Showing posts with label మీడియా. Show all posts
Showing posts with label మీడియా. Show all posts

Monday, 17 June 2013

వార్తలు - పత్రికలు



ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక సైంటిఫిక్ పేపర్ స్క్రీన్ షాట్. ఇది 'బ్రిటీష్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ' అనే ఒక మెడికల్ జర్నల్లో ప్రచురితమైన ఒరిజినల్ ఆర్టికల్. ఈ స్టడీ చేసినవారి declaration of interest వివరాలు స్క్రీన్ షాట్ చివర్లో చదువుకోవచ్చు. ఈ వివరాలు ఇచ్చే ఆనవాయితీ సైంటిఫిక్ జర్నల్స్ కి ఉంది. ఇవ్వాలనే నియమం కూడా ఉంది.

అసలీ వివరాలు ఎందుకివ్వాలి? ఒక ఉదాహరణ రాస్తాను. నేను ఒక రోగంలో X అనే మందుని Y అనే ఇంకో మందుతో పోలుస్తూ పరిశోధన చేస్తాను. 'ఈ రోగంలో X అనే మందు Y అనే మందు కన్నా బాగా పనిచేసింది.' అనే ఫలితంతో నా పరిశోధనా పత్రాన్ని సమర్పిస్తాను. అయితే నా పరిశోధనకి X అనే మందు తయారుచేసే కంపెనీవాడు ఆర్ధిక సహాయం చేశాడు. అంటే ఇక్కడ నాకు conflict of interest ఉంది. నా పరిశోధనా పత్రాన్ని చదివేవారికి ఈ సంగతి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అది శాస్త్రీయం. ఇలా చెప్పకుండా ప్రచురిస్తే అది మోసం చేసినట్లే అవుతుంది.

ఇప్పుడు మనం కొద్దిసేపు వార్తాపత్రికల వ్యాపారం గూర్చి మాట్లాడుకుందాం. వార్తాపత్రికల సంస్థలు వార్తలతో వ్యాపారం చేస్తాయి. వార్తాపత్రికల సంస్థలకి ఆదాయంలో అధికభాగం ప్రకటనల ద్వారా వస్తుంది. ఈ ప్రకటనల రేట్లు ఆయా పత్రికల సర్క్యులేషన్ అనుసరించి ఉంటాయి. కాబట్టి ప్రకటనలిచ్చే వ్యాపార సంస్థల ఇంటరెస్ట్ కి ఎటువంటి నష్టం ఉండదు. పత్రికా సంస్థలు వార్తలతో ముద్రితమైన పత్రికల్ని పాఠకునికి అమ్ముకుని మరికొంత ఆదాయం చేసుకుంటాయి. ఇది ఫక్తు వ్యాపారం. అంతిమంగా వార్తల కోసం పత్రికని కొని చదివే పాఠకుడే వినియోగదారుడు.

ఒక వస్తువు కొన్నప్పుడు వినియోగదారుడిగా మనక్కొన్ని హక్కులుంటాయి. ఉదాహరణగా బిస్కెట్ పేకెట్ సంగతే తీసుకుందాం. బిస్కెట్ పేకెట్ కవరుపై సంబంధిత వివరాలు ముద్రించి ఉంటాయి. అవి చదువుకున్నవాడు ఆ బిస్కెట్లు కొనుక్కోవచ్చు లేదా మానుకోవచ్చు. వినియోగదారుడిగా ఆ స్వేచ్చ మనకి ఉంటుంది. ఇక్కడ బిస్కెట్ల తయారీలో వాడిన పదార్ధాల సమాచారం వాటిని కొనబొయ్యేవాడికి తెలియజెయ్యడం అనేది ప్రాధమిక వ్యాపార సూత్రం. ఇప్పుడు ఇదే లాజిక్ ని మన వార్తాపత్రికలకి అన్వయించి చూద్దాం.

మనం మార్కెట్లో ఒక వార్తాపత్రిక వార్తలు తెలుసుకుందుకు కొనుక్కుంటాం. కొనేప్పుడు ఆ వార్తాపత్రిక కంటెంట్ గూర్చి మనకి అవగాహన ఉండదు. ఉదాహరణకి ఒక పత్రిక ఫలానా నాయకుడు అవినీతిపరుడు అని ఒక కథనం ప్రచురిస్తుంది. ఆ కథనం ఆ ఒక్క పత్రికలో మాత్రమే ఉంటుంది. అంటే ఆ కథనం విశ్వసనీయత లేని అసత్య, అర్ధసత్యాల కలయిక, మాటల గారడీ, మోసం. కానీ ఆ విషయం వినియోగదారుడైన పాఠకుడికి తెలీదు. అప్పుడు ఆ కథనాన్ని నిజమనుకునే ప్రమాదం ఉంది.

తనని తప్పుదోవ పట్టించే వార్తల నుండి పాఠకుణ్ని రక్షించాలంటే.. ఆ పత్రికపై పాఠకుడికి పూర్తి సమాచారం ఉండాలి. 'ఈ వార్తాపత్రికలో ఫలానా రాజకీయ నాయకుడు లేదా పార్టీకి అనుకూల అంశాలని మాత్రమే ప్రచురిస్తాం. ప్రతికూల అంశాలని ప్రచురించం. ఈ పత్రిక సొంతదారుడు ఫలానా రాజకీయపార్టీకి పూర్తి అనుకూలుడు. ఈ పత్రిక ఓనర్ ఫలానా రాజకీయపార్టీ తరఫున ఫలానా చట్టసభలో సభ్యుడు.' అంటూ నిజాల్ని వెల్లడిస్తూ తమ వార్తాపత్రిక యొక్క డిక్లేర్డ్ పాలసీని ముందు పేజీలో ప్రముఖంగా ప్రచురించాలి.

ఈ డిక్లరేషన్ లేనప్పుడు సహజంగానే వినియోగదారుడు నష్టపోతాడు. తెలుగు పత్రికలవాళ్ళు వార్తల విశ్లేషణ అంటూ చేటభారతాలు రాస్తుంటారు. మన పత్రికాధిపతులకి, ఎడిటర్లకి రాజకీయమైన లక్ష్యాలు ఉన్నాయి. కావున వారి విశ్లేషణలు.. వారిష్టం. కానీ తమ వివరాలు వెల్లడించకుండా తామేదో సత్యశోధన చేసి నిజాన్ని కనుగొన్నామనే ధోరణిలో విశ్లేషణ రాయడం ఖచ్చితంగా మోసం కిందకి వస్తుంది. ఎందుకంటే అవన్నీ తెలివిగా తమకి అనుకూలంగా రాసుకుంటున్న విశ్లేషణలు కాబట్టి.

కొన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ సభ్యులు, అభిమానుల కోసం వార్తాపత్రికల్ని నడుపుతుంటాయి. సహజంగానే అవి తమ పార్టీ అభిప్రాయాల్ని మాత్రమే ప్రచురిస్తాయి. కావున ఆ పత్రికలు ఎవర్నీ చీటింగ్ చేస్తున్నట్లు కాదు. ఎందుకంటే ఆ ఆ పత్రికల నిస్పాక్షికత పట్ల ఎవరికీ ఏ భ్రమలు ఉండవు కావున.

ఇక జాతీయస్థాయి పత్రికలైతే వార్తల్ని కవర్ చేసే విధానంలో వారి వ్యాపార దృక్పధం, కార్పోరేట్ అనుకూలత స్పష్టంగా కనబడుతూనే ఉంటుంది. వారు ఒక వార్తని తమకి అనుకూలంగా మలచుకునే తెలివితేటల్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు. వార్తని అవసరమైనదానికన్నా ఎక్కువతక్కువలు ఎలా చెయ్యాలో కూడా జాతీయస్థాయి వార్తాపత్రికలకి కొట్టిన పిండి.

ఎందుకనో మొదట్నుండి మన తెలుగువాడికి పత్రికల విశ్వసనీయత విషయంలో పెద్ద పట్టింపు లేదు. చల్లారిన ఇడ్లీ ఇచ్చినందుకో, పెసరట్టులో ఉప్మా తక్కువైనందుకో సర్వర్ మీద ఇంతెత్తున లేవడానికి మాత్రమే మన తెలుగువాడి పౌరుషం పరిమితం. వార్తాపత్రికలు తమ సొంత ఎజెండా ప్రచారం చేసుకుంటూ.. వారి ఎజండా చదవడానికి మనచేతనే మన సొమ్ము ఖర్చు పెట్టించడం అనే మోసాన్ని అంత ముఖ్యమైన విషయంగా భావించడు.

ఉపసంహారం :

ప్రస్తుతం రాజకీయ పార్టీల రాజకీయాల కన్నా వార్తాపత్రికల రాజకీయాలు ఎక్కువైపొయ్యాయి. ఈ ధోరణి మారాలనే ఆశ అయితే ఉంది. ఇది ఇప్పటికిప్పుడు మారదు అనే వాస్తవిక దృక్పధమూ ఉంది. తెలుగు భాష మాట్లాడేవాళ్ళలో అక్షరాస్యత తక్కువ. అక్షరాస్యుల్లో కూడా రాజకీయ అక్షరాస్యత మరీ తక్కువ. వీరి సంఖ్య పెరిగేదాకా పత్రికలు తమ ధోరణి మార్చుకునే అనివార్యత ఏర్పడదు. అప్పటిదాకా మనకీ పక్షపాత వార్తలే శరణ్యం.

(photos courtesy : Google)

Wednesday, 20 March 2013

"తెలుగు న్యూస్ పేపర్లు చదవకురా చెడేవు."


"తెలుగు న్యూస్ పేపర్లు చదవకురా చెడేవు."

"ఇచట తెలుగు వార్తాపత్రికలు నిషేధించబడినవి."

"తెలుగు వార్తాపత్రికలు చదివినవాడు గాడిద."

"ఈ ప్రాంగణమున తెలుగు వార్తాపత్రికలు వీక్షించిన యెడల శిక్షింపబడెదరు."

"తెలుగు వార్తాపత్రికలు చదివినచో పరీక్షల్లో మీకు గుండు సున్నా ఇవ్వబడును."

అదొక హై స్కూల్. ఆ స్కూల్ గోడల నిండా ఇట్లాంటి వాక్యాలు పెద్దపెద్ద అక్షరాలతో నీతివాక్యాల్లా రాయబడి ఉన్నాయి.

ఒక పక్కగా హెడ్మాస్టర్ గారి ఆఫీస్. ఆ గదిలో ఇద్దరు కుర్రాళ్ళు గోడకుర్చీ వేసి ఉన్నారు. ఇంకో ఇద్దరు కుర్రాళ్ళు గుంజిళ్ళు తీస్తున్నారు. వాళ్ళు చేసిన నేరం.. పొరబాటున ఆ రోజు తెలుగు వార్తాపత్రిక చూశారు!

హెడ్మాస్టర్ గారు ఏవో కాయితాలపై సంతకాలు చేసుకుంటూ అంటున్నారు.

"వెధవల్లారా! ఎంత చెప్పినా మీకు బుద్ధి రాదా? 'ఇంక జన్మలో తెలుగు పేపర్లు చదవం' అని రేపటికల్లా వందసార్లు రాసుకు రండి. అర్ధమైందా?"

ఏమిటీ అనర్ధం? ఎందుకీ అరాచకం? ఇక్కడింత జరుగుతున్నా 'అధికార తెలుగు భాషా సంఘం' ఏం చేస్తుంది? హతవిధీ! ఈ దురాగతాన్ని అరికట్టేవారే లేరా?

అసలేం జరిగిందంటే (ఫ్లాష్ బ్యాక్)..

కొన్నాళ్ళ క్రితం ఆ స్కూలుకి స్కూళ్ళ ఇనస్పెక్టర్ గారు వచ్చారు. పిల్లల హాజరు పట్టీ, ఉత్తీర్ణతా శాతాన్ని పరిశీలించిన పిమ్మట స్కూళ్ళ ఇనస్పెక్టర్ గారు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అందుకు కారకుడైన హెడ్మాస్టర్ గారిని ఎంతగానో అభినందించారు.

'ఈ స్కూల్ బహు ముచ్చటగా యున్నది. పిల్లల తెలివితేటలు ఇంకెంత గొప్పగా యుండునో?' అనుకున్న ఇనస్పెక్టర్ గారికి చివరి క్షణంలో పిల్లల జనరల్ నాలెడ్జ్ పరీక్షిద్దామనే గొప్ప ఆలోచన వచ్చింది. అందుకు అనుగుణంగా హెడ్మాస్టర్ గారు పిల్లల్ని సమావేశపరిచారు.

ఆ పిల్లల్లో ఒకడు చురుకుగా, ధైర్యంగా కనిపిస్తున్నాడు. ముందుగా వాణ్ని లేపారు ఇనస్పెక్టర్ గారు.
"నీ పేరేంటి బాబూ?"

"నిఖిల్ రెడ్డి."

"భారత దేశ స్వాతంత్ర్యోద్యమాన్ని ఎవరు నడిపించారు?" ఉల్లాసంగా నవ్వుతూ ప్రశ్నించారు ఇనస్పెక్టర్ గారు.

"వై.యస్. రాజశేఖర రెడ్డి." తడుముకోకుండా చెప్పాడు నిఖిల్ రెడ్డి.

ఇనస్పెక్టర్ గారు ఆశ్చర్యపోయారు.

"రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడెవరు?"

"చంద్రబాబు నాయుడు." ఠకీమని చెప్పాడు నిఖిల్ రెడ్డి.

ఇనస్పెక్టర్ గారికి సమాధానం అర్ధం కాలేదు. బట్ట బుర్ర గోక్కున్నారు.

"నోబెల్ ప్రైజ్ సంపాదించిన ఒక భారతీయుని పేరు చెప్పు."

"వై.యస్. జగన్మోహన రెడ్డి." బుల్లెట్లా సమాధానం వచ్చింది.

ఇనస్పెక్టర్ గారు హెడ్మాస్టారుని చిరాగ్గా చూశారు. హెడ్మాస్టర్ సిగ్గుతో తల దించుకున్నారు.

ఇనస్పెక్టర్ గారు నిఖిల్ రెడ్డి కూర్చోమని చెప్పి ఇంకొకణ్ని లేపారు.

"నీ పేరేంటి?"

"నవీన్ చౌదరి."

"ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎవరు?" మృదువుగా అడిగారు ఇనస్పెక్టర్ గారు.

"ఎన్టీరామారావు." గర్వంగా చెప్పాడా కుర్రాడు.

ఇనస్పెక్టర్ గారికి కళ్ళు తిరిగాయి.

"భారతదేశ ప్రధాన మంత్రిగా ఒకే ఒక్క తెలుగు వ్యక్తి పనిచేశారు. ఎవరాయన?"

"చంద్రబాబు నాయుడు." బల్ల గుద్దినట్లు చెప్పాడు నవీన్ చౌదరి.

ఇనస్పెక్టర్ గారికి గుండె పట్టేసినట్లైంది. నీరసంగా అడిగారు.

"జలియన్ వాలా బాగ్ దురంతానికి కారకుడెవరు?"

"వై.యస్.జగన్మోహన రెడ్డి." సమాధానం బాణం కన్నా వేగంగా దూసుకొచ్చింది.

ఇనస్పెక్టర్ గారు హెడ్మాస్టార్ని కొరకొరా చూశాడు. ఆయన చూపులకి హెడ్మాస్టర్ గారు విలవిలలాడిపొయ్యారు. ఒక్క ఉదుటున లేచి.. విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపొయ్యారు ఇనస్పెక్టర్ గారు. రెండు చేతులూ నెత్తిన బెట్టుకుని ఉసూరుమంటూ కుర్చీలో కూలబడ్డారు హెడ్మాస్టర్ గారు.

పది రోజుల్లో స్కూళ్ళ ఇనస్పెక్టర్ గారి కార్యాలయం నుండి తాఖీదు. మీ స్కూల్ విద్యార్ధుల నాలెడ్జ్ బిలో యావరేజ్ గా ఉన్నందున మీపై ఎందుకు చర్య తీసుకోరాదంటూ షో కాజ్ నోటీస్. హెడ్మాస్టర్ గారు లబోదిబోమన్నారు. ఆనక నిఖిల్ రెడ్డి, నవీన్ చౌదరిలని పిలిపించారు.

"మీ అమ్మ కడుపులు మాడ! మీరు చక్కగా చదివే స్టూడంట్లే కదర్రా! ఆ ఇనస్పెక్టర్ కి తలతిక్క సమాధానాలు చెప్పి నా కొంప కొల్లేరు చేసారేం?" అంటూ ఫేనంత ఎత్తు ఎగిరారు.

నిఖిల్ రెడ్డి, నవీన్ చౌదరిలు ముఖముఖాలు చూసుకున్నారు. తమ తప్పేమీ లేదనీ.. తాము తమ ఇంట్లో తెప్పించే తెలుగు వార్తాపత్రిక క్రమం తప్పకుండా చదువుతున్నామని.. అందులో రాసిన విధంగానే సమాధానాలు చెప్పామని బావురుమన్నారు.

"వార్తాపత్రికల్లో అలా రాశారా!? ఏం పేపర్లురా అవి?"

"......" అని ఒక పేపర్ పేరు చెప్పాడు నిఖిల్ రెడ్డి.

"....." అని ఇంకో పేపర్ పేరు చెప్పాడు నవీన్ చౌదరి.

హెడ్మాస్టర్ గారు ఆశ్చర్యపోయారు. పిమ్మట ప్యూన్ పుల్లారావుతో ఆ రెండు పేపర్లు తెప్పించారు. పావుగంట పాటు రెండు పేపర్లు తిరగేశారు.

'నిజమే! పాపం పసిపిల్లలు! వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఆ పేపరోళ్ళు రాసిందే నిజమని నమ్మారు. నమ్మిందే చెప్పారు.' అనుకుంటూ దీర్ఘాలోచనలో పడ్డారు హెడ్మాస్టర్ గారు.

అటు తరవాత ఇనస్పెక్టర్ గారి షో కాజ్ నోటీస్ కి ఏదో సమాధానం చెప్పుకుని బయటపడ్డారు హెడ్మాస్టర్ గారు. ఆపై స్కూల్ విద్యార్ధులెవరూ తెలుగు వార్తాపత్రికలు చదవరాదనే నిబంధన పెట్టారు. ఆ నిబంధన కనుగుణంగా స్కూల్ గోడల నిండా కొత్త నీతివాక్యాలు రాయించారు. క్రమశిక్షణ తప్పిన పిల్లల్ని కఠినంగా శిక్షించసాగారు.

అయ్యా! అదండీ కథ!

(photos courtesy : Google)

Monday, 28 May 2012

'అపరిచితుడు' అప్పారావు


"జగన్ అరెస్ట్ అన్యాయం, అక్రమం. నేను దీన్ని తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాను. నిన్నట్నుండి మా వంటింట్లో పొయ్యిమీద గండుపిల్లి గురకలు పెట్టి నిద్రోతుంది. రెండునెల్ల పసిగుడ్డుతో సహా ఎవరూ పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టలేదు. నా భార్య జగన్  జైల్నుండి విడుదలయ్యే దాకా కాపురం చెయ్యనంటూ పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికెళ్ళిపోయింది. మా నాన్న 'జగన్బాబూ!' అంటూ గుండెనొప్పితో మెలికలు తిరిగిపోయాడు. ఆస్పత్రిలో చేర్పించాం. ఆయన అటూఇటుగా ఉన్నాడు. మా అమ్మ 'జగన్! జగన్!' అంటూ పిచ్చిపట్టి ఏడుస్తూ ఎటో వెళ్ళిపోయింది. అన్నా! జగనన్నా! నువ్వు పోరాటం సాగించన్నా! నీ వెనక మేమున్నామన్నా! నువ్వు దేవుడవన్నా! జై జగన్!" అంటూ భోరున విలపిస్తూ కూలిపోయాడు అప్పారావు.

"కట్!" చెప్పాడు 'సాక్షి' చానెల్ విలేఖరి

కెమేరామెన్ కెమేరాని సర్దుకుంటున్నాడు.

"ఏం బాబు! ఎమోషన్ బాగా కేరీ అయ్యిందా? కావలంటే ఇంకో టేక్ తీద్దాం." అన్నాడు అప్పారావు.

"అవసరం లేదు. ఇప్పటికే ఎక్కువ చెప్పారు." అన్నాడు 'సాక్షి' విలేఖరి.

అటు తరవాత అప్పారావు భార్య వారికి జీడిపప్పు ఉప్మా, నేతి పెసరట్లు వడ్డించింది.

వాళ్ళ పక్కన కూర్చున్నాడు అప్పారావు.

"మీ ఎడిటర్ తో మాట్లాడండి. ఇప్పుడు చెప్పిన దానికి కొద్దిగా శృతి పెంచమన్నా పెంచుతాను, తగ్గించమన్నా తగ్గిస్తాను. మీ చానెల్ కి నా అభిప్రాయాన్ని చెప్పడానికి ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా వస్తా!" ఫ్రీ ఆఫర్ ఇచ్చాడు అప్పారావు.

అప్పారావు భార్య ఫిల్టర్ కాఫీ ఇచ్చింది.

"మీకు ఏ టాపిక్ మీద బైట్ కావలన్నా నన్ను సంప్రదించండి. రూపాయి పతనాన్ని ఆపలేక దువ్వూరి సుబ్బారావు చేతులెత్తేశాడు. ఆయనతో నాకు లైవ్ షో ఏర్పాటు చెయ్యండి. నా సలహాలకి సుబ్బారావు స్పృహ తప్పిపోవాలి." గర్వంగా అన్నాడు అప్పారావు.

వారికి వేటపాలెం జీడిపప్పు ప్యాకెట్లు చేతిలో పెట్టాడు.

"ఇవి ఉంచండి. గుర్తుంచుకోండి, అప్పడం నుండి అమెరికా దాకా అన్ని సబ్జక్టుల్నీ కరకరలాడించి మింగేశాను. 'పనామాలో పందిమాంసం రేటెందుకు డౌనయ్యింది? ఇరాక్ లో ఉబ్బసానికి చేపమందు పని చేస్తుందా?' వంటి ఎకనామిక్ అండ్ సైంటిఫిక్ కార్యక్రమాల్లో కూడా నా అభిప్రాయం తీసుకోండి." ప్రాధేయపడ్డాడు అప్పారావు.

అప్పారావు ఆతిధ్యాన్ని స్వీకరించి 'బ్రేవ్!' మంటూ సెలవు తీసుకున్నారు 'సాక్షి' వారు.

అలసటగా కళ్ళు మూసుకుని సోఫాలో కూలబడ్డాడు అప్పారావు. తన 'అభిప్రాయం' సాక్షి చానెల్ వాళ్ళకి చెప్పడానికి 'మూడ్' (కన్నీళ్ళు) కోసం వంటింట్లో నాలుగు ఉల్లిపాయలు తరిగాడు. అంచేత కళ్ళు మండుతున్నాయి. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు.


"అప్పు! అప్పు! లేలే! నీ కోసం ఇంకో చానెల్ వాళ్ళొచ్చారు." అంటూ భార్య అరవడంతో ఉలిక్కిపడుతూ లేచాడు.

"నమస్తే! మేం ABN ఆంధ్రజ్యోతి చానెల్ నుండి వచ్చాం. జగన్ అరెస్టు గూర్చి మీ అభిప్రాయం చెబుతారా?" అంటూ ఆ చానెల్ వాళ్ళు వచ్చీ రావడంతోనే మొదలెట్టారు.

అప్పారావు వంటింట్లోకి పరిగెత్తాడు. నిమ్మకాయని కత్తితో రెండు బద్దలుగా కొశాడు. ఒక్కోకంట్లో ఒకబద్ద పిండుకున్నాడు. కళ్ళు ఎర్ర్గగా, చింతనిప్పుల్ల్లా మారిపొయ్యాయి. హాల్లోకొచ్చి కెమెరా ముందు నిలబడ్డాడు.

"కెమెరా స్టార్ట్!"

"జగన్! జగన్! జగన్! అసలెవరీ జగన్? అఫ్టరాల్ ఒక ముఖ్యమంత్రి కొడుకు. విక్రమార్కుడా? కాదు, అక్రమార్కుడు. అవినీతికి కేరాఫ్ అడ్రెస్. ఈ దేశం ఏమైపోతుంది? జగన్ని సమర్ధించేవాళ్ళలారా! ఖబడ్దార్! ఒక విషయం గుర్తుంచుకోండి!" అంటూ కెమెరాలోకి కౄరంగా చూశాడు.

"జగన్ని సమర్ధిస్తే మీరు సద్దామ్ హుస్సేన్, ఒసమా బిన్ లాడెన్ని సమర్ధించినట్లే! జగన్ అవినీతి వల్లే ఎండలు మండిపోతున్నయ్, పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నయ్, సినిమాలు ఫ్లాపయిపోతున్నాయి." అంటూ గర్జించాడు అప్పారావు.

ఆంధ్రజ్యోతి వారిక్కూడా టిఫిన్లూ, కాఫీలు ఎరేంజ్ చేయబడ్డయ్.

తింటున్నవారి పక్కన కూర్చున్నాడు అప్పారావు.

"మొన్నామధ్య మీరు మా ఎదురింటి మంగతాయారుకి, పక్కింటి కృష్ణారావుకీ గల అక్రమ సమ్మందమ్మీద ఎనిమిది గంటల చర్చా కార్యక్రమం నడిపారు. ఎంత బ్రతిమాలినా నాకు మాట్లాడ్డానికి ఛాన్సివ్వలేదు. దయచేసి విలువైన నా అభిప్రాయం కూడా తీసుకోండి. నాకు బయాలజీ నుండి బూర్లెపాకం దాకా అన్ని  సబ్జక్టుల మీద మంచి గ్రిప్పుంది."

ఆంధ్రజ్యోతివాళ్ళు వెళ్ళేప్పుడు నూజివీడు రసాలు, ఆవకాయ జాడీలతో నిష్క్రమించారు.

అప్పారావు భార్యకి అనుమానం వచ్చింది.

"అప్పు! నువ్విట్లా చానెల్ చానెల్ కీ 'అపరిచితుడు'లో హీరోలాగా రంగులు మార్చేస్తున్నావ్. జనాలకి తెలిస్తే ప్రమాదమేమో?"

అప్పారావు నవ్వాడు.

"పిచ్చిమొహమా! అలా చెబితేనే వాళ్ళు చూపిస్తారు. అయినా - ఎవడికి నచ్చిన చానెల్ వాడు చూస్తాడు. ఒకవేళ అన్ని చానెళ్ళు చూసే పని లేని సన్నాసి ఎవడైనా ఉంటే అది వాడి ఖర్మ. సర్లే! నువ్వు వంట పని చూడు. ఈ దెబ్బకి మన పేరు ఆంధ్రదేశంలో మోగిపోవాలి." అన్నాడు అప్పారావు! 

(picture courtesy : Google)