Showing posts with label భానుమతి. Show all posts
Showing posts with label భానుమతి. Show all posts

Monday, 5 November 2012

భానుమతి వద్దు! రాజసులోచనే ముద్దు!!


అబ్బ! బుర్ర వేడెక్కిపోయింది. భార్యాభర్తల మధ్య తగాదా కేసు. చాలా టైం పట్టింది. ఇట్లాంటి కేసులు చూసినప్పుడు మనసంతా చికాగ్గా అయిపోతుంది. లాభం లేదు. ఒక మంచి తెలుగు సినిమా పాట చూసి రిలాక్స్ అవ్వాలి.

ఈ వేడెక్కిన బుర్రని చల్లార్చుకోడానికి నాకు యూట్యూబ్ పాత పాటలు ఎంతో ఉపయోగపడతాయి. నాకు కొత్త పాటలు తెలీదు. అంచేత పాత పాటల్లోనే తిరుగుతుంటాను.



'మనసున మల్లెలు మాలలూగెనే.. ఎంతహాయి ఈరేయి.. ఎంత మధురమీ హాయి!' మల్లీశ్వరి సినిమాలో భానుమతి పాడిన ఈపాట నాకు చాలాచాలా ఇష్టం. ఇప్పటికి వెయ్యిసార్లు విని ఉంటాను. అయినా మళ్ళీమళ్ళీ వినాలనిపిస్తుంది. ఎప్పుడువిన్నా మనసంతా హాయిగా, తేలిగ్గా అయిపోతుంది.

అంచేత ఇప్పుడు మళ్ళీ 'మనసున మల్లెలు మాలలూగెనే.. ' వినడం మొదలెట్టాను. కంప్యూటర్ మానిటర్ పై పాటని చూస్తూ తన్మయత్వం, పరవశం చెందుచుండగా..

"రవణ మావా! కాఫీ." అంటూ సుబ్బు వచ్చాడు.

శబ్దం చెయ్యొద్దన్నట్లుగా చూపుడువేలు నోటివద్ద పెట్టుకుని సైగచేస్తూ.. అరమోడ్పు కన్నులతో పాట వినడంలో పూర్తిగా మునిగిపొయ్యాను. పాట అయిపోయింది. తపస్సులోంచి అప్పుడే బయటకొచ్చిన మునివలే ఫీలయ్యాను. గదంతా నిశ్శబ్దం.. ప్రశాంతత.

"ఆహాహా ఏమి ఈ భానుమతి గానమాధుర్యము! ఒక ప్రేయసి తన ప్రియుడి కోసం ఎంత అద్భుతంగా పాడింది! ఈపాట విన్నవాడి జన్మధన్యం. విననివాడి ఖర్మం. సందేహము వలదు. ఈ భూప్రపంచంలో ఇంతకన్నా గొప్పపాట లేదు. ఇకముందు రాదు కూడా!" తన్మయత్వంతో అన్నాను.

"నేనలా అనుకోవడం లేదు." సుబ్బు గొంతు విని ఉలిక్కిపడ్డాను.

కర్కశంగా సుబ్బుని చూశాను. ఈ దరిద్రుడి వల్ల నాజీవితంలో నేనుపొందే చిన్నచిన్న ఆనందాలు కూడా కోల్పోతున్నాను. వీడు మొన్న నీలం తుఫాన్లో కొట్టుకుపొయినా బాగుండేది.

"నువ్వు కోపంతో అలా పిచ్చిచూపులు చూడనవసరం లేదు. భానుమతి పాట అద్భుతం. ఒప్పుకుంటున్నాను. కానీ నాదృష్టిలో 'సడిసేయకోగాలి.. ' ఇంతకన్నా అద్భుతం." అన్నాడు సుబ్బు.



"నువ్వు చెబుతుంది 'రాజమకుటం' పి.లీల పాడిన పాట గురించేనా? ఆపాట గూర్చి నువ్వు చెప్పేదేముంది? చాలా మంచి పాట. నాక్కూడా చాలా ఇష్టం. మాస్టర్ వేణు సంగీతం అమోఘం. కానీ ఆపాటని భానుమతి పాటతో పోలిక తేవడం నీ పూర్ టేస్ట్ సూచిస్తుంది. నా స్టేట్మెంట్ ఖండిద్దామనే దుగ్ద తప్ప నీవాదనలో పసలేదు." చికాగ్గా అన్నాను.

ఇంతలో కాఫీ వచ్చింది.

"నాది ఇంటలిజెంట్ టేస్ట్ అనుకుంటున్నాను. పూర్ టేస్ట్ ఎలానో చెబితే విని సంతోషిస్తాను." కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సుబ్బు.

"మల్లీశ్వరి బి.ఎన్.రెడ్డి అద్భుతసృష్టి." అన్నాను.

"మరి రాజమకుటం ఎవరి సృష్టో!" నవ్వాడు  సుబ్బు.

"దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం నుండి జాలువారిన.. "

"నా 'సడిసేయకోగాలి.. ' కూడా అక్కణ్ణుండే జాలువారింది మిత్రమా!" అందుకున్నాడు సుబ్బు.

"సరే! నీ సడిసేయకోగాలి నా మనసునమల్లెల కన్నా ఎలా ఎక్కువో నువ్వే చెప్పు. ప్రూవ్ యువర్ పాయింట్!" అన్నాను.

"అలా అడిగావ్ బాగుంది. రెండు పాటలు రాసింది కృష్ణశాస్త్రే. కానీ రాయడంలో ఎంత తేడా చూపించాడో గమనించు. మల్లీశ్వరి పాట సబ్జెక్టివ్ గా ఉంటుంది. రాణీవాసంలో మగ్గిపోతున్న మల్లి ఎంతోప్రయత్నం మీద తనబావ నాగరాజుని తుంగభద్ర ఒడ్డున కలుసుకుని.. ఆనందంతో పరవశం చెందుతూ.. తన భావాల్నికవితాత్మకంగా పాట రూపంలో వర్ణిస్తుంది. అద్భుతమైన పాటే! కానీ మనమెవరం? మగాళ్ళం. మన దృష్టికోణం మగవాడివైపు నుండి ఉండాలి." అన్నాడు సుబ్బు.


"అంటే!" ఆసక్తిగా అడిగాను.

"రాజమకుటం పాట విను. 'సడిసేయకోగాలి.. సడిసేయబోకే! బడలి ఒడిలో రాజు పవలించేనే!' ప్రియుడు అలసిసొలసి ఉన్నందున గాలిని శబ్దం చెయ్యొద్దని అడుగుతుంది. అతన్ని రారాజు, మహారాజుగా భావిస్తుంది. తనకంటూ ఏమీ కోరుకోదు. ఏమగాడికైనా కావలసింది తనకోసం వరాలు కోరుకునే నిస్వార్ధ నారీమణిగానీ, తన భావాలు అందంగా వ్యక్తీకరించే కవియిత్రి కాదు. కవిత్వం కడుపు నింపదు. అందుకే రామారావు అదృష్టానికి రాజనాల కుళ్ళుకుంటాడు." అంటూ నవ్వాడు సుబ్బు.

"నేనీ ఏంగిల్లో ఆలోచించలేదు." ఆలోచనగా అన్నాను.


"గాలికూడా శబ్దం చెయ్యరాదంటూ మనని అపురూపంగా చూసుకునే యువతి భార్యగా వస్తే ఎంత సుఖం! రోజూ గుత్తొంకాయ, దోసకాయ పప్పు చేయించుకుని కడుపునిండా భోంచెయ్యొచ్చు. ఎన్నిసార్లడిగినా విసుక్కోకుండా ఫిల్టర్ కాఫీలిస్తుంది. ఈరోజుల్లో ఎన్నిలక్షలు పోసినా ఒక్కరోజుకూడా ఇంతసుఖం దక్కదు." అన్నాడు సుబ్బు.

"భానుమతికేం తక్కువ?" నేనివ్వాళ భానుమతిని వదలదల్చుకోలేదు.

"ఏమీ తక్కువ కాదు. అన్నీ ఎక్కువే. అసలు భానుమతి, రాజసులోచన మొహాల్ని నువ్వెప్పుడన్నా పరిశీలనగా చూశావా? మనమేం చెప్పినా నమ్మేట్లుగా.. అమాయకంగా, బేలగా ఉండే రాజసులోచనతో.. తెలివిగా, ఆత్మవిశ్వాసంతో ఎసెర్టివ్ గా ఉండే భానుమతిని పోల్చడానికి నీకు బుర్రెలా వచ్చింది? బుద్ధున్న ఏమగాడైనా రాజసులోచనని వదులుకుంటాడా!" అన్నాడు సుబ్బు.

"నువ్వు భానుమతిని మరీ తక్కువ చేస్తున్నావు." ఓడిపోతున్నాని తెలిసి కూడా బింకంగా అన్నాను.

"రవణ మావా! నేను భానుమతిని తక్కువ చెయ్యట్లేదు. ఆవిడొక అద్భుతనటి. బహుముఖ ప్రజ్ఞాశీలి. ఆవిడకి శతకోటి వందనాలు. భానుమతి స్థాయి మనకన్నా లక్ష మెట్లు ఎక్కువనే చెబుతున్నాను. ఆడవారిలో తెలివి ఆటంబాంబు కన్నా ప్రమాదకరమైనది. వారికి ఎంతదూరంలో ఉంటే మనకంత మంచిది. తెలివైన యువతిని కట్టుకుని బాగుపడ్డ మగాడు చరిత్రలో లేడు." అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"నేను చరిత్ర చదువుకోలేదు సుబ్బు!" నవ్వుతూ అన్నాను.


"బి.ఎన్.రెడ్డిది కూడా నా అభిప్రాయమే! అందుకే పాటల చిత్రీకరణలో చాలా తేడా చూపాడు. 'మల్లీశ్వరి'లో భానుమతి పాట పాడినంతసేపూ రామారావు పక్కనే కూర్చునుంటాడు. పైగా భానుమతి తనమీదకి ఒరిగినప్పుడు ఆవిడ బరువు కూడా మోస్తాడు. ఎంత ఘోరం! అదే 'రాజమకుటం' పాట చూడు. హాయిగా రాజసులోచన ఒడిలో తల పెట్టుకుని ఆనందంగా ఉంటాడు. తనకి లభించిన ఈ ప్రమోషన్ రామారావుకి కూడా సంతోషం కలిగించినట్లుంది." అంటూ టైం చూసుకుంటూ లేచి నిలబడ్డాడు సుబ్బు.


"ఇన్నాళ్ళు భానుమతి పాటే అద్భుతమనుకున్నానే!" డిజప్పాయింటింగ్ గా అన్నాను.

వెళ్ళబోతూ ఆగి, వెనక్కితిరిగి అన్నాడు సుబ్బు.

"ఇవన్నీ పబ్లిగ్గా చెప్పే మాటలు కాదు మిత్రమా! యే అందర్ కి బాత్ హై! ఇప్పుడైనా ఎవరన్నా అడిగితే భానుమతి పాటే గొప్పని చెప్పు. లేకపోతే నిన్నో పురుష దురహంకారిగా భావించే ప్రమాదముంది. అసలే రోజులు బాలేవు!" అంటూ నిష్క్రమించాడు మా సుబ్బు.

(photos courtesy : Google)

Wednesday, 7 December 2011

స్వర్గంలో భానుమతి, సావిత్రి.. నేను కూడా!

అదొక విశాలమైన హాలు. పొడవాటి రంగురంగుల కర్టెన్లు. జమీందార్ల కొంపల్లో మాత్రమే కనిపించే సింహాసనం సోఫాలు, సోఫాలాంటి కుర్చీలు. అందమైన చీరల్లో మరింత అందమైన ఆడవాళ్ళు, తెల్లటి వస్త్రాల్లో మగవాళ్ళు. ఆ వాతావరణం సందడి సందడిగా, హడావుడి హడావుడిగా ఉంది.

హాలు మధ్యన పెద్ద పట్టుతివాచీ. దానిపై మందపాటి ముఖమల్ పరుపు. ఆ పరుపుపై కూర్చున్న ఒక స్త్రీ అచ్చు భానుమతి గొంతుతో గీతం ఆలపిస్తుంది. ఆమె చుట్టూతా కూర్చున్నవారు శ్రద్ధగా ఆమె గానాన్ని వింటూ తల పంకిస్తున్నారు.

'సావిరహే తవదీన.. '

ఏవిటిదంతా? నేనిక్కడికెలా వచ్చాను? అటుగా వెళ్తున్న ఒక తెల్లబట్టల పెద్దమనిషిని వాకబు చేశాను. ఆయన సమాధానం విని హతాశుడనయ్యాను. 

ఇది భూలోకం కాదు - స్వర్గంట! ఐదునిమిషాల క్రితమే నేను బాల్చీ తన్నేశాన్ట! యేమిటీ దారుణం? ఇది కల కాదు గదా? అసలేమైంది చెప్మా? కళ్ళు మూసుకుని ఓ క్షణం ఆలోచించాను.

ఆ! గుర్తొచ్చింది. ఇవ్వాళ అరికాలు దురద పెడుతుంటే ఓ కార్పోరేట్ ఆస్పత్రి డాక్టరు దగ్గరకెళ్ళాను. ఆ డాక్టరు నా అరికాలుని ఆరు నిమిషాలు పరీక్షించి, ఆరువేల రూపాయల టెస్టులు చేసి, ఆరువందల రూపాయల ఇంజెక్షను పొడిచాడు. ఆ ఇంజెక్షను వికటించిందా? వికటించే వుంటుంది, లేకపోతే ఇక్కడికెలా వొచ్చి పడతాను? అయ్యో! అంటే.. అంటే.. ఇప్పుడు నేను చచ్చిపోయానా!

బాధతో గుండె బరువెక్కింది. దుఃఖంతో కొంచెంసేపు విలపించాను. అయ్యో! చావడంలో కూడా నాదెంత దరిద్రపుగొట్టు చావు! ఏదో గుండెజబ్బులాంటి రోగంతో చస్తే గౌరవం గానీ, మరీ చీప్‌గా అరికాలు దురదకి చావటం ఎంత సిగ్గుచేటు! నా శవాన్ని చూడ్డనికొచ్చిన వారి ముందు నా పరువు పోయుంటుంది. సర్లే! ఎట్లాగూ చచ్చానుగా, ఇంక పరువుతో పనేముంది!

'కానీ - పుట్టి బుద్ధెరిగి ఎప్పుడూ పాపాలే చేశాను గానీ, పుణ్యం ఎప్పుడూ చెయ్యలేదే! యమభటులేమైనా పొరబాటున స్వర్గంలో పడేశారా?' అనే సందేహం కలిగింది. కొంతసేపటికి దుఃఖం తగ్గి, మనసు తేలికయ్యింది. ఇక్కడేదో బాగానే ఉన్నట్లుంది. పరిసరాలు పరికించి చూశాను. అక్కడి వాతావరణానికి నిదానంగా అలవాటు పడసాగాను. 

ఇంతకీ అంత మధురంగా పాడే ఆ గాయని ఎవరబ్బా!

'దగ్గరకెళ్ళి చూస్తే తెలుస్తుందిగా' అనుకుంటూ అలా వెళ్ళాను. ఆవిడ నిజంగానే భానుమతి! మనిషి మీగడ తరగలా ఎంతందంగా ఉంది! మహారాణిలా ఠీవీగా, విలాసంగా, హుందాగా.. మంద్రస్థాయిలో పాడుతుంది. ఆవిడ పాటలకి అందరూ మైమరచి, అరమోడ్పు కన్నులతో తల పంకిస్తూ ఆనంద పరవశులవుతున్నారు. భానుమతి ఒక పాట తరవాత మరో పాట పాడుతూనే ఉంది.

'ఒహొహొ! పావురమా'

'పిలచిన బిగువటరా'

'ఎందుకే నీకింత తొందర'

'మనసున మల్లెల మాలలూగెనే'

'ఎందుకోయి తోటమాలి అంతులేని యాతన'

'ఓ బాటసారి"

'నేనే రాధనోయి'

అహాహా! ఏమి ఈ గాత్రమాధుర్యము! జన్మ ధన్యమైంది! పోన్లే - చస్తే చచ్చాగానీ, గారెల బుట్టలో పడ్డా! అన్నట్లు ఈ స్వర్గంలో గారెలు దొరుకుతాయా? అసలిక్కడ వంటిల్లు అంటూ వుందా? ఆకలేస్తే ఉగ్గిన్నెతో అమృతం తాగిస్తాఆ!

ఇంతలో ఒక బూరె బుగ్గల చిన్నది - అక్కడున్న ఆడవాళ్ళని పేరుపేరునా పలకరిస్తూ, కాఫీ, టీ ఏర్పాట్లు పర్వవేక్షిస్తుంది. అబ్బా! ఎవరీ అందాలరాశి? ఎంత సుందరముగా యున్నది! కొంచెం దగ్గరగా వెళ్లి చూద్దాం. ఆఁ.. ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. ఆ అమ్మాయి.. ఆవిడ.. సా.. వి.. త్రి!

ఆనందంతో ఒళ్ళు పులకరించింది. నా శశిరేఖ, మేరా పార్వతి, మై మిస్సమ్మ.. వావ్! చచ్చిపోతే సావిత్రి కనిపిస్తుందంటే ఎప్పుడే చచ్చేవాణ్ణిగా! బొద్దుగా, ముద్దుగా, అమాయకంగా ఎంత బాగుంది! ఒరే అరికాలు డాక్టరు! థాంక్స్ రా బాబు థాంక్స్!

ఇంతలో పిడుగు పడ్డట్లు ఒక పెద్ద అరుపు.

"వొసే సావిత్రీ! నా కాఫీలో చక్కెర ఎక్కువెయ్యమని చెప్పానా లేదా? ఈ కాఫీ నీ మొహంలేగే వుంది, ఏడుపుగొట్టు మొహమా! తెలివితక్కువ దద్దమ్మ!"

పుఱ్ఱచేత్తో విసెనకర్రతో టపాటపా విసురుకుంటూ రుసరుసలాడింది సూర్యకాంతం. సావిత్రి భయంతో వణికిపోయింది.

"ఆ కాఫీ మీక్కాదు, అది కన్నాంబగారి కాఫీ." అంటూ కళ్ళనీళ్ళెట్టుకుంది.

నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఇంత కోపం నాకు భూలోకంలో కూడా ఎప్పుడూ రాలేదు. స్వర్గంలో మర్దర్ కేసుకి శిక్షలున్నాయా? ఈ సూర్యకాంతాన్ని మర్దర్ చెయ్యటానికి - ఏ రాజనాలకో, ఆర్.నాగేశ్వర్రావుకో సుపారీ ఇవ్వాలి. ఏరీ వాళ్ళు?

చప్పట్లతో హాలంతా మారుమోగింది. భానుమతి కచేరీ పూర్తయింది. శ్రోతలు భానుమతిని మెచ్చుకుని, నమస్కరిస్తూ ఒక్కొక్కళ్ళే హాలు బయటకెళ్ళారు. ఇప్పుడు హాల్లో కొద్దిమందిమి మాత్రమే మిగిలాం.

"నమస్కారం భానుమతమ్మగారు! నేను మీకున్న కోట్లాది అభిమానుల్లో ఒక రేణువుని. మీ 'మల్లీశ్వరి' లెక్కలేనన్నిసార్లు చూశాను. ఆ సినిమాలో మీరు హీరో, మీ పక్కన ఎన్టీరామారావు హీరోయినని మా స్నేహితులు అంటారు." వినయంగా అన్నాను.

భానుమతి నన్ను ఆపాదమస్తకం పరికించింది. ఆనక గంభీరంగా తల పంకించింది. ఆవిడకి నేను తన అభిమానిగా పరిచయం చేసుకోటం చాలా సంతోషాన్నిచ్చినట్లుంది. మనసులోని ఆనందాన్ని బయటకి కనబడనీయకుండా గుంభనంగా నవ్వుకుంది.

"మల్లీశ్వరి సినిమాకి హీరోని, హీరోయిన్ని కూడా నేనే! ఆ రామారావు కేవలం సహాయనటుడు." గర్వంగా తలెగరేస్తూ అన్నది భానుమతి.

అవునన్నట్లు తలూపుతూ అర్జంటుగా వొప్పేసుకున్నాను.

"అమ్మా! మీ అత్తగారి కథలు లేకపోతే చక్రపాణి, కుటుంబరావులు దీపావళి యువ సంచికలు అమ్ముకునేవాళ్ళా? మీ కథలు పంచదార గుళికలు." మరింత ఒంగిపోతూ అన్నాను. 

భానుమతి బహుత్ ఖుష్ హువా! ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ -

"ఒరే బడుద్దాయ్! మాటలు బాగానే నేర్చావు. నాకు పొగడ్తలంటే నచ్చవు. కానీ నువ్వన్నీ నిజాలే చెబుతున్నావనుకో!" అన్నది భానుమతి.

ఇంతలో సావిత్రి భానుమతికి తళతళలాడుతున్న గాజు గ్లాసులో బత్తాయి రసం ఇచ్చింది. నేను గుడ్లప్పగించి సావిత్రికేసి చూస్తుండిపోయాను. భానుమతి ఒక క్షణం నన్ను గమనించింది.

"సావిత్రీ! రా చెల్లీ! ఇలా నాకు దగ్గరగా వొచ్చి కూర్చో. వీడు ఇప్పటిదాకా నన్ను పొగిడాడు. నువ్వు రాంగాన్లే నిన్ను చూస్తూ నీలుక్కుపొయ్యాడు. మళ్ళీ చచ్చాడేమో వెధవ! వీడికి నువ్వంటే చచ్చేంత ఇష్టంట. అందుకే నీకోసం ఒక ప్రేమలేఖ రాశాడు."

"నిజమా! నాకు తెలీదక్కా!" ఆశ్చర్యంగా అంది సావిత్రి.

"ఓసి మొద్దుమొహమా! నీకు ఏం తెలిసి చచ్చింది గనక! ఆ దేవుడు నీకు గొప్ప నటనా ప్రతిభనిచ్చాడు గానీ, మట్టిబుఱ్ఱనిచ్చాడే బంగారం." అంటూ ముద్దుముద్దుగా సావిత్రిని విసుక్కుంది భానుమతి.

చటుక్కున తల ఎత్తి, నావైపు సూటిగా చూస్తూ "ఏమిరా! నా గూర్చి ఎప్పుడు రాస్తున్నావ్?" అంటూ హూంకరించింది భానుమతి.

"చి.. చి.. చిత్తం. త్వరలోనే.. తప్పకుండా.. ర.. రాస్తాను." వణికిపొయ్యాను.

భానుమతి కిలకిల నవ్వింది.

"నీ మొహం, నువ్వు రాయలేవులే. మీ మగవాళ్ళకి నా నటన ఇష్టం. నా పాటంటే చెవి కోసుకుంటారు. నా రచననల్ని అమితంగా ఇష్టపడతారు. కానీ నన్ను ప్రేమించే దమ్ములేని పిరికిసన్నాసులు. మీకు సావిత్రిలా అమాయకంగా, సబ్మిసివ్‌గా ఉండే వెర్రిమొహాలంటేనే ఇష్టం. సావిత్రిలో కనిపించే వల్నరబిలిటీ మీ మగాళ్ళకి ఇష్టం. నేను వీరనారీమణిని. నా దగ్గర మీరు సావిత్రి దగ్గర వేసే వేషాలేస్తే గుడ్లు పీకేస్తాను, పీక పిసికి చంపేస్తాను. అందుకే మీకు నాపాట మాత్రమే కావాలి. నాకు ప్రేమలేఖ రాయాలంటే వెన్నులో వణుకు."

భానుమతి చెబుతుంటే సావిత్రి కుందనపు బొమ్మలా, చెక్కిలిపై అరచెయ్యి ఆనించి, శ్రద్ధగా వింటూ తన చక్రాల్లాంటి కళ్ళతో 'నిజమా!' అన్నట్లు సంభ్రమంగా చూస్తూంది.

ఇంతలో మళ్ళీ ఇంకో పెద్ద పిడుగు!

"వొసే సావిత్రీ! కాఫీ నా మొహాన పడేసి ఏమిటే నీ మంతనాలు? పెత్తనాలు పక్కన పెట్టి నాకు నిద్రొచ్చే దాకా కాళ్ళొత్తు, నిద్రమొహం దానా! చూశావా ఛాయాదేవొదినా! నన్ను ఇక్కడ కూడా చెడ్డదాన్ని చెయ్యాలని కాకపోతే ఒక్కపనీ సరీగ్గా చేసేడవదు." పక్కనున్న చాయాదేవితో నిష్టూరంగా అంది సూర్యకాంతం. చాయదేవి మూతి వంకర్లు తిప్పుతూ ఆ పక్కకి వెళ్ళిపోయింది.

సూర్యకాంతం గావుకేకలతో స్వర్గం దద్దరిల్లింది. సావిత్రి ఉలికిపాటుతో ఎగిరిపడి సూర్యకాంతం దగ్గర పరిగెత్తుకెళ్ళింది.

భానుమతి నవ్వుతూ అంది. "ఇక్కడికి రాకముందు నాకూ అర్ధమయ్యేది కాదు - ఎందుకీ మగవాళ్ళు సావిత్రంటే పడి చస్తారు? నన్ను చూసి భయంతో వణికిపోతారు? మొన్నామధ్య ఒక గడ్డపాయన.. అదేనోయ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మనస్తత్వ శాస్త్రవేత్త.. దీంట్లోని మతలబు విడమర్చి చెప్పాడు."

"ఫ్రాయిడ్ మీతో మాట్లాడాడా!" ఆశ్చర్యపొయ్యాను.

"ఏంటోయ్ వెర్రి పీనుగా! అంత ఎక్స్‌ప్రెషనిచ్చావ్! నా పాటలు వినటానికి ఫ్రాయిడేం ఖర్మ! ఎరిక్ ఎరిక్సన్, ఎడ్లెర్, ఎరిక్ ఫ్రామ్, సార్త్ర్ కూడా ఎగబడతారు. ఫ్రాయిడుకి నా 'దులపర బుల్లోడా' పాట ఎంత ఇష్టమో తెలుసా? నిన్న సూర్యకాంతం పెట్టిన దొసావకాయ తిని, ఆవఘాటుకి ఉక్కిరిబిక్కిరై చచ్చాడు." అంటూ పెద్దగా నవ్వింది.

ఇంతలో హడావుడిగా లూజు చొక్కా ఇన్ షర్ట్ చేసుకుని కుర్రాళ్ళా కనిపిస్తున్న పెద్దాయన లోపలకొచ్చాడు. అతను.. ఆయన దేవానంద్! తల పైకికిందకీ ఊపుతూ, పల్చటి పెదాల్లోంచి నవ్వీ నవ్వనట్లుగా నవ్వుతూ అడిగాడు.

"నమస్కార్ భానుమతి బెహన్! ఆప్ జర మేరా సురయా కా ఎడ్రెస్ బతాయియే!"

భానుమతి దేవానంద్‌తో హిందీభాషలో ఏదో మాట్లాడుతుంది. చడీచప్పుడు చెయ్యకుండా చల్లగా అక్కణ్ణుంచి జారుకున్నాను.