Showing posts with label బాలగోపాల్. Show all posts
Showing posts with label బాలగోపాల్. Show all posts

Wednesday, 15 October 2014

నేరం - రాజ్యస్వభావం


'మనుషులంతా ఒక్కటే!' అనే నినాదం నా చిన్నప్పుడు వినపడేది. ఇప్పుడు వినపడ్డం మానేసింది. మనుషులంతా ఒక్కటయ్యారో లేదో తెలీదు కానీ - మతాల వారీగా, కులాల వారీగా, వృత్తుల వారీగా మాత్రం ఒక్కటయ్యారు.

న్యాయవాదులు, వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు - వివిధ వర్గాలలో అంతర్గతంగా ఎన్ని కుమ్ములాటలున్నా - బయట నుండి ప్రమాదం వచ్చినప్పుడు మాత్రం 'మనమంతా ఒక్కటే!' అనే నినాదంతో కలిసి పోరాడుతారు. ఆ పోరాటం న్యాయానికి వ్యతిరేకమా? అన్యాయానికి అనుకూలమా? అన్నది వారికి అనవసరం. ఇక - ప్రైవేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్, ప్రైవేట్ విద్యా సంస్థలు, కాంట్రాక్టర్లు.. మొదలైన కార్పోరేట్ వ్యాపార వర్గాల వాళ్ళు 'కలసి వుంటే కలదు సుఖం!' అన్న నానుడిని గట్టిగా నమ్మారు. అందుకే వాళ్ళు మంత్రులు, ప్రజాప్రతినిథులుగా కూడా రూపాంతరం చెందారు!

ఈ దేశంలో ప్రభుత్వాలు మారుతుంటాయి. అధికారంలోకి పాతమొహాల స్థానంలో కొత్తమొహాలు వస్తుంటాయి. పాత ప్రభుత్వాల అసమర్ధత, అవినీతి మీద కోపంతో, కసితో - కొత్త ప్రభుత్వాల్ని ఆహ్వానిస్తారు ప్రజలు. కానీ - వాళ్ళు ఆశించినంతగా పాత ప్రభుత్వ అవినీతి బాధ్యులపై నేరారోపణ గానీ, విచారణ గానీ జరగదు (మీడియాలో మాత్రం రోజువారీగా తిట్టుకుంటారు). కారణం - సింపుల్! రాజకీయ పార్టీలు కూడా అంతర్గతంగా ఒక్కటే!

కొందరు అమాయకులు చౌతాలా, లాలూ యాదవ్, జయలలిత వంటి నాయకులకి శిక్ష పడింది కదా! మన రాజ్యంగ వ్యవస్థ పటిష్టంగా పని చేస్తుందని అనుకుంటారు. ఇది కొంత నిజం, కొంత అబద్దం! ఎందుకంటే రాజ్యంగ వ్యవస్థ నేరాల్ని పూర్తిగా నిరోధించదు, రాజ్యంగ యంత్రానికి అవసరమైనంత మేరకు కంట్రోల్ చేస్తుందంతే!

ఈ రాజ్యంగ యంత్రం నేరాన్ని ఎంతమేరకు ఎందుకు అదుపు చేస్తుందో, ఎందుకు వదిలేస్తుందో - 'రావిశాస్త్రి రచనల్లో రాజ్యంగ యంత్రం' అనే వ్యాసంలో బాలగోపాల్ చక్కగా వివరించాడు. నాకీ వ్యాసం గొప్ప జ్ఞానాన్నిచ్చింది.

"ఈ పరస్పరత రెండురకాల అమాయకులకు అర్ధం కాదు. అమాయకులయిన అమాయకులు (వీళ్ళు మొదటిరకం) నేరాన్ని అరికట్టడం, నిరోధించడం రాజ్యంగయంత్రం పని అనుకుంటారు. ఈ కోవకు చెందినవాళ్ళు బడిపంతుళ్ళు, కుర్ర ఐ.ఎ.ఎస్. ఆఫీసర్లు. రండవ రకంది దుస్సాహిసక అమాయకత్వం. రాజ్యంగ యంత్రం నేరాన్నసలు అరికట్టనే అరికట్టదని, నేరం మీద బలవడమే ప్రభుత్వ 'కార్యనిర్వాహకుల' పని అనీ అనుకుంటుంది. ఈ కోవకి చెందినవాళ్ళు సాధారణంగా కవిత్వం రాస్తారు.

అసలు సంబంధం ఇదీ కాదు, అదీ కాదు. బూర్జువా రాజ్యంగ యంత్రం నేరాన్ని సంపూర్ణంగా అరికట్టదు (అది దానికి అవసరమూ కాదు, శ్రేయస్కరమూ కాదు), అలాగని నేరాన్ని పనికట్టుకుని పోషించనూ పోషించదు. అది నేరాన్ని రెగ్యులేట్ చేస్తుందంతే.

సూక్ష్మీకరించి చెప్పాలంటే, నేరం బూర్జువా సమాజపు సంక్షోభాలకి ఒక సేఫ్టీవాల్వు లాంటిది. అవసరమయినపుడు దాన్ని తెరవకపోతే ఒత్తిడికి తట్టుకోలేక ఇంజను పగిలిపోతుంది. అలాగని సేఫ్టీ వాల్వుని ఎప్పుడూ తెరిచే వుంచితే ఇంజను అసలు పనిచేయదు. అంటే దాన్ని రెగ్యులేట్ చేయాలి. అదుపులో వుంచుకోవాలి. సరీగ్గా అదే (నేరానికి సంబంధించి) రాజ్యంగ యంత్రం కర్తవ్యం.

దీనంతటి అర్ధం, రాజ్యంగ యంత్రం నేరాలలో ఏ 20 శాతాన్నో పరిష్కరిస్తుందనీ, నేరస్తులలో ఏ 20 శాతాన్నో శిక్షిస్తుందనీ ఎంతమాత్రం కాదు. నేరం కంట్రోల్‌లో వుంచుకున్నట్లు జనానికి కనిపించడం అసలు విషయాలు. అసలు నేరాలని పరిష్కరించాల్సిన అవసరంగాని, నిజమయిన నేరస్తులను నిజమయిన నేరాలకు శిక్షించాల్సిన అవసరం ఎంతమాత్రం లేవు."

బాలగోపాల్ తన విశ్లేషణ కోసం రావిశాస్త్రి రాసిన 'తలుపు గొళ్ళెం'  అనే కథని (ఋక్కులు సంపుటం), 'మాయ'  అనే కథని (ఆరుసారాకథలు సంపుటం) ఎక్కువగా ప్రస్తావించాడు. చర్చ రావిశాస్త్రి రచనల గూర్చి కాబట్టి బాలగోపాల్ లుంపెన్ వర్గాల నేరాల్ని, పోలీసుల సహకారాన్ని ప్రస్తావించాడు. ఇదే విశ్లేషణని రాజకీయ అవినీతికి కూడా అన్వయించుకోవచ్చు. అప్పుడు ఈ దేశంలోని అంతులేని రాజకీయ అవినీతిలో కొందరు మాత్రమే ఎందుకు శిక్షించబడతారో తెలుస్తుంది.

కావున ఒకళ్ళిద్దరు రాజకీయ నాయకులు జైలు కెళ్ళంగాన్లే ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందని (నాకీ 'ధర్మం - నాలుగు పాదాలు' కాన్సెప్ట్ ఏంటో తెలీదు) మనం ఆనందపడనక్కర్లేదు. ఆ ధర్మం అప్పుడప్పుడూ కుంటుతూ ఒంటికాలుపై నడుస్తుంది - అది రాజ్యంగ యంత్రం అవసరం. ఆ మేరకైనా ఎంతోకొంత మేలు జరుగుతుందని కొందరు ఆశాజీవులు ఆనందించవచ్చు! వారిని అభినందిస్తున్నాను.

(picture courtesy : Google)

Thursday, 3 July 2014

బాలగోపాల్ చెప్పిన 'జలపాఠాలు'


టి.యం.సి. / క్యూసెక్ అంటే ఏంటి?

నదీజలాల మీద ప్రజలకి హక్కులు ఉంటాయా?

జలవివాదాల పరిష్కారానికి చట్టం ఏం చెబుతుంది?

నికర జలాలు / మిగులు జలాల లెక్కలు ఎలా వేస్తారు?

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో కె.ఎల్.రావు 'ఘనత' ఏమిటి?

బచావత్ అనే సుప్రీం కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు (బచావత్ అవార్డు) మనకే ఎందుకు అనుకూలం?

రాష్టాలు సెంట్రల్ ట్రైబ్యునల్ దగ్గర ఎలాంటి (ఏడుపు) వాదనలు చేస్తాయి?

ప్రిస్క్రిప్టివ్ రైట్ అంటే ఏమిటి?

'తెలుగు గంగ'తో మొదలైన మన అక్రమ ప్రాజెక్టుల పరంపర ఎలా కొనసాగింది?

పోతులపాడు గ్రామం పోతిరెడ్డిపాడుగా ఎలా మారింది?

బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ దగ్గర రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వినిపించిన (అసంబద్ధ) వాదన ఏమిటి?

జలయజ్ఞం రైతుల కోసమా? కడప కాంట్రాక్టర్ల కోసమా?

పులిచింతలకి నికర జలాల కేటాయింపు ఎందుకు? అందువల్ల నల్గొండకి జరుగుతున్న నష్టం ఏమిటి?

పోలవరం ప్రాజెక్టు ఆలోచన సరైనదేనా?

కృష్ణాజల 'పునఃపంపిణీ' జరక్కుండా రాయలసీమ కరువు సమస్య తీరుతుందా?


మొన్నామధ్య విజయవాడ బుక్ ఎక్జిబిషన్లో బాలగోపాల్ పుస్తకం 'జలపాఠాలు' కొన్నాను. ఆ తరవాత చదువుదామని తెరిస్తే - పుస్తకంలో చాలా మ్యాపులు, టేబుల్స్, అంకెలు! భయపడిపోయాను. చిన్నప్పటి సోషల్ సబ్జక్టు గుర్తొచ్చింది. నేనేమీ నీటి పారుదల శాఖలో ఇంజనీర్ని కాను, కనీసం రైతుని కూడా కాను. నాకీ విషయాలు తెలీకపోయినా కొంపలేవీ మునిగిపోవు. కావున - పుస్తకాన్ని భద్రంగా బీరువాలో (చదవాల్సిన పుస్తకాల మధ్యన) పెట్టేశాను.

నాల్రోజుల క్రితం నా భార్యతో నాగార్జున సాగర్ గూర్చి మాట్లాడుతున్నప్పుడు తడబడ్డాను, కన్ఫ్యూజ్ అయ్యాను. ఈ సాగునీరు టాపిక్ నాకెంత సంబంధం లేని విషయమైనా, నా పాండిత్యం అజ్ఞానం కన్నా అధమస్థాయిలో వున్నట్లుగా తోచి.. కొంచెం ఇబ్బందిగా అనిపించింది.

అప్పుడు నాకు బాలగోపాల్ 'జలపాఠాలు' పుస్తకం గుర్తొచ్చింది. పుస్తకం అట్టమీద బొమ్మ - బాలగోపాల్ ఏదో వయోజన విద్యాకేంద్రంలో పాఠం చెబుతున్నట్లుగా వుంది. కావున - వయోజనుడనైన నేను కూడా విషయం అర్ధం చేసుకునేందుకు ఒక ప్రయత్నం చేద్దామనిపించింది. 'పుస్తకం ఎక్కడ విసుగు పుడితే అక్కడ మూసేసి, మళ్ళీ బీరువాలోకి నెట్టేస్తే సరి!' అని గట్టిగా నిర్ణయించుకుని 'జలపాఠాలు' పుస్తకం తెరిచి - చదవడం మొదలెట్టాను.

'క్లిష్టమైన విషయాన్ని సరళంగా రాసేవాడు ఉత్తముడు, క్లిష్టాన్ని సంక్లిష్టం చేసేవాడు మధ్యముడు, సరళాన్ని క్లిష్టం చేసేవాడు అధముడు' అని ఇంతకుముందోసారి రాశాను. ఆ లెక్కన చూస్తే బాలగోపాల్ అత్యుత్తముడు! ఎంతో బద్దకంగా పుస్తకం చదవడం మొదలెట్టిన నాచేత పుస్తకం మొత్తాన్ని ఏకబిగిన చదివించేశాడు.

ఈ పుస్తకం చదివిన తరవాత మనం (చదవక ముందు కన్నా) చాలా జ్ఞానాన్ని సంపాదిస్తాం. నదులు, నీళ్ళు, ప్రాజెక్టులు, డ్యాములు, కాలువలు, ఆయకట్టు సాగులెక్కలు, రాష్ట్రాల మధ్య నీళ్ళ తగాదాలు.. ఇదంతా చాలా డ్రై సబ్జక్ట్. అయితే - ఈ సబ్జక్ట్ బాలగోపాల్ చేతిలో పడి చందమామ కథలా మారిపోయింది. పిల్లలక్కూడా అర్ధమయ్యేంత సులభమైన భాషలో రాసిన బాలగోపాల్ శైలి (దీన్ని కొడవటిగంటి కుటుంబరావు శైలి అనవచ్చునేమో) చాలా హాయిగా వుంది.

దాదాపు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్దకి వెళ్ళి అక్కడి స్థానిక ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ (బాలగోపాల్ పనిరాక్షసుడు).. ప్రభుత్వం చెప్పే లెక్కలతో క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బేరీజు వేసుకుని అవగాహన చేసుకుంటూ అధ్యయనం చేసి.. సాధికారంగా, సవివరంగా (వివిధ సందర్భాల్లో) రాసిన వ్యాసాల సంపుటి ఇది. 

బాలగోపాల్ 'లెక్కల పండితుడు'. సాధారణంగా లెక్కల మనుషులకి మనకన్నా బుర్ర ఎక్కువ అని నా అభిప్రాయం. అందుకే బాలగోపాల్ విషయ పరిజ్ఞానం, లోతైన అవగాహన, విశ్లేషణా సామర్ధ్యం - సాహిత్యం గూర్చి రాసినా (రూపం - సారం), మానవ హక్కుల గూర్చి రాసినా.. నన్ను అబ్బుర పరుస్తుంది. ఇప్పుడు ఒక క్వాలిఫైడ్ ఇరిగేషన్ ఇంజనీర్‌లాగా ఈ పుస్తకం! (బాలగోపాల్ గూర్చి తెలీనివాళ్ళు ఆయన్నొక ఇంజనీరుగా భావించే ప్రమాదముంది!)

తెలుగునాట ఈమధ్య మేధావులు ఎక్కువైపొయ్యారు. ఆంధ్రా మేధావులు, తెలంగాణా మేధావులు అంటూ ప్రాంతీయ మేధావులు కూడా ప్రాచుర్యంలోకి వచ్చారు. మేధావులకి ఈ స్థానికత ఏంటో మనబోటి సామాన్యులకి అర్ధం కాదు. ప్రాంతం, భాష వంటి సంకుచిత పరిమితి గీతలు లేని అసలు సిసలు మేధావి బాలగోపాల్. అందుకే ఆయన మన రాష్ట్రం వల్ల మహారాష్ట్ర, కర్ణాటకలకి జరిగిన నష్టాన్ని కూడా నిర్భయంగా, నిజాయితీగా రాయగలిగాడు.

బాలగోపాల్ అభిప్రాయాల్తో అందరూ ఏకీభవించాలని లేదు, అలా ఏకీభవించాలని బహుశా బాలగోపాల్ కూడా అనుకోకపోవచ్చు. కానీ - ఇది ప్రజల ముందు కఠోర వాస్తవాలు ఉంచి ఆలోచింపజేసే పుస్తకం. బ్రిటీషువాడి ఆనకట్టల నిర్మాణం దగ్గర్నుండి పోలవరం దాకా చాలా నిక్కచ్చిగా నిజాల్ని మనముందు వుంచిన 'విషయం వున్న' పుస్తకం. రాజకీయ నాయకులు ప్రజల్ని ఏవిధంగా మోసం చేస్తారో బట్టబయలు చేసే పుస్తకం.

చివరగా - 

మొదట్లో మ్యాపులు, టేబుల్స్ చూసి భయపడ్డాను. కానీ - అవీ పుస్తకానికి చాలా అవసరం, అవే లేకపోతే నాకీ పుస్తకం ఇంత సులభంగా అర్ధమయ్యేది కాదు. అందుకు కారకులైన వేమన వసంతలక్ష్మి, మన్నం బ్రహ్మయ్యలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వారి కృషిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

Monday, 13 May 2013

రావిశాస్త్రి కథ 'తలుపు గొళ్లెం'.. కొన్ని ఆలోచనలు


ఇది ఒక పైడిరాజు కథ. అప్పుడే పుట్టిన (ఒక గంట వయసులో) పైడ్రాజు మురిక్కాలవ పక్కన ఓ ముష్టి దంపతులకి దొరుకుతాడు. పైడ్రాజు రాకతో ముష్టి దంపతులకి 'రాజయోగం' పట్టింది. వాళ్ళు ఎక్కడికెళ్తే అక్కడే ముష్టి. వీరి ముష్టి భోగానికి కన్నుకుట్టిన ఇంకో ముష్టి జంట నాలుగేళ్ల పైడ్రాజుని దొంగిలిస్తారు.

అయితే ఈ రెండో ముష్టి జంట ప్రధానవృత్తి దొంగతనం. పైడ్రాజు కొత్త తలిదండ్రులు వీధుల్లో అడుక్కుంటూనే దొంగతనాలు చేస్తుంటారు. వీరి మోడస్ ఒపరాండి ఏమనగా.. ఒక వీధిలో 'అమ్మా! లచ్చిం తల్లి, బిచ్చవమ్మా' అంటూ కొడుకుతో తల్లి యాచిస్తుండగా.. తండ్రి వారికి రెండిళ్ళ ముందుగా నడుస్తూ.. తాళం వేసున్న ఇళ్ళ తలుపుల గొళ్లెం క్షణంలో తీసేసి.. అడుక్కుంటూనే ముందుకెళ్తాడు.

"గదిలో కెల్లి గిన్నెలొట్టుకురా!" అని తల్లి పైడ్రాజుని లోపలకి పంపి అడుక్కుంటున్నట్లు బయట కాపలా ఉంటుంది. గిన్నెలు తీసుకొచ్చి తల్లి జోలెలో వేసేవాడు పైడ్రాజు. ఆ విధంగా ముష్టి ముసుగులో దొంగతనాలు చేస్తూ హాయిగా జీవించసాగారు. అందుకే ఎక్కడైనా 'తలుపు గొళ్లెం' చూస్తే పైడ్రాజు కి వళ్ళంతా పులకరింపుల్తో నిండిపొయ్యేది.

ఒకసారి జోలెలో చెంబులతో 'దొంగ' తల్లి పట్టుబడుతుంది. మనిషి కష్టాన్ని దోచుకునే దొంగని ఒక వెర్రి కుక్కని కొట్టినట్లు వాళ్ళంతా తన తల్లిని కళ్ళముందు కొడుతుంటే అతను గజగజ లాడేడు. చిల్లరపాముని వాకిట్లో నిర్దయగా మనుషులు కొడుతుంటే, వాకిట కాలవ కన్నం లోంచి పిల్లల తాచు ఆ దృశ్యం చూసినట్లు, అతను జనాన్ని అతిభయంతోనూ పరమ దుర్మార్గంగానూ చూసేడు. ఆ దెబ్బలకి ఆ మర్నాడు ఆ దొంగ తల్లి ఆసుపత్రిలో ప్రాణాలు విడిచింది.

అటు తరవాత నేలమీద ఇళ్ళ బేరం కంటే నీటి మీద ఓడల బేరం ఎక్కువ లాభసాటిగా ఉందని అనుభవం మీద తెలుసుకుని, ఊర్లోంచి హార్బర్లోకి పైడ్రాజు తన సాహస రంగాన్ని మార్చేడు. దొంగతనం చెయ్యడం పైడ్రాజు డ్యూటీ. దొంగసొత్తుని డబ్బుగా మార్చడం దొంగతండ్రి డ్యూటీ.

ఒకసారి హార్బర్లో కొత్త ఓడొకటి వచ్చింది. దాని కడుపు నిండా ఇంగ్లీషు మందులే. పినిసిలిన్ గొట్టాల పాకేజీ పెట్టెల్ని కొట్టుకొస్తాడు పైడ్రాజు. వాటిని ఆప్యాయంగా బిడ్డల్లా కావిలించుకుని,

"చావుకారు కాడికి ఒట్టుకెల్దాం, రా" అన్నాడు దొంగ తండ్రి.

"ఏ చావుకారు?" అని ప్రశ్నించాడు దొంగకొడుకు.


"మందుల్చావుకారు, ఈ మందుల బేరాలన్నీ ఆడియే!"


'చావుకారు' తో బేరం కుదిరి.. కొత్త కన్నెపిల్లలా కరకరలాడిపొతున్న పది పదుల్ని జోబులో వేసుకుని కులాసాగా ఇంటికెళ్ళిపోయారు తండ్రీకొడుకు.

దొంగ తండ్రికి చాల్రోజులుగా దాంపత్య సుఖం లేని కారణాన.. సంచుల సూరిగాడి కంపెనీలో పాతిక ఖర్చు చేసి అమర సౌఖ్యం అనుభవించీసేడు. తద్వారా పోలీసువారి దృష్టిలో పడి.. ఆర్నెల్లు జైలు చేస్తాడు.

జైల్ల్లోంచి బయటకొచ్చాక 'చావుకారు'ని కలిసి.. సంగతి బయట పెడతానని అతన్ని బెదిరిస్తాడు. షావుకారు భార్య భారీ మెరుపు తీగ. షావుకారు మంచి సరసుడైతే ఆవిడ మంచి సరసురాలు. అతను వేరేగా సరసుడు. ఆమె వేరేవేరేగా సరసురాలు. ఒకరి యెడల ఒకరికి ఉండే కోపాలకే గాని రూపాలొస్తే అవి పులులుగా మారి ఒకదాని మీదొకటి విరుచుకుపడి దెబ్బలాడతాయి. ఆ రోజు షావుకారు ఖూనీ చెయ్యబడతాడు. ఆ కేసులో దొంగ తండ్రి ఇరుక్కుంటాడు.

కోర్టు హాల్లోకి వెళ్ళడం, కోర్టు వ్యవహారం దగ్గర్నుండి చూడ్డం అదే ప్రధమం పైడిరాజుకి.

"ఏటీ ఈ ఓసన?" అనుకున్నాడు.


అది కోర్టు వాసనని అతనికి తెలీదు.


"మద్దినాలపేళ దీపాలెట్టుకున్నారేటి?" అనుకున్నాడు.


ఆ గదులు కట్టినప్పుడే చీకటిగా కడతారని అతనికి తెలీదు.


"ఆలీబాబా చినీమాల్లో దొంగల్లా ఇంతమందున్నారు! ఈళ్ళెవుళ్ళు?" అని ప్రశ్నించుకున్నాడు.


"ఓహో! ఈళ్ళే కావోలు పీడర్లు!" అని సమాధానం చెప్పుకున్నాడు.


జడ్జీ పైడ్రాజు సాక్ష్యం నమ్మడు. జడ్జీగారు చాలా విట్టీగానూ, విపులంగానూ రాసిన జడ్జిమెంటు కొనావరకు అలా మెరుపుతీగలా సాగి, ఆఖర్న దొంగతండ్రికి ఉరిశిక్ష విధిస్తూ భగ్గున ముగిసింది.

పుట్టగానే ఏడ్చేడు. వాతలు వేసిన్నాడు ఏడ్చేడు. తల్లిని కొట్టిననాడు ఆమె చనిపోయిననాడూ ఏడ్చేడు. ఆ తీర్పు రోజున ఏడ్చేడు. ఆ తండ్రిని ఉరితీసిన రోజున ఏడ్చేడు - మరింక జీవితంలో ఏడవకూడదని భీకరంగా నిశ్చయించుకున్నాడు పైడ్రాజు.

అప్పుడు పైడ్రాజు దీర్ఘంగా ఆలోచిస్తాడు. పెద్దల్లా దోచుకుతినడం బెస్టు అన్న నిశ్చయానికి అతను రావడానికి అట్టేసేపు పట్టలేదు.

దోచుకు తినడం బెస్టు!!..

అనేటటువంటి పరమ ఘోరమైన నిశ్చయానికి ఏ మానవుడైనా వచ్చి సాహసంతో రంగంలోకి ఉరికి, మెలకువతో వ్యవహరించి పట్టుదలతో పనిచేస్తే!! - వాణ్ణి మరింక ఆపడం చాలా కష్టం. వాడు చాలా దూరం వెళ్తాడు, చాలా పైకి వెళ్తాడు. పాపభీతి, దైవభీతి, సంఘభీతి, ఏ భీతీ ఉండదు వాడికి. వాడు పెద్దపులిలా ఉంటూనే పరమ ధర్మరాజులా కనిపించగలడు. తన బాగు కోసం వాడు తల్లి గొంతు నొక్కగలడు, తండ్రి వెన్ను పొడవగలడు, తమ్ముడి నెత్తురు తాగ్గలడు. లొంగిన వాళ్ళని వాడు అణుస్తాడు, లొంగని వాళ్ళలో కలుస్తాడు. అవసరం తీరిపోయాక నివురంతా కప్పేసుకుంటాడు. దైవం, ధర్మం, అర్ధం, కామం, సంఘం, స్వర్గం అన్నీ తనకోసమే ఉన్నాయి కాని తనెవరికోసమూ ఉండనంటాడు. చెదలా తినేస్తాడు. పులిలా విరుచుకుపడతాడు. దేశాన్ని అమ్ముతాడు, ధర్మాన్ని చంపుతాడు. వాడు చాలా దూరం వెళ్తాడు.

పైడ్రాజు ఆ తరవాత చాలా మెట్లు పైకెక్కి చాలా దూరం వెళ్ళేడు. బ్యాంక్ లొంచి బయటకొచ్చిన ఒక వృద్ధుణ్ణి హత్య చేశాడు. బంగారం కాజెయ్యడం కోసం ఒక మేస్త్రమ్మని చేరదీశాడు. అవసరం తీరాక ఆమెని తన్ని తగలేశాడు. రిక్షా తొక్కిన పైడ్రాజు టీ కొట్టు, ఆపై ఓటేలు, ఒక ఫేక్టరీ, ఆపై చిన్న కాంట్రాక్టరు.. క్రమేణా అత్యంత ధనవంతుడు ఐపోయ్యాడు.

పైడ్రాజు ఇప్పుడెక్కడున్నాడు?

చాలా దూరంలో ఉన్నాడు.


ఆపై పైడ్రాజు భార్య, కొడుకు గురించి కొంత ప్రస్తావించి కథ ముగుస్తుంది.

(ఎర్రరంగు అక్షరాలు రావిశాస్త్రివి)

1965 లో రాయబడ్డ ఈ కథని మొదటిసారిగా ముప్పైయ్యేళ్ళ క్రితం 'ఋక్కులు' సంకలనంలో చదివాను. ఇప్పటిదాకా మొత్తం ఓ నాలుగైదుసార్లు చదివుంటాను. రావిశాస్త్రిని ఇలా మళ్ళీమళ్ళీ చదవడానికి నాకో కారణం ఉంది. నాకు ఉత్తరాంధ్ర మాండలికం సరీగ్గా అర్ధం కాదు. పైపెచ్చు రావిశాస్త్రి శైలి పదాలని కలిపేస్తూ గమ్మత్తుగా ఉంటుంది. అందుకే నేను రావిశాస్త్రిని మార్కర్ తో అండర్ లైన్ చేస్తూ.. మార్జిన్లో అర్ధాలు రాసుకుంటూ.. ఒక టెక్స్ట్ బుక్ చదివినట్లు శ్రద్ధగా చదువుతాను.


బాలగోపాల్ సాహిత్య వ్యాసాల సంపుటి 'రూపం - సారం' గూర్చి ఇంతకు ముందో టపా రాశాను. ఈ సంపుటిలో 'రావిశాస్త్రి రచనల్లో రాజ్యాంగ యంత్రం' అని ఒక వ్యాసం ఉంది. నాకు తెలిసి రావిశాస్త్రిని ఇంత ప్రతిభావంతంగా విశ్లేషించిన వ్యాసం మరొకటి లేదు. "తలుపు గొళ్లంలో కోర్టు వర్ణన చాలా అద్భుతమైనది." అంటూ తన వ్యాసంలో ఈ కథని ప్రస్తావించాడు బాలగోపాల్. చాలామంది విమర్శకుల అభిప్రాయమూ ఇదే.

ఈ కథలో కోర్టుని వర్ణిస్తూ దాదాపు రెండు పేజీలు రాశాడు రావిశాస్త్రి. ప్రతి వాక్యమూ అపురూపమే (కోర్టు వర్ణన టపాకి అనుబంధంగా చివర్లో ఇచ్చాను). తెలుగు భాషలో మరి ఏ ఇతర రచయిత ఇంత అద్భుతంగా ఒక్క వాక్యం కూడా రాయలేడని నా విశ్వాసం. దటీజ్ 'చాత్రిబాబు'! చదివినప్పుడల్లా గొప్ప 'కిక్' వస్తుంది!

ఈ దేశంలో కఠిన చట్టాలు ఉన్నప్పుడే నేరాలు తగ్గుతాయని వాదించేవారు ఈ కథ చదివి తీరాలి. ఈ సమాజంలో అన్యాయం ఎంతగా వ్యవస్థీకృతమై ఉందో రావిశాస్త్రి చాలా నిశితంగా చెబుతాడు. మంచి డాక్టర్ రోగాన్ని అసహ్యించుకోడు. రోగ కారణం గూర్చి ఆలోచిస్తాడు. అప్పుడే అతనికి రోగ నివారణ ఎలాగో తెలుస్తుంది. మంచి రచయిత కూడా అంతే.

రావిశాస్త్రి రచనల్లో రాజ్యాంగ యంత్రం గూర్చి వివరిస్తూ బాలగోపాల్ ఇంకా ఇలా అంటాడు.

'రాజ్యాన్ని గురించీ రాజ్యాంగ యంత్రాన్ని గురించీ వకీళ్ళకి అర్ధమైనంతగా మరెవ్వరికీ కాదేమో! నేరానికీ రాజ్యాంగ యంత్రానికీ మధ్యనున్న సంక్లిష్టమైన పరస్పరత రెండురకాల అమాయకులకి అర్ధం కాదు. అమాయకులైన అమాయకులు (వీళ్ళు మొదటిరకం) నేరాన్ని అరికట్టడం, నిరోధించడం రాజ్యాంగ యంత్రం పని అనుకుంటారు. ఈ కోవకు చెందినవాళ్ళు బడిపంతుళ్ళు, కుర్ర ఐ.ఎ.ఎస్ ఆఫీసర్లు. రెండవ రకంది దుస్సాహసిక అమాకత్వం. రాజ్యాంగ యంత్రం నేరాన్నసలు అరికట్టనే అరికట్టదని, నేరం మీద బలవడమే ప్రభుత్వ 'కార్యనిర్వాహకుల' పని అనీ అనుకుంటుంది. ఈ కోవకి చెందినవాళ్ళు సాధారణంగా కవిత్వం రాస్తారు.'

బాలగోపాల్ రావిశాస్త్రి పరిమితుల గూర్చి కూడా వివరంగా రాశాడు. లంపెన్ వర్గాల జీవితాన్ని ఎంత వాస్తవికంగా చిత్రించినా అది కేవలం వాస్తవిక దృక్పధంగా మాత్రమే మిగిలి పోతుందంటాడు బాలగోపాల్. ఆ రకంగా అంచనా వేసినా.. రావిశాస్త్రి ఎమిలీ జోలా, మొపాసా, చెహోవ్, దోస్తోవస్కీల సరసన ఒక బంగారు పీట వేసి కూర్చోపెట్టేంత గొప్ప రచయిత అని గట్టిగా నమ్ముతున్నాను.

చివరి తోక..

ఈ మధ్య టపాలు రాసే ఉత్సాహం తగ్గిపోయింది. ఇక నా బ్లాగ్జీవితం చరమదశలోకొచ్చిందనే అనుకుంటున్నాను. అయితే మొన్నో పీడకలొచ్చింది. తెలుగు సాహిత్యంలో 'గీకుడురాళ్ళు' రాసిన  ప్రముఖ రచయితకి తరవాత రావిశాస్త్రికి అదేదో ఒక పీట (ఇది కూర్చునే పీట కాదు) వచ్చిందిట.

ఆ సందర్భంగా ఓ ప్రముఖ కళాబంధువు.. నిలువెత్తు రావిశాస్త్రి బొమ్మకి సన్మానం చేయుచుండగా.. 'పాడుతా తీయగా' అనే ఓ ప్రముఖ గాయకుడు రావిశాస్త్రి గూర్చి శంకరాభరణం స్టైల్లో పాడుచుండగా.. వందేళ్ళ తెలుగు కథల వందనాలయ్య రావిశాస్త్రి గూర్చి తనకి మాత్రమే సొంతమైన భయానక బీభత్స వాగ్దాటితో కీర్తించుచుండెను.

ఆ దృశ్యము గాంచి.. భీతి చెందాను, వణికిపొయ్యాను, తల్లడిల్లిపొయ్యాను, దుఃఖించాను. ఫినాయిల్ తో నోరు పుక్కిలించినట్లుగా, గజ్జికుక్క చెక్కిలి నిమిరినట్లుగా, చెవిలో పిశాచాలు పాళీ భాషలో పాట పాడుతూ.. మెదడు పీక్కు తింటున్నట్లుగా అనిపించింది.

ఒక్కసారిగా మెళకువొచ్చింది. మనసంతా దిగులుగా అనిపించసాగింది. తెల్లవారు ఝాము కలలు నిజమవుతాయంటారు. ఏమో! గురజాడ, శ్రీశ్రీలకి లేని రక్షణ రావిశాస్త్రికి ఎక్కణ్నుంచి వస్తుంది? నా పీడకలకి విరుగుడుగా ఏదైనా ఓ రావిశాస్త్రి కథపై టపా రాసి ప్రక్షాళన చేద్దామనిపించింది. ఆ ఫలితమే ఈ పోస్ట్.

అనుబంధం (కొర్టు వర్ణన) :

ఏ దేశంలోనైనాసరే ఎక్కడైనాసరే ఏ ఖుషీ కుర్చీల్లో ఎంత గంభీరంగా ఉండ ప్రయత్నించినాసరే నునుమెత్తని పులుల్లా ఉంటారు. అందమైన తోడేళ్ళలా ఉంటారు. లేదా దుక్కబలిసిన గుంటనక్కల్లా ఉంటారే తప్ప జడ్జీలెవరూ దయగల మనుషుల్లా ఉండరు (అనిన్నీ);

ఏ దేశంలో ఎక్కడికి వెళ్లి చూసినాసరే, సరసరలాడే తాచులాగో పడగెత్తిన నాగులాగో లేక తోక మీద నిలబడి నడిచే జెర్రిపోతులాగో ఉంటాడే తప్ప ఏ ప్లీడరూ కూడా మనిషిలా మాత్రం ఉండడు.. ఛస్తే ఉండడు (అనిన్నీ);

ఏ దేశంలో ఏ మారుమూల ఏ కోర్టుకి వెళ్లి చూసినప్పటికీ అక్కడ కనిపించే పోలీసులూ బంట్రోతులూ గుమాస్తాలూ అంతా కూడా పీడించడానికి యముడు పంపిన స్పెషల్ టైపు పిశాచాల్లా ఉంటారే తప్ప మనుష్యుల్లా కనిపించరు, మనుషుల్లా ప్రవర్తించరు (అనిన్నీ);

ఏ దేశంలోనైనాసరే ఎంత ఉన్నత న్యాయస్థానమైనాసరే దాని ఆవరణలో ఎంత మంచి పూలమొక్కలు పెంచినా వాటికి విషపుష్పాలు తప్ప వేరేమీ వికసించవు (అనిన్నీ);

అక్కడ ఎంత మంచి చెట్టు ఎంత బాగా ఎదిగినప్పటికీ ఆకొక నాలికగా గల వింత రాక్షసిలా ఉంటుంది తప్ప చల్లని చెట్టులా ఉండదు (అనిన్నీ);

అక్కడ ఏ పచ్చని తీగె సాగినా అది పసిరికపాములా ఉంటుందే తప్ప నును లేత పూతీగెలా ఉండదు (అనిన్నీ);

అక్కడ పచ్చటి పచ్చిక పరిస్తే అది పచ్చటి నివురుగప్పిన నిప్పుల తివాచీలా ఉంటుందే తప్ప మరో విధం గా ఉండదు (అనిన్నీ);

అక్కడ మానస సరోవరంలాంటి మంచినీటి చెరువు తవ్వితే అది అభాగ్యుల్ని మింగేసే ముసలి మొసలి గొయ్యిగా కుంచించుకుపోతుందే తప్ప చెరువుగా నిలవదు (అనిన్నీ);

అన్నెంపున్నెమెరుగని అమాయకపు చిలకల్ని అక్కడికి తెచ్చి పెంచితే అవి అక్కడ గెద్దలుగా ఎదుగుతాయి, చిలకలనే చంపుతాయి (అనిన్నీ);

అక్కడ తెల్లని మల్లెపూల మనసులు నాటితే అవి బ్రహ్మజెముడుడొంకలు గా ముళ్ళుముళ్ళుగా చావుచీకటిగా పెరుగుతాయి (అనిన్నీ);

నాలికలతో నిజం తప్ప వేరేదీ ముట్టని వారికి అక్కడికి వచ్చీ రాగానే వెయ్యి విషజిహ్వలొస్తాయి (అనిన్నీ);

అక్కడ చల్లటి నీడ ఉన్నప్పటికీ అది ఎండని మింగిన కొండచిలవలా ఉంటుందే తప్ప, తాపమార్చి ప్రాణమిచ్చే నీడలా ఉండదు (అనిన్నీ);

అక్కడ ఎండ ఉన్నప్పటికీ అది నీడని చంపి నిప్పులు చిమ్మే రక్కసి డేగలా పెనురెక్కల విసురులా ఉంటుందే తప్ప, దివాకరుని దివ్యాతి దివ్యమైన అనుగ్రహం లా ఉండదు (అనిన్నీ);

అక్కడ భగవంతుడు పుట్టించిన దేదీ భగవంతుడు పుట్టించినట్టుగా ఉండదు (అనిన్న్నీ);

అక్కడ దేముడే వెలిస్తే అతను ఠారున చచ్చి అక్కడ తప్పక దెయ్యమే అవుతాడు (అనిన్నీ);

ఏ దేశంలో ఏ కోర్టులో అయినా సరే తడిగుడ్డలు చల్లగా గొంతుకులు పిసుకుతాయి ప్రాణాలు తీస్తాయి తప్ప బాహాటంగా కత్తులు రాపాడవు గదలు ఢీకోవు (అనిన్నీ);

ఏ దేశంలో ఏ కోర్టులో ఎవరు నవ్వినప్పటికీ ఆ నవ్వు రాక్షస వృశ్చికాలు తోకలతో నవ్వినట్లుంటుందే కాని మానవత్వాన్ని సూచించే మనిషి నవ్వుగా సహజంగా నిర్మలంగా నిష్కల్మషంగా ఉండదు (అనిన్నీ);

ఏ దేశంలో ఏ కోర్టయినా సరే అది ఎంత చక్కగా ఎంత మంచి పాలరాతితో ఇంద్రభవనంలా స్వర్గహర్మ్యంగా మలిచినప్పటికీ అది వెన్వెంటనే గుండె లేని గోరీగా మారితీరుతుంది (అనిన్నీ);

ఆ కోర్టు ఎంత "కళ"గా ఉన్నప్పటికీ ఎప్పుడూ తొడతొక్కిడిగా శవాల హడావిడిగా ఉండే శ్మశానంలా ఉంటుందే తప్ప ఇంకో విధంగా ఉండదు (అనిన్నీ);

ఏడ్చే దౌర్భాగ్యులు తప్ప అక్కడ వేరెవరూ మనుషుల్లా ఉండరు (అనిన్నీ);

(photos courtesy : Google)

Monday, 12 December 2011

'శంకరాభరణం' పై బాలగోపాల్

"మీరు తెలుగులో రాస్తున్న వ్యాసాలు కష్టంగా ఉంటున్నాయి. భాషని సింప్లిఫై చెయ్యొచ్చుగా." ఒక సందర్భంలో నేను బాలగోపాల్‌ని అడిగాను.

"నేను చెప్పదలుచుకున్న విషయం రాసేస్తాను. అది అందరికీ అర్ధం అయ్యేట్లుగా రాయలని అనుకోను." బాలగోపాల్ సమాధానం.

నేను ఆయన్ని వదలదల్చుకోలేదు. 

"మరి నా సంగతేంటి? నేనేం చెయ్యాలి?" బాలగోపాల్‌కి ఒక గొప్పప్రశ్న సంధించినందుకు మనసులో భలే ఆనందపడ్డాను. 

'బాలగోపాల్ అభిమానులారా! బీ రెడీ! నేటినుండి బాలగోపాల్ కలం నుండి కుటుంబరావు శైలిలో వ్యాసాలు రాబోతున్నాయి. ఈ క్రెడిట్టంతా నాదే!' 

"తెలుగు నేర్చుకోండి, లేదా నా వ్యాసాలు చదవటం మానేయండి." అన్నాడు బాలగోపాల్. 

నెత్తిమీద నీళ్ళు కుమ్మరించినట్లైంది. ఈ బాలగోపాల్ ఎంత నిర్దయుడు!

ఓ నెలరోజుల క్రితం విశాలాంధ్ర వారి ఎగ్జిబిషన్లో బాలగోపాల్ సాహిత్య వ్యాసాల సంకలనం 'రూపం సారం' కొన్నాను. కె.శ్రీనివాస్ ముందుమాటతో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు. పాతికేళ్ళ క్రితం చేరా, కె.వి.ఆర్., త్రిపురనేని మధుసూదనరావులు రాసిన ముందుమాటల్ని వెనక్కి పంపారు! కారణం తెలీదు.

'రూపం సారం'లో బాలగోపాల్ రాసిన శంకరాభరణం, మాభూమి సినిమా రివ్యూలు చదివాను. చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో చదువుకోడానికి హాయిగా వున్నాయి. అంటే - నేనీ వ్యాసాలు చదవకుండా బాలగోపాల్‌కో గొప్పసలహా ఇచ్చానన్నమాట, అదీ సంగతి!

పుస్తకంలో 'సామాజిక వ్యాఖ్యాత కొడవటిగంటి కుటుంబరావు' అనే చాప్టర్లో కుటుంబరావులాగా క్లిష్టమైన అంశాలు సరళంగా రాయటం ఎంత కష్టమో వివరంగా రాశాడు. కొకు రచనల్ని చాలా సాధికారంగా విశ్లేషించాడు బాలగోపాల్. మాటల్లోలాగే రాతల్లో కూడా - క్లుప్తత, సూటిదనం బాలగోపాల్ సొంతం.  

'రూపం సారం'లో శంకరాభరణం చిత్ర సమీక్ష చదువుతుంటే భలే నవ్వొచ్చింది. బాలగోపాల్ ఇంత సరదాగా కూడా రాయగలడని అప్పటిదాకా నాకు తెలీదు.

---------------------------------------------

శంకరాభరణం - సినిమా సమీక్ష :

ఈ సినిమా బ్రాహ్మణుల వలన, బ్రాహ్మణుల చేత, బ్రాహ్మణుల కొరకు తీయబడిన సినిమా. నేను యిక్కడ 'బ్రాహ్మణుల'ని అంటున్నది కులం చేత బ్రాహ్మణులయిన వాళ్ళను మాత్రమే కాదు. 'భారతీయ సంస్కృతి' గా పిలవబడుతున్న దానికి వారసులుగా తమను తాము భావించుకుంటున్న వారందర్నీ. అంటే భారతీయ విద్యాభవన్ తరహా ఆలోచనా విధానం కలిగిన వారందర్నీ.

కథ క్లుప్తంగా చెప్పాలంటే ఇది సంగీతం పిచ్చి ఉన్న ఒక బ్రాహ్మణుడి కథ. శంకరాభరణం రాగం పాడడంలో అతను సుప్రసిద్ధుడు. ఈ బ్రాహ్మణుడు సంగీతం కోసం ఏమైనా చేస్తాడు. సంగీతాన్ని ప్రేమించే ఒక వేశ్య కూతురి పక్షం వహించి ఆమె కోసం సంఘబహిష్కరణకి కూడా సిద్ధపడతాడు. వాళ్ళు నిజంగానే వెలివేస్తే ఆ కోపాన్నంతా తన ఇష్టదైవం మీద చూపించి ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షాన్ని కురిపిస్తాడు. అపస్వరం పాడిందని తన కుమార్తె పెళ్ళిని దాదాపు చెడగొట్టినంత పని చేస్తాడు. ఆమెకు సాయం చేయబోయినందుకు పెళ్ళికొడుకును కూడా బిక్కచచ్చిపోయేలా చేస్తాడు.

మొత్తం సినిమాలో ఒక సందేశం మన చెవులను పోటెత్తిస్తుంది. సంగీతం, కళలు ఉన్నది కామోద్రేకాల్ని రెచ్చగొట్టటానికి కాదు. లేబర్ క్లాస్ (ఆంధ్రులకి ఇష్టమైన మాటలో చెప్పాలంటే) అశ్లీల అభిరుచులను సంతృప్తి పరచడానికి కాదు. అవి ఉన్నది 'అద్వైత సిద్ధి'కి, 'అమరత్వ లబ్ధి'కి. ఈ సినిమా కొందరి కోసమే అన్నభావం కలిగించే ప్రయత్నం మొదటి నుంచి చివరిదాకా కనిపిస్తుంది. ఎవరో కామెంట్ చేసినట్లు ఇది 'వాళ్ళకు' (అలగా జనానికి) అర్ధమయ్యే సినిమా కాదు.

--------------------------------

శంకరాభరణం సినిమాని రాజకీయ కోణంతో విమర్శించాడు బాలగోపాల్. రంగనాయకమ్మ, రావిశాస్త్రి కూడా అలాగే సమీక్షించారు. సినిమా విమర్శకులకీ రచయితలకీ వున్నా తేడా మనం గుర్తుంచుకోవాలి. 

శంకరాభరణం గూర్చి బాలగోపాల్ వివరంగా రాశాడు. ఆసక్తి ఉన్నవాళ్ళు balagopal.org లో ఇంగ్లీషులో కూడా చదువుకోవచ్చు. 

Friday, 28 October 2011

బాలగోపాల్.. కొన్ని జ్ఞాపకాలు


మన సమాజంలో కులం ప్రభావం బలమైనది. ఈ విషయంపై అనేక చర్చలు, విశ్లేషణలు చదువుతూనే ఉంటాం. మనం ఈ కుల ప్రభావానికి లోనుకాకుండా ఉండాలంటే, ముందుగా సమాజంలో కులంపాత్ర అంచనా వెయ్యగలగాలి. ఇది రాస్తున్నప్పుడు నాకు బాలగోపాల్, ఆయనతో గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి. 

నాకు చంద్ర (బి.చంద్రశేఖర్, న్యాయవాది, పూర్వాశ్రమంలో పౌరహక్కుల నాయకుడు) మంచి మిత్రుడు. అతని ద్వారా నాకు కె.బాలగోపాల్ పరిచయం. బాలగోపాల్ తరచూ గుంటూరు వస్తుండేవాడు. అప్పుడప్పుడు నా స్కూటర్ తీసుకుని ఊళ్ళో పనులు చక్కబరుచుకునేవాడు. ఆ సందర్భంగా మేమిద్దరం కలిసి కాఫీ తాగేవాళ్ళం. 

అప్పటికే పౌరహక్కుల ఉద్యమకారుడిగా బాలగోపాల్ సుప్రసిద్ధుడు. ఆయన సింప్లిసిటీ నన్ను ఆశ్చర్యపరిచేది. బాలగోపాల్ మొహమాటస్తుడు, పేషంట్లు వెయిట్ చేస్తుంటే తనుకూడా వాళ్ళతోపాటు కూర్చునేవాడు. మొదట్లో నా స్టాఫ్ ఆయన్ని పట్టించుకోలేదు. ఎవరో పేషంటుతోపాటు వచ్చినాయన అనుకుని అలాగే వెయిట్ చేయిస్తూ వుంచేవాళ్ళు. అటుతరవాత నేను బాలగోపాల్ పట్ల చూపించే మర్యాద, గౌరవం గమనించి ఆయన్ని హడావుడిగా కన్సల్టేషన్ రూంలోకి పంపేవాళ్ళు.  

బాలగోపాల్ మొహమాటస్తుడు గదాని మనం మోసపోకూడదు. విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా, నిక్కచ్చిగా మాట్లాడతాడు. ఒకసారి కాజువల్‌గా అన్నాను - 'తెలుగు వ్యాసాలు సంక్లిష్టంగా రాయటంలో మీరు కె.వి.రమణారెడ్డిగారితో పోటీ పడుతున్నారు' అని. 

'మీరు తెలుగు ఇంకొంచెం నేర్చుకోండి.' అంటూ మొహం మీద గుద్దినట్లు సమాధానం చెప్పాడు బాలగోపాల్

బాలగోపాల్ నా దగ్గరకి వచ్చినప్పుడల్లా కాఫీ ఇవ్వకుండా పంపేవాణ్ని కాదు. అందుక్కారణం - ఆయన్తో కొద్దిసేపు మాట్లాడే ఆవకాశాన్ని వదులుకోకూడదనే నా స్వార్ధం!  

ఒక కాఫీ సమయంలో హఠాత్తుగా అడిగాడాయన.

"మీదే కులం?"

"మీరు.. ఈ ప్రశ్న.. " ఆశ్చర్యంగా చూశాను.

నా ఆశ్చర్యాన్ని పట్టించుకోకుండా స్థిరంగా, స్పష్టంగా అన్నాడు బాలగోపాల్. 

"ఇక్కడ నేను మీతో బంధుత్వం కలుపుకోటానికి కులం అడగట్లేదు. మనమంతా కులరహిత సమాజం కావాలనుకుంటున్నాం. ముందుగా కులం మనమీద చూపిస్తున్న ప్రభావాన్ని గుర్తించగలగాలి. అప్పుడే గదా దాంట్లోంచి బయటపడగలిగేది. నేను పుట్టుకతో బ్రాహ్మణ్ణి. నా అవగాహన, ఆలోచన కొన్నిసార్లు నా కులానికి గల పరిమితులకి లోబడే ఉంటాయి. అది నా తప్పు కాదు. మనమందరం ఈ చట్రంలోంచి బయటపడ్డానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. మనని మనం సంస్కరించుకోవటం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఉదాహరణకి మీరు దళితులనుకుందాం. నాకా విషయం తెలీనప్పుడు మిమ్మల్ని నేను సరీగ్గా అర్ధం చేసుకోలేను. కొంతమంది కులం పేరెత్తితేనే ఏదో తప్పుగా చికాకు పడతారు, కులాన్ని గుర్తించకపోవడం సరికాదు."

ఇంకో సందర్భం -

ఇంకో కాఫీ సమయం.

"సమాజంలో కులప్రభావాన్ని తక్కువగా అంచనా వెయ్యకూడదు. నేను కిడ్నాప్ అయ్యానన్న వార్తని పత్రికలు విపరీతంగా కవర్ చేశాయి. పత్రికలు అంతలా కవర్ చెయ్యటం వెనుక కూడా కులప్రభావం ఉండొచ్చు."

"ఎలా?"

"మన పత్రికల్లో ఎడిటర్లు, రిపోర్టర్లు ఎక్కువమంది బ్రాహ్మణులు. నా రాజకీయాలు వాళ్లకి నచ్చకపోయినా, మనవాడేనన్న కులాభిమానం వాళ్లకి ఉండి ఉండొచ్చు." అన్నాడు బాలగోపాల్.

మాటల్లో క్లుప్తత బాలగోపాల్ సొంతం. ఒక్కోసారి ఆయన్తో మాట్లాడుతూ వుండిపోవాలని అనిపిస్తుంది. కానీ ఆయన చాలా బిజీ - నలిగిన చొక్కాతో, చెదిరిన క్రాఫుతో హడావుడిగా వెళ్లిపోతాడు. బాలగోపాల్ సర్! ఐ సెల్యూట్ యు.  

(photo courtesy : Google)