Monday 25 February 2013

'చంద్ర' జ్ఞాపకాలు - ఆలోచనలు


"నాన్నతో చివరిసారిగా మాట్లాడాలనుకుంటే అర్జంటుగా హైదరాబాద్ బయలుదేరి వచ్చెయ్యి." రాత్రి ఎనిమిదింటికి శశాంక్ (చంద్ర కొడుకు) ఫోన్ వినంగాన్లే కాళ్ళూ, చేతులు వణికిపొయ్యాయి. విపరీతమైన anxiety కి గురయ్యాను.

ఆ రోజు నా భార్య జనరల్ హాస్పిటల్లో డ్యూటీ ఫిజీషియన్ గా నైట్ డ్యూటీలో ఉంది. పిల్లల్ని వదిలేసి అప్పటికప్పుడు బయల్దేరే అవకాశం లేదు. హైదరాబాద్ బయల్దేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాను.

ఇంతలోనే మిత్రుల నుండి వరస ఫొన్లు. భారతి.. సాహితి.. 'చంద్ర సడన్ గా బేడ్ అయిపోయాట్ట. నిజమేనా?' అంటూ. కొద్దిసేపట్లోనే గోపరాజు రవి ఫోన్.. 'రమణా! చంద్రా ఈజ్ నో మోర్.'

మెదడు మొద్దుబారిపోయింది. అచేతన స్థితిలో అలాగే ఉండిపోయాను. కన్నీళ్ళు ధారగా కారిపోసాగాయి. పిల్లలు నన్నే చూస్తున్నారు. బెడ్రూంలోకి వెళ్లి విలపించాను. నా భార్య ఓదార్చసాగింది. నా తండ్రి చనిపోయినప్పుడు కూడా నేనంతగా విలపించలేదు.

మానవుడికి పుట్టుక ఒక యాక్సిడెంట్. జీవనగమనంలో అనేకమందిని కలుస్తుంటాం. ఆ కలయికలన్నీ కూడా యాక్సిడెంట్లే! కొందరి స్నేహం హాయిగా ఉంటుంది. వారిలోని ప్రతిభ, కమిట్మెంట్, శక్తిసామర్ధ్యాల్ని చూస్తూంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ముచ్చటేస్తుంది. అటువంటి అరుదైన వారిలో నా మిత్రుడు భువనగిరి చంద్రశేఖర్ ఒకడు. నాలాంటి స్నేహితులకి 'చంద్ర'.


చంద్ర మనతో ఉంటే హుషారుగా ఉంటుంది. ఉత్తేజం కలుగుతుంది. చంద్ర ఓ హైవోల్టేజ్ ఎలెక్ట్రిక్ వైర్. అందులో ఎల్లప్పుడూ కరెంట్ ప్రవహిస్తూనే ఉంటుంది. చాలా డైనమిక్ గా ఉంటాడు. అతని రూపం, మాట తీరు విలక్షణమైనది. మన కామిక్స్ లో సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఉన్నారు. ఆ పరిభాషలో చంద్రని మేగ్నెట్ మ్యాన్ (అయస్కాంత మనిషి) అనవచ్చు.

చంద్ర నాకు ఎనభైలలో గోపరాజు రవి ఇంట్లో (ఆ రోజుల్లో ఆ ఇల్లు మా అడ్డా) పరిచయం. మా పరిచయం సిగరెట్లు, కాఫీలతో  దినదినాభివృద్ధి చెందింది. చంద్రాకి రాజకీయంగా చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి.చంద్రా తన అభిప్రాయాల్ని చాలా స్పష్టంగా, సూటిగా చెప్తాడు. ఒక్కోసారి చాలా తీవ్రంగా వాదిస్తాడు. అతను ఏం చెప్పినా చాలా నిజాయితీ ధ్వనిస్తుంది. అతని ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. నేను చంద్రని అభిమానించడానికి అతనిలోని ఈ లక్షణం కూడా ఓ కారణం. అయితే.. ఈ లక్షణం కొందరికి ఇబ్బందిగా ఉండేది.

చంద్రా అప్పటికి లా స్టూడెంట్. అరండల్ పేట మేడపై ఒక చిన్న రూంలో ఉండేవాడు. అటు తరవాత అదే లైన్లో ఎదురుగా ఒక మూడు గదుల ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. అందరి ప్లీడర్లకి లాగే ఇంటి ముందు గదిలో ఆఫీస్ ఉండేది. ఒక పాత టేబుల్, కుర్చీ, కొన్ని లా పుస్తకాలు. అదీ చంద్ర ఆఫీస్. అక్కడే బాలగోపాల్ తో నాకు పరిచయం. చాలాసార్లు బాలగోపాల్ బాత్రూంలో బట్టలు ఉతుక్కుని, గడ్డం చేసుకుని, స్నానం చేసేదాకా చంద్రతో కబుర్లు చెబుతుండేవాణ్ని.

అవి నేను పీజి పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న రోజులు. ఒక డాక్టర్ గారి నర్స్ మూడో నెల గర్భంతో.. ఆయన ఆస్పత్రిలోనే ఆత్మహత్య చేసుకుంది. కేసులో డాక్టర్ గారు ప్రధాన నిందితుడు. ఆ పేద నర్స్ కుటుంబానికి చంద్ర ఎడ్వొకేట్. కేస్ ట్రయల్ కొచ్చింది.

ఒకరోజు తాలూకా ఎదురు టీ స్టాల్లో నేను, మా శరత్ (ఆ తర్వాత కాలంలో సైకియాట్రిస్ట్.. ఇప్పుడు లేడు) టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నాం. నాకు కొద్దిగా పరిచయం ఉన్న ఒక డాక్టర్ మాతో మాటలు కలిపి నెమ్మదిగా విషయం చెప్పాడు. ఆయన చంద్రకి లంచం ఇవ్వడానికి మమ్మల్ని వాడుకోదల్చుకున్నాడు. నాకు తరవాత తెలిసింది.. ఆ కేసులో చంద్రాని ప్రలోభ పెట్టడానికి అనేక ప్రయత్నాలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయని.

మనం ఎన్ని పుస్తకాలన్నా రాయొచ్చు. ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు. కానీ.. డబ్బు అవసరం ఉండి (డబ్బు వచ్చే అవకాశం ఉండి కూడా) డబ్బుని లెక్కజెయ్యనివాడు మహానుభావుడు అని నా అభిప్రాయం. ఆ సంఘటనతో చంద్ర నిజాయితీ నాకు అర్ధమైంది. కబుర్లు చెప్పడం వేరు. ఆచరణలో చూపడం వేరు. ఆవేశంతో ఊగిపోతూ నీతులు వల్లె వేసి.. అదే పెట్టుబడిగా సొమ్ము సంపాదించుకున్న మేధావులు నాకు తెలుసు.


నా పెళ్ళిలో 'హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ' అనే ఒక పుస్తక దిండు నాకు ప్రెజంటేషన్ గా ఇచ్చాడు. 'ఈ పుస్తకం చదువు. మనం తరవాత చర్చించుకుందాం.' అన్నాడు. నా మిత్రుడు నన్ను నా పెళ్ళిలో కూడా ఎడ్యుకేట్ చెయ్యడానికి ప్రయత్నించాడు!

చంద్రలో కొందరికి యారోగెన్స్ కనిపిస్తుంది. కొందరికి ఆధిపత్య ధోరణి కనిపిస్తుంది. ఇంకొందరికి ధిక్కార ధోరణి కనిపిస్తుంది. నాకైతే ఆ లేత మొహంలో పిల్లతనపు చాయలు కూడా కనిపించేవి. ఇవన్నీ నిజాయితీపరుల లక్షణాలేమో! ఫలానా పోలీసు ఆఫీసర్ తనంటే భయపడి చచ్చాడని నవ్వుకుంటూ చెప్పేవాడు. 'జాగ్రత్త! ఏ చీకట్లోనో వెనక నుండి నీ బుర్ర రాంకీర్తన పాడిస్తాడు.' అనేవాణ్ణి.


చంద్రా చుండూరు కేసుతో వృత్తి రీత్యా ప్రసిద్ధుడయ్యాడు. అయితే ఈ చుండూరు కేసులో చంద్రా పడ్డ శ్రమ చాలా తీవ్రమైనది.. ఫిజికల్ గా, మెంటల్ గా కూడా. అతనికి ఈ కేసు ద్వారా వచ్చిన పేరుప్రతిష్టలు.. అతని శ్రమ, తపనతో పోలిస్తే అత్యల్పం అని నా అభిప్రాయం.

డబ్బుకి ఏమాత్రం లొంగని మొండిఘటం. అందుకే ఒక ఇల్లు పట్టనన్ని పుస్తకాలు కొన్నాడు కానీ.. ఒక సొంత ఇల్లు కూడా ఏర్పరుచుకోలేకపొయ్యాడు. మన సమాజం నిజాయితీపరుల పట్ల నిర్ధాక్షిణ్యంగా ఉంటుంది. అందుకే వారిని ఇబ్బందులు పెడుతుంది.


చంద్రా బాలగోపాల్ అభిమాని. బాలగోపాల్ పట్ల చాలా ఇష్టంగా, గొప్పగా మాట్లాడేవాడు. బాలగోపాల్ మరణం చంద్రాని ఎంతో కృంగదీసింది. ఆ తెల్లవార్లూ దుఃఖిస్తూనే ఉన్నాడు (ఈ సంగతి నాకు చంద్రిక చెప్పింది). అంతకు చాలా కాలం ముందే బాలగోపాల్ తో చంద్రా విబేధించి 'మానవ హక్కుల వేదిక' నుండి బయటకొచ్చేశాడు. సాధారణంగా ఇట్లాంటి సందర్భాల్లో తీవ్రంగా విమర్శించుకోడం జరుగుతుంది. కానీ చంద్రా ఒక మినహాయింపు.



చంద్రా కన్నాభిరాన్ గూర్చి చెబుతుంటే.. ఆ కళ్ళల్లో 'గ్లో' కనిపించేది. అతనికి కన్నాభిరాన్ అంటే భక్తి, భయం, ఆరాధన. వినేవాడికి ఓపికుండాలే గాని.. కన్నాభిరాన్ గూర్చి గంటల తరబడి చెబుతూనే ఉంటాడు. కన్నాభిరాన్ ప్రస్తావన లేకుండా చంద్ర గూర్చి ఎంత రాసినా అది అసంపూర్ణమే అని నా అభిప్రాయం.

ఓ సందర్భంలో త్రిపురనేని మధుసూధనరావు ఉపన్యాసం గూర్చి చాలా నోస్టాల్జిక్ గా గుర్తు చేసుకున్నాడు. 'విరసం'తో విబేధం. త్రిపురనేని అంటే ఎనలేని గౌరవం! దటీజ్ చంద్రా!

ఆ మధ్య ఉరిశిక్షపై సాక్షి టీవీ వారి చర్చా కార్యక్రమంలో చంద్రాని చూశాను. తరవాత ఫోన్ చేశాను.

"చంద్రా! ఇప్పుడే టీవీలో చూశాను. సబ్జక్ట్ గూర్చి చెప్పేదేమీ లేదు. జుట్టు పెంచుకోడంలో నువ్వు బాలగోపాల్ తో పోటీ పడకు. అర్జంటుగా క్రాఫ్ చేయించుకో."

ఒక క్షణం చంద్రాకి నే చెప్పేది అర్ధం కాలేదు. తరవాత పెద్దగా నవ్వాడు.

చంద్రాతో నా స్నేహం పునశ్చరణ చేసుకుంటే నాకొక విషయం అర్ధమవుతుంది. మొదటి నుండి మా స్నేహం మా వృత్తులకి అతీతంగానే కొనసాగింది. అందుకే మా సంభాషణ ఎప్పుడూ కాజువల్ గానే ఉండేది. ఆయన్నొక గొప్ప ప్లీడరుగా నేనేనాడు అనుకోలేదు. నాకతను 'చంద్ర'. అంతే! నేనో సైకియాట్రీ స్పెషలిస్టుగా చంద్రా కూడా గుర్తించలేదు.. నన్ను 'రమణ' గానే భావించాడు (ఒకసారి ఏదో సందర్భంలో 'నీ వృత్తి ఒక గ్లోరిఫైడ్ భూతవైద్యం.' అని మాత్రం అన్నాడు.)

చంద్రా శవమై గుంటూరు తిరిగొచ్చాడు. 'చంద్రాకి సెకండరీస్ అన్న విషయం అక్టోబర్ ఎనిమిదినే తెలుసు.' అని చంద్రా గురువు ప్రొఫెసర్ A.సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఆశ్చర్యపోయాను.

అంటే ఆ రోజు తరవాత.. చంద్రా ఆరోగ్య పరిస్థితి గూర్చి తెలీకుండానే.. ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడాను. బహుశా అక్టోబర్ చివర్లో అనుకుంటాను. 'రాణి శివశంకర శర్మ గారు వచ్చారు. రాకూడదు? కబుర్లు చెప్పుకుందాం.' అన్నాడు. నాకు కుదర్లేదు.



డిసెంబర్లోనే ఒక అజ్ఞాత అగంతక ఫోన్ కాల్. ఎవడో ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడాడు. "నాకు పిచ్చా? నాకు నిద్రమాత్రలిచ్చి చంపేస్తావా? నీ సంగతి తేలుస్తాను. దమ్ముంటే ఆస్పత్రిలోంచి బయటకి రా! ఇవ్వాళ నువ్వు నా చేతిలో.... " ఫోన్ కట్ చేశాను.

ఎవడో పేషంటనుకుంటాను. బాగా తెలిసిన గొంతే! నర్స్ ని పిలిచి రోడ్డు మీద ఎవడన్నా ఉన్నాడేమో చూడమని చెప్పబోతుండగా.. మళ్ళీ ఫోన్.

"ఏంటి రమణా! మరీ అంత భయపడ్డావ్? నా గొంతు కూడా గుర్తు పట్టలేకపొయ్యావే!" ఫోన్లో పెద్దగా నవ్వుతూ చంద్రా!

జనవరి మూడున ఫోన్ చేసి 'పదిహేనున గురజాడ సాహిత్యం పంపిస్తాను.' అన్నాడు. పంపలేదు. పదిహేడున ఫోన్ చేశాను.

నీరసంగా 'ఎవరు?' అన్నాడు.

'నువ్వు పంపిన గురజాడ సాహిత్యం అందింది. థాంక్స్!' వ్యంగ్యంగా అన్నాను.

కొడుకు శశాంక్ ఫోన్ అందుకుని 'నాన్నకి నడుం నొప్పి, వంట్లో బాగా లేదు.' అన్నాడు.

తరవాత పెద్దగా రాయడానికి ఏమీ లేదు. నాలాంటి ఎందరో స్నేహితుల్ని దుఃఖసాగరంలో ముంచేసి చంద్ర వెళ్లిపోయాడు.

భారతి మాటలు నన్ను కదిలించాయి.

"నువ్వు అదృష్ట వంతుడువి రమణా! చంద్రాని చివరి స్థితిలో నువ్వు చూళ్ళేదు. అతను సరదాగా కబుర్లు చెప్పడం మాత్రమే నీకు గుర్తుండిపోతుంది. ఐసీయూలో చంద్రాని చూసిన తరవాత.. డెడ్ బాడీ లోనే చంద్ర ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది. మనందరికీ నవ్వుతూ, హడావుడిగా, సరదాగా కనిపించిన చంద్రా వేరు.. హాస్పిటల్లో నొప్పితో నరకయాతన పడుతూ.. జీవం లేని కళ్ళతో.. మైగాడ్! నిమ్స్ కి ఎందుకు వెళ్ళానా అనిపించింది."


యాభై వసంతాలు కూడా చూడకుండానే వెళ్ళిపొయ్యాడు చంద్ర. పౌరహక్కుల ఉద్యమ కర్తలు బాలగోపాల్, కన్నాభిరాన్, చంద్రశేఖర్.. స్వల్ప వ్యవధిలోనే నిష్క్రమించారు. వీళ్ళ మధ్య ఏదైనా సీక్రెట్ అవగాహన ఉందా!? వీరి నిష్క్రమణతో పౌరసమాజానికి మాత్రం చాలా ఘోరమైన నష్టం కలిగింది.

ఏంటి చంద్రా! ఎందుకింత హడావుడిగా వెళ్లిపోయ్యావ్? అన్నిట్లోనూ హడావుడేనా? నాకు ఏ ఇబ్బంది కలిగినా ముందు నీకే ఫోన్ చేశాను. నీ మాట నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చేది. నువ్వు లేని ఈ ప్రపంచం చాలా వెలితిగా, ఇరుగ్గా ఉంది మిత్రమా! ఐ మిస్ యూ మై బాయ్!

'మీ ఇంగ్లీష్ వైద్యం ఒక బోగస్. ఇది ఒక వ్యవస్థీకృతమైన దోపిడీ. దీని మూలాలు... కొలనైజేషన్.. గ్లోబలైజేషన్.. అనార్కిజమ్.. మార్క్సిజం.. పోస్ట్ మోడర్నిజం.. ఏంటి మోడర్నిటి.. ఫ్రాయిడ్.. ఫూకు.. బౌమన్.. నీషే.. రస్సెల్.. ' హఠాత్తుగా మెళకువొచ్చింది.

అయ్యో! ఇదంతా కలా! ఇక నాకు చంద్రా కనిపించడా! వినిపించడా! ఈ కల నిజమైతే ఎంత బాగుణ్ను!

('Chandra' photos courtesy : బి.శశాంక్)


Thursday 14 February 2013

'ఓహో మేఘమాలా.. '! కొంప ముంచితివి గదా!!


"గురు గారు! నాకు దిగులుగా ఉంది. ఈ మధ్య నా బ్రతుకు మరీ ఆఫ్ఘనిస్తాన్ లా అయిపోయింది."

"అంత కష్టమేమొచ్చి పడింది శిష్యా!"

"నా భార్య పోరు పడలేకున్నాను. ఆవిడకి నా సంపాదన చాలట్లేదుట."

"పోనీ నచ్చజెప్పి చూడకపొయ్యావా?"

"ఆన్నీ అయిపొయ్యాయండీ. నాకు జీవితం మీద విరక్తి పుట్టేసింది. మీరు మరో శిష్యుణ్ణి వెతుక్కోండి. సెలవు."

"తొందరపడకు శిష్యా! నే చెంతనుండగా నీకు చింతనేలా? సంగీత చికిత్సతో నీ భార్యలో పరివర్తన కలిగిద్దాం."

"సంగీత చికిత్సా?!అంటే?"

"పాత తెలుగు సినిమాల్లో బోల్డన్ని మంచి పాటలు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ఒక్కో పాటకి ఒక్కో రకమైన వైద్య గుణం ఉంటుంది. మొన్నొక నిద్ర లేమి రోగం వాడొచ్చాడు. రాత్రిళ్ళు మంచం మీద పడుకుని 'నిదురపోరా తమ్ముడా.. ' పాట వినమని సలహా ఇచ్చా. అంతే! ఆ రోజు నుండి వాడు రాత్రింబవళ్ళు గురకలు పెట్టి మరీ నిద్రోతున్నాడు."

"నిజంగానా! నా భార్యకి మీ సంగీత వైద్యం పని చేస్తుందంటారా?"

"నిస్సందేహంగా. సంగీతానికి రాళ్ళే కరుగుతాయంటారు. ఆడవారి మనసు కరిగించేందుకు ఒక మంచి పాట చెబ్తాను. అది చూపి నీ భార్యని నీకు చరణదాసిగా చేసుకో. ఈ విడియో చూడు."



"పాట చాలా బాగుందండి."

"ఎస్.రాజేశ్వరరావు సంగీతంలో తిరుమల లడ్డంత తియ్యదనం ఉందోయి. సదాశివ బ్రహ్మం కవిత్వం కాకరకాయ వేపుడంత కమ్మగా ఉంటుంది. ఘంటసాల, లీలల గానంలో వైబ్రేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి మల్టిప్లై అయ్యి అణుక్షిపణి వలే శక్తివంతమవుతాయి. ఆ క్షిపణి నీ భార్య చెవులో కర్ణభేరిని తాకి మెదడులో ప్రకంపనలు కలిగిస్తుంది. అంతే! కఠినమైన ఆమె మనసు క్వాలిటీ ఐస్ క్రీములా కరిగిపోతుంది. పిమ్మట నీ భార్య గుండమ్మకథలో సావిత్రంత అనుకూలవతిగా మారిపోతుంది."

"గురు గారు! ఈ పాటని నాగేశ్వర్రావు, సావిత్రి  పాడుకున్నారు. వాళ్ళు పాడిన పాట నా భార్యనెట్లా మారుస్తుంది?"

"చూడు శిష్యా! ఇక్కడ ఎవరు ఎవరి కోసం పాడారన్నది కాదు పాయింట్. పాటలోని కంపనలు, ప్రకంపనలు ముఖ్యం. మనసులోని భూతులు, అనుభూతులూ ప్రధానం. అందుకే గత యాభయ్యారేళ్ళుగా ఈ పాట తెలుగు వారిని మందు కొట్టకుండానే మత్తెక్కిస్తుంది."

"మీరు చెప్పేది సరీగ్గా అర్ధం కావట్లేదు గానీ.. వింటానికి బానే ఉంది. వర్కౌట్ అవుతుందంటారా?"

"నా సలహా గురి తప్పదు శిష్యా! అయితే ఒక కండిషన్. నీ భార్యని ఇంటికి ఈశాన్యం మూలకి తీసుకెళ్ళి ఈ పాటని చూపించు. ఆ సమయంలో లాప్టాప్ తూర్పు దిక్కుకి తిప్పి ఉంచాలి. గుర్తుంచుకో. పొమ్ము. విజయుడవై రమ్ము!"


           *                                *                                 *                            *

"గురు గారు! కొంప మునిగింది."

"ఏమిటి నాయనా ఆ కంగారు? సత్తుబొచ్చెకి సొట్టల్లా వంటి నిండా ఆ దెబ్బలేమిటి?"

"మీ సలహా విన్న ఫలితం. మీరు కొండ నాలుక్కి మందేశారు.. ఉన్న నాలుక పోయింది."

"తిన్నగా చెప్పి అఘోరించు శిష్యా!"

"మీరు చెప్పినట్లే నా భార్యకి 'ఓహో మేఘమాల.. ' విడియో చూపించాను. ఆవిడ ఆ పాట చూసి ఎంతగానో ఆనందించింది. మీ వైద్యం పంజేసిందని సంతోషించాను. సావిత్రి మెళ్ళో నాగేశ్వరరావు పెట్టిన హారం ఆవిడకి బాగా నచ్చిందిట. అదిప్పుడు అర్జంటుగా కావల్ట."

"అంత సొమ్ము నీ దగ్గరెక్కడిది?"

"నేనూ అదే సమాధానం చెప్పాను. 'సినిమాలో నాగేశ్వరరావు మాత్రం ఆ హారం కొని సావిత్రికి పెట్టాడా? కొట్టుకొచ్చిందేగా. ఆ మాత్రం నీకు చేత కాదా?' అంది."

"దొంగతనం మహాపాపం శిష్యా!"

"నేనూ ఆ ముక్కే అన్నాను. ఫలితంగా వంటి నిండా ఈ దెబ్బలు. హబ్బా! ఒళ్ళంతా ఒకటే సలపరంగా ఉంది. ఇప్పుడు నాకు దిక్కెవరు గురు గారు?"

"దిక్కులేని వాడికి ఆ దేవుడే దిక్కు నాయనా! అయినా.. తన్నుటకు నీ భార్య యెవ్వరు? తన్నించుకొనుటకు నీవెవ్వరు? అంతా వాడి లీల! మొహం మీదే తలుపేస్తున్నందుకు ఏమీ అనుకోకు. అసలే చలికాలం. నాకు నిద్ర ముంచుకొస్తుంది."

"గురు గారు! గురు గారు.. "


(photos courtesy : Google)

Monday 11 February 2013

'యోగి వేమన' ఆలోచనలు - అభిప్రాయాలు


'చిత్తూరు నాగయ్య.. గొప్ప సైకోథెరపిస్ట్'  అంటూ ఇంతకుముందో పోస్ట్ రాశాను. అందులో 'యోగి వేమన'లో నాగయ్య నటన గూర్చి కొంత రాశాను. అయితే - యోగి వేమన సినిమా గూర్చి ఒక పూర్తిస్థాయి పోస్ట్ రాద్దామనే నా ఆలోచన అలానే ఉండిపోయింది.

నాగయ్యపై పోస్ట్ రాసిన తరవాత కూడా ఈ సినిమా రెండుసార్లు చూశాను. మండుటెండలో చల్లని మజ్జిగ తాగినట్లు, యూట్యూబ్ లో పాటలు వింటూ ఆనందిస్తూనే ఉన్నాను. కానీ కొద్దిగా గిల్టీగా కూడా ఉంది - 'నేను మాత్రమే ఎంజాయ్ చేస్తున్న ఈ మధురానుభూతి గూర్చి ఎంతోకొంత రాసి నలుగురితో పంచుకుంటే బాగుండును కదా!' అనిపించి, 'యోగి వేమన' గూర్చి నా ఆలోచనల్ని రికార్ద్ చేస్తున్నాను. ఇది నాకోసం నేను రాసుకుంటున్న పోస్ట్. ఎవరికైనా నా ఆలోచనలు నచ్చితే సంతోషం. 

A.ప్రింట్ క్వాలిటీ బాగుంది. అరవైయ్యైదేళ్ళ క్రితం సినిమా ఈ క్వాలిటీలో ఉండటం ఆనందించదగిన విషయం. ఇందుకు ఎవరు కారకులో తెలీదు. CD లు మార్కెట్ చేసిన దివ్య విడియో వారు అభినందనీయులు (సినిమా పూర్తి నిడివి యూట్యూబులో లభ్యం). 

B.విజయా / వాహిని వారి అన్ని సినిమాలకి మల్లే ఈ సినిమాలో కూడా ఫొటోగ్రఫీ కాంతివంతంగా, బ్రైట్ గా ఉంది. (కొన్ని పాత సినిమాలు చీకట్లో చూస్తున్నట్లుంటాయి - 'జయభేరి' ఒక ఉదాహరణ.) ఇందుకు కారకుడైన ఛాయాగ్రహకుడు మార్కస్ బార్ట్లే ని ఆభినందిద్దాం.

C.సినిమా టైటిల్స్ ఇంగ్లీషులో ఉన్నాయి. ఆ రోజుల్లో స్క్రిప్ట్ కూడా ఇంగ్లీషులోనే రాసుకునేవారని ఎక్కడో చదివాను. కె.వి.రెడ్డి ఎక్కువ ఇంగ్లీషులోనే సంభాషిస్తాడని కూడా చదివాను. CD కవరుపై నిర్మాత B.N.రెడ్డి అని ఉంది, టైటిల్ కార్డ్స్ లో produced and directed by K.V.Reddi అని ఉంది (ఇట్లాంటి పొరబాట్లని కనుక్కోవడంలో VAK రంగారావు సిద్దహస్తులు).  

D.దర్శకుడు :- కె.వి.రెడ్డి

భోగలాలసుడైన వేమారెడ్డి, యోగి వేమనగా మారిన వైనం ఈ సినిమా సెంట్రల్ పాయింట్. కావున కథ పూర్తిగా వేమారెడ్డి వైపు నుండే నడుస్తుంది. వేమారెడ్డి విలాసపురుషుడు. అన్నగారు పెదవేమారెడ్డి (రామిరెడ్డి) రాచకార్యాలు చూస్తుంటాడు. వేమారెడ్డికి అన్న కూతురు జ్యోతి అంటే అంతులేని ప్రేమ. స్నేహితుడు అభిరాముడితో కలిసి బంగారం తయారుచేసే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. వేమారెడ్డి మోహనాంగి అనే వేశ్య మోజులో మునిగి తేలుతుంటాడు. మోహనాంగికి (కనకాభిషేకం చెయ్యడానికి) అన్నగారు వసూలు చేసిన శిస్తు సొమ్ము వాడేస్తాడు. ఫలితంగా పెదవేమారెడ్డి చెరసాల పాలవుతాడు. తనకెంతో ఇష్టమైన జ్యోతి జబ్బుచేసి 'చిన్నాన్న' అంటూ కలవరిస్తూ మరణిస్తుంది. విరక్తితో పిచ్చివాళ్ళా స్మశానాల వెంటా, గుళ్ళ వెంటా తిరుగుతాడు. శివయోగి (రాయప్రోలు) ఉపదేశంతో యోగిగా మారతాడు. చివరకి గుహప్రవేశం (సజీవ సమాధి?) చేస్తాడు. టూకీగా ఇదీ కథ.

సినిమా చూస్తుంటే ఒక నవల చదువుతున్నట్లుంటుంది. సన్నివేశాలు బిగువుగా, క్లుప్తంగా ఉంటాయి. సినిమా ప్రయాణం చాలా స్మూత్ గా, ఫోకస్డ్ గా ఉంటుంది, అనవసరమైన సన్నివేశం ఒక్కటి కూడా లేదు. నిడివి తగ్గిద్దామని ఎంత ప్రయత్నించినా, ఒక్క నిముషం కూడా ఎడిట్ చెయ్యలేం.

నాకు సినిమా గూర్చి సాంకేతిక పరిజ్ఞాం లేదు. అయితే ప్రతి సినిమా కథకి ఒక మూడ్ ఉంటుంది. సినిమా అసాంతం ఆ మూడ్ క్యారీ చెయ్యడం మంచి సినిమా లక్షణం అని నా అభిప్రాయం. ఆవారా, గాడ్ ఫాదర్ లాంటి క్లాసిక్స్ చూస్తున్నప్పుడు ఈ అభిప్రాయం బలపడింది. ఆ రకంగా చూస్తే కె.వి.రెడ్డి నూటికి నూరుపాళ్ళు విజయం సాధించాడు.

వేమారెడ్డి మోహనాంగితో ఆటపాటలతో ఎంజాయ్ చేస్తుంటే మనక్కూడా హాయిగా ఉంటుంది. జ్యోతి మరణంతో ప్రేక్షకుడు కూడా వేమారెడ్డితో పాటు దుఃఖంలో కూరుకుపోతాడు. ఆపై హీరోతో పాటు మనకి కూడా జీవితం పట్ల అంతులేని విరక్తి, వైరాగ్యం కలుగుతాయి. ఈ విధంగా కె.వి.రెడ్డి మనల్ని తీసుకెళ్ళి హోల్సేల్ గా వేమనకి అప్పగించేస్తాడు.

ప్రేక్షకుణ్ని ఇలా గైడ్ చేస్తూ ప్రధానపాత్రతో మనని మనం ఐడెంటిఫై చేసుకునేట్లు చెయ్యడం గొప్ప దర్శకత్వ ప్రతిభకి తార్కాణం అని నా నమ్మకం. 'యోగి వేమన' గూర్చి ఆరున్నర దశాబ్దాల తరవాత కూడా నేను రాయడానికి ప్రధాన కారణం ఇదే.

సహకార దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత కమలాకర కామేశ్వరరావుకి కూడా అభినందనలు.

సందర్భం కనుక ప్రస్తావిస్తున్నాను, 'యోగి వేమన' సినిమా శ్రీశ్రీకి నచ్చలేదు (మాలి, మాసపత్రిక, మే 1947). 

"వేమన్న మూఢ విశ్వాసాలకి విరోధి. కానీ వేమన్న చిత్రాన్ని చూచిన తర్వాత మన ప్రజలలో మూఢవిశ్వసాలు మరింత పదిలమవుతాయి. వేమన జిజ్ఞాసి, సాధకుడు, మన అందరివంటి మానవుడు. అతనికి మానవాతీత శక్తులంటగట్టడం అనవసరం. గుడ్డిమనిషికి కళ్ళిచ్చాడని చూపించడం వల్ల వేమన్న ఆధిక్యం స్థాపించబడదు." (పేజ్ నంబర్ 329, శ్రీశ్రీ వ్యాసాలు, విరసం ప్రచురణ, 1990.)

శ్రీశ్రీ వేమన తత్వం గూర్చి మంచి అవగాహన కలిగినవాడు. ఆయన కె.వి.రెడ్డి దగ్గర్నుండి ఊహించినంత గొప్పగా సినిమా లేకపోవడంవల్ల చికాకుతో ఈ రివ్యూ రాశాడనుకుంటున్నాను.

E.నటీనటులు.

1.చిత్తూరు నాగయ్య :- వేమారెడ్డి / యోగి వేమన.

ఇంతకుముందు ఈ సినిమా చూసినప్పుడు వేమారెడ్డిగా నాగయ్య నటన ఏవరేజిగా అనిపించింది. నాకెందుకో ఆయన మోహనాంగి ఇంటికి వెళ్ళేప్పుడల్లా ఏదో శంకర విలాస్ లో కాఫీ తాగడానికి వెళ్తున్నట్లు అనిపించింది. వేశ్య దగ్గరకి వెళ్ళే వ్యక్తి విరహతాపంతో ఊగిపోవాలి, నాగయ్యలో నాకా ఫీలింగ్ కనబళ్ళేదు. 

వేమారెడ్డిగా నాగయ్య యాంత్రికంగా నటించాడనడానికి ఒక ఉదాహరణ.. కొలనులోంచి తడచిన దుస్తులతో బయటకొచ్చిన మోహనాంగి (M.V.రాజమ్మ) నుండి దృష్టి మరల్చుకోలేం. కానీ నాగయ్య ఆవిడని సరీగ్గా చూడడు! పట్టించుకోడు, పైగా చీర కట్టుకు రమ్మంటాడు, ఔరా! ఇదేమి రసికత్వం!!

మోహనాంగి దగ్గరకి హడావుడిగా బయల్దేరతాడు వేమారెడ్డి. 

అన్న కూతురు జ్యోతికి వళ్ళు బాగుండదు. 'నన్ను వదలి వెళ్ళకు చిన్నాయనా!' అంటుంది జ్యోతి. 

అంతే! చిన్నపిల్ల అడగంగాన్లే మోహనాంగిని మర్చిపోయి.. ఆనందంగా, మధురంగా "అందాలు చిందేటి నా జ్యోతి.. " అంటూ పాడేస్తాడు. 

పాప పట్ల ఎంత ప్రేమున్నా, సౌందర్యవతి సాంగత్యం కోసం తపించిపొయ్యేవాడి ముఖంలో డిజప్పాయింట్మెంట్ కనబడాలి. నాగయ్యలో నాకు లేశమాత్రమైనా ఆ భావం కనబడలేదు.

దాదాపు ఇవే సన్నివేశాలతో తీసిన ఎన్టీఆర్ 'పాండురంగ మహత్యం' గుర్తు తెచ్చుకోండి. బి.సరోజాదేవిపై మోహంతో ఎన్టీఆర్ తపించిపోతాడు. సినిమా మొదట్లో వేశ్యాసాంగత్యం కోసం ఎంతగా పరితపిస్తాడో.. తరవాత దైవభక్తిలో అంతగా చరితార్ధుడవుతాడు. మొదటి భాగంలో ఎంత నెగెటివ్ షేడ్స్ ఉంటే రెండో భాగం అంత బాగా పండుతుంది. ఇది సింపుల్ బ్యాలెన్సింగ్ యాక్ట్.

మళ్ళీ మనం 'యోగి వేమన' కి వచ్చేద్దాం. వేమారెడ్డి, మొహానాంగిల మీటింగ్స్ మరీ మెకానికల్ గా ఉండటానికి కారణం ఏమిటబ్బా! నాకు తోచిన కొన్ని కారణాలు.

a)బహుశా 1947 (స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం) లో స్త్రీ లోలత్వాన్ని నటించడానికి కొద్దిగా మొహమాటాలు / మోరల్ రీజన్స్ ఉండి ఉండొచ్చు.

b)ఈ సినిమా కె.వి.రెడ్డి, చిత్తూరు నాగయ్యలది. వీళ్ళు మరీ సాత్వికులు, పెద్దమనుషులు. స్త్రీలోలుని చూపులు ఎలా ఉంటాయో నాగయ్యకి తెలీదు, చెప్పి చేయించుకోడానికి కె.వి.రెడ్డికీ తెలీదు. అందుకే నాగయ్యకి M.V.రాజమ్మని 'ఎలా చూస్తూ' నటించాలో తెలిసుండకపోవచ్చు!

c)ఇంకో కారణం. హీరో, దర్శకుడు.. ఇద్దరికీ పూర్తి ఫోకస్ వేమన మీదే. వేమన పార్ట్ కోసం వేమారెడ్డిని హడావుడిగా చుట్టేసినట్లు అనిపించింది.

ఈ సినిమాలోని ఇంత గొప్పలోపాన్ని కనుగొన్న నేను మిక్కిలి సంతసించాను. ఒక గొప్ప సినిమాలో అతి పెద్ద లోపాన్ని కనిపెట్టాను. శెభాష్! ఆలస్యమేలా? పోస్ట్ రాసేద్దాం. ఇంతలోనే ఒక అనుమానం. ఆపాటి ఆలోచన కె.వి.రెడ్డికి తట్టలేదా? నా అవగాహనలో ఎక్కడో ఏదో తేడా ఉంది! ఏమిటది? కావున, సినిమా మొత్తం మళ్ళీ చూశాను. పిమ్మట జ్ఞానోదయం కలిగింది.

'పాండురంగ మహత్యం' పుండరీకుడు వెధవన్నర వెధవ, అర్ధరాత్రి తలిదండ్రుల్ని వెళ్ళగొట్టిన కామాంధుడు. వాడికి కాళ్ళు పోయినప్పుడు మాత్రమే బుద్ధొస్తుంది. చేసిన పాపాలకి పశ్చాత్తాపంతో దహించుకుపోతాడు. కాళ్ళొచ్చిన తరవాత భక్తుడిగా కంటిన్యూ అయిపోతాడు. పుండరీకునికీ, వేమనకీ అస్సలు సామ్యం లేదు.

వేమారెడ్డి సౌమ్యుడు, అభ్యుదయవాది. దేవుడి వస్త్రం తీసుకెళ్ళి చలికి వణుకుతున్న పేదవృద్ధురాలికి కప్పిన మానవతావాది. మోహనాంగిని కూడా నిజాయితిగానే ప్రేమిస్తాడు. అతనికి రాళ్ళనీ, రప్పల్నీ కొలవడం ఇష్టముండదు. అతనిలో జ్యోతి మరణం అంతులేని ఆవేదనని కలుగజేస్తుంది. చావుపుటకల మర్మం గూర్చి నిర్వేదంలోకి వెళ్ళిపోతాడు. తను పాపాలు చేశాననే భావం అతనికుండదు. అసలు పాపపుణ్యాల అస్థిత్వాన్నే ప్రశ్నించే యోగస్థాయికి చేరుకుంటాడు.

మరి - మొన్న ఈ సినిమాలో గొప్పలోపం కనిపెట్టాననుకుని గర్వించానే! కారణమేమి? అనాదిగా తెలుగు సినిమాల్లో పాత్రలు బ్లాక్ అండ్ వైట్ లో, స్టీరియోటైప్డ్ గా ఉంటున్నాయి. మనం వాటికే బాగా అలవాటయి ఉన్నాం. నేనూ ఆ ట్రాప్ లో పడ్డాను.

వేమారెడ్డి వేశ్యాలోలుడు. కాబట్టి చెడ్డవాడు. స్త్రీలోలులకి ఇంకే ప్రయారిటీస్ ఉండరాదు. నాకున్న ఈ చెత్త ఆలోచన మూలంగా.. వేమారెడ్డికి అన్నవదినల పట్ల గౌరవం, పసిదాని పట్ల అంతులేని ప్రేమ కలిగి ఉండటాన్ని అర్ధం చేసుకోలేకపొయ్యాను. వేమారెడ్డిలోని డిఫరెంట్ షేడ్స్ ని దర్శకుడు మొదట్నుండీ చూపుతూనే ఉన్నాడు. నాకే సరీగ్గా అర్ధం అయ్యి చావలేదు.

నేను వేమారెడ్డి పాత్రని అర్ధం చేసుకోడంలో పప్పులో కాలేశాను. కావున పై విషయాలు రాయకూడదనుకున్నాను. కానీ - ఈ పోస్ట్ యోగి వేమన సినిమా గూర్చి నా ఆలోచనలు. కావున అన్ సెన్సార్డ్ గా ఇన్ టోటో రాద్దామని నిర్ణయించుకుని, రాస్తున్నాను.

చిన్నారి జ్యోతి చనిపోయిన తరవాత నాగయ్య నటన గూర్చి వర్ణించడానికి నాదగ్గర భాష లేదు. అంధ బిక్షకురాలి (అంజనీబాయి - సినిమాల్లో నటీమణులకి మేకప్ ఆర్టిస్ట్) బొచ్చెలోంచి అన్నం తింటూ నాగయ్య అద్భుత నటన ప్రదర్శించాడు. వేమన పద్యాలు ఆలపించేప్పుడు నాగయ్య అభినయం అద్భుతం. ఇక చివరి సీన్ తరవాత మహానటుడు నాగయ్య నటనా ప్రతిభకి చేతులెత్తి నమస్కరించడం మినహా చెయ్యగలిగిందేమీ లేదు. నేనదే చేశాను!

2.లింగమూర్తి :- అభిరామ్.

ఈ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడల్లా అందరూ నాగయ్య గూర్చే చెబుతుంటారు. వంకాయకూర బాగుంటే నాణ్యమైన వంకాయల్నీ, వంటమనిషిని మెచ్చుకుంటాంగానీ - ఉప్పూ, కారాల్ని మెచ్చుకోం. కానీ అవి లేకుండా కూరే లేదు. కానీ వాటికి అంత గుర్తింపు ఉండదు. అందుకే - చిత్తూరు నాగయ్య అనే మర్రిచెట్టు ఇతర పాత్రధారుల ప్రతిభని కప్పెట్టేసిందని సినిమా రెండోసారి చూస్తేగానీ తెలీదు.

అభిరాముడిగా ముదిగొండ లింగమూర్తి నటన సూపర్బ్. చాలా సహజంగా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో నాగయ్యకి పోటీగా తట్టుకుని నిలబడ్డాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. నాకు మహామంత్రి తిమ్మరసు, పాండవ వనవాసం సినిమాల్లోని 'దుష్ట' లింగమూర్తి తెలుసు. 'సాత్విక' లింగమూర్తి తెలీదు.

'పెళ్లిచేసిచూడు' లో దొరస్వామి కూడా నాకిట్లాంటి షాకే ఇచ్చాడు. ఈ పాత సినిమాలు చూస్తుంటే క్రమంగా నాకొక విషయం అర్ధమవుతుంది. పాతతరం నటులైన లింగమూర్తి, దొరస్వామి వంటి గొప్ప ప్రతిభావంతులని మనకి తెలీదు. అందుకే సూపర్ హిట్టయిన సినిమాలు ఒకటో, రెండో చూసి ఏదో సాదాసీదా సపోర్టింగ్ ఆర్టిస్టుల్లే అనుకుంటాం.. కానీ కాదు.

3.M.V.రాజమ్మ :- మోహనాంగి.

రాజమ్మ గూర్చి ఎంత రాసినా తక్కువే! అందం, అభినయం, గానం, నాట్యం.. అన్నీ అద్భుతమే! ఐ యామ్ ఇన్ లవ్ విత్ దిస్ బ్యూటీ! అయితే అప్పటికి నేనింకా పుట్టలేదు. అందువల్ల బి.ఆర్.పంతులు ఆ చాన్స్ కొట్టేశాడు. రాజమ్మ తన ఆటపాటలతో దుమ్ము దులిపేసింది.

రాజమ్మ గుళ్ళో ఆడిన పాటలో వెనక నల్లగా, పీలగా, నెత్తి మీద (తల కన్నా పెద్దదైన) పాగ పెట్టుకుని తాళం వేస్తూ ఒకాయన ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి. ఆయన మన ఘంటసాల మాస్టారు! ఘంటసాల పక్కన బక్కగా, పొట్టిగా ఉన్న అమ్మాయి సీత (దేవదాసులో పార్వతి స్నేహితురాలు మనోరమ). సినిమాలో మోహనాంగి చెల్లెలు 'కనకం' పాత్ర వేసింది.

4.కాంతామణి :- మోహనాంగి తల్లి.

ఈ సినిమాలో నన్ను ఆశ్చర్యపరచేంత సహజంగా నటించిన నటి. వేశ్యమాతగా నటించిన కాంతామణి సూర్యాకాంతం, చాయాదేవిలతో పోల్చదగినంతటి ప్రతిభావంతురాలు. ఆవిడ ఆంగికం, వాచకం గ్రేట్! ('దొంగరాముడు' లో 'నే చచ్చిపోతారా భద్రుడూ!' అంటూ రేలంగి తల్లిగా కూడా నటించింది.)

5.నరసమాంబ (వేమన వదిన) :- పార్వతీబాయి.

వేమారెడ్డి వదిన నరసమాంబగా పార్వతి బాయి చక్కగా ఉంది. వేమారెడ్డికి బాధ్యతల్ని గుర్తు చేస్తూ - ఒక పక్క అతనిపై ప్రేమ, అభిమానం.. ఇంకోవైపు చెడిపోతున్నాడన్న బాధ.. ఎంతో ఉదాత్తంగా, డిగ్నిఫైడ్ గా నటించింది.

6.జ్యోతి :- బేబీ కృష్ణవేణి.

ముద్దుగా చక్కగా చేసింది. ఈ పాపకి ఇప్పుడు డెబ్భైయ్యైదేళ్ళు దాటి ఉంటాయి. ఇప్పుడెవరైనా టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే బాగుండు. 

F.నేపధ్య గానం :-

1.నాగయ్య :-

నాగయ్య గానం గూర్చి రాసేంత శక్తిమంతుణ్ని కాదు.. శిరసు వంచి పాదాభివందనం చేయడం తప్ప! అయితే చిన్న పాయింట్.. అందరూ 'అందాలు చిందేటి నా జ్యోతి.. ' పాటని మెచ్చుకుంటారు. నాకు మాత్రం శ్మశానంలో వచ్చే నేపధ్యగానం 'ఇదేనా.. ఇంతేనా.. ' పాట చాలా ఇష్టం. ఇంత మంద్రస్థాయిలో పాడటం నాగయ్యకే చెల్లింది. (ఈ పాట నన్నెంతగా ఏడిపించిందో ఇంతకు ముందు రాశాను.)

2.బెజవాడ రాజారత్నం :-

నాకు ఈ సినిమా చూసేదాకా బెజవాడ రాజారత్నం గూర్చి తెలీనందుకు సిగ్గుపడుతున్నాను. చాలా క్లీన్ వాయిస్. అద్భుత గానం. 'మాయలు పడకే మనసా.. ' అంటూ స్పాంటేనియస్ గా, అలవోకగా పాడేసింది. నేను ఈవిడ గూర్చి తెలుసుకోవలసింది ఇంకా చాలా ఉంది.

G.సంగీతం :- చిత్తూరు నాగయ్య

వేమన పద్యాలకి 'సంగీత దర్శకుడు' నాగయ్య చాలా భావయుక్తంగా ట్యూన్లు చేశాడు. 'గాయకుడు' నాగయ్యతో అద్భుతంగా పాడించాడు. ముఖ్యంగా 'గంగిగోవు పాలు చాలు.. ' సూపర్బ్.

సినిమా మూడ్ క్యారీ చెయ్యడానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన పాత్ర వహించిందని నా అభిప్రాయం.. ముఖ్యంగా చివరి సీన్లో.

H. మాటలు, పాటలు :- సముద్రాల రాఘవాచార్య

మాటలు మనం మన ఇంట్లో మాట్లాడుకున్నట్లుగానే ఉన్నాయి. ఏ పాత్రా ఒక్క వాక్యం కూడా 'అతి'గా మాట్లాడలేదు.నాకు మాటలు ఇలా పొదుపుగా ఉంటేనే ఇష్టం. ఇక పాటల సాహిత్యం గూర్చి ఇవ్వాళ నే కొత్తగా చెప్పేదేముంటుంది?!

I.మేకప్ :- హరిబాబు.

యోగసిద్ధి సాధించిన వేమనని కె.వి.రెడ్డి వేమన పద్యాలతో క్రమేపి వృద్ధుడిగా మార్చేస్తాడు. అసలీ ఐడియా వచ్చినందుకే కె.వి.రెడ్డిని మనం అభినందించాలి. ఇంకో దర్శకుడైతే కథని ముందుకు నెట్టడానికి ఏం చెయ్యాలో తోచక గిలగిల్లాడి చచ్చేవాడు. కె.వి.రెడ్డి మాత్రం ఈ ఫీట్  హరిబాబు మేకప్ (మార్కస్ బార్ట్లే ఫొటోగ్రఫీ కూడా) సాయంతో అవలీలగా చెయ్యగలిగాడు. ఈ మేకప్ హరిబాబు 1947 లోనే వండర్స్ చేశాడు.. అసాధ్యుడులాగున్నాడు.

ఇంతటితో యోగి వేమన సినిమా 'కంటెంట్' గూర్చి నా ఆలోచనలు రాయడం అయిపోయింది.

J.సినిమాతో సంబంధం లేని ఆలోచన.

ఈ సినిమా ఎప్పుడు చూసినా రెండ్రోజుల దాకా వైరాగ్యం నన్ను వదలదు.జీవితంపై విరక్తి కలుగుతుంది. 'రోగి ఎవ్వడు? డాక్టరెవ్వడు? భార్య ఎవరు? జీవితమంతయూ మిధ్యయే కాదా? మరప్పుడు ఈ వెధవ జీవితానికి అర్ధమేమిటో విశ్వదాభిరామ వినురవేమ!' అనే మూడ్ లో ఉండిపోతాను. (గుంటూరులో గుహలు లేవు కాబట్టి బ్రతికిపొయ్యాను. లేకపోతే నేనూ ముమ్మిడివరం బాలయోగిలా అయిపొయ్యేవాణ్ణేమో!)

అరవయ్యైదేళ్ళ తరవాత సినిమా చూసిన నాకే ఇంత వైరాగ్యం కలుగుతుందంటే, నటించిన నాగయ్యకి ఇంకెలా ఉండాలి? అందుకే నాగయ్య నిజజీవితంలో కూడా బైరాగి అయిపొయ్యాడు. కష్టాలు పడ్డాడు. నాగయ్య ఇలా అయిపోవడం occupational hazard క్రిందకి వస్తుందా?!

చివరి మాట :-

ఈ సినిమా గూర్చి నా ఆలోచనలు మొత్తంగా మూట కట్టి దాచుకోవాలనే కోరికే నన్నీ పోస్ట్ రాయించింది. చదువుకోడానికి కొద్దిగా నిడివి ఎక్కువైందని తెలుసు. క్షమించగలరు.

(ఈ పోస్ట్ నా సైకోథెరపిస్ట్ చిత్తూరు నాగయ్యకి నేను సమర్పించుకున్న ఫీజు. హమ్మయ్యా! ఇప్పుడు ఋణ విముక్తుడనైనాను.)

(photos courtesy : Google)

Wednesday 6 February 2013

థాంక్స్ టు కాంగ్రెస్ హై కమాండ్!


"ఎరక్కపోయి అన్నాను. ఇరుక్కుపోయ్యాను." అప్పటికి అరవై మూడోసారి అనుకున్నాడు రాంబాబు.

ఫిల్టర్ కాఫీ తాగుతూ, టీవీ చూస్తున్నాడన్న మాటే గానీ.. మనసు మనసులో లేదు.

అది ఆదివారం. సమయం సాయంత్రం నాలుగు గంటలవుతుంది. భార్య ఇందిర వంటింట్లో బిజీగా ఉంది.

రాంబాబు, ఇందిరల జంట "రంగమ్మ కథ" లో మనకి పరిచయమే. వారికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ఎనిమిది, చిన్నవాడు ఆరో క్లాసు చదువుతున్నారు. పెద్దవాడిది తండ్రి పోలిక. కొంచెం మెతక. రెండోవాడిలో ఇందిర లక్షణాలు ఎక్కువ.

మొదట్నుండీ రాంబాబుకి పుస్తక పఠనం అనేది చాలా ఇష్టమైన కార్యం. అరిగిపోయిన తెలుగు భాషలో చెప్పాలంటే అతనో 'పుస్తకాల పురుగు.'

పెళ్ళైన కొత్తలో ఇందిరకి రాంబాబు హాబీ పెద్దగా ఇబ్బంది అనిపించ లేదు గానీ.. క్రమేణా ఆవిడకి చికాగ్గా అనిపించసాగింది. మొదట్లో చెప్పి చూసింది. ఆ తరవాత పొద్దస్తమానం పుస్తకాల మధ్యన బ్రతికేసే రాంబాబుని ఇందిర పట్టించుకోవడం మానేసింది.

పిల్లలు ఇందిరని అడుగుతుంటారు. "అమ్మా! నాన్నెందుకు ఎప్పుడూ అలా పుస్తకాలు చదువుతుంటాడు? పరీక్షలా?" అని. పరీక్షల్లేకపోయినా దీక్షగా పుస్తకాలు చదివే రాంబాబు కాన్సెప్ట్ పిల్లలకి అర్ధం కాలేదు.

ఈ విధంగా ఆ ఇంట్లో అందరికీ ఒక స్థిరమైన ప్రవర్తనా నియమావళి ఏర్పడిపోయింది. రాంబాబు ఉద్యోగం చేస్తాడు. పుస్తకాలు చదువుతాడు. ఇందిర వంట చేస్తుంది. పిల్లల చదువుల వ్యవహారం బాగా పట్టించుకుంటుంది. పిల్లలు స్కూలుకెళ్తారు. ఆడుకుంటారు. ఆకలేస్తే అన్నం తింటారు. చదువుకుంటారు. అప్పుడప్పుడు గొడవ చేస్తుంటారు. ఇదీ వరస.

నాల్రోజుల క్రితం ఆ ఇంట్లో అనుకోని సంఘటన ఒకటి జరిగింది. కన్యాశుల్కంలో పూటకూళ్ళమ్మకి, మధురవాణిలకి గల సామ్యం గూర్చి రాంబాబు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతనికి గురజాడ పూటకూళ్ళమ్మ పాత్రని అద్భుతంగా తీర్చిదిద్దినట్లు అనిపించింది.

ఇంతలో రెండో బెడ్రూం లోంచి అరుపులు, కేకలు.. కొద్దిసేపటికి పెద్దగా శబ్దాలు. ఇందిర ఆవేశంతో రాంబాబు రూంలోకి వచ్చింది. కోపంతో మొహం కందిపోయి ఉంది. జుట్టు రేగిపోయింది. కళ్ళల్లో నీళ్ళు. కన్యాశుల్కం ముందేసుకుని తీవ్రంగా యోచించుచున్న రాంబాబుని చూడంగాన్లే ఆమెకి కోపం రెండింతలైంది.

"మహానుభావా! నువ్వు సాహిత్యసేవ చేసుకుంటూ తరించు. పేకాట, తాగుడు కన్నా దరిద్రపు వ్యసనం నీది. నీతో కాపురం చెయ్యడం నావల్ల కాదు. నేను మా పుట్టింటికి పోతున్నా." అంటూ ఆవేశంతో ఊగిపోయింది.

రాంబాబుకి విషయం అర్ధం కాలేదు. పిమ్మట పిల్లల్ని పిలిచి విచారించాడు. ఇందిరని బుజ్జగిస్తూనే విషయాన్ని రాబట్టాడు. పిల్లలు గొడవ చేస్తున్నారు. సరీగ్గా చదువుకోటల్లేదు. ఇందిరని అస్సలు లెక్క చెయ్యట్లేదు. ప్రస్తుతం పిల్లలిద్దరి మధ్యా టీవీలో ఏ చానెల్ చూడాలన్న విషయంలో ఘోరమైన తగాదా.. తన్నులాట జరిగింది.

రాంబాబు కొద్దిసేపు ఆలోచించాడు. సమస్యని ఎలా పరిష్కరించాలో తెలీలేదు. ఇందిర అసలు దోషివి నువ్వేనన్నట్లు రాంబాబునే కొరకొరా చూస్తుంది. రాంబాబుకి వాతావరణం చాలా ఇబ్బందిగా ఉంది. అర్జంటుగా ఈ సిట్యువేషన్ నుండి బయట పడే మార్గం బుర్రలోకి తట్టట్లేదు.

పిల్లల్ని మందలిస్తే హర్టవుతారు. ఇందిరని ఊరుకోమ్మంటే ఆవిడకి కోపం వస్తుంది. అదీగాక పిల్లల ముందు చులకనైపోతుంది. ఏం చెయ్యాలి? ఈ పరిస్థితి నుండి ఎలా బయట పడాలి? పోనీ పిల్లలకి ఏదో ఆశ పెట్టి.. తల్లి మాట వినేట్లు చేస్తే పోలా? ఇదేదో బానే ఉంది.

"పిల్లలూ! మీరు గొడవ చెయ్యకుండా బుద్ధిగా చదువుకోండి. అమ్మ చెప్పినట్లు వినండి. నే చెప్పినట్లు చేస్తే వచ్చే ఆదివారం మిమ్మల్ని మంచి సినిమాకి తీసుకెళ్తాను. సరేనా?" అన్నాడు రాంబాబు.

పిల్లలు ఆనందంతో గంతులేశారు. ఇందిర కొద్దిగా ఆశ్చర్యంగా, ఎక్కువగా అపనమ్మకంగా రాంబాబుని చూసింది.

"నీలో ఇంత మార్పు ఊహించలేదు. పిల్లల గూర్చి పట్టించుకున్నందుకు థాంక్స్! నాకు తెలుసు. నువ్వు చెబితే పిల్లలు వింటారు." అంటూ వంటగదిలోకి వెళ్ళింది.

'ప్రస్తుతానికి గండం గడిచింది. అమ్మయ్య!' అనుకున్నాడు రాంబాబు.

ఆ రోజు నుండి ఆ ఇంటి వాతావరణం మారిపోయింది. పిల్లలు శ్రద్ధగా చదవసాగారు. ఇద్దరూ గొప్ప సఖ్యతతో టీవీ చూడ్డం మొదలెట్టారు. ఇందిరకి చాలా సంతోషం వేసింది. 'ఎంతైనా రాంబాబు తెలివైనవాడు.' అనుకుంది.

మారిన రాంబాబుపై ఇందిరకి మిక్కిలి ప్రేమ పుట్టింది. సుబ్బిరామిరెడ్డి కోట్లు ఖర్చు చేసి కళాకారుల్ని సన్మానించి తన కళాతృష్ణని తీర్చుకున్నట్లు.. ఇందిర రాంబాబుకి అత్యంత ప్రియమైన వంటలు చేస్తూ.. తన ప్రేమని వంటల రూపంలో ప్రదర్శించసాగింది.

రాంబాబుకి గుత్తొంకాయ ఇష్టం. కందిపచ్చడంటే ప్రాణం. నిమ్మకాయ పప్పంటే పరమానందం. చింతపండు పులిహొరంటే చచ్చిపోతాడు. ఇవన్నీ ఆ రోజు నుండి భారీగా, ధారాళంగా వండబడ్డాయి. రాంబాబు సినిమా మంత్రం పిల్లల మీదే కాదు.. ఇందిర మీద కూడా బానే పంజేసింది.

ఇవ్వాళ ఆదివారం. ఇందిర చేసిన బీరకాయ పచ్చడి, ములక్కాడల పప్పుచారు, కాకరకాయ వేపుడుతో భారీ భోజనాన్ని పొట్ట భరీగా పట్టించి 'బ్రేవ్' మని త్రేన్పాడు రాంబాబు.

భుక్తాయాసంతో కొద్దిసేపు చిన్న కునుకేశాడు. ఆపై స్నేహితుడు సుబ్బారావు పంపిన పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అది మనసు ఫౌండేషన్ వారు ప్రచురించిన పతంజలి సాహిత్యం. పుస్తకాన్ని ఆప్యాయంగా తడిమాడు రాంబాబు. అతనికి పతంజలి వ్యంగ్యం ఇష్టం. ఒక్కసారిగా గోపాత్రుడు, వీరబొబ్బిలి, అప్పన్నసర్దార్ మదిలో మెదిలారు. ఇవ్వాళ పతంజలిని పరామర్శించాలి అనుకున్నాడు.

ఒక్కసారిగా పిల్లలు గదిలోకొచ్చి ఆనందంతో అరవసాగారు. "నాన్నోయ్! ఇవ్వాళ ఆదివారం. సినిమా కెళ్తున్నాం." ఉలిక్కిపడ్డాడు రాంబాబు. అప్పటిగ్గాని అతనికి ఇవ్వాల్టి సినిమా ప్రోగ్రాం గుర్తు రాలేదు.

వంటింట్లోంచి నవ్వుతూ వచ్చింది ఇందిర. "సర్లే! తొందరగా స్నానాలు చేసి రెడీ అవ్వండి. నేనీలోపు రాత్రి వంట కానించేస్తాను." అంటూ వంటింట్లోకి వెళ్ళింది.

రాంబాబు సినిమా చూసి యేళ్ళు గడిచాయి. అతనికి సినిమాలంటే బొత్తిగా ఆసక్తి లేదు. ఆ సినిమా హింస భరిస్తూ, చీకట్లో రెండు గంటలు కదలకుండా కూర్చోవడాన్ని తలచుకుని భయకంపితుడైపొయ్యాడు.

ఆ రోజు ఏదో గండం నుండి తప్పించుకోడానికి నోరు జారాడు. పిల్లలు తన మాట సీరియస్ గా తీసుకుని ఇంత బుద్ధిమంతులైపోతారని అతను కలలో కూడా ఊహించని మలుపు!

ఎదురుగా పతంజలి పుస్తకం మందహాసంతో పలకరిస్తుంది. మనసంతా దిగులుగా అయిపోయింది.

'ఎరక్కపోయి అన్నాను. ఇరుక్కుపొయ్యాను.' అరవై నాలుగోసారి అనుకున్నాడు.

పోనీ 'తూచ్!' అంటే!

నో.. నో. పిల్లలకి  ఏదో కారణం చెప్పొచ్చు గాని.. ఇందిర దెబ్బకి తట్టుకోవడం కష్టం. దేవుడా! నాకీ సినిమా గండం తప్పేలా చూడు తండ్రి!


టీవీలో వార్తలు. గులాం నబి ఆజాద్ వారాలకి, నెలలకి రోజులెన్నో లెక్కలు చెబుతున్నాడు. వయలార్ రవి తెలంగాణా కోసం మరింత లోతైన చర్చలు అవసరం అంటున్నాడు. చానెల్ మార్చాడు. ఆ చానెల్లో ఒక పక్క నుండి మధు యాష్కి, ఇంకోపక్క నుండి లగడపాటి తిట్టుకుంటున్నారు.

రాంబాబుకి చిరాకేసింది. 'వీళ్ళందర్నీ ఏ కాన్సంట్రేషన్ కేంపులోనో పడేసి తిండి పెట్టకుండా మాడిస్తేగానీ దేశం బాగుపడదు.' అనుకున్నాడు.

సడన్గా.. ఐడియా! మెరుపు మెరిసింది. కొద్దిసేపటికి బుర్ర కె.వి.పి.రామచంద్రరావులా పని చెయ్యడం మొదలెట్టింది. మరికొంతసేపటికి ఆలోచనలో క్లారిటీ వచ్చేసింది.

ఇంతలో పిల్లలు రాంబాబు దగ్గరకొచ్చారు. "నాన్నోయ్! మొన్న అమ్మ కొన్న కొత్త బట్టలు వేసుకోమా?" అంటూ అడిగారు.

రాంబాబు తల పక్కకి తిప్పుకుని.. పిల్లలకి కనబడకుండా ప్రభాకరరెడ్డిలా ఒక విషపు నవ్వు నవ్వుకున్నాడు. తల మళ్ళీ పిల్లల వైపు తిప్పి చిత్తూరు నాగయ్యలా అమాయకపు నవ్వు నవ్వాడు.

వారిని ఆప్యాయంగా దగ్గరకి పిలిచాడు. అటూఇటూ చూస్తూ ఇందిరకి వినబడకుండా లోగొంతుకతో అడిగాడు. "ఇంతకీ ఏ సినిమాకి వెళ్దాం?"


పిల్లలు ఉత్సాహంగా "నాయక్ కి వెళ్దాం నాన్నా! ఫైటింగులు భలే ఉన్నాయంట. స్కూల్లో మా ఫ్రెండ్స్ చెప్పారు." అన్నారు.

"అవునవును. సినిమా చాలా బాగుందిట. అంతా ఫైటింగు, కామెడీయేనట. తప్పకుండా దానికే వెళ్దాం. అయితే మీ అమ్మ 'సీతమ్మ చెట్టు' కి వెల్దామంటుంది.. " అంటూ అర్దోక్తిగా ఆగాడు.

పిల్లలు వెంటనే "ఛీ.. ఛీ.. అదేం సినిమా? ఒక్క ఫైటింగు కూడా లేదు. నాయక్ కి వెళ్ళాల్సిందే!" అన్నారు.

రాంబాబు 'అమ్మయ్య' అనుకున్నాడు.

"తప్పకుండా మీరు చెప్పిన సినిమాకే వెళ్దాం. మీ ఇష్టమొచ్చిన బట్టలు వేసుకోండి. అమ్మని కూడా నాయక్ సినిమాకే ఒప్పిస్తాను." అంటూ వంట గదిలోకి వెళ్ళాడు.

వంటింట్లో ఇందిర హడావుడిగా రాత్రి భోజనంలోకి బెండకాయ వేపుడు చేస్తుంది. రాంబాబు ఇందిర వైపు ప్రేమగా, ఆప్యాయంగా చూశాడు. ఇందిరకి రాంబాబు చూపులో అక్కినేని నాగేశ్వర్రావు కనబడ్డాడు. తను కూడా అతన్ని జమునలా మురిపెంగా చూసింది.

"ఇందూ! మా ఆఫీసులో అందరూ సీతమ్మ చెట్టు సినిమా చాలా బాగుందన్నారు. సెంటిమెంట్ చాలా బాగుందట. నీతో కలిసి ఆ సినిమా చూడాలని కోరికగా ఉంది. మనం ఆ సినిమాకి వెళ్తే బాగుంటుందేమో?"

చిన్నపిల్లాడిలా బ్రతిమాలుతున్న భర్తని చూడంగాన్లే ఇందిరకి జాలి కలిగింది. సావిత్రిలా కరిగిపోయింది.

'ఇంత చిన్న విషయానికి కూడా తన పర్మిషన్ అడుగుతున్న ఈ సున్నిత హృదయుడు నాకు భర్తగా లభించడం నా అదృష్టం. ఆ పుస్తకాల పిచ్చి ఉందనే గానీ.. మనసు మాత్రం బంగారం.' అని మురిసిపోతూ "అలాగే! తప్పకుండా." అని మాటిచ్చింది.

"పిల్లలకి సీతమ్మ చెట్టు ఫ్యామిలీ సెంటిమెంట్ నచ్చదేమో?" సందేహంగా అడిగాడు.

"వాళ్ళ మొహం! వాళ్ళు నేనెంత చెబితే అంతే!" గర్వంగా అంది.

"థాంక్యూ ఇందూ! యు ఆర్ మై డార్లింగ్!" అంటూ బెడ్రూంలో పిల్లల దగ్గరకి వెళ్ళాడు.


"పిల్లలూ! అమ్మ సీతమ్మ చెట్టుకే వెళ్దామంటుంది. ఆ సినిమా దరిద్రంగా ఉంటుంది. అందులో ఒక్క ఫైటింగు కూడా ఉండదు. మీకసలా సినిమా అర్ధం కూడా కాదు. అమ్మ మాట కాదంటే ఊరుకోదు. ఎంత చెత్తైనా ఆమె ఇష్టప్రకారం ఆ చెట్టు సినిమాకే వెళ్ళాలి. ఇంక బయల్దేరండి." అంటూ తను కూడా సినిమాకి రెడీ అవుతున్నట్లు హడావుడి చేశాడు.

పిల్లలకి రాంబాబు చెప్పింది నచ్చలేదు. అందులో చిన్నవాడికి కోపం ఎక్కువ.

"నేను నాయక్ సినిమాకయితేనే వస్తాను. ఏడుపు సినిమాలకి రాను." అంటూ అరుస్తూ వంటగదిలోకి పరిగెత్తాడు. వాణ్ని ఫాలో అవుతూ పెద్దవాడూ వంటింట్లోకి వెళ్ళాడు.

రాంబాబు రెండు చెవులూ వంట గది వైపు వేశాడు. అక్కడ కొద్దిసేపు వాదనలు, ప్రతి వాదనలు. ఇంకొద్ది సేపటికి కేకలు, అరుపులు, శబ్దాలు. ఇంకా కొద్దిసేపటికి వంటింట్లోంచి ఆవేశంతో ఇందిర హాల్లో కొచ్చింది.

"వేలెడు లేడు వెధవ! ఫైటింగ్ సినిమా కావల్ట! నా మాటకి విలువ లేదా? ఇప్పుడే చెబుతున్నాను.. రామం! వెళ్తే సీతమ్మ చెట్టు.. లేకపోతే సినిమా ప్రోగ్రాం కేన్సిల్!"

పెద్దాడికి ఫలానా సినిమా అంటూ పట్టింపేం లేదు. ఏదొకటి గిట్టిద్డామనుకుంటున్నాడు. ఆ విషయం గట్టిగా చెప్పలేడు. వాడు మన్ మోహన్ సింగ్ లాంటి వాడు. అందుకే వాడికి ఏడుపొస్తుంది.

సమస్యంతా చిన్నవాడితోనే! వాడు ఇందిరతో సమానంగా నాగం జనార్ధనరెడ్డి రేంజిలో ఆవేశపడుతున్నాడు. "నేనేం రాను పో! నీ బోడి సినిమా ఎవడు చూస్తాడు." అంటూ చేతిలోనున్న కోకకోలా పెట్ బాటిల్ విసిరి నేలకేసి కొట్టాడు. హాలంతా కొకకోలా చిమ్మింది.

"అది కాదు నాన్నా! అమ్మ చెప్పినట్లు విని.. " అంటూ చిన్నవాణ్ణి బుజ్జగించబోయ్యాడు రాంబాబు.

"వాడికి పోగరెక్కింది. నోటికేంతోస్తే అంత వాగుతున్నాడు. ఇవ్వాళ సినిమా ప్రోగ్రాం కేన్సిల్. రామం! నువ్వు నీ రూంలోకెళ్ళి పుస్తకం చదువుకో. వాడితో నువ్వేం రాయబారాలు చెయ్యనక్కర్లేదు. నువ్వు ఎవర్నైనా సినిమాకి తీసుకెళ్ళావా.. నేను మా ఇంటికెళ్ళి పోతాను.. జాగ్రత్త!" భద్రకాళి అయ్యింది ఇందిర.

పాకిస్తాన్, ఇండియా సైనికుల మధ్యన చిక్కుకుపోయిన కాశ్మీరి పౌరుడి వలే 'అసహాయ దృక్కుల'తో అలా నిలబడిపొయ్యాడు రాంబాబు. తరవాత 'భారంగా' తన రూంలోకి వెళ్ళాడు.

టీవీలో మధు యాష్కి, లగడపాటి ఇంకా తిట్టుకుంటూనే ఉన్నారు. గులాం నబి ఆజాద్ వారానికి వెయ్యి రోజులని, నెలకి లక్ష రోజులనీ తేల్చేశాడు. వయలార్ రవి లుంగీ పైకెత్తి కట్టుకుని.. టేపు తీసుకుని సమస్య లోతు కొలుస్తానంటున్నాడు.

'యాహూ! థాంక్యూ కాంగ్రెస్ హైకమాండ్! థాంక్యూ!' అని సంతోషంగా, ఆనందంగా మనసులోనే అనుకుంటూ.. పతంజలి పుస్తకాన్ని ఆప్యాయంగా చేతిలోకి తీసుకున్నాడు రాంబాబు.

(photos courtesy : Google)

Sunday 3 February 2013

వెంటవచ్చునదదే యశస్సు... - బి. శశాంక్


చుండూరు కేసు విషయంలో ఎటువంటి ఒత్తిళ్ళు, ఆర్థిక ప్రలోభాలకు తలొగ్గకుండా, ఏనాడూ చుండూరు మొహం చూడని కొందరు దళిత నేతలు, బ్రాహ్మణుడు మనకేం చేస్తాడు అని కావాలని విషం చిమ్మినా అన్నిటినీ భరించి ప్రపంచంలో దేనినైనా డబ్బుతో కొనగలం అన్న ధీమాతో ఉన్న వారికి అది తప్పు చంద్రశేఖర్ ఉన్నాడు.. ఖబడ్దార్ అని చాటాడు. డబ్బు కంటే ఆశయం గొప్పదని చాటారు. ధర్మమే చుండూరు బాధితులకు రక్ష. 

'అన్నదమ్ములును, ఆలుబిడ్డలును, కన్న తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు వెంటరారు తుదిన్. వెంటవచ్చునది అదే యశస్సు. అదే సత్యము. స్థిరమై సంపదలెల్ల వెంట ఒక రీతిన్ సాగిరావు. ఏరికి ఏసరికి ఏ పాటి విధించెనో విధి. అదే అవశ్యప్రాప్తంబు' అనే హరిశ్చంద్ర నాటకంలోని పద్యము నాన్న ఎక్కువగా వింటూ తన్మయత్వం పొందేవాడు. అదే జీవిత సత్యంగా గుర్తించిన అతికొద్దిమందిలో నాన్న ఒకడు. ఆ పద్యం అర్థాన్నేకాక దాని భావసారాన్ని కూడా పూర్తిగా అవగతం చేసుకున్న వ్యక్తి ఆయన. 

సంపదను గడ్డిపోచతో సమానంగా భావించి నిజమైన సంపద అనగా 'జ్ఞానం' అని నాకు ఎప్పుడూ చెప్తుండేవాడు. ఆస్తులు మానవ సంబంధాలకు అవరోధాలు అనే ఉద్దేశం కలిగిన వ్యక్తి ఆయన. సమాజ హితము కోరే వ్యక్తులు ఎందరున్నా సామాజిక సమస్యల పట్ల ఆయన దృక్పథం చాలా భిన్నంగా ఉండేది. సమస్యల మూల కారణాలను అన్వేషించడంలో ఆయన నిమగ్నం అయ్యేవాడు. ఆధునికతను అన్ని సమస్యలకు మూల కారణంగా గుర్తించిన వ్యక్తి ఆయన. ఆధునికత మానవుడ్ని ప్రకృతి నుంచి దూరం చేసి మనిషిని ఒక వినియోగ దారునిగా మార్చివేసిందని ఆయన బాధపడుతుండేవాడు.

మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలుగా మార్చివేయడంలో మార్కెట్ ప్రధాన భూమిక పోషించిందని దానిలో భాగంగానే హక్కుల ఉద్యమాలు పుట్టుకొచ్చాయని ఆయన అంటుంటేవారు. హక్కులనేవి మార్కెట్ వేగంగా విస్తరించి సమాజంలో చొచ్చుకుపోవడానికి దోహదపడే రహదారుల వంటివని ఆయన అభిప్రాయం. మనిషి అనేవాడు సమూహంలో ఉన్నాననే భ్రమలో ఉన్నాడు గానీ అతనిని ఆధునికత ఒక 'atomistic individual' కిందికి మార్చివేసిందని, దాంతో మనిషి సమాజ నియంత్రణ నుంచి బయటపడి ఒక స్వార్థపూరిత వైఖరిని అలవర్చుకున్నాడని ఆయన తరచు చెబుతుండేవారు. 

అందుకే ఆయన ఆధునికతను విడిచిపెట్టి ప్రకృతిని ఆస్వాదిస్తూ కృష్ణానదీ తీరాన దైద అమరలింగస్వామి గుడి చేరువలో పొలం కొని వ్యవసాయం చేసుకుంటూ పుస్తకాలు చదువుకుంటూ జ్ఞానార్జన చేసుకుంటూ ఐహిక సుఖాల్ని విడనాడి కాలం గడపడానికి నిర్ణయం తీసుకున్నారు. నగరం పట్ల ఆయనకున్న ఏహ్య భావాన్ని అర్థం చేసుకోవడానికి సండే ఇండియన్‌లో ప్రచురితమైన ఆయన వ్యాసం చదివితే చాలు. ఆయన ప్రస్థానం అనేక సామాజిక ఉద్యమాలు దాటుతూ ప్రకృతి వైపు సాగింది. దాన్ని కొందరు తిరోగమనం అని భావించినా అది ఆధునిక అభివృద్ధి రాక్షసి చేసే విధ్వంసం కన్నా ప్రాకృతిక జీవనం వల్ల కలిగే ఆత్మసంతృప్తి చాలా గొప్పది. 

అసలైన తిరోగమనం అంటే ఆధునిక అభివృద్ధి పదం అనే మాయలో దూసుకుపోవడం తప్ప మరేదీకాదని ఆయన అనేవారు. ఆధునికతలో 'solution is the cause of the problem' అని గుర్తించిన వ్యక్తి ఆయన. ధైర్యం, తెగువ, తెలివి, ఆలోచన అన్నీ తీవ్రస్థాయిలో కలిగిన వ్యక్తి మా నాన్న. ఏదైనా ఒక కేసు ఒప్పుకుంటే ఎన్ని కష్టనష్టాలు ఎదుర్కొనైనా పూర్తిచేసేవాడు. 

ఉదాహరణకు ఆయనకు క్యాన్సర్ వచ్చిన రెండు నెలలకు 'de-facto complaint' తరపున జిల్లా కోర్టులోనే మొదటిసారిగా 'bail opposition petition' వాదించుటకు ఒప్పుకున్నారు. అది విచారణకు వచ్చేనాటికి ఆయన ఆసుపత్రిలో ఎముకలను పిండి చేసేంత తీవ్రమైన వెన్నునొప్పితో పడుకున్నారు కానీ తనను నమ్మిన క్లయింట్‌కు అన్యాయం జరగకూడదని కోటు, గౌను, పుస్తకాలు హాస్పిటల్ కి తెప్పించుకుని అక్కడే వాదనను సిద్ధం చేసుకున్నారు. 60 ఎంజి మార్ఫిన్ బిళ్ళలు వేసుకుని కోర్టులో కూర్చోలేని పరిస్థితిలో కారులో పడుకొని జడ్జి పిలవగానే నొప్పిని లెక్కచేయకుండా వెళ్ళి గంటసేపు నిల్చుని కోర్టు హాలు దద్దరిల్లే విధంగా వాదించి క్లయింట్‌కి న్యాయం చేసి తిరిగి హాస్పిటల్‌కి వెళ్ళి పడుకున్నారు. అదే ఆయన చివరిగా వాదించిన కేసు. ఆయనకు క్యాన్సర్అని తెలిసినప్పటినుంచి ఆయనతప్ప ఇంట్లో మిగతావారంతా రోదించారు.

ఆయన మాత్రం ఆ నాలుగు నెలలకాలంలో ఎప్పుడూ దిగులుగా కన్పించలేదు. అధైర్యమూ పడలేదు. పైగా నాతో 'నేను ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని విజేతగా నిలిచాను. క్యాన్సర్ నాకొక లెక్కా.. ఒకవేళ నేనీ పోరాటంలో ఓడినా నా ఆత్మ అనంత విశ్వంలో కలిసి ఉంటుంది. నెనెప్పుడూ నీ చుట్టూనే ఉంటాను. నీవు మాత్రం నీతి, నిజాయితీకి కట్టుబడి ఏదైనా పని ఒప్పుకుంటే పూర్తయ్యే దాకా వదలకు. జ్ఞానమే మనకు ఆస్తి' అని చెప్పేవారు. మృత్యువు తరుముకొస్తున్నా ఇంకొద్ది గంటలలో చనిపోతారనగా కూడా 'I will come back' అని తన శైలిలో గంభీర స్వరంతో పలికారు. క్యాన్సర్‌తో నాలుగు నెలల పోరాటమే ఆయన మొండితనం, ధైర్యానికి నిదర్శనం.

చుండూరు కేసు విషయంలో ఎటువంటి ఒత్తిళ్ళు, ఆర్థిక ప్రలోభాలకు తలొగ్గకుండా, ఏనాడూ చుండూరు మొహం చూడని కొందరు దళిత నేతలు, బ్రాహ్మణుడు మనకేం చేస్తాడు అని కావాలని విషం చిమ్మినా అన్నిటినీ భరించి ప్రపంచంలో దేనినైనా డబ్బుతో కొనగలం అన్న ధీమాతో ఉన్న వారికి అది తప్పు చంద్రశేఖర్ ఉన్నాడు.. ఖబడ్దార్ అని చాటాడు. కేసుని కిలోల లెక్కన అమ్ముకుందామని దుకాణాలు తెరిచిన ఎన్‌జీఓకి, ఇతర దుష్ట శక్తులకి కొరకరాని కొయ్యగా మారారు. డబ్బు కంటే ఆశయం గొప్పదని చాటారు. మా నాన్న చావుతో మళ్ళీ ఆ శక్తులు పునరుజ్జీవం పోసుకున్నాయి. కానీ ధర్మమే చుండూరు బాధితులకు రక్ష. 

ఆయనొక నిత్య విద్యార్ధి. పుస్తకాలను అమితంగా ప్రేమించేవాడు. ప్రతి పుస్తకాన్నీ ఒక భిన్న కోణంలో విశ్లేషించేవాడు. ప్రపంచం మొత్తం ఆకాశానికి ఎత్తిన పాలో కొయిలో రాసిన 'ది ఆల్కెమిస్ట్' నవలను, యాంటీ ముస్లిం నవల అని దానిమీద చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయే విమర్శ రాసిన వ్యక్తి ఆయన. 

హాస్పిటల్‌లో డాక్టర్‌ని కూడా 'నాకు పెన్ను పేపరు ఇవ్వండి. నేను చాలా రాయాలి' అని అడిగాడు ఆయన. గురజాడ సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేస్తూ ఒక పుస్తకం రాయాలనుకున్న ఆయన కలం అర్ధంతరంగా ఆగిపోయింది. ఆయన ఆత్మ అఖండాత్మలో లీనమైంది. 

నాకు తెలిసిన నాన్న మొండివాడు. భయం తెలియనివాడు. ఆడితప్పనివాడు. ఆధునికతకు వ్యతిరేకి. చుండూరు దళితుల ఆత్మగౌరవం నిలబెట్టిన ఒక బ్రాహ్మణుడు. ఆయన వెళ్ళిపోతూ నా మీద చాలా బాధ్యత వదిలి వెళ్ళిపోయాడు. ఆయన ఆశయ సాధనకు నేను నా వంతు కృషి చేస్తా.... 
- బి. శశాంక్ 
(వ్యాసకర్త ఇటీవల కేన్సర్ వ్యాధితో మరణించిన సుప్రసిద్ధ చుండూరు కేసు న్యాయవాది బి.చంద్రశేఖర్ కుమారుడు)
(ఈ రోజు ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజ్ లో ప్రచురితమైన వ్యాసం)