Showing posts with label ప్రణవ్ ముఖర్జీ. Show all posts
Showing posts with label ప్రణవ్ ముఖర్జీ. Show all posts

Sunday, 26 June 2011

ప్రణవ్ ముఖర్జీ జీడిపప్పుల కధ


సోనియా గాంధీ కొలువు తీరింది. అదే - కాంగ్రెస్ పార్టీ 'కోర్ కమిటీ' మీటింగ్ జరుగుతుంది. ప్రణవ్ ముఖర్జీ నేతిలో వేయించిన జీడిపప్పుని నోరు కదపకుండా చప్పరిస్తున్నాడు. ఆంటోని కూనికిపాట్లు పడుతున్నాడు. మొయిలీ దొంగచూపులు చూస్తున్నాడు. చిదంబరం సోడాబుడ్డి కళ్ళద్దాల్లోంచి శూన్యంలోకి చూస్తున్నాడు. అక్కడందరూ మీటింగ్ ఎప్పుడయిపోతుందాని ఎదురు చూస్తున్నట్లుగా వున్నారు. మరైతే అప్పుడీ మీటింగెందుకు? ఏలినవారు ఇట్లాంటి హంగామా చెయ్యటం మహాభారతం రోజుల్నుండీ ఆనవాయితీగా వస్తుంది.
               
దుర్యోధనుడు కూడా ఇట్లాగే చాలా కోర్ కమిటీ మీటింగులు పెట్టేవాడు. బోల్డంత జీతాలు తీసుకుంటున్న భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వంటి గడ్డం మేధావులు రారాజుకి మంచిసలహాలు ఇవ్వొచ్చు. "మై డియర్ దుర్యోదనా! ఎంతసేపూ ఆ ద్రౌపదిని నీ తొడమీద కూర్చోపెట్టుకోవాలనీ, బట్టలిప్పించాలనే వెకిలి ఆలోచనలు మానుకో. అసలు నీ పాండవుల obsession వదుల్చుకో. నువ్వు ఈ దేశాధినేతవి. ప్రజారక్షకుడిగా, జనరంజకంగా పాలించవోయి, అది నీ విధి." అని మాత్రం చెప్పరు.     
               
ఎందుకు? ఎందుకంటే - ఈ ముసలి సలహాదారులు పెద్ద అవకాశవాదులు. 'ఏం చెపితే ఏమవుతుందో! ఈరాజుగాడు ఎట్లా పోతే మనకేంటి? మనకి జీతం, గీతం బాగానే గిట్టుబాటవుతుందిగదా. అయినా ఈ దరిద్ర దుర్యోధనుడు శకుని మాటైతే వింటాడుగానీ మన మాటెందుకు వింటాడు? చచ్చినా వినడు. వీడు గనక యుద్ధంలో భీముడు చేతిలో చస్తే ధర్మరాజు కొలువులో చేరాలి. ఇంకొంచెం జీతం పెంచమని పైరవీలు చేసుకోవాలి.' అని మనసులో జీతభత్యాలు లెక్కలేసుకుంటూ - కనీసం చెప్పే ప్రయత్నం కూడా చెయ్యరు . 

ఇప్పుడు మీకు ఈ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ మీటింగుల కధాకమామీషు అర్దమైందికదూ! ప్రణబ్ ముఖర్జీ జీడిపప్పులు తినడం మాని - "దొరసానమ్మా! ధరలు తగ్గించు, సామాన్యజనం ఆకలిచావులు చచ్చేట్లున్నారు. కాశ్మీర్ సంగతేం చేద్దాం? పొద్దస్తమానం నీ కొడుకుని ప్రధానమంత్రిని చెయ్యాలనే తాపత్రయం తగ్గించుకో  తల్లీ! భాజాపా గూర్చి బుర్రబద్దలు కొట్టుకోకు. ప్రజలకి నువ్వు మంచి చేస్తే ప్రజలే భాజాపాని పక్కన పెడతారు." అని వాస్తవాలు మాట్లాడడు. ఎందుకంటే ప్రణవ్ ముఖర్జీ బ్రతక నేర్చినవాడు. 

మరి ఏం ఆలోచిస్తుంటాడు? 'ఈ పిచ్చిది మనం ఎంతచెప్పినా తనకొడుకు రాహుల్ గాంధీ చెప్పినట్లే చేస్తుంది. అందుకే నోరు మూసుకుని హాయిగా ఇంకొంచెం జీడిపప్పు తిందాం. ఎట్లాగూ రేపు భాజాపా గవర్నమెంట్ వస్తే నా దొంగసొత్తు బయటకి రాకుండా అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌లతో బేరం కుదుర్చుకున్నా. కాబట్టి నేను సేఫ్. తేడాలొస్తే ఈ సోనియా, దీని కొడుకే శంకరగిరిమాన్యాలు పడతారు. నాకెందుకొచ్చిన ఆయాసం.' అని ఆలొచిస్తుంటాడు!

(pictures courtesy : Google)