Showing posts with label సావిత్రి. Show all posts
Showing posts with label సావిత్రి. Show all posts

Tuesday, 16 December 2014

సావిత్రితో ఓ పాట


"శిష్యా! ఏవిఁటోయ్ లాప్‌టాప్‌నలా తినేసేలా చూస్తున్నావ్?"

"గురుగారు! యూట్యూబులో సావిత్రి పాటని చూస్తున్నాను - మైమరచిపోతున్నానండి."

"ఆహా అలాగా! ఏవిఁటో ఆ పాట?"

"సంతానం సినిమాలో 'చల్లని వెన్నెలలో'  అంటూ ఓ పాటుందండి! పాటలో సావిత్రి అందం గూర్చి ఏమని చెప్పను? చచ్చేంత అందంగా వుంది గురుగారు! సావిత్రినే చూస్తూ ఆనందంగా, హాయిగా పాడుతూ.. ఆహాహా! నాగేస్వర్రావు ఎంతదృష్టవంతుడు! అసూయగా వుందండి!"

"ఒహో అదా నీ సమస్య? నీ అసూయ తగ్గే మార్గం చెబుతా శిష్యా!"

"చెప్పండి గురుగారు."

"ఇంట్లో మంచం వుందా?"

"వుంది."

"దుప్పటుందా?"

"వుంది."

"ఒక పన్జెయ్! మంచం మీద పడుకుని, దుప్పటి కప్పుకుని సావిత్రినే తలచుకుంటూ - ఆ పాట నువ్వే పాడుతున్నట్లు, సావిత్రి ప్రేమగా నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నట్లు ఊహించుకో!"

"కానీ.. "

"ఊఁ! అడుగు, మొహమాటమెందుకు?"

"నాకు పాడ్డం రాదు గురుగారు!"

"నాగేస్సర్రావుకి మాత్రం పాడ్డం వచ్చా శిష్యా? ఘంటసాల స్టోన్‌ని అరువు తెచ్చుకోలేదూ?"

"అవును కదా!"

"లే మరి! ఇంక నీదే ఆలీసెం. దుప్పటి తన్ని కళ్ళు ఘాట్టిగా మూసుకుని - 'సావిత్రి రా! సావిత్రి రా!' అంటూ రిపీటెడ్‌గా పిలువు! దెబ్బకి సావిత్రి దిగొస్తుంది!"

"కానీ గురుగారు.. "

"మళ్ళీ డౌటా శిష్యా! సర్లే - అడుగు."

"నాకు పియానో వాయించడం కూడా రాదు గురుగారు!"

"ఓరి దరిద్రుడా! నీకు సావిత్రితో డ్యూయెట్ పాడుకునే మార్గం చెబుతుంటే దిక్కుమాలిన డౌట్లతో సమయం వృధా చేస్తావేం! ఇంక నిన్ను బాగు చెయ్యడం నావల్ల కాదు. ఎందులోనన్నా దూకి చావు, పీడా విరగడౌతుంది, నే వెళ్తున్నా!"

"గురుగారు! గురుగారు!!.... "

(picture courtesy : Google)

Monday, 1 July 2013

'దేవదాసు' వేదన - తెలుగువారి రోదన



నాగేశ్వరరావు నటించిన దేవదాసు సినిమా విడుదలై అరవయ్యేళ్ళయింది. తెలుగు పత్రికల్లో ఒకటే కథనాలు. నాకవి చదువుతుంటే నవ్వొస్తుంది. తెలుగు సినీజర్నలిజం సన్మాన పత్రాల స్థాయిలో పరమనాసిగా ఉంటుంది. ఈ సినిమాలో నాగేశ్వర్రావు చుక్కమందు కూడా తాగకుండా నటించాట్ట (నాకైతే ఆయన ఫుల్లుగా తాగి నటించినా అభ్యంతరం లేదు)!

అసలీ అరవైయ్యేళ్ల గోలేంటి? బహుశా షష్టిపూర్తి సన్మానమేమో! ఏదైతేనేం.. తెలుగు సినీప్రేమికులు దేవదాసుని గుర్తు తెచ్చుకుని తన్మయత్వం చెందుతున్న ఈ సందర్భాన దేవదాసు గూర్చి నేనూ నా ఆలోచనలు రాస్తున్నాను. అయితే నాగేశ్వరరావు సినిమా షూటింగులో గడ్డపెరుగు తిని నటించాడా? గొడ్డుకారం తిని నటించాడా? లాంటి చవకబారు వివరాలకి నేను పోదల్చుకోలేదు.

అరవైయ్యేళ్ల క్రితం (1953) ఈ దేవదాసు సినిమా ఎందుకంత అఖంఢ విజయం సాధించింది? ఇప్పుడు నేన్రాయబోయే అంశాలు మొత్తం ఈ ప్రశ్నకి సమాధానం చెప్పుకుంటూ రాస్తాను. దేవదాసు సినిమాకి ఆధారం బెంగాలీ పాపులర్ రచయిత శరత్ చంద్ర చటర్జీ రాసిన దేవదాసు అనే నవల.

నేను చిన్నప్పుడు శరత్ బాబు సాహిత్యం (దేశీ ప్రచురణలు) చదివాను. అప్పుడే దేవదాసు నవల కూడా చదివాను. వివరాలు సరీగ్గా గుర్తులేదు కానీ.. సినిమాలో ఉన్నంత నాటకీయత నవలలో ఉండదని గుర్తు. ఇప్పుడా చెత్త మళ్ళీ చదివే ఓపిక లేదు. అయితే నాగేశ్వర్రావు నటించిన దేవదాసు సినిమా చాలాసార్లు చూశాను.

నవల చదవాలంటే కష్టంగానీ.. సినిమా చూడ్డం చాలా సుఖం. హాల్లో కూర్చుంటే మన ప్రమేయం లేకుండానే వెనక కన్నాల్లోంచి తెరమీద సినిమా పడిపోతుంది. కాబట్టి ఇప్పుడు నా పోస్ట్ అక్కినేని నాగేశ్వర్రావు నటించిన దేవదాసు సినిమా కథకి మాత్రమే పరిమితం.

దేవదాసు సినిమాకి ముందు ఆరేళ్ళ క్రితం బ్రిటీష్ వాడి నుండి మనకి రాజకీయంగా అధికార మార్పిడి జరిగింది. సమాజంలో మాత్రం ఎటువంటి మార్పూ లేదు. ఆనాడు మన సమాజంలో కులం, మతం, డబ్బు చుట్టూ చాలా ఖచ్చితమైన గోడలు, లక్ష్మణరేఖలు ఉన్నాయి. సమాజ స్థితిగతులకి చాలా స్పష్టమైన నిర్వచనం ఇవ్వబడి ఉంది.

ప్రేక్షకుడు అన్నవాడు ఎక్కడో ఆకాశంలోంచి ఊడిపడడు. వాడు సమాజానికి ప్రతిబింబం. అంచేత  సాధారణ ప్రేక్షకుడు సమాజ చట్రం నుండి బయటపడి ఆలోచించగలిగే స్థితి, స్థాయిలో ఉండడు. ఆనాడు నిరక్షరాస్యత కూడా చాలానే ఉంది. (అయితే అక్షరాస్యతకి, ప్రోగ్రెసివ్ థింకింగ్ కి సంబంధం ఉంటుందనే భ్రమ నాకు లేదు).

ఈ సినిమా విజయానికి ముఖ్యకారణం.. కథ మొదటి నుండి చివరిదాకా సాంఘిక కట్టుబాట్లని గౌరవిస్తూ (ప్రమోట్) చేస్తూ ఉంటుంది. జమీందారు కొడుకైన దేవదాసు పక్కింటి పేదపిల్లతో స్నేహం కడతాడు. దేవదాసు పెద్దకులంవాడు, డబ్బున్నవాడు. కావున నేచురల్ గా పార్వతి దేవదాసుకి surrender అవ్వాలి. అయి తీరాలి (కాకుంటే ప్రేక్షకులు ఒప్పుకోరు).

జమీందార్ల పిల్లలు చదువుకోటానికి పట్నం పోవటం అనేది బ్రిటిష్ ఇండియాలో చాలా కామన్. కావున శరత్ కూడా కథ అలాగే రాసుకున్నాడు. దేవదాసు కూడా పట్నం పొయ్యి ఏవో చదువులు వెలగబెడతాడు. జట్కాబండి తోలుకుంటూ (పాట పాడుకుంటూ) ఊళ్లోకి వచ్చి పార్వతికి ఏదో నగ ప్రెజెంట్ చేసి తన ఖరీదైన తన ప్రేమని ప్రదర్శించుకుంటాడు (ఎంతైనా జమీందారు బిడ్డ కదా).

ఇలా కొంతకాలం శరత్ బాబు నాయికానాయకుల మధ్య స్వచ్చమైన ప్రేమని పూవులు పూయనిస్తాడు. కాయలు కాయనిస్తాడు. భవిష్యత్తులో వారి ప్రేమ అమరం కావాలంటే ఆ మాత్రం సన్నివేశాలు ఎస్టాబ్లిష్ కావాల్సిందే. వీళ్ళ ప్రేమ పెళ్ళిగా మారాలంటే పెద్దల అనుమతి కావాలని, అది అసాధ్యమని శరత్ కి కథ మొదట్లోనే తెలుసు. అయినా ఎక్కడా ఆ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడతాడు.

(కథని ముందుకు నెట్టడం కోసం) ఒక దుర్ముహోర్తాన దేవదాసు తన తండ్రి దగ్గర పెళ్లి ప్రసక్తి తెస్తాడు. ముసలి జమీందారు తమ వంశం పరువు, మర్యాద గూర్చి ఒక లెక్చర్ ఇస్తాడు. పాపం! ఆ ముసలాయన మాత్రం కొడుకు ప్రేమని ఎలా ఒప్పుకుంటాడు? ఛస్తే ఒప్పుకోకూడదు. మధ్యతరగతివారు దేవదాసు తండ్రి సమస్యని ఎంతో సానుభూతితో అర్ధం చేసుకుంటారు.

మనది పవిత్ర భారత దేశం. ఈ పుణ్యభూమిలో తండ్రి మాటకి కట్టుబడి ఒక యుగపురుషుడు అడవుల బాట పట్టాడు. ఇట్టి భూమిలో దేవదాసు తండ్రిమాట చచ్చినట్లు వినాల్సిందే. వినకపోతే జనాలకి నచ్చదు. అంచేత ప్రేక్షకుల కోరిక మన్నించి దేవదాసు పార్వతిని వదులుకుని పట్నం పోతాడు.

పట్నంలో భగవాన్ అనే ఒక సకలకళావల్లభుడు దేవదాసుకి ముఖ్యస్నేహితుడు. అతని ప్రోద్బలంతో దేవదాసు తాగుడు మొదలెడతాడు. (తాగుడు చెడ్డ అలవాటు. దేవదాసు వంటి సచ్చీలునికి స్వతహాగా ఇటువంటి దుర్బుద్ధి పుట్టరాదు). భగవాన్ అనేవాడు హీరోకి తాగుడు అలవాటు చెయ్యడానికి, వేశ్య దగ్గరకి తీసుకెళ్లడానికి రచయితచే సృష్టించబడ్డ ఓ అల్పజీవి.

దేవదాసు మీద ప్రేమని చంపుకోలేని పార్వతి అర్ధరాత్రి దేవదాసు ఇంటికొచ్చి తనని ఎక్కడికైనా తీసుకెళ్ళిపొమ్మంటుంది. దేవదాసు భయకంపితుడై పోతాడు (అవును. సమాజం, సంప్రదాయం దేవదాసు ఉఛ్వాసనిశ్వాసలు). పార్వతి ప్రపోజల్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తాడు. ధర్మబద్దుడైన దేవదాసు ఇప్పుడు మనకి ఇంకా నచ్చుతాడు.

దేవదాసు తిరస్కృతికి గురైన పార్వతి తన తండ్రి వయసున్న జమిందార్ని వివాహం చేసుకుంటుంది (ఆ రోజుల్లో పార్వతి వంటి చిన్నపిల్లల్ని పెళ్లి చేసుకోటానికి డబ్బున్న ముసిలి వెధవలు గుంటనక్కల్లా కాచుక్కూర్చుని ఉండేవాళ్ళనుకుంటా). పార్వతి ఆ ముసలి జమీందారు పిల్లల్ని సన్మార్గంలో పెడుతుంది. పార్వతి ఎంతటి మహాఇల్లాలు! పవిత్ర భారతీయ ధర్మాన్ని పాటించిన మహాపతివ్రతా శిరోమణి. పార్వతి ఇప్పుడు మనకి ఇంకా నచ్చుతుంది.

ఈ తాగుబోతు దేవదాసుని చంద్రముఖి అనే వేశ్య కూడా ఇష్టపడుతుంది. ఆవిడ వేశ్య అయినప్పటికీ ఉన్నత హృదయురాలు. అందువల్లనే ఆ వేశ్యామణి దేవదాసు పరిచయం వల్ల తన వృత్తి, బ్రతుకు హీనమైందని తెలుసుకుంటుంది. (ఆనాటికీ, ఈనాటికీ జనులు తమ శారీరక అవసరాల కోసం వేశ్యల వద్దకు వెళ్ళెదరు. కానీ ఆ వృత్తి మాత్రం ఎప్పటికీ హీనమైందే). ఈ పాయింట్ కూడా ప్రేక్షకకులకి బాగా పడుతుంది.


ఇప్పుడు శరత్ పాఠకుల్ని ఏడిపించటానికి కావలసిన దినుసులన్నీ సమకూర్చుకున్నాడు. రంగం సిద్ధం చేశాడు. ఈ దేవదాసు కథలో అందరూ ఉత్తములే. ఉన్నత హృదయులే. సమాజ చట్రంలో ఇరుక్కుపోయిన విధివంచితులు. లలాటలిఖితాన్ని ఎవరు మాత్రం తప్పించుకోగలరు? (శరత్ కథలన్నీ ఇట్లాంటి జీళ్ళపాకాలే). క్లినికల్ సైకాలజిస్టులు దేవదాసుని sadomasochist అంటారు.

మానసిక వైద్యంలో త్రాగుడు అలవాటుని alcohol dependence syndrome అంటారు. మానసిక వైద్యులు మద్యపానం అనేదాన్ని ఒక రోగంగా చూస్తారు. దేవదాసు మొదట్లో పార్వతిని మర్చిపోవటానికి (తన పిరికితనం వల్ల జరిగిన నష్టం మర్చిపోటానికి) త్రాగడం మొదలెట్టినా.. తర్వాత్తర్వాత ఆ అలవాటుకి బానిసైపొయ్యాడు. (దేవదాసు త్రాగుడు మొత్తం పార్వతి ఖాతాలో వేసేస్తాడు శరత్).

తాగుబోతు భగ్నప్రేమికులకి protagonist ఈ దేవదాసు. తాగుడు అలవాటుని దేవదాసు కథ romanticise చెయ్యటం వల్ల తెలుగు సమాజానికి నష్టం జరిగింది. అందుకే ప్రతి వెధవ ప్రేమ కోసం వెంపర్లాడటం (సాధారణంగా ఈ ప్రేమికుల జాతి చదువులో drop outs అయ్యుంటారు), ఆ ప్రేమ విఫలమైందని తాగుడు పంచన చేరడం చూస్తుంటాం ('ప్రేమించిన' అమ్మాయి మీద యాసిడ్ దాడి చేసేకన్నా alcohol  తాగితాగి, లివర్ చెడిపొయ్యి చావడం మంచిదే).

ప్రేక్షకుల్ని బాగా ఏడిపించటానికి కథలో శరత్ ఒక తెలివైన ఎత్తుగడ వేస్తాడు. చచ్చేముందు ఒక్కసారైనా తనకి సేవ చేసుకునే అదృష్టం కల్పించమని పార్వతి దేవదాసుని వేడుకొంటుంది (ఎందుకో తెలీదు). దేవదాసు చావటానికి ముందు భీకరమైన వర్షంలో దుర్గాపురం ప్రయాణం చేసి, చివరాకరికి ఓ చెట్టుకింద దిక్కులేని చావు చస్తాడు.

అరవయ్యేళ్ళనాడు నాటి కులాలు, కట్టుబాట్లను గౌరవించుటచేతనూ.. ప్రతిపాత్రా పాత్రోచితంగా పరమపవిత్రంగా ప్రవర్తించుటచేతనూ.. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాలని బలంగా తాకింది. ఆ రోజుల్లో కొద్దోగొప్పో చదువుకున్న తెలుగువారికి బెంగాలీ బాబుల్లాగా సున్నితంగా, ఉన్నతంగా ఆలోచించటం గొప్ప ఫ్యాషన్.

ఎగువ మధ్యతరగతి సెక్షన్ ప్రతినిధిగా వారి ఆలోచనలకి తగ్గట్టుగా శరత్ బాబు ఒక పవిత్రమైన, హృద్యమైన, విషాదకరమైన కథ వండాడు. ఈ బెంగాలి వంటకాన్ని గొప్ప తెలుగు వంటకంగా మార్చిన ఘనత వేదాంతం రాఘవయ్య, సముద్రాల రాఘవాచార్య, డియల్, సుబ్బురామన్, ఘంటసాలలకి దక్కుతుంది. ఈ ప్రతిభావంతులు నాగేశ్వరరావు, సావిత్రిలని దేవదాసు, పార్వతిలుగా ఆవిష్కరించి బోల్డంత సోమ్మునీ, కీర్తినీ మూటగట్టుకున్నారు.

ఈ కథ మనకి గొప్ప నీతిని చెబుతుంది. ఈ సమాజంలో మనం ఏమీ మార్చలేం. మనకి కావలసిందేదీ పొందలేం. సమాజ కట్టుబాట్లని మనం ఎలా కాదనగలం? మనం చేయగలిగిందల్లా.. మన చేతకానితనానికి ఏడ్చుకుంటూ బ్రతకటమే! అందుకే ఈ సినిమా అంత విజయం సాధించిందని నా అభిప్రాయం. అసలు ఈ సినిమాలో జనాలకి బాగా నచ్చిన పాయింట్.. పార్వతి, దేవదాసు పెళ్లి చేసుకోకపోవటం!

చివరి మాట :


మిత్రులారా! దేవదాసు సినిమాని ఇంత నిర్దయగా విశ్లేషించిన వ్యాసం మీరు ఎప్పుడూ చదివి ఉండరు (నేనూ చదవలేదు). ఆ సినిమాని చాలాసార్లు చూసి ఎంజాయ్ చేశాను (ఏడిచాను). ఇంత క్రిటికల్ రాయటం నాకూ ఇష్టం లేదు. ఆ సినిమా ఎందుకంతగా విజయం సాధించిందని ఆలోచించినప్పుడు నా మదిలో మెదిలిన ఆలోచనల్ని uncensored గా రాసేశాను. దేవదాసు సినీప్రేమికులు నన్ను మన్నించగలరు.

(photo courtesy : Google)

Wednesday, 19 June 2013

ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి



"నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కొడుకుని మాత్రం పెళ్ళికి ఒప్పించాలి." నా ప్రాణస్నేహితుని విన్నపం. పాపం! మరీమరీ అడుగుతుంటే కాదనలేకపొయ్యాను. అంచేత ఇవ్వాళ ఆఫీసు నుండి డైరక్టుగా స్నేహితుడి కొంపకే తగలడ్డాను.

మావాడి పుత్రరత్నం లాప్ టాప్ లోకి తీవ్రంగా చూస్తూ ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. వీణ్ని చిన్నప్పుడు ఎత్తుకుని తిరిగాను. అంతలోనే ఎంతవాడైపొయ్యాడు!

"ఏవాఁయ్! పెళ్లి ఎందుకొద్దంటున్నావో తెలుసుకోవచ్చా?" అంటూ పలకరించాను.

"పెళ్లి చేసుకోవటం వల్ల లాభమేంటి?" కుర్రాడు క్విజ్ మాస్టర్లాగా ప్రశ్నించాడు.

"భలేవాడివే! అన్నీ లాభాలే. ఎలాగూ లాప్టాప్ ముందే ఉన్నావుగా. ఓసారి యూట్యూబులో నేచెప్పిన పాట పెట్టు." హుషారుగా అన్నాను.

"ఏ పాట?"

"దేవత అనే సినిమాలో 'ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి' అని కొట్టు." అంటూ తొందరపెట్టాను.


"ఇదిగో కొడుతున్నా."




"పాట బాగానే వుంది. కానీ ఈ పన్లన్నీ నాక్కాబోయే భార్య చేస్తుందా?" సందేహంగా అడిగాడు. 

"ఎందుకు చెయ్యదు! మా ఆవిడ ఈ రోజుకీ నాకివన్నీ చెయ్యట్లేదా? అసలావిడ ఈ పాటలో సావిత్రికిలాగ నా తలని రోజూ అదేపనిగా దువ్వడం వల్లనే నాకీ బట్టతలొచ్చింది తెలుసా?" అంటూ నా బట్టతల రహస్యం విప్పాను.

"నిజంగా!" కుర్రాడి మొహంలో వెలుగు.

"మరేంటనుకున్నావ్? రౌతు కొద్దీ గుర్రం. అంతా మనలోనే ఉంది." రహస్యం చెబుతున్నట్లుగా అన్నాను.

"అయితే సరే. నేను పెళ్లి చేసుకుంటాను." సిగ్గుపడుతూ చెప్పాడు.

నా ప్రాణస్నేహితుడు గుమ్మడి స్టైల్లో నా రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు.

"నీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను." డైలాక్కూడా గుమ్మడిదే!

టైం చూసుకుని హడావుడిగా ఇంటికి బయల్దేరాను.

హాల్లో సోఫాకి నిండుగా కూర్చునుంది నా భార్యామణి. రిమోట్ ని పుర్ర చేత్తో పట్టుకుని ఠపాఠపామంటూ చానెల్స్ మారుస్తుంది. నన్ను చూడంగాన్లే ఇంతెత్తున లేచింది.

"ఏవిటయ్యా ఇది? మనిషన్న తరవాత బుద్దీజ్ఞానం ఉండఖ్ఖర్లా? ఆఫీసు నుండి తిన్నగా ఇంటికి రాకుండా మధ్యలో నీ బోడి పెత్తనాలేంటి? ఇంట్లో పన్లన్నీ నీ బాబుగాడు చేస్తాడనుకున్నావా? ఇంత లేటుగా వస్తే అంట్లెప్పుడు తోముతావ్? వంటెప్పుడు చేస్తావ్?" అంటూ సూర్యకాంతంలా గాండ్రించింది.

"ఆఁ.. ఆఁ.. వచ్చె.. వచ్చె.. అయిపోయింది. ఎంతలో పని? చిటికెలో అవగొట్టనూ!" అంటూ వంటింట్లోకి పరిగెత్తాను.

(photo courtesy : Google)

Friday, 12 April 2013

భార్యే మాయ! కాపురమే లోయ!!

హెచ్చరిక : ఈ టపా మగవారికి ప్రత్యేకం. ఆడవారు చదవరాదు.


అతనో చిరుద్యోగి. మంచివాడు. మృదుస్వభావి. పుస్తక ప్రియుడు. తెల్లనివన్ని పాలు, నల్లనివన్ని నీళ్ళనుకునే అమాయకుడు. సాధారణంగా ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి ఏదోక దుర్గుణం కలిగి ఉంటాడు. మనవాడి దుర్గుణం.. కవిత్వం పిచ్చి!

స్నేహితుడి చెల్లెల్ని చూసి ముచ్చటపడి ప్రేమించాడు. పెద్దల అంగీకారంతో ప్రేమని పెళ్ళిగా మార్చుకున్నాడు. కొత్తగా కాపురానికొచ్చిన భార్యని చూసి 'జీవితమే సఫలము.. రాగ సుధా భరితము.. ' అనుకుంటూ తెగ ఆనంద పడిపొయ్యాడు.

భార్య కూడా భర్త కవిత్వానికి తీవ్రంగా మురిసిపోయింది. ఆవిడకి తన భర్త కవిత్వంలో శ్రీశ్రీ మెరుపు, దాశరధి విరుపు, ఆత్రేయ వలపు కనిపించాయి. ఆయనగారి కవితావేశానికి కాఫీలందిస్తూ తన వంతు సహకారం అందించింది.

ఆ విధంగా ఆవిడ అతనిలో విస్కీలో సోడాలా కలిసిపోయింది. ఇప్పుడు వారి జీవితం మల్లెల పానుపు, వెన్నెల వర్షం. ఆ విషయం ఈ పాట చూస్తే మీకే తెలుస్తుంది.



కొన్నాళ్ళకి.. భార్యకి భర్త తాలూకా కవితామైకం దిగిపోయింది. కళ్ళు తెరచి చూస్తే ఇంట్లో పనికిమాలిన సాహిత్యపు పుస్తకాలు తప్పించి.. పనికొచ్చే ఒక్క వస్తువూ లేదన్న నగ్నసత్యాన్ని గ్రహించింది.

'ఏమిటీ కవితలు? ఎందుకీ పాటలు?' అని ఆలోచించడం మొదలెట్టింది. తత్ఫలితంగా ఆవిడకి దాహం వెయ్యసాగింది. అంచేత.. చల్లని నీటి కోసం లేటెస్ట్ మోడెల్ ఫ్రిజ్ కొందామని భర్తనడిగింది.

"ఫ్రిజ్ ఎందుకె చిన్నాదానా.. కష్టజీవుల మట్టికుండ లుండగా.. " అంటూ పాటెత్తుకున్నాడు మన భావుకుడు. భార్య నొసలు చిట్లించింది.

భర్త ఆఫీసుకెళ్ళినప్పుడు బోర్ కొడుతుంది. అంచేత లేటెస్ట్ మోడెల్ సోని LED టీవీ కొందామని భర్తనడిగింది..

"టీవీలెందుకె పిల్లాదానా.. పచ్చని ప్రకృతి పురులు విప్పి ఆడగా.. " అంటూ కవితాత్మకంగా చెప్పాడు మన కవి. భార్యకి చిరాకేసింది.

ఎండలు మండిపోతున్నాయ్. ఉక్కపోతగా ఉంది. లేటెస్ట్ మోడెల్ ఏసీ కొందామని భర్తనడిగింది.

"వట్టివేళ్ళ తడికెల తడిలో.. చెలి చల్లని చెక్కిలిపై నా మది సేద తీరగా.. " అంటూ లలితగీతం పాడాడు. భార్యకి మండిపోయింది. అన్నకి కబురు చేసింది.

అన్న పీకల్లోతు అప్పుల్లో, తీవ్రమైన కరువులో ఉన్నాడు. పీత కష్టాలు పీతవి! లేటెస్ట్ మోడల్ ఫ్రిజ్, టీవీ, ఏసీ కొనటం లేదని.. అతనికి భార్య తిండి పెట్టకుండా వారం రోజులుగా కడుపు మాడ్చేస్తుంది. చెల్లి కబురందుకుని పరుగున వచ్చాడు. చెల్లి కష్టాలు విన్న అన్న గుండె తరుక్కుపోయింది. హృదయం కదిలిపోయింది. కడుపు మండిపోయింది.

హుటాహుటిన చెల్లిని బజారుకి తీసుకెళ్ళి పేద్ద ఫ్రిజ్, ఇంకా పెద్ద సోనీ LED టీవీ, అతి నిశ్శబ్దంగా పంజేసే అత్యంత ఖరీదైన ఏసీ.. ఇంకా చాలా.. 'జీరో' డౌన్ పేమెంట్, 'ఆల్ పేమెంట్ ఓన్లీ ఇన్ ఇన్స్టాల్మెంట్స్' అనబడే వాయిదాల పద్ధతి స్కీములో (దీన్నే ముద్దుగా EMI అంటారు).. బావగారి పేరు మీద కొనిపించాడు. పన్లోపనిగా చెల్లెలి ఖాతాలో అవన్నీ తనూ తీసేసుకున్నాడు ముద్దుల అన్న!

'ఏమిటివన్నీ?' అంటూ ఆశ్చర్యంగా అడిగిన భర్తకి కాఫీ ఇచ్చి.. "పయనించే మన వలపుల నావ.. " అంటూ పాడింది భార్యామణి. మొహం చిట్లించాడు కవి. ఏసీ ఆన్ చేస్తూ "నీ మది చల్లగా.. స్వామి నిదురపో.. " అంటూ ఇంకో పాటెత్తుకుంది భార్య. ఖిన్నుడైనాడు కవి! హృదయం మూగగా రోదించింది. గోలగా ఘోషించింది. ఘోరంగా ఘూర్ఘించింది.

తనకొచ్చే జీతంతో EMI లు, కరెంట్ బిల్లులు కట్టలేక విలవిలలాడిపొయ్యాడు మన కవి పుంగవుడు. దిక్కు తోచక అప్పులు చెయ్యసాగాడు. అప్పులు చెయ్యడమే కానీ.. తీర్చే మార్గం కనబడ్డం లేదు. ఏం చెయ్యాలో తోచట్లేదు. దిగులుతో చిక్కి.. చూడ్డానికి రోగిస్టివాడిలా కనిపించసాగాడు. సహజంగానే కవితా గానం గాయబ్ అయిపోయింది.

ఆర్ధిక బాధలు తట్టుకోలేక.. ఓ మంచిరోజు ఇంట్లోంచి వెళ్ళిపొయ్యాడు. ఊరవతల ఓ కుళ్ళు వీధిలో కరెంట్ స్థంభానికి అనుకుని.. వీధి కుక్కని నిమురుతూ తన దుస్థితికి కుమిలిపోసాగాడు. అరె! చాల్రోజులకి మళ్ళీ కవిత్వం పొంగింది! దిగులుగా, ఆవేదనగా, ఆర్తిగా, నిర్వేదంగా, నిస్సారంగా, నీరసంగా.. జీవత సారాన్ని నెమరు వేసుకుంటూ పాడటం మొదలెట్టాడు.. పాపం!

అతను పాడుకుంటున్న పాట చూడండి.

< />
భర్త కనపడక భార్య తల్లడిల్లింది. భయపడిపోయింది. 'తన భర్త లేకపోతే.. EMI కట్టేదెవరు? ఈ టీవీ, ఫ్రిజ్, ఏసీ.. మైగాడ్.. ఇవన్నీ ఏమైపోవాలి? షాపువాళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోతే నే బ్రతికేదెట్లా? అయ్యో! భగవంతుడా! ఏ ఆడదానికీ రాని కష్టాన్ని నాకు కల్పించావేమయ్యా? ఇది నీకు న్యాయమా? ధర్మమా?' అంటూ దేవుణ్ని వేడుకుంది.

పిమ్మట తేరుకుంది. తదుపరి.. ఓ జట్కాబండి బాడుగకి మాట్లాడుకుని.. పారిపోయిన ఖైదీ కోసం పోలీసులు వెతికినట్లు.. భర్త కోసం వీధులన్నీవెదకసాగింది. మొత్తానికి భర్త దొరికాడు. EMI కట్టించే నిమిత్తం.. అతగాణ్ణి బలవంతంగా ఇంటికి లాక్కెళ్ళింది. కథ దుఃఖాంతం!

(photo courtesy : Google)

Thursday, 14 February 2013

'ఓహో మేఘమాలా.. '! కొంప ముంచితివి గదా!!


"గురు గారు! నాకు దిగులుగా ఉంది. ఈ మధ్య నా బ్రతుకు మరీ ఆఫ్ఘనిస్తాన్ లా అయిపోయింది."

"అంత కష్టమేమొచ్చి పడింది శిష్యా!"

"నా భార్య పోరు పడలేకున్నాను. ఆవిడకి నా సంపాదన చాలట్లేదుట."

"పోనీ నచ్చజెప్పి చూడకపొయ్యావా?"

"ఆన్నీ అయిపొయ్యాయండీ. నాకు జీవితం మీద విరక్తి పుట్టేసింది. మీరు మరో శిష్యుణ్ణి వెతుక్కోండి. సెలవు."

"తొందరపడకు శిష్యా! నే చెంతనుండగా నీకు చింతనేలా? సంగీత చికిత్సతో నీ భార్యలో పరివర్తన కలిగిద్దాం."

"సంగీత చికిత్సా?!అంటే?"

"పాత తెలుగు సినిమాల్లో బోల్డన్ని మంచి పాటలు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ఒక్కో పాటకి ఒక్కో రకమైన వైద్య గుణం ఉంటుంది. మొన్నొక నిద్ర లేమి రోగం వాడొచ్చాడు. రాత్రిళ్ళు మంచం మీద పడుకుని 'నిదురపోరా తమ్ముడా.. ' పాట వినమని సలహా ఇచ్చా. అంతే! ఆ రోజు నుండి వాడు రాత్రింబవళ్ళు గురకలు పెట్టి మరీ నిద్రోతున్నాడు."

"నిజంగానా! నా భార్యకి మీ సంగీత వైద్యం పని చేస్తుందంటారా?"

"నిస్సందేహంగా. సంగీతానికి రాళ్ళే కరుగుతాయంటారు. ఆడవారి మనసు కరిగించేందుకు ఒక మంచి పాట చెబ్తాను. అది చూపి నీ భార్యని నీకు చరణదాసిగా చేసుకో. ఈ విడియో చూడు."



"పాట చాలా బాగుందండి."

"ఎస్.రాజేశ్వరరావు సంగీతంలో తిరుమల లడ్డంత తియ్యదనం ఉందోయి. సదాశివ బ్రహ్మం కవిత్వం కాకరకాయ వేపుడంత కమ్మగా ఉంటుంది. ఘంటసాల, లీలల గానంలో వైబ్రేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి మల్టిప్లై అయ్యి అణుక్షిపణి వలే శక్తివంతమవుతాయి. ఆ క్షిపణి నీ భార్య చెవులో కర్ణభేరిని తాకి మెదడులో ప్రకంపనలు కలిగిస్తుంది. అంతే! కఠినమైన ఆమె మనసు క్వాలిటీ ఐస్ క్రీములా కరిగిపోతుంది. పిమ్మట నీ భార్య గుండమ్మకథలో సావిత్రంత అనుకూలవతిగా మారిపోతుంది."

"గురు గారు! ఈ పాటని నాగేశ్వర్రావు, సావిత్రి  పాడుకున్నారు. వాళ్ళు పాడిన పాట నా భార్యనెట్లా మారుస్తుంది?"

"చూడు శిష్యా! ఇక్కడ ఎవరు ఎవరి కోసం పాడారన్నది కాదు పాయింట్. పాటలోని కంపనలు, ప్రకంపనలు ముఖ్యం. మనసులోని భూతులు, అనుభూతులూ ప్రధానం. అందుకే గత యాభయ్యారేళ్ళుగా ఈ పాట తెలుగు వారిని మందు కొట్టకుండానే మత్తెక్కిస్తుంది."

"మీరు చెప్పేది సరీగ్గా అర్ధం కావట్లేదు గానీ.. వింటానికి బానే ఉంది. వర్కౌట్ అవుతుందంటారా?"

"నా సలహా గురి తప్పదు శిష్యా! అయితే ఒక కండిషన్. నీ భార్యని ఇంటికి ఈశాన్యం మూలకి తీసుకెళ్ళి ఈ పాటని చూపించు. ఆ సమయంలో లాప్టాప్ తూర్పు దిక్కుకి తిప్పి ఉంచాలి. గుర్తుంచుకో. పొమ్ము. విజయుడవై రమ్ము!"


           *                                *                                 *                            *

"గురు గారు! కొంప మునిగింది."

"ఏమిటి నాయనా ఆ కంగారు? సత్తుబొచ్చెకి సొట్టల్లా వంటి నిండా ఆ దెబ్బలేమిటి?"

"మీ సలహా విన్న ఫలితం. మీరు కొండ నాలుక్కి మందేశారు.. ఉన్న నాలుక పోయింది."

"తిన్నగా చెప్పి అఘోరించు శిష్యా!"

"మీరు చెప్పినట్లే నా భార్యకి 'ఓహో మేఘమాల.. ' విడియో చూపించాను. ఆవిడ ఆ పాట చూసి ఎంతగానో ఆనందించింది. మీ వైద్యం పంజేసిందని సంతోషించాను. సావిత్రి మెళ్ళో నాగేశ్వరరావు పెట్టిన హారం ఆవిడకి బాగా నచ్చిందిట. అదిప్పుడు అర్జంటుగా కావల్ట."

"అంత సొమ్ము నీ దగ్గరెక్కడిది?"

"నేనూ అదే సమాధానం చెప్పాను. 'సినిమాలో నాగేశ్వరరావు మాత్రం ఆ హారం కొని సావిత్రికి పెట్టాడా? కొట్టుకొచ్చిందేగా. ఆ మాత్రం నీకు చేత కాదా?' అంది."

"దొంగతనం మహాపాపం శిష్యా!"

"నేనూ ఆ ముక్కే అన్నాను. ఫలితంగా వంటి నిండా ఈ దెబ్బలు. హబ్బా! ఒళ్ళంతా ఒకటే సలపరంగా ఉంది. ఇప్పుడు నాకు దిక్కెవరు గురు గారు?"

"దిక్కులేని వాడికి ఆ దేవుడే దిక్కు నాయనా! అయినా.. తన్నుటకు నీ భార్య యెవ్వరు? తన్నించుకొనుటకు నీవెవ్వరు? అంతా వాడి లీల! మొహం మీదే తలుపేస్తున్నందుకు ఏమీ అనుకోకు. అసలే చలికాలం. నాకు నిద్ర ముంచుకొస్తుంది."

"గురు గారు! గురు గారు.. "


(photos courtesy : Google)

Monday, 26 November 2012

పిల్ల సందేహాలు - పిడుగు సమాధానాలు


అప్పుడు నాకు పదేళ్ళు. అమ్మానాన్నల మధ్య కూర్చుని 'కన్యాశుల్కం' సినిమా చూస్తున్నాను (అవునురే! పదేళ్ళ వయసులో ఏ ఎన్టీవోడి సినిమానో చూసుకోక - కన్యాశుల్కాలు, వరకట్నాలు నీకుందుకురా? అయ్యా! సినిమాలు చూచుట అనేది పరమ పవిత్రమైన కార్యము. మనం ప్రతిరోజూ ఎంతమంది దేవుళ్ళకి మొక్కట్లేదు? అట్లే, అన్నిరకముల సినిమాలు చూడవలెననీ, ఎన్ని సినిమాలు చూచినచో అంత పుణ్యము లభించునని నా ప్రగాఢ విశ్వాసము).

తెర మీదకి ఎవరెవరో వస్తున్నారు. ఏవిటేవిటో మాట్లాడుతున్నారు. సినిమా ఒక్కముక్క కూడా అర్ధం కావట్లేదు. కనీసం ఒక్క ఫైటింగు కూడా లేదు. సినిమా పరమ బోర్!

ఉన్నట్టుండి సావిత్రి 'లొట్టిపిట్టలు' అంటూ పెద్దగా నవ్వడం మొదలెట్టింది. అట్లా చాలాసేపు నవ్వుతూనే ఉంది. ఎందుకంత పడీపడీ నవ్వుతుంది? నాకర్ధం కాలేదు.

"అమ్మా! సావిత్రి ఎందుకట్లా నవ్వుతుంది?"

"సావిత్రి మధురవాణి వేషం వేస్తుంది. మధురవాణి వేశ్య!" అంది  అమ్మ.

ఓహో అలాగా! వేశ్యలు పెద్దగా నవ్వెదరు.

అంతలోనే ఇంకో సందేహం.

"వేశ్య అంటే?"

అమ్మ చిరాగ్గా మొహం పెట్టింది. ఒక క్షణం ఆలోచించింది.

"వేశ్య అంటే సంపాదించుకునేవాళ్ళు." అంది.

ఓహో అలాగా! సంపాదించుకునేవారిని వేశ్యలు అందురు.

ఇప్పుడింకో సందేహం.

"అమ్మా! నాన్న సంపాదిస్తున్నాడుగా. మరి నాన్న కూడా వేశ్యేనా?"

అమ్మ చిటపటలాడింది.

"నీ మొహం. అన్నీ కావాలి నీకు. నోర్మూసుకుని సినిమా చూడు." అంటూ కసురుకుంది.

నా మొహం చిన్నబోయింది.

          *                     *                   *                    *                        *                    
మళ్ళీ చిన్నప్పుడే!

అది మధ్యాహ్నం. సమయం సుమారు మూడు గంటలు. అమ్మ, ఆవిడ స్నేహితురాళ్ళు కబుర్లు చెప్పుకునే సమయం. బియ్యంలో మట్టిగడ్డలు ఏరుతూ, తిరగలి తిప్పుతూ, ఊరగాయ పచ్చడికి ముక్కలు తరుగుతూ లోకాభిరామాయణం చెప్పుకుంటుంటారు. నేనా కబుర్లు ఆసక్తిగా వినేవాణ్ని.

ఆరోజు ఎదురింటి విజయక్కయ్య, పక్కింటి భ్రమరాంభ పిన్ని, రెండిళ్ళవతల ఉండే గిరిజత్తయ్య చెవులు కొరుక్కుంటున్నారు. ఒక చెవి రిక్కించి అటు వేశా.

"చూశావా భ్రమరా! ఎంత అమాయకత్వంగా ఉండేవాడు. అంతా నటన! నంగి వెధవ. చదువుకున్నాడు గానీ ఏం లాభం? నేనైతే చెప్పుతో కొట్టే్దాన్ని." అంది విజయక్కయ్య.

"పాపం! ఆ పిల్ల ఎంత అమాయకురాలు! ఈ మధ్యనే పెళ్ళికూడా కుదిరిందట. ఇట్లాంటి దరిద్రుల్ని గాడిద మీద ఊరేగించాలి." అంది గిరిజత్తయ్య.

కొంతసేపటికి నాకర్ధమైనదేమనగా.. వీధి చివర శంకరం గారింట్లో  స్కూల్ మాస్టరు రంగారావు అద్దెకుంటారు. ఆయన వాళ్ళావిడ ఇంట్లోలేని సమయమున పనిమనిషి చెయ్యి పట్టుకున్నాట్ట. అదీ సంగతి!

విషయం అర్ధమైంది గానీ.. మర్మం అర్ధం కాలేదు.

ఒక సందేహము బుర్ర తొలుచుచుండెను.

"విజయక్కయ్యా! మాస్టారు పనిమనిషి చెయ్యి పట్టుకుంటే ఏమవుతుంది?" అడిగాను.

అమ్మ నోర్మూసుకోమన్నట్లు గుడ్లురుమింది.

విజయక్కయ్య సిగ్గు పడుతూ చెప్పింది.

"మగవాడు ఆడవాళ్ళ చెయ్యి పట్టుకోకూడదు. చాలా తప్పు." అంది.

ఓహో అలాగా! మగవాడు ఆడవారిని ఎక్కడైనా పట్టుకొనవచ్చును గానీ.. చెయ్యి మాత్రం పట్టుకొనరాదు!

ఇప్పుడింకో సందేహం.

"మరయితే ఆ గాజులమ్మేవాడు ఇందాక మీఅందరి చేతులూ పట్టుకున్నాడుగా?"

నా డౌటుకి విజయక్కయ్య తికమక పడింది. భ్రమరాంభ పిన్ని చీరకొంగు అడ్డం పెట్టుకుని ముసిముసిగా నవ్వుకుంది.

అమ్మ కసురుకుంది.

"వెధవా! అన్నీ పనికిమాలిన ప్రశ్నలు. అయినా ఆడాళ్ళ మధ్య నీకేం పని? అటుపొయ్యి ఆడుకో పో!"

నా మొహం మళ్ళీ చిన్నబోయింది!

(photo courtesy : Google)

Wednesday, 21 November 2012

అంతా భ్రాంతియేనా! పార్వతికి నిరాశేనా?


దేవదాసు పార్వతికి అన్యాయం చేశాడు. అందుకు దేవదాసుని నిందించి ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవదాసుకి అసలు న్యాయం చెయ్యటం రాదు. తనకేం కావాలో దేవదాసుకే పెద్దగా ఐడియా ఉన్నట్లు తోచదు. పక్కింట్లో ఉంది, చూడ్డానికి బాగుంది, తను చెప్పినట్టల్లా వింటుందని పార్వతిని ఇష్టపడిపొయ్యాడు. ఇక్కడదాకా బానే ఉంది.

దేవదాసుకి వాస్తవిక దృక్పధం ఉన్నట్లు అనిపించదు. తనకన్నా తక్కువ స్టేటస్ పిల్లని పెళ్లి చేసుకోడానికి తండ్రి ఒప్పుకుంటాడని ఎలా అనుకున్నాడు! పోనీ తండ్రిని ఎదిరించగల ధైర్యమన్నా ఉందా అంటే.. అదీ లేదాయె! డబ్బున్న కొంపలో పుట్టాడు. అల్లరిచిల్లరగా తిరిగాడు. సుఖవంతమైన జీవితం. ఈ బాపతు కుర్రాళ్ళకి బుర్ర తక్కువేమో!

ఇంత పిరికివాడూ.. పార్వతి దగ్గర అధార్టీ చెలాయిస్తుంటాడు. కోపం వచ్చి పార్వతి నుదుటిపై గాయం చేసిన అహంభావి. తండ్రి జమీందారు కావున భయం. పార్వతి పల్లెటూరి పేదరాలు కావున తేలిక భావం. కళ్ళముందు కనిపిస్తున్న కోహినూర్ వజ్రాన్ని కాలదన్నుకున్న అజ్ఞాని.

తప్పుల మీద తప్పులు చేసి.. బాధ మరచిపోవడానికి హాయిగా తాగుడు అలవాటు చేసుకున్నాడు. ఒక రకంగా తాగుడు తప్ప గత్యంతరం లేని అనివార్య పరిస్థితులు తనకుతానే సృష్టించుకున్నాడు. తనని తాను హింసించుకుంటూ తనచుట్టూ ఉన్నవారిని కూడా బాధ పెట్టాడు. అందుకే సైకాలజిస్టులు దేవదాసుని sadomasochist గా తేల్చేశారు. తాగుడు వల్ల బాధ మర్చిపోవచ్చనుకుంటే.. తాగుబోతు అవ్వాల్సింది పార్వతి. దేవదాసు కాదు!

పార్వతి చేసుకున్న పాపం దేవదాసు పొరుగున పుట్టటమే. పిచ్చిపిల్ల.. దేవదాసుని  unconditional గా ప్రేమించేస్తుంది. ధైర్యవంతురాలు. తమ ప్రేమ సంగతి తండ్రికి చెప్పమని దేవదాసుని కోరుతుంది. దేవదాసు తండ్రి తన వంశంని తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి అహం దెబ్బతింటుంది. జీవితంలో మొదటిసారి దేవదాసుని ప్రశ్నిస్తుంది.

పెళ్లి కుదిరిన తరవాత కూడా అర్ధరాత్రి దేవదాసు ఇంటి తలుపు తడుతుంది. తనని తీసుకెళ్ళిపొమ్మని ప్రాధేయపడుతుంది. పార్వతికున్న ధైర్యంలో ఒక నలుసు దేవదాసుకి కూడా ఉండిఉంటే కథ సుఖాంతం అయ్యేది. కానీ దేవదాసు అర్భకుడు. పార్వతి ప్రేమకు అపాత్రుడు. సమాజ (కృత్రిమ) విలువలకి తలవంచిన పిరికివాడు. 'ధైర్యం' అన్న పదానికి అర్ధం దేవదాసు dictionary లోనే లేదు.

దేవదాసు గూర్చి పార్వతికి సరియైన అవగాహనే ఉన్నట్లు 'అంతా భ్రాంతియేనా!' అనే ఈ పాట వింటే తెలుస్తుంది. అందుకే ఆ అమ్మాయి దేవదాసు కోణం కూడా అర్ధం చేసుకుని పాడింది. నాకర్ధం కానిదల్లా.. ఇంత తెలివైన పార్వతి 'దేవదాసుని ప్రేమించడం' అన్న తెలివితక్కువ పని ఎందుకు చేసిందనేది!

(photo courtesy : Google)

Wednesday, 14 November 2012

గోవిందరాజుల సుబ్బారావు.. నా తికమక!

                                                  - 1 -

అమ్మానాన్నలతో  సినిమాకి  రెడీ  అయిపొయ్యాను.

"అమ్మా! ఏం సినిమాకెళ్తున్నాం?"

"కన్యాశుల్కం."

"పేరేంటి అలా ఉంది! ఫైటింగులున్నాయా?"

"ఉండవు. నీకు నచ్చదేమో. పోనీ సినిమా మానేసి ఆడుకోరాదూ!"

ఫైటింగుల్లేకుండా సినిమా ఎందుకు తీస్తారో! నాకు చికాగ్గా అనిపించింది. అయితే నాకో నియమం ఉంది. సినిమా చూడ్డనికి వచ్చిన ఏ అవకాశమూ వదలరాదు. నచ్చినా, నచ్చకపోయినా సినిమా చూసి తీరాలి. ఇది నా ప్రతిజ్ఞ!

అమ్మానాన్నల మధ్య కూర్చుని సినిమా చూశాను. సినిమా హాల్లో  అమ్మానాన్నల మధ్యసీటు కోసం నాకు అక్కతో చాలాసార్లు తగాదా అయ్యేది. బొమ్మ తెరపై వెయ్యడానికి ముందు హాల్లో లైట్లు తీసేసి చీకటిగా చేస్తారు. ఆ చీకటంటే నాకు చచ్చేంత భయం. అటూఇటూ ఇంట్లోవాళ్ళుంటే.. మధ్యన కూర్చుని సినిమా చూడ్డానికి ధైర్యంగా ఉంటుంది. అదీ అసలు సంగతి!

'కన్యాశుల్కం' సినిమా ఎంతసేపు చూసినా ఒక్కముక్క కూడా అర్ధం కావట్లేదు. నాకస్సలు నచ్చలేదు. అయినా సావిత్రి ఉండవలసింది రామారావు పక్కన గదా? మరి ఎవరెవరితోనో చాలా స్నేహంగా మాట్లాడుతుందేమి! తప్పుకదూ!

పైపెచ్చు ఒక ముసలాయనకి పిలక దువ్వి, నూనె రాస్తుంది. నాకు ఇది మరీమరీ నచ్చలేదు. ఎన్టీరామారావు ఎంత పక్కన లేకపోతే మాత్రం సావిత్రి అంతగా సరదాలు చెయ్యాలా?

ఈ ముసలాయన్ని ఎక్కడో చూసినట్లుందే! ఎక్కడ చూశానబ్బా? ఆఁ! గుర్తొచ్చింది. ఈ ముసలాయన మా నందయ్యగారే! అదేంటి! నందయ్యగారు సినిమాల్లో వేషాలు కూడా వేస్తారా? ఉన్నట్లుండి నాకు సినిమా ఆసక్తిగా మారింది. బలవంతానా ఆపుకుంటున్న నిద్ర మాయమైంది. నందయ్యగారు యాక్షను బానే చేశారు. మరి సావిత్రితో తన పిలకకి నూనె ఎందుకు పెట్టించుకున్నాడబ్బా!

'ఎవరా నందయ్య గారు? ఏమాకథ?'

ఈ భూప్రపంచమందు అత్యంత సుందరమైన ప్రాంతం మా గుంటూరు. అందు మా బ్రాడీపేట మరింత సుందర ప్రదేశము. ఈ సంగతి మీకు ఇంతకుముందు కూడా బల్లగుద్ది చెప్పాను. మీరు మర్చిపోతారేమోనని అప్పుడప్పుడూ ఇలా మళ్ళీ బల్ల గుద్దుతుంటాను.

మా బ్రాడీపేట మూడవ లైను మొదట్లో.. అనగా ఓవర్ బ్రిడ్జ్ డౌన్లో నందయ్యగారి ఇల్లు. పక్కన మాజేటి గురవయ్యగారి ఇల్లు. ఆ పక్కన ముదిగొండ భ్రమరాంబగారి ఇల్లు. చింతలూరివారి ఆయుర్వేద వైద్యశాల. దాటితే డాక్టర్ ఆమంచర్ల చలపతిరావుగారి ఇల్లు. ఎదురుగా ఇసుకపల్లి వేంకట కృష్ణమూర్తిగారి ఆయుర్వేద వైద్యశాల ఉంటుంది.

సాయంకాలం సమయానికి ఈ అరుగులన్నీ పురోహితులతో కళకళలాడుతుండేది. గుంపులు గుంపులుగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు. వాతావరణం చాలా సందడిగా, కళకళలాడుతుండేది. ఊళ్ళో ఎవరికైనా పూజలు, వ్రతాలకి  పురోహితుల అవసరం వచ్చినప్పుడు అక్కడే ఎప్పాయింట్ మెంట్లు ఖరారయ్యేవి.

మంజునాథ రెస్టారెంట్ పక్కనే ఉన్న నశ్యం షాపు ఆ సమయంలో చాలా బిజీగా ఉండేది. పొడుంకాయ ఫుల్లుగా నింపడానికి ఐదు పైసలు. పొడుగ్గా ఉండే కాడ చివర బుల్లి గరిటె. ఆ గరిటెతో చిన్నజాడీలోంచి నశ్యాన్ని లాఘవంగా స్కూప్ చేస్తూ పొడుంకాయ నింపడం అద్భుతంగా ఉండేది. ఆ నశ్యం నింపే విధానం అబ్బురంగా చూస్తూ నిలబడిపొయ్యేవాడిని.

నశ్యం పట్టు పడుతూ.. సందడిగా, సరదాగా కబుర్లు చెప్పుకునే పురోహితులు ఒక వ్యక్తి కనపడంగాన్లే ఎలెర్ట్ అయిపోయేవారు. నిశ్శబ్దం పాటించేవారు. వినయంగా నమస్కరించేవారు. ఆయనే నందయ్య గారు.

నందయ్యగారింట్లో ఆడామగ అనేక వయసులవారు ఉండేవారు. ఇంటి వరండాలో చెక్కబల్లపై నందయ్యగారు కూర్చునుండేవారు. తెల్లటి తెలుపు. నిగనిగలాడే గుండు. ఒత్తైన పిలక. చొక్కా వేసుకొంగా ఎప్పుడూ చూళ్ళేదు. పంచె మోకాలు పైదాకా లాక్కుని, ఒక కాలు పైకి మడిచి కూర్చుని ఉంటారు. మెళ్ళో రుద్రాక్షలు. విశాలమైన నుదురు. చేతులు, భుజాలు, నుదుటిపైనా తెల్లటి వీభూది. పంచాంగం చూస్తూ వేళ్ళతో ఏవో లెక్కలు వేస్తుండేవారు.

ఇంటికి వచ్చినవారు నందయ్యగారికి వినయంగా నమస్కరించేవారు. పెద్దవాళ్ళు నాలాంటి పిల్లకాయల చేత ఆయన కాళ్ళకి నమస్కారం చేయించేవాళ్ళు. మహానుభావుల కాళ్ళకి నమస్కరిస్తే చదువు బాగా వంటబడుతుందని అమ్మ చెప్పింది. చదువు సంగతి అటుంచి.. కనీసం మా లెక్కల మాస్టారి తన్నులైనా తప్పుతయ్యేమోననే ఆశతో నందయ్యగారి కాళ్ళకి మొక్కేవాణ్ని.

మళ్ళీ మన 'కన్యాశుల్కం' లోకి వద్దాం. సినిమా అయిపొయింది. అమ్మానాన్న రిక్షాలో కూర్చున్నారు. యధావిధిగా నా ఉచితాసనంపై కూర్చున్నాను. ఏదో గొప్ప కోసం గంభీరంగా ఉంటుందని 'ఉచితాసనం' అని రాస్తున్నానుగానీ.. అసలు సంగతి రిక్షాలో నా ప్లేస్ కాళ్ళు పెట్టుకునే చోట.. అమ్మానాన్న కాళ్ళ దగ్గర.

మా ఇంట్లో అందరిలోకి నేనే చిన్నవాణ్ణి. అంచేత రిక్షా సీటుపై ఎవరు కూర్చున్నా.. నా పర్మనెంట్ ప్లేస్ మాత్రం వాళ్ళ కాళ్ళ దగ్గరే! ఆ విధంగా పెద్దయ్యేదాకా రిక్షా సీటుపై కూర్చునే అవకాశం పొందలేకపోయిన నిర్భాగ్యుడను.

"సినిమాలో మన నందయ్యగారు భలే యాక్టు  చేశారు." అన్నాను.

నాన్నకి అర్ధం కాలేదు.

"నందయ్యగారా! సినిమాలోనా!" అన్నాడు నాన్న.

"అవును. సావిత్రి ఆయన పిలకకేగా నూనె రాసింది." నాన్నకి తెలీని పాయింట్ నేను పట్టేసినందుకు భలే ఉత్సాహంగా ఉంది.

నాన్న పెద్దగా నవ్వాడు.

"నువ్వు చెప్పేది లుబ్దావధాని గూర్చా! ఆ పాత్ర వేసినాయన డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు. ఆయన గొప్పనటుడు. బాలనాగమ్మలో మాయల మరాఠీగా వేశాడు. దడుచుకు చచ్చాం." అన్నాడు నాన్న.

నమ్మలేకపోయాను. నాన్న నన్ను తప్పుదోవ పట్టిస్తున్నాడా? ఛ.. ఛ! నాన్న అలా చెయ్యడు. బహుశా నాన్న నందయ్యగారిని గుర్తుపట్టలేకపోయ్యాడా? అలాంటి అవకాశం లేదే! నాన్నకి నందయ్యగారు బాగా తెలుసు. నందయ్యగారు నాన్నని 'ఏమిరా!' అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు.

ఆలోచనలతోనే ఇంట్లోకొచ్చిపడ్డా. నాన్నకిష్టమైన, నాకు అత్యంత అయిష్టమైన కాకరకాయ పులుసుతో నాలుగు ముద్దలు తిన్నాను. నాన్న చాలా విషయాల్లో డెమాక్రటిక్ గా ఉండేవాడు. కానీ ఎందుకో కాకరకాయ పులుసు విషయంలో హిట్లర్ లా వ్యవహరించేవాడు. వారంలో ఒక్కసారైనా ఇంట్లోవాళ్ళం నాన్నకిష్టమైన కాకరకాయ పులుసుతో శిక్షించబడేవాళ్ళం.

కాకరకాయ పులుసు కడుపులో తిప్పుచుండగా.. నందయ్య గారి ఆలోచన మనసులో తిప్పుచుండెను. ఆలోచిస్తున్న కొద్దీ.. ఈ లుబ్దావధాని, గోవిందరాజుల సుబ్బారావు, నందయ్యగార్ల ముడి మరింతగా బిగుసుకుపోయి పీటముడి పడిపోయింది.

అటు తరవాత నందయ్యగారి సినిమా వేషం సంగతి నా అనుంగు స్నేహితుడైన దావులూరి గాడి దగ్గర ప్రస్తావించాను. వాడు నాకన్నా అజ్ఞాని. తెల్లమొహం వేశాడు. పరీక్షల్లో నాదగ్గర రెగ్యులర్ గా కాపీకొట్టే సాగి సత్తాయ్ గాడు మాత్రం నేనే కరక్టని నొక్కివక్కాణించాడు. ఏవిటో! అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది!

                                                     - 2 -

కాలచక్రం సినిమారీల్లా గిర్రున తిరిగింది. ఇప్పుడు నేను పెద్దవాడనైనాను. రిక్షాలొ కాళ్ళ దగ్గర కూచోకుండా సీటు మీదే కూర్చునే ప్రమోషనూ వచ్చింది. నా సాహిత్యాభిలాష చందమామ చదవడంతో మొదలై ఆంద్రపత్రిక, ప్రభల మీదుగా కథలు, నవలలదాకా ప్రయాణం చేసింది.

ఈ క్రమంలో కన్యాశుల్కం గురజాడ అప్పారావు రాసిన నాటకమనీ, అది సినిమాగా తీశారనీ తెలుసుకున్నాను. లుబ్దావధానిని నందయ్యగారిగా పొరబడ్డందుకు మొదట్లో సిగ్గు పడ్డాను. అటుతరవాత నవ్వుకున్నాను. నేనెందుకు తికమక పడ్డాను!?

కొన్నాళ్ళకి కన్యాశుల్కం నాటకం చదివాను. నాటకం గూర్చి అనేకమంది ప్రముఖుల వ్యాఖ్యానాలూ చదివాను. తెలుగు సాహిత్యంలో కన్యాశుల్కం ప్రాముఖ్యత గూర్చి ఒక అంచనా వచ్చింది. సినిమా మళ్ళీ చూడాలని.. పెరిగిన వయసుతో, పరిణిత మనసుతో హాల్లోకి అడుగెట్టాను.

సినిమా మొదలైన కొంతసేపటికి సినిమాలో పూర్తిగా లీనమైపొయ్యాను. కారణం.. గోవిందరాజుల సుబ్బారావు అద్భుత నటన. ఆంగ్లంలో 'స్పెల్ బౌండ్' అంటారు. తెలుగులో ఏమంటారో తెలీదు. లుబ్దావదానిగా గోవిందరాజుల సుబ్బారావు నటించాడనడం కన్నా..  ప్రవర్తించాడు అనడం కరెక్ట్.

గోవిందరాజుల సుబ్బారావు వృద్దుడయినందున లుబ్దావధాని ఆహార్యం చక్కగా కుదిరందని కొందరు అంటారు. వాస్తవమే అయ్యుండొచ్చు. అయితే ఇది నటుడికి కలసొచ్చిన ఒక అంశంగా మాత్రమే పరిగణించాలని నా అభిప్రాయం.

వృద్ధాప్యంలో 'డిమెన్షియా' అనే మతిమరుపు జబ్బు మొదలవుతుంది. ఎదుటివాడు చెప్పేది అర్ధం చేసుకుని చెప్పడానికి సమయం పడుతుంది. శరీర కదలికల వలె మానసికంగా కూడా నిదానంగా రియాక్ట్ అవుతుంటారు. ఎటెన్షన్ మరియు కాన్సంట్రేషన్ తగ్గడం చేత ఒక్కోసారి అర్ధం కానట్లు చేష్టలుడిగి చూస్తుండిపోతారు. ఇవన్నీ మనకి సినిమా లుబ్దావధానిలో కనిపిస్తాయి.

నా తికమక నటుడిగా గోవిందరాజుల సుబ్బారావు సాధించిన విజయం. అందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు. ఆయన మరీ అంత సహజంగా పాత్రలోకి దూరిపోయి అద్భుతంగా నటించేస్తే తికమక పడక ఛస్తానా! అంచేత 'నేరం నాదికాదు! గోవిందరాజుల సుబ్బారావుది.' అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను!

యూట్యూబులోంచి ఆయన నటించిన సన్నివేశం ఒకటి పెడుతున్నాను. చూసి ఆనందించండి.



చివరి తోక..

శ్రీ ముదిగొండ పెదనందయ్యగారు :  వేదపండితులు. ఘనాపాఠి. ఆరాధ్యులు. సంస్కృతాంధ్ర పండితులు.

కృతజ్ఞతలు..

ఈ పోస్టులో నేను రాసిన ఇళ్లేవీ ఇప్పుడు లేవు. అన్నీబహుళ అంతస్తుల బిల్దింగులుగా మారిపోయ్యాయి. పోస్ట్ రాస్తున్న సందర్భాన నా మెమరీని రిఫ్రెష్ చేసిన మిత్రుడు ములుగు రవికుమార్ (నందయ్యగారి మనవడు) కి కృతజ్ఞతలు.

(photos courtesy : Google)

Saturday, 29 September 2012

సావిత్రి ఎంతో అందముగా యుండును


"శిష్యా! జీవితాన్ని కాచి వడబోసి ఒక నగ్నసత్యాన్ని కనుక్కున్నా. రాసుకో! సావిత్రి ఎంతో అందముగా యుండును."

"అంత అందంగా ఉంటుందా గురూజీ?"

"అంతింత అందం కాదు. మబ్బంత అందంగా ఉంటుంది."

"మబ్బంతా!?"

"అవును. మబ్బు అందంగా ఉంటుంది. ఎవరికీ అందనంత ఎత్తుగానూ ఉంటుంది. అర్ధం కాలేదా? అయితే - 'ఏమిటో ఈ మాయ'  అంటూ మిస్సమ్మలో సావిత్రి పాడిన చూసుకో. పండగ చేసుకో!"

"గురూజీ! నాక్కూడా ఈ పాట భలే నచ్చింది."

"నచ్చక చస్తుందా! సావిత్రి అందం అట్లాంటిది. చూశావా! 'వినుటయె కాని వెన్నెల మహిమలు.. అనుభవించి నేనెరుగనయా!' అంటూ చంద్రుడితో చెప్పుకుంటుంది. పాపం! కష్టపడి బియ్యే పాసయింది. అయినా ఏం సుఖం? రవణారెడ్డి అప్పు తీర్చడం కోసం పాఠాలు చెప్పుకు బతుకుతుంది. ఏంటలా దిక్కులు చూస్తున్నావ్? ఇంతకీ సావిత్రి అందం గూర్చి నే చెప్పిన నగ్నసత్యం రాసుకున్నావా?"

"గురూజీ! మీరేవీ అనుకోకపోతే నాదో మాట. నాకీ పాటలో సావిత్రి అందం కంటే ఎన్టీరామారావు సిగరెట్ కాల్చడం భలే నచ్చింది. సిగరెట్ అంతలా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చని నాకిప్పటిదాకా తెలీదు. మీరు నన్నొదిలేస్తే అర్జంటుగా ఒక సిగరెట్ కాల్చుకుంటాను. ఉంటాను."

"ఆఁ!"

(photos courtesy : Google)

Thursday, 27 September 2012

'దేవి శ్రీదేవి.. ' భక్తిపాట కాదు!


నా చిన్నప్పుడు సినిమా పాటల అభిమానులకి రేడియోనే పెన్నిధి. ఇప్పుడంటే యూట్యూబు పుణ్యాన ఏ పాటనైనా క్షణాల్లో చూసేస్తున్నారు గానీ.. చిన్నప్పుడు ఇష్టమైన పాట వినడానిక్కూడా ఎన్నో తిప్పలు పడేవాళ్ళం.

ఈ తెలుగుదేశంలో ఘంటసాల అభిమానులు కానివారు నాకింతవరకూ కనబళ్ళేదు. నాకు దైవభక్తి లేదు. కానీ ఘంటసాల భక్తిపాటలు ఇష్టం! నాలో ఉన్న అనేక వైరుధ్యాలలో ఇదొకటి. 'సంతానం' సినిమాలో 'దేవి శ్రీదేవి.. ' అంటూ ఘంటసాల పాడిన భక్తిపాట నాకు చాలా ఇష్టం. 'సంతానం' సినిమా నేను చూళ్ళేదు. నటీనటులెవరో తెలీదు. కథ గూర్చి పైసా కూడా అవగాహన లేదు.

అయితే ఇంత powerful devotional song ని రేడియో స్టేషన్ వాళ్ళు ఉదయాన్నే ప్రసారం చేసే తమ భక్తిపాటల కార్యక్రమంలో వేసేవాళ్ళు కాదు. మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమంలో వినిపించేవాళ్ళు. ఈ సంగతి కనిపెట్టిన నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పనిచేస్తున్నవారు బుర్ర తక్కువ సన్నాసులనే అభిప్రాయానికొచ్చేశాను!

పెద్దయ్యాక గుంటూరు మెడికల్ కాలేజి గార్డెన్లో ఓరోజు సినిమా పాటల గూర్చి చర్చ జరుగుతున్న సందర్భంలో.. ఈ పాటని భక్తిపాటల slot లో చేర్చని ఆకాశవాణి వారి అజ్ఞానాన్ని ఎత్తి చూపాను.

"అది భక్తిపాట కాదనుకుంటా. లిరిక్ జాగ్రత్తగా ఫాలో అవ్వు. 'నీ కనుసన్నల నిరతము నన్నే హాయిగా ఓలలాడించ రావే!' అని గదా ఘంటసాల పాడింది. అంటే ఇది లవ్ సాంగ్ అయ్యుండొచ్చు." అన్నాడొక సినిమా పాటల జ్ఞాని.

ఆశ్చర్యపోయాను. కానీ నమ్మలేకపోయాను. "ఆ పాట శ్రుతి, తాళం, రాగం విన్నాక కూడా దాన్ని ప్రేమగీతం అంటావేంటి? కవులు భక్తిపాటల్లో కూడా క్రియేటివిటీ చూపిస్తారు. ప్రబంధ కవులయితే దేవతలకి లవ్ లెటర్లు కూడా రాస్తారు. నువ్వు చెప్పిన లైన్లు ఆ కోవలోకి చెందుతాయి." అని వాదించాను. గెలిచాను. నోరు గలవాడిదే గెలుపు!

కొన్నాళ్ళ క్రితం నా అభిమాన భక్తిపాట విందామని యూట్యూబులోకి వెళ్ళాను. వార్నీ! ఇంతకీ 'దేవి శ్రీదేవీ.. ' భక్తిపాట కాదు! నాగేశ్వరరావు సావిత్రికి తన గాఢప్రేమని వ్యక్తీకరిస్తూ ఘంటసాల స్టోన్లో పాడిన లలిత గీతం!

లోగడ 'పెళ్ళిచేసిచూడు' సినిమాలో 'యేడుకొండలవాడా వెంకటారమణా.. ' అంటూ భక్తిపాటలా అనిపించే ప్రేమగీతం విషయంలో కూడా ఇలాగే కంఫ్యూజయ్యాను. అయితే నేను 'పెళ్ళిచేసిచూడు' చూశాను. అక్కడ నర్స్ వేషంలో ఉన్న జి.వరలక్ష్మికి అట్లాంటి పాట పాడ్డానికి ఒక రీజనుంది.

నేను 'సంతానం' సినిమా చూడని కారణాన హాశ్చర్యపడటం మించి చేయగలిగింది లేదు. సుసర్ల దక్షిణాముర్తి శాస్త్రీయ సంగీతంలో ఎంత ఉద్దండుడైనా.. సందర్భశుద్ధి లేకుండా ఇంత హెవీ క్లాసికల్ బీటుతో లవ్ సాంగ్ చేస్తాడనుకోను.

సరే! కొద్దిసేపు ఈపాట సంగీతం గోలని పక్కన పెడదాం. పాట చిత్రీకరణ గూర్చి రెండు ముక్కలు. నాకీ పాటలో నాగేశ్వరరావు, సావిత్రి పిచ్చపిచ్చగా నచ్చేశారు. జంట చూడముచ్చటగా ఉంది. వీళ్ళ దుంపతెగ! ఎంత సున్నితంగా, ముద్దుగా ప్రేమని అభినయించారు! మధ్యలో తలుపు కూడా భలే నటించిందే! దీన్నే సహవాస దోషం అంటారనుకుంటా! ఈపాట మీ కోసం ఇక్కడ ఇస్తున్నాను.


Tuesday, 13 March 2012

తెలుగు సినిమాల్లో రేపుల కామెడీ

కథలు చదివేవాళ్ళని పాఠకులు అంటారు, వీళ్ళకి చదవడం రావాలి. సినిమా చూసేవాళ్ళని ప్రేక్షకులు అంటారు, వీళ్ళకి చదువుతో పన్లేదు. మన తెలుగువాళ్ళల్లో చదువుకున్నవారి సంఖ్య తక్కువ కాబట్టి, సినిమా వ్యాపారం కాబట్టి, మెజారిటీ (చదువుకోనివాళ్ళు)ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తారు. కారణం - వీళ్ళకి నచ్చితేనే సినిమా అనే వ్యాపారంలో లాభాలొస్తయ్ కాబట్టి.

మరి సినిమాలకి ఎంతో ముఖ్యుడైన ఈ ప్రేక్షకుడు తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసే వేదిక వుందా? లేదని నేననుకుంటున్నాను. వున్నట్లైతే ఒక సినిమా గూర్చి - 'ఎన్టీవోడు రాజనాలతో ఫైటింగ్ ఇరగదీశాడు', 'ప్రేమనగర్‌లో లేలే నారాజా పాట కోసం సిన్మా మూడుసార్లు చూశా. డ్యాన్స్ అదరహో!' తరహా అభిప్రాయాలు వినబడేవి.

ఇవ్వాళ్టి ఈ రాత ఉద్దేశం - అటువంటి వేదిక లేని లోటు తీరుద్దామనే గొప్ప ఆలోచన! నిజజీవితం వేరు, సినిమా తెర వేరు. రెంటికీ కిలోమీటర్లు దూరం వుంది. ఉదాహరణకి రేప్ లేక అత్యాచారం అన్న టాపిక్ తీసుకుందాం. నిజజీవితంలో రేప్ అన్నది అత్యంత క్రూరమైన, దుర్మార్గమైన నేరం. అయితే తెలుగు సినిమాలకి సంబంధించి రేప్ నేరం కాదు, ఒక వినోద సాధనం. ఈ నేరాన్ని ఒక ఫైటింగు సీన్లా, ఒక ఐటం సాంగులా - రేప్‌ని బాక్సాఫీస్ ఫార్ములాగా వాడుకుంటారు.

రేప్ సినిమాల్లో హీరోకి వికలాంగురాలైన ఓ చెల్లెలు. మంచి పెర్సనాలిటీ వున్న ఆ అమ్మాయికి హీరో గోరుముద్దలు తినిపిస్తూ 'ఓ చెల్లి! నా చిట్టి తల్లి' అంటూ ఘంటసాల గొంతు అరువు తెచ్చుకుని పాటలు పాడుతుంటాడు. ఆ అమ్మాయికి సినిమాలో ఒక రేప్ సీన్ రెడీగా వుందనీ, ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటుందనీ హీరోకి తప్ప థియేటర్లో అందరికీ తెలుసు. రేప్ సీన్ మొదలవగానే హాల్లో ఈలలూ, చప్పట్లూ! రేప్ సీన్ అయిన వెంటనే కొందరు బయటకి వెళ్లిపొయ్యేవాళ్ళు.

రేప్ సీన్ల వీక్షక స్పెషలిస్ట్ అయిన నా మిత్రుడొకడు ఓసారి తన రేప్ సీన్ల కోరికలు వెలిబుచ్చాడు. ముందే ఓ గంటపాటు కొన'సాగే' రేప్ సీన్ చుట్టేసి, ఆ సీన్ ని సెన్సారోళ్ళు ఒప్పుకుంటే - ఆ తర్వాత ముందువెనుకలు ఏదోక కధని అతికించే సౌలభ్యమున్నట్లయితే బాగుంటుంది! హాలు బయట 'హౌస్ ఫుల్' బోర్డులాగా, హాల్లో ఫలానా టైముకి రేప్ సీనుంటుంది అనే బోర్డు గనక పెట్టిచ్చినట్లయితే - హీరోగారు ఆయన చెల్లెలిగారి మమతలూ, అనురాగాలూ తాలూకా సీన్లు చూసే శిక్ష తప్పుతుంది!

మరొకసారి గుర్తు చేస్తున్నాను. నిజజీవితంలో రేప్ అనే ఒక దుర్మార్గమైన నేరం సినిమాల్లో బాక్సాఫీస్ ఫార్ములాగా మారిపొయ్యింది. ఇప్పుడు నేరాసేదంతా సినిమా రేపులగూర్చి మాత్రమే. అంచేత చదువరులు దీన్నొక సరదా రాతగా మాత్రమే భావించ మనవి.

సినిమావాళ్ళకి ఒక నటి శరీరాన్ని ఎక్స్పోజ్ చెయ్యడానికి రేపుని మించిన అవకాశం లేదు, అందుకే వాళ్ళు రేప్ సీన్లని విపులంగా, ప్రతిభావంతంగా చిత్రిస్తారు. మన తెలుగు సినిమాకి జాతీయ అవార్డులు రావట్లేదని ఏడ్చేకన్నా, ఉత్తమ రేప్ సీన్ కేటగిరీ ఒకటి క్రియేట్ చేయించినట్లయితే ఖచ్చితంగా చాలా అవార్డులు వచ్చేవని నా నమ్మకం.

ఎంతైనా ఆ రోజులే వేరు. రేపుల్లో ఎంత క్రియేటివిటీ! మన ఆనందం కోసం కొండల్లో, గుట్టల్లో.. ఎండనకా వాననక సత్యన్నారాయణ, ప్రభాకరరెడ్డి, రాజనాలలు ఎంత కష్టపడి రేపులు చేశారు! పాపం! కానిస్టేబుల్ సెలక్షన్ల కోసం పరిగెత్తినట్లు మైళ్ళకొద్దీ పరిగెత్తేవాళ్ళు. సత్యన్నారాయణ చాలా ఫేమస్ రేపిస్ట్. ఎందుకనో మొదట్నించి రాజనాల మొహంలో రేప్ ఫీలింగ్స్ పలకవు, అప్పుడుకూడా కత్తియుద్ధం చేస్తున్నట్లు మొహం క్రూరంగా పెడతాడు.

రేప్ సీన్లో నటించడం అంత వీజీ కాదు. దట్టమైన మేకప్ పూసుకుని, ఆర్క్ లైట్ల వేడిని తట్టుకుంటూ.. అంతమంది మధ్యన కళ్ళల్లో కామం చూపించడం ఎంత కష్టం! నామాట నమ్మరా? యేదీ, మహానటుడు చిత్తూరు నాగయ్యని ఒక రేప్ సీన్లో నటించమనండి చూద్దాం! ఆయనకి తన లిమిటేషన్స్ తెలుసు గనకనే కష్టమైన రేపుల జోలికి పోకుండా, సులభమైన భక్తిపాత్రలు వేసుకున్నాడు.

ఇప్పుడు సినిమా రేపుల గూర్చి కొన్ని నా రీసెర్చ్ ఫైండింగ్స్. అసలు తెలుగు సినిమాల్లో రేపులు ఎందుకు ఎలా మొదలయ్యాయి? అందుక్కారణం పాత సినిమా హీరోయిన్లేనని నా అభిప్రాయం! సినిమా తొలినాళ్ళలో విలన్లు హీరోయిన్లని ఘాటుగా ప్రేమించారు, వారి ప్రేమని పొందడానికి తహతహలాడారు. పాపం వాళ్ళసలు రేపుల జోలికే పోలేదు. ఇందుకు ఉదాహరణలు చాలానే వున్నాయి.

కెవిరెడ్డి దర్శకత్వం వహించిన 'జగదేకవీరుని కథ'లో రాజనాల రాజు. బి.సరోజాదేవిని చూసి మనసు పడ్డాడు. కొత్తమంత్రి సియస్సార్‌తో కలిసి ఎన్నో ప్లాన్లేస్తాడు! ఎన్నో తిప్పలు పడతాడు! 'ప్రెగ్గడ! హే పాదరాయ ప్రెగ్గడా' అంటూ మంత్రి సాయంతో సరోజాదేవి దృష్టిలో పడ్డానికి రాజనాల చెయ్యని ప్రయత్నం లేదు. చివరాకరికి ఆడవేషం వేశాడు, తన్నులు తిన్నాడు. బి.సరోజాదేవి మాత్రం తన చిలక పలుకులతో రామారావునే ప్రేమించింది కాని రాజనాలని కన్నెత్తి చూళ్ళేదు, ఇది చాలా అన్యాయం!

మళ్ళీ కెవిరెడ్డి సినిమానే ఉదాహరణ. ఆర్.నాగేశ్వరరావు దొంగే కావచ్చు, తాగుబోతే కావచ్చు. కానీ - 'దొంగరాముడు'లో సావిత్రిని ఘోరంగా ప్రేమించాడు. కసాయివాడే కానీ సావిత్రితో ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదు. కానీ ఆ మహాతల్లి ఏంచేసింది? 'రావోయి మాఇంటికి' అంటూ పాట పాడి నమ్మకద్రోహం చేసింది. ఆరడుగుల ఆర్.నాగేశ్వరరావు ప్రేమకి వెన్నుపోటు పొడిచింది, చివరికి జైల్లో వేయించింది. ఇది మిక్కిలి గర్హనీయము.

కెవిరెడ్డి మహాదర్శకుడు, ఆయన సినిమాల్లోనే ఎంతో అన్యాయానికి గురయ్యారు మన విలన్లు. ఇంక బుద్ధున్న యే విలనైనా హీరోయిన్లనీ, హీరో చెల్లెళ్ళనీ యెలా నమ్ముతాడు? అంచేత కాన్ఫిడెన్సు కోల్పోయి, ప్రేమ విషయాల్లో హీరోల్తో పోటీపడి నెగ్గుకు రాలేమని విలన్లందరూ మూకుమ్మడిగా డిసైడైపొయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో రేపుల వైపు మళ్ళారు (దుఖంతో గొంతు పూడుకుపోతుంది ఒక్కక్షణం విరామం).

ఇప్పుడు ద బెస్ట్ అండ్ ద వరస్ట్ రేప్ సీన్స్! బెస్ట్ రేప్ - 'డబ్బుకు లోకం దాసోహం'లో సత్యన్నారాయణ రేప్. డిస్కవరీ చానెల్లో లేడి వెంట పులి పడినట్లు వై.విజయ వెనక గంటసేపు పరిగెత్తుతాడు. ఆవిడ చీరని లాగేస్తాడు, తరవాత ఆవిడ మళ్ళీ ఫుల్ చీరతో పరిగెడుతుంటుంది! మళ్ళీ లాగేస్తాడు, మళ్ళీ ఫుల్ చీర! ఈవిధంగా సత్యన్నారాయణ ఇరవైసార్లు చీర లాగేస్తాడు. ఇంకో పదిసార్లు జాకెట్ చించేస్తాడు! ఎడిటింగ్ లోపమేమో మనకి తెలీదు!

వరస్ట్ రేప్ సీన్ - 'బంగారు సంకెళ్ళు'లో గుమ్మడి రేప్. గుమ్మడి ఇబ్బందిగా, దిగులుగా జమున చెయ్యి పట్టుకుంటాడు. జమున ఏదో అంటుంది. తరవాత గుమ్మడి క్లోజ్అప్. అది ఏడుపో, నవ్వో అర్ధం కాని ఒక విచిత్ర ఎక్స్‌ప్రెషన్. అప్పడిగేవాడు కూడా మొహం అంత దీనంగా పెట్టలేడు.

ఇంకో వరస్ట్ రేప్ - 'అంతా మన మంచికే'లో చూడొచ్చు. ఒక రౌడీగాడు బయ్యంబయ్యంగా భానుమతి చేతిని సెకనులో పదోవంతుసేపు పట్టుకుంటాడు. భానుమతి వాణ్ని ఈడ్చి ఒక్క తన్ను తంతుంది, అంతే! వాడింక లేవడు! అంత పిరికి సన్నాసికి రేపెందుకో మనకి తెలీదు.

ఒక ఆరోగ్యంగా వున్న స్త్రీని ఒక్కడే మగాడు రేప్ చెయ్యడం అసాధ్యం అని ఫోరెన్సిక్ మెడిసిన్లో చదివి బిత్తరపోయ్యాను. అంటే ఇన్నాళ్ళూ తెలుగు సినిమావాళ్ళు నన్ను మోసం చేశారా!? లేక తెలుగు హీరొయిన్లు తమని రక్షించుకునే ప్రయత్నం చెయ్యకుండా, హీరోని ఎలివేట్ చెయ్యడానికి 'కెవ్వుకెవ్వు' మన్నారా? ఏమిటో అంతా గజిబిజి, గందరగోళం.

కాలంతో పాటు క్రమేణా రేపులు అంతరించిపోయాయి. రేపు చుట్టూతా తిరిగే కధలు చూడ్డం అలవాటు పడ్డ నాలాంటి ప్రేక్షకులూ అంతరించిపోయారు (అంటే చచ్చారని కాదు, సినిమాలు చూడ్డం మానేశారని అర్ధం). ఇవ్వాళ జనాలకి సినిమా రేపంటే యేంటో తెలీకుండాపోయింది!

ముగింపు -

ఇందాక చెప్పిన విషయాన్నే మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నాను. నిజజీవితంలో రేప్ అనేది ఒక దారుణమైన నేరం. ఈ నేరం లోతుపాతులు ఫోరెన్సిక్ సైకియాట్రీ చదువుకున్న నాకు బాగా తెలుసు. ఈ రాత ఉద్దేశం - కేవలం మన సినిమా రేపుల గూర్చి సరదాగా రాయడం మాత్రమే. నథింగ్ మోర్, థాంక్స్ ఫర్ రీడింగ్!                              

Wednesday, 7 December 2011

స్వర్గంలో భానుమతి, సావిత్రి.. నేను కూడా!

అదొక విశాలమైన హాలు. పొడవాటి రంగురంగుల కర్టెన్లు. జమీందార్ల కొంపల్లో మాత్రమే కనిపించే సింహాసనం సోఫాలు, సోఫాలాంటి కుర్చీలు. అందమైన చీరల్లో మరింత అందమైన ఆడవాళ్ళు, తెల్లటి వస్త్రాల్లో మగవాళ్ళు. ఆ వాతావరణం సందడి సందడిగా, హడావుడి హడావుడిగా ఉంది.

హాలు మధ్యన పెద్ద పట్టుతివాచీ. దానిపై మందపాటి ముఖమల్ పరుపు. ఆ పరుపుపై కూర్చున్న ఒక స్త్రీ అచ్చు భానుమతి గొంతుతో గీతం ఆలపిస్తుంది. ఆమె చుట్టూతా కూర్చున్నవారు శ్రద్ధగా ఆమె గానాన్ని వింటూ తల పంకిస్తున్నారు.

'సావిరహే తవదీన.. '

ఏవిటిదంతా? నేనిక్కడికెలా వచ్చాను? అటుగా వెళ్తున్న ఒక తెల్లబట్టల పెద్దమనిషిని వాకబు చేశాను. ఆయన సమాధానం విని హతాశుడనయ్యాను. 

ఇది భూలోకం కాదు - స్వర్గంట! ఐదునిమిషాల క్రితమే నేను బాల్చీ తన్నేశాన్ట! యేమిటీ దారుణం? ఇది కల కాదు గదా? అసలేమైంది చెప్మా? కళ్ళు మూసుకుని ఓ క్షణం ఆలోచించాను.

ఆ! గుర్తొచ్చింది. ఇవ్వాళ అరికాలు దురద పెడుతుంటే ఓ కార్పోరేట్ ఆస్పత్రి డాక్టరు దగ్గరకెళ్ళాను. ఆ డాక్టరు నా అరికాలుని ఆరు నిమిషాలు పరీక్షించి, ఆరువేల రూపాయల టెస్టులు చేసి, ఆరువందల రూపాయల ఇంజెక్షను పొడిచాడు. ఆ ఇంజెక్షను వికటించిందా? వికటించే వుంటుంది, లేకపోతే ఇక్కడికెలా వొచ్చి పడతాను? అయ్యో! అంటే.. అంటే.. ఇప్పుడు నేను చచ్చిపోయానా!

బాధతో గుండె బరువెక్కింది. దుఃఖంతో కొంచెంసేపు విలపించాను. అయ్యో! చావడంలో కూడా నాదెంత దరిద్రపుగొట్టు చావు! ఏదో గుండెజబ్బులాంటి రోగంతో చస్తే గౌరవం గానీ, మరీ చీప్‌గా అరికాలు దురదకి చావటం ఎంత సిగ్గుచేటు! నా శవాన్ని చూడ్డనికొచ్చిన వారి ముందు నా పరువు పోయుంటుంది. సర్లే! ఎట్లాగూ చచ్చానుగా, ఇంక పరువుతో పనేముంది!

'కానీ - పుట్టి బుద్ధెరిగి ఎప్పుడూ పాపాలే చేశాను గానీ, పుణ్యం ఎప్పుడూ చెయ్యలేదే! యమభటులేమైనా పొరబాటున స్వర్గంలో పడేశారా?' అనే సందేహం కలిగింది. కొంతసేపటికి దుఃఖం తగ్గి, మనసు తేలికయ్యింది. ఇక్కడేదో బాగానే ఉన్నట్లుంది. పరిసరాలు పరికించి చూశాను. అక్కడి వాతావరణానికి నిదానంగా అలవాటు పడసాగాను. 

ఇంతకీ అంత మధురంగా పాడే ఆ గాయని ఎవరబ్బా!

'దగ్గరకెళ్ళి చూస్తే తెలుస్తుందిగా' అనుకుంటూ అలా వెళ్ళాను. ఆవిడ నిజంగానే భానుమతి! మనిషి మీగడ తరగలా ఎంతందంగా ఉంది! మహారాణిలా ఠీవీగా, విలాసంగా, హుందాగా.. మంద్రస్థాయిలో పాడుతుంది. ఆవిడ పాటలకి అందరూ మైమరచి, అరమోడ్పు కన్నులతో తల పంకిస్తూ ఆనంద పరవశులవుతున్నారు. భానుమతి ఒక పాట తరవాత మరో పాట పాడుతూనే ఉంది.

'ఒహొహొ! పావురమా'

'పిలచిన బిగువటరా'

'ఎందుకే నీకింత తొందర'

'మనసున మల్లెల మాలలూగెనే'

'ఎందుకోయి తోటమాలి అంతులేని యాతన'

'ఓ బాటసారి"

'నేనే రాధనోయి'

అహాహా! ఏమి ఈ గాత్రమాధుర్యము! జన్మ ధన్యమైంది! పోన్లే - చస్తే చచ్చాగానీ, గారెల బుట్టలో పడ్డా! అన్నట్లు ఈ స్వర్గంలో గారెలు దొరుకుతాయా? అసలిక్కడ వంటిల్లు అంటూ వుందా? ఆకలేస్తే ఉగ్గిన్నెతో అమృతం తాగిస్తాఆ!

ఇంతలో ఒక బూరె బుగ్గల చిన్నది - అక్కడున్న ఆడవాళ్ళని పేరుపేరునా పలకరిస్తూ, కాఫీ, టీ ఏర్పాట్లు పర్వవేక్షిస్తుంది. అబ్బా! ఎవరీ అందాలరాశి? ఎంత సుందరముగా యున్నది! కొంచెం దగ్గరగా వెళ్లి చూద్దాం. ఆఁ.. ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. ఆ అమ్మాయి.. ఆవిడ.. సా.. వి.. త్రి!

ఆనందంతో ఒళ్ళు పులకరించింది. నా శశిరేఖ, మేరా పార్వతి, మై మిస్సమ్మ.. వావ్! చచ్చిపోతే సావిత్రి కనిపిస్తుందంటే ఎప్పుడే చచ్చేవాణ్ణిగా! బొద్దుగా, ముద్దుగా, అమాయకంగా ఎంత బాగుంది! ఒరే అరికాలు డాక్టరు! థాంక్స్ రా బాబు థాంక్స్!

ఇంతలో పిడుగు పడ్డట్లు ఒక పెద్ద అరుపు.

"వొసే సావిత్రీ! నా కాఫీలో చక్కెర ఎక్కువెయ్యమని చెప్పానా లేదా? ఈ కాఫీ నీ మొహంలేగే వుంది, ఏడుపుగొట్టు మొహమా! తెలివితక్కువ దద్దమ్మ!"

పుఱ్ఱచేత్తో విసెనకర్రతో టపాటపా విసురుకుంటూ రుసరుసలాడింది సూర్యకాంతం. సావిత్రి భయంతో వణికిపోయింది.

"ఆ కాఫీ మీక్కాదు, అది కన్నాంబగారి కాఫీ." అంటూ కళ్ళనీళ్ళెట్టుకుంది.

నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఇంత కోపం నాకు భూలోకంలో కూడా ఎప్పుడూ రాలేదు. స్వర్గంలో మర్దర్ కేసుకి శిక్షలున్నాయా? ఈ సూర్యకాంతాన్ని మర్దర్ చెయ్యటానికి - ఏ రాజనాలకో, ఆర్.నాగేశ్వర్రావుకో సుపారీ ఇవ్వాలి. ఏరీ వాళ్ళు?

చప్పట్లతో హాలంతా మారుమోగింది. భానుమతి కచేరీ పూర్తయింది. శ్రోతలు భానుమతిని మెచ్చుకుని, నమస్కరిస్తూ ఒక్కొక్కళ్ళే హాలు బయటకెళ్ళారు. ఇప్పుడు హాల్లో కొద్దిమందిమి మాత్రమే మిగిలాం.

"నమస్కారం భానుమతమ్మగారు! నేను మీకున్న కోట్లాది అభిమానుల్లో ఒక రేణువుని. మీ 'మల్లీశ్వరి' లెక్కలేనన్నిసార్లు చూశాను. ఆ సినిమాలో మీరు హీరో, మీ పక్కన ఎన్టీరామారావు హీరోయినని మా స్నేహితులు అంటారు." వినయంగా అన్నాను.

భానుమతి నన్ను ఆపాదమస్తకం పరికించింది. ఆనక గంభీరంగా తల పంకించింది. ఆవిడకి నేను తన అభిమానిగా పరిచయం చేసుకోటం చాలా సంతోషాన్నిచ్చినట్లుంది. మనసులోని ఆనందాన్ని బయటకి కనబడనీయకుండా గుంభనంగా నవ్వుకుంది.

"మల్లీశ్వరి సినిమాకి హీరోని, హీరోయిన్ని కూడా నేనే! ఆ రామారావు కేవలం సహాయనటుడు." గర్వంగా తలెగరేస్తూ అన్నది భానుమతి.

అవునన్నట్లు తలూపుతూ అర్జంటుగా వొప్పేసుకున్నాను.

"అమ్మా! మీ అత్తగారి కథలు లేకపోతే చక్రపాణి, కుటుంబరావులు దీపావళి యువ సంచికలు అమ్ముకునేవాళ్ళా? మీ కథలు పంచదార గుళికలు." మరింత ఒంగిపోతూ అన్నాను. 

భానుమతి బహుత్ ఖుష్ హువా! ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ -

"ఒరే బడుద్దాయ్! మాటలు బాగానే నేర్చావు. నాకు పొగడ్తలంటే నచ్చవు. కానీ నువ్వన్నీ నిజాలే చెబుతున్నావనుకో!" అన్నది భానుమతి.

ఇంతలో సావిత్రి భానుమతికి తళతళలాడుతున్న గాజు గ్లాసులో బత్తాయి రసం ఇచ్చింది. నేను గుడ్లప్పగించి సావిత్రికేసి చూస్తుండిపోయాను. భానుమతి ఒక క్షణం నన్ను గమనించింది.

"సావిత్రీ! రా చెల్లీ! ఇలా నాకు దగ్గరగా వొచ్చి కూర్చో. వీడు ఇప్పటిదాకా నన్ను పొగిడాడు. నువ్వు రాంగాన్లే నిన్ను చూస్తూ నీలుక్కుపొయ్యాడు. మళ్ళీ చచ్చాడేమో వెధవ! వీడికి నువ్వంటే చచ్చేంత ఇష్టంట. అందుకే నీకోసం ఒక ప్రేమలేఖ రాశాడు."

"నిజమా! నాకు తెలీదక్కా!" ఆశ్చర్యంగా అంది సావిత్రి.

"ఓసి మొద్దుమొహమా! నీకు ఏం తెలిసి చచ్చింది గనక! ఆ దేవుడు నీకు గొప్ప నటనా ప్రతిభనిచ్చాడు గానీ, మట్టిబుఱ్ఱనిచ్చాడే బంగారం." అంటూ ముద్దుముద్దుగా సావిత్రిని విసుక్కుంది భానుమతి.

చటుక్కున తల ఎత్తి, నావైపు సూటిగా చూస్తూ "ఏమిరా! నా గూర్చి ఎప్పుడు రాస్తున్నావ్?" అంటూ హూంకరించింది భానుమతి.

"చి.. చి.. చిత్తం. త్వరలోనే.. తప్పకుండా.. ర.. రాస్తాను." వణికిపొయ్యాను.

భానుమతి కిలకిల నవ్వింది.

"నీ మొహం, నువ్వు రాయలేవులే. మీ మగవాళ్ళకి నా నటన ఇష్టం. నా పాటంటే చెవి కోసుకుంటారు. నా రచననల్ని అమితంగా ఇష్టపడతారు. కానీ నన్ను ప్రేమించే దమ్ములేని పిరికిసన్నాసులు. మీకు సావిత్రిలా అమాయకంగా, సబ్మిసివ్‌గా ఉండే వెర్రిమొహాలంటేనే ఇష్టం. సావిత్రిలో కనిపించే వల్నరబిలిటీ మీ మగాళ్ళకి ఇష్టం. నేను వీరనారీమణిని. నా దగ్గర మీరు సావిత్రి దగ్గర వేసే వేషాలేస్తే గుడ్లు పీకేస్తాను, పీక పిసికి చంపేస్తాను. అందుకే మీకు నాపాట మాత్రమే కావాలి. నాకు ప్రేమలేఖ రాయాలంటే వెన్నులో వణుకు."

భానుమతి చెబుతుంటే సావిత్రి కుందనపు బొమ్మలా, చెక్కిలిపై అరచెయ్యి ఆనించి, శ్రద్ధగా వింటూ తన చక్రాల్లాంటి కళ్ళతో 'నిజమా!' అన్నట్లు సంభ్రమంగా చూస్తూంది.

ఇంతలో మళ్ళీ ఇంకో పెద్ద పిడుగు!

"వొసే సావిత్రీ! కాఫీ నా మొహాన పడేసి ఏమిటే నీ మంతనాలు? పెత్తనాలు పక్కన పెట్టి నాకు నిద్రొచ్చే దాకా కాళ్ళొత్తు, నిద్రమొహం దానా! చూశావా ఛాయాదేవొదినా! నన్ను ఇక్కడ కూడా చెడ్డదాన్ని చెయ్యాలని కాకపోతే ఒక్కపనీ సరీగ్గా చేసేడవదు." పక్కనున్న చాయాదేవితో నిష్టూరంగా అంది సూర్యకాంతం. చాయదేవి మూతి వంకర్లు తిప్పుతూ ఆ పక్కకి వెళ్ళిపోయింది.

సూర్యకాంతం గావుకేకలతో స్వర్గం దద్దరిల్లింది. సావిత్రి ఉలికిపాటుతో ఎగిరిపడి సూర్యకాంతం దగ్గర పరిగెత్తుకెళ్ళింది.

భానుమతి నవ్వుతూ అంది. "ఇక్కడికి రాకముందు నాకూ అర్ధమయ్యేది కాదు - ఎందుకీ మగవాళ్ళు సావిత్రంటే పడి చస్తారు? నన్ను చూసి భయంతో వణికిపోతారు? మొన్నామధ్య ఒక గడ్డపాయన.. అదేనోయ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మనస్తత్వ శాస్త్రవేత్త.. దీంట్లోని మతలబు విడమర్చి చెప్పాడు."

"ఫ్రాయిడ్ మీతో మాట్లాడాడా!" ఆశ్చర్యపొయ్యాను.

"ఏంటోయ్ వెర్రి పీనుగా! అంత ఎక్స్‌ప్రెషనిచ్చావ్! నా పాటలు వినటానికి ఫ్రాయిడేం ఖర్మ! ఎరిక్ ఎరిక్సన్, ఎడ్లెర్, ఎరిక్ ఫ్రామ్, సార్త్ర్ కూడా ఎగబడతారు. ఫ్రాయిడుకి నా 'దులపర బుల్లోడా' పాట ఎంత ఇష్టమో తెలుసా? నిన్న సూర్యకాంతం పెట్టిన దొసావకాయ తిని, ఆవఘాటుకి ఉక్కిరిబిక్కిరై చచ్చాడు." అంటూ పెద్దగా నవ్వింది.

ఇంతలో హడావుడిగా లూజు చొక్కా ఇన్ షర్ట్ చేసుకుని కుర్రాళ్ళా కనిపిస్తున్న పెద్దాయన లోపలకొచ్చాడు. అతను.. ఆయన దేవానంద్! తల పైకికిందకీ ఊపుతూ, పల్చటి పెదాల్లోంచి నవ్వీ నవ్వనట్లుగా నవ్వుతూ అడిగాడు.

"నమస్కార్ భానుమతి బెహన్! ఆప్ జర మేరా సురయా కా ఎడ్రెస్ బతాయియే!"

భానుమతి దేవానంద్‌తో హిందీభాషలో ఏదో మాట్లాడుతుంది. చడీచప్పుడు చెయ్యకుండా చల్లగా అక్కణ్ణుంచి జారుకున్నాను.