారణం - రక్షణ సామాగ్రికి ఇడ్లీ, అట్టు రేట్లలాగా పారదర్శకత వుండదు, బిస్కెట్ పేకెట్లకున్నట్లు ఎమ్మార్పీ వుండదు. ఒక వస్తువు ఉత్పత్తి ఖర్చు వందరూపాయిలైతే - దాన్ని లక్షకి అమ్ముకోవచ్చు, కోటికీ అమ్ముకోవచ్చు. రేటు అనేది ఆయా దేశాల రాజకీయ నాయకత్వాల అవసరం (కక్కుర్తి) బట్టి వుంటుంది.

'కన్ఫెషన్స్ ఆఫ్ ఏన్ ఎకనామిక్ హిట్ మేన్' (తెలుగులో 'ఒక దళారి పశ్చాత్తాపం') అనే పుస్తకంలో జాన్ పెర్కిన్స్ అనే ఆయన బయటకి గౌరవంగా, మర్యాదగా కనిపిస్తూనే అనేక దేశాలు ఈ వ్యవహారాల్ని ఎలా చక్కబెట్టుకుంటాయో, వాటి మోడస్ ఒపరాండై ఏవిఁటో చక్కగా వివరించాడు. అభివృద్ధి చెందిన దేశాలకి ఉప్పుపప్పూ వ్యాపారాల మీద మోజుండదు - ఆ రంగాల్లో కిరాణాకొట్టులాగా పరిమిత లాభాలు మాత్రమే వుంటాయి కనుక. అంచేత అవి ఆయుధాల వ్యాపారం ఎంచుకుని, ఈ వ్యాపారాన్ని నిరాటంకంగా చేస్తుంటాయి (ఆయుధాల టెక్నాలజీ వారికి మాత్రమే సొంతం, ఇంకెవడైనా ఆయుధాలు తయారు చెయ్యాలని ప్రయత్నిస్తే వాడికి సద్దాం హుస్సేన్‌కి పట్టిన గతే పడుతుంది).

ప్రజలు తమ అవసరాల నిమిత్తం కొన్నిచోట్లకి వెళ్ళి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు - బట్టలకొట్టు, చెప్పులషాపు.. ఇలాగా. అలా కొనేవాళ్ళని అయా వ్యాపారస్తులు 'కస్టమర్లు'గా పరిగణిస్తారు. మరైతే ఆయుధాలు ఎవరికి అవసరం? అవి కొనడానికి కస్టమర్లు ఎక్కణ్నుండి వస్తారు? ఒక వస్తువుని అమ్ముకోవాలంటే ఆ వస్తువుకి డిమాండ్ వచ్చేలా చేసుకోవటం వ్యాపారంలో ప్రాధమిక సూత్రం. కావున రక్షణ సామాగ్రి అమ్ముకునేవాళ్ళు తమ కస్టమర్లని తామే సృష్టించుకుంటారు. అందుకోసం తాము ఆయుధాలు అమ్మాలనుకునే దేశాల్లో అంతర్గతంగా అశాంతి, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు వుండేట్లు ఆయుధ వ్యాపారులు తీవ్రంగా శ్రమిస్తారు (ఇందుకయ్యే ఖర్చులు ఫైనల్ బిల్లులో రాబడతార్లేండి).

ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల్లో తిరుగుబాటుదార్ల దగ్గర ఇబ్బడిముబ్బడిగా ఆయుధాలుంటాయి (అవి ఎక్కణ్నుండి వచ్చాయని అడక్కండి), వారి నుండి తమ ప్రభుత్వాల్ని రక్షించుకోడానికి ఆ ప్రభుత్వాలు ఆయుధాలు కొనుక్కోవాలి. అమ్మయ్య, ఇక్కడ పనైపోయింది! మరి మిడిల్ ఈస్ట్ సంగతేంటి? అక్కడ ఇజ్రాయిల్ పుణ్యామని యుద్ధం రావణ కాష్టంలా మండుతూనే వుందిగా! వాళ్ళు తమ సహజ సంపదైన చముర్ని అమ్ముకుంటూ, ఆయుధాలు కొనుక్కుంటూ, జాతి విద్వేషాల్తో ఒకళ్ళనొకళ్ళని చంపుకుంటూ కులాసాగా జీవనం కొనసాగిస్తున్నారు. అంటే పేకాటలో డబ్బు ఎవరు పోగొట్టుకున్నా వాళ్ళందరికీ అప్పిచ్చేది మాత్రం ఒక్కడే!

ఇక మన విషయానికొస్తే - మనకీ, పాకిస్తాన్‌కీ మధ్య ఇంచక్కా కాశ్మీర్ 'సమస్య' వుండనే వుంది. ఈ రెండుదేశాల సాధారణ ప్రజానీకం మాత్రం మలేరియా, టైఫాయిడ్‌లాంటి సింపుల్ రోగాల్తో చస్తుంటారు. వడదెబ్బకీ, చలిక్కూడా చస్తుంటారు. పంటలు పండకా, పండినా గిట్టూబాటు ధరల్లేకా రైతులు ఆత్మహత్యలు చేసుకు చస్తుంటారు. దిక్కులేనివాళ్ళు ఆకలి చావులు చస్తుంటారు. ఇంకా చెప్పుకోడానికి సిగ్గుపడే అనేక కారణాలతో రోజువారీ కుక్కచావులు చస్తూనే వుంటారు.

'ప్రజలారా! కలత చెందకండి, భయపడకండి. కాశ్మీరు మనది, అక్కడ ప్రతి అంగుళం మనదే, ఒక్క అంగుళం కూడా అవతలవారికి చెందనియ్యం.' ఈ తరహా ప్రచారం ఇటు ఇండియాలో, అటు పాకిస్తాన్‌లోనూ నిరంతరంగా కొనసాగుతుంటుంది. 'కాశ్మీరు సంగతి సరే! మరి మా సంగతేంటి?' అనడిగితే మనం అర్జంటుగా దేశద్రోహులైపోతాం, మనని అరిచి మందలించి భయపెట్టడానికి అర్నబ్ గోస్వామి వంటి భీభత్సమైన దేశభక్తులు వుండనే వున్నారు!

అయ్యా ఆయుధాలమ్మే అగ్రరాజ్యంగారు! నమస్తే. మాది శాంతికాముక దేశం సార్! కానీ మా సరిహద్దు దేశంగాడున్నాడే, వాడొట్టి దొంగాముండావాడండీ! ఆ దుర్మార్గుణ్నించి మమ్మల్ని మేం రక్షించుకోవాలి కదండీ? అంచేత అర్జంటుగా మాకిప్పుడు ఆయుధాలు కావాలి. కానీ మాదగ్గర ఈడ్చి తన్నినా పైసా లేదు. ఇప్పుడెలా? ఎలా? ఎలా?

డోంట్ వర్రీ! మై హూనా? అప్పుగా ఆయుధాలు ఎన్నైనా తీసుకోండి. వడ్డీలు, చక్రవడ్డీలు, ఈయమ్మైలు.. మొత్తం మేమే నిర్ణయిస్తాం. మీరు నిదానంగా కట్టండి. ఈలోపు అంతర్జాతీయంగా మేం తీసుకునే ప్రతి నిర్ణయానికీ మీరు కిక్కురుమనకుండా, గుడ్డిగా మద్దతు పలకాలి. లేదా, మా అప్పు వసూలుకి విజయవాడ కాల్ మనీ టైపు పద్ధతులు అమలు చేస్తాం. ఇంకో ముఖ్యవిషయం - మా మార్కెట్ రంగాన్ని మీ దేశంలోకి తలుపులు బార్లా తెరిచి ఆహ్వానించాలి.

తలుపులు మరీ బార్లా తెరిస్తే మాకు రాజకీయంగా ఇబ్బంది.

నిజమే కదూ! అయితే ఓ పన్జెయ్యండి, తలుపులు కొద్దిగా తెరవండి చాలు. వేలుపెట్టే సందు దొరికితే కాలు పెట్టడం మా ప్రత్యేకత! అయినా - ఒక ఇంట్లోకి ప్రవేశించాలంటే మాకు అనేక మార్గాలున్నాయి. సమయానుకూలంగా దొడ్డిదోవన వొస్తాం, వంటింటి కిటికీలోంచి దూరి వొస్తాం, పక్కింటిగోడ దూకి వొస్తాం.

ఇప్పుడు మనం అలనాటి బోఫోర్సు నుండి నేటి అగస్టావెస్ట్‌లేండ్ (ఈ హవాలా దివాలా పేర్లు భలే సెక్సీగా వుంటాయి) దాకా తెర వెనుక కథ తెలుసుకున్నాం. ఇవన్నీ చాలా సాధారణ విషయాలు, పవిత్ర గంగానదిలాగా నిరంతరం అలా పారుతూనే వుంటాయి. ఈ వ్యాసం రాస్తున్న సమయంలో ప్రపంచంలో యేదోకచోట ఒక డీల్ కుదురుకుంటూ వుంటుంది.

నోనో, ఇలా స్వీపింగ్ జెనరలైజేషన్ చెయ్యకూడదు. మా ప్రభుత్వం గత ప్రభుత్వం కుంభకోణాన్ని బయటపెట్టింది, మా పార్టీ నిప్పు.

సరే! కుంభకోణాల్ని బయటపెడుతున్నారు. మరప్పుడు బోఫోర్స్ కుంభకోణంలో ఎందరు జైలుకెళ్ళారు? కార్గిల్ శవపేటిక కుంభకోణంలో ఎందరు శిక్షించబడ్డారు? సమాధానం చెప్పి మమ్మానందింపజేయ ప్రార్ధన. ఈ కుంభకోణాల వెలికితీత వెనుక రాజకీయ ప్రయోజనాలకి మించి ప్రజల సంక్షేమం ఎంత మాత్రం లేదని మరీ బల్ల కాకపోయినా టీపాయ్ గుద్ది చెప్పొచ్చు.

'పార్ధా! ప్రభుత్వ పక్షమేమిటి? ప్రతిపక్షమేమిటి? అన్నిపక్షాలు నేనే! నువ్వు యే పక్షమైనా డీల్ కుదుర్చువాడను నేనే! ప్రజలకి ఫలానా పార్టీకి చెందిన ప్రభుత్వంపై మొహం మొత్తంగాన్లే పాతపార్టీల్తో కొత్తపక్షాన్ని సృష్టించి గద్దె నెక్కించువాడను నేనే! చదరంగంలో ఇవ్వాళ తెల్లపావుల్తో ఆడినవాడు రేపు నల్లపావుల్తో ఆడతాడు. ఒక దేశంలో ప్రభుత్వ ప్రతిపక్షాలన్నియూ ప్రజల భ్రాంతేనని వికిలీక్స్ సాక్షిగా నీవు గ్రహించగలవు. కావున నీవు నిస్సందేహముగా అవినీతికి పాల్గొనుము. ఇదే కలియుగ ధర్మం, వినకపోతే నీ ఖర్మం."

తెలుగు సినిమా ప్రేక్షకులు హీరోలకి వీరాభిమానులు. మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని తన్నుకు చస్తుంటారు. ఈ హీరోలతో సినిమాలు తీసేవాళ్ళు మాత్రం తెర వెనక ఐకమత్యంగా వుంటారు. డబ్బు సంపాదనే తమ ధ్యేయమనీ, మీరు కొట్టుకు చావకండని హీరోలు చచ్చినా చెప్పరు, చెబితే అది బ్యాడ్ బిజినెస్ స్ట్రేటజీ అవుతుంది. ఎందుకంటే - తమలో తమకి పడదని సాధారణ ప్రేక్షకుడు భావించడం కూడా హీరోల వ్యాపారంలో భాగమే కాబట్టి.

తెలుగువాళ్ళకి సినిమా ట్రాజెడీగా ముగిస్తే నచ్చదు. ఈ నచ్చకపోవడం అనేది ఇలాంటి వ్యాసాలక్కూడా అప్లై అవుతుందని నా అనుమానం. అందువల్ల ఈ వ్యాసాన్ని పాజిటివ్ నోట్‌తో ముగిస్తాను. భవిష్యత్తులో ఈ అవినీతి చీడ / భూతం (యేదైతేనేం) అంతరించిపోవాలని, నీతి అనేది నిజాయితీగా తలెత్తుకు నిలబడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం పొయిటిక్‌గా, పచ్చిఅబద్దంలా అనిపిస్తుంది కదూ! నేనేం జెయ్యనూ? అబద్దాలంతే, అవలాగే వుంటాయి!   

(ప్రచురణ - 'సారంగ' 12 - 5 - 2016 సంచిక)         

Friday 29 April 2016

ఒక బరువైన సన్నివేశం


"డైరక్టర్‌గారూ! మీకిప్పుడో సూపర్ హిట్ కథ చెబ్తాను."

"చెప్పండి."

"అది కోర్టు. ముఖ్యమైన కేసు విచారణ జరుగుతుంది. జడ్జిగారు ఆడలేడీసు. ఆవిడ కరుణామయి, త్యాగశీలి, అభిమానవతి, పుణ్యవతి, శీలవతి... "

"అర్ధమైంది, కేరీ ఆన్."

"కానీ జడ్జిగా ఆమె నిప్పులాంటి మనిషి. ఆవిడ కోర్టులో రంగయ్య డఫేదారు. పాపం! రంగయ్యకి రెండ్రోజులుగా జొరం, తట్టుకోలేక కళ్ళు తిరిగి కోర్టు మధ్యలో పడిపొయ్యాడు."

"జొరంగా వుంటే సెలవు పెట్టొచ్చుగా?"

"చెప్పాగా! జడ్జిగారు మహాస్ట్రిక్టు."

"అవును కదా, మర్చిపొయ్యా."

"డ్యూటిలో వుండగా కింద పడిపోయినందుగ్గానూ జడ్జిగారు రంగయ్యని సెక్షన్ 106, 271, 398, 469 ప్రకారం ఉద్యోగంలోంచి సస్పెండ్ చేశారు. తీర్పు చదువుతుండగా జడ్జిగారి ముఖంలో కాఠిన్యం, కంట్లోనీరు! కిందపడ్డ రంగయ్య నేలమీద నుండే హతాశుడయ్యాడు. కొద్దిసేపటికి 'ఇన్నాళ్ళ నా సేవకి ఇదా ఫలితం?' అన్నట్లు జడ్జిగారిని దుఃఖంగా చూశాడు. ఆ తరవాత నిదానంగా కోర్టుని కలియజూశాడు, ఇప్పుడు రంగయ్య కళ్ళల్లో గర్వం!"

"ఎందుకని!!!????"

"అదే మన కథలో ట్విస్టు. జడ్జమ్మాయిగారు డఫేదార్ రంగయ్య కూతురు! రంగయ్య తన ఆరోగ్యాన్ని లెక్కజెయ్యకుండా, రాత్రనకా పగలనకా గొడ్డులా కష్టపడి కూతుర్ని చదివించి ఇంతదాన్ని చేశాడు! ఎలా వుంది సీన్?"

"సూపర్. కాకపోతే మీరీ కథని యాభైయ్యేళ్ళు లేటుగా చెబ్తున్నారు."

"!!!???"

"యేంలేదు. ఈ పాత్రలు పోషించడానికి సావిత్రి, గుమ్మడి కావాలి. ఇప్పుడు మనం వాళ్ళని తేలేం కదా! కాబట్టి ఈ కథ వద్దులేండి." 

(picture courtesy : Google)    

Wednesday 27 April 2016

టాప్ సీక్రెట్


"ఇది టాప్ సీక్రెట్, ఎవరికీ చెప్పకు."

"యేంటది?"

"పాకిస్తాన్ పీడా ఒక్కరోజుతో వొదుల్చుకునే ప్లాన్ నాదగ్గరుంది."

"ఒక్కరోజులోనా!"

"అవును. నాక్కావల్సిందల్లా ఓ విమానం, పదిబాంబులు. ఆ పదిలో ఓ రెండు పేలని బాంబులు."

"ఎందుకు!?"

"చెబ్తా! ఆ బాంబుల మీద 'మేడిన్ పాకిస్తాన్' అని తాటికాయ కన్నా పెద్దక్షరాల్తో ప్రింట్ చేసుండాలి."

"ఎందుకు!?"

"చెబ్తా! ఆ విమానంలో యే అర్ధరాత్రో చైనావాడి భూభాగంలోకి ప్రవేశించి, గప్‌చుప్‌గా ఆ బాంబుల్ని జారవిడిచేసి వెనక్కొచ్చెయ్యాలి. చైనాగాడు పేలని బాంబుల మీదున్న 'మేడిన్ పాకిస్తాన్' చూస్తాడు. బాంబులేసింది పాకిస్తాన్‌వాడే అనుకుని కోపంతో రగిలిపోతాడు, వెంటనే పాకిస్తాన్‌గాడి మీద యుద్ధం మొదలెడతాడు. ఆ దెబ్బకి మనకి పాకిస్తాన్ పీడా విరగడౌతుంది. మనం తమాషా చూస్తూ ఎంజాయ్ చేద్దాం. శత్రువుని శత్రువుతోనే దెబ్బతియ్యాలి. ఇదీ నా ప్లాన్, ఎలా వుంది?"

"అయ్యా! ఎవరండీ తమరు?"

"ఇంత చెప్పినా తెలుసుకోలేరా!? నేను తెలుగు సినిమా రచయితని."

(picture courtesy : Google)

Tuesday 26 April 2016

అందర్ కీ బాత్


"గుడ్మార్నింగ్ శ్రీహరీ!"

"హాయ్ నారదా! భూలోక విశేషములేమి?"

"యేమని చెప్పను శ్రీహరి! ఇండియన్ పార్లమెంటులో అరుపులు, వాకౌట్లు తప్ప ప్రజల సమస్యల గూర్చి చర్చ ఏమాత్రం చర్చ జరగట్లేదు."

"పిచ్చి నారదా! అటు నా ఎల్యీడీ స్క్రీన్ చూడుము."

పార్లమెంటు భవనంలో ఓ గదిలో ఓ మూలగా కూర్చుని అధికార, ప్రతిపక్ష నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

"ఉత్తరాఖండ్ సమస్యపై మూడ్రోజులకి మించి వాకౌట్ చెయ్యలేం, మీరు మా ఇబ్బందుల్ని గుర్తించాలి." ప్రతిపక్ష నాయకుడు దీనంగా అన్నాడు.

"మూడోరోజుకి ఇంకో సమస్యని సృష్టిస్తాం, డోంట్ వర్రీ! కానీ - ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక ధరలు, కరువు కాటకాలు చర్చకి రాకూడదు. మీరు అధికారంలో వున్నప్పుడు మేం ఎంత బాగా సహకరించామో గుర్తుందిగా!" హెచ్చరికగా అన్నాడు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి.

రిమోట్‌తో ఎల్యీడీ స్క్రీన్ స్విచాఫ్ చేశాడు విష్ణుమూర్తి.

"నారదా! మబ్బుల్లో లోకసంచారం చెయ్యడం మినహాయించి నీకు 'అందర్ కీ బాత్' అర్ధం కావట్లేదు. నువ్వు మరీ outdated అయిపోతున్నావు." ఎగతాళిగా అన్నాడు విష్ణుమూర్తి.

నారదుడు కొద్దిసేపు ఆలోచించాడు, ఆపై పెద్దగా ఏడవడం మొదలెట్టాడు. విష్ణుమూర్తి కంగారు పడ్డాడు.

"నారదా! అయామ్ జస్ట్ జొకింగ్."

"శ్రీహరీ! నేనేడుస్తుంది మీకోసమే."

"వై?" ఆశ్చర్యపొయ్యాడు విష్ణుమూర్తి.

"మానవుడు ఎంత తెలివైనవాడు! ఈమాత్రం తెలివి లేకనే గదా - మీరు ఎంతో శ్రమ పడి దశావతారాలు ఎత్తి టైమ్ వేస్టు చేసుకున్నారు!"

విష్ణుమూర్తికి కూడా దుఃఖం ఆగింది కాదు. 

(picture courtesy : Google)

Friday 22 April 2016

గోమాత


"అయ్యో, అయ్యయ్యో! దుర్మార్గులారా! గోమాతని చంపేశారా?"

"అయ్యా.. "

"అమ్మా గోమాతా! నిన్ను రక్షించుకోలేకపొయ్యాం, క్షమించు తల్లీ!"

"అయ్యా.. "

"దేశద్రోహులారా! ఇంక మీక శాస్తి జరగాల్సిందే!"

"అయ్యా.. "

"ఏవిఁటోయ్! ఇందాకట్నుండీ 'అయ్యా! అయ్యా!' అంటూ ఒకటే గోల?"

"అయ్యా! చచ్చింది గుర్రం."

"ఓస్, ఇంతా జేసి ఇక్కడ చచ్చింది గుర్రమా!?"

"అయ్యా! అవును."

"వార్నీ! అనవసరంగా ఎంత కంగారు పడ్డాను! దూరం నుండి తెల్లగా కనిపిస్తే ఆవు అనుకున్నాన్లే!"

(picture courtesy : Google)

Monday 18 April 2016

చినబాబు స్పందించారు!


"చినబాబూ! మీకు చెప్పదగ్గవాళ్ళం కాదు, అయినా చెప్పక తప్పదు. ముఖ్యమంత్రి పోస్టులో నాన్నగారు బిజీగా వున్నారు. ఇప్పుడు పార్టీ నాయకత్వం మీదే. మీరేమో పొద్దస్తమానం ఇంట్లో కూర్చుని వీడియో గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు."

"అబ్బబ్బా! ఏం పార్టీ నాయకులయ్యా, ఒకటే నస. సరే! ఇప్పుడు నేనేంచెయ్యాలో చెప్పండి."

"ఎండలకి జనం మలమలా మాడిపోతున్నారు, పిట్టల్లా రాలిపోతున్నారు."

"సారీ! ఇప్పుడా ఎండల్లో తిరగడం నా వల్లకాదు."

"మీరు ఎండలోకి రానక్కర్లేదు చినబాబు, స్పందిస్తే చాలు."

"అంటే?"

"ఎండల మీద ఒక ప్రెస్ మీట్ పెట్టండి."

"పెట్టి?"

"ప్రతిపక్ష నాయకుణ్ణి నాలుగు తిట్టండి."

"తిడితే?"

"అది చాలు చినబాబు. మీరు చెప్పిన్దానికి అదనంగా కథ, స్క్రీన్ ప్లే, దర్సకత్వం వహిస్తూ వార్తల్ని వండి వార్చడానికి మనకి మన మీడియా వుండనే వుందిగా!"

"అవును కదా! ఆ విషయం మర్చేపొయ్యాను. వెంటనే ప్రెస్‌వాళ్ళకి కబురంపండి."

కొద్దిసేపటికి ప్రెస్ మీట్ -

"నాన్నగారి పాలనలో ప్రజలు ఆనందంతో ఉక్కిరిబిక్కిరౌతున్నారు. మళ్ళీ సాక్షాత్తు ఆ శ్రీరాముడే మమ్మల్ని పాలిస్తున్నాడని పులకించిపోతున్నారు. రాష్ట్రంలో ప్రజలంతా దర్జాగా, హాయిగా ఇంట్లోనే వుంటూ ఏసీ చల్లదనాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయాన్నే మా పార్టీ అమెరికా బ్రాంచివాళ్ళు కూడా రిపోర్టు చేశారు. ప్రజలు ఇంత చల్లగా, ప్రశాంతంగా బ్రతకడాన్ని చూసి సింగపూరు, జపాను వాళ్ళు కూడా తీవ్రంగా ఆశ్చర్యపోతున్నారు. అయితే అభివృద్ధిని అడ్డుకునే ప్రతిపక్ష నాయకుడు మాత్రం ప్రజల ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాడు. అందుకే - ప్రజల్ని రోడ్ల మీదకి రమ్మనీ, చచ్చిపొమ్మనీ రెచ్చగొడుతున్నాడు. ప్రతిపక్ష నాయకుడి కుట్రని తీవ్రంగా ఖండిస్తున్నా. అతడిపై సెడిషన్ చార్జెస్‌ మోపి వెంటనే అరెస్టు చెయ్యలని కూడా డిమాండ్ చేస్తున్నా. మా నాన్నగారికి జై! మా పార్టీకి జై!!"  

(picture courtesy : Google) 

Thursday 11 February 2016

దేశభక్తి - మతరాజకీయాలు


ఉదయం తొమ్మిది గంటలు, హిందూ పేపర్ తిరగేస్తున్నాను. పఠాన్ కోట్ సంఘటనపై పాకిస్తాన్‌కి మరింత సాక్ష్యం కావాల్ట!

"మిత్రమా! కాఫీ, అర్జంట్!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు. 

"కూర్చో సుబ్బూ! ఈ పాకిస్తాన్‌ వెధవకి బుద్ధి లేదు, వొళ్ళు మండిపోతుంది!" అన్నాను. 

"మనకి పాకిస్తాన్ వార్తలెప్పుడూ అంతేలే!" అంటూ నవ్వాడు సుబ్బు. 

"అంటే పాకిస్తాన్ దేశం వొక శాంతికపోతం అంటావా?" చిరాగ్గా అన్నాను. 

"అని నేనన్నానా? మనం పాకిస్తాన్ గూర్చి ఎలా అనుకుంటామో, పాకిస్తాన్ ప్రజలు కూడా ఇండియాని అలాగే అనుకుంటారు. ఇలా ఇరువైపులా దుష్ప్రచారం జరగడం రాజ్యానికి చాలా అవసరం." అన్నాడు సుబ్బు.

"కొంచెం వివరంగా చెప్పు." అన్నాను.

"రాజ్యానికి అభివృద్ధి అనేది లక్ష్యంగా వుండాలి. ఇక్కడ అభివృద్ధి అంటే బులెట్ ట్రైన్లు, బిల్డింగులు కాదు. పేదరికాన్ని తగ్గించడం. విద్యా, ఆరోగ్య సౌకర్యాలని పెంచడం. సామాన్య ప్రజల్ని ఆర్ధికంగా పరిపుష్టం చేస్తూ, బలహీన వర్గాల కోసం సంక్షేమ పథకాల్ని సమర్ధవంతంగా అమలు చేస్తూ.. " చెప్పసాగాడు సుబ్బు. 

"సుబ్బూ! నువ్వు మరీ అరటిపండు వొలవనక్కర్లేదు." నవ్వుతూ కట్ చేశాను. 

"ఈ రకమైన ప్రజాభివృద్ధి ఎజెండా రాజ్యానికి వున్నట్లైతే అభ్యుదయ శాస్త్రీయ సిద్ధాంతం సరిపోతుంది. కానీ దోపిడీ వ్యవస్థల రాజ్యానికి 'అందర్ కీ బాత్' వేరే వుంటుంది. అది - పెట్టుబడిదారులకి కొమ్ము కాయడం, సామాన్యులని దోచుకోవడం! అందుకే  - నువ్వు వినేది నిజం కాదు, నువ్వు చూసేదీ నిజం కాదు!" అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! కొంచెం అర్ధం అయ్యేట్లు చెప్పు." మొహం చిట్లించాను.

ఇంతలో పొగలు గక్కుతూ ఫిల్టర్ కాఫీ వచ్చింది.

"సరే! నీకు అర్ధం కావడం కోసం ఒక ఉదాహరణ చెబుతాను. స్వతంత్రం వచ్చిన కొన్నాళ్ళకే పాకిస్తాన్‌లో రాజ్యం సమాజ అభివృద్ధి, ప్రజా సంక్షేమం వంటి ప్రజోపకరమైన కార్యక్రమాల్ని వదిలేసి, పెట్టుబడిదారు అనుకూల దోపిడీ ఎజెండా ఎంచుకుంది. సామాన్య ప్రజలు ఈ దోపిడీ సహించరు. అంచేత రాజ్యానికి మార్మికత అవసరం. ప్రజల దృష్టి మళ్ళించడానికి అక్కడ రాజ్యం ఎంచుకున్న మార్మికత - భారత్ వ్యతిరేకత. ఇందుకోసం 'కాశ్మీర్' వుండనే వుంది. అంచేత రాజ్యం ప్రజల మొహాన 'ఇండియా వ్యతిరేకత' అనే దేశభక్తి భావజాలాన్ని ఈజీగా రుద్దగలిగింది!" కాఫీ సిప్ చేస్తూ ఆగాడు సుబ్బు.

"ఇంటరెస్టింగ్, గో ఆన్!" అన్నాను.

"ఇండియాతో యుద్ధం ఓడిపోయ్యి బంగ్లాదేశ్ ఏర్పడ్డాక పాకిస్తాన్ ప్రజలకి ఇండియా వ్యతిరేకతలోని మార్మికత అర్ధమైంది. అప్పుడు వెంటనే రాజ్యం మతం ఎత్తుగడ వేసి పాకిస్తాన్‌ని ఇస్లామిక్ మత రాజ్యంగా మార్చేసింది. ఈ పని చేసింది జమాతే ఇస్లాం కాదు, సైన్యం ఆధ్వర్యంలో వున్న ప్రభుత్వం. ఇలా రాజ్యం తన ఎత్తుగడల్లో భాగంగా దేశభక్తి, మతభావనల్ని సమయానుకూలంగా తెరపైకి తెస్తుంటుంది." అన్నాడు సుబ్బు.

"అవును కదా!" అన్నాను.

"హిట్లర్ వోటు ద్వారానే అధికారంలోకి వచ్చాడు. ఆ తరవాతే గోబెల్స్ సహాయంతో యూదు వ్యతిరేకత, కమ్యూనిస్టు వ్యతిరేకత అంటూ జాతీయ భావాల్ని రెచ్చగొట్టి ప్రపంచాన్ని చిందర వందర చేశాడు. సద్దామ్ హుస్సేన్ బాత్ పార్టీ మొదట్లో సెక్యులర్ పార్టీ. ఆ తరవాత యుద్దాల్ని జనాల మీదకి రుద్దడానికి బాత్ పార్టీ ఇస్లామిక్ పార్టీగా మారిపొయింది." ఆలోచిస్తూ అన్నాడు సుబ్బు.

"మరి ఇండియా సంగతి?" అడిగాను.

"స్వతంత్రం వచ్చిన కొన్నేళ్ళదాకా రాజ్యం గాంధీయిజం, సోషలిజం సిద్ధాంతాల్ని వాడుకుంది. ఆ తరవాత అది సరిపోదని గ్రహించి - పాకిస్తాన్లో ఫలితం ఇచ్చిన మతవాదాన్ని తెరపైకి తెచ్చింది. టెస్ట్ డోసుగా అయోధ్య తలుపులు తెరిపించింది. ఎలాగూ మతవాదంతో రెడీమేడ్‌గా ఆరెస్సెస్ వుండనే వుంది. దాన్ని దుమ్ము దులిపి బయటకి లాగి - 'రామజన్మ భూమి' అంటూ అద్వానీ రథయాత్రతో ముందుకి నెట్టింది. అది గుజరాత్ హత్యాకాండతో మరింత స్థిరీకరించబడింది." అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"ఒప్పుకుంటున్నాను." అన్నాను.

"టీ కొట్టువాడు పాలు, డికాక్షన్లు దగ్గర ఉంచుకుని కస్టమర్ల టేస్టుకి తగ్గట్లు పాళ్ళు కలిపి ఇస్తుంటాడు. అలాగే రాజ్యం - దేశభక్తి, మతభావనలు అనే భావజాలాల డోసుని అవసరాన్ని బట్టి పెంచడం, తగ్గించడం చేస్తుంది. శ్రీలంకలో తమిళుల్ని ఊచకోత కొయ్యడానికి రాజ్యానికి దేశభక్తి డోసు పెంచాల్సి వచ్చింది. ఆ సమయంలో 'అహింసాయుత' బౌద్ధమతం తన మొహాన్ని ఇంకోవైపుకి తిప్పుకుంది." అన్నాడు సుబ్బు.

"ఈ మధ్య మతాన్ని రాష్ట్రప్రభుత్వాలు కూడా మోస్తున్నాయి కదా!" అన్నాను.

"అవును, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశం లేని రాజ్యం పుష్కరాలు, యాగాలు అంటూ భక్తిభావాల్ని ప్రమోట్ చేస్తుంది. వాస్తవానికి ఈ భక్తి కార్యక్రమాల్ని నిర్వహించడానికి మత ధార్మిక సంస్థలున్నాయ్. కానీ ప్రజల దృష్టి మరల్చడానికి పనికొచ్చే యే అంశాన్నీ వదులుకోడం రాజ్యానికి ఇష్టం వుండదు."

"కరెక్ట్." అన్నాను.

"రాజ్యం అసలు ఎజెండా - సామ్రాజ్యవాదానికి దేశంలో ఒక మార్కెట్ దళారీ వ్యవస్థని ఏర్పాటు చెయ్యడం. కానీ ఈ విషయాన్ని దాచి, ఇంకోటి చెబుతుంటుంది. పాకిస్తాన్లో మసీదు మెట్ల మీద అడుక్కునేవాడు, ఇండియాలో గుడిమెట్ల మీద అడుక్కునేవాడు - తాము పరస్పర శత్రువులుగా భావించేందుకు అవసరమైన భావజాల సరంజామాని రాజ్యం నిత్యం సరఫరా చేస్తూ వుంటుంది. అదీ సంగతి!" అంటూ హడావుడిగా నిష్క్రమించాడు మా సుబ్బు.

**(బాలగోపాల్ 'హిందూమత రాజ్యం' (1991) వ్యాసం ఆధారంగా) 

(ప్రచురణ - సారంగ వెబ్ మేగజైన్ - 11 ఫిబ్రవరి, 2016)

Sunday 31 January 2016

రోహిత్ మరణం.. కొన్ని ఆలోచనలు


పుట్టినవాడు గిట్టక మానడు, చావు పుట్టుకలు ప్రకృతి సహజం అంటారు. అయితే - కొన్ని మరణాలు చరిత్ర సృస్టిస్తాయి, మనలోని మనిషిని కొరడాతో చెళ్ళుమని కొట్టి ఉలిక్కిపడేలా చేస్తాయి. రోహిత్ మరణం అనేక ప్రశ్నల్ని మనముందుంచింది. ఒక విద్యార్ధి మరణం దేశవ్యాప్తంగా ఇంత సంచనలం సృష్టించడం ఈ మధ్య కాలంలో జరగలేదు (ఎమర్జెన్సీ సమయంలో రాజన్ అనే కేరళ విద్యార్ధి encounter కూడా ఇలాంటి తుఫానునే సృష్టించింది).

రోహిత్ మరణం గూర్చి జరుగుతున్న ఆందోళనలు కొన్నాళ్ళకి సద్దుమణగొచ్చు. అయితే - రోహిత్ మరణం భవిష్యత్తులో ఒక మంచి కేస్ స్టడీగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. రోహిత్ కేవలం ఒక SC కులానికి చెందినవాడైతే ఇంత చర్చ జరిగేది కాదు. అప్పుడది కారంచేడు, చుండూరు మాదిరిగా దళిత vs అగ్రకుల పోరాటంగా మిగిలిపోయ్యేదేమో.

ఒక SC పసిపిల్లని BC కుటుంబం పెంచి పెద్ద చెయ్యడం, తదుపరి తమ BC కులంలో వ్యక్తికి పెళ్లి చెయ్యడం అరుదుగా జరుగుతుంది. ముగ్గురు పిల్లల్ని కన్నాక భార్య SC అన్న 'నిజం' తెలుసుకుని భర్త గృహహింసకి పాల్పడటం, ఆపై విడాకులు తీసుకోవడం కూడా ఆసక్తికరమే. వీళ్ళకి పుట్టిన పిల్లాడు అనేక కష్టాలు ఎదుర్కుని యూనివర్సిటీ స్థాయికి ఎదగడమూ అసాధారణమే. ఈ కుర్రాడు అంబేద్కర్ ఆలోచనలకి ప్రభావితుడై యూనివర్సిటీ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించడం.. ఇదంతా ఓ సినిమా కథలా వుంది కదూ! అవును - రోహిత్ కేసు అనేక విధాలుగా చాలా అరుదైనది. సామాజిక శాస్త్రం చదువుకున్నవారికి ఇవన్నీ చాలా ఆసక్తికరమైన అంశాలు.

రోహిత్ తల్లి చట్టపరంగా భర్త నుండి విడాకులు తీసుకుని విడిపొయ్యింది. అందువల్ల ఆయా కుటుంబాల్లో సహజంగానే కొన్ని రాగద్వేషాలు వుండొచ్చు. అయితే రోహిత్ తండ్రి వైపు వారి కోపాన్ని పదేపదే చూపించి హైలైట్ చెయ్యడంలో మీడియా కుట్ర వుందని భావిస్తున్నాను. భర్త నుండి విడిపోయిన భార్య character assassination చెయ్యడం - మీడియాకున్న 'అధికారానికి కొమ్ము కాయడం' అనే పవిత్రమైన ఎజెండాలో భాగం. Women empowerment గూర్చి ఆలోచించాల్సిన ఈ రోజుల్లో - బూజు పట్టిన భావాలకి ఎంత ప్రచారం! 

పిల్లల్ని పెంచడం అన్నది చాలా సీరియస్ వ్యవహారం. Disturbed family environment లో పెరిగే పిల్లల మనస్తత్వం చాలా delicate గా వుంటుంది. తాగుబోతు తండ్రి తమ తల్లిని అవమానించడం, హింసించడం పసివాళ్ళ మససు మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. పేదరికానికి అవమానం, అభద్రత తోడైతే అది చాలా deadly combination. ఈ అమానవీయ నేపధ్యంలో రోహిత్ JRF సాధించగలిగాడంటే అది ఎంతైనా అభినందనీయం.

మధ్యతరగతి భావజాలంలో దేశభక్తి అత్యంత పవిత్రమైనది. మరణశిక్షని రద్దు చెయ్యాలని బలమైన వాదన నడుస్తూనే వుంది. ఈ నేపధ్యంలో మెమెన్ ఉరిశిక్షని వ్యతిరేకించడం అన్నది నేరం ఎలా అవుతుంది!? కానీ - సంఘపరివార్ దృష్టిలో ఇదో జాతి వ్యతిరేక, దేశ వ్యతిరేకమైన తీవ్రమైన నేరం. అందుకే ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తూ రోహిత్ మరణం justified అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో వీరు ఎంతమేరకు విజయం సాధించారో కొన్నాళ్ళు ఆగితే గానీ తెలీదు.

మన్దేశంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లైనా కులాలకీ, మతాలకీ అతీతంగా ఆలోచించలేరని అర్ధమైపోయింది. ఇందుకు ప్రధాన కారణం - వీరిలో ఎక్కువమంది (అందరూ కాదు) ప్రభుత్వాలకి సాగిలపడి కులాన్ని అడ్డుపెట్టుకుని, పైరవీలు చేసి ప్రమోషన్లు సంపాదించుకున్న బాపతు. ఇంక వీరు నిస్పాక్షికంగా వ్యవహరిస్తారని ఎలా ఆశించగలం! ఈ రేటున ఈ దేశానికి కులం నుండి ఇప్పడప్పుడే విముక్తి లేనట్లుగా అర్ధమౌతుంది.

రోహిత్ మరణం పట్ల స్పందనల్ని స్థూలంగా మూడు విభాగాలుగా విభజించవచ్చు. మొదటి రకం - బిజెపి అనుకూల హిందూమత రాజకీయుల వాదన. వీళ్ళు రిజర్వేషన్ వ్యతిరేకులు, అంబేద్కర్ వాదనకి వ్యతిరేకులు. కాబట్టి వీరికి (సహజంగానే) రోహిత్ దేశద్రోహిలా కనబడతాడు. చదువుకోవాల్సిన చోట రాజకీయాలు (తమకి నచ్చనివి) చెయ్యడం వల్ల  చనిపొయ్యాడు. అయితే ముసుగు తొలగిపొయ్యి తమ దళిత వ్యతిరేకత నగ్నంగా ప్రదర్శించబడటం సంఘపరివార్‌కి రాజకీయంగా నష్టం. అంచేత తమ escape plan లో భాగంగా 'రోహిత్ దళితుడు కాదు' అనే ప్రచారం మొదలెట్టింది. ABVP రాజకీయాలు సూటిగా, స్పష్టంగా వుంటాయి.   

రెండోరకం స్పందన - దళితవాదుల ప్రకటనలు. మనవాడు, మన ఇంట్లోవాడు అన్యాయంగా చనిపోతే దుఃఖం, కోపం కలుగుతాయి. వీరి ప్రకటనలు ఇదే స్థితిని తెలుపుతున్నాయి. తమవాడి మరణం వీరిని రోడ్ల మీదకి వచ్చేలా చేసింది. వీరి వాదనా స్పష్టంగా అర్ధమవుతుంది. 

ఇంక మూడోరకం - మధ్యతరగతి మేధావుల స్పందన. వీరు 'మంచివారు'. పాతకాలం ప్రజానాట్య మండలి నాటకాల్లా - పేదరికాన్ని, బలహీనుణ్నీ romanticize చేస్తారు. వీరిది - ధనికుడు vs పేదవాడిలో పేదవాడే కరెక్ట్, ఆడ vs మగ సమస్యల్లో ఆడవారే కరెక్ట్, కుల సంఘర్షణలో తక్కువ కులమే కరెక్ట్ అనే stereotype అవగాహన. సామాజిక విషయాల్ని over simplify చేసుకుని అర్ధం చేసుకోడానికి అలవాటు పడిపోయినందున - రోహిత్ కేసులో కన్ఫ్యూజ్ అవుతున్నారు. కారణం - కేసులో నిందితుడైన ABVP కుర్రాడు BC అయిపొయ్యాడు! ఇటువంటి సమయాల్లో ఈ తాత్విక గందరగోళాన్ని తగ్గిస్తూ (ఎడ్యుకేట్ చేస్తూ) బాలగోపాల్ అనేక వ్యాసాలు రాశాడు. నాకివ్వాళ బాలగోపాల్ లేని లోటు స్పష్టంగా కనబడుతుంది.        

సరే! వాదన కోసం రోహిత్ SC కాదు, OC అనుకుందాం. అసలు గొడవ ఎక్కడ ఎందుకు మొదలైంది? అంబేద్కర్ విద్యార్ధి సంఘానికి, ABVP మధ్య జరిగిన, జరుగుతున్న ఘర్షణ నేపధ్యాన్ని అర్ధం చేసుకోవాలి. ప్రపంచంలో ఏ రాజకీయాలకైనా భావజాలమే ప్రధానం. దళితుడైనా ABVP సభ్యుడైతే అతను బ్రాహ్మణీయ భావజాల ప్రతినిధిగానే చూడాలి. అలాగే అగ్రకులస్తుడైనా అంబేద్కర్ విద్యార్ధి సంఘ సభ్యుడైతే అంబేద్కరిస్టుగానే చూడాలి. కాబట్టి - ఇది రెండు రకాల పరస్పర వ్యతిరేక ఆలోచనలని ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యార్ధి సంఘాల ఘర్షణ. అందుకే ABVP తరఫున కేంద్రమంత్రులు దిగారు. విషయం ఇంత స్పష్టంగా వుంటే - మధ్యతరగతి మేధావులకి రోహిత్ SC నా లేక BC నా అనేది ప్రధానమైపోయింది. రోహిత్ పట్ల గానీ, అతని తల్లి పట్ల గానీ కనీస మానవత్వంతో స్పందించాలన్న స్పృహ లేకుండా మాట్లాడుతున్నారు.

నిర్భయ చట్టం రాకముందు అనేక దుర్మార్గమైన రేపులు జరిగాయి. కానీ నిర్భయ కేసు సంచలనం సృష్టించడం వల్ల నిర్భయ చట్టం వచ్చింది. రోహిత్ కన్నా ముందు యూనివర్సిటీల్లో దళిత విద్యార్ధులు అనేకులు ఆత్మహత్య చేసుకున్నా.. దేశవ్యాప్తంగా ఈ విషయాన్ని చర్చిస్తున్నది ఇప్పుడే. నిర్భయ చట్టం లాగా, దళిత విద్యార్ధులకి రక్షణగా ఒక రోహిత్ చట్టం వస్తే ఈ మొత్తం ఆందోళనకి ఒక మంచి ముగింపు కాగలదు. అప్పుడైనా ఉన్నత విద్యాలయాల్లో కొంతలో కొంత వివక్ష తగ్గే అవకాశం వుంది. అయితే అటువంటి చట్టాలు ఇప్పుడు అధికారంలో వున్నవారి నుండి ఆశించడం అత్యాశేమో!

(picture courtesy : Google)

Tuesday 19 January 2016

దళిత ప్రజాప్రతినిథుల దివాళాకోరుతనం


అనగనగా ఒకానొకప్పుడు కాలేజీల్లో, యూనివర్సిటీల్లో విద్యార్ధి సంఘాలు వుండేవి. SFI, AISF, RSU, ABVP, NSUI అంటూ హడావుడి రాజకీయ వాతావరణం వుండేది. ఇప్పట్లా కులసంఘాలు వుండేవి కావు. విద్యార్ధి సంఘాలు ప్రధాన రాజకీయ పార్టీలకి అనుబంధ సంస్థలు కావున, తరచూ వీటిమధ్య గొడవలు జరుగుతుండేవి. వాతావరణం అప్పుడప్పుడు ఉద్రిక్తంగానూ వుంటుండేది. 

కాలక్రమేణా ఎర్రజెండా ప్రాభవం కోల్పోయింది. ఎర్రజెండా స్థానంలో దళిత సంఘాలు క్రియాశీలకంగా ముందుకొచ్చాయి. వీరికి రాజకీయంగా సహజ శత్రువు బ్రాహ్మణీయ ABVP కాబట్టి అనేకచోట్ల ఘర్షణాత్మకమైన వాతావరణం నెలకొనుంది. ఇదిలా వుండగా - కేంద్రంలో బీజేపి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. మతవాద శక్తులకి అధికారం తోడైతే ఇంక ఎదురుండదు. కావున ఇవ్వాల్టి ABVP ఒకప్పటి ABVP కాదు, చాలా బలం సంతరించుకుంది. ఈ నేపధ్యంలో ఆలోచిస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన పరిణామాలు పెద్దగా ఆశ్చర్యం కలిగించవు.

సంఘపరివారానికి ABVP కార్యకర్తలు, VHP నేతలు, కేంద్రమంత్రులు.. అందరూ బిడ్డలే. ఎవరు ఎంత స్థాయిలో వున్నా అన్నదమ్ములు ఒకరికొకరు సాయం చేసుకుంటారు. కాబట్టి యూనివర్సిటీలో జరిగిన ఒక చిన్న ఘర్షణ ఆధిపత్య పోరుగా మారింది. ఈ పోరులో సంఘపరివారానికి చెందిన కేంద్రమంత్రి స్థాయి వ్యక్తి చురుకైన పాత్ర వహించడం ఆశ్చర్యకరమైన పరిణామం కాదు. 

మతతత్వ విద్యార్ధి సంఘానికి కేంద్రమంత్రి స్థాయి వ్యక్తి సంపూర్ణ మద్దతు ఇచ్చినప్పుడు - వివక్షతకి గురవుతూ, తీవ్రమైన కష్టాల్లో వున్న దళిత విద్యార్ధులకి దళిత ప్రజాప్రతినిథులు ఎందుకు అండగా నిలవలేదు!? ఎందుకంటే - మనది నిచ్చెన మెట్ల మనువాది వ్యవస్థ. ఇది ఖరీదైన ముసుగు కప్పుకుని అమాయకంగా కనిపిస్తుంది. అధికారం అందరి చేతిలో వున్నట్లుగానే కనబడుతుంది గానీ - కొందరి చేతిలోనే వుంటుంది.

కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబాన్ని కాదన్నవాడికి మంచినీళ్ళు పుట్టవు. బీజేపిలో RSS విధేయుడిగా లేనివారు వార్డు స్థాయి నాయకుడిగా కూడా ఎదగలేరు. కెరీర్ రాజకీయాల్లో పదవే పరమావిధి. అందుకు చట్ట సభల్లో ఎన్నిక కావడం కీలకం. అందుకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్టు అవసరం. అందుకు పార్టీకి విధేయుడిగా వుండటం అవసరం.

ఈ సీక్వెన్స్ అర్ధం అయితే, సెంట్రల్ యూనివర్సిటీ దళిత విద్యార్ధులకి దళిత ప్రజాప్రతినిథులు అండగా ఎందుకు నిలబడలేదో అర్ధమవుతుంది. దళిత రిజర్వేషన్ వాడుకుని ప్రజాప్రతినిథులుగా ఎన్నికైనవారు 'పైనుండి' ఆదేశాలు రాకపోతే తమవారి వైపు కన్నెత్తి చూడరు (అలా చూస్తే ఏమవుతుందో తెలిసిన బ్రతకనేర్చిన నేతలు కనుక). అధికారం, పదవులు, డబ్బుకున్న పవర్ అట్లాంటిది!

మనువాది పార్టీలు దళితులకి ఎలాగూ శత్రువులే. కనబడే శత్రువు కన్నా కనబడని శత్రువు ప్రమాదకారి. తమ పక్షాన నిలబడని (నిలబడలేని) దళిత ప్రజా ప్రతినిథులకి బుద్ధి చెప్పగలిగి, వారిని శాసించే స్థాయికి దళిత సంఘాలు చేరుకున్న రోజున - అవి శత్రువుని మరింత సమర్ధతతో ఎదుర్కొనగలవు. ఆ విధంగా దళిత చైతన్యం పురోగమించగలిగితే, రోహిత్ వంటి యువకులు మరింత ఉత్సాహంగా పోరాడగలరు. ఆ రోజు సమీప భవిష్యత్తులో వస్తుందని ఆశాభావంతో వుందాం (అంతకుమించి చేసేదేమీ లేదు కనుక).


(picture courtesy : Google) 

Thursday 14 January 2016

శబరిమలై సంప్రదాయ గోడలు


మన ఇంటికి అతిథులు వస్తారు. అందరికీ కాఫీ ఇచ్చి, ఒకరికి మాత్రం మంచినీళ్ళే ఇస్తాం. ఆ మంచినీళ్ళ వ్యక్తి మొదట ఆశ్చర్యపోతాడు, తరవాత చిన్నబుచ్చుకుంటాడు, ఆ తరవాత కోపగించుకుంటాడు. కాఫీ ఆరోగ్యానికి హాని అనీ, అందుకే నీకు ఇవ్వలేదనీ మనం బుకాయించబోయినా అతడు ఒప్పుకోడు. వాస్తవానికి అతనికి కాఫీ తాగే అలవాటు లేదు. అయినా, అందరితో పాటు తనకి కాఫీ ఆఫర్ చెయ్యనందుకు కోపగిస్తాడు. తను కాఫీ త్రాగాలా వద్దా అనేది నిర్ణయించుకోవల్సింది అతడే గానీ మనం కాదు.

కేరళలో శబరిమలై అనేచోట అయ్యప్ప అనే దేవుడు వున్నాడు. నల్ల దుస్తుల్తో (సీనియర్లు కాషాయ దుస్తుల్తో) దీక్ష తీసుకుని దేవుణ్ణి దర్శించుకుంటారు. సంక్రాంతినాడు జ్యోతి కనబడుతుందిట గానీ - దాన్ని దేవస్థానం బోర్డు ఉద్యోగులే చాలా కష్టపడి వెలిగిస్తారని ప్రభుత్వమే వొప్పుకుంది. శబరిమల ఆలయంలోకి 10 నుండి 50 సంవత్సరాల ఆడవాళ్ళకి ప్రవేశం లేదుట. దీనిక్కారణం ఈ వయసు ఆడవాళ్ళు menstruate అవుతారు. 

ప్రజలు నమ్మకాల్నీ, భక్తినీ ప్రశ్నించడానికి సందేహిస్తారు. 'మనకెందుకులే' అనుకుని అలా ఫాలో అయిపోతూ వుంటారు. అయితే కాలం ఎల్లకాలం ఒకేలా వుండదు. ఏదోక రోజు నమ్మకాల్నీ, సాంప్రదాయతనీ ప్రశ్నించేవాళ్ళు బయల్దేరతారు. అంటు, మైల, ముట్టు - మొదలైన ముద్దుపేర్లతో menstrual bleed ని చీదరించుకునేవాళ్ళని చీదరించుకుంటూ కొందరు అమ్మాయిలు happy to bleed అనడం మొదలెట్టారు (పిదప కాలం, పిదప బుద్ధులు). 

'ఉరే భక్త స్వాములూ! మగ ఆడ sexual intercourse చేసుకున్న ఫలితంగా, గర్భాశయంలో తొమ్మిది నెలలు గడిపి, స్త్రీ జననాంగం ద్వారా మీరు బయటకొచ్చారు. మరప్పుడు మీ పుట్టుక అపవిత్రం కాదా?' అనడిగారు. అంతటితో వూరుకోకుండా - 'అయ్యప్పని దర్శించుకునే హక్కు menstruating women అయిన మాకూ వుంది' అంటూ ఎన్నాళ్ళనుండో వస్తున్న 'పవిత్రమైన' ఆనవాయితీని ప్రశ్నిస్తూ కోర్టుకెక్కారు (ఎంత అన్యాయం!).

కోర్టుక్కూడా న్యాయదేవత వుంది. కానీ ఆ దేవత చూడ్డానికి వీల్లేకుండా కళ్ళకి గుడ్డ కట్టేసి వుంటుంది. గౌరవనీయులైన కోర్టువారు చట్టాల దుమ్ము దులిపి నిశితంగా పరిశీలించారు. వాళ్లకి menstruating women కి వ్యతిరేకంగా యే ఆధారమూ కనబడక - 'bleeding women దేవుణ్ణి ఎందుకు చూడకూడదు?' అని తీవ్రంగా హాశ్చర్యపొయ్యారు. 'ట్రావన్కూరు దేవస్థానం వాళ్ళు రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కుల ఉల్లంఘనకి పాల్పడుతున్నారా?' అంటూ కించిత్తు మధనపడుతూ సందేహాన్ని వ్యక్తం చేశారు. అంతిమ తీర్పు ఇంకా రావలసి వుంది. 

సమాజం నిశ్చలంగా వుండదు, నిరంతర మార్పు దాని గుణం. 'ఎందుకు?' అన్న ప్రశ్నకి నిలబడనిదేదైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. 'ఎందుకు?' అన్న ప్రశ్నకి తావు లేని సమాజం నిస్సారమైనది, అనాగరికమైనది. అందుకే - 'ఎందుకు?' అన్న ప్రశ్న చాలా ప్రమాదకరమైనది కూడా! ఈ ప్రశ్న వినపడ్డప్పుడల్లా కొందరు గుండెలు బాదుకుంటూనే వున్నారు. ఆ గుండెలు బాదుకునే వాళ్ళు గుండె పగిలి చచ్చేలా సమాజం ముందుకు పురోగమిస్తూనే వుంది. ఇవ్వాళ శబరిమలైలో అగ్గిపుల్ల రాజుకుంది. ఈ అగ్గి పుల్లతోనే ఆరిపోదనీ, ఇది ఇంకెన్నో మంటల్ని రాజేస్తుందనీ ఆశిస్తున్నాను. 

(picture courtesy : Google)

Wednesday 13 January 2016

రిజర్వేషన్ - ప్రతిభ


నేను పుట్టిన కులానికి రిజర్వేషన్ లేదు. మెడిసిన్ సీట్ వచ్చాక కూడా నాకు కులాలపై సరైన అవగాహన లేదు. కొన్నాళ్ళకి - రిజర్వేషన్లు ప్రతిభని దిగజారుస్తున్నయ్యనీ, OC పేదవారికి అన్యాయం జరిగిపోతుందనీ నమ్మడం మొదలెట్టాను. ఆ తరవాత కొన్నాళ్ళకి రిజర్వేషన్లపై నాకున్న అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను.

ఇదంతా ఒక పరిణామ క్రమం. యే విషయాన్నైనా అవగాహన చేసుకోడంలో ఒక్కొక్కళ్ళు ఒక్కోదశలో స్థిరపడిపోతారు. రిజర్వేషన్ల గూర్చి ఒకప్పటి నా అవగాహన ఆనాడు నాకున్న పరిమితుల్ని సూచిస్తుంది. నాకు రిజర్వేషన్ లేకపోవడం, సైన్స్ విద్యార్ధిని కావడం, రిజర్వేషన్ వల్ల వచ్చిన మెడికల్ సీటుతో చదువుకుంటున్న వారితో పెద్దగా స్నేహం లేకపోవడం నాకున్న పరిమితులు.

రిజర్వేషన్ ప్రతిభని గండి కొడుతుందనే వాదనలో పస లేదు. ఉదాహరణకి మెడిసిన్ సీటుకి కావలసిన కనీస అర్హత ఇంటర్మీడియేట్ బయాలజీ సబ్జక్టుల్తో పాసవ్వడం. కానీ మెడిసిన్ సీట్లు తక్కువ, అర్హులైన విద్యార్ధులు ఎక్కువ అవడం మూలాన మళ్ళీ EMCET అని ఇంకో పరీక్ష పెడుతున్నారు. ఇందుకోసం విద్యార్ధులు ఇంటర్ సబ్జక్టుల్నే మళ్ళీమళ్ళీ చదువుతారు. ఇంటర్మీడియేట్ సబ్జక్టుల జ్ఞానం (దీన్నే 'మెరిట్' అని కూడా అంటారు) సీటు వొచ్చేదాకాననే విషయం గుర్తుంచుకోవాలి.

వొక్కసారి మెడిసిన్ సీటొచ్చాక పూర్తిగా కొత్త సబ్జక్టులు మొదలవుతాయి, కొత్త కోర్సూ మొదలవుతుంది. MBBS సబ్జక్టులు పాసవడానికి ఎవరికీ ఎటువంటి రిజర్వేషనూ వుండదు. అందరికీ ఒకే పరీక్ష, ఒకే కొలబద్ద. కాబట్టి - సామాజికంగా వెనకబడిన విద్యార్ధులకి మెడికల్ కాలేజిలోకి ప్రవేశానికి మాత్రమే రిజర్వేషన్ ఉంటుందని, ఇంకే విధమైన రాయితీలు ఉండవని అర్ధం చేసుకోవాలి.

మన దేశ ఆరోగ్య వ్యవస్థలో ప్రభుత్వాల పాత్ర చాలా ప్రధానమైనది. ఇప్పటికీ గ్రామీణ పేదల అవసరాలు ప్రభుత్వాసుపత్రులే తీరుస్తాయి. ఈరోజుకీ టైఫాయిడ్, కలరా, మలేరియా, డయేరియాలే మన ప్రధాన శత్రువులు. ఈ రోగాలకి వైద్యం అందేది ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లోనే. మనం గమనించవలసినది - ఇక్కడ పన్జేసే వైద్యుల్లో ఎక్కువమంది రిజర్వేషన్ వల్ల డాక్టర్లైనవాళ్ళే.

'ప్రతిభ' ఉండి, రిజర్వేషన్ లేని డాక్టర్లు (ఎక్కువమంది) ఏం చేస్తారు? మెరుగైన వసతుల కోసం అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లకి వలస వెళ్ళిపోతారు. లేదా ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్మిస్తారు. కారణం - వీళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పన్జేసే అవసరం వుండదు (వనరుల సమస్య వుండదు కనుక).

కొందరు వైద్యవిద్యకి గొప్ప బుర్ర కావాలని అనుకుంటారు. నాకిది అర్ధం కాదు. నేననుకోవడం మంచి డాక్టర్ కావాలంటే కావలసింది commitment. గొప్ప తెలివితేటలున్న మెరిట్ విద్యార్ధి PG సీటు కోసం లైబ్రరీల్లో శ్రమిస్తాడు. రిజర్వేషన్ విద్యార్ధులు వార్డుల్లో పేషంట్ల మధ్యన శ్రమిస్తారు. కారణం - వారు MBBS తో గ్రామీణ ప్రాంతాల్లో పన్జేయ్యడానికి మానసికంగా సిద్ధపడిపోయి వుంటారు కాబట్టి. MBBS సబ్జక్టుల్ని టెన్త్ క్లాసులాగా, ఇంటర్మీడియేట్ లాగా లైబ్రరీలలో చదవడం సరైన వైద్యవిద్య కాదు. వైద్యవిద్యకి రోగాల్నీ, పేషంట్లనీ అర్ధం చేసుకోడం ఎంతో అవసరం.

ఇలా అనేకమైన లోపాలతో, priorities తలక్రిందులుగా వున్న వైద్యవిద్య వల్ల రిజర్వేషన్ వున్నా, లేకున్నా committed doctors వచ్చే అవకాశం తగ్గించేసుకున్నాం. ఇవన్నీ లోపలకెళ్తే గానీ కనపడని లోపాలు. కాబట్టి రిజర్వేషన్ల వల్ల ప్రతిభ తగ్గిపోతుందన్నది పసలేని వాదనే అవుతుంది.

నాకు తెలుసు, ఇవన్నీ చాలా ప్రాధమిక పాయింట్లని. కానీ ఈ మాత్రం చెప్పేందుకు నా స్నేహితులు నాకెప్పుడూ అవకాశం ఇవ్వలేదు. ఒకళ్ళిద్దరు ఎగతాళి కూడా చేశారు. ఇది నా బ్లాగ్ కాబట్టి ఈ చిన్ని పాయింటుని ప్రశాంతంగా రాసుకున్నాను (బ్లాగ్రాతల వల్ల కలిగే ప్రయోజనాల్లో ఇది ముఖ్యమైనది)

ముగింపు -

"నాన్నా! ఈ రిజర్వేషన్లు చాలా దారుణం. BC, SC ల వల్ల మనం చాలా నష్టపోతున్నాం." నా కూతురి స్టేట్మెంట్!

"ముందు రిజర్వేషన్లు ఎలా వోచ్చాయో తెలుసుకో. మనకి స్వతంత్రం రాక ముందు.. " అని చెప్పబోతుండగా -

మొహం చిట్లించుకుంటూ నా కూతురు తన బెడ్రూములోకి వెళ్ళిపోయింది!

(picture courtesy : Google)