Showing posts with label ఎన్నికలు. Show all posts
Showing posts with label ఎన్నికలు. Show all posts

Friday, 2 January 2015

ప్రజలకి తిక్క కుదరాల్సిందే!


"నాకు రాజకీయాలంటే మంట!"

"ఎందుకు!?"

"ఎందుకా? బాబుని చూడండి! ఎన్నికల ముందు ఋణమాఫీ అన్నాడు, ఇప్పుడేమో అర్ధం కాని ఆల్జీబ్రా లెక్కలేవో చెబుతున్నాడు. ఎంతన్యాయం! ఈ లెక్కలు ఎన్నికలప్పుడు చెప్పొచ్చుగా?"

"ఈ లెక్కలు ముందే చెబితే జనాలు ఓట్లెందుకేస్తారు?"

"అది మాట తప్పడం కాదా? అందుకే నాకు రాజకీయాలంటే మంట!"

"దాన్దేవుఁంది! ఎన్నికలన్నాక లక్ష చెబ్తారు. అవన్నీ నమ్మాలని వుందా యేవిఁటి? అయినా - ఈ రోజుల్లో ఎన్నికల వాగ్దానాల్ని పట్టించుకునేదెవరు?"

"మీరు చాలా సినికల్‌గా మాట్లాడుతున్నారు. కేంద్రంలో మోడీని చూడండి! ఎన్నికల ముందు దేశాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు. ఇప్పుడేమో చేతికి చీపుళ్ళిచ్చి రోడ్లూడిపిస్తున్నాడు. టీవీల్లో రోజుకో సన్యాసి హిందూ మతానికి అన్యాయం జరుగిపోతుందని గుండెలు బాదుకోడం తప్ప అభివృద్ధి కనుచూపు మేర కనిపట్టం లేదు. 'అచ్చే దిన్' అంటే ఇవేనా?"

"వాళ్ళ దృష్టిలో ఇవే అచ్చే దిన్! ఈ సంగతి ముందే చెబితే జనాలు ఓట్లెందుకేస్తారు?"

"అది మాట తప్పడం కాదా? అందుకే నాకు రాజకీయాలంటే మంట!"

"దాన్దేవుఁంది! ఎన్నికలన్నాక లక్ష చెబ్తారు. అవన్నీ నమ్మాలని వుందా యేవిఁటి? అయినా - ఈ రోజుల్లో ఎన్నికల వాగ్దానాల్ని పట్టించుకునేదెవరు?"

"అయ్యా! ఇంతకీ తమరెవరు?"

"అయ్యో నా మతి మండా! మాటల్లో పడి మర్చేపొయ్యాను సుమండీ! నాపేరు పేరయ్య. పెళ్ళిళ్ళు కుదురుస్తుంటాను. నన్నందరూ పెళ్ళిళ్ళ పేరయ్య అంటారు."

"పేరయ్య గారూ! నమస్కారం! గత కొంతకాలంగా మా అబ్బాయి పెళ్ళి చెయ్యడానికి నానా తిప్పలు పడుతున్నాను. ముల్లోకాలు వెదికినా మావాడికి పిల్లనిచ్చే దౌర్భాగ్యుడు ఒక్కడూ దొరకట్లేదు! కొడుక్కి పెళ్ళి చెయ్యలేని వాజమ్మనని నా భార్య రోజూ నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. అయ్యా! ఇవి చేతులు కావు, కాళ్ళనుకోండి. మావాడి పెళ్ళి మీరే చెయ్యాలి! చచ్చి మీ కడుపున పుడ్తాను!"

"ఇంక మీరు నిశ్చింతగా వుండండి, మీవాడికి బ్రహ్మాండమైన సంబంధం కుదిర్చే పూచీ నాది - సరేనా? ఇంతకీ కుర్రాడేం చేస్తుంటాడో?"

"పది పదిసార్లు తప్పాడండీ! కష్టపడి టీసీఎస్‌లో ఆఫీస్ బాయ్ వుద్యోగం వేయించాను."

"దానికేం! సలక్షణమైన ఉద్యోగం. కాకపోతే కొంత మార్చి చెబ్దాం. మీవాడు ఏమ్సీయే చేశాడనీ, టీసీఎస్‌లో టీమ్ లీడర్‌గా చేస్తున్నాడనీ చెప్పండి. ఆస్తిపాస్తులేమాత్రం వున్నాయేమిటి?"

"సెంటు భూమి కూడా లేదండీ!"

"శుభం! తుళ్ళూరులో పదెకరాలు కొని పడేశానని చెప్పండి."

"కానీ - అవతలివాళ్ళు నమ్మాలి కదండీ?"

"ఎందుకు నమ్మరు! రాజకీయ నాయకుల్ని జనాలు నమ్మట్లేదా?"

"అయ్యా! ఇట్లా అడ్డగోలుగా అబద్దాలు చెబితే రేపు పెళ్ళయ్యాక ప్రాబ్లం కదండి!"

"వెయ్యబద్దాలాడి ఒక పెళ్ళి చెయ్యమన్నారు. ఒక్కసారి ఆ మూడుముళ్ళు పడ్డాక ఎవడైనా చేసి చచ్చేదేవుఁంది గనక! ఇందాక తమరు రాజకీయ నాయకుల గూర్చి గుండెలు బాదుకుంటున్నారు కదా! రేపు పెళ్ళికూతురు తండ్రీ అంతే!"

"అంతేనంటారా?"

"అంతేనండీ బాబూ! అంతే! ఈ రోజుల్లో నిజాయితీ గా వుంటే నీళ్ళు కూడా పుట్టవు సుమండీ! మరి నే వస్తాను, నా కమిషన్ సంగతి మాత్రం మర్చిపోకండేం!"

"అయ్యో! ఎంత మాట? మిమ్మల్ని సంతోషపెట్టడం నా విధి!"

"ఇంకోమాట - నాకు రాజకీయాలు ఆట్టే తెలీదు. ఇందాక నేనన్న మాటలు పట్టించుకోకండి."

"నాకూ రాజకీయాలు ఆట్టే తెలీదు లేండి - ఏదో న్యూస్ పేపరుగాణ్ని, నోరూరుకోక వాగుతుంటాను! రాజకీయ నాయకులన్నాక ఎన్నికల్లో లక్ష వాగ్దానాలు చేస్తారు, అవి తీర్చేవా చచ్చేవా? నన్నడిగితే అసలు జనాలే దొంగముండా కొడుకులంటాను. వేసేది లింగులిటుకు మంటూ ఒక్క ఓటు, అందుకు సవాలక్ష డిమాండ్లు! వాళ్ళకా మాత్రం తిక్క కుదరాల్సిందే!"

"అంతేకదు మరి! వుంటాను." 

(picture courtesy : Google)

Saturday, 17 May 2014

ఎన్నికల ధర్మం


అది ఎన్నికలానందస్వామి వారి ఆశ్రమం. ఆశ్రమం అంటే 'లవకుశ'లో వాల్మీకి మహర్షి టైపు పూరిపాకల ఆశ్రమం అనుకునేరు.. కాదు. అక్కడ అన్నీ విశాలమైన పాలరాతి కట్టడాలు, బహుళ అంతస్తుల సముదాయాలు.. ఆశ్రమమంతా కూడా సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్. ఆశ్రమానికి ఒకవైపు విశాలమైన పంట పొలాలు, ఆ పొలంలో పండించిన ధాన్యాన్ని, కూరగాయల్ని మాత్రమే ఆశ్రమవాసులు వండించుకుంటారు. ఇంకోవైపు మరింత విశాలమైన పండ్ల తోటలు, ఆ తాజాఫలాల్నే ఆశ్రమవాసులు భుజిస్తారు.

అక్కడి ఆశ్రమవాసులు అత్యంత ధనికులు. వయసులో తెగ సంపాదించేసి, సంపాదన యెడల విసుగు పుట్టి, పిమ్మట జీవితం పట్ల వైరాగ్యం కలిగి (డబ్బు సంపాదించినవాడికే వైరాగ్యం కలుగును), ఆపై ఆస్తుల్ని పిల్లలకి పంచేసి (ఇది చాలా ముఖ్యం).. 'తుచ్చమైన ఈ మానవ జీవితానికి అర్ధం ఏమిటి?' అనే జీవిత సత్యాన్ని కనుగొనుటకు స్వామివారి దగ్గర శిష్యలుగా చేరారు. వారికి స్వామివారి పద్ధతులు తెగ నచ్చేసి ఆశ్రమానికి తెగ డొనేషన్లు ఇచ్చేశారు (డొనేషన్లు ఇవ్వలేనివారు స్వామివారి కృపకు అనర్హులు). ఆ సత్యశోధకులకి నిత్యమూ స్వామివారి ప్రవచనములు వినుటయే తప్ప.. వేరే పన్లేదు (ఈ దేశంలో కోట్లాదిమందికి కూలి చేస్తేగానీ కడుపు నిండదు, అందుకే - వారికి వైరాగ్యం కలిగేంత జ్ఞానం ఉండదు).

డాక్టర్లలో గుండెజబ్బులకి, మెదడుజబ్బులకి స్పెషలిస్టులు ఉంటారు. ప్లీడర్లలో సివిల్, క్రిమినల్ కేసులకి స్పెషలిస్టులు ఉంటారు. దొంగల్లో పట్టపగలు దొంగలు, అర్ధరాత్రి దొంగలు అంటూ స్పెషలిస్టులుంటారు. అదే విధంగా - స్వామీజీలలో కూడా స్పెషలిస్టులుంటారు. ఎన్నికలానందస్వామి వారిది ఎలక్షన్ల స్పెషాలిటీ, ఆయన పేరు కూడా అలా వచ్చిందే. ఈ రంగంలో వారిది థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్.

మునిసిపాలిటీ వార్డు మెంబర్ నుండి మంత్రుల దాకా స్వామివారి శిష్యులున్నారు. వారంతా ఆయన చెప్పిన పార్టీలో చేరతారు (ఒక ఊరు చేరడానికి బస్సెక్కుతాం, రైలెక్కుతాం, ప్లేనెక్కుతాం.. దేంట్లో ప్రయాణించినా గమ్యం చేరడం ముఖ్యం. చట్టసభ అనే గమ్యాన్ని చేరడానికి రాజకీయ పార్టీలనేవి వాహనాల వంటివని స్వామివారి శిష్యుల అభిప్రాయం), చెప్పిన సమయానికి నామినేషన్ వేస్తారు, చెప్పిన సమయానికి ప్రచారం ప్రారంభిస్తారు. నిన్న ఆంద్రదేశంలో ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. గెలిచిన శిష్యులు స్వామివారి దర్శనానికి వరస కట్టారు. పొద్దున్నుండి ఒకళ్ళ తరవాత ఒకళ్ళు స్వామివారి దర్శనం చేసుకుంటూనే ఉన్నారు.

వినాయకరావు సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన మునిసిపల్ చైర్మెన్ గా రాజకీయ జీవితం ప్రారంభించాడు. ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఆయనకిది మూడోసారి, ఈసారి మంత్రి పదవి గ్యారెంటీ అంటున్నారు. ఆయనకి నమ్మకాలు ఎక్కువ, అందుకే ఆయన పేరు Viinaaayka Ravuu గా రాసుకుంటాడు.. తెలుగు పేరుకి ఇంగ్లీషు అక్షరాల అలంకారాలేవిటి అని ఆశ్చర్యపోతున్నారా? అదంతే, అదో శాస్త్రం! ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వినాయకరావు ప్రస్తుతం స్వామివారి దర్శనానికి వచ్చాడు.

అది స్వామివారి పూజా సమయం. ఆ సమయంలో ఆయన్ని డిస్టర్బ్ చెయ్యడం దేనికని, పూజామందిరం పక్కగా ఉండే స్వామివారి ఏకాంత మందిరంలో వెయిట్ చేయ్యసాగాడు వినాయకరావు. ఆ మందిరం విశాలంగా ఉంది, నేల మీద పరిచిన ఎర్రటి తివాచీ గదిని నెత్తుటితో కడిగినట్లుగా అందంగా, భయంకరంగా ఉంది. ఈ నెత్తుటి మడుగులోంచి పొడుచుకొచ్చిన దెయ్యప్పిల్లల్లా ఒక పక్కగా మెత్తటి సోఫాలున్నాయి. గది మధ్యలో వెండితో చేసిన పెద్ద సింహాసనం ఆ దెయ్యప్పిల్లలకి తండ్రిలాగా ఉంది. ఆ గది మిక్కిలి ఖరీదుగా ఉంది, భయం కొలిపేదిగానూ ఉంది. ఆ గది ఆధ్యాత్మికతకి నిలయంగా లేదు, దొంగల ముఠాలు దోచుకున్న సొమ్ము వాటాలేసుకునే హెడ్డాఫీసులా ఉంది.

వినాయకరావు ఒక సోఫాలో కూర్చున్నాడు. ఆయన ఎత్తుగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, లావుగా కూడా ఉంటాడు. విశాలమైన నుదుటిపై ఎర్రని కుంకుమ బొట్టు, చేతివేళ్ళకి రకరకాల రంగురాళ్ళ ఉంగరాలు.. చూడ్డానికి రాజకీయవేత్తకి, అధ్యాత్మికవేత్తకి పుట్టిన అక్రమ సంతానంలా అగుపిస్తాడు. ఆతను చూపులకి బహుసౌమ్యుడు, చేతల్లో బహుక్రూరుడు. అతని భాష చాలా కల్చర్డ్ గా ఉంటుంది, ఆలోచనలు అతి అన్ కల్చర్డ్ గా ఉంటాయి.

వినాయకరావుకి ధన బలం ఉంది, కుల బలం ఉంది, కండ బలం ఉంది, మంది బలం ఉంది. తద్వారా - రాజకీయ బలం ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా ఇన్ని బలాలు ఉన్న వ్యక్తి సంతోషంగా ఉంటాడు. కానీ - ఇప్పుడు వినాయకరావు అంత సంతోషంగా లేడు.. అన్యమస్కంగా ఉన్నాడు. అసలాయన వాలకం ఎన్నికల్లో గెలిచినట్లు లేదు - డిపాజిట్ కోల్పోయినట్లుంది. చిటికెన వేలుతో తన నియోజక వర్గాన్ని శాసించగలిగే వినాయకరావు దిగాలుగా ఉన్నాడు!

అందుకు కారణమేమి? వినాయకరావు ఒక్కగానొక్క కూతురు, పెళ్లై అమెరికా వెళ్ళిపోయింది (రాజకీయ నాయకుడి సంతానం - అయితే రాజకీయ నాయకులయినా అవుతారు, లేదా అమెరికాలోనైనా స్థిరపడతారు). ఒక్కగానొక్క కొడుకు, కొడుకుది అచ్చు తన పోలికే. రూపంలోనే కాదు గుణంలో కూడా! అంచేత చిన్న వినాయకరావు కూడా మందు, మగువల సాంగత్యంతో జీవిత సత్యాన్ని కనుగొనే ప్రయత్నంలో తల మున్కలయ్యాడు.

ఆ విధంగా అన్నివిధాలుగా తన వారసుడిగా ఎదుగుతున్న పుత్రరత్నాన్ని గాంచిన వినాయకరావు మిక్కిలి గర్వించాడు. ఈసారి ఎన్నికల్లో - కొడుకుని అసెంబ్లీకి పంపి, తను పార్లమెంటుకి వెళ్దామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ - విధి బలీయమైనది. కొన్నాళ్ళక్రితం - వన్ ఫైన్ డే ఫుల్లుగా మందుకొట్టి, అత్యంత ఖరీదైన కారుని అత్యంత వేగంగా నడిపిన కారణాన యాక్సిడెంటై అసువులు బాశాడు ( విధి క్రూరమైనది కూడా).

వినాయకరావు పుట్టెడు పుత్రశోకంతోనే ఎన్నికల్లో పోటీ చేశాడు (తప్పదు మరి.. ఒక్కసారి టిక్కెట్టొదులుకుంటే మళ్ళీ వస్తుందని నమ్మకం లేదు). ఈసారి ఎగస్పార్టీవాడు ఏదో పారిశ్రామికవేత్తట, డబ్బు మంచినీళ్ళలా ఖర్చు చేశాడు. వినాయకరావుకి చిర్రెత్తింది. డాక్టర్లు చచ్చేదాకా వైద్యవృత్తిలోనే ఉంటారు, ప్లీడర్లు ప్లీడరీ వృత్తిలోనే ఛస్తారు. కానీ ఈమధ్య నాలుగు డబ్బులు సంపాదించిన ప్రతి ముండాకొడుకు రాజకీయ నాయకులకి కాంపిటీషన్ కొచ్చేస్తున్నాడు.. రాజకీయం మరీ చవకైపొయ్యింది. అంచేత - పోయినసారి కన్నా ఈసారి మెజారిటీ కొంత తగ్గినా, మొత్తానికి గెలుపొందాడు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పబ్లిక్ పరీక్షల్లాంటివి. అందుకే గెలుపెప్పుడూ గొప్ప కిక్కునిస్తుంది. కానీ చెతికందొచ్చిన కొడుకు లేకుండా పొయ్యాడు. ఎన్నికలు, ఫలితాలు.. ఈ వాతావరణం కొడుకుని మరీమరీ జ్ఞప్తికి తెస్తున్నాయి వినాయకరావుకి. అంచేత - మనసులో బాధ, దుఃఖం తుఫానులో కారుమబ్బుల వలె ఆవహించి.. నైరాశ్యంలో కూరుకుపొయ్యాడు.

ఎన్నికలానందస్వామి వారి పూజ అయిపోయినట్లుంది.. ఏకాంత మందిరంలోకి ప్రవేశించారు. వినాయకరావు స్వామివారిని చూడంగాన్లే లేచి నిలబడి నమస్కరించాడు. స్వామివారు గుండ్రంగా, గుండుగా తొక్కు తీసిన పనసపండులా ఉన్నాడు. ఆయన శరీరం నిన్ననే పాలిష్ చేసిన బలార్షా టేకు చెక్క వలె తళతళలాడుతుంది. ఆయన మొహం అప్పుడే కోసిన దోసకాయలా నవనవలాడుతుంది. స్వామివారు గది మధ్యలోనున్న వెండి సింహాసనంపై ఆశీనులయ్యారు. అది వారి ఉచితాసనం (అనగా - శిష్యులు ఉచితంగా ఇచ్చిన ఆసనం అని అర్ధం).

వినాయకరావు సోఫాలో తల దించుకుని కూర్చున్నాడే గానీ ఏమీ మాట్లాడలేదు. అతను అశాంతిగా ఉన్నాడని గ్రహించారు స్వామివారు. ఇజ్రాయిల్లో వర్షాలు పడకపోతే అమెరికా వాడు కలత చెందినట్లు, స్వామివారి తన భక్తుని బాధని గాంచి ఆందోళన చెందారు.

"ఏం చిన్నా? ఈసారి కూడా గెల్చావు కదా! అలా ఉన్నావేం?" అంటూ ప్రేమగా పలకరించారు.

ఎన్నికలానందస్వామి వారు డబ్బు, పలుకుబడి ఉన్న భక్తుల్ని మాత్రమే ఆప్యాయంగా 'చిన్నా!' అని సంబోధిస్తారు. అవేమీ లేనివాళ్లని అసలేవీ సంబోధించరు - కుసింత బూడిద మాత్రం ప్రసాదిస్తారు.

స్వామివారి పలకరింపు - ఎస్సైగారు దొంగగాడి కష్టాల్ని సానుభూతిగా కనుక్కుంటున్నట్లుగా అనిపించింది వినాయకరావుకి. కావున - ఒక్కసారిగా బేలగా అయిపొయ్యాడు. దుఃఖంతో గొంతు పూడుకుపోతుండగా, కష్టంగా కూడదీసుకుంటూ అన్నాడు.

"దొంగనోట్లు మార్చాను, మానభంగాలు చేశాను, హత్యలు చేయించాను. డబ్బు కోసం, పదవి కోసం, పలుకుబడి కోసం నే చెయ్యని అక్రమం లేదు. నేను మహాపాపిని. నా పాపాలు నన్ను కాల్చేస్తున్నాయి. నాకందరూ ఉన్నారు, కానీ ఒంటరిని. నాకన్నీ ఉన్నాయి, కానీ ఏవీ నావి కావు. భయంగా ఉంది స్వామీ. నా బ్రతుకే ఒక బొంకు. ఈ ఎన్నికలు, అది నేను గెలవడం అంతా మోసం. ఎందరి ఉసురు పోసుకున్నానో? నా బిడ్డ నాక్కాకుండా పొయ్యాడు...... " ఇంక మాట్లాడలేక నిశ్శబ్దంగా రోదించసాగాడు వినాయకరావు.

అడవిలో అర్ధరాత్రిలా, పేదవాడి నీరసంలా.. గదంతా నిశ్శబ్దం. కొంతమందికి కొన్ని నప్పవు, అవి మనం చూళ్ళం. ఉదాహరణకి గుమ్మడి ఫైటింగులు, అమెరికావాడి నీతులు ఎబ్బెట్టుగా ఉంటాయి. వినాయకరావు దుఃఖం కూడా స్వామివారికి అలాగే అనిపించింది.

అర్ధమైందన్నట్లుగా తల పంకిస్తూ.. స్వామివారు చిద్విలాసంగా చిరునవ్వు చిందించారు.

"చిన్నా! జీవితం బుద్బుదప్రాయం, నీ బిడ్డడికి నూరేళ్ళు నిండాయి, వెళ్ళిపొయ్యాడు. మన్చేతిలో ఏముంది? ఏమీ లేదు - అంతా దైవనిర్ణయం. ఇకపోతే - నువ్వు అన్యాయం, పాపం అంటూ ఏవో చెబుతున్నావు. నాకైతే నువ్వు చేసిన పాపలేమిటో బోధపడటం లేదు." అన్నారు.

దుఃఖిస్తూనే ఆశ్చర్యపొయ్యాడు వినాయకరావు.

"ఈ సృష్టిలోని ప్రతి వస్తువుకి, ప్రతి జీవికి పర్పస్ ఒకటి ఉంటుంది చిన్నా! ఇప్పుడు నువ్వు కూర్చున్న సోఫా ఎంత మెత్తగా ఉన్నా, అది డైనింగ్ టేబుల్ గా పనికిరాదు. అలాగే - సకల జీవచరాలకి ఒక ధర్మం అంటూ ఉంటుంది. ఆ ధర్మం ఆ దేవదేవుడే నిర్ణయిస్తాడు. ఆ ధర్మాన్ని నిర్వర్తించటమే ఆ జీవి పరమార్ధం. నేల నుండి సారాన్ని గ్రహించి గడ్డి పెరుగుతుంది, గడ్డిని తిని జింకలు, దున్నలు జీవిస్తాయి. ఆ జింకల్ని, దున్నల్ని తిని పులులు జీవిస్తాయి. ఆ పులుల్ని వేటగాడైనా చంపేస్తాడు, లేదా అవే కొంతకాలానికి అవే చస్తాయ్.. ఎట్లా చచ్చినా నేలలో కలిసిపోవాల్సిందే. అంటే నేల నుండి పుట్టింది అనేక రకాలుగా రూపాంతరాలు చెంది తిరిగి ఆ నేలలోనే కలిసిపోయింది. ఇదొక సృష్టి చక్రం!" అంటూ కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నట్లుగా ఆగారు.

కొద్దిసేపటికి కళ్ళు తెరిచి వినాయకరావుని చూస్తూ మళ్ళీ చెప్పసాగారు స్వామి.

"చిన్నా! ఇప్పుడు నీ సంగతే చెబుతాను. నువ్వు స్వశక్తితో అంచెలంచెలుగా పైకొచ్చిన వ్యక్తివి. నీ అవకాశాల కోసం ఇతరుల్ని హింసించావు, మోసగించావు. నువ్వేది చేసినా నీ భవిష్యత్తు కోసమే చేశావు, సరదా కోసం చెయ్యలేదు. మెడికల్ సీటు కోసం విద్యార్ధి కోచింగు తీసుకుని ఎమ్సెట్ పరీక్ష రాస్తాడు, తనకే డాక్టర్ సీటు రావాలని కోరుకుంటాడు. రాజకీయ నాయకుడికి ఎలక్షన్లో పార్టీ టిక్కెట్ సంపాదించడం, పోటీ చెయ్యడం కూడా ఎమ్సెట్ వంటిదే! నువ్వు చేసింది తప్పైతే ఎమ్సెట్ పరీక్ష కూడా తప్పే! పులి ఆహారం కోసం జింకని చంపడం న్యాయం, అదే పులి అదే జింకని వినోదం కోసం చంపడం మాత్రం పాపం.. నువ్వలాంటి పాపాలేవీ చెయ్యలేదు."

'అవును కదా!' అనుకున్నాడు వినాయకరావు.

"నువ్వు నిజాయితీగా ఉన్నావనుకుందాం. నీ పార్టీవాళ్లు 'ఫండ్స్' తీసుకోకుండా నీకు టిక్కెట్టు ఇస్తారా? ఇవ్వరు. కార్యకర్తల్ని రోజు కూలీ ఇచ్చి ప్రచారం చేయిస్తావ్. నీ పార్టీ సిద్ధంతాన్నో, నీ నాయకత్వాన్నో చూసి వాళ్ళేమన్నా ఫ్రీగా సర్విస్ చేస్తారా? చెయ్యరు. ఎలక్షన్ల ముందు ఓట్లు కొనడానికి పార్టీ ముఖ్యులకి డబ్బు పంపిణీ చేస్తావ్. వాళ్ళేమన్నా నిజాయితీగా డబ్బు పంచుతారా? పంచరు. మధ్యలో ఎవరికి అందినంత వాళ్ళు కాజేస్తారు." అంటూ మళ్ళీ కళ్ళు మూసుకున్నారు స్వామివారు.

స్వామివారిలో భగవద్గీతని ప్రవచిస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముని గాంచాడు వినాయకరావు.

"ఈ ప్రజలు అత్యాసపరులు. నువ్వు నిజాయితీగా ప్రజాసేవ చెయ్యాలంటారు. కానీ - ఎలక్షన్లో డబ్బు లేకుండా పన్జరగదు. పోనీ - నువ్వు నిజాయితీగా 'నా నియోజకవర్గ ప్రజలారా! ఎన్నికల కోసం నాకింత ఖర్చయ్యింది, ఇంత తీసుకుంటున్నాను.' అని చెబితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అప్పుడు నీకు ప్రజాధనం నీ ధనంగా మార్చుకోడానికి మించి వేరొక మార్గం ఉందా? లేదు."

'అవునవును!' అనుకున్నాడు వినాయకరావు.

"చిన్నా! నే చెబుతున్నా విను! నువ్వు అవినీతికి పాల్పడలేదు, భవిష్యత్తులో రాబోయే ఎలక్షన్లలో కాబోయే ఖర్చు కోసం నిధులు సమకూర్చుకున్నావు, ఎన్నికల సమయంలో ఆ నిధులు ఉపయోగించావ్. నేలలోంచి పుట్టిన జీవి చివరాకరికి మళ్ళీ నేల్లోనే కలిసిపోయినట్లు.. ప్రజల సొమ్ము అటు తిరిగి, ఇటు తిరిగి మళ్ళీ ప్రజల వద్దకే చేరింది. ఇది ఎన్నికల ధర్మం, ప్రజాస్వామ్య చక్రం." అన్నారు స్వామివారు.

"కానీ.. కానీ.. నేను రిగ్గింగులు చేయించాను, ప్రత్యర్ధులపై దొంగ కేసులు పెట్టించాను, ఒకట్రెండు మర్డర్లు చేయించాను." గిల్టీగా అన్నాడు వినాయకరావు.

స్వామివారు దరహాసంతో ఇలా సెలవిచ్చారు.

"చిన్నా! దేవుడు గుళ్ళో ఉంటేనే పూజలందుకుంటాడు. రాజకీయ నాయకుడు పదవిలో ఉంటేనే రాణిస్తాడు. నాయకుడు ఎన్నికల్లో గెలవకపోతే ప్రజలు వాణ్నో చిత్తుకాయితంలా చూస్తారు. చిత్తుకాయితాల్ని కనీసం తూకానికైనా అమ్ముకోవచ్చు, ఓడిన నాయకుడు అందుక్కూడా పనికి రాడు. అదే ప్రజలు గెల్చిన నాయకుడికి బ్రహ్మరథం పడతారు. కావున ఎన్నికల్లో ఎలాగైనా గెలవడమే నీ ధర్మం. వేటాడే పులి ధర్మాధర్మాల గూర్చి బేరీజు వేస్తూ కూర్చుంటే ఆకలి చావు చస్తుంది. కావున - నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నప్పుడు న్యాయాన్యాయాల ప్రసక్తి అనవసరం. నీ గెలుపు అడ్డం అనుకున్నవాడి మీద దొంగ కేసు పెట్టించడం కూడా ధర్మమే. అడ్డం కానప్పుడు మాత్రం దొంగ కేసు పెట్టించడం చాలా అన్యాయం, అటువంటి పాపపు పనులు నువ్వు చెయ్యకు."

వినాయకరావు మొహంలో కొద్దిగా కళ కనిపించింది.

"కానీ నావల్ల కాంట్రాక్టర్లు, మాఫియా తప్ప లాభపడిన వారెవ్వరూ లేరు. ప్రజల కనీసావసారాల కోసం కనీసంగా కూడా పాటు పళ్ళేదు." సందేహంగా అన్నాడు వినాయకరావు.

స్వామివారు మొహం చిట్లించారు.

"ప్రజల గూర్చి ఆలోచించాలా? ఎందుకు!? పేషంట్ల గూర్చి డాక్టర్లు ఆలోచిస్తున్నారా? కక్షిదారుల గూర్చి న్యాయవాదులు ఆలోచిస్తున్నారా? కస్టమర్ల గూర్చి వ్యాపారస్తులు ఆలోచిస్తున్నారా? శాంతిభద్రతల గూర్చి పోలీసులు ఆలోచిస్తున్నారా? లంచాలు మింగకుండా ఆఫీసర్లు పని చేస్తున్నారా? వాళ్ళెవ్వరికీ లేని వృత్తిధర్మం మీ రాజకీయ నాయకులకి మాత్రం ఎందుకు?"

వినాయకరావు భ్రమలు తొలగిపోయ్యాయి. ఆయన స్వామివారి పాదాలకి మొక్కాడు.

"చిన్నా! నీకు దిష్టి తగిలింది, అందుకే ఇట్లాంటి రాకూడని ఆలోచనలు వస్తున్నాయి. సాధారణంగా ఇట్లాంటి ఆలోచనలు రచయితలకి వస్తుంటాయి! వాళ్లొట్టి పనికిమాలినవాళ్ళు. కావునే - ఏ కథో, కవితో రాసుకుని ఆత్మానందం పొందుతారు." దరహాసంతో అన్నారు స్వామివారు.

వినాయకరావు చిరునవ్వు నవ్వాడు.

"చిన్నా! కొన్నాళ్ళపాటు ప్రశాంతంగా పుణ్యక్షేత్రాలు దర్శించుకో, దేవుడికి తలనీలాలు సమర్పించు. నెత్తిమీద ఉన్నది నాలుగు వెంట్రుకలే కదాని మొహమాటపడకు! దేవుడు కరుణామయుడు, చిన్నవిషయాలు పట్టించుకోడు. హుండీలో కానుకలు వెయ్యి, గట్టిగా ప్రార్ధించు. ఎన్నికల్లో 'నువ్వు చేశాననుకుంటున్న' పాపం పరిహారం అయిపోతుంది." అంటూ కర్తవ్యాన్ని బోధించారు స్వామివారు.

వినాయకరావుకి ఇప్పుడు హుషారుగా ఉంది. హాయిగా నవ్వసాగాడు.

"చిన్నా! నువ్వు తెలివైనవాడివి, చురుకైనవాడివి. ముందుముందు మంచి భవిష్యత్తు ఉన్నవాడివి. ఈసారి నీకు మంత్రి పదవి ఖాయం. ముఖ్యమంత్రితో చెప్పి మంత్రివర్గంలో మంచి శాఖొహటి ఇప్పిస్తా. ఇహ ప్రశాంతంగా ఉండు." అంటూ చిన్నగా నవ్వుతూ అన్నారు స్వామివారు.

స్వామివారు ఎన్నికల్ని ఎందుకు అంతలా స్పెషలైజ్ చేశారో అర్ధమైంది వినాయకరావుకి.

"సరే స్వామి! ఇంక సెలవు. ఆ వందెకరాల ప్రభుత్వ భూమి మీ ఆశ్రమం పేరుకి మార్చేలా కృషి చేస్తాను." అన్నాడు వినాయకరావు.

స్వామివారు చిరునవ్వు నవ్వారు.

"చిన్నా! ఆ విషయం ఆల్రెడీ ముఖ్యమంత్రితో మాట్లాడాను, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింతరవాత ఆయన చేసే మొదటి సంతకం మన ఫైల్ మీదే!"

"స్వామీ! యువార్ గ్రేట్!" అంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాడు వినాయకరావు.

disclaimer :

అంతా కల్పితం.. పాత్రలు కూడా. ఎవరినీ ఉద్దేశించి రాయలేదు.

(picture courtesy : Google)

Wednesday, 7 May 2014

ఎన్నికల కత


అది దట్టమైన అడవి. ఆ అడవిలో మహావృక్షాలున్నయ్, అవి దయ్యాలు జుట్టు విరబోసుకున్నట్లుగా ఉన్నయ్. సెలయేళ్ళున్నయ్, అవి ఒంపులు తిరుగుతూ ప్రశాంతంగా, బద్దకంగా ప్రవహిస్తున్నయ్. ఆ పచ్చిక బయళ్ళు, ఆ లేత చెట్లు.. భూదేవి అప్పుడే ప్రసవించినట్లు తాజాగా ఉన్నాయి, అందంగా కూడా ఉన్నాయి. 

ఇప్పుడా అడవిలో కొన్నిగంటలుగా రెండు సింహాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది, నిప్పులవాన కురుస్తున్నట్లు భూమ్యాకాశాలు దద్దరిల్లిపోతున్నయ్. అది వాటిమధ్య ఆధిపత్య పోరాటం. సింహం అనగా సన్నని నడుము, అందమైన జూలు, ఠీవియైన నడక.. అంటూ కవులు రొమేంటిసైజ్ చేస్తారు గానీ, ప్రస్తుతం జరుగుతున్న ఆ పోరాటం చూసినట్లైతే - 'ఈ పోరాటం ప్రళయ భీకరమైనప్పటికీ అతి మనోహరం. వజ్రసమాన కాయంతో, ఉక్కు పంజాతో రెండు బంగారు కొండలు ఢీకొన్నట్లు, ఉత్తుంగ తరంగాల వలె పైకెగెసి పడినట్లు.. ' అని రాసుకుంటూ పొయ్యేవాళ్ళు కాదు. మరేం చేసేవాళ్ళు? పుస్తకం, కలం ఆక్కడే పడేసి పారిపొయ్యేవాళ్ళు.. అక్కడ వాతావరణం అంత భీభత్సంగా ఉంది!

ఆ పోరాడే సింహాలకి అనుచరులైన నక్కలు, తోడేళ్ళు కూడా రెండు జట్లుగా విడిపొయ్యి అరుచుకుంటున్నాయి, కరుచుకుంటున్నాయి. ఈ యుద్ధాన్ని వీక్షిస్తున్న కుందేళ్ళు, జంగు పిల్లులు, జింకలు, అడవి దున్నలు.. మొదట్లో భయపడ్డా, ఆ తరవాత వాటికి ఇదంతా వినోదంగా అనిపించింది. అంచేత - అవి చప్పట్లు కొడుతూ భలే ఎంజాయ్ చెయ్యడం మొదలెట్టాయి. ఏ సింహం గెలుస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నయ్, పందేలు కూడా కాసుకోసాగాయి. 

కొంతసేపటికి - ఆ యుద్ధం చాపకింద నీరులా ప్రేక్షక జంతువుల్లోకి కూడా పాకింది. కావున - అవి తమలో తాము చెరో సింహం పార్టీలుగా విడిపొయ్యి, గోలగోలగా అరుచుకోసాగాయ్. కొద్దిసేపటికి - కుందేళ్ళు, కుందేళ్ళతో, జింకలు జింకలతో, దున్నలు దున్నలతో కలబడుకోనారంభించాయ్. వాతావరణం సరదా సరదాగా ఉంది, హడావుడిగా ఉంది, అడవికేదో జబ్బు చేసి దారుణ దావానలంలో మండిపోతున్నట్లుగా కూడా ఉంది. 

మరి కొంతసేపటికి యుద్ధం ముగిసింది. ఓడిపోయిన సింహం తోక ముడుచుకుని పారిపోయింది, దాంతోపాటు ఓడిపోయిన పార్టీ తోడేళ్ళు, నక్కలు కూడా పారిపొయ్యాయి. వాతావరణం ప్రశాంతంగా మారిపోయింది. ఇప్పుడంతా పార్టీ మూడ్! కుందేళ్ళు, జింకలు, దున్నలు గెలిచిన ఆ సింహాన్ని భుజాల కెత్తుకుని 'హుర్రే' అంటూ ఆనందంతో ఊరేగాయి. జింకలు పులి డేన్స్ చేశాయి, దున్నలు డిస్కో డేన్స్ చేశాయి. ఊరేగింపు ముగిసింది. 

'ప్రియమైన అడవి వాసులారా! ఇక మీకు సెలవు.'

ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపొయ్యారు. 

అలుపు తీరిన కొద్దిసేపటికి సింహంకి ఆకలి దంచెయ్యసాగింది. సింహం పరివారానికీ ఆకలిగా ఉంది.. అవును మరి, అవి కూడా గెలిచిన ఆనందంలో డేన్సులు చేసి అలసిపోయ్యి ఉన్నాయి కదా! అంచేత - ఆ సింహం కొన్ని కుందేళ్ళని, జింకల్ని, దున్నల్ని పిలిపించుకుంది. 

ఆపై - సింహం, దాని బంధువర్గం ప్రేమగా, ప్రశాంతంగా వాటి పీక కొరికి.. ధారగా కారుతున్న చిక్కటి వెచ్చని రక్తాన్ని స్కాచ్ విస్కీలాగా చప్పరిస్తూ తాగేశాయి. ఆ తరవాత - నిదానంగా మాంసాన్ని పీక్కు తిననారంభించాయి. అవి తినంగా మిగిలిన మాంసాన్ని తోడేళ్ళు, నక్కలు హడావుడిగా మింగసాగాయి. 

చచ్చి గుట్టగా పడున్న ఆ జంతువుల్లో ఓ జింకపిల్ల కొనఊపిరితో ఉంది, అది భారంగా డొక్క లెగరేస్తూ ఆయాసపడుతూ సన్నగా ఊపిరి పీలుస్తుంది. అయితే ఆ జింక పిల్ల బాధతో గిలగిల్లాడకుండా, వెక్కివెక్కి ఏడుస్తుంది!

ఒక దున్న లెగ్ పీసుని ఇష్టంగా పీక్కుతింటున్న సింహానికి జింకపిల్ల ఏడుపు ఆశ్చర్యంగా అనిపించింది. 

'జింకోత్తమా! ఏల ఈ ఏడుపు?' అని ఆసక్తిగా ప్రశ్నించింది. 

అంతట ఆ జింక పిల్ల వెక్కుతూనే ఇలా అంది.

"మృగరాజా! ఇవ్వాళంతా నీ గెలుపు కోసం నేనెంతగానో కృషి చేశాను, పరితపించాను. నీ కోసం నా తోటి జింకల్తో గొడవపడ్డాను. ఇప్పుడు నన్నీ విధంగా చంపి తింటున్నావు, ఇది నీకు న్యాయం కాదు." అంది. 

సింహానికి జింక పిల్ల యెడల జాలి కలిగింది.

"మిత్రమా! నీ ప్రశ్నకి సమాధానం చెబ్తా విను. నాది సింహం జన్మ. లంచ్ అండ్ డిన్నర్ కోసం అడవిలో జంతువుల్ని భోంచెయ్యడం మాజాతికి జన్మతో వచ్చిన హక్కు, అలాగే - మాకు ఫుడ్డుగా మారడం మీ జాతి డ్యూటీ. మనకీ విధులన్నీ నిన్నూ, నన్నూ పుట్టించిన ఆ దేవుడే ఇచ్చాడు, దీన్నే ప్రకృతి ధర్మం అని కూడా అంటారు. నీవు నీ జీవించే హక్కు గూర్చి ఎంతైనా వాదించు, ఒప్పుకుంటాను - అందులో బోల్డంత లాజిక్ ఉండొచ్చు, న్యాయం కూడా ఉండొచ్చు. కానీ - న్యాయం వేరు, ధర్మం వేరు. నేను నిన్ను చంపడం అన్యాయం అవ్వొచ్చు, కానీ - అధర్మం కాదు." అంది సింహం.

జింకపిల్లకి నోరెండిపోతుంది, భరింపలేని బాధతో మెదడు మొద్దుబారింది. నోరు పెగుల్చుకుని, మాట కూడగట్టుకుంటూ, నెమ్మదిగా అడిగింది.

"నేను.. నేను.. నీ అభిమానిని."

"అవును, ఆ విషయం నాకు తెలుసు. కానీ మైడియర్ మిత్రమా! ఇవ్వాళ జరిగిందంతా మా సింహాల మధ్య ఆధిపత్య పోరు. అనగా మిమ్మల్ని భక్షించే హక్కు కోసం జరిగిన పోరు. అసలు మా యుద్ధంతో నీలాంటి అర్భక ప్రాణులకేం పని!? మా పోటీ మీకు న్యాయం జరగడానిక్కాదు, మీ మంచికీ కాదు. అంచేత - మాలో ఎవరు గెలిచినా మీకు ఒరిగేదేమీ ఉండదు. మీరు మా చేత చంపబడటానికే పుట్టారు. ఆ సూక్ష్మాన్ని గ్రహింపలేని నువ్వు, నీ స్నేహితులు బుద్ధిహీనులై, అమాయకంగా మా పోరాటంలో దూరారు, అందుకు నీకు నా సానుభూతి తెలియజేస్తున్నాను."

జింకపిల్లకి మగత కమ్ముకొస్తుంది, కళ్ళు మూత పడుతున్నయ్. దానికి తన కుటుంబం, ఎత్తుగా ఒత్తుగా పచ్చని గడ్డితో కళకళలాడే తన ఇల్లు, ఇంటి పక్కగా గలగలా పారే సెలయేరూ.. తను, తన చెల్లెళ్ళు పోటీ పడుతూ అమ్మ పొదుగులోంచి పాలు తాగుతున్న దృశ్యం.. ఆ సమయంలో అమ్మ ప్రేమగా తమ శరీరాల్ని ప్రేమగా నాకుతూ 'నా చిట్టిపొట్టి కన్నలారా! నా పొదుగులో పాలన్నీ మీకోసమే, హాయిగా కడుపు నిండా తాగండి నాన్నా!' అని మృదువుగా, లాలనగా చెప్పిన దృశ్యం.. అప్పుడు తను - 'భగవంతుడు ఎంతటి దయామయుడు! సృష్టిలోని ఆనందాన్నంతా మూటగట్టి మా ఇంట్లోనే ఉంచాడు' అని సంతసించిన వైనం జ్ఞాపకం వచ్చాయి. ఇంతలో - దూరంగా కళ్ళు జిగేల్మనే పెద్ద వెలుగు! ఏవిటా వెలుగు? దేవుడా? దేవుడే అయ్యుంటాడు. 

'హే భగవాన్! నాకు తెలిసి నేనే తప్పూ చెయ్యలేదు, తెలీక చేసిన తప్పుల్ని క్షమించు తండ్రీ! మళ్ళీ జన్మంటూ ఉంటే నన్ను జింకగా మాత్రం పుట్టించకు." అంటూ దేవుణ్ని ప్రార్ధించింది జింకపిల్ల. 

ఇంతలో సింహం జింకపిల్ల చెవులో నెమ్మదిగా చెప్పింది.

"మిత్రమా! ఒకేఒక్క క్షణం.. కొంచెం నొప్పిగా ఉంటుంది.. ఓర్చుకో.. అయామ్ సారీ!" అంటూ జింకపిల్ల మెడని పూర్తిగా కోరికేసింది. అంతట ఆ జింకపిల్ల విగతజీవియై తల వేళ్ళాడేసింది.

ఉపసంహారం :

క్రమేపి అడవులు, అడవిలో జీవులూ అంతరించి పోసాగాయి. ప్రకృతి ధర్మాన్ని కాపాడటం దేవుని డ్యూటీ. అంచేత జనారణ్యంలో కూడా సింహాల్ని, అవి దోచుకుందుకు (వేట నిషేధింపబడిన కారణాన) అర్భక ప్రాణుల్ని కూడా ఆ దేవదేవుడు సృష్టించాడు, గాడీజ్ గ్రేట్!

ముగింపు :

ఇవ్వాళ ఆధిపత్యం కోసం సింహాలు యుద్ధం చేసుకుంటున్న రోజు.. దీన్నే ఎన్నికల రోజు అని కూడా అంటారు!

అంకితం :

నాకు దేవుడంటే నమ్మకం లేదు, కానీ - రావిశాస్త్రి దేవుడేమోననే అనుమానం మాత్రం ఉంది. అట్టి రావిశాస్త్రి పాదపద్మములకి.. 

(picture courtesy : Google)

Tuesday, 6 May 2014

AC సర్వే


ఇది ఎన్నికల సమయం. రోజుకో సర్వే, గంటకో కథనం. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ వాళ్ళ రిపోర్టు లాగా విషయం మారిపోతుంది. 

నేను మాత్రం ఖాళీగా ఎందుకుండాలి? కాబట్టి - ఈమధ్య నేనూ ఒక సర్వే చేశాను. దీని పేరు 'AC సర్వే' (అంటే AC రూములో కూర్చుని నిర్వహించిన సర్వే అని అర్ధం).

నాకు psephology తెలీదు. కావున, నా methodology నేనే తయారు చేసుకున్నాను.

exclusion criteria : 

1. రెడ్డి, కమ్మ కులస్తులు (ఈ రెండు కులాల వారి అభిప్రాయం కనుక్కోడం అనవసరం.. కారణం అందరికీ తెలిసిందే).  

2. PG స్థాయి చదువు (బాగా చదువుకున్నవాడు ఛస్తే నిజం చెప్పడు).  

inclusion criteria :

1. పై రెండు వర్గాలకి చెందని వారు. 

2. వ్యవసాయ కూలీలు, చిన్న ఉద్యోగాలు చేసుకునేవారికి ప్రాముఖ్యం. 

sample size : 40 - 50 

నేను వాళ్లకి బాగా తెలుసు కాబట్టి.. నా ప్రశ్నకి చాలామంది స్పష్టంగా సమాధానం చెప్పారు, కొందరైతే నన్నుకూడా వాళ్ళు సూచించిన పార్టీకే ఓటెయ్యమని అడిగారు. 

నాకు ఓటర్లలో స్పష్టమైన ట్రెండ్ కనిపించింది. ఆ ట్రెండ్ ఇక్కడ ఇస్తున్నాను.

(> అన్న గుర్తుకి more than అని అర్ధం.)  

1. గుంటూరు టౌన్ లోకల్, జిల్లాలో ఇతర పట్టణాలు.. TDP > YSR CP 

2. గ్రామీణ ప్రాంతాలు.. YSR CP > TDP 

3. కుర్రాళ్ళు.. YSR CP > TDP 

4. మధ్యవయసువారు (30 - 65).. TDP > YSR CP

5. ముసలివారు (above 65).. TDP = YSR CP

6. BC ఓటర్లు.. TDP = YSR CP

7. SC ఓటర్లు.. YSR CP > TDP

8. దళిత్ క్రిస్టియన్లు.. YSR CP only. 

9. ముస్లిం ఓటర్లు.. YSR CP > TDP 

10. చిన్నఉద్యోగులు.. TDP > YSR CP

కొన్ని అబ్జర్వేషన్లు :

1. ఆరోగ్యశ్రీ, fee reimbursement స్కీముల వల్ల లబ్ది పొందిన కుటుంబాలవారు పూర్తిగా YSR CP పక్షాన ఉన్నారు. 

2. నిరుద్యోగులు (ముఖ్యంగా ఇంజినీరింగ్ చదివినవాళ్ళు) పూర్తిగా TDP వైపున్నారు. 

limitations :

ముందే చెప్పాను.. ఇది పూర్తిగా AC సర్వే. కావున, reliability & validity - ???????????? (0 - 100 ఎంతైనా కావచ్చు). 

conclusion : 

TDP, YSR CP లలో ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది!

క్రీడల్లోలా రాజకీయాల్లో సిల్వర్ మెడల్ లేదు. ఒకటే మెడల్.. అధికారం. అందుకే ఈ రెండు పార్టీలు భీభత్సమైన డబ్బు బలంతో (రేపు రాష్ట్ర 'పునర్నిర్మాణం'లో వడ్డీతో సహా నాలుగింతలు వసూలు చేసుకుంటాయి లేండి), కండ బలంతో అధికారం కోసం పోరాడుకుంటున్నాయి.

బాబ్బాబు! మీ ఓటు ఒక వజ్రాయుధం.. అంచేత - మీట నొక్కండని ఎన్నికల కమిషన్ వారు (టార్గెట్లు పెట్టుకుని మరీ) జనాల్ని బ్రతిమాల్తున్నారు. మధ్యతరగతి మేధావులు కూడా మీట నొక్కకపొతే మనిషివే కాదన్నట్లు ప్రచారం చేస్తున్నారు. కావున - మీరు కూడా మీ ఓటేసి, వేలు పైకెత్తి ఫోటో దిగి ఫేస్బుక్కులో పెట్టుకోండి.. చాలా లైకులొస్తాయి. 

చివరి మాట :

డా.బి.హరిబాబు, ఆర్తోపెడిక్ సర్జన్, గుంటూరు. నాకు ఇంటర్ నుండి క్లాస్మేట్, అత్యంత అత్మీయుడు. 

నా సర్వే ఫలితాలు మా హరిబాబుకి ఫోన్లో చెప్పాను - 'ఇంకెందుకాలస్యం? పెట్టెయ్ నీ బ్లాగులో!' అన్నాడు.. పెట్టేశా! 

(picture courtesy : Google)