Showing posts with label బ్లాగ్ కష్టాలు. Show all posts
Showing posts with label బ్లాగ్ కష్టాలు. Show all posts

Sunday, 10 May 2015

పాఠకుల (బ్లాగర్ల) విచక్షణ


ఒక రచయిత తనకి తోచిన రీతిలో రచనలు చేస్తాడు. ఈ రచనా ప్రక్రియని కొందరు ప్రతిభావంతంగా, ఎక్కువమంది దరిద్రంగా, మరింత ఎక్కువమంది పరమ దరిద్రంగా చేస్తుంటారు. రాసేవాళ్ళు రాస్తుంటే చదివేవాళ్ళు చదువుతుంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో కారణాన ఒక్కో రాతగాడంటే ఇష్టం, అయిష్టం.  

రచయితకి దేని గూర్చైనా రాసే హక్కున్నట్లే (వాస్తవానికి రచయితకి పెద్దగా హక్కుల్లేవని ఈమధ్య పెరుమాళ్ మురుగన్ తెలియజెప్పాడు), చదవాలా వద్దా అన్న విచక్షణ పాఠకుడికి వుంటుంది. కొందరు కొన్నాళ్ళు ఒక రచయితకి అభిమానిగా వుండి, కొన్ని కారణాల వల్ల ఆ రచయితని పట్టించుకోవడం మానేస్తారు. అందులో నేనూ వొకణ్నని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 

'పచ్చ నాకు సాక్షిగా' చదివి నామిని అభిమాని అయ్యాను. ఆ తరవాత నామిని రచనల్ని చాలావరకు చదివాను. ఒక సందర్భంలో (నంబర్ వన్ పుడింగి అనుకుంటాను) రావిశాస్త్రి గూర్చి నోరు పారేసుకున్నాడు నామిని. రావిశాస్త్రి సాహిత్యంలోని మంచి చెడ్డలు చర్చిస్తూ అనేకమంది వ్యాసాలు రాశారు. బాలగోపాల్ అయితే చాలా నిర్మొహమాటంగా రావిశాస్త్రి పరిమితుల్ని ఎత్తి చూపుతూ చక్కటి వ్యాసం రాశాడు. ఈ వ్యాసాల్లో నాకు చాలా విషయం కనపడింది. 

కానీ - నామిని రావిశాస్త్రి రచనా విధానాన్ని (దీన్నే శిల్పం అంటారు) ఎగతాళి చేశాడు. అందుకు సరైన కారణం కూడా రాయలేదు. ఇది నాకు చాలా బాధ్యతా రాహిత్యంగా, దుర్మార్గంగా తోచింది. కాఫీ తాగుతూ - నామిని ప్రేలాపనల గూర్చి ఒక ఐదు నిమిషాలు తీవ్రంగా ఆలోచించాను. నామిని రచయిత. ఒక రచయిత ప్రోడక్ట్ అతని సాహిత్యం. అట్టి ప్రోడక్టుని బహిష్కరించి నిరసన తెలియజెయ్యగలగడం వినియోగదారుడిగా నాకున్న హక్కు. 

వెంటనే నా లైబ్రరీలో వున్న నామిని పుస్తకాలు తీసేశాను. హాస్పిటల్ ఆయాని పిల్చాను. "ఈ పుస్తకాల్ని కట్టగట్టి ఆ మెట్ల కింద తుక్కు సామాన్లో పడెయ్. తుక్కు సామాను కొనేవాడు వచ్చినప్పుడు తూకానికి అమ్మెయ్ - ఎంత తక్కువైనా పర్లేదు. ఆ డబ్బు నువ్వు తీసుకో. నీకిది చాలా ముఖ్యమైన పని, సాధ్యమైనంత తొందరగా పూర్తి చెయ్యి." అని చెప్పాను. మర్నాడు ఆ పుస్తకాల్ని ఒక తోపుడు బండివాడు కొనుక్కున్నాడు.  

నామిని 'మూలింటామె' చదివావా? అని నన్ను కనీసం పదిమంది అడిగారు. ఇంకా చదవలేదు, బిజీగా వున్నానని చెప్పాను గానీ - వాస్తవానికి ఆ రచనకి నోబెల్ బహుమతి వచ్చినా కూడా, అందులో ఒక్క వాక్యమైనా చదివే ఉద్దేశం నాకు లేదు. నాకు సంబంధించి - నామిని అనే తెలుగు రచయిత లేడు! మొన్నామధ్య ఒక మిత్రుడు పంపగా - 'మూలింటామె' కొరియర్ వచ్చింది. జాగ్రత్తగా ఆ పుస్తకాన్ని రిసెప్షన్ బల్ల మీద పడేయించాను. రెండ్రోజుల తరవాత ఆ 'మూలింటామె' కనబడ్డం మానేసింది! ఆ విధంగా పాఠకుడిగా నాకున్న హక్కుని వినియోగపర్చుకుని నాకు నచ్చని రచయితని ఇగ్నోర్ చేసి తృప్తి నొందాను. 

చివరి మాట -

నా బ్లాగ్ చదివేవాళ్ళక్కూడా నేనిచ్చే సలహా ఇదే. నా రాతలు నచ్చకపోతే ఇటు రాకండి. నా ఆలోచన రాసుకునే హక్కు నాకున్నట్లే, దాన్ని చదవకుండా ఇగ్నోర్ చేసే హక్కు మీకుంది. కానీ - ఈ బ్లాగ్లోకంలో మీ హక్కుని మీరు సరీగ్గా వినియోగించుకోవట్లేదని చెప్పడానికి విచారిస్తున్నాను. 

కొందరు వ్యక్తులు అదేపనిగా నన్ను విమర్శిస్తూ కామెంట్లు రాయడమే పనిగా పెట్టుకున్నారు. 'నా కామెంట్ ఎందుకు పబ్లిష్ చెయ్యలేదు?' అంటూ మళ్ళీ ఆరాలు! ఇంకొందరు - "ఫలానా బ్లాగులో మిమ్మల్ని తిడుతున్నారు, పట్టించుకోకండి." అంటూ ఆయా సైట్లకి లింక్‌లిస్తూ 'ధైర్యం' చెబుతున్నారు (వీళ్ళది ఆ తిట్లు నేనెక్కడ మిస్సైపోతున్నానో అనే బెంగ కావచ్చు). మొత్తానికి ఈ తెలుగు బ్లాగ్లోకం నన్ను చాలా విసిగిస్తుంది

ఇక్కడితో ఈ పోస్టు సమాప్తం. 

ఇప్పుడు కొంతసేపు నా బ్లాగ్ కష్టాలు (ఇంతకు ముందోసారి రాశాను) - 

కొందరు బ్లాగర్లు యెల్లో పేజెస్ ద్వారా నా హాస్పిటల్ నంబరు తెలుసుకుని, ఫోన్ చేసి సైకియాట్రీ సబ్జక్టు సంబంధించిన సలహాలు అడుగుతున్నారు. ఇంకొందరు నన్ను ఫలానా సైకియాట్రిస్టుకి ఫోన్ చేసి చెప్పమని (ముఖ్యంగా ఎన్నారైలు) అడుగుతున్నారు. ఇది నాకు చాలా ఇబ్బందిగా, మొహమాటంగా వుంది. దయచేసి నన్ను బ్లాగరుగా మాత్రమే చూడ ప్రార్ధన. 

ఇంకో విషయం. నా పర్సనల్ నంబర్ కావాలనీ, గుంటూరు వచ్చినప్పుడు కలుస్తామనీ అడుగుతున్నారు. నాకు తోటి బ్లాగర్లతో వ్యక్తిగత పరిచయాల పట్ల ఆసక్తి లేదు (ఇది చాలా ముఖ్యమైన పాయింట్). నా పరిచయం బ్లాగుకే పరిమితం. అంతకు మించి - నన్ను కలిసే అవకాశం మీకు లేదని సవినయంగా మనవి చేస్తున్నాను. 

వైద్యవృత్తిలో బిజీగా వుంటూ తెలుగు బ్లాగుల్ని రెగ్యులర్‌గా రాస్తున్న ఏకైక అధముణ్ని నేనే! అందుగ్గానూ (విసిగించి) శిక్షించబూనడం మర్యాద కాదని కూడా తెలియ జేసుకుంటున్నాను. కాదూ కూడదూ అంటే బ్లాగు మూసేసుకుని స్నేహితుల కోసం ప్రైవేటుగా రాసుకుంటాను. థాంక్యూ!

(picture courtesy : Google)