Showing posts with label గుంటూరు. Show all posts
Showing posts with label గుంటూరు. Show all posts

Saturday, 13 September 2014

మా గుంటూరు స్మార్ట్ సిటీ ఆయెనె!


"మన గుంటూర్ని స్మార్ట్ సిటీగా చేస్తున్నార్ట!"

బద్దకంగా బ్రష్ చేసుకుంటుంటే - తెలుగు పేపర్ చూస్తున్న నా భార్య వ్యాఖ్య.

పొద్దున్నే ఎంత తీపివార్త! మా గుంటూరు ఇక ప్రపంచ పటంలో ఉదయ చంద్రుని వలె ప్రకాశించబోతుంది.

ఈ వార్త విన్నంతనే అనేక ఆలోచనలు సుడులు తిరగనారంభించాయి. కొంతసేపటికి ఆలోచనల సుడులు జలపాతాలై ప్రవహించసాగాయి.

నేను ఎనిమిదో క్లాసులో వుండగా, నా మేనమామ పెళ్ళి చేసుకున్నాడు. ఆయన పుస్తకాలు చదివేవాడు, పాటలు పాడేవాడు, నాకు కొనుక్కోడానికి పది పైసలిచ్చేవాడు. పెళ్లిరోజు - పెళ్ళిపీటల మీద కూర్చున్నంతసేపూ భార్య చెవిలో ఏదో చెబుతూనే వున్నాడు. ఆవిడ సినిమాలో సావిత్రిలాగా సిగ్గుగా, ముసిముసిగా నవ్వుతుంది. మావయ్య - హిట్టైన తెలుగు సినిమా హీరోలా విజయగర్వంతో నవ్వుతున్నాడు. మావయ్య ఎందుకంతలా నవ్వుతున్నాడో నాకర్ధం కాలేదు.

పెళ్ళిపనుల్తో హడావుడిగా వున్న అమ్మని అడిగాను. 

"అమ్మా! మావయ్యెందుకలా నవ్వుతున్నాడు?"

అమ్మకి నా ప్రశ్నకి సమాధానంగా ఏం చెప్పాలో తోచనట్లుగా ఒకక్షణం ఆలోచించి - 

"పెళ్ళంటే అంతే! సంతోషంగా వుంటుంది." అంది.

ఓహో అలాగా! నోట్ ద పాయింట్. పెళ్ళైతే సంతోషంగా వుంటుంది, నవ్వొస్తుంటుంది కూడాను!

కానీ - కొన్నాళ్ళకి మావయ్య ఎందుకో నవ్వడం తగ్గించాడు. మరికొన్నాళ్ళకి నవ్వడం మానేశాడు. ఇంకా మరికొన్నాళ్ళకి మొహం చిట్లించసాగాడు! ఆయన మొహం క్రమంగా అలా మారిపోవడానికి కారణం మా అత్తయ్యేననే అనుమానం నాలో వుండిపోయింది. అయితే - ఆధారాల్లేకుండా రాయడానికి నేనేమీ తెలుగు పత్రికా విలేఖరిని కాను. కావున - ఈ విషయం ఇంతటితో వదిలేస్తాను.

నేను ఇంటర్మీడియేట్ చదివేప్పుడు కోటంరాజు రంగారావుగారి దగ్గర కెమిస్ట్రీ ట్యూషన్ చెప్పించుకున్నాను. ఒకరోజు ఆయన పాఠం చెప్పకుండా హిందూ పేపర్లోని వార్తొకటి పెద్దగా చదివారు. మన దేశం అణుబాంబు పరీక్షని విజయవంతంగా జరిపిందని ఆ వార్త సారాంశం. ఇవ్వాళ్టినుండి మనం కూడా అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల సరసన ఒక ఉచితాసనం పొందామని ఆయన సెలవిచ్చారు. ఆ తరవాత ఆరోజు ట్యూషన్‌కి కూడా సెలవిచ్చారు.

అందరితోపాటు సంతోషిస్తున్నట్లుగా ఒక వెలిగిపొతున్న మతాబా మొహం పెట్టాను. కానీ - నాకు దీపావళప్పుడు పేల్చే తాడుబాంబుకీ, భారద్దేశం పేల్చిన అణుబాంబుకీ తేడా తెలీలేదు. ఇక్కడ అందరికీ అంతా తెలిసినట్లుంది. నేనొక్కడినే వాజమ్మనన్న మాట!

అందువల్ల - నా అత్మీయ మిత్రుడూ, సహ మతాబా అయిన సూర్యం (ద గ్రేట్ బ్రాడీపేట మ్యూజిక్ బ్యాండ్ పోస్టులో వున్నాడు) చెవిలో చిన్నగా అడిగాను - "మన్దేశం అణుబాంబు పేలిస్తే ఏమవుతుంది?" అని.

ఉన్నట్టుండి సూర్యం మేధావిలా గంభీరంగా అయిపొయ్యాడు. నావంటి అ-మేధావికి ఎలా చెబితే విషయం అర్ధమవుతుందా అన్నట్లు సీరియస్‌గా మొహం పెట్టి ఒకక్షణం ఆలోచించాడు.

"ఈ క్షణం నుండి మనం అమెరికాతో సమానమైపొయ్యాం. ఇకపైన ఆకాశంలో ఒకటే విమానాలు, హెలీకాప్టర్లు. మీ ఇల్లూ, మా ఇల్లూ పదంతస్తుల మేడగా మారిపోతాయి." అని చెప్పాడు.

నాకు చాలా సంతోషం కలిగింది. సినిమాల్లో చూడ్డవేఁ గాని నేనెప్పుడూ విమానాల్ని చూళ్ళేదు. నేను ఎక్కిన అతి ఎత్తైన కట్టడం మా హిందూ కాలేజి రెండో అంతస్తు. నాకు రెండో అంతస్తులోంచి కిందకి చూస్తేనే కళ్ళు తిరిగేవి. అదే పదంతస్తులయితే వాంతే అవుతుందేమో!

ఆ రోజు నుండి వీలయినప్పుడల్లా తల పైకెత్తి ఆశగా ఆకాశం వైపు చూస్తూనే వున్నాను. కాకులు తప్పితే ఏవీఁ కనిపించట్లేదు, మెడనొప్పి తప్ప ఏవీఁ మిగలట్లేదు. కొన్నాళ్ళకి సూర్యం అమెరికా వెళ్ళిపొయ్యాడు.

అణుబాంబు పేల్చి మనం కూడా అమెరికాతో సమానమైనప్పుడు - మా సూర్యం ప్రత్యేకంగా టిక్కెట్టు కొనుక్కుని మరీ అమెరికా ఎందుకెళ్ళాడో అర్ధం కాలేదు! ఇది డబ్బులు వృధా చేసుకోడమేనని నా అభిప్రాయం. అణుబాంబు గూర్చి అంత తెలిసిన మా సూర్యంకి, ఇట్లాంటి చిన్నవిషయాల పట్ల అవగాహన లేకపోడం విచిత్రం కాక మరేవిటి?

సూర్యం ఆలోచన సైన్స్ ఫిక్షన్లో ప్రెడిక్షన్‌లాగా మిగిలిపోయింది. మా ఇళ్ళు పదంస్తుల మేడలుగా మారడం అటుంచి -  ప్రస్తుతం పాడుబడి కూలిపోడానికి సిద్ధంగా వున్నాయి. ఆ విధంగా నలభయ్యేళ్ళ క్రితం అణుబాంబు పేల్చినా - మేవఁనుకున్న మార్పు రాలేదు. కావున ఈ విషయవూఁ ఇక్కడితో వదిలేస్తాను.

హమ్మయ్యా! నా ఆలోచనల సుడులు, జలపాతాలూ రాసేశాను. ఇప్పుడు హాయిగా వుంది!

ఇకిప్పుడు వర్తమానంలోకి వస్తాను.

మా గుంటూర్ని స్మార్ట్ సిటీగా మార్చేస్తున్న కృష్ణార్జునుల వంటి చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు (వీరిలో ఎవరు కృష్ణుడో, ఎవరు అర్జనుడో నాకు తెలీదు) గార్లకి మా గుంటూరు ప్రజల తరఫున - కృతజ్ఞతతో కరిగిపోతూ, వినయంతో వొంగిపోతూ, ఆనంద భాష్పాలు కారుస్తూ - 2090 వరకూ కూడా మీరే మన నాయకులుగా వుండిపోవాలని ఆ భగవంతుని ప్రార్ధిసూ -

ఒక (భవిష్యత్) స్మార్ట్ సిటీ పౌరుడు.


ముగింపు -

ఇంతకీ - 'స్మార్ట్ సిటీ' అనగానేమి?

(నాకు మాత్రం ఏం తెలుసు?)

ఇన్నాళ్ళూ గుంటూరు నాలాంటి స్మార్ట్ పీపుల్‌కి నిలయంగా వుంది. ఇకముందు ఊరికి ఊరే స్మార్ట్‌గా అయిపోతుంది! అదీ సంగతి!

సొల్లు చెప్పకు, తెలిస్తే సరైన సమాధానం చెప్పు. లేదా నోర్మూసుకో!

(పెళ్ళిసందేహం తీర్చిన అమ్మ మంచాన వుంది. అణుబాంబు గూర్చి అణువంత విడమర్చిన సూర్యం దూరంగా వున్నాడు. ఇప్పుడెలా? ఏదోటి చెప్పి గుంటూరు పరువు కాపాడాలి. లేనిచో - గుంటూర్ని స్మార్ట్ సిటీ అనకపోతే పోయె, ఈడియట్ సిటీ అంటారేమో! )

(picture courtesy : Google)

Monday, 8 July 2013

ద గ్రేట్ బ్రాడీపేట మ్యూజిక్ బ్యాండ్

ముందుమాట :


ఈ పోస్టులో నా చిన్ననాటి స్నేహితుల జ్ఞాపకాలు రాస్తున్నాను. ఇది పూర్తిగా నా సొంతగోల. ఓ స్నేహితుడి కోసం నేన్రాసుకున్న తీపిజ్ఞాపకం. ఇది నా రాత కాబట్టి.. నాకంటూ ఓ బ్లాగుంది కాబట్టి.. పబ్లిష్ చేస్తున్నాను. మీకు విసుగనిపించవచ్చు. అయినా చదివేస్తాం అంటే.. మీ ఇష్టం!


టీవీలో ఏదో అమితాబ్ బచ్చన్ పాత సినిమా వస్తుంది. ఓ రెండు నిమిషాలపాటు కన్నార్పకుండా అమితాబ్ ని అలానే చూస్తుండిపొయ్యాను. గతమెంత ఘనము! రోజులెంత తొందరగా మారిపోయ్యాయి!

నేనొకప్పుడు ఇదే అమితాబ్ ని చూస్తూ మైమరచి పొయ్యేవాణ్ని. అమితాబ్ రేఖతో రొమేన్స్ చేస్తుంటే పులకరించిపొయ్యేవాణ్ని. అతని ఫైటింగులు చూస్తూ పరవశించిపోయేవాణ్ని. ఇప్పుడు అదే అమితాబ్ ని చూస్తుంటే పులకరింత, పలవరింత కాదు గదా.. కనీసం చక్కలిగింత పెట్టినట్లుగా కూడా లేదు! కారణమేమి?

వందోసారి రాస్తున్నాను.. ఈ భూమండలమునందు అత్యంత సుందర ప్రదేశం మా గుంటూరు (ఎవరికైనా అభ్యంతరం ఉంటే గుంటూరు సివిల్ కోర్టులో కేసు వేసుకోవచ్చు.). అందుకలదు మా బ్రాడీపేట గ్యాంగ్. మా బ్రాడీపేట సందుల్లో, గొందుల్లో విపరీతంగా క్రికెట్ ఆడేవాళ్ళం. మా సందు బౌలర్లలో డెనిస్ లిల్లీ, మైఖేల్ హోల్దింగుల్నీ.. గల్లీ బ్యాట్స్ మెన్లలో విశ్వనాథ్, సోబర్సుల్నీ చూసుకుని ముచ్చటనొందేవాళ్ళం.

మాకు విపరీతంగా సినిమాలు చూసే గొప్పఅలవాటు కూడా ఉంది. అప్పటికి మా సినీవీక్షక ప్రస్తానం విఠలాచార్య కత్తియుద్దాలతో మొదలై.. రామారావు ఫైటింగుల మీదుగా పయనించి.. అమితాబ్ బచ్చన్ హిందీ సినిమాల వద్దకి చేరుకుంది.

గుంటూర్లో అమితాబ్ బచ్చన్ సినిమాలు ఎక్కువగా రంగమహాల్లోకి, తక్కువగా విజయలక్ష్మిలోకి వచ్చేవి. ఏ సినిమా ఏ హాల్లోకి వచ్చినా ఒక్కోసినిమా ఒకటికి రెండుసార్లు చూసేవాళ్ళం. మాకదో దీక్ష, నోము, యజ్ఞం, వ్రతం. అమితాబ్ సినిమాలకి మొదట్రోజు జనం ఎక్కువగా ఉండేవాళ్ళు. స్త్రీల టికెట్ కౌంటర్ వద్ద క్యూ పోట్టిదిగానూ, పురుషుల కౌంటర్ వద్ద క్యూ పొడవుగానూ ఉండేది.

మా రావాయ్ గాడు ("గల్తీ బాత్ మత్ కరో భాయ్!" ఫేం) ఆడవాళ్ళ టికెట్ కౌంటర్ల వద్ద చేతులోని రూపాయిల నోట్లు చూపుతూ, ఊపుతూ.. అత్యంత దీనంగా, జాలిగా 'అక్కా టికెట్! అమ్మా టికెట్!' అంటూ టికెట్లు తీసివ్వమని యాచించేవాడు. వీడి దొంగమొహాన్ని చూసి ఎవరో ఒక మహాతల్లికి గుండె కరిగేది. తత్ఫలితంగా మా చేతిలో టికెట్లు పడేవి.

అమితాబ్ సినిమాల్లో కిశోర్ కుమార్ పాటలుండేవి. అవి మిక్కిలి మధురంగా మనసును మైమరపించేవి. అమితానందంతో అమితాబ్ సినిమాని చూసిన మమ్మల్ని.. సినిమా తరవాత కిశోర్ గానమాధుర్యం ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ట్యూన్లలో హచ్ కుక్కలా వెంటాడేవి. సింగిల్ మాల్ట్ విస్కీలా మత్తెక్కించేవి.

ఇక్కడిదాకా పెద్ద విశేషం కాదు. ఇట్లాంటి అనుభూతులు దాదాపు అన్ని స్నేహబృందాలకి అనుభవమే. అయితే మాకు ఇక్కణ్నించే చాలా పని మొదలయ్యేది. మా బ్రాడీపేట గ్యాంగ్ లో అతి ముఖ్యుడు సూర్యం. హిందీ సినిమాల ప్రేమికుడు.

'పొద్దస్తమానం హిందీ సినిమాలేనా?' అని గింజుకునే నన్ను.. నా జుట్టు (ఆ రోజుల్లో నా తలకి ఫుల్లుగా జట్టుండేది) పట్టుకుని మరీ లాక్కెళ్ళేవాడు. సినిమా చూసిన సూర్యాన్ని కిశోర్ కుమార్ అవహించేవాడు.. పూనేవాడు. వెంటనే తీవ్రాతితీవ్రంగా కిశోర్ కుమార్ పాటల్ని అందుకునేవాడు.




బ్రాడీపేట రెండోలైన్ తొమ్మిదో అడ్డరోడ్డులో ఓంకార్స్ టైప్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. దాని ఎదురుగా మా సూర్యం ఇల్లు. అది మా బ్రాడీపేట గ్యాంగ్ హెడ్ క్వార్టర్స్. అక్కడ మేం ఒక ఆర్కెస్ట్రా కూడా డెవలప్ చేశాం. ఆర్కెస్ట్రా లీడ్ సింగర్ సూర్యం.

ఒకడు తుప్పుపట్టిన బుల్ బుల్ ప్లే చేస్తాడు. ఇంకోడు దుమ్ము పట్టిన మౌతార్గాన్. ఇట్లా ఎవరికీ దొరికిన వాయిద్యంతో వాడు రెడీ అయిపోయ్యేవాడు. ఇక్కడ మాది ఇండియన్ ఒలింపిక్స్ స్పూర్తి (ఏం వాయించాం, ఎంత బాగా వాయించాం అన్నది ప్రధానం కాదు.. అసలు ఆర్కెస్ట్రాలో ఉన్నామా లేదా అన్నదే పాయింట్).

ఇప్పుడు కొంచెంసేపు నా గిటార్ గోల. నేనో గిటార్ కొనుగోలు చేసి శిక్షణ నిమిత్తం ఆర్.అగ్రహారంలో ఒక గిటార్ టీచర్ దగ్గర చేరితిని. ఆయన ఎంతసేపటికీ ఏదో నోట్స్ ఇచ్చి (అది నిలువు అడ్డగీతలతో ఉండేది) ప్రాక్టీస్ చెయ్యమనేవాడు. నాకు వేళ్ళు మంట తప్ప ఏదీ పలికి చచ్చేదికాదు.

మొత్తానికి కిందామీదా పడి 'Come September' ప్లే చెయ్యడం నేర్చుకున్నాను. దాన్నే కొంచెం మార్చి 'The Good, the Bad and the Ugly' (అంటూ) ప్లే చేసేవాణ్ణి. కావున మా గ్రూప్ లో నేనే లీడ్ గిటారిస్టునని అని వేరే చెప్పక్కర్లేదనుకుంటా!

ఒక్క ఇంస్ట్రుమెంట్ కూడా తెలీని మా రావాయ్ గాడు అత్యుత్సాహంగా ఆర్కెస్ట్రాలో ఇరుక్కునే వాడు. ఇంట్లో అటక మీద నుండి పెద్ద బొచ్చె దించి.. దాన్ని బోర్లేసి పుల్లల్తో వీరబాదుడు బాదేవాడు. వాడు మా డ్రమ్మర్! పాట పాడటం రానివాళ్ళు, తమ బొంగురు గొంతులతో లీడ్ సింగర్ కి గొంతు సాయం చేసేవాళ్ళు. వాళ్ళని కోరస్ సింగర్స్ అందురు.

ఆ రోజుల్లో ఇళ్ళల్లో టేప్ రికార్డర్ ఉండటం కాదు.. చూసినవాళ్ళూ తక్కువే (ముప్పైయ్యైదేళ్ళ క్రితం ఇళ్ళల్లో రేడియో ఉండటమే గొప్ప)! మా సూర్యం ఇంట్లో నేషనల్ పానాసోనిక్ టేప్ రికార్డర్ ఉండేది. అదిచూసి కొందరు ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టేవాళ్ళు. (అసలు ఆ టేప్ రికార్డర్ ఉండటం మూలానే మేం ఆర్కెస్ట్రా సిద్ధం చేశాం).


                            (ఐదేళ్ళ క్రితం తీసిన  పై ఫోటో ఒకప్పటి మా హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు లేదు. నేలమట్టం అయిపోయింది.) 


మెయిన్ హాల్ పక్కనున్న ఒక చిన్న రూం మా రికార్డింగ్ స్టూడియో. గాయకుడు, వాయిద్యగాళ్ళు ఇరుక్కుని చాపల మీద కూర్చునేవాళ్ళం. ఇంతమంది ఇన్నిరకాలుగా ఆర్కెస్ట్రాలో ఇరుక్కున్నా ఇంకొందరు మిగిలిపోయ్యేవాళ్ళు. వాళ్ళు self employment scheme quota లో సంగీత దర్శకుల అవతారం ఎత్తేవాళ్ళు.

అనగా.. లక్ష్మీకాంత్ ప్యారేలాల్, శంకర్ జైకిషన్ స్టయిల్లో చేతులు పైకెత్తి.. పైకికిందకీ ఊపూతూ ట్రూప్ మొత్తం తమ చేతిసన్నల్లో ఉండేట్లు చేసుకునేవారు. ఎవరెవరు ఏ బిట్ ఎలా వాయించాలి అన్నది 'డిస్కస్' చేసుకుని.. ఇంకొద్దిసేపు ముఖ్యగాయకుడైన సూర్యంతో మరింత లోతుగా 'డిస్కస్' చేసి.. 'రెడీ! వన్.. టూ.. త్రీ.. ' అనే countdown తో ఆర్కెస్ట్రా ఫుల్ స్వింగ్ తో మొదలయ్యేది.

ఆర్కెస్ట్రా ఎంత రిచ్ గా ఉన్నప్పటికీ గాయకుడి వాయిస్ ని డామినేట్ చెయ్యరాదు అనే గొప్ప సాంకేతిక విశేషం మాకు అప్పుడే తెలుసు. అంచేత సూర్యాన్ని మైక్రోఫోన్ కి దగ్గరగా కూర్చోబెట్టి పాడించేవాళ్ళం. ఆ సత్తుబొచ్చెల డ్రమ్మర్ గాణ్ణి దూరంగా ఉంచేవాళ్ళం. తప్పదు మరి.. ఒక quality output కోసం ఆ మాత్రం ప్లాన్లెయ్యాలి.

ఈ విధంగా కిశోర్ పాటల్ని రికార్డ్ చేసుకునేవాళ్ళం. పిమ్మట మైసూర్ కేఫ్ లో శంకరనారాయణ పర్యవేక్షణలో ఇడ్లీ సాంబార్ గ్రోలి, కాఫీ సేవించి, క్రేన్ వక్కపలుకుల రుచితో సేద తీరేవాళ్ళం. ఆ తరవాత మేం రికార్డ్ చేసుకున్న పాటల్ని పదేపదే replay చేసుకుంటూ వినేవాళ్ళం. నాకా పాటలు వీనులు విందుగా ఉండేవి. కాకి పిల్ల కాకికి ముద్దు అని అనుకోకండి. ఒట్టేసి చెబుతున్నా. అదొక మధురమైన గానం. అద్భుతమైన ఆర్కెస్ట్రా!

'వాళ్ళు రికార్డ్ చేసిన పాట వింటుంటే పిశాచాలు పాళీభాషలో చేస్తున్న మృత్యుఘోషలా ఉంటుంది. కంకరరోడ్డు మీద చేస్తున్న సైనిక కవాతు వలె ఉంటుంది. ఆ ఆర్కెస్ట్రా విమానం కూలిపోతున్నట్లుగా భీకర శబ్దాలతోనూ, తోకతెగిన ఊరకుక్క రోదనలా పరమ దరిద్రంగానూ ఉంటుంది.' అని మా శత్రువర్గ దుష్టాధములు ప్రచారం చేసేవాళ్ళు.

ఉత్తమ కళాకారులకి ఆత్మవిశ్వాసమే తరగని పెన్నిధి. విమర్శలకి కుంగిపోరాదు. పొగడ్తలకి పొంగిపోరాదు. ఇవన్నీ కళాకారులమైన మాకు బాగా తెలుసు. అంచేత కువిమర్శలకి తొణకక, బెణకక మా బ్రాడీపేట మ్యూజిక్ బ్యాండ్ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోయి అనేక ఆణిముత్యాల్ని రికార్డ్ చేసింది.

అనాదిగా కళలకి, పరీక్షలకి చుక్కెదురు. అంచేత ఓ పరీక్షల సమయాన మా బ్యాండ్ చెట్టుకొకరు, పుట్టకొకరుగా అయిపోయి కనుమరుగైపోయింది. ఆ విధంగా తెలుగు కళాప్రపంచం తీరని నష్టానికి గురయ్యింది! 

చివరి మాట :

ఈ పోస్ట్ నా ప్రాణస్నేహితుడు సూర్యం కోసం రాశాను.

'సూర్యం! దిస్ ఈజ్ ఫర్ యూ.'

(గంటి సూర్యప్రకాష్. స్నేహితులకి ప్రేమగా 'సూర్యం'. గత ముప్పైయ్యేళ్ళుగా న్యూజెర్సీ పట్టణంలో మత్తు వైద్య నిపుణుడిగా స్థిరపడ్డాడు. ఈరోజుకీ తన పాటలతో అమెరికావాసుల్ని అలరిస్తున్నాడు.)

చివరి మాటకి చివరి మాట :

ముందుమాట పట్టించుకోకుండా ఇక్కడదాకా చదువుకుంటూ వచ్చారా!? అయినచో మీరు ఉత్తములు. మీకు ఆయురారోగ్యాలు, ధనకనక అష్టైశ్వర్యాలు సంప్రాప్తించుగాక!

శ్రీశ్రీశ్రీ రమణానంద మహర్షి. 

(photos courtesy : Google)

Monday, 15 April 2013

"ఇంతేరా ఈ జీవితం.. తిరిగే రంగులరాట్నం!"


ఒక ముఖ్యమైన పెళ్లి. తప్పకుండా వెళ్ళాలి, వెళ్లి తీరాలి. అంటే పెళ్ళి ముఖ్యమైనదని కాదు. వెళ్ళకపోతే ఆ పెళ్ళికి పిలిచినవాడు రక్తకన్నీరు కారుస్తాడు, ఆపై నాతో స్నేహం మానేస్తాడు, నన్నో శత్రువుగా చూస్తాడు. ఈ వయసులో కొత్త స్నేహాల్ని వెతుక్కునే ఓపిక లేదు. అందుకని చచ్చినట్లు వెళ్ళాలి. ఆ రకంగా ఇది చాలా ముఖ్యమైన పెళ్లి.

మా ఊళ్ళో ఆటో ప్రయాణం నాకు ఇష్టమని చెబుతూ "నా పులి సవారి (ఇది చాలా డేంజర్ గురూ!)" అంటూ ఒక టపా రాశాను. అయితే నా ఆటో ప్రయాణ సాహస యాత్రలతో.. నాకున్న డస్ట్ ఎలెర్జీ వల్ల.. ఎలెర్జిక్ రైనైటిస్ (అర్ధం కాలేదా? జలుబు!) తిరగబెడుతుండటం వల్ల.. నాకు కారే గతని నా ముక్కు వైద్యుడు హెచ్చరించాడు. ఆల్రెడీ ముక్కుకి రెండు ఆపరేషన్లు చేయించుకున్న కారణాన.. ఆయన మాట గౌరవిస్తూ.. కారుని ఆశ్రయించాను.

నా డ్రైవర్ వయసులో నాకన్నా పెద్దవాడు. మంచివాడు. నిదానమే ప్రధానం అని నమ్మిన వ్యక్తి. అందుకే కారు స్లో మోషన్లో నడుపుతుంటాడు. ఒకసారి కొద్దిగా స్పీడ్ పెంచమన్నాను. 'మేడమ్ గారు ఊరుకోరు సార్!' అన్నాడు. అప్పట్నుండి నేనతనికి ఏమీ చెప్పలేదు. మన్మోహన్ సింగ్ లా బుద్ధిగా కూర్చుంటున్నాను. ఇదీ ఒకందుకు మంచిదే! నా పురము, నా పురజనుల్ని నిశితంగా, ప్రశాంతంగా గమనించే అవకాశం కలుగుతుంది.


అసలు నాకు మా గుంటూర్లో కారు ప్రయాణం అంతగా నచ్చదు. కారణం.. ఈ ఊళ్ళోనే నేను ఎన్టీఆర్ సినిమాలు చూడ్డం కోసం మండుటెండలో గంటల తరబడి సినిమా క్యూల్లో నించున్నాను. 'ముల్కీ డౌన్ డౌన్!' (నాకప్పుడు ముల్కీ అంటే ఏంటో తెలీదు) అంటూ దుమ్ము కొట్టుకుంటూ రోడ్లన్నీ నడిచాను. ఇచ్చట రోడ్లు, ధుమ్ము, ధూళి, ఉమ్ములు, ఉచ్చలు.. అన్నీ నాకలవాటే!

అంచేత కార్లో వెళ్తూ పరిసరాల్ని పరికిస్తుంటే.. ఏదో శవపేటిక లాంటి డబ్బాలోంచి ఊరిని చూస్తున్న భావన కలుగుతుంటుంది. ప్రజలతో సంబంధాలు తెగిపోయిన రాజకీయ నాయకుళ్ళా ఫీలవుతాను. అయిననూ తప్పదు. వయసు, అనారోగ్యం.. దురదృష్టవశాత్తు.. నన్ను జయించాయి.

సరే! రోడ్లన్నీ ఆటోల సమూహం. చీమల్లా మందలు మందలుగా జనం. ఇరువైపులా తోరణాల్లా రంగుల ఫ్లెక్సీలు. ఏదో కొత్త సినిమా రిలీజనుకుంటా. అయితే నాకు ఆ ఫ్లెక్సీల్లో మొహాలు తెలీదు. ఒకడు సెల్ ఫోన్లో మాట్లాడుతూ.. ఇంకోడు నల్లకళ్ళజోడుతో.. చిత్రవిచిత్ర భంగిమలలో ఎవరెవరివో మొహాలు. వీళ్ళంతా కొత్త హీరోలా?

కాదు.. కాదు. పరిశీలనగా చూడగా.. ఆ మొహాలు హీరోలవి కాదు.. ఆ హీరోకి అభినందనలు చెబుతున్న అభిమానులవి! అయితే మరి మన హీరోగారెక్కడ? ఫ్లెక్సీలో ఓ మూలగా ఇరుక్కుని బేలగా చూస్తున్నాడు! అభిమానం హద్దులు దాటడం అంటే ఇదే కామోలు! డబ్బు పెట్టేవాడిదే ఫ్లెక్సీ.. ఫ్లెక్సీ పెట్టించినవాడే అభిమాని!

దార్లో అక్కడక్కడా.. కళ్యాణ మంటపాలు. మంటపాల ఎంట్రన్స్ వద్ద 'నేడే చూడండి' అన్నట్లు పెళ్లి చేసుకునేవాళ్ళ భారీ ఫ్లెక్సీలు! బరువైన నగలతో పెళ్ళికూతురు, శర్వాణిలో పెళ్ళికొడుకు.. ఒకళ్ళ మీద ఇంకోళ్ళు పడిపోయి.. దాదాపు కౌగలించుకున్నట్లున్న పోజులతో ఫోటోలు. వాటిపై ఫోకస్ లైట్లు. కొంపదీసి ఈ జంటలకి ఇంతకుముందే పెళ్ళైపోయిందా!

ఓహ్! ఇప్పుడు ఎంగేజ్ మెంట్ కూడా పెళ్ళి తరహాలో చేస్తున్నారు కదూ! బహుశా అప్పటి ఫోటోలై ఉంటాయి. అయితే.. ఆ ఫోటోలతో ఇంత గ్రాండ్ గా ఫ్లెక్సీలెందుకు పెట్టారబ్బా! బహుశా.. నాలాంటి ఆబ్సెంట్ మైండెడ్ ఫెలో పొరబాటున ఒక పెళ్ళికి వెళ్ళబోయి ఇంకో పెళ్ళికి వెళ్ళకుండా ఆపడానికయ్యుంటుంది. సర్లే! పెళ్ళంటే నూరేళ్ళ మంట! ఈ ఒక్కరోజైనా ఆర్భాటంగా ఉండనిద్దాం. మన సొమ్మేం పోయింది!?
పెళ్ళి జరుగుతున్న హాల్లో అడుగెట్టాను. అది చాలా పెద్ద హాల్. ఎదురుగా పెళ్ళికొడుకు, కూతురు.. నమస్కారం పెడుతున్నట్లు చేతులు జోడించి.. శిలావిగ్రహాల్లా కూర్చునున్నారు. ఒకపక్క అక్షింతలు వెయ్యడానికి ఓ పెద్ద క్యూ ఉంది. నేను కూడా క్యూలో నిలబడి.. అక్షింతలు వేస్తూ విడియోలో హాజరు వేయించుకుని 'హమ్మయ్య' అనుకున్నాను. నా స్నేహం నిలబడింది. శీలపరీక్షలో నెగ్గాను!

పెళ్ళికొడుకు మరీ అమాయకుళ్ళా ఉన్నాడు. వీడికి ముందుంది ముసళ్ళ పండగ. వాణ్ణి పరీక్షగా చూస్తే.. అమ్మోరికి బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్న మేకపిల్లలా అనిపించాడు. ఏం చేస్తాం? ఈ వెధవల గూర్చి "దీపం పురుగుల అజ్ఞానం!" అంటూ ఓ పోస్టు కూడా రాశాను. సమాజానికి నా సందేశమైతే ఇచ్చాను గానీ.. చదివేవాడేడి?

సరే! వచ్చిన పని అయిపోయింది. ఇవ్వాళ ఆదివారం. కొంపలు ముంచుకుపోయే పన్లేమి లేవు. తెలిసినవాడెవడూ కనబడ్డం లేదు. కొద్దిగా ఆ భోజనాల వైపు వెళ్ళి చూస్తే పోలా! అనుకుంటూ అటుగా నడిచా. అక్కడందరూ చేతిలో ప్లేట్లతో దర్సనమిచ్చారు. క్షణకాలం ముష్టివాళ్ళు సామూహికంగా బిక్షాపాత్రలతో తిరుగాడుతున్నట్లుగా అనిపించింది.

నాకా పెళ్ళిలో భోంచేసే ఉద్దేశ్యం లేదు.. అయినా ఆహార పదార్ధాలు చూట్టం మూలంగా జిహ్వాచాపల్యం కలుగుతుందేమోనని భోజన పదార్ధాల వైపు దృష్టి సారించాను. నాకు తెలిసిన వంకాయ, బీరకాయ, దొండకాయల కోసం వెదికాను. ఎక్కడా కాయగూరల అనవాళ్ళు లేవు. అక్కడున్నవన్నీ చూడ్డానికి తప్పితే తినేందుకు పనికొచ్చేట్లుగా లేవు. మంచిదే. తినేవాడు తింటాడు. లేపోతే లేదు. ఎవడి గోల వాడిది.

ఈలోగా.. మదీయ మిత్రుడొకడు కనిపించాడు. వాడి పక్కన నగలు, పట్టుచీర మోస్తూ ఒక నడివయసు మహిళ.. అతని భార్య అనుకుంటాను.. నన్ను చూస్తూ పలకరింపుగా నవ్వాడు. సన్నగా నవ్వుతూ ముందుకు సాగిపోయాను. భార్య పక్కన ఉన్నప్పుడు స్నేహితుల్తో మాట్లాడరాదనే నియమం నాకుంది. ఈ విషయంపై "నమస్కారం.. అన్నయ్యగారు!" అంటూ ఓ పోస్టు కూడా రాశాను.

ఫంక్షన్ హాల్ బయటకొచ్చి డ్రైవర్ కోసం ఫోన్ చేశాను. అతను భోంచేస్తున్నాట్ట. రోడ్డుపై నిలబడి ఫంక్షన్ హాల్ వైపు దృష్టి సారించాను. కళ్ళు చెదిరే లైటింగ్! పక్కనే చెవులు పగిలే మోతతో జెనరేటర్లు! కొంపలు మునిగిపోతున్నట్లు హడావుడిగా లోపలకెళ్ళేవాళ్ళు.. బయటకొచ్చేవాళ్ళు. ఎందుకో!

"ఇంతేరా ఈ జీవితం. తిరిగే రంగులరాట్నం.. " అనే ఘంటసాల పాట జ్ఞాపకం వచ్చింది. పుట్టేవాళ్ళు పుడుతూనే ఉంటారు. పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్లు చేసుకుంటూనే ఉంటారు. ఇంకోపక్క చచ్చేవాళ్ళు చస్తూనే ఉంటారు! ఘంటసాల పాటలో ఎంత అర్ధం ఉంది!



(photos courtesy : Google)

Thursday, 31 January 2013

స్త్రీలని గౌరవించండి.. లేదా అడుక్కుతినండి! (మా స్కూలు కబుర్లు)



అనగనగా ఒక బడి. ఆ బడి పేరు శ్రీమాజేటి గురవయ్య హైస్కూలు. అది గుంటూరు పురమునకే తలమానికముగా బ్రాడీపేట యందు వెలసియున్నది. మా బడి నావంటి ఎందఱో అజ్ఞానులకి విజ్ఞానాన్ని ప్రసాదించిన ఒక చదువుల నిలయం.

ఇప్పుడు నేను రాస్తున్న కబుర్లు ఎర్లీ సెవెంటీస్ (1970-3) నాటివి కావున.. అది ఆ రోజుల్లో ఒక రోజు. సమయం ఉదయం ఎనిమిది గంటలు. స్థలం మా స్కూల్ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం. విద్యార్ధులందరం తరగతుల వారిగా వరసలో నించునున్నాం. ఇలా నించోడాన్నే 'అసెంబ్లీ' అందురు.




మా స్కూల్లో 'వందేమాతరం' రికార్డుని పిన్ను మార్చకుండా అదే పనిగా వేలసార్లు తిప్పినందువల్ల.. రికార్డ్ అరిగిపోయి చాలా రోజులైంది. రికార్డ్ ప్లేయర్ కి 'కీ' ఇచ్చి పబ్లిక్ ఎడ్రెస్ సిస్టంలో (యాంత్రికంగా, నిర్వికారంగా) ప్లే చెయ్యడం మొదలెట్టాడు గోపాలరావు.

గోపాలరావు మా సైన్స్ లేబొరేటరీ అసిస్టెంట్. అతని శరీరచాయ నల్లగాను, తలంతా ముగ్గుబుట్టగాను ఉండుటచే బ్లాక్ అండ్ వైట్ ఫోటో నెగెటివ్ లా అనిపిస్తుంటాడు. చిటపట ధ్వనుల మధ్య.. వినబడీ వినబడనట్లు 'వందేమాతరం' అంటూ వణుకుతూ గీతం మొదలైంది.

మాకు హెడ్ మాస్టారు శ్రీ వల్లూరి జగన్నాధరావు గారు. తెల్ల చొక్కా, నల్ల పేంటు, దళసరి ఫ్రేము కళ్ళద్దాలు, దబ్బపండు శరీర చాయ. దుర్యోధనుని చేత గదా దండము వలె ఆయన చేతిలో పొడవాటి కేన్ బెత్తం. ఆయన సింహంలా స్టేజ్ మీద నిలబడి ఉన్నారు. కనుసన్నల్లో అందర్నీ గమనిస్తున్నారు. ఆయనంటే మాకు భ..భ.. భయం. హ.. హ.. హఢల్!

అందుకు అనేక కారణాలు. మన కళ్ళల్లోకి చూస్తేనే ఆయనకి మనం చదువుతున్నామో, లేదో తెలిసిపోతుంది.. ట! అందుకే (తెలివిగా) నేనెప్పుడూ ఆయన కళ్ళల్లోకి చూళ్ళేదు. ఆయన కేన్ బెత్తాన్ని భారీగా వాడతారు. ఆయన రోజూ ఈ 'అసెంబ్లీ'ని పార్లమెంట్ స్థాయిలో చాలా సీరియస్ గా నిర్వహించేవారు.




'వందేమాతరం' అయిపొయింది. ఒక 'రాముడు బుద్ధిమంతుడు' వంటి విద్యార్ధి ఇంటి దగ్గర రాసుకొచ్చిన వివేకానందుని ప్రవచనాలు, గాంధీ సూక్తులు.. మైకులో పెద్దగా అరుస్తున్నట్లు చదివాడు (సాధారణంగా ఇట్లాంటి గొప్ప పనులు ఏ పుచ్చా గాడో, పాటిబండ్ల గాడో చేస్తుంటారు. వారిద్దరూ మైకు ముందున్న ఆ నాలుగు క్షణాలు దేశనాయకుల్లా తెగ ఫీలైపొయ్యేవాళ్ళు).

వల్లూరి జగన్నాధరావుగారు గొంతు సరి చేసుకుని మైక్ లో మాట్లాడటం మొదలెట్టారు.

"మనది పవిత్ర భారత దేశం. మనమంతా భారతీయులం. గాంధీ తాత ఎంతో కష్టపడి మనకి స్వాతంత్ర్యం తెచ్చారు. మనం ఈ పవిత్ర భారత దేశ పౌరులుగా గాంధీ గారి ఆశయాలు నెరవేర్చాలి. అందువల్ల మనమంతా అత్యంత బాధ్యతతో, క్రమశిక్షణగా జీవించాలి. అమ్మానాన్న దైవస్వరూపులు. వారిని గౌరవిద్దాం. మీరు ఉదయాన్నే ఫోరింటికి లేచి ఫైవింటి దాకా చదువుకోండి. సిక్సింటిదాకా అమ్మకి ఇంటి పనుల్లో సాయం చెయ్యండి. సెవెనింటికల్లా స్కూలుకి రెడీ అయిపోండి." (ఆయనకి 'ఇంటి' భాష అలవాటు.)

ఇంతలో మైక్ 'కుయ్' మని శబ్దం చేసింది. గోపాలరావు యాంప్లిఫైర్ కంట్రోల్స్ లో ఏదో మీటరు ముందుకి వెనక్కి తిప్పాడు. మొత్తానికి శబ్దం మాయమైంది. జగన్నాధరావుగారు మళ్ళీ మాట్లాడటం మొదలెట్టారు.

"స్త్రీలని గౌరవించండి. వారు లక్ష్మీ స్వరూపులు. సరస్వతి స్వరూపులు. అంటే దానర్ధం ఏమిటి? వారిలో లక్ష్మీ,సరస్వతి దేవతలు దాగి ఉంటారు. కానీ మనకి బయటిక్కనబడరు. అయితే మనమేమన్నా తప్పు చేస్తున్నామా అని లోపల్నుండి గమనిస్తుంటారు. అదే గమ్మత్తు. అంచేత మీరు ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టారో.. లక్ష్మీసరస్వతి దేవతలకి కోపం వస్తుంది. అప్పుడు సరస్వతీదేవి మీకు అన్ని పరీక్షల్లొ గుండుసున్నా వచ్చేట్లు చేస్తుంది. లక్ష్మీదేవి మీ జేబులో పైసా కూడా ఉండనివ్వదు. ఇప్పుడు రోడ్ల మీద అడుక్కు తింటున్నవాళ్ళంతా ఒకప్పుడు స్త్రీలని హింసించినవాళ్ళే. అర్ధమయ్యిందా.. " ఆయన ఉపన్యాసం ఈ ధోరణిలో ప్రతిరోజూ ఓ ఐదు నిముషాలు సాగుతుంది.

రోజూ 'సాగే' ఆయన ఉపన్యాసంలో ఎక్కువ భాగం రిపిటీషన్. నాకు విసుగు పుట్టేది. కాళ్ళు నొప్పెట్టేవి. ఆయన ఉపన్యాసం తరవాత దేశం కోసం రెండు నిముషాలు ధ్యానం! ధ్యానం అంటే ఏం లేదు. చేతులు జోడించి.. కళ్ళు మూసుకుని నిలబడాలి. ఆ రెండు నిముషాలు రెండు గంటల్లా అనిపించేది. (అయితే మన హెడ్ మాస్టర్ గారు కళ్ళు తెరిచి వాచ్ కేసి చూసుకుంటూ ధ్యానం సరీగ్గా చెయ్యరని తన దొంగచూపులతో మా సత్తాయ్ గాడు కనిపెట్టాడు.)



మీకు అసెంబ్లీ రావడం ఇష్టం లేదా? అంతసేపు నిలబడలేరా? అయితే ఒక ఫెసిలిటీ ఉంది. అదే భగవద్గీత క్లాస్. హాయిగా క్లాస్ రూంలో కూర్చోవచ్చు. బ్రహ్మాండం శీను (నా క్లాస్మేట్, క్లోజ్ ఫ్రెండ్), దీక్షితులు (నాకు ఒకేడాది జూనియర్) అక్కడ టీచర్లు. వారికి స్నేహమన్న అర్ధం తెలీదు. అందుకే వారికి స్నేహధర్మం లేదు. ఇద్దరూ కలిసి మమ్మల్ని చావగొట్టి చెవులు మూసేవాళ్ళు. 'ధర్మక్షేత్రే కురుక్షేత్రే.. ' అంటూ మొదలెడతారు. వాళ్ళు ఒక లైన్ చెబితే మనం కోరస్ గా అరుస్తూ ఆ లైన్ రిపీట్ చెయ్యాలి. ఈ క్లాస్ కనీసం అరగంట. ఇది అచ్చంగా పెనం మీద నుండి పొయ్యిలోకి పడటంలాంటి దన్నమాట!

చిన్నప్పట్నుండి నాది ద్వైదీభావ స్వభావం. హోటల్లో ఇడ్లీ తినాలా? అట్టు తినాలా? అన్నది కూడా తొందరగా తేల్చుకోలేను. కాబట్టి భగవద్గీత క్లాసులో నోరు నొప్పెట్టినప్పుడు అసెంబ్లీకి.. వల్లూరు జగన్నాధరావు గారి నీతిబోధనలకి చెవులు నొప్పెట్టినప్పుడు అసెంబ్లీకి మారుతుండేవాణ్ని.



ఈ రెండూ తప్పించుకోడానికి మూడో మార్గం కూడా ఉంది. అయితే ఇది కొద్దిగా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. అది అసెంబ్లీ అయిపొయ్యే సమయానికి బ్రాడీపేట ఐదో లైన్లోంచి గోడ దూకి దొడ్డి దోవన స్కూల్లోకి రావడం. స్కూల్ అటెండర్ పరుశురాముడి దృష్టిలో పడితే ఓ మూడు పైసలు లంచం ఇచ్చి తప్పించుకోవచ్చు. అదే డ్రిల్ మాస్టర్ రామబ్రహ్మం గారి కంట్లో పడితే మాత్రం పంబరేగ్గొడతారు. మా సత్తాయ్, భాస్కరాయ్, బోడా నాగేశ్వర్రావులు దీరోదాత్తులు. వారు మాత్రమే ఈ గోడ దూకే సాహస కృత్యం చేసేవాళ్ళు. నాకు చచ్చే భయం. అంచేత నేనెప్పుడూ గోడ దూకలేదు.

సరే! ఒక పక్కన అసెంబ్లీ.. ఇంకో పక్కన భగవద్గీత. ఈ కష్టాలన్నీ దాటాం గదాని సంబరపడరాదు! క్లాస్ రూంలో పాఠాల మధ్య చాన్స్ దొరికితే చాలు (దొరక్కపోయినా కలిపించుకుని మరీ).. పరిమి ఆంజనేయశర్మ గారు, కల్లూరి నరసింహమూర్తి గారు, మాడభూషి భవనాచారి గారు, పోలూరి శ్రీమన్నారాయణ గారు.. మా గురువు గార్ల లిస్టు పెద్దది.. నీతి బోధన వాయింపుడు కార్యక్రమం రోజూ ఉండనే ఉంటుంది.




"మీరు డాక్టర్లవుతారా, ఇంజనీర్లవుతారా అనేది మాకు అనవసరం. అవన్నీ భుక్తి కోసం విద్యలు. మీరు మంచి పౌరులుగా ఎదగాలని మా కోరిక. పొరబాటున కూడా సమాజానికి హాని చెయ్యరాదు. మా శిష్యు లైన మీరు వెధవ పనులు చేస్తే మాకు, మన స్కూలుకి అవమానం." అంటూ ఏదో సందర్భంలో చెబుతూనే ఉంటారు.

ఇప్పుడు చెప్పండి. పొద్దస్తమానం ఈ సూత్రాల మధ్యన పెరిగిన నేను.. చదువు నిర్లక్ష్యం చేస్తూ.. అమ్మాయిలకి సైట్లు కొడుతూ, బీట్లెయ్యాలంటేనే ఎంతో కష్టపడాలి. నేను పుట్టుకతో బద్దకస్తుడను. అంచేత.. కష్టపడుతూ ఆ పన్లన్నీ చేసే ఓపిక లేక.. చదువుకుని సుఖపడుతూ బాగుపడిపొయ్యాను. చెడిపోవలసిన వయసులో బాగుపడి పోవుట చేత.. అలవాటై పొయ్యి.. అదే కంటిన్యూ చేసేశాను.




మొన్నామధ్య నా గురవయ్య హై స్కూల్ స్నేహితుడు కలిశాడు. అతగాడు ఢిల్లీలో ఏదో డిఫెన్స్ లాబ్ లో సైంటిస్టుగా పని చేస్తున్నాడు. మాటల సందర్భాన మా స్కూల్ ప్రస్తావన వచ్చింది. మావాడు మొహం ఆవదం తాగినట్లు పెట్టాడు.

"నాకు మన స్కూల్ గూర్చి చెప్పకు. దానంత దరిద్రపు స్కూల్ ఈ లోకంలోనే లేదు." కసిగా అన్నాడు.

ఆశ్చర్యపోయాను. "నేనింకా మన గురవయ్య బళ్ళో చదువుకోడం అదృష్టం అనుకుంటున్నానే!" అంటూ నసిగాను.

"నీ మొహం అదృష్టం. అది కూడా ఒక స్కూలేనా? ప్రతిరోజూ 'స్త్రీలని గౌరవించండి, నెత్తిన పెట్టుకోండి, పూజించండి' అంటూ జగన్నాధరావు గారు నా బుర్రలో నాగార్జునా సిమెంటుతో చైనా వాల్ కట్టేశారు. నాకా దెబ్బకి ఆడాళ్లంటే గౌరవంతో కూడిన భయం లాంటిదేదో పట్టుకుంది. ఇదో రోగం. నిజం చెప్తున్నా.. ఆయన దెబ్బకి నా జీవితంలో ఏనాడూ ఒక్క ఆడపిల్ల మొహం వైపు కూడా ధైర్యంగా చూళ్ళేదు."

"అదా సంగతి!" అంటూ నవ్వాను.

"పెళ్ళయిన రోజు నుండి భార్యని కూడా గౌరవిస్తున్నాను. ఆమెని ఏనాడూ నోరెత్తి చిన్న మాట కూడా అన్లేదు. అప్పుడప్పుడు కోపం వస్తుంది. గట్టిగా మాట్లాడాలంటే జగన్నాధరావు గారి లక్ష్మీసరస్వతుల అసెంబ్లీ పాఠం గుర్తొస్తుంది. పైగా ఆయన నాకేసి గుడ్లురుముతూ చూస్తున్నట్లనిపిస్తుంది. నాకింక నోరు పెగలదు. అందుకే మా ఆవిడ నన్నో వాజమ్మలా చూస్తుంది." దిగులుగా అన్నాడు.


మావాణ్ణి జాలిగా చూశాను. మెడిసిన్ సరైన మోతాదులో వాడితేనే ఫలితం బాగుంటుంది. అదే మెడిసిన్  ఓవర్ డోసేజ్ అయిపోతే కాంప్లికేషన్లొస్తాయి. మావాడు హెడ్ మాస్టర్ గారి బోధనలని మరీ సీరియస్ గా పట్టించుకుని.. దెబ్బతిన్నాడు. ఆ విధంగా స్కూళ్ళ వల్ల లాభాలే కాదు.. నష్టాలూ ఉంటాయని అర్ధమైంది.


మనవి..


ఈ పోస్ట్ నా గురవయ్య హైస్కూల్ స్నేహితుల కోసం రాశాను. కొందరికి విసుగనిపించవచ్చు. మన్నించగలరు. ఈ పోస్ట్ చదివిన మా స్కూల్ విద్యార్ధులు.. వల్లూరి జగన్నాధరావు గారి ఫోటో పంపిన యెడల.. ఆ ఫోటో ఈ పోస్టులో ప్రచురిస్తాను.

కృతజ్ఞతలు..

DSR.మూర్తి నా ప్రాణమిత్రుడు. 'మన స్కూల్ గూర్చి రాస్తున్నాన్రా' అనంగాన్లే.. సంతోషంగా, హడావుడిగా చక్కటి ఫోటోలు తీసి పంపాడు. (చివరి చిత్రం మా స్కూల్ సంస్థాపకులు శ్రీమాజేటి గురవయ్య గారిది.)

Friday, 28 December 2012

ఆనందభవన్ లో ఆ రోజు!


అది గుంటూరు పురము. ఆ పురంబునకు బ్రాడీపేట తలమానికము. అందుకలదొక భోజనగృహము. అచట భుజించుట ఆనందదాయకము. ఆ కారణముననే కాబోలు ఆ భోజనగృహ నామధేయము ఆనందభవనముగా భాసిల్లుచుండెను. నిస్సందేహముగా ఇది సార్ధక నామధేయము.

(ఏమిటయ్యా ఈ పిశాచాల భాష? ఆ రాసేదేదో మనుషులు మాట్లాడే భాషలో ఏడిచ్చావు!)

క్షమించాలి. అలా కోప్పడకండి. తెలుగు మహాసభలు జరుగుతున్నాయ్ గదా! కొద్దిగా పాండిత్యం ప్రదర్శిద్దామని ఉబలాటపడ్డాను. మీకిష్టం లేకపోతే రాయన్లేండి. తెలుగు భాషలోనే రాస్తాను.

ఇక చదవండి..


సమయం మధ్యాహ్నం మూడు గంటలు. వేదిక గుంటూరు ఓవర్ బ్రిడ్జ్ పక్కన గల ఆనందభవన్. మాసిన నేల. అరిగిపోయిన బల్లలు. సొట్టల గ్లాసులు. నిశ్శబ్దాన్ని చేదించుకుంటూ రెండో ప్రపంచ యుద్ధ కాలపు నాటి ఫ్యాన్లు 'గరగర' మంటూ భారంగా తిరుగుతున్నాయి.

ఎదురుగా ఒక అద్దాల బీరువా. దాని వయసు సుమారు తొంభయ్యేళ్ళు. బీరువా పక్కగా పెద్ద రిఫ్రెజిరేటర్. అది ఫ్రిజ్ కనిబెట్టబడిన రోజుల్లో బ్రిటిషు వాడు స్టీమర్లో పంపించినదై ఉండవచ్చు. హాలుకి ఒక మూలగా పగిలిపోయిన వాష్ బేసిన్. పక్కనే స్టీలు బకెట్ లో నీళ్ళు.. స్టీలు గ్లాసు. గత ముప్పైయ్యేళ్ళుగా ఆ వాష్ బేసిన్లోకి నీళ్ళు రావు. రావడానికి అసలు నీళ్ళ గొట్టం ఉంటేగదా! బకెట్లోంచి గ్లాసుతో నీళ్ళు ముంచుకుని చేతులు కడుక్కోవాలి.


హోటల్ ప్రవేశద్వారం ఎడమ వైపు క్యాష్ కౌంటర్. పక్కనున్న గోడ మీద అనేక దేవతల పటాలు.. వాటికి పసుపు కుంకుమల తాలూకా మరకలు. క్యాష్ కౌంటర్ కుర్చీలో ఒక ఎర్రటి, బక్కపలచని వ్యక్తి కూర్చుని డబ్బులు లెక్కపెడుతూ.. పదులు, యాభైలు, వందలు నోట్లు కట్టలుగా కడుతున్నాడు. తెల్ల ప్యాంటు, చొక్కా. ఎత్తు అయిదడుగుల మూడంగుళాలు. ఆయనే ఆ హోటల్ యజమాని.

పేరు పురుషోత్తం. పేరుకు తగ్గట్టుగానే చాలా మంచివాడు. ఎప్పుడు నవ్వు మొహంతోనే ఉంటాడు. క్యాష్ కౌంటర్, వంటగదికి మధ్య బొంగరంలా తిరుగుతుంటాడు. అవసరమైతే క్షణంలో వంటవాడిగా మారిపోతాడు. ఒక్కోసారి కష్టమర్లు బిల్లు కట్టటానికి క్యాష్ కౌంటర్ దగ్గర నిలబడి పురుషోత్తం కోసం ఎదురు చూడవలసి ఉంటుంది.

ఎప్పటివలె ఆ రోజు కూడా ఆనందభవనం ప్రశాంత నిలయంగా.. బద్దకంగా, మత్తుగా జోగుతుంది. కష్టమర్లు తలోమూల కూర్చుని కాఫీలు, టిఫినీలు నిదానంగా ఆరగిస్తున్నారు. సప్లైర్లు గొడకి ఆనుకుని నించొని కునికిపాట్లు పడుతున్నారు.

ఇంతలో బయట నుండి  రణగొణధ్వనులు. ఏవో స్లోగన్లు. పురుషోత్తం కంగారు పడ్డాడు. గబగబ డబ్బులు సొరుగులో పెట్టేసి తాళం వేసుకుని.. ఎందుకయినా మంచిదని సొరుగుని రెండు మూడుసార్లు ఘాట్టిగా లాగి చెక్ చేసుకున్నాడు.

చూస్తుండగానే బిలబిల మంటూ ఆడవాళ్ళు.. సుమారు పది మంది.. లోపలకి దూసుకొచ్చారు. పురుషోత్తంని చుట్టుముట్టారు. కంగారు పడిపోయిన పురుషోత్తం.. ఆ గుంపులో ఒకళ్ళిద్దర్ని గుర్తు పట్టి.. 'అమ్మయ్య!' అనుకున్నాడు.

"నమస్తే అమ్మా! వణక్కం. ఎండన పడి వచ్చారు. కాఫీ తాగండి తల్లీ!" అంటూ మర్యాద చేశాడు.

నిజంగానే పాపం వాళ్ళ మొహాలు ఎండకి వాడిపొయి, కాలిన మినపట్టుల్లా ఉన్నాయి. అయితే.. ఆ వచ్చినవారు కోపంగా ఉన్నారు. ఆవేశంగానూ ఉన్నారు. వేడిగా కూడా ఉన్నారు.

పురుషోత్తం వంటశాలలోకి వినబడేలా గట్టిగా అరిచి చెప్పాడు.

"రంగరాజన్! మేడం గార్లకి పది కాఫీ!"

ఆ గుంపులో అందరిలోకి ముందు నించునున్న ఒక యువతి కోపంగా పురుషోత్తాన్ని తినేశాలా చూస్తూ..

"మేమేమీ నీ బోడి కాఫీ తాగిపోటానికి రాలేదు. అర్జంటుగా  ఈ హోటల్ మూసెయ్యమని చెప్పడానికొచ్చాం." అన్నది. ఆవిడ పొట్టిగా, బొద్దుగా ఉంది. పేరు రమాప్రభ.

పురుషోత్తం గతుక్కుమన్నాడు.

"అమ్మా! నా హోటల్ ఎందుకు.. "


అందర్లోకి వెనగ్గా నించొని.. చేతులు వెనక్కి కట్టుకుని ఆ హోటల్ని నిశితంగా పరిశీలిస్తుంది ఒక లావుపాటి వ్యక్తి. గోల్డ్ ఫ్రేం చత్వారపు కళ్ళజోడు. ఆమె ఆ టీమ్ కి లీడర్. పేరు సూర్యాకాంతం.

"ఏవిటయ్యా నీకు కారణాలు చెబితేగానీ ముయ్యవా? నా సంగతి నీకింకా తెలీదు." విసురుగా ఎడమ చేయి చూపుడు వేలుతో బెదిరించింది.

ఇంతలో గీతాంజలి ఉత్సాహంగా స్లొగన్లందుకుంది.

"విప్లవం.. వర్ధిల్లాలి. ఆనంద భవన్ డౌన్! డౌన్!!"

మిగిలినవారు గొంతు కలిపారు.

పురుషోత్తం భయపడిపోయ్యాడు. రెండు చేతులూ జోడించాడు.

"అమ్మా! మీ అందరికీ నా హోటల్ వల్ల ఇబ్బందైతే మూసేసుకుంటాను. కానీ విషయం ఏంటో నాకు అర్ధమయ్యేట్లు చెప్పండమ్మా!" అంటూ ప్రాధేయపడ్డాడు.

ఆ ఆడవారు పురుషోత్తం వినయానికి మిక్కిలి సంతోషించారు. మగాళ్ళంతా ఇంత వినయవిధేయలతో ఉంటే ఈ లోకం శాంతిసౌభాగ్యాలతో వెల్లివిరియదా? అడవిలో లేడిపిల్లని చూసి పులి జాలి పడ్డట్లు.. నక్సలైట్ నాయకుణ్ణి ఎన్ కౌంటర్ చేసే ముందు పోలీసు జాలి పడ్డట్లు.. వారంతా పురుషోత్తాన్ని చూసి జాలి పడ్డారు. ఒకళ్ళిద్దరికి పురుషోత్తాన్ని ఓదార్చాలనిపించింది గానీ.. సూర్యాకాంతానికి ఝడిసి ఊరుకున్నారు.

ఆ విప్లవనారీ లోకానికి స్పోక్స్ పర్సన్ గా వ్యవహరిస్తున్న చాయాదేవి అసలు విషయం చెప్పనారంభించింది.

"ఇదిగో అబ్బాయ్! ఇన్నాళ్ళూ మా బ్రాడీపేటలో ఆడవాళ్ళం గుట్టుగా కాపురం చేసుకుంటున్నాం. భార్యలుగా మాక్కొన్ని హక్కులుంటాయి.. నీకు తెలుసుగా?"

"అమ్మా! నాకు తెలీదు. మీరే చెప్పండి. వింటాను." పురుషోత్తం మళ్ళీ నమస్కరించాడు.

"అయ్యో నా మతి మండా! నిన్నడిగితే నువ్వేం చెబుతావు! ఎంత చెడ్డా నువ్వూ మగవెధవ్వేగా! సరే విను. నీ ఓటల్లో భోజనం అమృతంలా ఉంటుందిట. నీ కందపచ్చడి, బీట్రూట్ కూర, సాంబార్ని మా ఆయన రవణారెడ్డి కల్లో కూడా కలవరిస్తూ లొట్టలేస్తున్నాడు." అంటూ చాయాదేవి మూతి వంకర్లు తిప్పింది.

ఛాయాదేవి మాటకి పురుషోత్తం ఛాతీ గర్వంతో రెండంగుళాలు పొంగింది. సంతోషంతో సిగ్గు మొగ్గయి పొయ్యాడు. ఆనందంతో మెలికలు తిరిగిపొయ్యాడు.

ఇంతలో వెనకనుండి గిరిజ అందుకుంది.

"మా ఆయన రేలంగి మాత్రం తక్కువ తిన్నాడా? ఆఫీసు నుండి డైరక్టుగా నీ హోటలుకే వచ్చి సుష్టుగా భోంచేస్తున్నాడు. బొజ్జ ఇంకాస్త పెంచేశాడు. నేనేం చేశాను? సీతాదేవంతటి ఇల్లాల్ని. ఇంట్లో పన్లు చెయ్యమన్నాను. అంతేగా! భర్తన్నవాడు అంట్లు తోమడా? ఇల్లు చిమ్మడా? బట్టలుతకడా? ఏం! ఎవరింట్లో పని వాళ్ళు చేసుకుంటే తప్పేంటి?" ముక్కులెగరేసింది.

ఇంతలో రమాప్రభ మళ్ళీ అందుకుంది.

"మొగుడన్న తరవాత ఆ మాత్రం తిట్టుకోడానికి, తన్నుకోడానికి లేదా? నేనేమన్నా మా అక్క గీతాంజలిలా భర్తని బెల్టుతో తంతున్నానా? అసలు భర్తంటే అర్ధమేంటి? భార్య నుండి తిట్లు, తన్నులు భరించేవాడని! మేమేం చేసినా మా భర్తల్ని మంచి మార్గాన పెట్టుకోడానికేగా. అయినా నా మొగుడు రాజబాబుకి ఆ బుద్ధే ఉంటే నాకీ తిప్పలెందుకు?" అంటూ ముక్కు చీదుకుంటూ రమాప్రభ ఎమోషనల్ అయిపోయింది.

"ఒసే రమాప్రభా! మధ్యలో మా ఆయన పద్మనాభం సంగతి తీసుకురావద్దు. బెల్టుతో బాదుకుంటానో, బెత్తంతో కొట్టుకుంటానో నా ఇష్టం. నీకెందుకే?" సాగదీసింది గీతాంజలి.

గిరిజ విసుక్కుంటూ అన్నది.

"అబ్బా! ఆపండే మీ పాడు గోల. చూడు బాబు! ఈ ఆంధ్రదేశంలో 'భార్య' అన్న పదం వింటేనే భర్తలు గజగజా వణికిపోతారు.. ఒక్క ఈ గుంటూర్లో తప్ప! అందుకు కారణం నువ్వే! ఈ హోటల్ టిఫిన్లు, భోజనాలు చూసుకుని మా మొగుళ్ళు రెచ్చిపోతున్నారు. ఈ తిండి సుఖమే లేకపోతే మా భర్తలు కుక్కల్లా మేం చెప్పినట్లు వింటారు."

పురుషోత్తం చేతులు జోడించి నమస్కారం పోజులోనే.. విగ్రహంలా నిలబడి వింటున్నాడు.

ఇప్పుడు చాయాదేవి అందుకుంది.

"ఏవయ్యా పెద్దమనిషి! ఇళ్ళల్లో పన్లెగ్గొట్టి మా మొగుళ్ళు నీ పంచన చేరితే.. వాళ్ళకి బుద్ధి చెప్పి, గడ్డి పెట్టాల్సిందిపోయి పీకల్దాకా భోజనం పెడతావా? నువ్వసలు మనిషివేనా? నీకు డబ్బులే ముఖ్యమా? నీకు అక్కాచెల్లెళ్ళు లేరు?" అంటూ పురుషోత్తం మీదమీదకి వెళ్ళింది.

"చాయాదేవత్తా! మా ఆయన రాజబాబు ఈ ఊరొచ్చి చెడిపొయ్యాడు. ఇంతకు ముందు నా తిట్లు, తన్నులు తట్టుకోలేపోతే..  కాళ్ళావేళ్ళా పడి బ్రతిమాలేవాడు. ఇప్పుడు సుబ్బరంగా ఈ హోటల్ కొచ్చి ముప్పూటలా మెక్కుతున్నాడు. బంగారం లాంటి మా ఆయన పద్మనాభం బావతో సావాసం చేసి చెడిపొయ్యాడు." రమాప్రభ మళ్ళీ గీతాంజలి వైపు కొరకొరగా చూసింది.

గీతాంజలి సర్రున కోపమొచ్చింది.

"అబ్బో! చెప్పొచ్చావు! మీ ఆయనో పెద్ద అమాయక చక్రవర్తమ్మా! నువ్వామధ్య పుట్టింటికెళ్తే నెలవారి సీజన్ టిక్కెట్లు కొనుక్కుని మరీ తిన్నాడు. మళ్ళీ చూడ్డానికి మాత్రం ఒంటూపిరివాళ్ళా ఉంటాడు. సూది బెజ్జం బానకడుపు. ఎవరి భాగోతం ఎవరికి తెలీదు." అంటూ రుసరుసలాడింది.

ఇంతలో సూర్యాకాంతం గట్టిగా అరిచింది.

"ఒసే! ఆపండే మీ మొహాలు మండా! వీడి ఓటేలు మూయించడానికొచ్చి మీ పరువులు బజార్న పడేసుకుంటారే? ఇదిగో అబ్బాయ్! నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీకు మా ఆయన ఎస్వీరంగారావు ఎంత పెద్ద ప్లీడరో తెలుసుగా? బల్ల గుద్ది వాదించాడంటే ఈ గుంటూరేం ఖర్మ.. ఢిల్లీ కూడా గడగడలాడిపోవాల్సిందే. నువ్వర్జంటుగా నీ దుకాణం మూసెయ్. ఇది మర్యాదస్తులు కాపురాలు చేసుకునే ఏరియా. ఇట్లా హోటళ్ళు పెట్టి కాపురాలు కూల్చావంటే ఏవనుకున్నావో? నీమీద మా ఆయనతో న్యూసెన్స్ కేసు కట్టించి.. ఉరిశిక్ష వేయిస్తా! జాగ్రత్త." హూంకరించింది సూర్యాకాంతం.

పురుషోత్తం భయంతో వణికిపోసాగాడు. చెమటలు పట్టేశాయి.

"అ.. అ.. అమ్మగారూ! మీరు ఉప్పూకారాలు ఎక్కువేస్తున్నారంట. గంట క్రితమే మీ ప్లీడరు గుమాస్తా వంగర వెంకటసుబ్బయ్య  రెండు ఫుల్ క్యారేజీలు కట్టించుకుని తీసుకెళ్ళాడు. సాంబార్ ఎగస్ట్రా!"

సూర్యాకాంతం బిత్తరపోయింది. తదుపరి ఆవేశంతో ఊగిపోయింది.

"అదా సంగతి. 'కాంతం! ఇవ్వాళ ఒంట్లో నలతగా ఉందే. లంఖణం పరమౌషధం అన్నారు. నాకు వంట చెయ్యకు.' అంటే పస్తున్నాడేమోననుకున్నాను. ఈ మధ్య కోర్టులోనే కాకుండా ఇంట్లో కూడా అబద్దాలు చెబుతున్నాడన్న మాట! చెప్తా! చెప్తా! ఎక్కడికి పోతాడు. సాయంకాలం కోర్టు నుండి వస్తాడుగా! ముందా వంగరకి బెండు వంకర తీస్తే ఈ పెద్దమనిషి దారికోస్తాడు." పళ్ళు పటపటలాడించింది సూర్యాకాంతం.

చాయాదేవి అందుకుంది.

"ఇదిగో అబ్బాయ్! నీ వాలకం చూస్తుంటే మా గుమ్మడి బావగారిలా మంచాళ్ళాగే ఉన్నావు. ఉన్నపళంగా వెళ్ళిపొమ్మంటే నువ్వు మాత్రం ఎక్కడికి పోతావులే! అంచేత నువ్వు హోటల్ ఎత్తెయ్యడానికి నెల్రోజులు గడువిస్తున్నా. ఈ లోపు నీ ఏర్పాట్లు చూసుకో. లేకపోతే నా సంగతి నీకు తెలీదు. మా అల్లుడు రాజనాలతో చెప్పి నీ హోటల్ నేలమట్టం చేయిస్తాను. పదండే పోదాం!" అంటూ వెనుతిరిగింది.

"చాయాదేవత్తా! వెళ్ళేప్పుడు చీతిరాల వాళ్ళ కొట్లో ఓ పది అప్పడాల కర్రలు కొనుక్కెళ్ళాలి. అట్నుండి వెళ్దాం." అంది గీతాంజలి.

"అయినా నీకిదేం పోయ్యేకాలమే గీతాంజలి? మేం మాత్రం కాపురం చెయ్యట్లేదు? ఎంత మొగుడయితే మాత్రం అన్నేసి అప్పడాల కర్రలు విరిగేలా కోడతావుటే? తగలరాని చోట తగిలి హరీ మంటే రేపు నీకు కొట్టుకోడానికి ఎవరు దొరుకుతారు? అయినా ఈ కరువు రోజుల్లో అన్ని కర్రలు ఎక్కడ కొనగలం? అట్లకాడతో వీపు మీద వాతలు పెట్టు. ఖర్చు లేని పని. సరిపోతుంది." అంది చాయాదేవి.

"ఉసే ఉసే! ఈ ప్లాన్లన్నీ ఇంట్లో మాట్లాడుకోవాలే. మొగుళ్ళని ఎంత తన్నుకున్నా.. వాళ్ళ పరువు ఇలా రోడ్డున పడెయ్య కూడదు. ఇదిగో అబ్బాయ్! నీకు మా ఛాయాదేవి ఇచ్చిన గడువు గుర్తుందిగా?" అంటూ గర్జిస్తూ బయటకి నడిచింది సూర్యాకాంతం.

వర్షం వెలిసినట్లైంది. పురుషోత్తానికి ఇంకా వణుకు తగ్గలేదు. తన హోటల్లో ఆహార పదార్ధాలు రుచిగా, శుచిగా ఉండాలనుకున్నాడు గానీ.. బ్రాడీపేట కుటుంబాల్లో ఇన్ని కలతలు రేపుతాయనుకోలేదు. వంటగదిలోకెళ్ళి ఫిల్టర్ కాఫీ స్ట్రాంగ్ గా కలుపుకుని.. తాగుతూ.. ఈ కష్టాన్ని ఎలా అధిగమించాలా? అని ఆలోచనలో పడ్డాడు.

చివరి తోక..

గుంటూరు, ఆనంద భవన్, పురుషోత్తం.. నిజం. మిగిలిందంతా కల్పితం!

అమ్మకి నాన్నతో తగాదా వచ్చినప్పుడల్లా అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళేది. నేను నాన్నతో కలిసి అన్ని రోజులూ ఆనంద భవన్ లో హాయిగా భోంచేసేవాడిని. అమ్మ తిరిగొచ్చినప్పుడు నాకు చికాగ్గా ఉండేది.. ఆనంద భవన్ మిస్ అవుతున్నందుకు. మళ్ళీ అమ్మానాన్నల తగాదా కోసం ఆశగా ఎదురు చూస్తుండేవాణ్ణి.

ఈ రోజుకీ ఎందరో భర్తలకి ఆపద సమయంలో (భార్య కన్నా) మంచి భోజనం అందిస్తున్న మా గుంటూరు ఆనందభవన్ కి వందనం.. అభినందనం!

కృతజ్ఞతలు..

ఆనంద భవన్ ఫోటోలు : నా ఆత్మీయ మిత్రుడు D.S.R.మూర్తి, బ్రాడీపేట, గుంటూరు.

Wednesday, 14 November 2012

గోవిందరాజుల సుబ్బారావు.. నా తికమక!

                                                  - 1 -

అమ్మానాన్నలతో  సినిమాకి  రెడీ  అయిపొయ్యాను.

"అమ్మా! ఏం సినిమాకెళ్తున్నాం?"

"కన్యాశుల్కం."

"పేరేంటి అలా ఉంది! ఫైటింగులున్నాయా?"

"ఉండవు. నీకు నచ్చదేమో. పోనీ సినిమా మానేసి ఆడుకోరాదూ!"

ఫైటింగుల్లేకుండా సినిమా ఎందుకు తీస్తారో! నాకు చికాగ్గా అనిపించింది. అయితే నాకో నియమం ఉంది. సినిమా చూడ్డనికి వచ్చిన ఏ అవకాశమూ వదలరాదు. నచ్చినా, నచ్చకపోయినా సినిమా చూసి తీరాలి. ఇది నా ప్రతిజ్ఞ!

అమ్మానాన్నల మధ్య కూర్చుని సినిమా చూశాను. సినిమా హాల్లో  అమ్మానాన్నల మధ్యసీటు కోసం నాకు అక్కతో చాలాసార్లు తగాదా అయ్యేది. బొమ్మ తెరపై వెయ్యడానికి ముందు హాల్లో లైట్లు తీసేసి చీకటిగా చేస్తారు. ఆ చీకటంటే నాకు చచ్చేంత భయం. అటూఇటూ ఇంట్లోవాళ్ళుంటే.. మధ్యన కూర్చుని సినిమా చూడ్డానికి ధైర్యంగా ఉంటుంది. అదీ అసలు సంగతి!

'కన్యాశుల్కం' సినిమా ఎంతసేపు చూసినా ఒక్కముక్క కూడా అర్ధం కావట్లేదు. నాకస్సలు నచ్చలేదు. అయినా సావిత్రి ఉండవలసింది రామారావు పక్కన గదా? మరి ఎవరెవరితోనో చాలా స్నేహంగా మాట్లాడుతుందేమి! తప్పుకదూ!

పైపెచ్చు ఒక ముసలాయనకి పిలక దువ్వి, నూనె రాస్తుంది. నాకు ఇది మరీమరీ నచ్చలేదు. ఎన్టీరామారావు ఎంత పక్కన లేకపోతే మాత్రం సావిత్రి అంతగా సరదాలు చెయ్యాలా?

ఈ ముసలాయన్ని ఎక్కడో చూసినట్లుందే! ఎక్కడ చూశానబ్బా? ఆఁ! గుర్తొచ్చింది. ఈ ముసలాయన మా నందయ్యగారే! అదేంటి! నందయ్యగారు సినిమాల్లో వేషాలు కూడా వేస్తారా? ఉన్నట్లుండి నాకు సినిమా ఆసక్తిగా మారింది. బలవంతానా ఆపుకుంటున్న నిద్ర మాయమైంది. నందయ్యగారు యాక్షను బానే చేశారు. మరి సావిత్రితో తన పిలకకి నూనె ఎందుకు పెట్టించుకున్నాడబ్బా!

'ఎవరా నందయ్య గారు? ఏమాకథ?'

ఈ భూప్రపంచమందు అత్యంత సుందరమైన ప్రాంతం మా గుంటూరు. అందు మా బ్రాడీపేట మరింత సుందర ప్రదేశము. ఈ సంగతి మీకు ఇంతకుముందు కూడా బల్లగుద్ది చెప్పాను. మీరు మర్చిపోతారేమోనని అప్పుడప్పుడూ ఇలా మళ్ళీ బల్ల గుద్దుతుంటాను.

మా బ్రాడీపేట మూడవ లైను మొదట్లో.. అనగా ఓవర్ బ్రిడ్జ్ డౌన్లో నందయ్యగారి ఇల్లు. పక్కన మాజేటి గురవయ్యగారి ఇల్లు. ఆ పక్కన ముదిగొండ భ్రమరాంబగారి ఇల్లు. చింతలూరివారి ఆయుర్వేద వైద్యశాల. దాటితే డాక్టర్ ఆమంచర్ల చలపతిరావుగారి ఇల్లు. ఎదురుగా ఇసుకపల్లి వేంకట కృష్ణమూర్తిగారి ఆయుర్వేద వైద్యశాల ఉంటుంది.

సాయంకాలం సమయానికి ఈ అరుగులన్నీ పురోహితులతో కళకళలాడుతుండేది. గుంపులు గుంపులుగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు. వాతావరణం చాలా సందడిగా, కళకళలాడుతుండేది. ఊళ్ళో ఎవరికైనా పూజలు, వ్రతాలకి  పురోహితుల అవసరం వచ్చినప్పుడు అక్కడే ఎప్పాయింట్ మెంట్లు ఖరారయ్యేవి.

మంజునాథ రెస్టారెంట్ పక్కనే ఉన్న నశ్యం షాపు ఆ సమయంలో చాలా బిజీగా ఉండేది. పొడుంకాయ ఫుల్లుగా నింపడానికి ఐదు పైసలు. పొడుగ్గా ఉండే కాడ చివర బుల్లి గరిటె. ఆ గరిటెతో చిన్నజాడీలోంచి నశ్యాన్ని లాఘవంగా స్కూప్ చేస్తూ పొడుంకాయ నింపడం అద్భుతంగా ఉండేది. ఆ నశ్యం నింపే విధానం అబ్బురంగా చూస్తూ నిలబడిపొయ్యేవాడిని.

నశ్యం పట్టు పడుతూ.. సందడిగా, సరదాగా కబుర్లు చెప్పుకునే పురోహితులు ఒక వ్యక్తి కనపడంగాన్లే ఎలెర్ట్ అయిపోయేవారు. నిశ్శబ్దం పాటించేవారు. వినయంగా నమస్కరించేవారు. ఆయనే నందయ్య గారు.

నందయ్యగారింట్లో ఆడామగ అనేక వయసులవారు ఉండేవారు. ఇంటి వరండాలో చెక్కబల్లపై నందయ్యగారు కూర్చునుండేవారు. తెల్లటి తెలుపు. నిగనిగలాడే గుండు. ఒత్తైన పిలక. చొక్కా వేసుకొంగా ఎప్పుడూ చూళ్ళేదు. పంచె మోకాలు పైదాకా లాక్కుని, ఒక కాలు పైకి మడిచి కూర్చుని ఉంటారు. మెళ్ళో రుద్రాక్షలు. విశాలమైన నుదురు. చేతులు, భుజాలు, నుదుటిపైనా తెల్లటి వీభూది. పంచాంగం చూస్తూ వేళ్ళతో ఏవో లెక్కలు వేస్తుండేవారు.

ఇంటికి వచ్చినవారు నందయ్యగారికి వినయంగా నమస్కరించేవారు. పెద్దవాళ్ళు నాలాంటి పిల్లకాయల చేత ఆయన కాళ్ళకి నమస్కారం చేయించేవాళ్ళు. మహానుభావుల కాళ్ళకి నమస్కరిస్తే చదువు బాగా వంటబడుతుందని అమ్మ చెప్పింది. చదువు సంగతి అటుంచి.. కనీసం మా లెక్కల మాస్టారి తన్నులైనా తప్పుతయ్యేమోననే ఆశతో నందయ్యగారి కాళ్ళకి మొక్కేవాణ్ని.

మళ్ళీ మన 'కన్యాశుల్కం' లోకి వద్దాం. సినిమా అయిపొయింది. అమ్మానాన్న రిక్షాలో కూర్చున్నారు. యధావిధిగా నా ఉచితాసనంపై కూర్చున్నాను. ఏదో గొప్ప కోసం గంభీరంగా ఉంటుందని 'ఉచితాసనం' అని రాస్తున్నానుగానీ.. అసలు సంగతి రిక్షాలో నా ప్లేస్ కాళ్ళు పెట్టుకునే చోట.. అమ్మానాన్న కాళ్ళ దగ్గర.

మా ఇంట్లో అందరిలోకి నేనే చిన్నవాణ్ణి. అంచేత రిక్షా సీటుపై ఎవరు కూర్చున్నా.. నా పర్మనెంట్ ప్లేస్ మాత్రం వాళ్ళ కాళ్ళ దగ్గరే! ఆ విధంగా పెద్దయ్యేదాకా రిక్షా సీటుపై కూర్చునే అవకాశం పొందలేకపోయిన నిర్భాగ్యుడను.

"సినిమాలో మన నందయ్యగారు భలే యాక్టు  చేశారు." అన్నాను.

నాన్నకి అర్ధం కాలేదు.

"నందయ్యగారా! సినిమాలోనా!" అన్నాడు నాన్న.

"అవును. సావిత్రి ఆయన పిలకకేగా నూనె రాసింది." నాన్నకి తెలీని పాయింట్ నేను పట్టేసినందుకు భలే ఉత్సాహంగా ఉంది.

నాన్న పెద్దగా నవ్వాడు.

"నువ్వు చెప్పేది లుబ్దావధాని గూర్చా! ఆ పాత్ర వేసినాయన డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు. ఆయన గొప్పనటుడు. బాలనాగమ్మలో మాయల మరాఠీగా వేశాడు. దడుచుకు చచ్చాం." అన్నాడు నాన్న.

నమ్మలేకపోయాను. నాన్న నన్ను తప్పుదోవ పట్టిస్తున్నాడా? ఛ.. ఛ! నాన్న అలా చెయ్యడు. బహుశా నాన్న నందయ్యగారిని గుర్తుపట్టలేకపోయ్యాడా? అలాంటి అవకాశం లేదే! నాన్నకి నందయ్యగారు బాగా తెలుసు. నందయ్యగారు నాన్నని 'ఏమిరా!' అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు.

ఆలోచనలతోనే ఇంట్లోకొచ్చిపడ్డా. నాన్నకిష్టమైన, నాకు అత్యంత అయిష్టమైన కాకరకాయ పులుసుతో నాలుగు ముద్దలు తిన్నాను. నాన్న చాలా విషయాల్లో డెమాక్రటిక్ గా ఉండేవాడు. కానీ ఎందుకో కాకరకాయ పులుసు విషయంలో హిట్లర్ లా వ్యవహరించేవాడు. వారంలో ఒక్కసారైనా ఇంట్లోవాళ్ళం నాన్నకిష్టమైన కాకరకాయ పులుసుతో శిక్షించబడేవాళ్ళం.

కాకరకాయ పులుసు కడుపులో తిప్పుచుండగా.. నందయ్య గారి ఆలోచన మనసులో తిప్పుచుండెను. ఆలోచిస్తున్న కొద్దీ.. ఈ లుబ్దావధాని, గోవిందరాజుల సుబ్బారావు, నందయ్యగార్ల ముడి మరింతగా బిగుసుకుపోయి పీటముడి పడిపోయింది.

అటు తరవాత నందయ్యగారి సినిమా వేషం సంగతి నా అనుంగు స్నేహితుడైన దావులూరి గాడి దగ్గర ప్రస్తావించాను. వాడు నాకన్నా అజ్ఞాని. తెల్లమొహం వేశాడు. పరీక్షల్లో నాదగ్గర రెగ్యులర్ గా కాపీకొట్టే సాగి సత్తాయ్ గాడు మాత్రం నేనే కరక్టని నొక్కివక్కాణించాడు. ఏవిటో! అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది!

                                                     - 2 -

కాలచక్రం సినిమారీల్లా గిర్రున తిరిగింది. ఇప్పుడు నేను పెద్దవాడనైనాను. రిక్షాలొ కాళ్ళ దగ్గర కూచోకుండా సీటు మీదే కూర్చునే ప్రమోషనూ వచ్చింది. నా సాహిత్యాభిలాష చందమామ చదవడంతో మొదలై ఆంద్రపత్రిక, ప్రభల మీదుగా కథలు, నవలలదాకా ప్రయాణం చేసింది.

ఈ క్రమంలో కన్యాశుల్కం గురజాడ అప్పారావు రాసిన నాటకమనీ, అది సినిమాగా తీశారనీ తెలుసుకున్నాను. లుబ్దావధానిని నందయ్యగారిగా పొరబడ్డందుకు మొదట్లో సిగ్గు పడ్డాను. అటుతరవాత నవ్వుకున్నాను. నేనెందుకు తికమక పడ్డాను!?

కొన్నాళ్ళకి కన్యాశుల్కం నాటకం చదివాను. నాటకం గూర్చి అనేకమంది ప్రముఖుల వ్యాఖ్యానాలూ చదివాను. తెలుగు సాహిత్యంలో కన్యాశుల్కం ప్రాముఖ్యత గూర్చి ఒక అంచనా వచ్చింది. సినిమా మళ్ళీ చూడాలని.. పెరిగిన వయసుతో, పరిణిత మనసుతో హాల్లోకి అడుగెట్టాను.

సినిమా మొదలైన కొంతసేపటికి సినిమాలో పూర్తిగా లీనమైపొయ్యాను. కారణం.. గోవిందరాజుల సుబ్బారావు అద్భుత నటన. ఆంగ్లంలో 'స్పెల్ బౌండ్' అంటారు. తెలుగులో ఏమంటారో తెలీదు. లుబ్దావదానిగా గోవిందరాజుల సుబ్బారావు నటించాడనడం కన్నా..  ప్రవర్తించాడు అనడం కరెక్ట్.

గోవిందరాజుల సుబ్బారావు వృద్దుడయినందున లుబ్దావధాని ఆహార్యం చక్కగా కుదిరందని కొందరు అంటారు. వాస్తవమే అయ్యుండొచ్చు. అయితే ఇది నటుడికి కలసొచ్చిన ఒక అంశంగా మాత్రమే పరిగణించాలని నా అభిప్రాయం.

వృద్ధాప్యంలో 'డిమెన్షియా' అనే మతిమరుపు జబ్బు మొదలవుతుంది. ఎదుటివాడు చెప్పేది అర్ధం చేసుకుని చెప్పడానికి సమయం పడుతుంది. శరీర కదలికల వలె మానసికంగా కూడా నిదానంగా రియాక్ట్ అవుతుంటారు. ఎటెన్షన్ మరియు కాన్సంట్రేషన్ తగ్గడం చేత ఒక్కోసారి అర్ధం కానట్లు చేష్టలుడిగి చూస్తుండిపోతారు. ఇవన్నీ మనకి సినిమా లుబ్దావధానిలో కనిపిస్తాయి.

నా తికమక నటుడిగా గోవిందరాజుల సుబ్బారావు సాధించిన విజయం. అందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు. ఆయన మరీ అంత సహజంగా పాత్రలోకి దూరిపోయి అద్భుతంగా నటించేస్తే తికమక పడక ఛస్తానా! అంచేత 'నేరం నాదికాదు! గోవిందరాజుల సుబ్బారావుది.' అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను!

యూట్యూబులోంచి ఆయన నటించిన సన్నివేశం ఒకటి పెడుతున్నాను. చూసి ఆనందించండి.



చివరి తోక..

శ్రీ ముదిగొండ పెదనందయ్యగారు :  వేదపండితులు. ఘనాపాఠి. ఆరాధ్యులు. సంస్కృతాంధ్ర పండితులు.

కృతజ్ఞతలు..

ఈ పోస్టులో నేను రాసిన ఇళ్లేవీ ఇప్పుడు లేవు. అన్నీబహుళ అంతస్తుల బిల్దింగులుగా మారిపోయ్యాయి. పోస్ట్ రాస్తున్న సందర్భాన నా మెమరీని రిఫ్రెష్ చేసిన మిత్రుడు ములుగు రవికుమార్ (నందయ్యగారి మనవడు) కి కృతజ్ఞతలు.

(photos courtesy : Google)

Thursday, 24 May 2012

ధారుణి రాజ్యసంపద (బీడీలబాబు కథ)

"ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణజూచి" పద్యం భీకరంగా మొదలయ్యింది. వింటున్న కొద్దీ గుండెలు ఉప్పొంగసాగాయి, మరుగుతున్న రక్తం మరిపోసాగింది, హృదయం ఉరకలు వెయ్యసాగింది. భుజంమీద గద వుంచుకుని, ఠీవీగా మీసం మెలేస్తున్న భీముడు కళ్ళముందు నిలిచాడు.

నాకు పద్యాలు అంటే యేంటో తెలీదు, అర్ధం అసలే తెలీదు, పాడిందెవరో కూడా తెలీదు. మరేం తెలుసు? భీముడు తెలుసు! తల్చుకుంటే ఆ సభలోని వాళ్ళనందరినీ గదతో మోది క్షణంలో చంపేయగలడు. కానీ - చంపనీకుండా ధర్మరాజు ఆపుతున్నాడు. ఆవేశం కంట్రోల్ చేసుకోలేక భీముడు పద్యాలు పాడేశాడు, పాపం! అంతకన్నా భీముడు మాత్రం ఏం చెయ్యగలడు?

నా చిన్నతనంలో ఇప్పట్లా సంస్కృతిని, సంప్రదాయాన్ని పరిరక్షించే సంస్థలు లేవు. కళాబంధువులు, కళాసేవకులు అసలే లేరు. ఈ పనంతా ఒంటిచేత్తో శ్రీరామనవమి పందిళ్ళు చేసేవి. పాట కచేరీలు, నృత్య ప్రదర్శనలు, నాటికలు, నాటకాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు.. అన్నీ కూడా శ్రీరామనవమి చలవే.

గుంటూర్లో వీధివీధికీ పోటాపోటీగా పందిళ్ళు ఉండేవి. రవి కాలేజీ ముందున్న పందిరి మా ఇంటికి బాగా దగ్గర. ఈ పందిరి నిర్వాహకులకి అక్కడ బడ్డీకొట్టుంది. వీరిది ఆ ఏరియాలో ఏకైక ముస్లిం కుటుంబం, అంచేత ఈ కొట్టుని 'సాయిబు కొట్టు'గా వ్యవహరించేవాళ్ళం. వీళ్ళు ఐదుగురు సోదరులు. వీరిలో సత్తార్, రజాక్ ముఖ్యులు.

ఈ పందిళ్ళల్లో - ఆధ్యాత్మిక ప్రసంగాలు, పాటకచేరీలు, డ్యాన్సులు, నాటికలు, నాటకాలు.. ఇలా రకరకాల ప్రోగ్రాంలు వుండేవి. రాత్రిళ్ళు భోంచేసి చాపలు తీసుకెళ్ళి స్టేజ్ ముందర పరిచేసేవాళ్ళం. ఒక్కొక్క చాప ఒక్కో కుటుంబానిది. వీరబ్రహ్మేంద్రస్వామి నాటకం, పాండవోద్యోగ విజయాలు, చింతామణి.. చాలా నాటకాలు పడుకునే చూసేవాళ్ళం. నాటక కళాకారులు యాంత్రికంగా ఎవరి పద్యం వాళ్ళు పాడేసేవాళ్ళు. పాత్రధారుల మేకప్ దట్టంగా వున్నందున మొహంలో ఫీలింగ్స్ కనబడేవి కాదు, అక్కడ నటన కన్నా పద్యాలకే ప్రాధాన్యం. కృష్ణుడు, బ్రహ్మంగారు స్టేజ్ వెనుక బీడీలు తాగడం విచిత్రంగా అనిపించేది.

ఇప్పుడు మళ్ళీ అసలు కథలోకొద్దాం. పాండవ వనవాసము సినిమా రికార్డులో భీముడి పద్యాలు సైడ్ 'బి'లో ఉండేవి. సైడ్ 'ఎ' ద్రౌపది పాడిన ఏడుపుగొట్టు పాట - "దేవా! దీనబాంధవా! అసహాయురాలరా.. కావరా" వుండేది. నాకీ పాటంటే చిరాకు, అస్సలు  నచ్చదు. అయితే - సైడ్ 'ఎ' పాట తరవాతే, సైడ్ 'బి' పద్యాలు వేసేవాళ్ళు. నాకా  మూణ్నిమిషాలు మూడుగంటల్లాగా అనిపించేది.

అయితే - ఈ ఏడుప్పాట వల్ల ఒక ప్రయోజనముంది. లౌడ్ స్పీకర్లో ఆ పాట మొదలవ్వంగాన్లే ఇంట్లోంచి  పరుగందుకుని పందిట్లో వాలేవాణ్ణి. పందిట్లో మూలనున్న సీతారాములకి ఒక దణ్ణం పడేసి, ప్రసాదం నోట్లో వేసుకుని, భీముడి పద్యాల కోసం ఆత్రంగా ఎదురు చూస్తుండేవాణ్ణి. "ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణజూచి.. " మొదలు. మళ్ళీ గుండెలు.. రక్తం.. హృదయం.. షరా మాములే!

నాకీ పద్యాలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరేదికాదు. రోజంతా వినాలని చాలా కోరిగ్గా ఉండేది. కానీ ఏం చెయ్యను? ఆ రికార్డులు వేసే వ్యక్తిని అడిగే ధైర్యం లేదు. అతని పేరు షేక్ బాబు. ఎర్రగా, పొడుగ్గా, పీలగా నలిగిపోయిన వానపాములా ఉండేవాడు. అతను పొద్దస్తమానం బీడీలు తాగుతుండేవాడు, దగ్గుతుండేవాడు. దగ్గుతూ కూడా దీక్షగా బీడీలు కాలుస్తుండేవాడు! అంచేత కొందరతన్ని 'బీడీలబాబు' అనేవాళ్ళు.

గ్రామఫోన్ రికార్డులు మట్టివి. అవి పెట్టడానికి వీలుగా నిలువు అరలతో భోషాణం లాంటి చెక్కపెట్టె. పక్కన రికార్డ్ ప్లేయెర్. ప్లేయర్‌కి మూల బుల్లిఅరలో సూదులు. 'కీ' ఇవ్వడానికి 'జెడ్' ఆకారపు స్టీల్ పరికరం. బాబు రికార్డుల్నీ, గ్రామ్ ఫోన్‌నీ సున్నితంగా, ఎంతో నైపుణ్యంతో హేండిల్ చేసేవాడు. రికార్డుల్ని ప్లే చెయ్యడంలో అతనికేదో క్రమం వుంది, అన్ని రికార్డులు సమానంగా అరిగిపోవాలనే నియమం అయ్యుండొచ్చు.

బీడీలబాబు పద్యాలు మళ్ళీ ఎప్పుడు పెడతాడు? ఆ పద్యాల కోసం ఎదురుచూస్తూ అక్కడే ఎంతసేపు పడిగాపులు కాయాలి? పోనీ ఒక గంటదాకా ఆ పద్యాలు వెయ్యడా? అదేంలేదు, ఎవరన్నా పెద్దవాళ్ళు ఆ పద్యాల్ని వెయ్యమంటే ఔటాఫ్ ఆర్డర్లో వేసేస్తాడు. అప్పటికే ఇంట్లోంచి నాలుగుసార్లు పరిగెత్తుకుంటూ వచ్చా. కాళ్ళు లాగేస్తున్నాయి, నాకు ఏడుపొచ్చింది. 

అప్పటికి వందోసారి నిర్ణయించుకున్నాను. పెద్దయ్యాక నేనూ బీడీలబాబులా రికార్డులేసే ఉద్యోగంలోనే చేరతాను. పిల్లలు అడిగిన పాటలన్నీ వేస్తాను. భీముడి పద్యాలు వెంటవెంటనే వేసే బుద్ధి బాబుకి ప్రసాదించమని.. ద్రౌపది పాడినట్లు నేను కూడా 'హే కృష్ణా!' అంటూ ప్రార్ధించుకునేవాణ్ని. మనమెంత ప్రార్ధించినా ప్రయోజనం లేదని, బాబు సాయిబు అయినందున మన హిందుదేవుళ్ళు బాబు మనసు మార్చలేరని ఎదురింటి రాము అనేవాడు. పైన మబ్బుల్లో దేవుళ్ళంతా ఒకటేననీ, అక్కడ మన దేవుళ్ళు అల్లాకి రికమండ్ చేస్తారని పక్కింటి ఫణి వాదించేవాడు.

నా "ధారుణి రాజ్య సంపద.. " వీరాభిమానం కేవలం విన్డానికే పరిమితమా? కానేకాదు, ఇంట్లో భీముడుగా మోనో ఏక్షన్ చేసేవాణ్ని. పొయ్యి పక్కనున్న సరివికట్టె నా గదాదండము, దారం కట్టిన అట్టముక్క కిరీటం. ఈ రెండూ వొంటి మీదకి రాంగాన్లే నన్ను భీముడు పూనేవాడు. (లేని) మీసం మెలేస్తూ, తొడ కొడుతూ ఆవేశంతో ఊగిపొయ్యేవాణ్ణి.

"ఓరోరీ మాయాజూద వినోదా, మధు మదోన్మత్తా, దుర్యోధనా! నీ దురహంకారానికి తగిన ప్రతీకారం చేస్తా!" అని పెడబొబ్బలు పెట్టి, తొడ గొట్టుకుంటూ "ధారుణి రాజ్యసంపద" అంటూ గర్జిస్తూ పద్యం అందుకునేవాణ్ణి. ఇంటికి ఎవరొచ్చినా వారికి భీముణ్ణి చూపేవాణ్ణి. కొన్నిసార్లు నా ప్రదర్శనకి రెండుపైసలు పారితోషకం కూడా లభించేది. ఒకరోజు ప్రదర్శనలు ఎక్కువైనందున, తొడ వాచిపోయి ఏడుస్తుంటే అమ్మ కొబ్బరినూనె రాసి ఓదార్చింది.

కొన్నాళ్ళకి దేవుడు నా మొర ఆలకించాడు - మా పక్కింటి సత్తిగాడి రూపంలో! సత్తిగాడు నాకన్నా ఒకేడాది పెద్ద. లావుగా, పొట్టిగా గుండ్రాయిలా ఉంటాడు. తండ్రికి పక్కవీధిలో కిరాణా కొట్టుంది. సత్తిగాడు మధ్యాహ్నం తండ్రి కోసం భోజనం కేరేజ్ తీసుకెళ్ళేవాడు. తండ్రి అటుతిరిగి అన్నం తింటుంటే మనవాడు గల్లాపెట్టె వద్ద తన హస్తలాఘవం చూపేవాడు.

వచ్చేప్పుడు కేరేజ్ ఖాళీది తెచ్చేవాడు, జేబులు మాత్రం నిండుగా ఉండేవి. కొట్టుకొచ్చిన డబ్బుల్తో మాకు నిమ్మతొనలు, నువ్వు జీళ్ళు, తాటి చాపలు, కలరు డ్రింకులు ఇప్పిస్తుండేవాడు. మేం వాడి వంధిమాగధులం. వీధి మూలనున్న పొట్టి చెట్టుకున్న వంకర కొమ్మ మీద విలాసంగా పడుకుని మాతో పనులు చేయించుకునేవాడు. ఎంతయినా డబ్బుకున్న దర్జా దేనికీ లేదు!

పాండవవనవాసము, భీముడి పద్యాలు అంటూ సత్తిగాణ్ణి ఊదరగొట్టేశాను. నా అదృష్టవశాత్తు మా సత్తిగాడిక్కూడా భీముడి పద్యాలు తెగ నచ్చేశాయి. రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా? సత్తిగాడు ఆర్డర్ పాస్ చేసేవాడు. బీడిలబాబు వినయంగా, డ్యూటిఫుల్గా 'ధారుణి రాజ్య సంపద' వేసేవాడు. చెవులారా వింటూ మైమరచిపొయ్యేవాణ్ని.

ఇంతకీ బీడీలబాబు సత్తిగాడి బంటు ఎలా అయ్యాడు? సింపుల్! బాబుకి, సత్తిగాడికి మధ్య బీడిల ఒప్పందం కుదిరింది. ఆ పద్యాలు ఒకసారి ప్లే చేస్తే రెండు హస్తం బీడీలు ఫ్రీ. లెక్కలు ఖచ్చితంగా ఉండేవి. ఆ విధంగా భావిభారత పౌరులమైన మేం దొంగతనానికి, లంచం కలిపితే చాలా ఎఫెక్టివ్‌గా పనులవుతాయని గుర్తించితిమి.

ముగింపు -

చిన్నప్పటి నా యాంబిషన్ అయిన మట్టిరికార్డులు ప్లే చేసే ఉద్యోగం సంపాదించలేక ఇంకేదో అయిపొయ్యాను. ఏం చేస్తాం? తలరాత, మనమందరం విధి చేతిలో పావులం!

మొన్న టీవీలో 'ధారుణి రాజ్యసంపద' పద్యాలు వచ్చాయి. చేస్తున్న పని ఆపేసి గుడ్లప్పగించేశాను. నాకు టీవీలో బీడీలబాబు, సత్తిగాళ్ళే కనిపించారు. ఔరా! కాలం ఎంత వేగంగా పరిగెడుతుంది!