Showing posts with label గురవయ్య హైస్కూలు. Show all posts
Showing posts with label గురవయ్య హైస్కూలు. Show all posts

Saturday, 16 March 2013

ఉపన్యాసం.. ఒక హింసధ్వని!



"ఉరేయ్! మన దేశానికి అనవసరంగా సొతంత్రం వచ్చింది. రాకపోతేనే బాగుండేది. ఈ సుత్తి భరించలేకపోతున్నా!" పక్కనున్న రావాయ్ గాడితో విసుగ్గా అన్నాను.

"ష్! హెడ్మాస్టర్ జగన్నాథరావుగారు మననే చూస్తున్నారు." పెదాలు కదపకుండా సమాధానం చెప్పాడు రావాయ్ గాడు ఆలియాస్ రాము.

నిజంగానే మా హెడ్మాస్టర్ గారు పిల్లలందర్నీ సునిశితంగా గమనిస్తున్నారు. అసలే ఆ రోజు ఇండిపెండెన్స్ డే. దొరికితే ఇంతే సంగతులు. అబ్బబ్బా! ఈ హెడ్మాస్టర్ గారితో చస్తున్నాం. దేశానికైతే ఇండిపెండెన్స్ వచ్చింది గానీ.. మాకు మాత్రం హెడ్మాస్టర్ గారి బలవంతపు దేశభక్తి పాఠాల నుండి విముక్తి రాలేదు.

ఆ వచ్చినాయన స్వాతంత్ర్య సమర యోధుడుట. నెత్తి మీద గాంధీ టోపీ. బక్కగా, పొట్టిగా ఆర్కేలక్ష్మణ్ కార్టూన్లా ఉన్నాడు. ఆయన దేశం కోసం ఎంతో త్యాగం చేశాట్ట. బ్రిటీష్ వాడి గుండెల్లో నిద్ర పోయాట్ట. గంటన్నరగా స్వాతంత్ర్యోద్యమం గూర్చి ఆవేశంతో ఊగిపోతూ చెబుతున్నాడు. గాంధీ, నెహ్రూ పేర్లు తప్ప ఒక్క ముక్క అర్ధం అయ్యి చావట్లేదు. మొత్తానికి ఉపన్యాసం అయిపోయింది. చప్పట్లతో ఓపెన్ ఆడిటోరియం మార్మోగింది. ఆ రోజుల్లో పెద్దగా చప్పట్లు కొట్టి ఉపన్యాసం ముగియడం పట్ల మా సంతోషాన్ని (నిరసనని) వ్యక్తం చేసేవాళ్ళం.


మా మాజేటి గురవయ్య హైస్కూల్లో 'ఇండిపెండెన్స్ డే', 'రిపబ్లిక్ డే'లు మాకు ఇష్టమైన దినాలు. జెండా కర్ర దగ్గర కట్టి ఉంచిన తాడు లాగంగాన్లే.. జెండా తెరుచుకుంటూ.. అందులోంచి పూలు రాలడం.. పి. సి.సర్కార్ మేజిక్కులా అనిపించేది. ఒక్కోసారి తాడు ఎంత లాగినా జెండా తెరుచుకునేది కాదు. అది ఇంకా సరదాగా ఉండేది.

నా ఇష్టానికి ఇంకో కారణం.. మా స్కూల్లో ఇండిపెండెన్స్ డే నాడు ఐదు బ్రిటానియా బిస్కట్లు, రిపబ్లిక్ డే నాడు ఒక రవ్వలడ్డు ఇస్తారు. ప్రోగ్రాం అయిపోయి తరవాత మెయిన్ గేటు సగం తెరిచి ఉంచేవారు. బయటకి వెళ్ళేప్పుడు మా బుల్లి చేతుల్లో బిస్కెట్లో, లడ్డో పెట్టేవాళ్ళు. ఆ పెట్టేవాళ్ళు కూడా విద్యార్ధులే.అంచేత ఫ్రెండ్షిప్పు కొద్దీ ఎవడికైనా ఎక్కువ ఇచ్చేస్తారేమోనని కొండా ఆంజనేయులు మాస్టారు వంటి చండశాసన ఉపాధ్యాయుల్ని డిస్ట్రిబ్యూషన్ దగ్గర పర్యవేక్షకులుగా ఉంచేవారు.

సరే! కాలచక్రం గిర్రున తిరిగి.. నేను పెద్దవాడనైనాను. ఆ విధంగా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ల సందర్భంగా ప్రముఖులు వాకృచ్చే గంటల కొద్దీ ఉపన్యాసాలు తప్పించుకుని.. జీవితాన్ని మిక్కిలి సంతోషంగా గడపసాగాను. అయితే విధి బలీయమైనది. దాని చేతిలో మనమందరమూ పాపులమే.. క్షమించాలి.. పావులమే!

అందుకే ఒకానొక ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక స్కూల్లో ఉపన్యసించవలసిన అగత్యం ఏర్పడింది. అగత్యం అని ఎందుకుంటున్నానంటే.. తప్పించుకోడానికి అనేక ఎత్తులు వేశాను. ఉపన్యాసాలు వినడమే ఒక శిక్ష. ఇంక చెప్పడం కూడానా! కానీ కుదర్లేదు. ఆ స్కూల్ వారికి సైకియాట్రిస్ట్ మాత్రమే కావాల్ట (నా ఖర్మ). నాకు అతి ముఖ్యమైన స్నేహితుల నుండి ఒత్తిడి, మొహమాటం.

జెండా ఎగరేసేందుకు ముఖ్య అతిధిగా ఒక పెద్ద ప్రొఫెసర్ గారట. ఆయన మాట్లాడిన తరవాత నేను మాట్లాడాలిట. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచుకోవడం లాంటి చిత్రవిచిత్ర అంశాల గూర్చి నేను ఆంగ్లంలో ఉపన్యసించాలి. అదీ నాకిచ్చిన టాస్క్. ఇట్లాంటి నీతిబోధనలపై నాకంత గౌరవం లేనప్పటికీ ఒప్పుకోక తప్పలేదు.

ఉదయం ఎనిమిదిన్నర కల్లా స్కూలుకి చేరుకున్నాను. ప్రొఫెసర్ గారు జెండా ఎగరేసి వందన సమర్పణ గావించారు. అక్కడ పిల్లల్ని చూసి ఆశ్చర్యపొయ్యాను. చిన్నపిల్లలు. ముద్దొస్తున్నారు.మరీ ఇంత పసిపిల్లలు విద్యార్ధులుగా ఉంటారని నేనూహించ లేదు. కొందరు పిల్లలైతే తప్పటడుగులు వేస్తున్నారు. (ఆ పసిపిల్లలు ఎల్కేజీ వారని స్కూల్ హెడ్ చెప్పాడు.)

పిల్లల్ని తరగతుల వారీగా నేలపై కూర్చోబెట్టారు. ముందు చిన్న తరగతులు. చివర్లో పదో తరగతి. నేనెప్పుడూ ఏ స్కూల్లోనూ స్టేజ్ మీద కుర్చీలో కూర్చోలేదు. అంచేత ఆ అనుభవం నాక్కూడా కొత్తగానే ఉంది. అంతమంది పిల్లలు బారులు తీరి కూర్చోవడం చూడ్డానికి ముచ్చటగా కూడా ఉంది.

ఆ పిల్లలు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవడం గమనిస్తే.. వారికి ఇంగ్లీష్ సరీగ్గా రాదని తెలిసిపోయింది. అసలే నాది డ్రై టాపిక్. కాబట్టి వారికర్ధమయ్యే భాషలోనే ఏడిస్తే మంచిది. అంచేత నా ప్లాన్ మార్చుకున్నాను. నే చెప్పదలుచుకున్న అంశాన్ని మనసులోనే తెలుగులోకి తర్జుమా చేసుకున్నాను. అయినా వీరికి అర్ధమయ్యేట్లు చెప్పడం కష్టమే! అసలు నాకిచ్చిన ఉపన్యాస అంశమే ఇక్కడ ఇర్రిలవెంట్ టాపిక్. ఇప్పుడెలా? ఇరుక్కుపోయ్యానే!

ప్రొఫెసర్ గారు ఇండిపెండెన్స్ డే గూర్చి ఆంగ్లంలో ఉపన్యాసం మొదలెట్టాడు. ఆయనకి ఆంగ్లభాషపై మంచి పట్టు ఉన్నట్లుంది. వింటుంటే హిందూ పేపర్ ఎడిటోరియల్ చదువుతున్నట్లుగా అనిపించింది. కొద్దిసేపటికి ఆయన చెప్పేది నాకు అర్ధం అవ్వట్లేదు! అర్ధం కానప్పుడు వినడం దండగ. అంచేత వినడమే మానేశాను.

స్టేజి మీద ఉన్నాను కాబట్టి దిక్కులు చూస్తుంటే బాగోదు. అందువల్ల ఎదురుగానున్న పిల్లల్ని గమనించసాగాను. వారి మొహంలో కొట్టొచ్చినట్లు విసుగు కనిపిస్తుంది. హఠాత్తుగా నా గురవయ్య హైస్కూల్ రోజులు జ్ఞాపకం వచ్చాయి. ఆ పిల్లల్లో నాకు నేనూ, నా స్నేహితులూ కనిపించసాగారు. ముఖ్యంగా ఆ చివరి వరసలో ఒకడు కోపంగా గుడ్లు మిటకరిస్తున్నాడు. వాడిలో నన్ను నేను దర్శించుకున్నాను!

పక్కనే కూర్చునున్న స్కూల్ హెడ్ ని వాకబు చేశాను. 'వీరికి ప్రోగ్రాం అయిన తరవాత స్నాక్స్ ఇస్తున్నారా?'. ఆయన అట్లాంటి ప్రోగ్రామేమీ లేదన్నాడు. నాకు ఇబ్బందిగా అనిపించింది. గిల్టీగా కూడా అనిపించింది. ఇవ్వాళ దేశానికి పండగ అని చెబుతున్నాం. కనీసం ఒక బిస్కట్ అయినా ఇస్తే పిల్లలు ఎంతగానో సంతోషిస్తారు గదా (అందుకు సాక్ష్యం నేనే)!

ప్రొఫెసర్ గారి ఆవేశపూరిత, ఉద్వేగపూరిత, స్పూర్తిదాయక ఆంగ్లోపన్యాసం పూర్తయింది. పెద్దగా చప్పట్లు. ప్రొఫెసర్ గారి మొహంలో గర్వం. పిల్లలు అంత గట్టిగా చప్పట్లు ఎందుకు కొట్టారు!? ఈ చప్పట్లు మా నిరశన చప్పట్ల వంటివా? ఏమో! కొన్ని ఆనవాయితీల్ని ఎవరూ చెప్పకుండానే ఫాలో అయిపోతుంటాం.

ఇక నా వంతొచ్చింది. స్కూల్ హెడ్ మైకులో నా గూర్చి గొప్పగా చెప్పి పిల్లలకి పరిచయం చేశాడు (నిజానికి నేనంత సమర్దుడనని అప్పటిదాకా నాకూ తెలీదు). మైక్ ముందుకోచ్చాను. గొంతు సరిచేసుకున్నాను. పిల్లల మొహాల్లో చికాకు. 'నాటకంలో రెండో కృష్ణుళ్ళా మళ్ళీ ఇంకోడు' అని వారు అనుకుంటున్నారా!?

ఒక్క క్షణం ఆలోచించాను. నా చిన్నతనంలో నేను ఉపన్యాసాల బాదితుడను. ఇప్పుడు వీరిని నేను అదే ఉపన్యాసంతో ఎందుకు పీడించాలి? పీడితుడు పీడకుడు కారాదు. స్కూల్ యాజమాన్యాన్ని సంతృప్తి పరచడానికి పిల్లల్ని హింసించలేను. వెంటనే నాకు జ్ఞానోదయం అయ్యింది. నేను ఏం చెప్పకూడదో కూడా అర్ధమైంది. ఖచ్చితంగా ఇక్కడ ఎడ్యుకేషనల్ సైకాలజీ మాట్లాడరాదు. మరేం చెప్పాలి?

"పిల్లలూ! బాల్యం చాలా విలువైనది. రోజూ కనీసం గంటసేపు ఆడుకోండి. స్నేహితులతో చక్కగా కబుర్లు చెప్పుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. రోజూ మూడు పూటలా మంచి ఆహారం కడుపు నిండా తీసుకొండి. పాలు తాగండి. గుడ్డు తినండి. పప్పు ఎక్కువగా తినండి." అంటూ తెలుగులో మాట్లాడటం మొదలెట్టాను. ప్రొఫెసర్ గారు నన్ను విచిత్రంగా చూశారు.

నేను మాట్లాడటం కొనసాగించాను.

"జీవితంలో చదువు చాలా ముఖ్యం. కానీ చదువే జీవితం కాదు. సబ్జక్ట్ అర్ధం చేసుకుంటూ చదవండి. డౌట్స్ ఉంటే మీ టీచర్స్ తో చర్చించండి. మార్కుల కోసం పడీపడీ చదవద్దు. మార్కులనేవి అసలు ముఖ్యం కాదు. చదవడం చికాకనిపిస్తే పుస్తకం అవతల పడేసి హాయిగా ఫ్రెండ్స్ తో ఆడుకోండి. నేనదే చేశాను. బీ హేపీ! ఎంజాయ్ యువర్ సెల్ఫ్!" అంటూ ముగించాను. స్కూల్ హెడ్ ఆశ్చర్యంగా నన్నే చూస్తున్నాడు.

మళ్ళీ చప్పట్లు. అయితే ఈసారి చప్పట్లు మరింతగా ఎక్కువసేపు వినిపించాయి. బహుశా నేను నా టాపిక్ మాట్లాడకపోవడం వారికి నచ్చినట్లుంది!

అంకితం..

ఎందఱో మహానుభావులు. అందరికీ వందనములు. స్కూల్స్, కాలేజీలకి ఉపన్యాసకులుగా వెళ్లి.. సుభాషితాలు, హితబోధలు గావిస్తూ విద్యార్ధుల జీవితాలతో ఆడుకునే ఉపన్యాస దుర్జనులకి.. క్షమించాలి.. దురంధరులకి..

కృతజ్ఞత..

'హింసధ్వని' మిత్రులు వల్లూరి శివప్రసాద్ గారి రచన. బంగారు నందితో పాటు ఎన్నో ఎవార్డులు పొందిన 'హింసధ్వని' నాటిక.. ఈ టపా శీర్షికకి ప్రేరణ. 


(photos courtesy : Google)

Thursday, 31 January 2013

స్త్రీలని గౌరవించండి.. లేదా అడుక్కుతినండి! (మా స్కూలు కబుర్లు)



అనగనగా ఒక బడి. ఆ బడి పేరు శ్రీమాజేటి గురవయ్య హైస్కూలు. అది గుంటూరు పురమునకే తలమానికముగా బ్రాడీపేట యందు వెలసియున్నది. మా బడి నావంటి ఎందఱో అజ్ఞానులకి విజ్ఞానాన్ని ప్రసాదించిన ఒక చదువుల నిలయం.

ఇప్పుడు నేను రాస్తున్న కబుర్లు ఎర్లీ సెవెంటీస్ (1970-3) నాటివి కావున.. అది ఆ రోజుల్లో ఒక రోజు. సమయం ఉదయం ఎనిమిది గంటలు. స్థలం మా స్కూల్ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం. విద్యార్ధులందరం తరగతుల వారిగా వరసలో నించునున్నాం. ఇలా నించోడాన్నే 'అసెంబ్లీ' అందురు.




మా స్కూల్లో 'వందేమాతరం' రికార్డుని పిన్ను మార్చకుండా అదే పనిగా వేలసార్లు తిప్పినందువల్ల.. రికార్డ్ అరిగిపోయి చాలా రోజులైంది. రికార్డ్ ప్లేయర్ కి 'కీ' ఇచ్చి పబ్లిక్ ఎడ్రెస్ సిస్టంలో (యాంత్రికంగా, నిర్వికారంగా) ప్లే చెయ్యడం మొదలెట్టాడు గోపాలరావు.

గోపాలరావు మా సైన్స్ లేబొరేటరీ అసిస్టెంట్. అతని శరీరచాయ నల్లగాను, తలంతా ముగ్గుబుట్టగాను ఉండుటచే బ్లాక్ అండ్ వైట్ ఫోటో నెగెటివ్ లా అనిపిస్తుంటాడు. చిటపట ధ్వనుల మధ్య.. వినబడీ వినబడనట్లు 'వందేమాతరం' అంటూ వణుకుతూ గీతం మొదలైంది.

మాకు హెడ్ మాస్టారు శ్రీ వల్లూరి జగన్నాధరావు గారు. తెల్ల చొక్కా, నల్ల పేంటు, దళసరి ఫ్రేము కళ్ళద్దాలు, దబ్బపండు శరీర చాయ. దుర్యోధనుని చేత గదా దండము వలె ఆయన చేతిలో పొడవాటి కేన్ బెత్తం. ఆయన సింహంలా స్టేజ్ మీద నిలబడి ఉన్నారు. కనుసన్నల్లో అందర్నీ గమనిస్తున్నారు. ఆయనంటే మాకు భ..భ.. భయం. హ.. హ.. హఢల్!

అందుకు అనేక కారణాలు. మన కళ్ళల్లోకి చూస్తేనే ఆయనకి మనం చదువుతున్నామో, లేదో తెలిసిపోతుంది.. ట! అందుకే (తెలివిగా) నేనెప్పుడూ ఆయన కళ్ళల్లోకి చూళ్ళేదు. ఆయన కేన్ బెత్తాన్ని భారీగా వాడతారు. ఆయన రోజూ ఈ 'అసెంబ్లీ'ని పార్లమెంట్ స్థాయిలో చాలా సీరియస్ గా నిర్వహించేవారు.




'వందేమాతరం' అయిపొయింది. ఒక 'రాముడు బుద్ధిమంతుడు' వంటి విద్యార్ధి ఇంటి దగ్గర రాసుకొచ్చిన వివేకానందుని ప్రవచనాలు, గాంధీ సూక్తులు.. మైకులో పెద్దగా అరుస్తున్నట్లు చదివాడు (సాధారణంగా ఇట్లాంటి గొప్ప పనులు ఏ పుచ్చా గాడో, పాటిబండ్ల గాడో చేస్తుంటారు. వారిద్దరూ మైకు ముందున్న ఆ నాలుగు క్షణాలు దేశనాయకుల్లా తెగ ఫీలైపొయ్యేవాళ్ళు).

వల్లూరి జగన్నాధరావుగారు గొంతు సరి చేసుకుని మైక్ లో మాట్లాడటం మొదలెట్టారు.

"మనది పవిత్ర భారత దేశం. మనమంతా భారతీయులం. గాంధీ తాత ఎంతో కష్టపడి మనకి స్వాతంత్ర్యం తెచ్చారు. మనం ఈ పవిత్ర భారత దేశ పౌరులుగా గాంధీ గారి ఆశయాలు నెరవేర్చాలి. అందువల్ల మనమంతా అత్యంత బాధ్యతతో, క్రమశిక్షణగా జీవించాలి. అమ్మానాన్న దైవస్వరూపులు. వారిని గౌరవిద్దాం. మీరు ఉదయాన్నే ఫోరింటికి లేచి ఫైవింటి దాకా చదువుకోండి. సిక్సింటిదాకా అమ్మకి ఇంటి పనుల్లో సాయం చెయ్యండి. సెవెనింటికల్లా స్కూలుకి రెడీ అయిపోండి." (ఆయనకి 'ఇంటి' భాష అలవాటు.)

ఇంతలో మైక్ 'కుయ్' మని శబ్దం చేసింది. గోపాలరావు యాంప్లిఫైర్ కంట్రోల్స్ లో ఏదో మీటరు ముందుకి వెనక్కి తిప్పాడు. మొత్తానికి శబ్దం మాయమైంది. జగన్నాధరావుగారు మళ్ళీ మాట్లాడటం మొదలెట్టారు.

"స్త్రీలని గౌరవించండి. వారు లక్ష్మీ స్వరూపులు. సరస్వతి స్వరూపులు. అంటే దానర్ధం ఏమిటి? వారిలో లక్ష్మీ,సరస్వతి దేవతలు దాగి ఉంటారు. కానీ మనకి బయటిక్కనబడరు. అయితే మనమేమన్నా తప్పు చేస్తున్నామా అని లోపల్నుండి గమనిస్తుంటారు. అదే గమ్మత్తు. అంచేత మీరు ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టారో.. లక్ష్మీసరస్వతి దేవతలకి కోపం వస్తుంది. అప్పుడు సరస్వతీదేవి మీకు అన్ని పరీక్షల్లొ గుండుసున్నా వచ్చేట్లు చేస్తుంది. లక్ష్మీదేవి మీ జేబులో పైసా కూడా ఉండనివ్వదు. ఇప్పుడు రోడ్ల మీద అడుక్కు తింటున్నవాళ్ళంతా ఒకప్పుడు స్త్రీలని హింసించినవాళ్ళే. అర్ధమయ్యిందా.. " ఆయన ఉపన్యాసం ఈ ధోరణిలో ప్రతిరోజూ ఓ ఐదు నిముషాలు సాగుతుంది.

రోజూ 'సాగే' ఆయన ఉపన్యాసంలో ఎక్కువ భాగం రిపిటీషన్. నాకు విసుగు పుట్టేది. కాళ్ళు నొప్పెట్టేవి. ఆయన ఉపన్యాసం తరవాత దేశం కోసం రెండు నిముషాలు ధ్యానం! ధ్యానం అంటే ఏం లేదు. చేతులు జోడించి.. కళ్ళు మూసుకుని నిలబడాలి. ఆ రెండు నిముషాలు రెండు గంటల్లా అనిపించేది. (అయితే మన హెడ్ మాస్టర్ గారు కళ్ళు తెరిచి వాచ్ కేసి చూసుకుంటూ ధ్యానం సరీగ్గా చెయ్యరని తన దొంగచూపులతో మా సత్తాయ్ గాడు కనిపెట్టాడు.)



మీకు అసెంబ్లీ రావడం ఇష్టం లేదా? అంతసేపు నిలబడలేరా? అయితే ఒక ఫెసిలిటీ ఉంది. అదే భగవద్గీత క్లాస్. హాయిగా క్లాస్ రూంలో కూర్చోవచ్చు. బ్రహ్మాండం శీను (నా క్లాస్మేట్, క్లోజ్ ఫ్రెండ్), దీక్షితులు (నాకు ఒకేడాది జూనియర్) అక్కడ టీచర్లు. వారికి స్నేహమన్న అర్ధం తెలీదు. అందుకే వారికి స్నేహధర్మం లేదు. ఇద్దరూ కలిసి మమ్మల్ని చావగొట్టి చెవులు మూసేవాళ్ళు. 'ధర్మక్షేత్రే కురుక్షేత్రే.. ' అంటూ మొదలెడతారు. వాళ్ళు ఒక లైన్ చెబితే మనం కోరస్ గా అరుస్తూ ఆ లైన్ రిపీట్ చెయ్యాలి. ఈ క్లాస్ కనీసం అరగంట. ఇది అచ్చంగా పెనం మీద నుండి పొయ్యిలోకి పడటంలాంటి దన్నమాట!

చిన్నప్పట్నుండి నాది ద్వైదీభావ స్వభావం. హోటల్లో ఇడ్లీ తినాలా? అట్టు తినాలా? అన్నది కూడా తొందరగా తేల్చుకోలేను. కాబట్టి భగవద్గీత క్లాసులో నోరు నొప్పెట్టినప్పుడు అసెంబ్లీకి.. వల్లూరు జగన్నాధరావు గారి నీతిబోధనలకి చెవులు నొప్పెట్టినప్పుడు అసెంబ్లీకి మారుతుండేవాణ్ని.



ఈ రెండూ తప్పించుకోడానికి మూడో మార్గం కూడా ఉంది. అయితే ఇది కొద్దిగా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. అది అసెంబ్లీ అయిపొయ్యే సమయానికి బ్రాడీపేట ఐదో లైన్లోంచి గోడ దూకి దొడ్డి దోవన స్కూల్లోకి రావడం. స్కూల్ అటెండర్ పరుశురాముడి దృష్టిలో పడితే ఓ మూడు పైసలు లంచం ఇచ్చి తప్పించుకోవచ్చు. అదే డ్రిల్ మాస్టర్ రామబ్రహ్మం గారి కంట్లో పడితే మాత్రం పంబరేగ్గొడతారు. మా సత్తాయ్, భాస్కరాయ్, బోడా నాగేశ్వర్రావులు దీరోదాత్తులు. వారు మాత్రమే ఈ గోడ దూకే సాహస కృత్యం చేసేవాళ్ళు. నాకు చచ్చే భయం. అంచేత నేనెప్పుడూ గోడ దూకలేదు.

సరే! ఒక పక్కన అసెంబ్లీ.. ఇంకో పక్కన భగవద్గీత. ఈ కష్టాలన్నీ దాటాం గదాని సంబరపడరాదు! క్లాస్ రూంలో పాఠాల మధ్య చాన్స్ దొరికితే చాలు (దొరక్కపోయినా కలిపించుకుని మరీ).. పరిమి ఆంజనేయశర్మ గారు, కల్లూరి నరసింహమూర్తి గారు, మాడభూషి భవనాచారి గారు, పోలూరి శ్రీమన్నారాయణ గారు.. మా గురువు గార్ల లిస్టు పెద్దది.. నీతి బోధన వాయింపుడు కార్యక్రమం రోజూ ఉండనే ఉంటుంది.




"మీరు డాక్టర్లవుతారా, ఇంజనీర్లవుతారా అనేది మాకు అనవసరం. అవన్నీ భుక్తి కోసం విద్యలు. మీరు మంచి పౌరులుగా ఎదగాలని మా కోరిక. పొరబాటున కూడా సమాజానికి హాని చెయ్యరాదు. మా శిష్యు లైన మీరు వెధవ పనులు చేస్తే మాకు, మన స్కూలుకి అవమానం." అంటూ ఏదో సందర్భంలో చెబుతూనే ఉంటారు.

ఇప్పుడు చెప్పండి. పొద్దస్తమానం ఈ సూత్రాల మధ్యన పెరిగిన నేను.. చదువు నిర్లక్ష్యం చేస్తూ.. అమ్మాయిలకి సైట్లు కొడుతూ, బీట్లెయ్యాలంటేనే ఎంతో కష్టపడాలి. నేను పుట్టుకతో బద్దకస్తుడను. అంచేత.. కష్టపడుతూ ఆ పన్లన్నీ చేసే ఓపిక లేక.. చదువుకుని సుఖపడుతూ బాగుపడిపొయ్యాను. చెడిపోవలసిన వయసులో బాగుపడి పోవుట చేత.. అలవాటై పొయ్యి.. అదే కంటిన్యూ చేసేశాను.




మొన్నామధ్య నా గురవయ్య హై స్కూల్ స్నేహితుడు కలిశాడు. అతగాడు ఢిల్లీలో ఏదో డిఫెన్స్ లాబ్ లో సైంటిస్టుగా పని చేస్తున్నాడు. మాటల సందర్భాన మా స్కూల్ ప్రస్తావన వచ్చింది. మావాడు మొహం ఆవదం తాగినట్లు పెట్టాడు.

"నాకు మన స్కూల్ గూర్చి చెప్పకు. దానంత దరిద్రపు స్కూల్ ఈ లోకంలోనే లేదు." కసిగా అన్నాడు.

ఆశ్చర్యపోయాను. "నేనింకా మన గురవయ్య బళ్ళో చదువుకోడం అదృష్టం అనుకుంటున్నానే!" అంటూ నసిగాను.

"నీ మొహం అదృష్టం. అది కూడా ఒక స్కూలేనా? ప్రతిరోజూ 'స్త్రీలని గౌరవించండి, నెత్తిన పెట్టుకోండి, పూజించండి' అంటూ జగన్నాధరావు గారు నా బుర్రలో నాగార్జునా సిమెంటుతో చైనా వాల్ కట్టేశారు. నాకా దెబ్బకి ఆడాళ్లంటే గౌరవంతో కూడిన భయం లాంటిదేదో పట్టుకుంది. ఇదో రోగం. నిజం చెప్తున్నా.. ఆయన దెబ్బకి నా జీవితంలో ఏనాడూ ఒక్క ఆడపిల్ల మొహం వైపు కూడా ధైర్యంగా చూళ్ళేదు."

"అదా సంగతి!" అంటూ నవ్వాను.

"పెళ్ళయిన రోజు నుండి భార్యని కూడా గౌరవిస్తున్నాను. ఆమెని ఏనాడూ నోరెత్తి చిన్న మాట కూడా అన్లేదు. అప్పుడప్పుడు కోపం వస్తుంది. గట్టిగా మాట్లాడాలంటే జగన్నాధరావు గారి లక్ష్మీసరస్వతుల అసెంబ్లీ పాఠం గుర్తొస్తుంది. పైగా ఆయన నాకేసి గుడ్లురుముతూ చూస్తున్నట్లనిపిస్తుంది. నాకింక నోరు పెగలదు. అందుకే మా ఆవిడ నన్నో వాజమ్మలా చూస్తుంది." దిగులుగా అన్నాడు.


మావాణ్ణి జాలిగా చూశాను. మెడిసిన్ సరైన మోతాదులో వాడితేనే ఫలితం బాగుంటుంది. అదే మెడిసిన్  ఓవర్ డోసేజ్ అయిపోతే కాంప్లికేషన్లొస్తాయి. మావాడు హెడ్ మాస్టర్ గారి బోధనలని మరీ సీరియస్ గా పట్టించుకుని.. దెబ్బతిన్నాడు. ఆ విధంగా స్కూళ్ళ వల్ల లాభాలే కాదు.. నష్టాలూ ఉంటాయని అర్ధమైంది.


మనవి..


ఈ పోస్ట్ నా గురవయ్య హైస్కూల్ స్నేహితుల కోసం రాశాను. కొందరికి విసుగనిపించవచ్చు. మన్నించగలరు. ఈ పోస్ట్ చదివిన మా స్కూల్ విద్యార్ధులు.. వల్లూరి జగన్నాధరావు గారి ఫోటో పంపిన యెడల.. ఆ ఫోటో ఈ పోస్టులో ప్రచురిస్తాను.

కృతజ్ఞతలు..

DSR.మూర్తి నా ప్రాణమిత్రుడు. 'మన స్కూల్ గూర్చి రాస్తున్నాన్రా' అనంగాన్లే.. సంతోషంగా, హడావుడిగా చక్కటి ఫోటోలు తీసి పంపాడు. (చివరి చిత్రం మా స్కూల్ సంస్థాపకులు శ్రీమాజేటి గురవయ్య గారిది.)

Friday, 29 June 2012

నా 'గురజాడ' కష్టాలు

"గురజాడ అప్పారావు!? ఎవరీ గురజాడ? స్వాతంత్ర సమరయోధుడా? రాజకీయ నాయకుడా? నాటకాలేస్తాడా? పాటలు పాడతాడా? సినిమాలు తీస్తాడా? వున్నాడా? పొయ్యాడా? పేరు గంభీరంగానే వుంది, గాంధీగారికి శిష్యుడా? గురజాడా! మై డియర్ గురజాడా! హూవార్యూ?" నన్నునేనీ ప్రశ్నలడుక్కోవడం ఇది డెబ్భైనాలుగోసారి, బట్ నో సమాధానం!

అది మా హైస్కూల్. ఇంకొంతసేపట్లో వ్యాసరచన పోటీ జరగబోతుంది. టాపిక్ - 'గురజాడ అప్పారావు' అని మొన్ననే తెలుసు. రెండ్రోజుల క్రితం క్లాసులోకి ఈ వ్యాసరచన తాలూకా నోటీసు వచ్చింది. మా క్లాస్ టీచర్ 'పాల్గొనువారు' అంటూ ఏకపక్షంగా కొందరిపేర్లు రాసేశారు. పిమ్మట 'మీకు ప్రైజ్ ముఖ్యం కాదు, ఆ మహానుభావుడి గూర్చి నాలుగు ముక్కలు రాయడం ముఖ్యం!' అంటూ వాక్రుచ్చారు. ఆవిధంగా నా ప్రమేయం లేకుండానే వ్యాసరచన పోటీదారుణ్ని అయిపొయ్యాను. ఆరోజు స్కూల్ అయిపోంగాన్లే గురజాడ గూర్చి వివరాలు సేకరించే పనిలో పడ్డా.

శాస్త్రిగాడి నమ్మకద్రోహం నా కొంప ముంచింది. ఇప్పుడు శాస్త్రిగాడి గూర్చి నాలుగు ముక్కలు. శాస్త్రిగాడు నా క్లాస్మేట్. గత రెండేళ్ళుగా నాపక్కనే కూచుంటాడు, వాడికి నా పక్కన ప్లేసు చాలా ఇష్తం! ఎందుకని? పరీక్షల్లో వాడు నా ఆన్సర్ షీటుని జిరాక్స్ మిషన్ కన్నా వేగంగా కాపీ కొడతాడు. అదీ సంగతి! అందుకు కృతజ్ఞతగా కొన్ని సందర్భాల్లో వాడు నాకు అసిస్టెంటుగా వ్యవహరించేవాడు.

'ఉరేయ్! గురజాడ అప్పారావు గూర్చి నువ్వస్సలు వర్రీ అవ్వకు. మా బాబాయ్ దగ్గర ఇట్లాంటి విషయాల మీద మోపులకొద్దీ మెటీరియల్ ఉంటుంది. రేపు తెచ్చిస్తాను.' అని హామీ ఇచ్చాడు శాస్త్రి. విషయం చిన్నదే కాబట్టి శాస్త్రిగాణ్ణి నమ్మి, ఇంక నేనావిషయం పట్టించుకోలేదు.

మెటీరియల్ అదిగో, ఇదిగో అంటూ చివరి నిమిషందాకా లాగాడు శాస్త్రి. ఇప్పుడు మొహం చాటేశాడు. మిత్రద్రోహి! మొన్న క్వార్టర్లీ పరీక్షల్లో ఇన్విజిలేటర్ కఠినంగా ఉన్నందున, శాస్త్రిగాడికి చూసి రాసుకునేందుకు ఎప్పట్లా పూర్తిస్థాయిలో 'సహకరించ'లేకపొయ్యాను. అదిమనసులో పెట్టుకున్నాడు, దుర్మార్గుడు! కుట్ర పన్నాడు. ఆ విషయం గ్రహించలేక కష్టంలో పడిపొయ్యాను.

ఇంక లాభం లేదు, ఈ గరజాడ ఎవరో అడిగి తెలుకోవాల్సిందే. 

"ఒరే నడింపల్లిగా! గురజాడ గూర్చి తెలిస్తే కాస్త చెప్పరా!"

"గురజాడా! ఎవరాయన? నాకు తెలీదు." అంటూ జారుకున్నాడు నడింపల్లిగాడు.

'దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా' అంటూ బట్టీవేస్తున్న పంగులూరిగాడు, నన్ను చూడంగాన్లే హడావుడిగా కాయితం జేబులో పెట్టుకుని క్లాస్ రూములోకి పారిపొయ్యాడు.

"ఒరేయ్! నువ్వు ఇవ్వాళ మాక్కూడా చూపించు! ఎంతసేపూ ఆ శాస్త్రిగాడికే చూపిస్తావేం? ఊరికినే చూపించమనట్లేదు! సాయంకాలం మామిడి కాయలు తెచ్చిస్తాంలే!" అంటూ బేరంపెట్టారు జంటకవులైన భాస్కరాయ్, సత్తాయ్ ద్వయం.

భాస్కరాయ్, సత్తాయ్ ప్రాణస్నేహితులు. మా బ్రాడీపేట ఇళ్ళల్లో మామిడిచెట్లకి రక్షణ లేదు. కాయలు ఉన్నట్టుండి మాయమైపొయ్యేవి. అది వీరి చేతిచలవే! ఇలా కొట్టేసిన కాయల్తో వీరు వాణిజ్యం చేసేవాళ్ళు. పరీక్షల్లో కాపీకి సహకరించే స్నేహితుల, ఇన్విజిలేటర్ల ఋణం మామిడికాయల్తోనే తీర్చుకునేవాళ్ళు. పరీక్షలయ్యాక టీచర్ల ఇళ్ళకి వెళ్ళి 'మా పెరట్లో చెట్టుకాయలండి' అంటూ భక్తిప్రవృత్తులతో గురుపత్నులకి సాష్టాంగప్రణామం చేసి బుట్టెడు కాయలు సమర్పించుకునేవాళ్ళు. వీరీ మంత్రాంగంతో విజయవంతంగా అనేక పరీక్షల్లో పాసు మార్కులు సంపాదించారు.

"ఏంటి మీకు నేను చూపించేది! శాస్త్రిగాడు నన్ను మోసం చేశాడు. నాకే ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు." అన్నాను దీనంగా.

"నీకేం తెలీదు, శాస్త్రిగాడు నిన్ను మోసం చేశాడు, ఇదంతా మేం నమ్మాలి! బయటకొస్తావుగా, అప్పుడు తేలుస్తాం నీ సంగతి." అంటూ గుడ్లురిమారు జంటకవులు.

క్లాసురూములోకి అడుగుబెట్టాక అక్కడి వాతావరణం చూసి నీరుగారిపొయ్యాను. పబ్లిక్ పరీక్ష రాయిస్తున్నట్లు అందర్నీ దూరందూరంగా కూర్చోబెట్టారు, పక్కనున్నవాడిని అడిగే అవకాశం లేదు. నా మిత్రశత్రువులు, శత్రుమిత్రులు అందరూ వారివారి స్థానాల్లో ఆశీనులై ఉన్నారు. ఇప్పటిక్కూడా గురజాడ ఎవరో కనీసం ఒక చిన్న హింట్ కూడా నాదగ్గర లేదు!

నా వెన్నుపోటుదారుడైన శాస్త్రిగాడు కొత్త పెళ్ళికొడుకులా ముసిముసిగా నవ్వుకుంటూ చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాడు. నేను శాస్త్రిగాడి దగ్గరకెళ్ళాను. కసిగా, కర్కశంగా, కోపంగా ఒక్కోఅక్షరం వత్తిపలుకుతూ నిదానంగా, నెమ్మదిగా వాడిచెవిలో అన్నాను.

"ఒరే శాస్త్రిగా! దరిద్రుడా, దౌర్భాగ్యుడా, నికృష్టుడా! పంది, ఎద్దు, దున్న! నీలాంటి నీచుణ్ణి నేనింతమటుకూ చూళ్ళేదు. నువ్వు గురజాడ గూర్చి చాలా విషయాలు బట్టీ కొట్టావని నాకు తెలుసురా. కనీసం ఇప్పుడయినా రెండు పాయింట్లు చెప్పిచావు, నిన్ను క్షమించేస్తాను." అంటూ వాడి పాపపరిహారానికి చివరి అవకాశం ఇచ్చాను. శాస్త్రిగాడు నామాట వినబడనట్లు మొహం పక్కకి తిప్పుకున్నాడు.

నేను కోపంగా నా స్థానంలోకొచ్చి కూర్చున్నాను. నాకు గురజాడ గూర్చి తెలీకపోవడం కన్నా.. నా స్నేహితులు నాకు ఇంతలా సహాయ నిరాకరణ చెయ్యడం చాలా అవమానకరంగా అనిపిస్తుంది. బాధగా ఉంది, ఏడుపొస్తుంది. బహుశా బ్రిటీషోడిక్కూడా గాంధీగారు ఇంత ఘోర సహాయ నిరాకరణ చేసుండరు! 

వ్యాసరచన సమయం మొదలైంది. మిత్రులంతా కళ్ళు మూసుకుని, శబ్దం బయటకి రాకుండా పెదాలు కదుపుతూ సరస్వతీ ప్రార్ధన చేసుకున్నారు. అయోమయంగా వాళ్ళని చూస్తుండిపొయ్యాను. నా జీవితంలో నాకెప్పుడూ ఇలాంటి అనుభవం లేదు. 

కొద్దిసేపటికి నిదానంగా ఆలోచించడం మొదలెట్టాను. 'ఎలాగూ గంటదాకా బయటకెళ్ళనివ్వరు. ఏదోకటి రాస్తే నష్టమేముంది? అయినా గురజాడ అప్పారావు గూర్చి తెలుసుకుని రాస్తే గొప్పేముంది? తెలీకుండా రాయడమే గొప్ప!' అంటూ ఒక నిర్ణయం తీసుకున్నాను. కొద్దిగా ఉత్సాహం వచ్చింది.

నా తెలుగు, సోషల్ పాఠాలు జ్ఞప్తికి తెచ్చుకున్నాను. శ్రీకృష్ణదేవరాయలు, ఝాన్సీ లక్ష్మీబాయి, టంగుటూరి ప్రకాశం, గాంధీ మహాత్ముడు, సర్దార్ పటేల్.. ఇట్లా గుర్తున్నవారందర్నీ బయటకి లాగాను. అందర్నీ కలిపి రోట్లో వేసి మెత్తగా రుబ్బి, ఇంకుగా మార్చి పెన్నులో పోశాను. ఇంక రాయడం మొదలెట్టాను.

'అమృతమూర్తులైన గురజాడ అప్పారావు గారు కారణజన్ముడు. వీరు భరతమాత ముద్దుబిడ్డ. అసమాన ప్రజ్ఞాసంపన్నుడు, మహోన్నత వ్యక్తి. వీరి ప్రతిభ అపూర్వం, పట్టుదల అనితరసాధ్యం! ఈ పేరు వినంగాన్లే తెలుగువారి హృదయం ఆనందంతో పులకిస్తుంది, గర్వంతో గుండెలు ఉప్పొంగుతాయి. ఇంతటి మహానుభావుడు మన తెలుగువాడు కావడం మన అదృష్టం. ఆయన నడయాడిన ఈ పుణ్యభూమికి శతకోటి వందనాలు. మన తెలుగువారి ఉన్నతి గురజాడవారి త్యాగఫలం! సూర్యచంద్రులున్నంత కాలం గురజాడవారి కీర్తి ధగధగలాడుతూనే ఉంటుంది. గురజాడవంటి మహానుభావుని గూర్చి రాయడం నా పూర్వజన్మ సుకృతం. నా జీవితం ధన్యం..... ' ఈ విధంగా రాసుకుంటూ పోయాను. నా చేతిరాత అక్షరాలు పెద్దవిగా వుంటాయి. ఒక పేజికి పదిలైన్లు మించి రాసే అలవాటు లేదు. తదేక దీక్షతో అనేక ఎడిషనల్ షీట్లు రాసేశాను.

ఎక్కడా పొరబాటున కూడా గురజాడ గూర్చి చిన్న వివరం ఉండదు! కానీ చాలా రాశాను, చాలాచాలా రాశాను. శాస్త్రిగాడు చేసిన ద్రోహానికి కోపంతో రాశాను, ఆవేశంగా రాశాను. అది ఒక రాత సునామి, ఒక రాతా తాలిబానిజం, ఒక రాతా రాక్షసత్వం. కోపం మనలోని భాషాప్రావిణ్యాన్ని బయటకి తెస్తుందేమో!

వ్యాసం రాయడానికి ముందు 'శ్రీరామ' అని పెద్దక్షరాలతో హెడింగ్ పెట్టుకుని ఏంరాయాలో తెలీక పక్కచూపులు చూస్తున్న సత్తాయ్, భాస్కరాయ్ గాళ్ళు నా రాతోన్మాదాన్ని చూసి కోపంతో పళ్ళు నూరుతున్నారు. నిక్కర్ లోపల్నించి చిన్నస్లిప్ తీసి మేటర్ మూణ్ణిమిషాల్లో రాసేసిన నడింపల్లిగాడు దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. బట్టీకొట్టిన పదిపాయింట్లు పదినిమిషాల్లో రాసేసిన శాస్త్రిగాడు నన్ను ఆశ్చర్యంగా గమనిస్తున్నాడు. ఆమాత్రం కూడా గుర్తురాని పంగులూరి గాడు బిత్తరచూపులు చూస్తున్నాడు. ఆరోజు ఆ వ్యాసరచన పోటీలో అందరికన్నా ఎక్కువ పేజీలు ఖరాబు చేసింది నేనేనని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటా!

ఓ పదిరోజుల తరవాత వ్యాసరచనా పోటీ ఫలితాల్ని ప్రకటించారు. దాదాపు యాభైమంది రాసిన ఆ పోటీలో నాకు ద్వితీయ బహుమతి వచ్చింది. ప్రధమ, తృతీయ స్థానాలు ఎవరివో గుర్తు లేదు. స్నేహద్రోహి శాస్త్రిగాడికి ఏ బహుమతీ రాలేదు. అది మాత్రం గుర్తుంది. నాక్కావల్సిందీ అదే. మనసులోనే వికటాట్టహాసం చేసుకున్నాను.

ఆ రోజు స్కూల్ ఎసెంబ్లీలో ఫలితాల్ని ప్రకటిస్తూ హెడ్ మేస్టరుగారు అన్నమాటలు కూడా గుర్తున్నాయి. "అద్భుతంగా రాశావు బాబు. కానీ గురజాడ ఎవరో రాయడం మర్చిపొయ్యావు. కనీసం గురజాడ 'రచయిత' అన్న ఒక్కపదం రాసినా నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అందుకే ఇంత బాగా రాసినా ఆ ఒక్కకారణంగా నీకు సెకండ్ ప్రైజ్ ఇవ్వాల్సొచ్చింది." అని మెచ్చుకుంటూ తెగ బాధపడ్డారు.

నాకు గురజాడ 'రచయిత' అన్న పదం తెలీదని ఆయనకి తెలీదు. పాపం హెడ్ మేస్టరుగారు! విద్యార్ధుల్లో నాలాంటి మోసకారులుంటారని ఆయనకి తెలిసినట్లు లేదు!