Showing posts with label నాన్న. Show all posts
Showing posts with label నాన్న. Show all posts

Monday, 11 March 2013

నాన్నా! నన్ను క్షమించు


సమయం రాత్రి ఒంటిగంట. అంతా నిశ్శబ్దం. ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. 'జర్నల్ ఆఫ్ క్లినికల్ సైకియాట్రీ'లొ రివ్యూ ఆర్టికల్ చదువుతున్నాను. విసుగ్గా ఉంది. తల పైకెత్తి చూస్తే ఎదురుగా నాన్న ఫోటో. ఫోటోలోంచి నన్నే చూస్తూ నవ్వుతున్నట్లనిపించింది.

పుస్తకం మూసేశాను. నాన్న! నా జీవితంలో కొన్నేళ్ళపాటు ప్రతిరోజూ ప్రధానపాత్ర వహించిన నాన్న ఇవ్వాళ లేడు. మేమిద్దరం మంచి స్నేహితులం. సినిమాలు, సాహిత్యం, రాజకీయాలు, మానవ సంబంధాలు.. మాకన్నీ చర్చనీయాంశాలే. ఇన్ని కబుర్లు చెప్పిన నాన్న.. పెద్దవాడైనాక.. నన్ను ఏదోక విషయంలో తిట్టేవాడు. కొన్నిసార్లు ఆయన నన్నెందుకు తిడుతున్నాడో ఆయన మర్చిపోయ్యేవాడు.. నాకూ గుర్తుండేది కాదు. ఆయన తిట్లు నాకంతగా అలవాటైపొయ్యాయి!

నాన్న 'బ్రోకర్ మాటలు!' గూర్చి ఒక పోస్ట్ రాశాను. 'బ్రోకరు మాటలు' అన్న మాట నాన్న సొంతం! ఆయనకి  మతమన్నా, దేవుడన్నా చికాకు. పూజలు, పునస్కారాలు చేసే వాళ్ళని విసుక్కునేవాడు. ఆ లిస్టులో అమ్మ కూడా ఉంది. ఆ రకంగా నాన్నకి నేను కృతజ్ఞుడను. నాకెప్పుడూ 'దేవుడున్నాడా?' అనే  సంశయం కూడా కలగకుండా చేశాడు.

ఆయన సిపీయం పార్టీ అభిమాని. ఆ పార్టీ వాళ్ళతో సంబంధాలు ఉండేవి. పుచ్చలపల్లి సుందరయ్యకి భయంకరమైన అభిమాని. ఆశ్చర్యమేమంటే.. నంబూద్రిపాద్ ని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిలా భావించేవాడు. ఎ.కె.గోపాలన్ కారణజన్ముడనేవాడు. ఇదేమి కమ్యూనిజం!

ఆయనో చిన్నపాటి ఉద్యోగం చేసేవాడు. బ్రాడీపేటలోనే పుట్టి పెరిగిన కారణాన వీధివీధికి 'ఏరా!' స్నేహితులుండేవారు.  ఆయన పేరు ధనుంజయరావు. స్నేహితులకి మాత్రం 'ధనంజి'. కనిపిస్తే రోడ్ల మీదే వాళ్ళతో కబుర్లు. ఆయన కబుర్లు ఎక్కువగా రాజకీయాల చుట్టూతానే. ఆయన స్నేహితులు ఇందిరాగాంధీని తిడుతుండేవాళ్ళు. మొరార్జీ దేశాయ్, కామరాజు నాడార్, వి.వి.గిరి మొదలైన పేర్లు విరివిగా వినబడుతుండేది.

నాన్న నన్ను చదువుకొమ్మని ఏ నాడు ఇబ్బంది పెట్టలేదు. కానీ ఆయన వల్ల చిత్రమైన హింసకి గురైనాను. ఆయనకి పులుసులంటే ఇష్టం. కాకరకాయ పులుసు, బెండకాయ పులుసు, వంకాయ పులుసు, సొరకాయ పులుసు.. ఇదొక ఎండ్లెస్ లిస్ట్. ఆ రోజుల్లో అమ్మలు నాన్న మాట వినేవాళ్ళు! ఆయన తన పులుసులతో తీవ్రంగా బాధించేవాడు.

పోనీ సినిమాలైనా మంచివి చూపిస్తాడా అంటే అదీ లేదు. ఆయన కాంతారావు నటించిన కత్తి యుద్ధం సినిమాలన్నీ వరసగా చూపెట్టేవాడు! అన్నీ ఒకేరకంగా ఉండేవి. రాజ్ కపూర్ సినిమాలు చూపించేవాడు. ఒక్క ముక్క అర్ధమయ్యేది కాదు.

ఆయనది తన అభిరుచులే కరెక్ట్ అనుకునే హిట్లర్ మనస్తత్వం. కొంత వయసు వచ్చాక మాకు స్వాతంత్ర్యం లభించింది. పులుసుల నుండి విముక్తీ లభించింది. ఇంట్లో రకరకాల కూరలు. "ఛీ.. ఛీ.. ఇదేం వంట? గేదెలు కూడా తినవు. ఇంతకన్నా జైలు కూడు నయం." అంటూ ఒకటే సణిగేవాడు. ఇంట్లో పులుసులు తగ్గిపోడం ఒక ఇన్సల్ట్ గా భావించేవాడు.


నాన్న నేను పదో క్లాసు ఫస్ట్ క్లాస్ లో పాసయితే వాచ్ కొనిస్తానన్నాడు. పాసయ్యాను. కొన్లేదు. ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాసైతే కొనిస్తానన్నాడు. పాసయ్యాను. కొన్లేదు. మెడిసిన్ సీటొస్తే కొనిస్తానన్నాడు. సీటొచ్చింది. ఇంక తప్పలేదు. ఊరంతా తిప్పితిప్పి బేరం చేసిచేసి 173 రూపాయలతో హెన్రీ శాండెజ్ వాచ్ కొనిచ్చాడు. కొన్న వేళావిశేషం! దాన్ని ఎనాటమీ థియేటర్లో మూడో రోజే పోగొట్టుకున్నాను. ఆయన ఆ రోజు నన్ను తిట్టిన తిట్లకి చెవుల్లోంచి రక్తం వచ్చింది!
                               
గుడిపాటి చలం చివర్లో ఆధ్యాత్మికత వైపు మళ్ళినట్లుగా.. నాన్న చివర్లో ఎన్టీఆర్ ని అభిమానించాడు. ఎన్టీఆర్ దేశాన్ని ఉద్ధరిస్తాడని నమ్మేవాడు. పార్టీల పట్ల లాయల్టీలు మారినా ఆయనకి 'ఉద్ధరింపుడు నమ్మకాలు' మాత్రం మారలేదు! అయితే ఎందుకో ఆయన తను టిడిపి అభిమానిగా ఐడెంటిఫై అవడం ఇష్టపళ్ళేదు. బయటకి మాత్రం సిపియం అభిమానిగానే ఉండిపోయ్యాడు.


ఇక్కడే నేను ఆయన వీక్ పాయింట్ పట్టేశా. ఆయన సిపియం వన్నె టిడిపి! ఆయన మీద 'పులుసు' ప్రతీకారం, సినిమాల రివెంజ్ తీర్చుకోడానికి నాకో మంచి అవకాశం దొరికింది! ఆయనతో కలిసి భోంచేస్తున్నప్పుడు ఎన్టీఆర్ ని భయంకరంగా విమర్శించేవాణ్ణి. నా మీద విపరీతంగా ఆవేశపడేవాడు.

"ఎన్టీఆర్ ని అంటే నీకెందుకు కోపం? సిపియం పార్టీని ఏమన్నా అంటే అప్పుడను. టిడిపి ఒక బూర్జువా పార్టీ. అవునా? కాదా?" ఇదీ నా వాదన.

పాపం! ఆయన మింగలేక కక్కలేక సతమతమయ్యేవాడు. ఏమీ చెప్పలేక.. తన ఫేవరెట్ పంచ్ లైన్ వాడేవాడు.

"బ్రోకరు మాటలు మాట్లాడకు. నీలాంటి బ్రోకరు ఇంట్లో ఉంటేనే శని.. "

అమ్మ విసుక్కునేది. "భోజనాల దగ్గర ఈ గోలేంటి. వాళ్ళెవరో ఏదో చేస్తే మీరెందుకు పోట్లాడుకుంటారు?"

నా వాదనకి  సమాధానం చెప్పలేక కుతకుతలాడిపోతున్న నాన్న కోపం అమ్మ మీదకి మళ్ళించేవాడు. ఆ రోజులు భర్తలకి స్వర్ణయుగం. అంచేత భర్తలు భార్యల్ని ఇంచక్కా తిట్టుకునేవాళ్ళు.

"అసలు దీనంతటికీ కారణం నువ్వే. వీడితో పాటు నాకు భోజనం పెట్టి నన్ను తిట్టిస్తావా?  ప్రపంచంలో నిన్ను మించిన  బ్రోకరు ఎవ్వరూ లేరు." అంటూ అమ్మ మీద ఎగిరేవాడు.

"నాన్నా! నేను నిన్ను తిట్టానా? లేదు కదా! నాకు టిడిపి అంటే ఇష్టం లేదు. అది నా ఇష్టం. ఇంతకీ మీ సిపియం వాళ్ళు టిడిపితో పొత్తు పెట్టుకుంటున్నారా?" అలవోకగా నవ్వేవాణ్ని.

"ఈ దేశాన్ని రెండు శనిగ్రహాలు పీడిస్తున్నయ్యి. ఒకటి ఇందిరాగాంధీ. రెండు నువ్వు." అంటూ నాన్న ఆవేశపడేవాడు.

"మరి ఎన్టీఆర్ ఏ గ్రహమో?" వ్యంగ్యంగా నవ్వేవాణ్ని.

"ఇంట్లో బ్రోకరు ముండాకొడుకులు ఎక్కువైపోయారు. నా సొమ్ము తింటూ ఎద్దుల్లా బలిసి కొట్టుకుంటున్నారు." అంటూ పళ్ళు పటపట లాడించేవాడు.


తనకి నచ్చని వాదనల్ని బ్రోకర్ మాటలంటూ విసుక్కునే నాన్నని తన బ్రోకర్ మాటలతో బుట్టలో వేసుకున్నాడు ఒక మాయల మరాఠి. పేరు ఎన్వీరమణమూర్తి. రమణమూర్తి గూర్చి నా 'ఖడ్గతిక్కన' ఖష్టాలు అంటూ ఒక పోస్ట్ రాశాను.

ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో అమ్మానాన్న. మేడ పైన రెండు గదుల్లో నేనూ, నా చదువుల డెన్. డెన్ కీపర్స్ లో రమణమూర్తి ముఖ్యుడు. మెడిసిన్ టెక్స్ట్ బుక్స్ తక్కువగానూ, సినిమా మేగజైన్స్ ఎక్కువగానూ చదివేవాడు. శ్రీదేవి, రేఖ, దీప బొమ్మల్ని తదేకదీక్షగా చూస్తూ.. వేడిగా నిట్టూరుస్తుండేవాడు.

కొన్నాళ్ళకి నాన్న రమణమూర్తిని పైనుండి పిలిపించి మరీ సహభోజనం చెయ్యసాగాడు. ఓ నాడు ఆయన ఉన్నట్లుండి "మీ ఫ్రెండ్స్ అందర్లోకి రమణమూర్తి ఎంతో ఉత్తముడు. అతని తలిదండ్రులు అదృష్టవంతులు." అని ఓ భారీ డైలాగ్ కొట్టాడు. ఆశ్చర్యపోయాను. వీళ్ళిద్దరి మధ్యా ఏదో జరుగుతుంది! ఏమిటది? మర్నాడు వాళ్ళిద్దరూ భోంచేస్తున్నప్పుడు.. డిటెక్టివ్ యుగంధర్ లా వారి సంభాషణ పై ఓ చెవేశాను.


రమణమూర్తి ఎదురుగా డైనింగ్ టేబుల్ మీద కంచంలో తిరపతి కొండంత అన్నం రాసి! అందులో పప్పు కలుపుతూ మాట్లాడుతూనే ఉన్నాడు. "ఎన్టీరామారావు ఇంటర్నేషనల్ ఫిగర్. అయన్ది అమెరికా ప్రెసిడెంట్ అవ్వాల్సినంత రేంజ్. కనీసం భారతదేశానికి ప్రధాని అవ్వాలి. అవుతాడు కూడా. రవణ గాడి (అనగా నేను)కి బుద్ధి లేదు. అందుకే వాడికి ఎన్టీఆర్ గొప్పదనం అర్ధం కాదు. ఇందిరాగాంధీ ఎక్కడా? రామారావెక్కడా?" చెబుతూనే ఉన్నాడు.

ఆశ్చర్యపోయ్యాను. ఆరి దుర్మార్గుడా! నాకు తెలిసి రమణమూర్తికి రేఖ, రాఖీల మధ్య తేడా మాత్రమే తెలుసు. మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీల మధ్య తేడా మాత్రం ఖచ్చితంగా తెలీదు.

నాన్న ఆనందం పట్టలేకపోతున్నాడు. "మీ ఫ్రెండ్ గాడిదకి బుద్దొచ్చేట్లు నువ్వే చెయ్యాలయ్యా. ఏవే! పాపం రమణమూర్తి ఎంతో కష్టపడి చదువుకుంటున్నాడు. పప్పు మళ్ళీ వడ్డించు. ఇంకొంచెం వంకాయ కూర వేసుకోవయ్యా. నెయ్యి సరిపోదేమో.. "

ఇది మా రమణమూర్తి గాడి కుతంత్రం. నాకు నాన్నని చూస్తే జాలేసింది. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్లు.. బ్రోకర్ మాటలంటూ ఎంతోమందిని విసుక్కున్న నాన్న రమణమూర్తి గాడి బ్రోకర్ మాటలకి పడిపొయ్యాడు. పాపం!

ఆయన నాతో కనీసం బిపి కూడా చూపించుకునేవాడు కాదు. "నువ్వు మెంటల్ డాక్టరువి. బిపి చూడ్డం నీకేం తెలుసు." అనేవాడు. ఎన్టీఆర్ ని విమర్శించే నేను.. ఒక పెద్ద తెలివితక్కువ దద్దమ్మనని ఆయన ప్రగాఢ విశ్వాసం. ఆయనకి తన కోడలు కొడుక్కన్నా మంచి డాక్టరని కూడా నమ్మకం. అంచేత ఆవిడ సలహాలే తీసుకునేవాడు.

ఆయన చివరి రోజుల్లో మంచాన పడ్డాడు. మనిషి ఎముకల గూడులా అయిపొయ్యి మంచానికి అతుక్కుపోయ్యాడు. మనం చెప్పేది అర్ధమయ్యేది కాదు. ఒకసారి ఆయన చెవిలో "నాన్నా! ఎన్టీఆర్ ప్రధానమంత్రి అయ్యాడు." అన్నాను. ఆయన కళ్ళల్లో వెలుగు! ఆయన చనిపోయినప్పుడు ఆయనకి తన బాధల నుండి విముక్తి లభించినందుకు సంతోషించాను. తను ఎంతగానో అభిమానించిన సుందరయ్య, ఎన్టీఆర్ ల దగ్గరకి వెళ్ళిపొయ్యాడనుకున్నాను.

నాన్న నాకు గడియారంలో టైం చూడ్డం నేర్పాడు. సైకిల్ తొక్కడం నేర్పించాడు. ఆంధ్రపత్రిక చదవడం నేర్పించాడు. క్యారమ్స్ ఎలా ఆడాలో నేర్పించాడు. అమ్మకి తెలీకుండా ఆనందభవన్ లో మసాలా అట్టు తినడం ఎలానో నేర్పాడు. ఆయన మహానుభావుడు కాదు. ఒట్టి భావుడు మాత్రమే! చాలా సాదాసీదాగా జీవించిన ఏ ప్రత్యేకతా లేని సగటు జీవి.

నాన్న ఫోటోని చూస్తూ..

"నాన్నా! ఎన్టీఆర్, నంబూద్రిపాద్, సుందరయ్యలు అసలు లీడర్లే కాదు! ఇందిరా గాంధీ నా అభిమాన రాజకీయ నాయకురాలు" అన్నాను.

సమాధానం లేదు. నిశ్శబ్దం! నాన్నకి కోపం రాలేదు. ఫోటోలోంచి అలాగే నన్ను నవ్వుతూ చూస్తున్నాడు! నాన్న నన్ను ఇక ఎప్పటికీ తిట్టడు. తిట్టలేడు. కాలం ఎంత క్రూరమైనది!

"నాన్నా! ఐ మిస్ యు. ఐ మిస్ యువర్ తిట్లు."

నా కళ్ళల్లో తడి.. కళ్ళు మసకబారాయి!

క్షమాపణ..

నేను చాలా తప్పు చేశాను. నాన్నతో నా వాదనల సమయానికే ఆయనలో డిమెన్షియా లక్షణాలు మొదలయ్యాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గాయి. అంచేత.. నాతో వాదించలేక.. మొండిగా మారిపోయ్యాడు. అందుకే ఆయనకి విపరీతమైన కోపం వచ్చేది. నాకా విషయం అప్పుడు తెలీదు. అందుకే ఆయన్ని నా చెత్త వాదనలతో ఇబ్బంది పెట్టాను.

"నాన్నా! నన్ను క్షమించు!"

(photos courtesy : నాన్న ఫోటో : బుడుగు, others : Google)

Monday, 21 January 2013

అవే కళ్ళు!


భయంగా ఉంది. దడగా ఉంది. కాళ్ళల్లో వణుకు. అప్పటికీ భయమేసినప్పుడల్లా కళ్ళు మూసుకుంటూనే ఉన్నాను. అయినా లాభం లేకపోతుంది. భీతి గొలిపే శబ్దాలతొ హాలంతా మారుమోగుతుంది. సినిమాలో ఎప్పుడు ఎవడు చస్తాడోనని టెన్షన్తో వణికి చస్తున్నాను.

అసలు ఇంట్లోనే ఉండిపోతే హాయిగా ఉండేది. నాకు బుద్ధి లేదు. హాయిగా రాము గాడితో గోళీలాట ఆడుకుంటే పొయ్యేది. నా సినిమా పిచ్చే నా కొంప ముంచింది.  పోయిపోయి ఈ భయానక సినిమాలోకొచ్చి పడ్డాను. 'హే భగవాన్! ఈ సినిమా తొందరగా అయిపోయేట్లు చెయ్యి తండ్రి!'

నాకు సినిమాలంటే వెర్రి అభిమానం. సినిమా హాల్ గేట్ దగ్గర టిక్కెట్లు చించే వాళ్ళు నా హీరోలు. వెనక బొక్కల్లోంచి సినిమా వేసే ప్రొజక్షనిస్టులు నా దృష్టిలో గొప్ప ఇంజనీర్లు. వాళ్ళని కళ్ళార్పకుండా ఎడ్మైరింగ్ గా చూసేవాడిని. ఇంచక్కా రోజూ సినిమా అన్ని ఆటలు ఫ్రీగా చూస్తున్న అదృష్టవంతులు వారు.. కొద్దిగా కుళ్ళుగా ఉండేది.

ఆ రోజుల్లోనే పెద్దయ్యాక సినిమా హాల్లోనే ఏదోక ఉద్యోగం చెయ్యాలని నిర్ణయించేసుకున్నాను. అయితే ఎవరన్నా అడిగితే 'పెద్దయ్యాక డాక్టర్నవుతాను' అని గొప్ప కోసం అబద్దం చెప్పేవాడిని. ఏ ఉద్యోగం చేసినా.. ఎంత సంపాదించినా.. రోజుకి కనీసం మూడు సినిమాలు చూడాలని మాత్రం ఎప్పుడో డిసైడయిపొయ్యాను. జేబు నిండుగా డబ్బులుంచుకుని కూడా సినిమా చూడని ఈ పెద్దవాళ్ళు ఎంత అజ్ఞానులో కదా!

ఇంతటి సినిమా పిచ్చి గల నేను.. పుట్టి బుద్ధెరిగిన నాటి నుండి సినిమా చూడ్డానికి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదని మనవి చేసుకుంటున్నాను. రోజుకో సినిమా చూసే అదృష్టాన్ని ప్రసాదించమని మా బ్రాడీపేట శివాలయంలో నుదుటిన అడ్డంగా విబూది రాసుకుని, ఎగ్గిరి గంట కొట్టి మరీ ప్రార్ధించేవాణ్ని.

దేవుడు దయామయుడు. బాలల పక్షపాతి. అందుకే నా సినిమా వీక్షక యజ్ఞం అవిచ్చిన్నంగా కొనసాగింది. అయితే అన్ని రోజులు మనవి కావు. నా జీవితంలో ఓ దుర్దినాన.. చిన్న మావయ్య, అన్నయ్య సినిమాకి బయలుదేరారు. మా బ్రాడీపేటలో గల ఏకైక సినిమా హాలు లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్. అందులో ఏదో 'అవేకళ్ళు' అనే సినిమా అట. అందునా అది పంచ రంగుల చిత్రం. వదలివేయు నా తరమా! నేనూ బయల్దేరాను.

సినిమా అంతా రంగుల మయం. మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఎప్పుడూ చూసే బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో తెల్లగా కనిపించే ఆకాశం ఇప్పుడు నీలంగానూ, నల్లగా కనబడే రక్తం ఎర్రగానూ కనిపిస్తుంటే.. చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. సినిమా సరదాగా మొదలైంది. కానీ క్రమేపి హత్యలతో సస్పెన్స్ గా మారిపోయింది. ఒక్కొక్క క్యారెక్టర్ చచ్చిపోసాగింది. సినిమా సరీగ్గా అర్ధమై చావట్లేదు గానీ.. బాగా భయం వెయ్యసాగింది.

ఉన్నట్లుండి సినిమా హాలు ఒక స్మశానంగానూ, ప్రేక్షకులంతా నన్ను పీక్కుదినబోయే రక్తపిశాచాల్లాగానూ కనిపించసాగారు. ఏమిటి నాకీ దుస్థితి? ఈ భీకర సినిమాలో ఇట్లా ఇరుక్కుపోయానేంటబ్బా! మొత్తానికి చివరకి హంతకుడెవరో తెలిసింది. (అందరూ అనుకున్నట్లు రాజనాల హంతకుడు కాదు.) ఆ హంతక విలన్ హీరో కృష్ణ చేతిలో చావను కూడా చచ్చాడు. ఇక్కడ భయంతో నేను చచ్చే చావు చస్తున్నాను. హాల్లో లైట్లేశారు. హమ్మయ్య! బ్రతుకు జీవుడా అనుకుంటూ హాల్లోంచి బయటపడ్డాను.

రాత్రి సరీగ్గా నిద్ర పట్టలేదు. పంచరంగుల సినిమా అని ముచ్చటపడ్డాను గానీ.. ఆ ఎర్రటి నెత్తురు గుర్తొస్తేనే భయమేస్తుంది. నిద్రలో ఒక పీడ కల. సినిమాలో కనిపించిన హంతకుడు నన్నూ చంపేశాడు. నా ఒళ్ళంతా ఒకటే నెత్తురు. ధారలుగా కారిపోతుంది. ఆ నెత్తురుతో పక్కంతా చల్లగా అయినట్లు అనిపించింది. ఆ తరవాత ఏమైందో గుర్తు లేదు!

తెల్లవారింది. ఎవరో అరుస్తున్నారు. ఎవరు చెప్మా? ఇంకెవరు? అక్క! ఎవర్నో తిడుతుంది. గుడ్లు నులుముకుంటూ, బాగా మెలకువ తెచ్చుకుని, కళ్ళు చిలికించి చూశాను. అక్క తిట్టేది ఎవర్నో కాదు. నన్నే! గదంతా బాత్రూం కంపు.

"అమ్మడూ! వాడి పక్కబట్టలు విడిగా ఒక బకెట్లో నానబెట్టవే. కనబడిన ప్రతి అడ్డమైన సినిమాకి పోవడం.. రాత్రుళ్ళు పక్క ఖరాబు చెయ్యడం. దొంగ గాడిద కొడుకు. ఆ ఉచ్చగుడ్డలు వాడితోనే ఉతికిస్తే గాని బుద్ధి రాదు." నాన్న ఎగురుతున్నాడు.

అమ్మ అన్నయ్యని కేకలేసింది. "చిన్నపిల్లల్ని అట్లాంటి సినిమాలకి ఎవరైనా తీసుకెళ్తారా? ఆ దరిద్రపుగొట్టు సినిమా చూసి బిడ్డ దడుచుకున్నాడు. పాపం! వాడు మాత్రం ఏం చేస్తాడు." అంటూ 'నేరం నాది కాదు.. సినిమాది' అని తేల్చేసింది.

సిగ్గుతో, లజ్జతో.. అవమాన భారంతో.. తేలు కుట్టిన దొంగవలె (దొంగలనే తేళ్ళు ఎందుకు కుడతాయో!) నిశ్శబ్దంగా అక్కణ్ణుంచి నిష్క్రమించాను. ఇదీ నా 'అవేకళ్ళు' కథ. మిత్రులారా! ఇక్కడ దాకా చదువుకుంటూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఆ కంటితోనే ఈ సూపర్ హిట్ సాంగ్ కూడా చూసి ఆనందించండి.

(

photo courtesy : Google)

Wednesday, 14 November 2012

గోవిందరాజుల సుబ్బారావు.. నా తికమక!

                                                  - 1 -

అమ్మానాన్నలతో  సినిమాకి  రెడీ  అయిపొయ్యాను.

"అమ్మా! ఏం సినిమాకెళ్తున్నాం?"

"కన్యాశుల్కం."

"పేరేంటి అలా ఉంది! ఫైటింగులున్నాయా?"

"ఉండవు. నీకు నచ్చదేమో. పోనీ సినిమా మానేసి ఆడుకోరాదూ!"

ఫైటింగుల్లేకుండా సినిమా ఎందుకు తీస్తారో! నాకు చికాగ్గా అనిపించింది. అయితే నాకో నియమం ఉంది. సినిమా చూడ్డనికి వచ్చిన ఏ అవకాశమూ వదలరాదు. నచ్చినా, నచ్చకపోయినా సినిమా చూసి తీరాలి. ఇది నా ప్రతిజ్ఞ!

అమ్మానాన్నల మధ్య కూర్చుని సినిమా చూశాను. సినిమా హాల్లో  అమ్మానాన్నల మధ్యసీటు కోసం నాకు అక్కతో చాలాసార్లు తగాదా అయ్యేది. బొమ్మ తెరపై వెయ్యడానికి ముందు హాల్లో లైట్లు తీసేసి చీకటిగా చేస్తారు. ఆ చీకటంటే నాకు చచ్చేంత భయం. అటూఇటూ ఇంట్లోవాళ్ళుంటే.. మధ్యన కూర్చుని సినిమా చూడ్డానికి ధైర్యంగా ఉంటుంది. అదీ అసలు సంగతి!

'కన్యాశుల్కం' సినిమా ఎంతసేపు చూసినా ఒక్కముక్క కూడా అర్ధం కావట్లేదు. నాకస్సలు నచ్చలేదు. అయినా సావిత్రి ఉండవలసింది రామారావు పక్కన గదా? మరి ఎవరెవరితోనో చాలా స్నేహంగా మాట్లాడుతుందేమి! తప్పుకదూ!

పైపెచ్చు ఒక ముసలాయనకి పిలక దువ్వి, నూనె రాస్తుంది. నాకు ఇది మరీమరీ నచ్చలేదు. ఎన్టీరామారావు ఎంత పక్కన లేకపోతే మాత్రం సావిత్రి అంతగా సరదాలు చెయ్యాలా?

ఈ ముసలాయన్ని ఎక్కడో చూసినట్లుందే! ఎక్కడ చూశానబ్బా? ఆఁ! గుర్తొచ్చింది. ఈ ముసలాయన మా నందయ్యగారే! అదేంటి! నందయ్యగారు సినిమాల్లో వేషాలు కూడా వేస్తారా? ఉన్నట్లుండి నాకు సినిమా ఆసక్తిగా మారింది. బలవంతానా ఆపుకుంటున్న నిద్ర మాయమైంది. నందయ్యగారు యాక్షను బానే చేశారు. మరి సావిత్రితో తన పిలకకి నూనె ఎందుకు పెట్టించుకున్నాడబ్బా!

'ఎవరా నందయ్య గారు? ఏమాకథ?'

ఈ భూప్రపంచమందు అత్యంత సుందరమైన ప్రాంతం మా గుంటూరు. అందు మా బ్రాడీపేట మరింత సుందర ప్రదేశము. ఈ సంగతి మీకు ఇంతకుముందు కూడా బల్లగుద్ది చెప్పాను. మీరు మర్చిపోతారేమోనని అప్పుడప్పుడూ ఇలా మళ్ళీ బల్ల గుద్దుతుంటాను.

మా బ్రాడీపేట మూడవ లైను మొదట్లో.. అనగా ఓవర్ బ్రిడ్జ్ డౌన్లో నందయ్యగారి ఇల్లు. పక్కన మాజేటి గురవయ్యగారి ఇల్లు. ఆ పక్కన ముదిగొండ భ్రమరాంబగారి ఇల్లు. చింతలూరివారి ఆయుర్వేద వైద్యశాల. దాటితే డాక్టర్ ఆమంచర్ల చలపతిరావుగారి ఇల్లు. ఎదురుగా ఇసుకపల్లి వేంకట కృష్ణమూర్తిగారి ఆయుర్వేద వైద్యశాల ఉంటుంది.

సాయంకాలం సమయానికి ఈ అరుగులన్నీ పురోహితులతో కళకళలాడుతుండేది. గుంపులు గుంపులుగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు. వాతావరణం చాలా సందడిగా, కళకళలాడుతుండేది. ఊళ్ళో ఎవరికైనా పూజలు, వ్రతాలకి  పురోహితుల అవసరం వచ్చినప్పుడు అక్కడే ఎప్పాయింట్ మెంట్లు ఖరారయ్యేవి.

మంజునాథ రెస్టారెంట్ పక్కనే ఉన్న నశ్యం షాపు ఆ సమయంలో చాలా బిజీగా ఉండేది. పొడుంకాయ ఫుల్లుగా నింపడానికి ఐదు పైసలు. పొడుగ్గా ఉండే కాడ చివర బుల్లి గరిటె. ఆ గరిటెతో చిన్నజాడీలోంచి నశ్యాన్ని లాఘవంగా స్కూప్ చేస్తూ పొడుంకాయ నింపడం అద్భుతంగా ఉండేది. ఆ నశ్యం నింపే విధానం అబ్బురంగా చూస్తూ నిలబడిపొయ్యేవాడిని.

నశ్యం పట్టు పడుతూ.. సందడిగా, సరదాగా కబుర్లు చెప్పుకునే పురోహితులు ఒక వ్యక్తి కనపడంగాన్లే ఎలెర్ట్ అయిపోయేవారు. నిశ్శబ్దం పాటించేవారు. వినయంగా నమస్కరించేవారు. ఆయనే నందయ్య గారు.

నందయ్యగారింట్లో ఆడామగ అనేక వయసులవారు ఉండేవారు. ఇంటి వరండాలో చెక్కబల్లపై నందయ్యగారు కూర్చునుండేవారు. తెల్లటి తెలుపు. నిగనిగలాడే గుండు. ఒత్తైన పిలక. చొక్కా వేసుకొంగా ఎప్పుడూ చూళ్ళేదు. పంచె మోకాలు పైదాకా లాక్కుని, ఒక కాలు పైకి మడిచి కూర్చుని ఉంటారు. మెళ్ళో రుద్రాక్షలు. విశాలమైన నుదురు. చేతులు, భుజాలు, నుదుటిపైనా తెల్లటి వీభూది. పంచాంగం చూస్తూ వేళ్ళతో ఏవో లెక్కలు వేస్తుండేవారు.

ఇంటికి వచ్చినవారు నందయ్యగారికి వినయంగా నమస్కరించేవారు. పెద్దవాళ్ళు నాలాంటి పిల్లకాయల చేత ఆయన కాళ్ళకి నమస్కారం చేయించేవాళ్ళు. మహానుభావుల కాళ్ళకి నమస్కరిస్తే చదువు బాగా వంటబడుతుందని అమ్మ చెప్పింది. చదువు సంగతి అటుంచి.. కనీసం మా లెక్కల మాస్టారి తన్నులైనా తప్పుతయ్యేమోననే ఆశతో నందయ్యగారి కాళ్ళకి మొక్కేవాణ్ని.

మళ్ళీ మన 'కన్యాశుల్కం' లోకి వద్దాం. సినిమా అయిపొయింది. అమ్మానాన్న రిక్షాలో కూర్చున్నారు. యధావిధిగా నా ఉచితాసనంపై కూర్చున్నాను. ఏదో గొప్ప కోసం గంభీరంగా ఉంటుందని 'ఉచితాసనం' అని రాస్తున్నానుగానీ.. అసలు సంగతి రిక్షాలో నా ప్లేస్ కాళ్ళు పెట్టుకునే చోట.. అమ్మానాన్న కాళ్ళ దగ్గర.

మా ఇంట్లో అందరిలోకి నేనే చిన్నవాణ్ణి. అంచేత రిక్షా సీటుపై ఎవరు కూర్చున్నా.. నా పర్మనెంట్ ప్లేస్ మాత్రం వాళ్ళ కాళ్ళ దగ్గరే! ఆ విధంగా పెద్దయ్యేదాకా రిక్షా సీటుపై కూర్చునే అవకాశం పొందలేకపోయిన నిర్భాగ్యుడను.

"సినిమాలో మన నందయ్యగారు భలే యాక్టు  చేశారు." అన్నాను.

నాన్నకి అర్ధం కాలేదు.

"నందయ్యగారా! సినిమాలోనా!" అన్నాడు నాన్న.

"అవును. సావిత్రి ఆయన పిలకకేగా నూనె రాసింది." నాన్నకి తెలీని పాయింట్ నేను పట్టేసినందుకు భలే ఉత్సాహంగా ఉంది.

నాన్న పెద్దగా నవ్వాడు.

"నువ్వు చెప్పేది లుబ్దావధాని గూర్చా! ఆ పాత్ర వేసినాయన డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు. ఆయన గొప్పనటుడు. బాలనాగమ్మలో మాయల మరాఠీగా వేశాడు. దడుచుకు చచ్చాం." అన్నాడు నాన్న.

నమ్మలేకపోయాను. నాన్న నన్ను తప్పుదోవ పట్టిస్తున్నాడా? ఛ.. ఛ! నాన్న అలా చెయ్యడు. బహుశా నాన్న నందయ్యగారిని గుర్తుపట్టలేకపోయ్యాడా? అలాంటి అవకాశం లేదే! నాన్నకి నందయ్యగారు బాగా తెలుసు. నందయ్యగారు నాన్నని 'ఏమిరా!' అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు.

ఆలోచనలతోనే ఇంట్లోకొచ్చిపడ్డా. నాన్నకిష్టమైన, నాకు అత్యంత అయిష్టమైన కాకరకాయ పులుసుతో నాలుగు ముద్దలు తిన్నాను. నాన్న చాలా విషయాల్లో డెమాక్రటిక్ గా ఉండేవాడు. కానీ ఎందుకో కాకరకాయ పులుసు విషయంలో హిట్లర్ లా వ్యవహరించేవాడు. వారంలో ఒక్కసారైనా ఇంట్లోవాళ్ళం నాన్నకిష్టమైన కాకరకాయ పులుసుతో శిక్షించబడేవాళ్ళం.

కాకరకాయ పులుసు కడుపులో తిప్పుచుండగా.. నందయ్య గారి ఆలోచన మనసులో తిప్పుచుండెను. ఆలోచిస్తున్న కొద్దీ.. ఈ లుబ్దావధాని, గోవిందరాజుల సుబ్బారావు, నందయ్యగార్ల ముడి మరింతగా బిగుసుకుపోయి పీటముడి పడిపోయింది.

అటు తరవాత నందయ్యగారి సినిమా వేషం సంగతి నా అనుంగు స్నేహితుడైన దావులూరి గాడి దగ్గర ప్రస్తావించాను. వాడు నాకన్నా అజ్ఞాని. తెల్లమొహం వేశాడు. పరీక్షల్లో నాదగ్గర రెగ్యులర్ గా కాపీకొట్టే సాగి సత్తాయ్ గాడు మాత్రం నేనే కరక్టని నొక్కివక్కాణించాడు. ఏవిటో! అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది!

                                                     - 2 -

కాలచక్రం సినిమారీల్లా గిర్రున తిరిగింది. ఇప్పుడు నేను పెద్దవాడనైనాను. రిక్షాలొ కాళ్ళ దగ్గర కూచోకుండా సీటు మీదే కూర్చునే ప్రమోషనూ వచ్చింది. నా సాహిత్యాభిలాష చందమామ చదవడంతో మొదలై ఆంద్రపత్రిక, ప్రభల మీదుగా కథలు, నవలలదాకా ప్రయాణం చేసింది.

ఈ క్రమంలో కన్యాశుల్కం గురజాడ అప్పారావు రాసిన నాటకమనీ, అది సినిమాగా తీశారనీ తెలుసుకున్నాను. లుబ్దావధానిని నందయ్యగారిగా పొరబడ్డందుకు మొదట్లో సిగ్గు పడ్డాను. అటుతరవాత నవ్వుకున్నాను. నేనెందుకు తికమక పడ్డాను!?

కొన్నాళ్ళకి కన్యాశుల్కం నాటకం చదివాను. నాటకం గూర్చి అనేకమంది ప్రముఖుల వ్యాఖ్యానాలూ చదివాను. తెలుగు సాహిత్యంలో కన్యాశుల్కం ప్రాముఖ్యత గూర్చి ఒక అంచనా వచ్చింది. సినిమా మళ్ళీ చూడాలని.. పెరిగిన వయసుతో, పరిణిత మనసుతో హాల్లోకి అడుగెట్టాను.

సినిమా మొదలైన కొంతసేపటికి సినిమాలో పూర్తిగా లీనమైపొయ్యాను. కారణం.. గోవిందరాజుల సుబ్బారావు అద్భుత నటన. ఆంగ్లంలో 'స్పెల్ బౌండ్' అంటారు. తెలుగులో ఏమంటారో తెలీదు. లుబ్దావదానిగా గోవిందరాజుల సుబ్బారావు నటించాడనడం కన్నా..  ప్రవర్తించాడు అనడం కరెక్ట్.

గోవిందరాజుల సుబ్బారావు వృద్దుడయినందున లుబ్దావధాని ఆహార్యం చక్కగా కుదిరందని కొందరు అంటారు. వాస్తవమే అయ్యుండొచ్చు. అయితే ఇది నటుడికి కలసొచ్చిన ఒక అంశంగా మాత్రమే పరిగణించాలని నా అభిప్రాయం.

వృద్ధాప్యంలో 'డిమెన్షియా' అనే మతిమరుపు జబ్బు మొదలవుతుంది. ఎదుటివాడు చెప్పేది అర్ధం చేసుకుని చెప్పడానికి సమయం పడుతుంది. శరీర కదలికల వలె మానసికంగా కూడా నిదానంగా రియాక్ట్ అవుతుంటారు. ఎటెన్షన్ మరియు కాన్సంట్రేషన్ తగ్గడం చేత ఒక్కోసారి అర్ధం కానట్లు చేష్టలుడిగి చూస్తుండిపోతారు. ఇవన్నీ మనకి సినిమా లుబ్దావధానిలో కనిపిస్తాయి.

నా తికమక నటుడిగా గోవిందరాజుల సుబ్బారావు సాధించిన విజయం. అందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు. ఆయన మరీ అంత సహజంగా పాత్రలోకి దూరిపోయి అద్భుతంగా నటించేస్తే తికమక పడక ఛస్తానా! అంచేత 'నేరం నాదికాదు! గోవిందరాజుల సుబ్బారావుది.' అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను!

యూట్యూబులోంచి ఆయన నటించిన సన్నివేశం ఒకటి పెడుతున్నాను. చూసి ఆనందించండి.



చివరి తోక..

శ్రీ ముదిగొండ పెదనందయ్యగారు :  వేదపండితులు. ఘనాపాఠి. ఆరాధ్యులు. సంస్కృతాంధ్ర పండితులు.

కృతజ్ఞతలు..

ఈ పోస్టులో నేను రాసిన ఇళ్లేవీ ఇప్పుడు లేవు. అన్నీబహుళ అంతస్తుల బిల్దింగులుగా మారిపోయ్యాయి. పోస్ట్ రాస్తున్న సందర్భాన నా మెమరీని రిఫ్రెష్ చేసిన మిత్రుడు ములుగు రవికుమార్ (నందయ్యగారి మనవడు) కి కృతజ్ఞతలు.

(photos courtesy : Google)

Monday, 10 September 2012

బ్రోకర్ మాటలు


"తప్పకుండా! అలాగే! చూద్దాం. చేద్దాం. అంతే! అంతే! అలాగే!" అంటూ ఫోన్ పెట్టేశాను.

మనసు చికాగ్గా ఉంది. నాకీ పని చెయ్యడం అస్సలు ఇష్టం లేదు. కానీ ఒక చిన్న ఆబ్లిగేషన్ వల్ల చెయ్యక తప్పేట్టు లేదు.

'ఇలా ఇరుక్కు పోయానేమిటబ్బా! బయటపడే మార్గంలేదా?' అనుకుంటూ ఆలోచనలో పడ్డాను.

ఎదురుగ్గా గోడ మీద నాన్న ఫొటో.. నన్ను చూసి నవ్వుతున్నట్లుంది.

"బ్రోకరు మాటలు బాగానే చెబుతున్నావే!" అంటున్నట్లుగా కూడా అనిపించింది.

నాన్న చనిపోయి చాలా యేళ్ళయింది. చాలామందికి తమ తండ్రి గూర్చి ప్రేమ, ఉద్విగ్నతతో కూడిన గొప్పజ్ఞాపకాలు ఉంటాయి. 'మా నాన్నగారు' అంటూ పుస్తకాలు కూడా రాస్తున్నారు. నాకంతటి అదృష్టం లేదు. నేనెప్పుడూ నాన్నని గొప్ప వ్యక్తిగా భావించలేదు. మేమిద్దరం మామూలు మనుషులం. భోంచేస్తూ, టీవీ చూస్తూ చాలా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. జోకులేసుకునేవాళ్ళం. కొన్నిసార్లు వాదించుకునేవాళ్ళం.

నాన్న అతిసాధారణ వ్యక్తి. భోజన ప్రియుడు. స్నేహితులతో కబుర్లు, పుస్తకాలతో స్నేహం ఆయనకి ఇష్టం. నాన్న స్నేహితుల లిస్టులో నేనుకూడా ఉన్నానని గర్వంగా చెబుతున్నాను. ఆయనెప్పుడూ నాదగ్గర తండ్రి హోదా చూపించలేదు. ఆయన చివరిదాకా నాకు స్నేహితుడిగానే ఉండిపొయ్యాడు. ఫలానా పని చెయ్యమనిగానీ, చెయ్యొద్దనిగానీ నాకెప్పుడూ సలహా ఇవ్వక పోవడమే నాన్న నాకు చేసిన గొప్ప మేలు.

"బ్రోకరు మాటలు చెప్పకు." ఇది నాన్న తరచూ వాడే మాట. బ్రోకర్ అనగా 'దళారీ' అని అర్ధం. అయితే నాన్న బ్రోకర్ పదాన్ని dictionary అర్ధంతో ఎప్పుడూ వాడలేదు. ఆయన దృష్టిలో అదో పెద్ద తిట్టు! బ్రోకర్లంటే నిజాయితీపరులు కాదనీ.. సొంతలాభం కోసం నిజాల్ని ట్విస్ట్ చేసే అవకాశవాదులని ఆయన అభిప్రాయం. అసలు నాన్నకి ఈ బ్రోకర్లంటే ఎందుకంత ఎలెర్జీ?

మన సమాజంలో 'బ్రోకర్' పదానికి గౌరవం లేదు. కొందరైతే 'బ్రోకరంటే అమ్మాయిలని set చేసేవాడు' అని కూడా అనుకుంటారు. అందుకే 'అమ్మాయిల బ్రోకర్' అనే మాట పాపులర్. 'మూగమనసులు'  సినిమాలో అల్లు రామలింగయ్య జమునని నాగభూషణానికి 'సెట్' చెయ్యబోతాడు. ఆ ప్రయత్నంలో జమునతో తన్నించుకుంటాడు. భార్యతో తిట్టించుకుంటాడు.

ఈ 'బ్రోకర్' అనే పదానికున్న negative connotation వల్ల.. పెళ్ళిళ్ళ బ్రోకర్లు మేరేజ్ బ్యూరో నిర్వాహకులగానూ, ఇళ్ళస్థలాల బ్రోకర్లు రియల్ ఎస్టేట్ ఏజంట్లుగానూ రూపాంతరం చెందారు (పేర్లు మార్చుకున్నారు). పశ్చిమ దేశాల్లో కార్పోరేట్ డీల్స్ కుదిర్చే బ్రొకర్లకి భారీ కమీషన్లు ముడతాయి. మనది పుణ్య భూమి. ఇచట అఫీషియల్ బ్రోకరేజ్ నిషిద్ధం.

ఇళ్ళస్థలాల బ్రోకర్ ఏం చెబుతాడు? అమ్మేవాడితో.. భూటాన్ లో భూకంపం వచ్చినందున ఇళ్ళస్థలాల రేట్లు దారుణంగా పడిపోయ్యయంటాడు. చచ్చోనోడి పెళ్ళికి వచ్చిందే కట్నంగా ఫలానా రేటుకి, ఫలానా వాడికి అమ్మెయ్యమంటాడు. కొనేవాడికి కొసరు కబుర్లు వినిపిస్తాడు. స్థలం బంగారం అంటాడు. ఇంగ్లాండులో ఇత్తడి రేటు తగ్గినందున నెల లోపే స్థలం రేటు రెట్టింపు అయిపోతుందంటాడు. ఈ రకంగా రెండు పార్టీల దగ్గర రెండురకాల రికార్డులు  వేస్తాడు. డీల్ సెటిల్ చేసి కమిషన్ తీసుకుంటాడు. ఇదంతా మనకి తెలిసిన వ్యవహారమే!

మన రాజకీయ నాయకుల కూడా అచ్చు ఇలాగే చెబుతారు. ఫలానా ప్రాజెక్ట్ దేశానికి తక్షణావసరం అంటారు. ఈ ప్రాజెక్టుతో దేశాభివృద్ధి అమెరికాకి అరంగుళం అంచులోకి వచ్చేస్తుందంటారు. అయితే ఈ 'దేశాభివృద్ధి'లో మతలబు వేరుగా ఉంటుంది. నాలుగ్గోడల మధ్యన పెద్దమనుషుల ఒప్పందాలు జరుగుతాయి. మన ఆస్థులు వాళ్ళే రాసేసుకుని మనకే బ్రోకరేజ్ విదుల్చుదురు! ఇదొక ఆధునిక బ్రోకర్ వ్యవస్థ.

పూర్వం ఏదైనా పత్రికా సంపాదకుడు ప్రభుత్వ పాలసీని సమర్ధిస్తూనో, వ్యతిరేకిస్తూనో ఒక సంపాదకీయం రాస్తే ప్రజలు సీరియస్ గా ఆలోచించేవారు. ఇప్పుడీ రంగం మారిపోయింది. పత్రికాధిపతులే ఎడిటర్లు. వారికి వ్యాపారాలుంటయ్. రాజకీయ ప్రయోజనాలుంటయ్. మనకి మాత్రం పరిశుద్దాత్మతో నీతిబోధనలు ప్రవచించెదరు. మనల్ని ఉత్తమ ఓటరుగా తీర్చిదిద్దుటకు శ్రమించెదరు!

వీరిని ఇంటలెక్చువల్ బ్రోకర్లని అనవచ్చును. ఈ తెగవారు తమ వాదనాపటిమతో, రచనాచాతుర్యంతో మనని బురిడీ కొట్టించి 'భలే చెప్పాడే!' అనిపిస్తారు. కానీ.. వారి అసలు ఉద్దేశం వేరు. వీళ్ళుకూడా నాన్న చెప్పిన బ్రోకర్లే. తమ అసలు రంగు కనబడనీయకుండా రకరకాల ముసుగులు కప్పుకుని మోసం చేసే దొంగబ్రోకర్లు. అసలు బ్రోకర్ల కన్నా ఈ ముసుగు బ్రోకర్లు మహా ప్రమాదకరమైన మాయగాళ్ళు. ఇప్పుడా ముసుగులు కూడా పక్కన పడేస్తున్నార్లేండి!

'ఇందుగలడందు లేడని సందేహము వలదు.. ఎందెందు వెతికినా అందందే కలడు బ్రోకర్.' అని అనిపిస్తుంది. 'ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం బ్రోకర్ల పీడన పరాయణత్వం.' అని కూడా అనిపిస్తుంది. ఒకడు కనబడే బ్రోకరైతే, మరొకడు కనబడని బ్రోకరు. ఒకడిది పొట్ట పోసుకునే వృత్తి అయితే వేరొకడిది పొట్ట కొట్టే వృత్తి.
                                   
ఈ విధంగా 'సర్వం బ్రోకర్ల మయం' కావడానికి కారణం ఏమిటి? సమాజంలో డబ్బు అవసరాలు పెరగడం, డబ్బుతోనే రాజకీయాలు కూడా నడపగలమన్న నమ్మకం పెరిగిపోవడం అయ్యుండొచ్చు. అందుకనే మనం ఇప్పుడు Forbes జాబితా అంటూ డబ్బున్నోళ్ళ పేర్లు ఫాలో అవుతున్నాం. వాళ్ళే మనకి ఆదర్శం.

నాన్నకాలం స్వర్ణయుగం. డబ్బు అవసరాలు తక్కువ. అంచేత ఆ కాలంవారు నిజాయితీగా, నిక్కచ్చిగా బ్రతగ్గలిగారు. ఇవ్వాళ అన్నింటినీ శాసిస్తుంది డబ్బే. 'కోటివిద్యలు డబ్బు కొరకే' అన్నది నేటిసామెత. డబ్బుకోసం అమ్ముడు పోనిదేదీలేదు. నేటి బాలలే రేపటి బ్రోకర్లు. భారంగా నిట్టూర్చాను.

నాన్న ఫోటో వైపు చూస్తూ.. 'సారీ నాన్న!' అనుకున్నాను!

నాన్న నన్ను చూసి నవ్వుతూనే ఉన్నాడు!

(photo courtesy : Budugu)

Wednesday, 11 April 2012

నాన్న పొదుపు - నా చిన్నికష్టాలు


"ఈణ్నాకొడుకయ్యా! అన్నం సరీంగా తిండు, తిన్నదొంటబట్టట్లేదు. ఒక బలంసీసా రాయి సార్!" అడిగాడు కోటయ్య. 

కోటయ్యది దుర్గి మండలలో ఓ గ్రామం. పొడుగ్గా, బక్కగా, కాయబారిన దేహం. చింపిరి జుట్టు, మాసిన గడ్డం, చిరుగు చొక్కాతో పేదరికానికి బట్టలు తోడిగినట్లుంటాడు. కొన్నాళ్ళుగా నా పేషంట్. ఎప్పుడూ భార్యని తోడుగా తెచ్చుకునేవాడు, ఈసారి తన పదేళ్ళ కొడుకుతో వచ్చాడు.

ఆ 'సరీంగా అన్నం తినని' కోటయ్య కొడుకు వైపు దృష్టి సారించాను. బక్కగా, పొట్టిగా అడుగుబద్దలా ఉన్నాడు. డిప్పకటింగ్, చీమిడిముక్కు, మిడిగుడ్లు. తన లూజు నిక్కర్ జారిపోకుండా ఎడంచేత్తో పట్టుకుని, కుడిచేత్తో తండ్రి చెయ్యిని గట్టిగా పట్టుకుని, ఇంజక్షన్ ఎక్కడ పొడిచేస్తానో అన్నట్లు నావైపు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు. మాసిన తెల్లచొక్కా మోకాళ్ళ దాకా లూజుగా వేళ్ళాడుతుంది. చొక్కా గుండీలకి బదులు రెండు పిన్నీసులు. ఈ ఆకారాన్ని ఎక్కడో చూశాను, ఎక్కడ చూశాను? ఎక్కడ? ఎక్కడబ్బా? ఎక్కడో ఏంటీ! అది నేనే!!
                                                    
గుంటూరు శారదా నికేతనంలో నేను ఒకటి నుండి ఐదోక్లాసు దాకా చదువుకున్నాను. ఎడ్మిషన్ ఫీజు అక్షరాల ఒక రూపాయి, అటుతరవాత ఒక్కపైసా కట్టే పన్లేదు. విశాలమైన ఆవరణలో చుట్టూతా క్లాసురూములు, మధ్యలో ఆటస్థలం. వాతావరణం సరదా సరదాగా వుండేది. బడికి ఒక మూలగా రేకుల షెడ్డు, అందులో ఒక పిండిమర. బడి ప్రాంగణంలో ఈ పిండిమర ఎందుకుందో నాకు తెలీదు, కానీ నాకా పిండిమర ఓ ఇంజినీరింగ్ మార్వల్‌లా అనిపించేది.

సర్రుమంటూ శబ్దం చేస్తూ తిరిగే పెద్ద నవ్వారు బెల్టుల్ని ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని చూస్తుండిపొయ్యేవాణ్ణి. రకరకాల ధాన్యాల్ని గిన్నెలు, డబ్బాల్లో వరస క్రమంలో పెడతారు. 'పిండిమరబ్బాయి' వాటిని అదే వరస క్రమంలో, చిన్న స్టూలు మీద నిలబడి, పిండిమర మిషన్‌పైన కప్పలా నోరు తెరుచుకునున్న వెడల్పాటి రేకు డబ్బాలోకి పోసేవాడు. వెంటనే గింజలు 'పటపట'మంటూ శబ్దం చేస్తూ పిండిగా మారి కిందనున్న రేకుడబ్బాలోకి పడేవి. ఆ 'పిండిమరబ్బాయి' నా హీరో. నా హీరో శరీరమంతా పిండి దుమ్ముతో తెల్లగా మారిపోయి గ్రహాంతరవాసిగా అగుపించేవాడు.

శారదా నికేతనం హెడ్మాస్టారుగారు గాంధేయవాది. ఆయన బాగా పొడుగ్గా, బాగా బక్కగా, బాగా బట్టతలతో, ఖద్దరు బట్టల్తో, మందపాటి గుండ్రటి కళ్ళజోడుతో అచ్చు గాంధీగారి తమ్ముళ్ళా ఉండేవారు. ఆయన గదిలో గోడపైన గాంధి, నెహ్రు, బోస్, పటేల్ మొదలైన దేశనాయకుల చిత్రపటాలు ఉండేవి. ఆ రూంలో ఓ మూలగా మంచినీళ్ళ కుండ ఉంటుంది. క్లాసు మధ్యలో దాహం వేస్తే ఆ కుండలోని చల్లని నీళ్ళు తాగేవాళ్ళం. హెడ్మాస్టరుగారి టేబుల్ మీద పెన్సిల్ ముక్కు చెక్కుకునే మిషన్ (షార్పెనెర్) ఉంటుంది. ఆయన గదికి వెళ్ళినప్పుడల్లా ఆయన 'మనది పవిత్ర భారత దేశం, చదువుకుని దేశానికి సేవ చెయ్యటం మన కర్తవ్యం. చక్కగా చదువుకోండి. మిమ్మల్ని చూసి తలిదండ్రులు గర్వించాలి' అంటూ చాలా చెప్పేవాళ్ళు.

బడి గోడల్నిండా 'సత్యము పలుకుము, పెద్దలని గౌరవించవలెను.' లాంటి సూక్తులు రాసుండేవి. అబద్దం చెబితే సరస్వతి దేవికి కోపమొచ్చి చదువు రాకుండా చేస్తుందని గట్టిగా నమ్మేవాణ్ని, భయపడేవాణ్ణి. ఓంకార క్షేత్రంలో ప్రసాదం సమయానికి ఠంచనుగా  హజరయ్యేవాణ్ని. ఒక్క ఎగురు ఎగిరి గంటకొట్టి, రెండు చేతులూ జోడించి, కళ్ళు గట్టిగా మూసుకుని బాగా చదువొచ్చేట్లు చెయ్యమని దేవుణ్ణి తీవ్రంగా వేడుకునేవాణ్ణి. పుణ్యానికి పుణ్యం, చేతినిండా ప్రసాదం!

మా స్కూలుకి యూనిఫాం లేదు. నాకు రోజువారీ తోడుక్కోడానికి శుభ్రమైన బట్టలు రెండుజతలు ఉండేవి. సాయంత్రం స్నానం తరవాత  పోట్టైపోయి పోయినేడాది బట్టలే గతి. అవి - బిగుతుగా, (ఇప్పటి మన సినిమా హీరోయిన్ల బట్టల్లా) ఇబ్బందిగా  ఉండేవి. అమ్మకి చెబితే - 'మగాడివి, నీకు సిగ్గేంట్రా!' అనేది. ఆ విధంగా మగాళ్ళకి  సిగ్గుండక్కర్లేదని చాలా చిన్నతనంలోనే గ్రహించాను! బట్టలు సరిపోటల్లేదని ఎంత మొర పెట్టుకున్నా అందరిదీ ఒకటే సమాధానం - ' అసలీ వయసులో నీకెందుకన్ని బట్టలు? ఎట్లాగూ  పోట్టైపోతాయ్ గదా!'

నాకు దెబ్బలు తగిలించుకోటంలో గిన్నిస్ రికార్డుంది. కోతికొమ్మచ్చి ఆడుతూనో, గోడ దూకుతూనో.. ఏదో రకంగా శరీరంలోని అనేక భాగాల్లో అనేక దెబ్బలు తగుల్తుండేవి. వాటిల్లో కొన్ని మానుతున్న గాయాలైతే, మరికొన్ని ఫ్రెష్ గాయాలు. ఒక రోజు సైకిల్  నేర్చుకుంటూ  కింద  పడ్డాను. మోకాలు భయంకరంగా దోక్కుపోయింది, బాగా రక్తం కారుతుంది. వీధి చివర మునిసిపాలిటీ పంపు నీళ్ళధార కింద దెబ్బని కడుక్కున్నాను. రక్తంతో కలిసిన నీళ్ళు ఎర్రగా కిందకి జారిపొయ్యాయి. అబ్బ! భరించలేని మంట. కుంటుకుంటూ, ఏడ్చుకుంటూ ఇంటికి  చేరాను.

నాన్న ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడే అన్నం తిని, మంచం మీద పడుకుని ఆంధ్రప్రభ చదువుకుంటున్నాడు. నా అవతారం చూడంగాన్లే వీరావేశంతో నన్ను ఉతికి ఆరేశాడు. ఆయనకంత కోపం రావడానికి కారణం నాకు దెబ్బ తగలడం కాదు, అసలాయన నా దెబ్బనే పట్టించుకోలేదు - దెబ్బవల్ల నిక్కర్ అంచు కొంచెం చిరిగింది, అదీ సంగతి!

ఈవిధంగా శరీరంతో పాటు బట్టలకి కూడా అవుతున్న రకరకాల గాయాలకి కట్లు కట్టించుకుంటూ (దీన్నే టైలర్ల భాషలో 'రఫ్' తియ్యడం అంటారు), బొత్తాలు ఊడిపోయిన చొక్కాకి పిన్నీసులు పెట్టుకుంటూ, నిక్కర్ (మేం 'లాగు' అనేవాళ్ళం) జారిపోకుండా మొలతాడుని నడుం చుట్టూ బిగిస్తూ కొత్తబట్టల కోసం భారంగా ఎదురు చూపులు చూస్తుండేవాణ్ణి.   

ఈ కొత్తబట్టలకి ఒక లెక్కుంది. ఎండాకాలం సెలవల తరవాత స్కూళ్ళు తెరిచేప్పుడు రెండుజతల బట్టలు, అటుతరవాత ముఖ్యమైన పండగలకి ఒకజత. ఓవర్ బ్రిడ్జ్ పక్కన మూడోలైన్లో కొత్తమాసువారి బట్టల దుకాణం ఉంది. ఆ దుకాణదారుడు నాన్నకి స్నేహితుడు. అంచేత  ఎప్పుడైనా కొత్తమాసువారి  కొట్లో మాత్రమే గుడ్డ కొనాలి. కొద్దిగా బాగున్న గుడ్డ కొందామనుకుంటే ఆ షాప్ ఓనరుదీ ఇంట్లోవాళ్ళ పాటే! 'అంత ఖరీదైన గుడ్డెందుకు బాబు? ఎదిగే వయసు, ఊరికే పొట్టైపోతాయి. ఈ పన్నా చించుతున్నా, రేటు తక్కువ, గట్టిదనం ఎక్కువ.' అంటూ చేతికందిన గుడ్డని కత్తెరతో పరపర కత్తిరించేసేవాడు. ఆయన నాన్నకి స్నేహితుడవడం చేత నన్ను డామినేట్ చేసేవాడు, ఎంతన్యాయం!

నాకా కొత్తబట్టల ప్యాకెట్ ఎంతో అపురూపంగా అనిపించేది. దాన్ని రెండు చేతుల్త్లో ఆప్యాయంగా దగ్గరకి  తీసుకుని, కొత్తబట్టల సువాసనని ముక్కారా ('మనసారా'కి అనుకరణ) ఎంజాయ్ చేస్తూ, నాన్నతోపాటు టైలర్ దగ్గరికి వెళ్ళేవాణ్ణి.

ఓవర్ బ్రిడ్జ్ పక్కన రెండో లైన్ మొదట్లో బాజీ అని మా ఆస్థాన టైలర్ ఉండేవాడు. తెల్లజుట్టు, మాసిన గడ్డం, శూన్యదృక్కులు. అతని మొహం నిర్లిప్తత, నిరాశలకి శాశ్విత చిరునామాలా ఉంటుంది. అతనికీ ప్రపంచంతో, ప్రాపంచిక విషయాల్తో ఆట్టే సంబంధం ఉన్నట్లుగా తోచదు. అతను చిన్నగా, తక్కువగా మాట్లాడతాడు. అతనికి పదిమంది పిల్లల్ట, చాలా కష్టాల్లో కూడా ఉన్నాట్ట. అతని బావ హైదరాబాదులో టైలరుగా బాగా సంపాదిస్తున్నాట్ట, కానీ తన కుటుంబాన్ని అసలు పట్టించుకోట్ట. ఈ విషయాలన్నీ నాన్న అమ్మకి చెబుతుండగా విన్నాను. 

బాజీలాగే బాజీ కుట్టు మిషన్ అత్యంత పురాతనమైనది, ఇంకా చెప్పాలంటే శిధిలమైనది. బ్రిటీషు వాడు దేశానికి స్వతంత్రం ఇచ్చేసి, ఈ కుట్టు మిషన్ కూడా వదిలేసి వెళ్లిపొయ్యాడని నా అనుమానం. బాజీ దించిన తల ఎత్తకుండా పొద్దస్తమానం బట్టలు కుడుతూనే ఉండేవాడు. నాకతను కుట్టు మిషన్తో పోటీ పడుతున్న మనిషి మిషన్లా కనపడేవాడు.. యాంత్రికతలో అతను యంత్రాన్ని జయించినవాడు.

మనుషుల్లో రెండురకాలు - ధనవంతులు, పేదవారు. వస్తువులు కూడా రెండురకాలు కొత్తవి, పాతవి. బాజీ కొలతలు తీసుకునే టేపు పాతది మాత్రమే కాదు, అంటువ్యాధిలా దానికి బాజీ పేదరికం కూడా పట్టుకుంది. అందువల్లా అది చీకిపోయి, పెట్లిపోయి ఉంటుంది. దానిపై అంకెలు అరిగిపోయి కనబట్టం మానేసి చాల్రోజులైంది. కనబడని ఆ టేపుతో కొలతలు తీసుకుంటూ, సరీగ్గా అంగుళం మాత్రమే ఉండే పెన్సిల్‌తో బట్టలు కొన్న బిల్లువెనక ఏవో అంకెలు కెలికేవాడు. 

బాజీ మెజర్‌మెంట్స్ లూజుగా తీసుకునేవాడు. అంచేత లూజు కొంచెం తాగించి ఆదులు తీసుకొమ్మని బాజీకి చెప్పమని నాన్నని బ్రతిమాలేవాడిని. నాన్న పట్టించుకునేవాడు కాదు. బాజీ గూర్చి రాయడం దండగ. అతను వినడు, మాట్లాడడు, రోబోలాగా నిర్వికారంగా కొలతలు తీసుకునేవాడు. ఆవిధంగా నాన్న నాకు అరణ్యరోదన అంటే ఏంటో చిన్నప్పుడే తెలియజెప్పాడు. గుడ్డ అంగుళం కూడా వేస్ట్ కాకూడదు, అదే అక్కడ క్రైటీరియా! ఈ మాత్రం దానికి కొలతలు ఎందుకో అర్ధం కాదు!
                     
నిక్కర్ భయంకరమైన లూజ్ - పొలీసోళ్ళ నిక్కర్లకి మల్లే (ఆరోజుల్లో పోలీసులు నిక్కర్లు వేసుకునేవాళ్ళు) మోకాళ్ళని కవర్ చేస్తుంది. నిక్కర్ కింద అంచు లోపలకి రెండుమూడు మడతలు మడిచి కుట్టబడేది (పొరబాటున ఆ సంవత్సరం నేను హఠాత్తుగా పదడుగులు పొడవు పెరిగినా ఆ మడతలు ఊడదీస్తే సరిపోతుందని నాన్న దూరాలోచన). చొక్కా వదులుగా, అందులో ఇంకా ఇంకోనలుగురు దూరగలిగేంత విశాలంగా ఉండేది. 

చొక్కా ఎంత పొడవున్నా, నిక్కర్ దానికన్నా పొడవుండడం వల్ల పరువు దక్కేది. లేకపోతే చొక్కాకింద ఏమీ వేసుకోలేదనుకునే ప్రమాదం ఉంది! ఇన్నిమాటలేల? నా బట్టలు నాన్నక్కూడా సరిపోతాయి! ఆ బట్టలు నా శరీరాన్ని ఎంత దాచేవో తెలీదు కానీ, వాటిని మొయ్యలేక దుంప తెగేది. ఏ మాటకామాటే - కొంత సుఖం కూడా దక్కేది, గాలి ధారాళంగా ఆడేది. ఆ పెద్దజేబుల్లో బోల్డన్ని మరమరాలు కుక్కొచ్చు, పెన్సిల్ ముక్కలు దాచుకోవచ్చు.
                                 
కొత్తబట్టలేసుకున్నానన్న ఆనందం ఒకపక్కా, అవి మరీ లూజుగా ఉన్నాయన్న దిగులు మరోపక్కా సమానంగా ఉండేవి. మరీ ఇంత వదులైతే ఎలా? పక్కింటివాళ్ళు ఆరేసుకున్న బట్టల్ని కాజేసి వాడుకుంటున్నాననుకోరూ! ఈ అవతారంతో బడికెళ్తే నా పరువేం కావాలి?  పైగా అక్కడ అమ్మాయిలు కూడా ఉంటారాయె. అందులోనూ మొన్న సుమతీ శతకం పద్యాలు గుక్కతిప్పుకోకుండా అప్పజెప్పినప్పుడు పక్కబెంచిలోంచి కె.లలిత నన్ను ఎంత ఎడ్మైరింగ్‌గా చూసింది!

బెరుకుగా బడికెళ్లాను, బిడియంగా నా 'బి' సెక్షన్లోకి అడుగెట్టాను. అక్కడ క్లాసులో ముప్పాతికమంది కొత్తబట్టలతో దర్శనం. ఆశ్చర్యం! వాళ్ళవి నాకన్నా వదులు దుస్తులు. వాళ్ళతో పోలిస్తే నా బట్టలు చాలా నయం. ఆలోచించగా - తండ్రులందరిదీ ఒకే జాతిలాగా తోస్తుంది. ఈ తండ్రుల పొదుపు వల్ల పిల్లల బట్టలకి రక్షణ లేకుండా పోయింది. పిల్లలు అమాయకులనీ, వారి హృదయాల్లో దేవుడుంటాడనీ.. కబుర్లు మాత్రం చెబుతారు, ఆచరణలో మాత్రం అందుకు వ్యతిరేకం, ఏమిటో ఈ మాయదారి ప్రపంచం!

వేసవి సెలవల తరవాత ఆ రోజే క్లాసులు మొదలు, అంచేత - క్లాసంతా గోలగోలగా ఉంది. సూరిని చూస్తే నవ్వొస్తుంది, తిరపతి పోయ్యాట్ట, వాడి బోడిగుండు నున్నగా ఇత్తడి చెంబులా మెరిసిపోతుంది. సీతారావుడు సూరి గుండుని రుద్దుతూ ఏడిపిస్తున్నాడు. శీనుగాడి కుడిచేతికి పిండికట్టు, పక్కింట్లో దొంగతనంగా మామిడి కాయలు కోస్తూ చెట్టుమీంచి పడ్డాట్ట. ఆ మూల వీరయ్య, సుబ్బిగాళ్ళ మధ్యన కూర్చునే ప్లేసుల దగ్గర తగాదా. అరె! నా ప్లేసులో వాడెవడో కొత్తోడు కూర్చున్నాడే! 'వురేయ్ ఎవడ్రా అది? ఆ ప్లేసు నాది, మర్యాదగా లేస్తావా లేదా?' ఆ క్షణంలోనే నా లూజు బట్టల వేదాంతం, సిద్ధాంతం, రాద్ధాంతం.. అన్నీ మర్చిపోయి నా హక్కుల సాధనలో మునిగిపొయ్యాను!
                              
అంకితం -

నా చిన్ననాటి జ్ఞాపకాలు, ముచ్చట్లు నెమరు వేయించిన వదులు దుస్తుల వీరుడు కోటయ్య కుమారుడికి.

కృతజ్ఞతలు -

కోటయ్య కొడుకు బొమ్మని అందంగా గీసిన అన్వర్ గారికి, అందుకు కారకులైన భాస్కర్ రామరాజు గారికి.        

Wednesday, 22 February 2012

వైద్యో నారాయణో హరి!!

"వీడు మా రెండోవాడండీ, ఏడోక్లాసు. కనబడ్డ అడ్డమైన గడ్డీ తింటుంటాడు. ఇప్పుడు పరీక్షల మధ్యలో విరోచనాలు తెచ్చుకున్నాడు, పొద్దుట్నించి దొడ్లోనే పడి యేడుస్తున్నాడు."

ప్రపంచంలో ఏ డాక్టరుకి ఒక పేషంట్ గూర్చి ఇంత గ్రాండ్ ఇంట్రడక్షన్ ఉండదేమో! నాకంత నీరసంలోనూ నాన్నమీద కోపమొచ్చింది. ఆయన ఒక పెద్దమనిషి, అందునా డాక్టరు ముందు ఇలా నా పరువు దారుణంగా తీసేస్తాడని ఊహించలేదు.

అదో విశాలమైన గది. గది మధ్యన పాతకాలపు టేకుబల్ల, కుర్చీ. పక్కన అద్దాల చెక్కబీరువాలు, వాటినిండా ఏవో పుస్తకాలు. గోడకి ఒకవైపు గాంధీ, నెహ్రూ, నేతాజీ మొదలైన దేశనాయకుల పటాలు. ఇంకోవైపు లక్ష్మి, సరస్వతి, రాముడు, శివుడు వగైరా దేవుళ్ళ పటాలు. గదంతా ఆయుర్వేద మందుల తాలూకా ఘాటైన వాసన.

ఆ పాతకుర్చీలో ప్రశాంత వదనంతో, హుందాగా ఒక అరయ్యేళ్ళ వ్యక్తి కూర్చుని ఉన్నారు. ఆయన శరీరఛాయ తెలుపు, జుట్టు తెలుపు, లాల్చీ తెలుపు. మెడలో రుద్రాక్షలు, నుదుట కుంకుమ బొట్టు. వారు మాఊళ్ళో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు సుబ్రహ్మణ్యశాస్త్రి గారు.

ఆయన నావైపు గంభీరంగా చూశారు. నా కుడిచెయ్యి తనచేతిలోకి తీసుకుని నాడి పరీక్ష చేశారు. 

"ఎప్పట్నించి?" సూటిగా నాకళ్ళల్లోకి చూస్తూ అడిగారు.

"ఉదయాన్నించి." నీరసంగా నేను.

"ఎన్నిసార్లు?"

ఐదా? ఆరా? గుర్తులేదు, సర్లే! ... "ఐదు."

వైద్యులవారు ఒక్కక్షణం ఆలోచించారు.

"బయటి పదార్ధాలేమన్నా తిన్నావా?"

చచ్చితిని! ఊహించని మలుపు! జవాబేం చెప్పాలి? నిజం చెబితే ఇంట్లోవాళ్ళతో తంటా, చెప్పకపోతే వైద్యానికి తంటా! మందు వికటించి కొత్తరోగానికి దారి తియ్యొచ్చు. హే భగవాన్! ఏమిటి నాకీ క్లిష్టపరిస్థితి!

నాకూ, అక్కకి పాకెట్ మనీ రోజుకి ఐదుపైసలు. ఆరోజుల్లో రిఫ్రిజిరేటర్ల కాన్సెప్ట్ లేదు. చల్లటినీళ్ళ కోసం మట్టికూజాలు, కుండలు కొనేవాళ్ళు. వీటితోపాటు పిల్లలు చిల్లర దాచుకోటానికి మట్టిముంతలు కూడా కొనేవాళ్ళు. పిల్లలు తమ పాకెట్ మనీ మరియూ నాన్నల జేబుల్లో కొట్టేసిన చిల్లర ముంతలో వేసుకునేవాళ్ళు. రోజుకి పదిసార్లైనా ఆ ముంత బరువు ఫీలవుతూ, ముంతని పైకి కిందకి ఆడిస్తూ, నాణేల గలగల శబ్దాన్ని తృప్తిగా, గర్వంగా ఫీలయ్యేవాళ్ళు.

నాకంటూ చిల్లర వేసుకొఏదానికి ఒక ముంత వున్నా, నేనెప్పుడూ అందులో డబ్బులేసుకోలేదు. అలా పైసలు ముంతలో వేసుకుని దాచేసినచో భారత ఆర్ధిక వ్యవస్థ కుంటుబడునని గట్టిగా నమ్మిన కారణాన, నేనెప్పుడూ పొదుపు సలహాలు పాటించలేదు. పైగా పెద్దలమాట విని బుద్ధిగా ముంతలో డబ్బులు దాచుకుంటున్న అక్క ముంత నుండి చీపురుపుల్ల సాయంతో ఐదుపైసల బిళ్ళలు లాగేసేవాణ్ణి. ఎన్నిరోజులు డబ్బులేసినా ముంత నిండట్లేదని పిచ్చిఅక్క తెగ ఫీలయిపోయేది. కొంతమంది అంతే! ఈ పాడులోకంలో దొంగలుంటారనీ, అందునా ఇంటిదొంగలు పరమ డేంజరస్సనీ తెలుసుకోలేని అజ్ఞానప్పక్షులు!

ఇంతేగాక - నా తెలివితేటలతో ఇంకొన్నిట్రిక్కులు డెవలప్ చేశాను. ఇంటికి బంధువులొచ్చినప్పుడు, వాళ్ళ ముందు అమ్మని 'ఐదుపైసలియ్యమ్మా! కొనుక్కుంటా.' అని బ్రతిమాలేవాణ్ణి. విడప్పుడు పైసాకూడా విదల్చని అమ్మ, చుట్టాల ముందు పరువు పోతుందనే భయంతో, పోపులడబ్బాలోంచి ఐదుపైసలు తీసిచ్చేది. ఆ వచ్చిన చుట్టం ఆ ఐదుపైసలకి ఇంకో ఐదుపైసలు జతచేసి 'బాగా చదువుకో బాబూ!' అనేవాడు (అసలు విషయం, ఆయన ఇచ్చేదాకా నేను అక్కణ్ణించి కదిలేవాణ్ణి కాదు).

నిన్న ఇంటికి మా మేనమామ వచ్చాడు. అరిగిపోయిన నా పాత ట్రిక్కు ప్లే చేసి పదిపైసలు గిట్టిచ్చాను. ఒక ఐదుపైసలు పీచుమిఠాయి నోట్లో పెట్టుకుంటుంటేనే కరిగిపోయింది. ఐదుపైసలు కలరు డ్రింకు తియ్యగా, చల్లగా గొంతులోకి జారిపోయింది. కానీ - కొద్ది సమయానికే కడుపులో గుడబిడ, తదుపరి చిత్రవిచిత్ర శబ్దాలు. ఆపై తరచూ పాయిఖానా సందర్శన భాగ్యం. ఇదీకథ! ఇప్పుడు సత్యహరిశ్చంద్రుళ్ళా నిజం చెపితినా, నా పాకెట్ మనీకి కోతపడే అవకాశం ఉంది.

కోర్టులో సాక్ష్యం ఖచ్చితత్వంతో చెప్పాలి. 'ఫలానా సుబ్బారావు నాకు తెలుసు గానీ, వాడిపళ్ళు రాలగొట్టింది మాత్రం నేనుకాదు.' అంటే కోర్టు నమ్మదు. అందుకే అసలా సుబ్బారావెవడో నాకు తెలీదని బల్ల గుద్దాలి. అప్పుడే సాక్ష్యం నమ్మబుల్‌గా ఉంటుంది, కోర్టు కూడా నమ్ముతుంది. అంచేత - నిజాలంటూ చెప్పటం ప్రారంభిస్తే, ఒకటొకటిగా అన్నీ బయటపడతాయని, పొద్దున్నించి ఎవరెన్నిరకాలుగా అడిగినా నేను బయటి తిండి అస్సలు తిననే తినలేదనీ.. తల్లితోడనీ, సరస్వత్తోడనీ నొక్కి వక్కాణిస్తున్నాను.

ఇప్పుడీ వైద్యులవారి వాలకం.. ఆయన లాల్చీ, బొట్టు, పెద్దమనిషి తరహా చూస్తుంటే.. పిల్లలు అబద్దాలు చెబ్తారనీ, అంచేత వాళ్ళని ప్రశ్నలతో వేధించకుండా బుద్ధిగా వైద్యం చేసుకోవాలనే తెలివి వున్నవాడిగా అనిపించట్లేదు. అంచేత - ఇప్పుడు నేను నా తిండి విషయం చెప్పకపోయినట్లయితే, ఇంకేదో మందు ఇచ్చేట్టున్నాడు.

వైద్యులకి రోగలక్షణాలన్నీ చెబితేనే అంతంత మాత్రం వైద్యం చేస్తున్నారు, అట్లాంటిది వాళ్ళని తప్పుదోవ పట్టిస్తే ఇంకే వైద్యం చేస్తారో గదా! అప్పుడు అసలుకే మోసం వచ్చే ప్రమాదముంది. కావున ఒట్టుతీసి గట్టుమీద పెట్టి.. నంగినంగిగా, నసుగుతూ పీచు మిఠాయి, కలరు డ్రింకు రహస్యాన్ని బయటపెట్టాను. నా వెనక నించుని కోపంతో బుసలు కొడుతున్న నాన్నని ఓరగా గమనించాను. ఇప్పుడు నాకు నా రోగిష్టి పొట్టని రక్షించుకోవడమే ప్రధమ కర్తవ్యం. కావున నాన్నకోపం నాకేమంత భయం కలిగించలేదు. 

వైద్యులవారు అర్ధమయ్యిందన్నట్లు తల పంకించారు.

"శివుడూ!" అంటూ పిలిచారు.

శివుడు అనబడే శాల్తీ అప్పటిదాకా గది గుమ్మానికి బల్లిలాగా వేళ్ళాడుతున్నాడు. ముతక పంచె, ఖద్దరు బనీను, స్కేలు బద్దలా పల్చగా ఉన్న ఆవ్యక్తి.. నాకెందుకో ప్రాణమున్న జీవిలా అనిపించలేదు. ఆ గదిలోని బల్ల, కుర్చీ, పటాల్లో ఒకడిగా అగుపించాడు. శివుడికి డాక్టరుగారు ఏదోమందు పేరు చెప్పారు. శివుడు యాంత్రికంగా పక్కగది లోపలికెళ్ళి రెండునిమిషాల్లో ఒక చిన్నపొట్లంతో వచ్చాడు. డాక్టరుగారు పొట్లం విప్పారు. అందులో అచ్చు మిరియాల గింజల్లా ఆరేడు గుళికలు ఉన్నయ్. 

"నోరు తెరు." అంటూ రెండు గుళికలు నానోట్లో వేశారు వైద్యులవారు.

గుళికలు వగరుగా, చేదుగా ఉన్నయ్.

"ఒకగంటలో తగ్గిపోవాలి, తగ్గకపొతే గంట తరవాత ఇంకోరెండు. మజ్జిగన్నం తప్పించి ఏమీ పెట్టొద్దు." అని ఆ పొట్లం నాన్న చేతికిచ్చారు. 

ఇంటికొచ్చే దారంతా నాన్న తిట్లతో నిండిపోయింది.

"దొంగగాడిద కొడకా (కోపంలో నాన్న తననితనే తిట్టుకుంటున్నాడు)! ఈసారి ఐదుపైసలంటూ అడుగు, తాట తీస్తా!" అంటూ తిట్లతో సరిపుచ్చాడు, తన్నలేదు. అమ్మయ్య! నా రోగిష్టి స్టేటస్ నన్ను తన్నుల బారినుండి రక్షించింది.

వైద్యులవారి గుళికలు ఇంటికి చేరుకునేలోపే గుణం చూపించనారంభించాయి. ఉదయం నుండి కడుపులో వస్తున్న రణగొణ ధ్వనులకి తెర పడింది, కొంతసేపటికి వికారం తగ్గిపోయింది, ఇంకొంతసేపటికి ఆకలి కూడా వెయ్యనారంభించింది.

వంటింట్లో అక్క భోంచేస్తుంది. అక్క కంచంలో నాకిష్టమైన దోసకాయ పప్పు, వంకాయ కూర! నాకు ఏడుపొచ్చింది, తరవాత భలే కోపమొచ్చింది. అసలు నాకు రోగమొచ్చినప్పుడు నాకిష్టమైన కూరలు వండటం ఎంతన్యాయం! ఎంత దుర్మార్గం! అన్నం తింటున్న అక్కకేసి కొంచెంసేపు కుక్కచూపులు చూస్తూ కూర్చున్నాను. ఇంక తట్టుకోవటం నా వల్లకాలేదు.

"అమ్మా! ఆకలేస్తుంది. నాక్కూడా పప్పు, వంకాయ కూర." అంటూ వంటింట్లో అక్క పక్కనే పీటేసుక్కూర్చున్నాను.

"విరోచానాలకి పత్యం చెయ్యాలిరా, మజ్జిగన్నం తిను." అంది అమ్మ.

"లేదమ్మా! పత్యం అవసరం లేదుట. డాక్టరుగారు అన్నీ తినొచ్చని చెప్పారు. ఒట్టు, దేవుడితోడు." అన్నాను, అమ్మ నమ్మింది (ఏవిఁటో - ఈ ఒట్లు, ప్రమాణాలు నేను తప్పితే అందరూ నమ్ముతారు)! ఆపై - నాసామిరంగా! దోసకాయ పప్పు, వంకాయకూరతో ఒక పట్టుపట్టాను. కొద్దిసేపటికి నీరసం కూడా తగ్గిపోయింది. 

అటుతరవాత రోగం సంగతే మర్చిపొయ్యాను. యధావిధిగా ముప్పొద్దులా పూర్ణకుంభాలు లాగిస్తూ పరీక్షలు రాశాను. మూడ్రోజులు ఇట్టే గడిచిపొయ్యాయి. క్రమేపి నాపొట్ట ఉబ్బుతూ, అనతికాలంలోనే గుమ్మడికాయ పరిమాణం పొందింది. నిండుగర్భిణీ వలె రొప్పుతూ, ఆపసోపాలు పడసాగాను. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, గత కొన్నిరోజులుగా నాకు ప్రకృతి నుండి పిలుపు రాలేదు. పొట్టలోకి లోడింగ్ చేస్తున్నానే గాని, అన్‌లోడింగ్ చెయ్యట్లేదు. కారణమేమి చెప్మా? ఓ! అర్ధమైంది, ఇదంతా వైద్యులవారి గుళికల మహిమ. విరోచనాలు కట్టించమంటే అసలు విరోచనమే లేకుండా చేసేశారు!

నా సంకటస్థితిని అమ్మానాన్నలకి చెప్పాను. నాన్న 'శిష్ట్లావారి దగ్గరికి పద' అనంగాన్లే వణుకు పుట్టింది. ఆయన వైద్యం అతివృష్టి, అనావృష్టి టైపేమేమో అని ఓ తీవ్రమైన అనుమానం. ఈసారి మందుగుళికలకి మళ్ళీ వరదలోస్తాయేమో! ఆ నీరసాన్ని భరించడం నావల్ల కాదు, కానీ వెళ్ళక తప్పేట్టు లేదు.

మిత్రులారా! ఆరోజుల్లో నాన్నలు ఈరోజుల డాడీల్లాగా డెమాక్రటిగ్గా ఉండేవాళ్ళు కాదు. వారు చండశాసనులు, పిల్లల హక్కుల్ని నల్లుల్లా నలిపేసే విలన్లు. బెట్టుచేస్తే బాది పడేసేవాళ్ళు, మొండికేస్తే మాడు పగలకొట్టేవాళ్ళు. అమ్మలు మనకి  మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళే గానీ, ఫిజికల్ సపోర్ట్ (అనగా తన్నకుండా అడ్డు పడటం) ఇచ్చేవాళ్ళు కాదు. మహా ఐతే తన్నుల సెషన్ అయిన తరవాత రాజకీయ నాయకుల్లా నాన్న తన్నుల్ని ఖండిస్తారు, అంతే!

బాలల హక్కుల ఉల్లంఘనలో ఘనత వహించిన నా తండ్రి మాట విననిచో, కలుగు విపరిణామములు నాకు అనుభవ పూర్వకముగా తెలియును. కావున నోరు మూసుకుని నా నిర్దయ తండ్రితో వైద్యులవారి వద్దకేగితిని. వారు నన్ను (మళ్ళీ) గంభీరంగా చూశారు. నాన్న నా కొత్తకష్టం చెప్పాడు, ఆయన నా గుమ్మడికాయ బోజ్జని నొక్కినొక్కి చూశారు. 

"పత్యం చెయ్యలేదా?" సూటిగా చూస్తూ అడిగారు.

హతవిధీ! మళ్ళీ క్లిష్టపరిస్థితి. ఈయన నాతో రహస్యాలు కక్కించిగానీ యే వైద్యం చెయ్యడేమో!

"లేదు." నంగిగా నసిగాను.

"శివుడూ!"

స్కేలుబద్ద శివుడు మళ్ళీ రంగంలోకి వచ్చాడు. లోపలి గదిలోకెళ్ళి యేదో పొట్లం తెచ్చాడు. ఈసారి నా నోట్లో ఒక గుళిక మాత్రమే వెయ్యబడింది. ఈ గుళిక అత్యంత తీవ్రమైన చదుగా వుంది. 

"ఇవ్వాళ చారన్నం తప్పించి ఇంకేం పెట్టొద్దు." ఆదేశాలు జారీ చెయ్యబడ్డాయ్.

అటు తరవాత రాయడానికి పెద్దగా ఏమీలేదు. ఈసారి నాన్న నన్ను పెద్దగా తిట్టలేదు, కాకపొతే వీపుమీద విమానం మరియూ హెలికాప్టర్ మోతలు మోగించాడంతే!

ఇంటికొచ్చిన కొద్దిసేపటికే ప్రకృతి పులకించింది. నాకు సుఖప్రసవం అయ్యింది, సంచి ఝాఢించింది. గుమ్మడికాయ ఖాళీ అయ్యి గాలితీసిన బెలూన్లా అయిపొయింది. 'లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్' అని ఎందుకంటారో అర్ధమైంది.

అప్పటిదాకా స్తబ్దుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఊపిరి పోసుకున్నట్లుగా అనిపించింది. అప్రయత్నంగా భక్తప్రహ్లాద సినిమాలో మంగళంపల్లి మేఘాల్లో తేలియాడుతూ పాడిన 'ఆదియూ అంతము నీవే దేవా' అనే పాట నోట్లోంచి తన్నుకుంటూ వచ్చింది. నారదుడికి అంత ఆనందం ఎందుకో కూడా అర్ధమైంది.

బుద్ధి ఉన్నవాడెవడూ జన్మలో మళ్ళీ పీచుమిఠాయిలు, కలరు డ్రింకులు తాగడు, తాగకూడదు కూడా. కానీ - నాకు బుద్ధి లేదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఒకసారి జైలుకెళ్తే జైలన్నా, పోలీసులన్నా భయం పోతుందిట. అట్లే - కడుపుని ఎంత ఛండాలం చేసుకున్నా, తగ్గించడానికి వైద్యులవారున్నార్లెమ్మని భరోసా వచ్చేసింది. ఆత్మవిశ్వాసం ద్విగుణీకృతం అయ్యింది.

నా ప్రస్థానం పీచుమిఠాయి, కలరు సోడాల్ని దాటుకుని బజ్జీమసాల, ముంతకింద పప్పుల మీదుగా కారం రాసిన మామిడి ముక్కలు, తాటిచాప, జీళ్ళు, పప్పుచెక్కల దాకా కొనసాగింది. నాకు బూతదయ మెండు, స్నేహశీలిని కూడా. అందుకే - ఈ పదార్ధాలపై వాలే ఈగల్ని నా సహచరులుగానూ, నా సహపంక్తిదారులుగానూ భావించాను!

ఇవ్విధముగా నానావిధములైన శ్రేష్టము మరియూ బలవర్ధకమైన పదార్ధాలతో ఆహార నియమాల్ని శుచిగా పాటిస్తూ, బ్రతుకు నిచ్చెనమెట్లు ఒకటొకటిగా ఎక్కుతూ, ఇదిగో - ఇవ్వాళ ఈ స్థాయికి చేరుకున్నాను!