Showing posts with label ఘంటసాల. Show all posts
Showing posts with label ఘంటసాల. Show all posts

Thursday, 8 August 2013

ఘంటసాల = మొహమద్ రఫీ



మంచి పాట అనగానేమి? నాకు తెలీదు. అయితే మంచి పాటలకి రంగు, రుచి, వాసన ఎలా ఉంటాయో మాత్రం తెలుసు. అవన్నీ ఒక్క ఘంటసాల పాటల్లోనే ఉంటాయి. పోస్టు కార్డు మీద మా ఇంటి ఎడ్రెస్ ఎంత ఖచ్చితంగా రాయొచ్చో.. అంతే ఖచ్చితత్వంతో మంచి పాటలకి కేరాఫ్ ఎడ్రెస్ ఘంటసాల అని రాయొచ్చునని నమ్ముతున్నాను.

నాకింకో నమ్మకం కూడా ఉంది. సంక్రాంతి పండక్కి అమ్మ చేసే అరిసెలు అత్యంత రుచికరంగా ఉంటాయి. అవి తింటుంటే 'జీవితమే మధురము' అనిపించేది. అప్పటికి నాకు పీచు మిఠాయి, సాయిబు కొట్లో నిమ్మ తొనల రుచి కూడా పరిచయమే గానీ.. అవేవీ అరిసెలకి సరి రావు. అందువల్ల సృష్టిలో అరిసెల కన్నా రుచికరమైనదేదీ లేదని గట్టిగా నమ్మాను.

ఒక విషయాన్ని తిరుగులేని వాస్తవంగా అంగీకరించినప్పుడు.. ఇంకే విషయాన్ని ఒప్పుకోటానికి ఇష్టపడం. ఇందుకు కారణం మన అభిప్రాయమే నిజమైనది అనే ఆత్మవిశ్వాసం లేదా అహంకార పూరిత అజ్ఞానం కారణం కావచ్చు. నాకీ రెండూ మెండుగా ఉన్నాయి కావున.. ఈ భూమండలము నందు ఘంటసాల దరిదాపుల్లోకొచ్చే గాయకుడు లేడనీ.. అమ్మ చేతి వంటతో పోల్చదగిన మధురమైన వంటకం మరేదీ లేదనీ (బల్ల గుద్దకుండానే) వాదించేవాణ్ని.

ఇలాంటి స్థిరమైన అభిప్రాయంతో ప్రశాంతంగా జీవిస్తున్న నా జీవితంలో ఓ రోజు ఉన్నట్లుండి కలకలం రేగింది. ఒక (శుభ) దుర్దినాన నాన్న బజార్నుండి నేతి మైసూరుపాకం కొనుక్కొచ్చాడు. ఘుమఘుమలాడుతున్న ఆ మైసూరుపాకం నుండి ఒక ముక్క తుంచి నా నోట్లో పెట్టింది అమ్మ. ఏమి ఈ రుచి! ఇంత అద్భుతముగా యున్నదేమి! నా ప్రమేయం లేకుండానే మైసూరుపాకం ముక్క నోట్లో కరిగిపోయి పొట్టలోకి జారిపోయింది. అదంత తొందరగా కరిగిపోయినందుకు మిక్కిలి విచారించాను. ఇంకోముక్క నోట్లో వేసుకున్నాను. ఈ సృష్టిలో ఇంత గొప్ప రుచి ఉన్నట్లు ఇన్నాళ్ళు నాకెందుకు తెలీలేదు? తెలీనందుకు కించిత్తు చింతించాను. అటు తరవాత మైసూరుపాకం నాకిష్టమైన పదార్ధాల లిస్టులోకొచ్చి చేరింది.

నా చిన్నప్పుడు బావిని, బావిలో నీళ్ళని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. భూమికి బొక్క పెడితే నీళ్ళెందుకొస్తాయబ్బా! అని తీవ్రంగా ఆలోచించేవాడిని. అమ్మ నీళ్ళు తోడుతున్నంతసేపు ఆ బావిలో నీళ్ళని చూస్తూ సంబర పడుతుండేవాణ్ని. ఒకసారి రామకోటి ఉత్సవాల సందర్భంగా అగ్రహారంలో ఉన్న రామనామ క్షేత్రంకి వెళ్లాను. అక్కడ అందరూ దేవుడికి మొక్కుతుంటే.. నేను మాత్రం గుడి మధ్యలోనున్న కోనేరుని ఆశ్చర్యంగా చూస్తుండిపొయ్యాను. ఒక్కసారిగా వంద బావులు కలిపి చూసిన భావన కలిగింది.. భీతి కూడా కలిగింది. అందుకే అమ్మ చెయ్యి మరింత గట్టిగా పట్టుకున్నాను.

ఆ తరవాత కృష్ణ పుష్కరాలకి బెజవాడ వెళ్లాను. అక్కడ కృష్ణానదిని సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండిపొయ్యాను. ఈ ప్రపంచంలో ఇన్ని నీళ్ళున్నాయా! నాకు కృష్ణమ్మ సృష్టిలోని అనంత జీవకోటికి తల్లిగానూ.. స్నానమాచరిస్తున్న భక్తులు ఆవిడ బిడ్డల్లాగానూ అగుపించారు. నాకానాడు ఒక సత్యం బోధపడింది. ఈ అనంతవిశ్వంలో మనం రేణువులం మాత్రమే. మనం బ్రతకడం కోసం దేవుడే నీరు, నిప్పు, ఆహారం.. ఇత్యాది రూపాల్లో మనకి అందుబాటులో ఉంటాడు.. కనిపెట్టుకునీ ఉంటాడు.. వెధవ్వేషాలేస్తే బుద్ధీ చెబుతాడు.




నేను మొదటిసారి మైసూరుపాకం తిన్నపుడు, మొదటిసారి కృష్ణానదిని చూసినపుడు కలిగిన అనుభూతే.. ఆ తరవాత మొదటిసారి మొహమద్ రఫీ పాట విన్నప్పుడు కలిగింది. చాలా ఏక్సిడెంటల్ గా మొహమద్ రఫీ వినడం తటస్థించింది. అది బైజూ బావ్రా సినిమాలోని 'ఓ దునియా కే రఖ్ వాలే' పాట. పరాకుగా వినడం మొదలెట్టిన నేను.. కొన్ని క్షణాల తరవాత ఆసక్తిగా వినడం మొదలెట్టాను. పాట వింటున్నకొద్దీ ఆర్ద్రతకి గురైనాను. సంగీతానికి రాళ్ళు కరుగుతాయంటారు. ఆ రాళ్ళ సంగతేమో కానీ నేను మాత్రం పూర్తిగా కరిగి నీరైపొయ్యాను. సంగీతంలో ఓనమాలు కూడా తెలీని నేను అంతటి భావోద్వేగానికి గురవ్వడం నాకే ఆశ్చర్యం కలిగించింది.

ఆ రోజు రఫీ నాలో కలిగించినవ అలజడి ఇంతంత కాదు. అంతలోనే ఏమూలో ఒక చిన్న అనుమానం. స్వీట్ల దుకాణంవాడు రుచి కోసం ఇచ్చే శాంపిల్ ముక్క మంచిది ఇస్తాడు. తీరా ప్యాక్ చేసేప్పుడు నాసిరకం సరుకు కట్టి మోసం చేస్తాడు. ఆ మోసం ఇంటికెళ్ళి చూస్తేగానీ అర్ధం కాదు. అంచేత అనుమాన నివృత్తి కోసం రఫీ పాడిన మరికొన్ని పాటలు విన్నాను. సందేహం లేదు.. ఈ రఫీ సామాన్యుడు కాదు. ఇతగాడు మన ఘంటసాల సహాపంక్తిన కూర్చుండబెట్టడానికి అన్ని విధాల అర్హుడు.

అటుతరవాత నాలో పెద్దగా కన్ఫ్యూజన్ లేదు. ఈ ప్రపంచంలో కృషి ఉంటే ఏదైనా సాధించగలం అంటారు. కానీ కృషి ఉన్నా సాధించలేనివి కొన్ని ఉన్నాయి. దాన్నే వృధాప్రయాస అని కూడా అంటారు. సముద్రంలో నీటిని కొలవలేం. ఆకాశానికి హద్దు కనుక్కోలేం. ఘంటసాల, రఫీల ప్రతిభని అంచనా వెయ్యలేం. ఇవన్నీ చెయ్యబూనటాన్నే 'వృధాప్రయాస' అంటారని అనుకుంటున్నాను.




నీలాకాశం, చల్లని వెన్నెల, చిరుజల్లు, కోయిలమ్మ గానం, పసివాని నవ్వు.. ఇవన్నీ సృష్టిలో భగవంతుని అద్భుతాలు. వీటిని ఆస్వాదించడానికి టైం లేనివాడు బ్రతికి ప్రయోజనం లేదు. తుచ్చమానవజాతి యొక్క బ్రతుకు ఎడారిలో ఇసక కొండల్లా నిస్సారంగా, నిస్తేజంగా మారిపోయ్యే ప్రమాదాన్ని నివారించడానికి ఆ దేవుడిచే మనకోసం పంపబడ్డ 'గంధర్వులు ఆన్ స్పెషల్ డ్యూటీ' రఫీ అండ్ ఘంటసాల అని నా నమ్మకం.

వీళ్ళిద్దరూ సినిమాల్లో పాడినందుకు నిర్మాతల దగ్గర ఏంత సొమ్ము తీసుకున్నారో నాకు తెలీదు కానీ నేను మాత్రం వారికి ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనంతగా ఋణపడిపోయాను. సైకియాట్రిస్టులు మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు మార్గాలు ఎంచుకోమంటారు. రఫీ, ఘంటసాలల పాటలు వింటూ ఉండడం అనేది మానసిక ప్రశాంతతకి నేషనల్ హైవే వంటిదని నమ్ముతున్నాను.

నువ్వు చక్కగా చదువుకున్నావా? గుడ్. మంచి ఉద్యోగం చేస్తున్నావా? వెరీ గుడ్. సమాజహితం గూర్చి కూడా ఆలోచిస్తున్నావా? వెరీవెరీ గుడ్ (అనాదిగా మంచి చదువుతో సమాజహితానికి లంకె కుదురుతుంది గానీ 'మంచి' వ్యాపారంతో లంకె కుదరదు). నువ్వు ఘంటసాల, రఫీల పాటలు వినడం లేదా? అయితే నీ బ్రతుకు వృధా. అర్జంటుగా ఎందులోనన్నా దూకి చావు!




ఇప్పుడు నన్నెంతగానో  ఆనందింపచేసిన 'బైజూ బావ్రా' పాట గూర్చి రాస్తాను. నౌషాద్ సంగీతం వహించిన ఈ సినిమా 1952 లో విడుదలైంది. భరత్ భూషణ్, మీనాకుమారి హీరో హీరోయిన్లుగా చేశారు. (కొంతకాలం పాటు బైజూ బావ్రా అనేది మన జయభేరి సినిమాకి హిందీ వెర్షన్ అనే భ్రమలో ఉన్నాను).

అక్బర్ ఆస్థాన గాయకుడు తాన్ సేన్. ఆ రాజ్యంలో తాన్ సేన్ అనుమతి లేనిదే ఎవరూ పాడరాదు. అలా పాడినందున బైజూ తండ్రిని భటులు కొడతారు. ఎప్పటికైనా తాన్ సేన్ మీద ప్రతీకారం తీర్చుకోమని బైజూని కోరుతూ తండ్రి మరణిస్తాడు. బైజూ ఒక పడవ నడిపేవాని కూతురు గౌరీ (మీనాకుమారి) తో ప్రేమలో పడతాడు. బైజూ సంగీత గురువు తన శిష్యుడు శోకంతో ఉన్నప్పుడు అద్భుతంగా పాడటం గమనిస్తాడు. బైజూని వెతుక్కుంటూ వచ్చిన గౌరీని పాము కాటేస్తుంది.

గౌరీ మరణించిందనుకుని దుఃఖంలో దేవుణ్ని ఉద్దేశిస్తూ పాడటం మొదలెడతాడు బైజూ. గొప్ప కళాకారుల జీవితాలకి కష్టాలు, కన్నీళ్లు అంటిపెట్టుకునుంటాయి. బహుశా ఇదొక ఆనివార్యమైన స్థితేమో. (రాజుల మెప్పు కోసం రాజప్రసాదాల్లో మంద్రస్థాయిలో శాస్త్రీయ కూనిరాగాలు తీసే కడుపునిండిన కళాకారులు ఇందుకు మినహాయింపు).

మీరు నేను "నందుని చరిత - ఘంటసాల ఘనత" అంటూ రాసిన పోస్ట్ చదివే ఉంటారు. అక్కడ కాశీ కూడా అంతే! ఆవేశం, ఆవేదన కలిగి గొంతు పగల కొట్టుకుంటూ పాడతాడు. ఇక్కడ బైజూ కూడా దుఃఖంతో రోదిస్తూ పాడిన పాట 'ఏ దునియా కె రఖ్ వాలే'. దేవుణ్ని వేడుకుంటూ, కించిత్తు నిందిస్తూ, రోదిస్తూ.. పిచ్చివాడిలా (అన్నట్లు 'బావ్రా' అంటే పిచ్చివాడు అని అర్ధం) తిరుగుతూ పాడిన పాట ఇది.

ఇంతకుముందు "మధుబాల డార్లింగ్" అనే పోస్టులో 'ప్యార్ కియా తో డర్నా క్యా?' అనే పాటకి నేను చేసిన అనువాదంలో చాలా తప్పులు దొర్లాయి. అందుకు కారణం నెట్లో ఆ పాటకి ఇచ్చిన ఆంగ్ల అనువాదం! అసలు భాష తెలీకుండా కొసరు భాషలోంచి తర్జుమా చేస్తే ఇట్లాంటి అనర్ధాలే సంభవిస్తాయి. కావున ఈసారి తెలుగు అనువాదం చేసే సాహసం చెయ్యను. మీరే అర్ధం చేసుకొండి.




ఇప్పుడు నౌషాద్ ఆలి గూర్చి రెండు ముక్కలు. నౌషాద్ మనం మెచ్చిన అనేకమంది సంగీత దర్శకులకి అభిమాన సంగీతకారుడు. ఉదాహరణకి మన ఎస్. రాజేశ్వరరావుకి నౌషాద్ అంటే అమితమైన ఇష్టం. నౌషాద్ బాణీలు ఎక్కువగా శాస్త్రీయ సంగీత వరసల్ని ఆధారం చేసుకుని ఉంటాయి. నౌషాద్ సంగీతంలో నాకు మరీమరీ నచ్చే అంశం ఆయన orchestration. ఆయన వాడే ప్రతి instrument గాయకుల గొంతుతో (vocals) పెనవేసుకుపోతుంది. ఇది నాకు చాలా విశేషంగా తోస్తుంది. ఈ పాట జాగ్రత్తగా వింటే మీరు కూడా నా పాయింట్ ఒప్పేసుకుంటారు.

'బైజూ బావ్రా' లోని ఈ పాట స్థాయి భారతదేశంలో అతితక్కువ పాటలకి మాత్రమే ఉందని నా నమ్మకం. ఈ పాట ఇక్కడ ఇస్తున్నాను. ఎంజాయ్ ద సాంగ్.



(photos courtesy : Google)

Wednesday, 19 June 2013

ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి



"నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కొడుకుని మాత్రం పెళ్ళికి ఒప్పించాలి." నా ప్రాణస్నేహితుని విన్నపం. పాపం! మరీమరీ అడుగుతుంటే కాదనలేకపొయ్యాను. అంచేత ఇవ్వాళ ఆఫీసు నుండి డైరక్టుగా స్నేహితుడి కొంపకే తగలడ్డాను.

మావాడి పుత్రరత్నం లాప్ టాప్ లోకి తీవ్రంగా చూస్తూ ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. వీణ్ని చిన్నప్పుడు ఎత్తుకుని తిరిగాను. అంతలోనే ఎంతవాడైపొయ్యాడు!

"ఏవాఁయ్! పెళ్లి ఎందుకొద్దంటున్నావో తెలుసుకోవచ్చా?" అంటూ పలకరించాను.

"పెళ్లి చేసుకోవటం వల్ల లాభమేంటి?" కుర్రాడు క్విజ్ మాస్టర్లాగా ప్రశ్నించాడు.

"భలేవాడివే! అన్నీ లాభాలే. ఎలాగూ లాప్టాప్ ముందే ఉన్నావుగా. ఓసారి యూట్యూబులో నేచెప్పిన పాట పెట్టు." హుషారుగా అన్నాను.

"ఏ పాట?"

"దేవత అనే సినిమాలో 'ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి' అని కొట్టు." అంటూ తొందరపెట్టాను.


"ఇదిగో కొడుతున్నా."




"పాట బాగానే వుంది. కానీ ఈ పన్లన్నీ నాక్కాబోయే భార్య చేస్తుందా?" సందేహంగా అడిగాడు. 

"ఎందుకు చెయ్యదు! మా ఆవిడ ఈ రోజుకీ నాకివన్నీ చెయ్యట్లేదా? అసలావిడ ఈ పాటలో సావిత్రికిలాగ నా తలని రోజూ అదేపనిగా దువ్వడం వల్లనే నాకీ బట్టతలొచ్చింది తెలుసా?" అంటూ నా బట్టతల రహస్యం విప్పాను.

"నిజంగా!" కుర్రాడి మొహంలో వెలుగు.

"మరేంటనుకున్నావ్? రౌతు కొద్దీ గుర్రం. అంతా మనలోనే ఉంది." రహస్యం చెబుతున్నట్లుగా అన్నాను.

"అయితే సరే. నేను పెళ్లి చేసుకుంటాను." సిగ్గుపడుతూ చెప్పాడు.

నా ప్రాణస్నేహితుడు గుమ్మడి స్టైల్లో నా రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు.

"నీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను." డైలాక్కూడా గుమ్మడిదే!

టైం చూసుకుని హడావుడిగా ఇంటికి బయల్దేరాను.

హాల్లో సోఫాకి నిండుగా కూర్చునుంది నా భార్యామణి. రిమోట్ ని పుర్ర చేత్తో పట్టుకుని ఠపాఠపామంటూ చానెల్స్ మారుస్తుంది. నన్ను చూడంగాన్లే ఇంతెత్తున లేచింది.

"ఏవిటయ్యా ఇది? మనిషన్న తరవాత బుద్దీజ్ఞానం ఉండఖ్ఖర్లా? ఆఫీసు నుండి తిన్నగా ఇంటికి రాకుండా మధ్యలో నీ బోడి పెత్తనాలేంటి? ఇంట్లో పన్లన్నీ నీ బాబుగాడు చేస్తాడనుకున్నావా? ఇంత లేటుగా వస్తే అంట్లెప్పుడు తోముతావ్? వంటెప్పుడు చేస్తావ్?" అంటూ సూర్యకాంతంలా గాండ్రించింది.

"ఆఁ.. ఆఁ.. వచ్చె.. వచ్చె.. అయిపోయింది. ఎంతలో పని? చిటికెలో అవగొట్టనూ!" అంటూ వంటింట్లోకి పరిగెత్తాను.

(photo courtesy : Google)

Monday, 15 April 2013

"ఇంతేరా ఈ జీవితం.. తిరిగే రంగులరాట్నం!"


ఒక ముఖ్యమైన పెళ్లి. తప్పకుండా వెళ్ళాలి, వెళ్లి తీరాలి. అంటే పెళ్ళి ముఖ్యమైనదని కాదు. వెళ్ళకపోతే ఆ పెళ్ళికి పిలిచినవాడు రక్తకన్నీరు కారుస్తాడు, ఆపై నాతో స్నేహం మానేస్తాడు, నన్నో శత్రువుగా చూస్తాడు. ఈ వయసులో కొత్త స్నేహాల్ని వెతుక్కునే ఓపిక లేదు. అందుకని చచ్చినట్లు వెళ్ళాలి. ఆ రకంగా ఇది చాలా ముఖ్యమైన పెళ్లి.

మా ఊళ్ళో ఆటో ప్రయాణం నాకు ఇష్టమని చెబుతూ "నా పులి సవారి (ఇది చాలా డేంజర్ గురూ!)" అంటూ ఒక టపా రాశాను. అయితే నా ఆటో ప్రయాణ సాహస యాత్రలతో.. నాకున్న డస్ట్ ఎలెర్జీ వల్ల.. ఎలెర్జిక్ రైనైటిస్ (అర్ధం కాలేదా? జలుబు!) తిరగబెడుతుండటం వల్ల.. నాకు కారే గతని నా ముక్కు వైద్యుడు హెచ్చరించాడు. ఆల్రెడీ ముక్కుకి రెండు ఆపరేషన్లు చేయించుకున్న కారణాన.. ఆయన మాట గౌరవిస్తూ.. కారుని ఆశ్రయించాను.

నా డ్రైవర్ వయసులో నాకన్నా పెద్దవాడు. మంచివాడు. నిదానమే ప్రధానం అని నమ్మిన వ్యక్తి. అందుకే కారు స్లో మోషన్లో నడుపుతుంటాడు. ఒకసారి కొద్దిగా స్పీడ్ పెంచమన్నాను. 'మేడమ్ గారు ఊరుకోరు సార్!' అన్నాడు. అప్పట్నుండి నేనతనికి ఏమీ చెప్పలేదు. మన్మోహన్ సింగ్ లా బుద్ధిగా కూర్చుంటున్నాను. ఇదీ ఒకందుకు మంచిదే! నా పురము, నా పురజనుల్ని నిశితంగా, ప్రశాంతంగా గమనించే అవకాశం కలుగుతుంది.


అసలు నాకు మా గుంటూర్లో కారు ప్రయాణం అంతగా నచ్చదు. కారణం.. ఈ ఊళ్ళోనే నేను ఎన్టీఆర్ సినిమాలు చూడ్డం కోసం మండుటెండలో గంటల తరబడి సినిమా క్యూల్లో నించున్నాను. 'ముల్కీ డౌన్ డౌన్!' (నాకప్పుడు ముల్కీ అంటే ఏంటో తెలీదు) అంటూ దుమ్ము కొట్టుకుంటూ రోడ్లన్నీ నడిచాను. ఇచ్చట రోడ్లు, ధుమ్ము, ధూళి, ఉమ్ములు, ఉచ్చలు.. అన్నీ నాకలవాటే!

అంచేత కార్లో వెళ్తూ పరిసరాల్ని పరికిస్తుంటే.. ఏదో శవపేటిక లాంటి డబ్బాలోంచి ఊరిని చూస్తున్న భావన కలుగుతుంటుంది. ప్రజలతో సంబంధాలు తెగిపోయిన రాజకీయ నాయకుళ్ళా ఫీలవుతాను. అయిననూ తప్పదు. వయసు, అనారోగ్యం.. దురదృష్టవశాత్తు.. నన్ను జయించాయి.

సరే! రోడ్లన్నీ ఆటోల సమూహం. చీమల్లా మందలు మందలుగా జనం. ఇరువైపులా తోరణాల్లా రంగుల ఫ్లెక్సీలు. ఏదో కొత్త సినిమా రిలీజనుకుంటా. అయితే నాకు ఆ ఫ్లెక్సీల్లో మొహాలు తెలీదు. ఒకడు సెల్ ఫోన్లో మాట్లాడుతూ.. ఇంకోడు నల్లకళ్ళజోడుతో.. చిత్రవిచిత్ర భంగిమలలో ఎవరెవరివో మొహాలు. వీళ్ళంతా కొత్త హీరోలా?

కాదు.. కాదు. పరిశీలనగా చూడగా.. ఆ మొహాలు హీరోలవి కాదు.. ఆ హీరోకి అభినందనలు చెబుతున్న అభిమానులవి! అయితే మరి మన హీరోగారెక్కడ? ఫ్లెక్సీలో ఓ మూలగా ఇరుక్కుని బేలగా చూస్తున్నాడు! అభిమానం హద్దులు దాటడం అంటే ఇదే కామోలు! డబ్బు పెట్టేవాడిదే ఫ్లెక్సీ.. ఫ్లెక్సీ పెట్టించినవాడే అభిమాని!

దార్లో అక్కడక్కడా.. కళ్యాణ మంటపాలు. మంటపాల ఎంట్రన్స్ వద్ద 'నేడే చూడండి' అన్నట్లు పెళ్లి చేసుకునేవాళ్ళ భారీ ఫ్లెక్సీలు! బరువైన నగలతో పెళ్ళికూతురు, శర్వాణిలో పెళ్ళికొడుకు.. ఒకళ్ళ మీద ఇంకోళ్ళు పడిపోయి.. దాదాపు కౌగలించుకున్నట్లున్న పోజులతో ఫోటోలు. వాటిపై ఫోకస్ లైట్లు. కొంపదీసి ఈ జంటలకి ఇంతకుముందే పెళ్ళైపోయిందా!

ఓహ్! ఇప్పుడు ఎంగేజ్ మెంట్ కూడా పెళ్ళి తరహాలో చేస్తున్నారు కదూ! బహుశా అప్పటి ఫోటోలై ఉంటాయి. అయితే.. ఆ ఫోటోలతో ఇంత గ్రాండ్ గా ఫ్లెక్సీలెందుకు పెట్టారబ్బా! బహుశా.. నాలాంటి ఆబ్సెంట్ మైండెడ్ ఫెలో పొరబాటున ఒక పెళ్ళికి వెళ్ళబోయి ఇంకో పెళ్ళికి వెళ్ళకుండా ఆపడానికయ్యుంటుంది. సర్లే! పెళ్ళంటే నూరేళ్ళ మంట! ఈ ఒక్కరోజైనా ఆర్భాటంగా ఉండనిద్దాం. మన సొమ్మేం పోయింది!?
పెళ్ళి జరుగుతున్న హాల్లో అడుగెట్టాను. అది చాలా పెద్ద హాల్. ఎదురుగా పెళ్ళికొడుకు, కూతురు.. నమస్కారం పెడుతున్నట్లు చేతులు జోడించి.. శిలావిగ్రహాల్లా కూర్చునున్నారు. ఒకపక్క అక్షింతలు వెయ్యడానికి ఓ పెద్ద క్యూ ఉంది. నేను కూడా క్యూలో నిలబడి.. అక్షింతలు వేస్తూ విడియోలో హాజరు వేయించుకుని 'హమ్మయ్య' అనుకున్నాను. నా స్నేహం నిలబడింది. శీలపరీక్షలో నెగ్గాను!

పెళ్ళికొడుకు మరీ అమాయకుళ్ళా ఉన్నాడు. వీడికి ముందుంది ముసళ్ళ పండగ. వాణ్ణి పరీక్షగా చూస్తే.. అమ్మోరికి బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్న మేకపిల్లలా అనిపించాడు. ఏం చేస్తాం? ఈ వెధవల గూర్చి "దీపం పురుగుల అజ్ఞానం!" అంటూ ఓ పోస్టు కూడా రాశాను. సమాజానికి నా సందేశమైతే ఇచ్చాను గానీ.. చదివేవాడేడి?

సరే! వచ్చిన పని అయిపోయింది. ఇవ్వాళ ఆదివారం. కొంపలు ముంచుకుపోయే పన్లేమి లేవు. తెలిసినవాడెవడూ కనబడ్డం లేదు. కొద్దిగా ఆ భోజనాల వైపు వెళ్ళి చూస్తే పోలా! అనుకుంటూ అటుగా నడిచా. అక్కడందరూ చేతిలో ప్లేట్లతో దర్సనమిచ్చారు. క్షణకాలం ముష్టివాళ్ళు సామూహికంగా బిక్షాపాత్రలతో తిరుగాడుతున్నట్లుగా అనిపించింది.

నాకా పెళ్ళిలో భోంచేసే ఉద్దేశ్యం లేదు.. అయినా ఆహార పదార్ధాలు చూట్టం మూలంగా జిహ్వాచాపల్యం కలుగుతుందేమోనని భోజన పదార్ధాల వైపు దృష్టి సారించాను. నాకు తెలిసిన వంకాయ, బీరకాయ, దొండకాయల కోసం వెదికాను. ఎక్కడా కాయగూరల అనవాళ్ళు లేవు. అక్కడున్నవన్నీ చూడ్డానికి తప్పితే తినేందుకు పనికొచ్చేట్లుగా లేవు. మంచిదే. తినేవాడు తింటాడు. లేపోతే లేదు. ఎవడి గోల వాడిది.

ఈలోగా.. మదీయ మిత్రుడొకడు కనిపించాడు. వాడి పక్కన నగలు, పట్టుచీర మోస్తూ ఒక నడివయసు మహిళ.. అతని భార్య అనుకుంటాను.. నన్ను చూస్తూ పలకరింపుగా నవ్వాడు. సన్నగా నవ్వుతూ ముందుకు సాగిపోయాను. భార్య పక్కన ఉన్నప్పుడు స్నేహితుల్తో మాట్లాడరాదనే నియమం నాకుంది. ఈ విషయంపై "నమస్కారం.. అన్నయ్యగారు!" అంటూ ఓ పోస్టు కూడా రాశాను.

ఫంక్షన్ హాల్ బయటకొచ్చి డ్రైవర్ కోసం ఫోన్ చేశాను. అతను భోంచేస్తున్నాట్ట. రోడ్డుపై నిలబడి ఫంక్షన్ హాల్ వైపు దృష్టి సారించాను. కళ్ళు చెదిరే లైటింగ్! పక్కనే చెవులు పగిలే మోతతో జెనరేటర్లు! కొంపలు మునిగిపోతున్నట్లు హడావుడిగా లోపలకెళ్ళేవాళ్ళు.. బయటకొచ్చేవాళ్ళు. ఎందుకో!

"ఇంతేరా ఈ జీవితం. తిరిగే రంగులరాట్నం.. " అనే ఘంటసాల పాట జ్ఞాపకం వచ్చింది. పుట్టేవాళ్ళు పుడుతూనే ఉంటారు. పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్లు చేసుకుంటూనే ఉంటారు. ఇంకోపక్క చచ్చేవాళ్ళు చస్తూనే ఉంటారు! ఘంటసాల పాటలో ఎంత అర్ధం ఉంది!



(photos courtesy : Google)

Friday, 12 April 2013

భార్యే మాయ! కాపురమే లోయ!!

హెచ్చరిక : ఈ టపా మగవారికి ప్రత్యేకం. ఆడవారు చదవరాదు.


అతనో చిరుద్యోగి. మంచివాడు. మృదుస్వభావి. పుస్తక ప్రియుడు. తెల్లనివన్ని పాలు, నల్లనివన్ని నీళ్ళనుకునే అమాయకుడు. సాధారణంగా ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి ఏదోక దుర్గుణం కలిగి ఉంటాడు. మనవాడి దుర్గుణం.. కవిత్వం పిచ్చి!

స్నేహితుడి చెల్లెల్ని చూసి ముచ్చటపడి ప్రేమించాడు. పెద్దల అంగీకారంతో ప్రేమని పెళ్ళిగా మార్చుకున్నాడు. కొత్తగా కాపురానికొచ్చిన భార్యని చూసి 'జీవితమే సఫలము.. రాగ సుధా భరితము.. ' అనుకుంటూ తెగ ఆనంద పడిపొయ్యాడు.

భార్య కూడా భర్త కవిత్వానికి తీవ్రంగా మురిసిపోయింది. ఆవిడకి తన భర్త కవిత్వంలో శ్రీశ్రీ మెరుపు, దాశరధి విరుపు, ఆత్రేయ వలపు కనిపించాయి. ఆయనగారి కవితావేశానికి కాఫీలందిస్తూ తన వంతు సహకారం అందించింది.

ఆ విధంగా ఆవిడ అతనిలో విస్కీలో సోడాలా కలిసిపోయింది. ఇప్పుడు వారి జీవితం మల్లెల పానుపు, వెన్నెల వర్షం. ఆ విషయం ఈ పాట చూస్తే మీకే తెలుస్తుంది.



కొన్నాళ్ళకి.. భార్యకి భర్త తాలూకా కవితామైకం దిగిపోయింది. కళ్ళు తెరచి చూస్తే ఇంట్లో పనికిమాలిన సాహిత్యపు పుస్తకాలు తప్పించి.. పనికొచ్చే ఒక్క వస్తువూ లేదన్న నగ్నసత్యాన్ని గ్రహించింది.

'ఏమిటీ కవితలు? ఎందుకీ పాటలు?' అని ఆలోచించడం మొదలెట్టింది. తత్ఫలితంగా ఆవిడకి దాహం వెయ్యసాగింది. అంచేత.. చల్లని నీటి కోసం లేటెస్ట్ మోడెల్ ఫ్రిజ్ కొందామని భర్తనడిగింది.

"ఫ్రిజ్ ఎందుకె చిన్నాదానా.. కష్టజీవుల మట్టికుండ లుండగా.. " అంటూ పాటెత్తుకున్నాడు మన భావుకుడు. భార్య నొసలు చిట్లించింది.

భర్త ఆఫీసుకెళ్ళినప్పుడు బోర్ కొడుతుంది. అంచేత లేటెస్ట్ మోడెల్ సోని LED టీవీ కొందామని భర్తనడిగింది..

"టీవీలెందుకె పిల్లాదానా.. పచ్చని ప్రకృతి పురులు విప్పి ఆడగా.. " అంటూ కవితాత్మకంగా చెప్పాడు మన కవి. భార్యకి చిరాకేసింది.

ఎండలు మండిపోతున్నాయ్. ఉక్కపోతగా ఉంది. లేటెస్ట్ మోడెల్ ఏసీ కొందామని భర్తనడిగింది.

"వట్టివేళ్ళ తడికెల తడిలో.. చెలి చల్లని చెక్కిలిపై నా మది సేద తీరగా.. " అంటూ లలితగీతం పాడాడు. భార్యకి మండిపోయింది. అన్నకి కబురు చేసింది.

అన్న పీకల్లోతు అప్పుల్లో, తీవ్రమైన కరువులో ఉన్నాడు. పీత కష్టాలు పీతవి! లేటెస్ట్ మోడల్ ఫ్రిజ్, టీవీ, ఏసీ కొనటం లేదని.. అతనికి భార్య తిండి పెట్టకుండా వారం రోజులుగా కడుపు మాడ్చేస్తుంది. చెల్లి కబురందుకుని పరుగున వచ్చాడు. చెల్లి కష్టాలు విన్న అన్న గుండె తరుక్కుపోయింది. హృదయం కదిలిపోయింది. కడుపు మండిపోయింది.

హుటాహుటిన చెల్లిని బజారుకి తీసుకెళ్ళి పేద్ద ఫ్రిజ్, ఇంకా పెద్ద సోనీ LED టీవీ, అతి నిశ్శబ్దంగా పంజేసే అత్యంత ఖరీదైన ఏసీ.. ఇంకా చాలా.. 'జీరో' డౌన్ పేమెంట్, 'ఆల్ పేమెంట్ ఓన్లీ ఇన్ ఇన్స్టాల్మెంట్స్' అనబడే వాయిదాల పద్ధతి స్కీములో (దీన్నే ముద్దుగా EMI అంటారు).. బావగారి పేరు మీద కొనిపించాడు. పన్లోపనిగా చెల్లెలి ఖాతాలో అవన్నీ తనూ తీసేసుకున్నాడు ముద్దుల అన్న!

'ఏమిటివన్నీ?' అంటూ ఆశ్చర్యంగా అడిగిన భర్తకి కాఫీ ఇచ్చి.. "పయనించే మన వలపుల నావ.. " అంటూ పాడింది భార్యామణి. మొహం చిట్లించాడు కవి. ఏసీ ఆన్ చేస్తూ "నీ మది చల్లగా.. స్వామి నిదురపో.. " అంటూ ఇంకో పాటెత్తుకుంది భార్య. ఖిన్నుడైనాడు కవి! హృదయం మూగగా రోదించింది. గోలగా ఘోషించింది. ఘోరంగా ఘూర్ఘించింది.

తనకొచ్చే జీతంతో EMI లు, కరెంట్ బిల్లులు కట్టలేక విలవిలలాడిపొయ్యాడు మన కవి పుంగవుడు. దిక్కు తోచక అప్పులు చెయ్యసాగాడు. అప్పులు చెయ్యడమే కానీ.. తీర్చే మార్గం కనబడ్డం లేదు. ఏం చెయ్యాలో తోచట్లేదు. దిగులుతో చిక్కి.. చూడ్డానికి రోగిస్టివాడిలా కనిపించసాగాడు. సహజంగానే కవితా గానం గాయబ్ అయిపోయింది.

ఆర్ధిక బాధలు తట్టుకోలేక.. ఓ మంచిరోజు ఇంట్లోంచి వెళ్ళిపొయ్యాడు. ఊరవతల ఓ కుళ్ళు వీధిలో కరెంట్ స్థంభానికి అనుకుని.. వీధి కుక్కని నిమురుతూ తన దుస్థితికి కుమిలిపోసాగాడు. అరె! చాల్రోజులకి మళ్ళీ కవిత్వం పొంగింది! దిగులుగా, ఆవేదనగా, ఆర్తిగా, నిర్వేదంగా, నిస్సారంగా, నీరసంగా.. జీవత సారాన్ని నెమరు వేసుకుంటూ పాడటం మొదలెట్టాడు.. పాపం!

అతను పాడుకుంటున్న పాట చూడండి.

< />
భర్త కనపడక భార్య తల్లడిల్లింది. భయపడిపోయింది. 'తన భర్త లేకపోతే.. EMI కట్టేదెవరు? ఈ టీవీ, ఫ్రిజ్, ఏసీ.. మైగాడ్.. ఇవన్నీ ఏమైపోవాలి? షాపువాళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోతే నే బ్రతికేదెట్లా? అయ్యో! భగవంతుడా! ఏ ఆడదానికీ రాని కష్టాన్ని నాకు కల్పించావేమయ్యా? ఇది నీకు న్యాయమా? ధర్మమా?' అంటూ దేవుణ్ని వేడుకుంది.

పిమ్మట తేరుకుంది. తదుపరి.. ఓ జట్కాబండి బాడుగకి మాట్లాడుకుని.. పారిపోయిన ఖైదీ కోసం పోలీసులు వెతికినట్లు.. భర్త కోసం వీధులన్నీవెదకసాగింది. మొత్తానికి భర్త దొరికాడు. EMI కట్టించే నిమిత్తం.. అతగాణ్ణి బలవంతంగా ఇంటికి లాక్కెళ్ళింది. కథ దుఃఖాంతం!

(photo courtesy : Google)

Friday, 5 April 2013

నందుని చరిత - ఘంటసాల ఘనత


నేను చిన్నప్పుడు ఘంటసాల పాటలు వింటూ పెరిగాను. అయితే ఆ పాటలు ఘంటసాల పాడినట్లు అప్పుడు నాకు తెలీదు. ఆ పాటలు రామారావు, నాగేశ్వరరావులే పాడుతుండే వాళ్ళనుకునేవాణ్ని. కొన్నాళ్ళకి ఆ గొంతు ఘంటసాలదని తెలుసుకున్నాను. ఇంకొన్నాళ్ళకి ఘంటసాల గొప్ప గాయకుడని అర్ధం చేసుకున్నాను. అయితే ఘంటసాల విశ్వరూప దర్శనం నాకు 'జయభేరి' సినిమా చూస్తుండగా కలిగింది.

సరే! 'జయభేరి' పాటల గొప్పదనాన్ని ఇవ్వాళ నేను ఇక్కడ రాసేదేమీ లేదు. దాదాపు అన్ని పాటలు (చివర్లో వచ్చే సౌందర్ రాజన్ పాట మినహాయింపు) బాగుంటాయి. బెస్ట్ ఆఫ్ జయభేరి? రకరకాల సమాధానాలు. క్లాసికల్ ప్రేమికులు 'రసికరాజ తగువారము కాదా.. ' చెబుతారు. విరహ ప్రేమికులు 'రాగమయి రావే.. ', 'యమునా తీరమున.. ' అంటుంటారు. నాకైతే 'నందుని చరితము.. ' పాట ఒక అద్భుతంగా తోస్తుంది.

'జయభేరి' చూడనివారి కోసం.. ఈ పాట సందర్భం బ్రీఫ్ గా రాస్తాను. హీరో పేరు కాశీనాథశాస్త్రి. గొప్ప సంగీత విద్వాంసుడు. కళకి క్లాస్ డిస్క్రిమినేషన్ ఉండరాదని నమ్ముతాడు. నమ్మిన సత్యాన్ని ఆచరించగలిగిన సాహసి. అందుకే గురువుని, అన్నావదినల్ని ఎదిరించి వీధి నాటాకాలాడే అమ్మాయిని వివాహం చేసుకుంటాడు.

మహారాజు కాశీనాథుని ప్రతిభని మెచ్చి ఆస్థాన విద్వాంసుడిగా నియమిస్తాడు. అతను ఇంత స్థాయి పొందడాన్ని సహించలేని రాజగురువు, రాజనర్తకిలు కుట్ర పన్ని తాగుబోతుగా మార్చేస్తారు. ఒకనాడు మహారాజు అజ్ఞాపించినప్పుడు కూడా పాడటానికి నిరాకరిస్తాడు. రాజాగ్రహానికి గురై వీధిన పడతాడు.

గుళ్ళో హరికథ జరుగుతుంటుంది. ఒక 'అంటరానివాడు' జ్వరంతో తీసుకుంటున్న తన కూతురితో కలిసి గుడి బయట నుండే దేవునికి మొక్కుతాడు. ఆగ్రహించిన గుళ్ళో బ్రాహ్మణులు అతన్ని నెట్టేస్తారు. మద్యం మత్తులో అటుగా వెళ్తున్న కాశీనాథశాస్త్రి ఆ తండ్రీకూతుళ్ళకి దేవుని దర్శనం చేయించడానికి విఫలయత్నం చేసి.. తను కూడా గెంటింపబడతాడు.

ఈ అరాచకానికి కాశీనాథశాస్త్రి కలత చెందుతాడు. ఆవేదన చెందుతాడు. మహారాజు కోరినా పాడనని మొరాయించిన ఆ స్వరం ఒక్కసారిగా జీవం పోసుకుంటుంది. ఆవేశంతో పరవళ్ళు తొక్కుతుంది. ఆగ్రహంతో కట్టలు తెంచుకుంటుంది. అందుకే ఆ మహాగాయకుడు గొంతెత్తి నందుని చరితాన్ని ఆలాపించడం మొదలెడతాడు. ఇదీ పాట సందర్భం. ఇక్కడీ పాట యూట్యూబులో చూడండి.



ఈ పాట సందర్భాన్ని పి.పుల్లయ్య పెండ్యాలకి వివరించి ఉంటాడు. పెండ్యాల నాగేశ్వరరావు వరసలు చక్కగా కట్టి ఉంటాడు. ఏ దర్శకునికైనా, సంగీత దర్శకునికైనా ఎన్నో కోరికలుంటాయి. కానీ గాయకులని దృష్టిలో ఉంచుకుని పరిమితులు ఏర్పరచుకుంటారు. డొక్కు కారుని వంద మైళ్ళ వేగంతో నడపితే యాక్సిడెంటవుతుంది.

ఘంటసాల వాయిస్ రేంజ్ అప్పుడే షో రూం డెలివరీ అయిన బెంజ్ కారు వంటిది. ఇక నడిపేవాడి ఓపిక. ఆకాశమే హద్దు. సంగీత దర్శకుడు ఏ బాణీనైనా, ఏ శృతిలోనైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 'ఘంటసాల లక్జరీ' ని ఎస్.రాజేశ్వరరావు దగ్గర్నుండీ అందరూ అనుభవించిన వారే!

మళ్ళీ 'అధికులనీ అధములనీ.. ' పాట దగ్గర కొద్దాం. ఈ పాట ఎత్తుగడే చాలా హై పిచ్ లో ఉంటుంది. అన్యాయానికి స్పందించిన ఒక మహాగాయకుని ఆవేదన, ఆర్ద్రత, ధర్మాగ్రహం.. అంతటినీ ఘంటసాల గీతాలాపనలో గాంచవచ్చు.

నటించింది అక్కినేని నాగేశ్వరరావయినా.. సన్నివేశానికి ఘంటసాల గొంతు పదిరెట్లు ఊపునిస్తుంది. ఈ పాటని నేను చాలాసార్లు చూశాను. ఎన్నిసార్లు చూసినా.. నాకీ పాట ఒక అద్భుతంగా తోస్తుంది. ('జయభేరి' మన మనసులో చిరస్థాయిగా మిగిలిపోడానికి ప్రధాన కారకుడు ఘంటసాల అని నా అభిప్రాయం.)

అయితే.. నాకు ఘంటసాలని ఫోటోల్లో చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంతటి అసమాన ప్రతిభావంతుడు అతి సామాన్యుడిలా, అమాయకంగా కనిపిస్తుంటాడు. ఘంటసాలకి తనెంతటి ప్రతిభాసంపన్నుడో తనకే తెలీనంత అమాయకుడని నా అనుమానం! ఘంటసాల తెలుగు పాటని హిమాలయాలంత ఎత్తున ప్రతిష్టించాడు. ఇది తెలుగువారి అదృష్టం.

మా వేలు విడిచిన మేనమామ ఒకాయనకి పెళ్ళీపెటాకులు లేవు. ఉద్యోగం సద్యోగం లేదు. పనీపాటా లేదు. ఆస్తిపాస్తులు బానే ఉన్నాయి. సాధారణంగా ఇట్లాంటివాళ్లకి ఏదొక హాబీ ఉంటుంది. మా మేనమామకి సినిమా పాటల హాబీ. అదో పిచ్చి. పొద్దస్తమానం ఏవో గ్రామ్ ఫోన్ రికార్డులు వింటూ, వాటిని తుడుచుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడు. సినిమా పాటల పరిజ్ఞానం చాలానే ఉంది.

ఓ సారి ఆయన ఏదో పెళ్ళిలో కనిపిస్తే అడిగాను. కచేరీల్లో ప్రతి తలకి మాసిన వెధవ ఘంటసాలలా తెగ ఫీలైపోతూ.. 'రాగమయి రావే.. ', 'నీలిమేఘాలలో..' అంటూ సెలెక్టివ్ గా కొన్ని పాటల్నే హత్య చేస్తారేమి! ఆ గార్ధభోత్తములు 'నందును చరితము.. ' జోలికి ఎందుకు పోరు? అని. ఆయన ఒక క్షణం ఆలోచించాడు. ఆపై విషయం తేల్చేశాడు.

"ఆ పాట పాడటం చాలాచాలా కష్టం. శృతి చాలదు. నా లెక్క ప్రకారం 'నందుని చరితము' పాడ్డానికి ఎవడు సాహసించినా.. పాటయ్యేలోపు గిద్దెడు నెత్తురు కక్కుకుని చస్తాడు. చావుకి తెగించి ఎవడైనా ఎలా పాడతాడు?" అన్నాడు.

నిజమే కదా! ఎవరికైనా తమ గానంతో జనాల ప్రాణాలు తియ్యాలనే సరదా ఉంటుంది గానీ.. తమ గానంతో తమ ప్రాణాలకే ఎసరు ఎందుకు పెట్టుకుంటారు?! మామా! నువ్వు కరెక్టుగానే చెప్పావు!

(photos courtesy : Google)

Thursday, 14 February 2013

'ఓహో మేఘమాలా.. '! కొంప ముంచితివి గదా!!


"గురు గారు! నాకు దిగులుగా ఉంది. ఈ మధ్య నా బ్రతుకు మరీ ఆఫ్ఘనిస్తాన్ లా అయిపోయింది."

"అంత కష్టమేమొచ్చి పడింది శిష్యా!"

"నా భార్య పోరు పడలేకున్నాను. ఆవిడకి నా సంపాదన చాలట్లేదుట."

"పోనీ నచ్చజెప్పి చూడకపొయ్యావా?"

"ఆన్నీ అయిపొయ్యాయండీ. నాకు జీవితం మీద విరక్తి పుట్టేసింది. మీరు మరో శిష్యుణ్ణి వెతుక్కోండి. సెలవు."

"తొందరపడకు శిష్యా! నే చెంతనుండగా నీకు చింతనేలా? సంగీత చికిత్సతో నీ భార్యలో పరివర్తన కలిగిద్దాం."

"సంగీత చికిత్సా?!అంటే?"

"పాత తెలుగు సినిమాల్లో బోల్డన్ని మంచి పాటలు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ఒక్కో పాటకి ఒక్కో రకమైన వైద్య గుణం ఉంటుంది. మొన్నొక నిద్ర లేమి రోగం వాడొచ్చాడు. రాత్రిళ్ళు మంచం మీద పడుకుని 'నిదురపోరా తమ్ముడా.. ' పాట వినమని సలహా ఇచ్చా. అంతే! ఆ రోజు నుండి వాడు రాత్రింబవళ్ళు గురకలు పెట్టి మరీ నిద్రోతున్నాడు."

"నిజంగానా! నా భార్యకి మీ సంగీత వైద్యం పని చేస్తుందంటారా?"

"నిస్సందేహంగా. సంగీతానికి రాళ్ళే కరుగుతాయంటారు. ఆడవారి మనసు కరిగించేందుకు ఒక మంచి పాట చెబ్తాను. అది చూపి నీ భార్యని నీకు చరణదాసిగా చేసుకో. ఈ విడియో చూడు."



"పాట చాలా బాగుందండి."

"ఎస్.రాజేశ్వరరావు సంగీతంలో తిరుమల లడ్డంత తియ్యదనం ఉందోయి. సదాశివ బ్రహ్మం కవిత్వం కాకరకాయ వేపుడంత కమ్మగా ఉంటుంది. ఘంటసాల, లీలల గానంలో వైబ్రేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి మల్టిప్లై అయ్యి అణుక్షిపణి వలే శక్తివంతమవుతాయి. ఆ క్షిపణి నీ భార్య చెవులో కర్ణభేరిని తాకి మెదడులో ప్రకంపనలు కలిగిస్తుంది. అంతే! కఠినమైన ఆమె మనసు క్వాలిటీ ఐస్ క్రీములా కరిగిపోతుంది. పిమ్మట నీ భార్య గుండమ్మకథలో సావిత్రంత అనుకూలవతిగా మారిపోతుంది."

"గురు గారు! ఈ పాటని నాగేశ్వర్రావు, సావిత్రి  పాడుకున్నారు. వాళ్ళు పాడిన పాట నా భార్యనెట్లా మారుస్తుంది?"

"చూడు శిష్యా! ఇక్కడ ఎవరు ఎవరి కోసం పాడారన్నది కాదు పాయింట్. పాటలోని కంపనలు, ప్రకంపనలు ముఖ్యం. మనసులోని భూతులు, అనుభూతులూ ప్రధానం. అందుకే గత యాభయ్యారేళ్ళుగా ఈ పాట తెలుగు వారిని మందు కొట్టకుండానే మత్తెక్కిస్తుంది."

"మీరు చెప్పేది సరీగ్గా అర్ధం కావట్లేదు గానీ.. వింటానికి బానే ఉంది. వర్కౌట్ అవుతుందంటారా?"

"నా సలహా గురి తప్పదు శిష్యా! అయితే ఒక కండిషన్. నీ భార్యని ఇంటికి ఈశాన్యం మూలకి తీసుకెళ్ళి ఈ పాటని చూపించు. ఆ సమయంలో లాప్టాప్ తూర్పు దిక్కుకి తిప్పి ఉంచాలి. గుర్తుంచుకో. పొమ్ము. విజయుడవై రమ్ము!"


           *                                *                                 *                            *

"గురు గారు! కొంప మునిగింది."

"ఏమిటి నాయనా ఆ కంగారు? సత్తుబొచ్చెకి సొట్టల్లా వంటి నిండా ఆ దెబ్బలేమిటి?"

"మీ సలహా విన్న ఫలితం. మీరు కొండ నాలుక్కి మందేశారు.. ఉన్న నాలుక పోయింది."

"తిన్నగా చెప్పి అఘోరించు శిష్యా!"

"మీరు చెప్పినట్లే నా భార్యకి 'ఓహో మేఘమాల.. ' విడియో చూపించాను. ఆవిడ ఆ పాట చూసి ఎంతగానో ఆనందించింది. మీ వైద్యం పంజేసిందని సంతోషించాను. సావిత్రి మెళ్ళో నాగేశ్వరరావు పెట్టిన హారం ఆవిడకి బాగా నచ్చిందిట. అదిప్పుడు అర్జంటుగా కావల్ట."

"అంత సొమ్ము నీ దగ్గరెక్కడిది?"

"నేనూ అదే సమాధానం చెప్పాను. 'సినిమాలో నాగేశ్వరరావు మాత్రం ఆ హారం కొని సావిత్రికి పెట్టాడా? కొట్టుకొచ్చిందేగా. ఆ మాత్రం నీకు చేత కాదా?' అంది."

"దొంగతనం మహాపాపం శిష్యా!"

"నేనూ ఆ ముక్కే అన్నాను. ఫలితంగా వంటి నిండా ఈ దెబ్బలు. హబ్బా! ఒళ్ళంతా ఒకటే సలపరంగా ఉంది. ఇప్పుడు నాకు దిక్కెవరు గురు గారు?"

"దిక్కులేని వాడికి ఆ దేవుడే దిక్కు నాయనా! అయినా.. తన్నుటకు నీ భార్య యెవ్వరు? తన్నించుకొనుటకు నీవెవ్వరు? అంతా వాడి లీల! మొహం మీదే తలుపేస్తున్నందుకు ఏమీ అనుకోకు. అసలే చలికాలం. నాకు నిద్ర ముంచుకొస్తుంది."

"గురు గారు! గురు గారు.. "


(photos courtesy : Google)

Monday, 11 February 2013

'యోగి వేమన' ఆలోచనలు - అభిప్రాయాలు


'చిత్తూరు నాగయ్య.. గొప్ప సైకోథెరపిస్ట్'  అంటూ ఇంతకుముందో పోస్ట్ రాశాను. అందులో 'యోగి వేమన'లో నాగయ్య నటన గూర్చి కొంత రాశాను. అయితే - యోగి వేమన సినిమా గూర్చి ఒక పూర్తిస్థాయి పోస్ట్ రాద్దామనే నా ఆలోచన అలానే ఉండిపోయింది.

నాగయ్యపై పోస్ట్ రాసిన తరవాత కూడా ఈ సినిమా రెండుసార్లు చూశాను. మండుటెండలో చల్లని మజ్జిగ తాగినట్లు, యూట్యూబ్ లో పాటలు వింటూ ఆనందిస్తూనే ఉన్నాను. కానీ కొద్దిగా గిల్టీగా కూడా ఉంది - 'నేను మాత్రమే ఎంజాయ్ చేస్తున్న ఈ మధురానుభూతి గూర్చి ఎంతోకొంత రాసి నలుగురితో పంచుకుంటే బాగుండును కదా!' అనిపించి, 'యోగి వేమన' గూర్చి నా ఆలోచనల్ని రికార్ద్ చేస్తున్నాను. ఇది నాకోసం నేను రాసుకుంటున్న పోస్ట్. ఎవరికైనా నా ఆలోచనలు నచ్చితే సంతోషం. 

A.ప్రింట్ క్వాలిటీ బాగుంది. అరవైయ్యైదేళ్ళ క్రితం సినిమా ఈ క్వాలిటీలో ఉండటం ఆనందించదగిన విషయం. ఇందుకు ఎవరు కారకులో తెలీదు. CD లు మార్కెట్ చేసిన దివ్య విడియో వారు అభినందనీయులు (సినిమా పూర్తి నిడివి యూట్యూబులో లభ్యం). 

B.విజయా / వాహిని వారి అన్ని సినిమాలకి మల్లే ఈ సినిమాలో కూడా ఫొటోగ్రఫీ కాంతివంతంగా, బ్రైట్ గా ఉంది. (కొన్ని పాత సినిమాలు చీకట్లో చూస్తున్నట్లుంటాయి - 'జయభేరి' ఒక ఉదాహరణ.) ఇందుకు కారకుడైన ఛాయాగ్రహకుడు మార్కస్ బార్ట్లే ని ఆభినందిద్దాం.

C.సినిమా టైటిల్స్ ఇంగ్లీషులో ఉన్నాయి. ఆ రోజుల్లో స్క్రిప్ట్ కూడా ఇంగ్లీషులోనే రాసుకునేవారని ఎక్కడో చదివాను. కె.వి.రెడ్డి ఎక్కువ ఇంగ్లీషులోనే సంభాషిస్తాడని కూడా చదివాను. CD కవరుపై నిర్మాత B.N.రెడ్డి అని ఉంది, టైటిల్ కార్డ్స్ లో produced and directed by K.V.Reddi అని ఉంది (ఇట్లాంటి పొరబాట్లని కనుక్కోవడంలో VAK రంగారావు సిద్దహస్తులు).  

D.దర్శకుడు :- కె.వి.రెడ్డి

భోగలాలసుడైన వేమారెడ్డి, యోగి వేమనగా మారిన వైనం ఈ సినిమా సెంట్రల్ పాయింట్. కావున కథ పూర్తిగా వేమారెడ్డి వైపు నుండే నడుస్తుంది. వేమారెడ్డి విలాసపురుషుడు. అన్నగారు పెదవేమారెడ్డి (రామిరెడ్డి) రాచకార్యాలు చూస్తుంటాడు. వేమారెడ్డికి అన్న కూతురు జ్యోతి అంటే అంతులేని ప్రేమ. స్నేహితుడు అభిరాముడితో కలిసి బంగారం తయారుచేసే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. వేమారెడ్డి మోహనాంగి అనే వేశ్య మోజులో మునిగి తేలుతుంటాడు. మోహనాంగికి (కనకాభిషేకం చెయ్యడానికి) అన్నగారు వసూలు చేసిన శిస్తు సొమ్ము వాడేస్తాడు. ఫలితంగా పెదవేమారెడ్డి చెరసాల పాలవుతాడు. తనకెంతో ఇష్టమైన జ్యోతి జబ్బుచేసి 'చిన్నాన్న' అంటూ కలవరిస్తూ మరణిస్తుంది. విరక్తితో పిచ్చివాళ్ళా స్మశానాల వెంటా, గుళ్ళ వెంటా తిరుగుతాడు. శివయోగి (రాయప్రోలు) ఉపదేశంతో యోగిగా మారతాడు. చివరకి గుహప్రవేశం (సజీవ సమాధి?) చేస్తాడు. టూకీగా ఇదీ కథ.

సినిమా చూస్తుంటే ఒక నవల చదువుతున్నట్లుంటుంది. సన్నివేశాలు బిగువుగా, క్లుప్తంగా ఉంటాయి. సినిమా ప్రయాణం చాలా స్మూత్ గా, ఫోకస్డ్ గా ఉంటుంది, అనవసరమైన సన్నివేశం ఒక్కటి కూడా లేదు. నిడివి తగ్గిద్దామని ఎంత ప్రయత్నించినా, ఒక్క నిముషం కూడా ఎడిట్ చెయ్యలేం.

నాకు సినిమా గూర్చి సాంకేతిక పరిజ్ఞాం లేదు. అయితే ప్రతి సినిమా కథకి ఒక మూడ్ ఉంటుంది. సినిమా అసాంతం ఆ మూడ్ క్యారీ చెయ్యడం మంచి సినిమా లక్షణం అని నా అభిప్రాయం. ఆవారా, గాడ్ ఫాదర్ లాంటి క్లాసిక్స్ చూస్తున్నప్పుడు ఈ అభిప్రాయం బలపడింది. ఆ రకంగా చూస్తే కె.వి.రెడ్డి నూటికి నూరుపాళ్ళు విజయం సాధించాడు.

వేమారెడ్డి మోహనాంగితో ఆటపాటలతో ఎంజాయ్ చేస్తుంటే మనక్కూడా హాయిగా ఉంటుంది. జ్యోతి మరణంతో ప్రేక్షకుడు కూడా వేమారెడ్డితో పాటు దుఃఖంలో కూరుకుపోతాడు. ఆపై హీరోతో పాటు మనకి కూడా జీవితం పట్ల అంతులేని విరక్తి, వైరాగ్యం కలుగుతాయి. ఈ విధంగా కె.వి.రెడ్డి మనల్ని తీసుకెళ్ళి హోల్సేల్ గా వేమనకి అప్పగించేస్తాడు.

ప్రేక్షకుణ్ని ఇలా గైడ్ చేస్తూ ప్రధానపాత్రతో మనని మనం ఐడెంటిఫై చేసుకునేట్లు చెయ్యడం గొప్ప దర్శకత్వ ప్రతిభకి తార్కాణం అని నా నమ్మకం. 'యోగి వేమన' గూర్చి ఆరున్నర దశాబ్దాల తరవాత కూడా నేను రాయడానికి ప్రధాన కారణం ఇదే.

సహకార దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత కమలాకర కామేశ్వరరావుకి కూడా అభినందనలు.

సందర్భం కనుక ప్రస్తావిస్తున్నాను, 'యోగి వేమన' సినిమా శ్రీశ్రీకి నచ్చలేదు (మాలి, మాసపత్రిక, మే 1947). 

"వేమన్న మూఢ విశ్వాసాలకి విరోధి. కానీ వేమన్న చిత్రాన్ని చూచిన తర్వాత మన ప్రజలలో మూఢవిశ్వసాలు మరింత పదిలమవుతాయి. వేమన జిజ్ఞాసి, సాధకుడు, మన అందరివంటి మానవుడు. అతనికి మానవాతీత శక్తులంటగట్టడం అనవసరం. గుడ్డిమనిషికి కళ్ళిచ్చాడని చూపించడం వల్ల వేమన్న ఆధిక్యం స్థాపించబడదు." (పేజ్ నంబర్ 329, శ్రీశ్రీ వ్యాసాలు, విరసం ప్రచురణ, 1990.)

శ్రీశ్రీ వేమన తత్వం గూర్చి మంచి అవగాహన కలిగినవాడు. ఆయన కె.వి.రెడ్డి దగ్గర్నుండి ఊహించినంత గొప్పగా సినిమా లేకపోవడంవల్ల చికాకుతో ఈ రివ్యూ రాశాడనుకుంటున్నాను.

E.నటీనటులు.

1.చిత్తూరు నాగయ్య :- వేమారెడ్డి / యోగి వేమన.

ఇంతకుముందు ఈ సినిమా చూసినప్పుడు వేమారెడ్డిగా నాగయ్య నటన ఏవరేజిగా అనిపించింది. నాకెందుకో ఆయన మోహనాంగి ఇంటికి వెళ్ళేప్పుడల్లా ఏదో శంకర విలాస్ లో కాఫీ తాగడానికి వెళ్తున్నట్లు అనిపించింది. వేశ్య దగ్గరకి వెళ్ళే వ్యక్తి విరహతాపంతో ఊగిపోవాలి, నాగయ్యలో నాకా ఫీలింగ్ కనబళ్ళేదు. 

వేమారెడ్డిగా నాగయ్య యాంత్రికంగా నటించాడనడానికి ఒక ఉదాహరణ.. కొలనులోంచి తడచిన దుస్తులతో బయటకొచ్చిన మోహనాంగి (M.V.రాజమ్మ) నుండి దృష్టి మరల్చుకోలేం. కానీ నాగయ్య ఆవిడని సరీగ్గా చూడడు! పట్టించుకోడు, పైగా చీర కట్టుకు రమ్మంటాడు, ఔరా! ఇదేమి రసికత్వం!!

మోహనాంగి దగ్గరకి హడావుడిగా బయల్దేరతాడు వేమారెడ్డి. 

అన్న కూతురు జ్యోతికి వళ్ళు బాగుండదు. 'నన్ను వదలి వెళ్ళకు చిన్నాయనా!' అంటుంది జ్యోతి. 

అంతే! చిన్నపిల్ల అడగంగాన్లే మోహనాంగిని మర్చిపోయి.. ఆనందంగా, మధురంగా "అందాలు చిందేటి నా జ్యోతి.. " అంటూ పాడేస్తాడు. 

పాప పట్ల ఎంత ప్రేమున్నా, సౌందర్యవతి సాంగత్యం కోసం తపించిపొయ్యేవాడి ముఖంలో డిజప్పాయింట్మెంట్ కనబడాలి. నాగయ్యలో నాకు లేశమాత్రమైనా ఆ భావం కనబడలేదు.

దాదాపు ఇవే సన్నివేశాలతో తీసిన ఎన్టీఆర్ 'పాండురంగ మహత్యం' గుర్తు తెచ్చుకోండి. బి.సరోజాదేవిపై మోహంతో ఎన్టీఆర్ తపించిపోతాడు. సినిమా మొదట్లో వేశ్యాసాంగత్యం కోసం ఎంతగా పరితపిస్తాడో.. తరవాత దైవభక్తిలో అంతగా చరితార్ధుడవుతాడు. మొదటి భాగంలో ఎంత నెగెటివ్ షేడ్స్ ఉంటే రెండో భాగం అంత బాగా పండుతుంది. ఇది సింపుల్ బ్యాలెన్సింగ్ యాక్ట్.

మళ్ళీ మనం 'యోగి వేమన' కి వచ్చేద్దాం. వేమారెడ్డి, మొహానాంగిల మీటింగ్స్ మరీ మెకానికల్ గా ఉండటానికి కారణం ఏమిటబ్బా! నాకు తోచిన కొన్ని కారణాలు.

a)బహుశా 1947 (స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం) లో స్త్రీ లోలత్వాన్ని నటించడానికి కొద్దిగా మొహమాటాలు / మోరల్ రీజన్స్ ఉండి ఉండొచ్చు.

b)ఈ సినిమా కె.వి.రెడ్డి, చిత్తూరు నాగయ్యలది. వీళ్ళు మరీ సాత్వికులు, పెద్దమనుషులు. స్త్రీలోలుని చూపులు ఎలా ఉంటాయో నాగయ్యకి తెలీదు, చెప్పి చేయించుకోడానికి కె.వి.రెడ్డికీ తెలీదు. అందుకే నాగయ్యకి M.V.రాజమ్మని 'ఎలా చూస్తూ' నటించాలో తెలిసుండకపోవచ్చు!

c)ఇంకో కారణం. హీరో, దర్శకుడు.. ఇద్దరికీ పూర్తి ఫోకస్ వేమన మీదే. వేమన పార్ట్ కోసం వేమారెడ్డిని హడావుడిగా చుట్టేసినట్లు అనిపించింది.

ఈ సినిమాలోని ఇంత గొప్పలోపాన్ని కనుగొన్న నేను మిక్కిలి సంతసించాను. ఒక గొప్ప సినిమాలో అతి పెద్ద లోపాన్ని కనిపెట్టాను. శెభాష్! ఆలస్యమేలా? పోస్ట్ రాసేద్దాం. ఇంతలోనే ఒక అనుమానం. ఆపాటి ఆలోచన కె.వి.రెడ్డికి తట్టలేదా? నా అవగాహనలో ఎక్కడో ఏదో తేడా ఉంది! ఏమిటది? కావున, సినిమా మొత్తం మళ్ళీ చూశాను. పిమ్మట జ్ఞానోదయం కలిగింది.

'పాండురంగ మహత్యం' పుండరీకుడు వెధవన్నర వెధవ, అర్ధరాత్రి తలిదండ్రుల్ని వెళ్ళగొట్టిన కామాంధుడు. వాడికి కాళ్ళు పోయినప్పుడు మాత్రమే బుద్ధొస్తుంది. చేసిన పాపాలకి పశ్చాత్తాపంతో దహించుకుపోతాడు. కాళ్ళొచ్చిన తరవాత భక్తుడిగా కంటిన్యూ అయిపోతాడు. పుండరీకునికీ, వేమనకీ అస్సలు సామ్యం లేదు.

వేమారెడ్డి సౌమ్యుడు, అభ్యుదయవాది. దేవుడి వస్త్రం తీసుకెళ్ళి చలికి వణుకుతున్న పేదవృద్ధురాలికి కప్పిన మానవతావాది. మోహనాంగిని కూడా నిజాయితిగానే ప్రేమిస్తాడు. అతనికి రాళ్ళనీ, రప్పల్నీ కొలవడం ఇష్టముండదు. అతనిలో జ్యోతి మరణం అంతులేని ఆవేదనని కలుగజేస్తుంది. చావుపుటకల మర్మం గూర్చి నిర్వేదంలోకి వెళ్ళిపోతాడు. తను పాపాలు చేశాననే భావం అతనికుండదు. అసలు పాపపుణ్యాల అస్థిత్వాన్నే ప్రశ్నించే యోగస్థాయికి చేరుకుంటాడు.

మరి - మొన్న ఈ సినిమాలో గొప్పలోపం కనిపెట్టాననుకుని గర్వించానే! కారణమేమి? అనాదిగా తెలుగు సినిమాల్లో పాత్రలు బ్లాక్ అండ్ వైట్ లో, స్టీరియోటైప్డ్ గా ఉంటున్నాయి. మనం వాటికే బాగా అలవాటయి ఉన్నాం. నేనూ ఆ ట్రాప్ లో పడ్డాను.

వేమారెడ్డి వేశ్యాలోలుడు. కాబట్టి చెడ్డవాడు. స్త్రీలోలులకి ఇంకే ప్రయారిటీస్ ఉండరాదు. నాకున్న ఈ చెత్త ఆలోచన మూలంగా.. వేమారెడ్డికి అన్నవదినల పట్ల గౌరవం, పసిదాని పట్ల అంతులేని ప్రేమ కలిగి ఉండటాన్ని అర్ధం చేసుకోలేకపొయ్యాను. వేమారెడ్డిలోని డిఫరెంట్ షేడ్స్ ని దర్శకుడు మొదట్నుండీ చూపుతూనే ఉన్నాడు. నాకే సరీగ్గా అర్ధం అయ్యి చావలేదు.

నేను వేమారెడ్డి పాత్రని అర్ధం చేసుకోడంలో పప్పులో కాలేశాను. కావున పై విషయాలు రాయకూడదనుకున్నాను. కానీ - ఈ పోస్ట్ యోగి వేమన సినిమా గూర్చి నా ఆలోచనలు. కావున అన్ సెన్సార్డ్ గా ఇన్ టోటో రాద్దామని నిర్ణయించుకుని, రాస్తున్నాను.

చిన్నారి జ్యోతి చనిపోయిన తరవాత నాగయ్య నటన గూర్చి వర్ణించడానికి నాదగ్గర భాష లేదు. అంధ బిక్షకురాలి (అంజనీబాయి - సినిమాల్లో నటీమణులకి మేకప్ ఆర్టిస్ట్) బొచ్చెలోంచి అన్నం తింటూ నాగయ్య అద్భుత నటన ప్రదర్శించాడు. వేమన పద్యాలు ఆలపించేప్పుడు నాగయ్య అభినయం అద్భుతం. ఇక చివరి సీన్ తరవాత మహానటుడు నాగయ్య నటనా ప్రతిభకి చేతులెత్తి నమస్కరించడం మినహా చెయ్యగలిగిందేమీ లేదు. నేనదే చేశాను!

2.లింగమూర్తి :- అభిరామ్.

ఈ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడల్లా అందరూ నాగయ్య గూర్చే చెబుతుంటారు. వంకాయకూర బాగుంటే నాణ్యమైన వంకాయల్నీ, వంటమనిషిని మెచ్చుకుంటాంగానీ - ఉప్పూ, కారాల్ని మెచ్చుకోం. కానీ అవి లేకుండా కూరే లేదు. కానీ వాటికి అంత గుర్తింపు ఉండదు. అందుకే - చిత్తూరు నాగయ్య అనే మర్రిచెట్టు ఇతర పాత్రధారుల ప్రతిభని కప్పెట్టేసిందని సినిమా రెండోసారి చూస్తేగానీ తెలీదు.

అభిరాముడిగా ముదిగొండ లింగమూర్తి నటన సూపర్బ్. చాలా సహజంగా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో నాగయ్యకి పోటీగా తట్టుకుని నిలబడ్డాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. నాకు మహామంత్రి తిమ్మరసు, పాండవ వనవాసం సినిమాల్లోని 'దుష్ట' లింగమూర్తి తెలుసు. 'సాత్విక' లింగమూర్తి తెలీదు.

'పెళ్లిచేసిచూడు' లో దొరస్వామి కూడా నాకిట్లాంటి షాకే ఇచ్చాడు. ఈ పాత సినిమాలు చూస్తుంటే క్రమంగా నాకొక విషయం అర్ధమవుతుంది. పాతతరం నటులైన లింగమూర్తి, దొరస్వామి వంటి గొప్ప ప్రతిభావంతులని మనకి తెలీదు. అందుకే సూపర్ హిట్టయిన సినిమాలు ఒకటో, రెండో చూసి ఏదో సాదాసీదా సపోర్టింగ్ ఆర్టిస్టుల్లే అనుకుంటాం.. కానీ కాదు.

3.M.V.రాజమ్మ :- మోహనాంగి.

రాజమ్మ గూర్చి ఎంత రాసినా తక్కువే! అందం, అభినయం, గానం, నాట్యం.. అన్నీ అద్భుతమే! ఐ యామ్ ఇన్ లవ్ విత్ దిస్ బ్యూటీ! అయితే అప్పటికి నేనింకా పుట్టలేదు. అందువల్ల బి.ఆర్.పంతులు ఆ చాన్స్ కొట్టేశాడు. రాజమ్మ తన ఆటపాటలతో దుమ్ము దులిపేసింది.

రాజమ్మ గుళ్ళో ఆడిన పాటలో వెనక నల్లగా, పీలగా, నెత్తి మీద (తల కన్నా పెద్దదైన) పాగ పెట్టుకుని తాళం వేస్తూ ఒకాయన ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి. ఆయన మన ఘంటసాల మాస్టారు! ఘంటసాల పక్కన బక్కగా, పొట్టిగా ఉన్న అమ్మాయి సీత (దేవదాసులో పార్వతి స్నేహితురాలు మనోరమ). సినిమాలో మోహనాంగి చెల్లెలు 'కనకం' పాత్ర వేసింది.

4.కాంతామణి :- మోహనాంగి తల్లి.

ఈ సినిమాలో నన్ను ఆశ్చర్యపరచేంత సహజంగా నటించిన నటి. వేశ్యమాతగా నటించిన కాంతామణి సూర్యాకాంతం, చాయాదేవిలతో పోల్చదగినంతటి ప్రతిభావంతురాలు. ఆవిడ ఆంగికం, వాచకం గ్రేట్! ('దొంగరాముడు' లో 'నే చచ్చిపోతారా భద్రుడూ!' అంటూ రేలంగి తల్లిగా కూడా నటించింది.)

5.నరసమాంబ (వేమన వదిన) :- పార్వతీబాయి.

వేమారెడ్డి వదిన నరసమాంబగా పార్వతి బాయి చక్కగా ఉంది. వేమారెడ్డికి బాధ్యతల్ని గుర్తు చేస్తూ - ఒక పక్క అతనిపై ప్రేమ, అభిమానం.. ఇంకోవైపు చెడిపోతున్నాడన్న బాధ.. ఎంతో ఉదాత్తంగా, డిగ్నిఫైడ్ గా నటించింది.

6.జ్యోతి :- బేబీ కృష్ణవేణి.

ముద్దుగా చక్కగా చేసింది. ఈ పాపకి ఇప్పుడు డెబ్భైయ్యైదేళ్ళు దాటి ఉంటాయి. ఇప్పుడెవరైనా టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే బాగుండు. 

F.నేపధ్య గానం :-

1.నాగయ్య :-

నాగయ్య గానం గూర్చి రాసేంత శక్తిమంతుణ్ని కాదు.. శిరసు వంచి పాదాభివందనం చేయడం తప్ప! అయితే చిన్న పాయింట్.. అందరూ 'అందాలు చిందేటి నా జ్యోతి.. ' పాటని మెచ్చుకుంటారు. నాకు మాత్రం శ్మశానంలో వచ్చే నేపధ్యగానం 'ఇదేనా.. ఇంతేనా.. ' పాట చాలా ఇష్టం. ఇంత మంద్రస్థాయిలో పాడటం నాగయ్యకే చెల్లింది. (ఈ పాట నన్నెంతగా ఏడిపించిందో ఇంతకు ముందు రాశాను.)

2.బెజవాడ రాజారత్నం :-

నాకు ఈ సినిమా చూసేదాకా బెజవాడ రాజారత్నం గూర్చి తెలీనందుకు సిగ్గుపడుతున్నాను. చాలా క్లీన్ వాయిస్. అద్భుత గానం. 'మాయలు పడకే మనసా.. ' అంటూ స్పాంటేనియస్ గా, అలవోకగా పాడేసింది. నేను ఈవిడ గూర్చి తెలుసుకోవలసింది ఇంకా చాలా ఉంది.

G.సంగీతం :- చిత్తూరు నాగయ్య

వేమన పద్యాలకి 'సంగీత దర్శకుడు' నాగయ్య చాలా భావయుక్తంగా ట్యూన్లు చేశాడు. 'గాయకుడు' నాగయ్యతో అద్భుతంగా పాడించాడు. ముఖ్యంగా 'గంగిగోవు పాలు చాలు.. ' సూపర్బ్.

సినిమా మూడ్ క్యారీ చెయ్యడానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన పాత్ర వహించిందని నా అభిప్రాయం.. ముఖ్యంగా చివరి సీన్లో.

H. మాటలు, పాటలు :- సముద్రాల రాఘవాచార్య

మాటలు మనం మన ఇంట్లో మాట్లాడుకున్నట్లుగానే ఉన్నాయి. ఏ పాత్రా ఒక్క వాక్యం కూడా 'అతి'గా మాట్లాడలేదు.నాకు మాటలు ఇలా పొదుపుగా ఉంటేనే ఇష్టం. ఇక పాటల సాహిత్యం గూర్చి ఇవ్వాళ నే కొత్తగా చెప్పేదేముంటుంది?!

I.మేకప్ :- హరిబాబు.

యోగసిద్ధి సాధించిన వేమనని కె.వి.రెడ్డి వేమన పద్యాలతో క్రమేపి వృద్ధుడిగా మార్చేస్తాడు. అసలీ ఐడియా వచ్చినందుకే కె.వి.రెడ్డిని మనం అభినందించాలి. ఇంకో దర్శకుడైతే కథని ముందుకు నెట్టడానికి ఏం చెయ్యాలో తోచక గిలగిల్లాడి చచ్చేవాడు. కె.వి.రెడ్డి మాత్రం ఈ ఫీట్  హరిబాబు మేకప్ (మార్కస్ బార్ట్లే ఫొటోగ్రఫీ కూడా) సాయంతో అవలీలగా చెయ్యగలిగాడు. ఈ మేకప్ హరిబాబు 1947 లోనే వండర్స్ చేశాడు.. అసాధ్యుడులాగున్నాడు.

ఇంతటితో యోగి వేమన సినిమా 'కంటెంట్' గూర్చి నా ఆలోచనలు రాయడం అయిపోయింది.

J.సినిమాతో సంబంధం లేని ఆలోచన.

ఈ సినిమా ఎప్పుడు చూసినా రెండ్రోజుల దాకా వైరాగ్యం నన్ను వదలదు.జీవితంపై విరక్తి కలుగుతుంది. 'రోగి ఎవ్వడు? డాక్టరెవ్వడు? భార్య ఎవరు? జీవితమంతయూ మిధ్యయే కాదా? మరప్పుడు ఈ వెధవ జీవితానికి అర్ధమేమిటో విశ్వదాభిరామ వినురవేమ!' అనే మూడ్ లో ఉండిపోతాను. (గుంటూరులో గుహలు లేవు కాబట్టి బ్రతికిపొయ్యాను. లేకపోతే నేనూ ముమ్మిడివరం బాలయోగిలా అయిపొయ్యేవాణ్ణేమో!)

అరవయ్యైదేళ్ళ తరవాత సినిమా చూసిన నాకే ఇంత వైరాగ్యం కలుగుతుందంటే, నటించిన నాగయ్యకి ఇంకెలా ఉండాలి? అందుకే నాగయ్య నిజజీవితంలో కూడా బైరాగి అయిపొయ్యాడు. కష్టాలు పడ్డాడు. నాగయ్య ఇలా అయిపోవడం occupational hazard క్రిందకి వస్తుందా?!

చివరి మాట :-

ఈ సినిమా గూర్చి నా ఆలోచనలు మొత్తంగా మూట కట్టి దాచుకోవాలనే కోరికే నన్నీ పోస్ట్ రాయించింది. చదువుకోడానికి కొద్దిగా నిడివి ఎక్కువైందని తెలుసు. క్షమించగలరు.

(ఈ పోస్ట్ నా సైకోథెరపిస్ట్ చిత్తూరు నాగయ్యకి నేను సమర్పించుకున్న ఫీజు. హమ్మయ్యా! ఇప్పుడు ఋణ విముక్తుడనైనాను.)

(photos courtesy : Google)

Monday, 28 January 2013

ఘంటసాల పాటొచ్చింది.. గేరు మార్చు!


"గురూ గారు!"

"ఏమిటి శిష్యా?"

"మీరీమధ్య బ్లాగుల్లో ఘంటసాల భజన చేస్తున్నరెందుకు?"


"పిచ్చివాడా! బ్లాగులున్నదే భజన చేసేందుకు! నాకు నచ్చినవి నా బ్లాగులో రాసుకోకపోతే ఇంకెక్కడ రాసుకోమంటావ్? నీ ఇంటి గోడ మీద రాయమంటావా?"

"ఆ పని మాత్రం చెయ్యకండి. మొన్ననే సున్నం కొట్టించాను. మీరీమధ్య 'ఘంటసాలా! ఓ ఘంటసాల!' అంటూ ఒక టపా రాశారు. ఘంటసాల పాట సినిమా కథని ఎలివేట్ చేస్తుందన్నారు. కథని ముందుకు నెడుతుందన్నారు. నాకైతే మీ రాత కొద్దిగా 'అతి' అనిపించింది."

"నీకలా అనిపించిందా శిష్యా! సర్లే! ఇలా వచ్చి నా పక్కన కూర్చో. నీకిప్పుడో యూట్యూబ్ విడియో చూపిస్తాను. శ్రద్ధగా మనసు పెట్టి చూడు. అప్పుడుగానీ నీకు సత్యం బోధపడదు."

"చూడక తప్పదంటారా?"


"తప్పదు గాక తప్పదు. ముందుగా ఈ 'దేవదాసు' పాట చూడు. పార్వతికి పెళ్ళైపోయింది. దేవదాసుకి ఇంక అంతా అంధకారమే! 'నెరవేరని ఈ మమకారాలేమో.. ' అంటూ ఘంటసాల గానం రాబోయే ఘోరమైన, దుర్మార్గమైన ఏడుపు సన్నివేశాలకి ప్రేక్షకుల మూడ్ ని ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ ఈ పాట లేకుండా దేవదాసు తాగుడు మొదలెట్టేస్తే ప్రేక్షకులకి దేవదాసు పట్ల సానుభూతి అంతగా ఉండేది కాదు."




"చూశావు గదా! సినిమా టెక్నిక్ పట్ల ఎంతో అవగాహన, వాయిస్ మీద గొప్ప కంట్రోల్ ఉంటే తప్ప స్వరంలో అంత దుఃఖం పలకదు శిష్యా! దటీజ్ ఘంటసాల. ఏమంటావు?"

"కాదంటే మీరూరుకోరుగా!"

"ఋజువు చూపినా కూడా నీ బుర్రలో జ్ఞానద్వారాలు తెరుచుకోవట్లేదేమి శిశువా? అయితే ఇప్పుడు 'దొంగరాముడు' పాట చూడు. పాటలోనే కొంత కథ కూడా నడిపించేశాడు కె.వి.రెడ్డి. కాబట్టి సన్నివేశాలకి క్లుప్తత కూడా వచ్చింది. ఇటువంటి సారోఫుల్, బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ ని అనేక సినిమాల్లో ఘంటసాల రోట్లో వేసి చితక్కొట్టేశాడు. చపాతి పిండిలా పిసికేసాడు."



"ఎలా ఉంది?"

"గురూ గారు! నాకు సావిత్రి భలేగుంది."


"శిష్యా! నీకు విషయం మీద ఫోకస్ లేదు. అందుకే ఘంటసాలని వదిలేసి సావిత్రిని చూశావు. ఆడలేడీసుపై నీ దృష్టి మరలే అవకాశం లేకుండా ఇప్పుడు నీకు స్త్రీ పాత్ర లేని 'ఆత్మబంధువు' పాట చూపిస్తాను. చూడు."

"బాబోయ్! ఇప్పుడింకో పాట చూళ్ళేను. ఒప్పుకుంటున్నాను. ఘంటసాల గొప్పగాయకుడు."

"ఈ ముక్క నీ హృదయంలోంచి తన్నుకుంటూ రావాలి. నోట్లోంచి కాదు. ఈ 'ఆత్మబంధువు' పాట చూస్తే ఘంటసాల ఘనతేమిటో నీకే అర్ధమౌతుంది."




"గురూ గారు! నాదో డౌటు. అసలు సిన్మా మధ్యలో ఈ బ్యాక్ గ్రౌండ్ పాట లెందుకు? హాయిగా డ్యూయెట్ల తో సిన్మా లాగించెయ్యొచ్చుగా?"

"మంచి ప్రశ్నడిగావు! పూర్వం సిన్మాల్లో కథ ఉండేది. మోటార్ సైకిల్ నడిపేప్పుడు క్లచ్ తో ఎక్కువసేపు పనుండదు. కానీ మోటర్ సైకిల్ డ్రైవింగులో క్లచ్ అత్యంత ముఖ్యమైనది. అది లేకండా గేర్లు మార్చలేం. క్లచ్ నొక్కి గేరు మార్చినట్లు.. పాత సినిమాల్లో దర్శకులు 'ఘంటసాల బ్యాక్ గ్రౌండ్ సాంగ్' అనే క్లచ్ నొక్కి కథకి గేర్లు మార్చేవాళ్ళు. నువ్వీ సినిమాలు పూర్తిగా చూస్తేగాని ఈ పాటల పరమార్ధం తెలీదు."

"అద్సరే గానీ.. ఈ పాటలు ఇంత బాగా ఇంకెవరూ పాడలేరంటారా?"

"పాడలేకేం? పాడతారు. అయితే.. ఘంటసాల తప్ప ఇంకెవరు పాడినా ఆ పాట ఏడిపించేట్లు ఉండదు. ఏడిసినట్లుంటుంది. అదీ విషయం."


"ఏంటో గురూ గారు! మీరేమో ఇంత నిక్కచ్చిగా చెబుతున్నారు. ఈ సంగతులే నేను బయట చెబుతుంటే నా స్నేహితులకి కోపమొస్తుంది."

"ఓరి పిచ్చి నాగన్నా! అందరి మనోభావాలు గౌరవిస్తూ కూర్చోడానికి నువ్వేమన్నా కాంగ్రెస్ హై కమాండువా? 'కాఫీ రుచి కషాయం కన్నా మిన్న' అని చెబితే కొందరు కషాయ ప్రేమికుల మనోభావాలు దెబ్బతినొచ్చు. అంతమాత్రాన మన అభిప్రాయాలు చెప్పకుండా ఎలా ఉంటాం?"

"అవును గదా!"

"అవును. ఇకనుండీ నిన్ను ఎవరేమన్నా పట్టించుకోకు. ఘనమైన ఘంటసాల గానం గూర్చి గళమెత్తి గర్జించు. అర్ధమైందా?"

"చిత్తం. నేనలా చెయ్యాలంటే ఇప్పుడు మీరు నన్నొదిలి పెట్టాలి. శెలవు!"



(photos courtesy : Google)

Monday, 21 January 2013

అవే కళ్ళు!


భయంగా ఉంది. దడగా ఉంది. కాళ్ళల్లో వణుకు. అప్పటికీ భయమేసినప్పుడల్లా కళ్ళు మూసుకుంటూనే ఉన్నాను. అయినా లాభం లేకపోతుంది. భీతి గొలిపే శబ్దాలతొ హాలంతా మారుమోగుతుంది. సినిమాలో ఎప్పుడు ఎవడు చస్తాడోనని టెన్షన్తో వణికి చస్తున్నాను.

అసలు ఇంట్లోనే ఉండిపోతే హాయిగా ఉండేది. నాకు బుద్ధి లేదు. హాయిగా రాము గాడితో గోళీలాట ఆడుకుంటే పొయ్యేది. నా సినిమా పిచ్చే నా కొంప ముంచింది.  పోయిపోయి ఈ భయానక సినిమాలోకొచ్చి పడ్డాను. 'హే భగవాన్! ఈ సినిమా తొందరగా అయిపోయేట్లు చెయ్యి తండ్రి!'

నాకు సినిమాలంటే వెర్రి అభిమానం. సినిమా హాల్ గేట్ దగ్గర టిక్కెట్లు చించే వాళ్ళు నా హీరోలు. వెనక బొక్కల్లోంచి సినిమా వేసే ప్రొజక్షనిస్టులు నా దృష్టిలో గొప్ప ఇంజనీర్లు. వాళ్ళని కళ్ళార్పకుండా ఎడ్మైరింగ్ గా చూసేవాడిని. ఇంచక్కా రోజూ సినిమా అన్ని ఆటలు ఫ్రీగా చూస్తున్న అదృష్టవంతులు వారు.. కొద్దిగా కుళ్ళుగా ఉండేది.

ఆ రోజుల్లోనే పెద్దయ్యాక సినిమా హాల్లోనే ఏదోక ఉద్యోగం చెయ్యాలని నిర్ణయించేసుకున్నాను. అయితే ఎవరన్నా అడిగితే 'పెద్దయ్యాక డాక్టర్నవుతాను' అని గొప్ప కోసం అబద్దం చెప్పేవాడిని. ఏ ఉద్యోగం చేసినా.. ఎంత సంపాదించినా.. రోజుకి కనీసం మూడు సినిమాలు చూడాలని మాత్రం ఎప్పుడో డిసైడయిపొయ్యాను. జేబు నిండుగా డబ్బులుంచుకుని కూడా సినిమా చూడని ఈ పెద్దవాళ్ళు ఎంత అజ్ఞానులో కదా!

ఇంతటి సినిమా పిచ్చి గల నేను.. పుట్టి బుద్ధెరిగిన నాటి నుండి సినిమా చూడ్డానికి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదని మనవి చేసుకుంటున్నాను. రోజుకో సినిమా చూసే అదృష్టాన్ని ప్రసాదించమని మా బ్రాడీపేట శివాలయంలో నుదుటిన అడ్డంగా విబూది రాసుకుని, ఎగ్గిరి గంట కొట్టి మరీ ప్రార్ధించేవాణ్ని.

దేవుడు దయామయుడు. బాలల పక్షపాతి. అందుకే నా సినిమా వీక్షక యజ్ఞం అవిచ్చిన్నంగా కొనసాగింది. అయితే అన్ని రోజులు మనవి కావు. నా జీవితంలో ఓ దుర్దినాన.. చిన్న మావయ్య, అన్నయ్య సినిమాకి బయలుదేరారు. మా బ్రాడీపేటలో గల ఏకైక సినిమా హాలు లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్. అందులో ఏదో 'అవేకళ్ళు' అనే సినిమా అట. అందునా అది పంచ రంగుల చిత్రం. వదలివేయు నా తరమా! నేనూ బయల్దేరాను.

సినిమా అంతా రంగుల మయం. మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఎప్పుడూ చూసే బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో తెల్లగా కనిపించే ఆకాశం ఇప్పుడు నీలంగానూ, నల్లగా కనబడే రక్తం ఎర్రగానూ కనిపిస్తుంటే.. చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. సినిమా సరదాగా మొదలైంది. కానీ క్రమేపి హత్యలతో సస్పెన్స్ గా మారిపోయింది. ఒక్కొక్క క్యారెక్టర్ చచ్చిపోసాగింది. సినిమా సరీగ్గా అర్ధమై చావట్లేదు గానీ.. బాగా భయం వెయ్యసాగింది.

ఉన్నట్లుండి సినిమా హాలు ఒక స్మశానంగానూ, ప్రేక్షకులంతా నన్ను పీక్కుదినబోయే రక్తపిశాచాల్లాగానూ కనిపించసాగారు. ఏమిటి నాకీ దుస్థితి? ఈ భీకర సినిమాలో ఇట్లా ఇరుక్కుపోయానేంటబ్బా! మొత్తానికి చివరకి హంతకుడెవరో తెలిసింది. (అందరూ అనుకున్నట్లు రాజనాల హంతకుడు కాదు.) ఆ హంతక విలన్ హీరో కృష్ణ చేతిలో చావను కూడా చచ్చాడు. ఇక్కడ భయంతో నేను చచ్చే చావు చస్తున్నాను. హాల్లో లైట్లేశారు. హమ్మయ్య! బ్రతుకు జీవుడా అనుకుంటూ హాల్లోంచి బయటపడ్డాను.

రాత్రి సరీగ్గా నిద్ర పట్టలేదు. పంచరంగుల సినిమా అని ముచ్చటపడ్డాను గానీ.. ఆ ఎర్రటి నెత్తురు గుర్తొస్తేనే భయమేస్తుంది. నిద్రలో ఒక పీడ కల. సినిమాలో కనిపించిన హంతకుడు నన్నూ చంపేశాడు. నా ఒళ్ళంతా ఒకటే నెత్తురు. ధారలుగా కారిపోతుంది. ఆ నెత్తురుతో పక్కంతా చల్లగా అయినట్లు అనిపించింది. ఆ తరవాత ఏమైందో గుర్తు లేదు!

తెల్లవారింది. ఎవరో అరుస్తున్నారు. ఎవరు చెప్మా? ఇంకెవరు? అక్క! ఎవర్నో తిడుతుంది. గుడ్లు నులుముకుంటూ, బాగా మెలకువ తెచ్చుకుని, కళ్ళు చిలికించి చూశాను. అక్క తిట్టేది ఎవర్నో కాదు. నన్నే! గదంతా బాత్రూం కంపు.

"అమ్మడూ! వాడి పక్కబట్టలు విడిగా ఒక బకెట్లో నానబెట్టవే. కనబడిన ప్రతి అడ్డమైన సినిమాకి పోవడం.. రాత్రుళ్ళు పక్క ఖరాబు చెయ్యడం. దొంగ గాడిద కొడుకు. ఆ ఉచ్చగుడ్డలు వాడితోనే ఉతికిస్తే గాని బుద్ధి రాదు." నాన్న ఎగురుతున్నాడు.

అమ్మ అన్నయ్యని కేకలేసింది. "చిన్నపిల్లల్ని అట్లాంటి సినిమాలకి ఎవరైనా తీసుకెళ్తారా? ఆ దరిద్రపుగొట్టు సినిమా చూసి బిడ్డ దడుచుకున్నాడు. పాపం! వాడు మాత్రం ఏం చేస్తాడు." అంటూ 'నేరం నాది కాదు.. సినిమాది' అని తేల్చేసింది.

సిగ్గుతో, లజ్జతో.. అవమాన భారంతో.. తేలు కుట్టిన దొంగవలె (దొంగలనే తేళ్ళు ఎందుకు కుడతాయో!) నిశ్శబ్దంగా అక్కణ్ణుంచి నిష్క్రమించాను. ఇదీ నా 'అవేకళ్ళు' కథ. మిత్రులారా! ఇక్కడ దాకా చదువుకుంటూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఆ కంటితోనే ఈ సూపర్ హిట్ సాంగ్ కూడా చూసి ఆనందించండి.

(

photo courtesy : Google)

Friday, 11 January 2013

ఘంటసాలా! ఓ ఘంటసాలా!


"ఘంటసాల గొప్పేంటో నాకర్ధం కాదు. ఆయన స్వరం ఒక అద్భుతం. ఎన్నో యేళ్ళు శాస్త్రీయ సంగీతం అభ్యసించాడు. మంచి సంగీత విద్వాంసుడు. ఆయనకి ఆ స్వరం దేవుడిచ్చిన వరం. అందులో పదో వంతు వాయిస్ నాకున్నా ఆంధ్రదేశాన్ని ఊపేసేవాణ్ణి." అనేవాడు నా స్నేహితుడు.

"నిజమే కదా!" అనుకునేవాణ్ణి.

మరి మన తెలుగువారిలో ఘంటసాలంతటి చక్కటి గాత్రం కలవారెవరూ లేరా? ఉండొచ్చు. ఘంటసాలకున్నంత శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం కలవారు ఇంకెవరూ లేరా? ఉండొచ్చు. మరి మనం ఘంటసాలనే ఇంకా ఎందుకు తలచుకుంటున్నాం? ఇందులో మతలబు ఏమిటి? విషయం నా స్నేహితుడు చెబుతున్నంత సింపుల్ కాదు.

సినిమా పాటలకి ఒక ప్రత్యేకత ఉంటుంది. సినిమా అనేది ఒక దృశ్య రూపం. తెరపై ఒక సన్నివేశం నడుస్తుంటుంది. పాత్రధారులు నటిస్తుంటారు. ఒక పుస్తకం చదువుతున్నట్లుగా ప్రేక్షకులు కథలో లీనమైపోతారు. ఉన్నట్లుండి పాట మొదలవుతుంది.

సినిమా పాట ప్రయోజనం ఆ సన్నివేశాన్ని మనసుకు హత్తుకు పోయేట్లు ముద్రించడం.. కథని ముందుకు నడిపించడం. అప్పటిదాకా తన గొంతుతో మాట్లాడిన పాత్రధారి హఠాత్తుగా గాయకుని గొంతులోకి మారిపోతాడు. వ్యవహారిక భాష గ్రాంధికంగా మారినట్లు.. గద్యం పద్యమైపోయినట్లు.. నటుని వాయిస్ గాయకుని స్వరంగా మారిపోతుంది.

ప్రధాన నటుడు సినిమా అంతా ఉంటాడు. తన హావభావాలతో క్యారెక్టర్ ని పండిస్తూ.. ప్రేక్షకులతో కనెక్ట్ కావడానికి అతనికి కావలసినంత సమయం ఉంటుంది. ఆ సౌలభ్యం గాయకుడికి ఉండదు. అతడు తన గొంతుతో పాత్రలోకి పరకాయ ప్రవేశం చెయ్యాలి. ఆ పాత్ర స్వభావం, సన్నివేశం.. 'ఫీల్' అవ్వాలి. సమయం చాలా పరిమితం. ఆ కొద్ది నిముషాల్లోనే నటుణ్ణీ, సన్నివేశాన్ని ఎలివేట్ చెయ్యగలగాలి.



నా వాదనకి ఉదాహరణగా పాండురంగ మహత్యం సినిమాని ప్రస్తావిస్తాను. కాళ్ళు కోల్పోయిన పుండరీకుడు 'అమ్మా అని అరచిన ఆలకించవేమమ్మా.. ఆవేదన తీరు రోజు ఈ జన్మకి లేదా?' అంటూ పిచ్చివాడిలా తలిదండ్రుల కోసం పరితపిస్తూ పాడతాడు. పాట చివర్లో ఘంటసాల తన హెవీ బేస్ వాయిస్ లో 'అమ్మా! నాన్నా!' అంటూ చేసే ఆర్తనాదాలు మన గుండెల్ని పిండేస్తాయి.

తలిదండ్రుల దర్శనం చేసుకున్న పుండరీకుడు 'ఏ పాదసీమ కాశీప్రయాగాది.. ' అంటూ ఆర్తిగా ఆలాపించే శ్లోకంలో ఘంటసాల స్వరం పుండరీకుని భావావేశాన్ని పూర్తిగా నింపుకుంది. సినిమాకి ఎంతో ముఖ్యమైన ఈ సన్నివేశాన్ని అద్భుతంగా ఆవిష్కరించడంలో ఘంటసాల గాత్రం పాలు చాలా ఎక్కువ. మిగిలిన కొద్ది పని పూర్తి చెయ్యడం రామారావుకి చాలా ఈజీ అయిపోయింది. ఒక అత్యున్నత గాయకుడు సన్నివేశ స్థాయిని ఎంత ఎత్తుకు తీసుకెళ్లగలడో ఈ ఉదాహరణ నిరూపిస్తుంది.

సినిమా పాటలు అనేక రకాలు. కొన్ని పాటలు కచేరీల్లో పాడుకోడానికి అనువుగా శ్రావ్యంగా ఉంటాయి. చక్కటి స్వరం, కొద్దిపాటి స్వరజ్ఞానం ఉన్నవారెవరైనా ఈ పాటలు పాడెయ్యవచ్చు. ఈ పాటలు ఘంటసాల కాఫీ తాగినంత సుఖంగా పాడెయ్యగలడు. పాడేశాడు కూడా. ఇంకొన్ని పాటలు సన్నివేశంలో మమేకమై.. ఆ సన్నివేశాన్ని ఎలివేట్ చేసే పాటలు. నా దృష్టిలో ఇవి బహుకష్టమైన పాటలు. ఈ 'బహుకష్టం' కేటగిరీ ఘంటసాల స్పెషాలిటీ.

మీరు యాభై, అరవైలలోని తెలుగు సినిమాల్ని జాగ్రత్తగా గమనిస్తే.. నే చెప్పే విషయం అర్ధమైపోతుంది. ఘంటసాల స్వరం కథలో ఇమిడిపోతుంది. కథని చెప్పేస్తుంది. ముందుకు నడిపిస్తుంది. ఇదేమి సామాన్యమైన విజయం కాదు. అయితే ఘంటసాల గానం ఈ పని చాలా అవలీలగా, అలవోకగా చేసేసింది. దటీజ్ ఘంటసాల!

(photo courtesy : Google)