Showing posts with label కాంగ్రెస్. Show all posts
Showing posts with label కాంగ్రెస్. Show all posts

Friday, 11 October 2013

తెలంగాణా! ఎందుకు?


"సుబ్బూ! కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని నిట్టనిలువుగా చీల్చి చాలా తప్పు చేసింది." బాధగా అన్నాను.

కాఫీ తాగుతున్న సుబ్బు చిన్నగా నవ్వాడు.

"నేనైతే అలా అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్లుండి తెలంగాణా ప్రాంతంపై ప్రేమ పుట్టుకురాలేదు. ఆ పార్టీకి తెలంగాణా ఇవ్వకుండా ఉండలేని రాజకీయ అనివార్యత ఏర్పడింది." అన్నాడు సుబ్బు.

"అంటే రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని చీలుస్తుందా?" అన్నాను.

"ముందు నువ్వా 'తెలుగు జాతి' అంటూ పరుచూరి బ్రదర్స్ మార్కు డైలాగులు కొట్టడం ఆపు. రాజకీయాలు మాట్లాడేప్పుడు రాజకీయ భాషనే వాడు. సినిమా భాష వాడకు. అవును ఏ పార్టీకైనా రాజకీయ లబ్దే అంతిమ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ. డాక్టర్లు వైద్యం చేస్తారు. వంటవాడు వంటే చేస్తాడు. రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. ఇంకోటి చెయ్యవు. దేశంలో రాజకీయ లబ్ది చూసుకొని రాజకీయ పార్టీ ఏదన్నా ఉందా?" అడిగాడు సుబ్బు.

"అవుననుకో. కానీ నాకెందుకో బాధగా ఉంది." అన్నాను.

"అవును. కొద్దిగా బాధగానే ఉంటుంది. కానీ రాష్ట్ర విభజన ఒక రాజకీయ అంశం. రాజకీయ అంశాలని emotional గా చూడరాదు మిత్రమా! ఒకరకంగా కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వటానికి నరేంద్ర మోడీ ముఖ్యకారకుడు. కాంగ్రెస్ పార్టీ 2014 లో రాహల్ గాంధీని ప్రధానిగా చెయ్యడానికి రోడ్ మేప్ వేసుకుంది. బిజెపి నరేంద్ర మోడీతో రోడ్ మేప్ సిద్ధం చేసుకుంటుంది. ఈ రెండు మ్యాపుల్లో ఒక మ్యాప్ మాత్రమే సక్సస్ అవుతుంది. మోసగాళ్ళకి మోసగాడు సినిమాలో నిధి కోసం వేసుకునే ఎత్తులు, పైయ్యెత్తులు జ్ఞాపకం ఉందా? ఇప్పుడు బిజెపి, కాంగ్రెస్, బిజెపిల మధ్య ఈ వాతావరణమే నెలకొని ఉంది. అందువల్ల దేశంలోని ప్రతి పార్లమెంటు సీటు కీలకంగా మారింది." అన్నాడు సుబ్బు.

"అందువల్ల రాష్ట్రం విడగొట్టాలని దుర్మార్గమైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుందంటావ్?" అడిగాను.

"మళ్ళీ సినిమా భాషలో మాట్లాడుతున్నావ్. ఇక్కడ దుర్మార్గం, సన్మార్గం ఏముంది? అంతా రాజకీయ  మార్గమే! నువ్వు రాష్ట్ర రాజకీయాల్ని ఢిల్లీ వైపు నుండి చూట్టం నేర్చుకో. విషయం చాలా తేలికగా అర్ధమవుతుంది." అన్నాడు సుబ్బు.

"నేను నిఖార్సైన తెలుగువాణ్ని. సమస్యని నా ప్రాంతం నుండి మాత్రమే చూస్తాను. ఇంకేవైపు నుండి చూడను." చికాగ్గా అన్నాను.

సుబ్బు ఖాళీ కాఫీకప్పు టేబుల్ పై పెట్టి కుర్చీలోంచి లేచాడు. నా ఎదురుగా నించొని.. నా నుదిటిపై తన కుడిచేతి చూపుడు వేలు ఆనించాడు.

"ఇప్పుడు నీకు నిద్ర వస్తుంది.. వస్తుంది. హాయిగా నిద్ర పోతున్నావ్. నిద్ర పోయ్యావ్. నిద్ర పో.. య్యా .. వ్." అన్నాడు.

ఆశ్చర్యం! నాకు నిజంగానే నిద్రోచ్చింది. అలాగే కుర్చీలో ఒరిగిపొయ్యాను.

"మిత్రమా! ఇప్పుడు నువ్వు సాధారణ పౌరుడివి కాదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడవి. నువ్విప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ మీటింగులో ఉన్నావు. నేను సోనియా గాంధీని. అదిగో చూడు.. ఎదురుగా అహ్మద్ పటేల్, మన్మోహన్ సింగ్, ఆంటోని.. కనిపిస్తున్నారా?"

"అవును. స్పష్టంగా కనిపిస్తున్నారు మేడం." అన్నాను.

"మీరు CWC లో ఆంద్రప్రదేశ్ వ్యవహారాల బాధ్యులు. పార్టీ అధ్యక్షురాలిగా ఏపీలో మన పార్టీ పరిస్థితిపై మీ నివేదిక అడుగుతున్నాను. ఏం చెబుతారో చెప్పండి." అన్నాడు సుబ్బు.

నేను గొంతు సరి చేసుకుని చెప్పటం మొదలెట్టాను.

"నమస్తే మేడం! ఏపీలో మన పార్టీ పరిస్థితి అస్సలు బాలేదు మేడం. సీమాంధ్రలో జగన్ పార్టీ దూసుకుపోతుంది. తెలంగాణా కెసిఆర్ కోటగా మారిపోయింది. తెలంగాణలో బిజెపి కూడా చాప కింద నీరులా విస్తరిస్తుంది. రాష్ట్రంలో ఉపఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిచోటా మన పార్టీ డిపాజిట్టు కోల్పోయింది. కాబట్టి మన రాష్ట్ర నాయకుల మాటలకి విలువనివ్వడం శుద్ధదండగ." అన్నాను.

"అలాగా? సరే! మీరేం చేస్తారో నాకనవసరం. ఎట్లాగైనా సరే అక్కడ మన పార్టీ పరిస్థితి ఇంప్రూవ్ అవ్వాలి. మనకి ఏపీ నుండి మేక్జిమం పార్లమెంటు సీట్లు రావాలి. ఏం చేద్దామంటారు?" అడిగాడు సుబ్బు.

ఒక్క క్షణం ఆలోచించాను.

"మేడం! మనం అర్జంటుగా తెలంగాణా ఇచ్చేద్దాం. అందువల్ల ఇరవై మూడు జిల్లాల్లో పది జిల్లాలు మన ఖాతాలో పడతయ్. ఈ దెబ్బకి తెలంగాణలో బిజెపి అవుట్. కెసిఆర్ ఎలాగూ మనతో కలిసిపోతాడు. కాబట్టి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాని స్వీప్ చేసేస్తాం." ఉత్సాహంగా అన్నాను.

"వెరీ గుడ్. మరప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో ఏం చేద్దాం?" అడిగాడు సుబ్బు.

"అక్కడ రాజకీయం చెయ్యడానికి మనకి వెసులుబాటు ఉంది మేడం. జగన్ పార్టీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని రంగం సిద్ధం చేశాను. ద డీల్ ఈజ్ జగన్ బాబు CM, మన రాహుల్ బాబు PM."

"ఇప్పుడు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం నడుస్తుంది. మరి తెలంగాణా ఆపేద్దామా?" అడిగాడు సుబ్బు aka సోనియా గాంధీ.

"అదెలా కుదురుతుంది. ఇప్పుడు రాష్ట్ర విభజనని పెండింగ్ లో పెడితే అన్నింటికి చెడతాం మేడం. దీన్నే మా తెలుగు భాషలో వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదంటారు. మనకి ముందుకు పోవడం మించి వేరే దారి లేదు మేడం." అన్నాను.

"అంతేనంటారా?"

"అంతే మేడం. మీరు తెలంగాణా ఇస్తానని ఒకసారి ఎలక్షన్ మీటింగులో చెప్పారు. ఇప్పుడు తెలంగాణా ఇచ్చేస్తే మాట నిలబెట్టుకున్నట్లూ ఉంటుంది.. రాజకీయంగా లాభమూ చేకూరుతుంది. తెలంగాణా ఇవ్వకుండా రాష్ట్రం మొత్తం నష్టపొయ్యేకన్నా.. ఇచ్చి ఒక భాగాన్ని మన ఖాతాలో వేసుకోవడం ఉత్తమం."

"మరి రాష్ట్రవిభజన విషయంలో నిదానంగా వ్యవహరిస్తున్నారేమిటి?" అడిగాడు సుబ్బు.

"చూడండి మేడం! ఎదురుగా మసాలా దోశ విత్ అల్లం పచ్చడి అండ్ కొబ్బరి చట్నీలతో రెడీగా ఉంది. మన ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చినట్లు తిందాం. హడావుడిగా తినవలసిన అవసరం మనకేంటి?" అన్నాను.

"అర్ధం కాలేదు." అన్నాడు సుబ్బు.

"కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో మనమే ఉన్నాం గదా మేడం. ఎన్నికల సమయానికి క్లైమేక్స్ వచ్చేట్లుగా మనం రాజకీయాలు నడిపిద్దాం. మా  తెలుగు సినిమాల్లో పదోరీల్లోనే పోలీసులు వస్తే హీరో ఫైటింగు చెయ్యని అసమర్ధ వెధవగా మిగిలిపోతాడు. కాబట్టి దర్శకుడు పద్నాలుగో రీలు దాకా పోలీసుల్ని ఆపుతాడు. అంచేత తెలంగాణా ఇవ్వాల్సిన టైమింగ్ మన ఇష్టప్రకారం మాత్రమే ఉంటుంది. చివరిదాకా ఎవరికీ ఇంకే అవకాశం లేకుండా చెయ్యడమే మన మాస్టర్ ప్లాన్." అన్నాను.

కుర్చీలోంచి లేచాడు సుబ్బు. తన కుడిచేతి చూపుడు వేలుతో నా నుదురు తాకాడు.

"ఇప్పుడు నువ్వు నిద్ర లోంచి లేస్తున్నావు. నిదానంగా కళ్ళు తెరుస్తున్నావు. ఇప్పుడు నేను సోనియా గాంధీని కాను. నువ్వు CWC సభ్యుడవి కాదు.. సభ్యుడవి కాదు. నువ్వొక సాధారణ పౌరుడివి." అన్నాడు సుబ్బు.

నిద్రలోంచి మెలకువ వచ్చినట్లు నిదానంగా కళ్ళు తెరిచాను. వెలుగు భరించలేక ఒక్కసారిగా కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచాను. ఎదురుగా నవ్వుతూ సుబ్బు.

ఇందాక ఏదో మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నాను? ఆఁ.. గుర్తొచ్చింది. రాష్ట్ర విభజన గూర్చి సుబ్బుతో చర్చిస్తున్నాను.

" సుబ్బూ! కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని నిట్టనిలువుగా చీల్చి చాలా తప్పు చేసింది." అన్నాను.

"అవునా? అయితే ఇప్పుడు నీకున్న ఆప్షన్ ఒక్కటే! రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని తెలంగాణా జిల్లాల్లో ఉద్యమం చెయ్యడం. బెస్టాఫ్ లక్." అంటూ నవ్వుతూ గదిలోంచి నిష్క్రమించాడు సుబ్బు.

(photo courtesy : Google)

Wednesday, 6 February 2013

థాంక్స్ టు కాంగ్రెస్ హై కమాండ్!


"ఎరక్కపోయి అన్నాను. ఇరుక్కుపోయ్యాను." అప్పటికి అరవై మూడోసారి అనుకున్నాడు రాంబాబు.

ఫిల్టర్ కాఫీ తాగుతూ, టీవీ చూస్తున్నాడన్న మాటే గానీ.. మనసు మనసులో లేదు.

అది ఆదివారం. సమయం సాయంత్రం నాలుగు గంటలవుతుంది. భార్య ఇందిర వంటింట్లో బిజీగా ఉంది.

రాంబాబు, ఇందిరల జంట "రంగమ్మ కథ" లో మనకి పరిచయమే. వారికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ఎనిమిది, చిన్నవాడు ఆరో క్లాసు చదువుతున్నారు. పెద్దవాడిది తండ్రి పోలిక. కొంచెం మెతక. రెండోవాడిలో ఇందిర లక్షణాలు ఎక్కువ.

మొదట్నుండీ రాంబాబుకి పుస్తక పఠనం అనేది చాలా ఇష్టమైన కార్యం. అరిగిపోయిన తెలుగు భాషలో చెప్పాలంటే అతనో 'పుస్తకాల పురుగు.'

పెళ్ళైన కొత్తలో ఇందిరకి రాంబాబు హాబీ పెద్దగా ఇబ్బంది అనిపించ లేదు గానీ.. క్రమేణా ఆవిడకి చికాగ్గా అనిపించసాగింది. మొదట్లో చెప్పి చూసింది. ఆ తరవాత పొద్దస్తమానం పుస్తకాల మధ్యన బ్రతికేసే రాంబాబుని ఇందిర పట్టించుకోవడం మానేసింది.

పిల్లలు ఇందిరని అడుగుతుంటారు. "అమ్మా! నాన్నెందుకు ఎప్పుడూ అలా పుస్తకాలు చదువుతుంటాడు? పరీక్షలా?" అని. పరీక్షల్లేకపోయినా దీక్షగా పుస్తకాలు చదివే రాంబాబు కాన్సెప్ట్ పిల్లలకి అర్ధం కాలేదు.

ఈ విధంగా ఆ ఇంట్లో అందరికీ ఒక స్థిరమైన ప్రవర్తనా నియమావళి ఏర్పడిపోయింది. రాంబాబు ఉద్యోగం చేస్తాడు. పుస్తకాలు చదువుతాడు. ఇందిర వంట చేస్తుంది. పిల్లల చదువుల వ్యవహారం బాగా పట్టించుకుంటుంది. పిల్లలు స్కూలుకెళ్తారు. ఆడుకుంటారు. ఆకలేస్తే అన్నం తింటారు. చదువుకుంటారు. అప్పుడప్పుడు గొడవ చేస్తుంటారు. ఇదీ వరస.

నాల్రోజుల క్రితం ఆ ఇంట్లో అనుకోని సంఘటన ఒకటి జరిగింది. కన్యాశుల్కంలో పూటకూళ్ళమ్మకి, మధురవాణిలకి గల సామ్యం గూర్చి రాంబాబు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతనికి గురజాడ పూటకూళ్ళమ్మ పాత్రని అద్భుతంగా తీర్చిదిద్దినట్లు అనిపించింది.

ఇంతలో రెండో బెడ్రూం లోంచి అరుపులు, కేకలు.. కొద్దిసేపటికి పెద్దగా శబ్దాలు. ఇందిర ఆవేశంతో రాంబాబు రూంలోకి వచ్చింది. కోపంతో మొహం కందిపోయి ఉంది. జుట్టు రేగిపోయింది. కళ్ళల్లో నీళ్ళు. కన్యాశుల్కం ముందేసుకుని తీవ్రంగా యోచించుచున్న రాంబాబుని చూడంగాన్లే ఆమెకి కోపం రెండింతలైంది.

"మహానుభావా! నువ్వు సాహిత్యసేవ చేసుకుంటూ తరించు. పేకాట, తాగుడు కన్నా దరిద్రపు వ్యసనం నీది. నీతో కాపురం చెయ్యడం నావల్ల కాదు. నేను మా పుట్టింటికి పోతున్నా." అంటూ ఆవేశంతో ఊగిపోయింది.

రాంబాబుకి విషయం అర్ధం కాలేదు. పిమ్మట పిల్లల్ని పిలిచి విచారించాడు. ఇందిరని బుజ్జగిస్తూనే విషయాన్ని రాబట్టాడు. పిల్లలు గొడవ చేస్తున్నారు. సరీగ్గా చదువుకోటల్లేదు. ఇందిరని అస్సలు లెక్క చెయ్యట్లేదు. ప్రస్తుతం పిల్లలిద్దరి మధ్యా టీవీలో ఏ చానెల్ చూడాలన్న విషయంలో ఘోరమైన తగాదా.. తన్నులాట జరిగింది.

రాంబాబు కొద్దిసేపు ఆలోచించాడు. సమస్యని ఎలా పరిష్కరించాలో తెలీలేదు. ఇందిర అసలు దోషివి నువ్వేనన్నట్లు రాంబాబునే కొరకొరా చూస్తుంది. రాంబాబుకి వాతావరణం చాలా ఇబ్బందిగా ఉంది. అర్జంటుగా ఈ సిట్యువేషన్ నుండి బయట పడే మార్గం బుర్రలోకి తట్టట్లేదు.

పిల్లల్ని మందలిస్తే హర్టవుతారు. ఇందిరని ఊరుకోమ్మంటే ఆవిడకి కోపం వస్తుంది. అదీగాక పిల్లల ముందు చులకనైపోతుంది. ఏం చెయ్యాలి? ఈ పరిస్థితి నుండి ఎలా బయట పడాలి? పోనీ పిల్లలకి ఏదో ఆశ పెట్టి.. తల్లి మాట వినేట్లు చేస్తే పోలా? ఇదేదో బానే ఉంది.

"పిల్లలూ! మీరు గొడవ చెయ్యకుండా బుద్ధిగా చదువుకోండి. అమ్మ చెప్పినట్లు వినండి. నే చెప్పినట్లు చేస్తే వచ్చే ఆదివారం మిమ్మల్ని మంచి సినిమాకి తీసుకెళ్తాను. సరేనా?" అన్నాడు రాంబాబు.

పిల్లలు ఆనందంతో గంతులేశారు. ఇందిర కొద్దిగా ఆశ్చర్యంగా, ఎక్కువగా అపనమ్మకంగా రాంబాబుని చూసింది.

"నీలో ఇంత మార్పు ఊహించలేదు. పిల్లల గూర్చి పట్టించుకున్నందుకు థాంక్స్! నాకు తెలుసు. నువ్వు చెబితే పిల్లలు వింటారు." అంటూ వంటగదిలోకి వెళ్ళింది.

'ప్రస్తుతానికి గండం గడిచింది. అమ్మయ్య!' అనుకున్నాడు రాంబాబు.

ఆ రోజు నుండి ఆ ఇంటి వాతావరణం మారిపోయింది. పిల్లలు శ్రద్ధగా చదవసాగారు. ఇద్దరూ గొప్ప సఖ్యతతో టీవీ చూడ్డం మొదలెట్టారు. ఇందిరకి చాలా సంతోషం వేసింది. 'ఎంతైనా రాంబాబు తెలివైనవాడు.' అనుకుంది.

మారిన రాంబాబుపై ఇందిరకి మిక్కిలి ప్రేమ పుట్టింది. సుబ్బిరామిరెడ్డి కోట్లు ఖర్చు చేసి కళాకారుల్ని సన్మానించి తన కళాతృష్ణని తీర్చుకున్నట్లు.. ఇందిర రాంబాబుకి అత్యంత ప్రియమైన వంటలు చేస్తూ.. తన ప్రేమని వంటల రూపంలో ప్రదర్శించసాగింది.

రాంబాబుకి గుత్తొంకాయ ఇష్టం. కందిపచ్చడంటే ప్రాణం. నిమ్మకాయ పప్పంటే పరమానందం. చింతపండు పులిహొరంటే చచ్చిపోతాడు. ఇవన్నీ ఆ రోజు నుండి భారీగా, ధారాళంగా వండబడ్డాయి. రాంబాబు సినిమా మంత్రం పిల్లల మీదే కాదు.. ఇందిర మీద కూడా బానే పంజేసింది.

ఇవ్వాళ ఆదివారం. ఇందిర చేసిన బీరకాయ పచ్చడి, ములక్కాడల పప్పుచారు, కాకరకాయ వేపుడుతో భారీ భోజనాన్ని పొట్ట భరీగా పట్టించి 'బ్రేవ్' మని త్రేన్పాడు రాంబాబు.

భుక్తాయాసంతో కొద్దిసేపు చిన్న కునుకేశాడు. ఆపై స్నేహితుడు సుబ్బారావు పంపిన పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అది మనసు ఫౌండేషన్ వారు ప్రచురించిన పతంజలి సాహిత్యం. పుస్తకాన్ని ఆప్యాయంగా తడిమాడు రాంబాబు. అతనికి పతంజలి వ్యంగ్యం ఇష్టం. ఒక్కసారిగా గోపాత్రుడు, వీరబొబ్బిలి, అప్పన్నసర్దార్ మదిలో మెదిలారు. ఇవ్వాళ పతంజలిని పరామర్శించాలి అనుకున్నాడు.

ఒక్కసారిగా పిల్లలు గదిలోకొచ్చి ఆనందంతో అరవసాగారు. "నాన్నోయ్! ఇవ్వాళ ఆదివారం. సినిమా కెళ్తున్నాం." ఉలిక్కిపడ్డాడు రాంబాబు. అప్పటిగ్గాని అతనికి ఇవ్వాల్టి సినిమా ప్రోగ్రాం గుర్తు రాలేదు.

వంటింట్లోంచి నవ్వుతూ వచ్చింది ఇందిర. "సర్లే! తొందరగా స్నానాలు చేసి రెడీ అవ్వండి. నేనీలోపు రాత్రి వంట కానించేస్తాను." అంటూ వంటింట్లోకి వెళ్ళింది.

రాంబాబు సినిమా చూసి యేళ్ళు గడిచాయి. అతనికి సినిమాలంటే బొత్తిగా ఆసక్తి లేదు. ఆ సినిమా హింస భరిస్తూ, చీకట్లో రెండు గంటలు కదలకుండా కూర్చోవడాన్ని తలచుకుని భయకంపితుడైపొయ్యాడు.

ఆ రోజు ఏదో గండం నుండి తప్పించుకోడానికి నోరు జారాడు. పిల్లలు తన మాట సీరియస్ గా తీసుకుని ఇంత బుద్ధిమంతులైపోతారని అతను కలలో కూడా ఊహించని మలుపు!

ఎదురుగా పతంజలి పుస్తకం మందహాసంతో పలకరిస్తుంది. మనసంతా దిగులుగా అయిపోయింది.

'ఎరక్కపోయి అన్నాను. ఇరుక్కుపొయ్యాను.' అరవై నాలుగోసారి అనుకున్నాడు.

పోనీ 'తూచ్!' అంటే!

నో.. నో. పిల్లలకి  ఏదో కారణం చెప్పొచ్చు గాని.. ఇందిర దెబ్బకి తట్టుకోవడం కష్టం. దేవుడా! నాకీ సినిమా గండం తప్పేలా చూడు తండ్రి!


టీవీలో వార్తలు. గులాం నబి ఆజాద్ వారాలకి, నెలలకి రోజులెన్నో లెక్కలు చెబుతున్నాడు. వయలార్ రవి తెలంగాణా కోసం మరింత లోతైన చర్చలు అవసరం అంటున్నాడు. చానెల్ మార్చాడు. ఆ చానెల్లో ఒక పక్క నుండి మధు యాష్కి, ఇంకోపక్క నుండి లగడపాటి తిట్టుకుంటున్నారు.

రాంబాబుకి చిరాకేసింది. 'వీళ్ళందర్నీ ఏ కాన్సంట్రేషన్ కేంపులోనో పడేసి తిండి పెట్టకుండా మాడిస్తేగానీ దేశం బాగుపడదు.' అనుకున్నాడు.

సడన్గా.. ఐడియా! మెరుపు మెరిసింది. కొద్దిసేపటికి బుర్ర కె.వి.పి.రామచంద్రరావులా పని చెయ్యడం మొదలెట్టింది. మరికొంతసేపటికి ఆలోచనలో క్లారిటీ వచ్చేసింది.

ఇంతలో పిల్లలు రాంబాబు దగ్గరకొచ్చారు. "నాన్నోయ్! మొన్న అమ్మ కొన్న కొత్త బట్టలు వేసుకోమా?" అంటూ అడిగారు.

రాంబాబు తల పక్కకి తిప్పుకుని.. పిల్లలకి కనబడకుండా ప్రభాకరరెడ్డిలా ఒక విషపు నవ్వు నవ్వుకున్నాడు. తల మళ్ళీ పిల్లల వైపు తిప్పి చిత్తూరు నాగయ్యలా అమాయకపు నవ్వు నవ్వాడు.

వారిని ఆప్యాయంగా దగ్గరకి పిలిచాడు. అటూఇటూ చూస్తూ ఇందిరకి వినబడకుండా లోగొంతుకతో అడిగాడు. "ఇంతకీ ఏ సినిమాకి వెళ్దాం?"


పిల్లలు ఉత్సాహంగా "నాయక్ కి వెళ్దాం నాన్నా! ఫైటింగులు భలే ఉన్నాయంట. స్కూల్లో మా ఫ్రెండ్స్ చెప్పారు." అన్నారు.

"అవునవును. సినిమా చాలా బాగుందిట. అంతా ఫైటింగు, కామెడీయేనట. తప్పకుండా దానికే వెళ్దాం. అయితే మీ అమ్మ 'సీతమ్మ చెట్టు' కి వెల్దామంటుంది.. " అంటూ అర్దోక్తిగా ఆగాడు.

పిల్లలు వెంటనే "ఛీ.. ఛీ.. అదేం సినిమా? ఒక్క ఫైటింగు కూడా లేదు. నాయక్ కి వెళ్ళాల్సిందే!" అన్నారు.

రాంబాబు 'అమ్మయ్య' అనుకున్నాడు.

"తప్పకుండా మీరు చెప్పిన సినిమాకే వెళ్దాం. మీ ఇష్టమొచ్చిన బట్టలు వేసుకోండి. అమ్మని కూడా నాయక్ సినిమాకే ఒప్పిస్తాను." అంటూ వంట గదిలోకి వెళ్ళాడు.

వంటింట్లో ఇందిర హడావుడిగా రాత్రి భోజనంలోకి బెండకాయ వేపుడు చేస్తుంది. రాంబాబు ఇందిర వైపు ప్రేమగా, ఆప్యాయంగా చూశాడు. ఇందిరకి రాంబాబు చూపులో అక్కినేని నాగేశ్వర్రావు కనబడ్డాడు. తను కూడా అతన్ని జమునలా మురిపెంగా చూసింది.

"ఇందూ! మా ఆఫీసులో అందరూ సీతమ్మ చెట్టు సినిమా చాలా బాగుందన్నారు. సెంటిమెంట్ చాలా బాగుందట. నీతో కలిసి ఆ సినిమా చూడాలని కోరికగా ఉంది. మనం ఆ సినిమాకి వెళ్తే బాగుంటుందేమో?"

చిన్నపిల్లాడిలా బ్రతిమాలుతున్న భర్తని చూడంగాన్లే ఇందిరకి జాలి కలిగింది. సావిత్రిలా కరిగిపోయింది.

'ఇంత చిన్న విషయానికి కూడా తన పర్మిషన్ అడుగుతున్న ఈ సున్నిత హృదయుడు నాకు భర్తగా లభించడం నా అదృష్టం. ఆ పుస్తకాల పిచ్చి ఉందనే గానీ.. మనసు మాత్రం బంగారం.' అని మురిసిపోతూ "అలాగే! తప్పకుండా." అని మాటిచ్చింది.

"పిల్లలకి సీతమ్మ చెట్టు ఫ్యామిలీ సెంటిమెంట్ నచ్చదేమో?" సందేహంగా అడిగాడు.

"వాళ్ళ మొహం! వాళ్ళు నేనెంత చెబితే అంతే!" గర్వంగా అంది.

"థాంక్యూ ఇందూ! యు ఆర్ మై డార్లింగ్!" అంటూ బెడ్రూంలో పిల్లల దగ్గరకి వెళ్ళాడు.


"పిల్లలూ! అమ్మ సీతమ్మ చెట్టుకే వెళ్దామంటుంది. ఆ సినిమా దరిద్రంగా ఉంటుంది. అందులో ఒక్క ఫైటింగు కూడా ఉండదు. మీకసలా సినిమా అర్ధం కూడా కాదు. అమ్మ మాట కాదంటే ఊరుకోదు. ఎంత చెత్తైనా ఆమె ఇష్టప్రకారం ఆ చెట్టు సినిమాకే వెళ్ళాలి. ఇంక బయల్దేరండి." అంటూ తను కూడా సినిమాకి రెడీ అవుతున్నట్లు హడావుడి చేశాడు.

పిల్లలకి రాంబాబు చెప్పింది నచ్చలేదు. అందులో చిన్నవాడికి కోపం ఎక్కువ.

"నేను నాయక్ సినిమాకయితేనే వస్తాను. ఏడుపు సినిమాలకి రాను." అంటూ అరుస్తూ వంటగదిలోకి పరిగెత్తాడు. వాణ్ని ఫాలో అవుతూ పెద్దవాడూ వంటింట్లోకి వెళ్ళాడు.

రాంబాబు రెండు చెవులూ వంట గది వైపు వేశాడు. అక్కడ కొద్దిసేపు వాదనలు, ప్రతి వాదనలు. ఇంకొద్ది సేపటికి కేకలు, అరుపులు, శబ్దాలు. ఇంకా కొద్దిసేపటికి వంటింట్లోంచి ఆవేశంతో ఇందిర హాల్లో కొచ్చింది.

"వేలెడు లేడు వెధవ! ఫైటింగ్ సినిమా కావల్ట! నా మాటకి విలువ లేదా? ఇప్పుడే చెబుతున్నాను.. రామం! వెళ్తే సీతమ్మ చెట్టు.. లేకపోతే సినిమా ప్రోగ్రాం కేన్సిల్!"

పెద్దాడికి ఫలానా సినిమా అంటూ పట్టింపేం లేదు. ఏదొకటి గిట్టిద్డామనుకుంటున్నాడు. ఆ విషయం గట్టిగా చెప్పలేడు. వాడు మన్ మోహన్ సింగ్ లాంటి వాడు. అందుకే వాడికి ఏడుపొస్తుంది.

సమస్యంతా చిన్నవాడితోనే! వాడు ఇందిరతో సమానంగా నాగం జనార్ధనరెడ్డి రేంజిలో ఆవేశపడుతున్నాడు. "నేనేం రాను పో! నీ బోడి సినిమా ఎవడు చూస్తాడు." అంటూ చేతిలోనున్న కోకకోలా పెట్ బాటిల్ విసిరి నేలకేసి కొట్టాడు. హాలంతా కొకకోలా చిమ్మింది.

"అది కాదు నాన్నా! అమ్మ చెప్పినట్లు విని.. " అంటూ చిన్నవాణ్ణి బుజ్జగించబోయ్యాడు రాంబాబు.

"వాడికి పోగరెక్కింది. నోటికేంతోస్తే అంత వాగుతున్నాడు. ఇవ్వాళ సినిమా ప్రోగ్రాం కేన్సిల్. రామం! నువ్వు నీ రూంలోకెళ్ళి పుస్తకం చదువుకో. వాడితో నువ్వేం రాయబారాలు చెయ్యనక్కర్లేదు. నువ్వు ఎవర్నైనా సినిమాకి తీసుకెళ్ళావా.. నేను మా ఇంటికెళ్ళి పోతాను.. జాగ్రత్త!" భద్రకాళి అయ్యింది ఇందిర.

పాకిస్తాన్, ఇండియా సైనికుల మధ్యన చిక్కుకుపోయిన కాశ్మీరి పౌరుడి వలే 'అసహాయ దృక్కుల'తో అలా నిలబడిపొయ్యాడు రాంబాబు. తరవాత 'భారంగా' తన రూంలోకి వెళ్ళాడు.

టీవీలో మధు యాష్కి, లగడపాటి ఇంకా తిట్టుకుంటూనే ఉన్నారు. గులాం నబి ఆజాద్ వారానికి వెయ్యి రోజులని, నెలకి లక్ష రోజులనీ తేల్చేశాడు. వయలార్ రవి లుంగీ పైకెత్తి కట్టుకుని.. టేపు తీసుకుని సమస్య లోతు కొలుస్తానంటున్నాడు.

'యాహూ! థాంక్యూ కాంగ్రెస్ హైకమాండ్! థాంక్యూ!' అని సంతోషంగా, ఆనందంగా మనసులోనే అనుకుంటూ.. పతంజలి పుస్తకాన్ని ఆప్యాయంగా చేతిలోకి తీసుకున్నాడు రాంబాబు.

(photos courtesy : Google)

Saturday, 26 May 2012

జగన్ అవినీతి - కాంగ్రెస్ రాజనీతి


ఉదయాన్నే కాఫీ తాగుతూ 'ఆంధ్రజ్యోతి' తిరగేస్తున్నా. 'జగన్ అవినీతిపరుడు.' ఒప్పుకున్నాం! ఇంకేమన్నా వార్తలున్నాయా? ఎంత వెతికినా వేరే వార్తలు కనిపించట్లేదు. ఈ ముక్క రాయడానికి ఇన్ని పేజీలు  దేనికబ్బా!

ఇంతలో "రవణ మావా! కాఫీ." అంటూ వచ్చాడు సుబ్బు.

"కూర్చో సుబ్బు! జగన్ని లోపలేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యవాదులంతా హర్షించదగిన మంచి పరిణామం. ఒక అవినీతిపరుణ్ణి లోపలేస్తే గాని మిగిలినవారికి బుద్ధిరాదు." అన్నాను.

సుబ్బు ఒకక్షణం ఆలోచించాడు.

"నేనలా అనుకోవడం లేదు. జగన్ని అరస్టు చెయ్యడం కాంగ్రెస్ చేస్తున్న చివరి తప్పిదం అవుతుందేమో. రాజకీయంగా ఆలోచిస్తే జైలుకెళ్ళడం జగన్ కే మంచిదిగా అనిపిస్తుంది. అవినీతి రాజకీయాల గూర్చి మాట్లాడే ముందు మనం ఒక విషయం ఆలోచించాలి. ఈ దేశంలో ఎవరు అవినీతిపరులు కాదు? ములాయం, మాయావతి, లాలూ, కరుణానిధి.. వీళ్ళంతా ఎవరు? సీబీఐ కేసులనేవి రాష్ట్రస్థాయి రాజకీయ నాయకుల్ని దారికి తెచ్చుకోవడానికి కేంద్రం చేతిలో ఉండే ముకుతాళ్ళు. నువ్వు నీతిసూత్రాల్ని, న్యాయసూత్రాల్ని ఖచ్చితంగా అప్లై చేస్తే ఈ దేశంలోని రాజకీయ నాయకులందరూ జైల్లోనే ఉండాల్సి వుంటుంది." అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! యువార్ టాకింగ్ నాన్సెన్స్! జగన్ని ఎలా సపోర్ట్ చేస్తావు?"అన్నాను.

"నేను ఎవ్వర్నీ సపోర్ట్ చెయ్యడం లేదు మిత్రమా! వాస్తవ పరిస్థితుల్ని అంచనా వేస్తున్నాను. మనది రాజకీయంగా నిరక్షరాస్య దేశం. మధ్యతరగతి మేధావులు ఎమోషనల్ గా, సెంటిమెంటల్ గా ఆలోచిస్తుంటారు. తల్లిని చంపేశారని రాజీవ్ గాంధీకి బంగారు పళ్ళెంలో అధికారమిచ్చాం. రాజీవ్ గాంధీని చంపేశారని సోనియాకి పట్టం కట్టాం. ఇంత పెద్దదేశంలో రాజకీయాలు ప్రజల జీవన ప్రమాణాలని మెరుగుపర్చే పథకాలతో కాకుండా సెంటిమెంటుతో నడుస్తున్నాయి. ఆశ్చర్యంగా లేదూ!" అన్నాడు సుబ్బు.

ఇంతలో కాఫీ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ చెప్పసాగాడు సుబ్బు.

"మన అనుభవంలో ఉన్న విషయాల్ని మాత్రమే మనం అర్ధం చేసుకోగలం, అనుభూతి చెందగలం. ఈ అనుభూతి లేనిదే ఫలానావాడు దుష్టుడు, దుర్మార్గుడు అని ఎంత చెప్పినా మనకి అర్ధంకాదు. ఇవన్నీ మన మైండ్ కి సంబంధించిన విషయాలు. ఉదాహరణకి - అమెరికావాడు అంతర్జాతీయంగా చేస్తున్న రౌడీయిజం మనకి పట్టదు. అదే ఒక వీధిరౌడీ అరాచకానికి మాత్రం కోపం తెచ్చుకుంటాం. విమానం కూలి నాలుగొందల మంది మరణించారన్నా పెద్ద బాధగా ఉండదు, అదే ఏ రైలేక్సిడెంట్లోనో ఇద్దరు చనిపోయినా చాలా బాధ పడతాం." అన్నాడు సుబ్బు.

"సుబ్బు! నువ్వు జగన్ అవినీతి గూర్చి మాట్లాడకుండా ఏదేదో చెబుతున్నావ్." గుర్తు చేశాను.

"నేను రిలవెంట్ గానే మాట్లాడుతున్నాను. అమెరికావాడి రాజకీయం లాగే, సమాజంలో సామాన్య జనాలకి అర్ధం కాని, ఐడెంటిఫై చేసుకోలేని అవినీతి ఉంటుంది. 2 జి స్పెక్ట్రమ్ అంటే ఏంటి? క్విడ్ ప్రోకో (quid pro quo) అంటే ఏదో తిట్టులా లేదు? గాలి జనార్ధనరెడ్డి చేసిన తప్పేంటి? ఏవో గనులు అక్రమంగా తవ్వాట్ట! మనకి మనూళ్ళో మునిసిపాలిటీవాడు అడ్డదిడ్డంగా తవ్వి పూడ్చకుండా వదిలేసిన గుంటలు మాత్రమే తెలుసు. అట్లాంటి మనం - ఎక్కడో కొండల్లో తవ్వే గనులు, గుంటలు ఎలా ఊహించుకోగలం? నువ్వూహించుకోగలవా?" అడిగాడు సుబ్బు.

"నావల్ల కాదు." అన్నాను.

"లక్షకోట్ల అవినీతి అంటారు. ఎవడన్నా కోటిరూపాయిలు ఎప్పుడన్నా లెక్కబెట్టాడా? కనీసం కంటితో చూశాడా? ఇవన్నీ మనం ఎమోషనల్ గా కనెక్ట్ కాని, కాలేని తెలివైన భారీనేరాలు. ఈ నేరాలు అర్ధం చేసుకోవాలంటే మనం సి.ఎ. చదివుండాలి." అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు.

"సుబ్బూ! నేరాన్ని, నేరస్థుల్ని పట్టించుకోని సమాజం మనది అంటావ్. అంతేనా?" అడిగాను.

"నా పాయింట్ అది కాదు! మనం మన స్థాయికి తగ్గ నేరాల్ని మాత్రమే గుర్తించగలం. జేబుదొంగల్ని తన్ని పోలీసులకి అప్పజెబుతాం. అర్ధరాత్రి ఇళ్ళల్లో పడే దొంగల్ని కరెంటు స్థంబానికి కట్టేసి చావగొడతాం. ఆస్పత్రిలో పది, ఇరవై అడుక్కునే వార్డ్ బాయ్ ని అసహ్యించుకుంటాం. అందుకే శంకర్ తీసిన 'భారతీయుడు' అంత హిట్టయ్యింది, అన్నాహజారే అంత పాపులరయ్యాడు." అన్నాడు  సుబ్బు.

"అవును కదా!" ఆశ్చర్యపొయ్యాను.

సుబ్బు చెప్పడం కొనసాగించాడు.

"ఒక తప్పుడు జీవోతో, అదే ఆస్పత్ర్లి భూమిని కాజేసి వందకోట్లు లబ్ది పొందే ప్రభుత్వ పెద్దల్ని పెద్దగా పట్టించుకోం. సూట్ కేస్ కంపెనీలు ఫ్లోట్ చేసి వేల కోట్ల అవినీతి చేస్తే, అసలా ప్రాసెస్సే అర్ధం కాక, కొద్దిసేపు బుర్ర గోక్కుని వదిలేస్తాం." అన్నాడు సుబ్బు.

"జగన్ అవినీతి సామాన్య ప్రజలు కనెక్ట్ అయ్యేది కాదంటావ్! అంతేగా? మరి జగన్ ఎన్నికల్లో గెలుస్తాడో, లేదో చెప్పలేదు." అడిగాను.

"కాంగ్రెస్ వాళ్ళు జగన్ ఎన్నికల్లో గెలిచే దాకా వదిలేట్టులేరు! నా లాజిక్ సింపుల్. దొంగని రెండు దెబ్బలేస్తే జనాలు తృప్తినొందుతారు, 'తిక్క కుదిరింది వెధవకి' అనుకుంటారు. అదే దొంగని చెట్టుకి కట్టేసి కొడితే 'అయ్యో పాపం!' అనుకుంటారు. కాంగ్రెస్ జగన్ని ఒకస్థాయిదాకా ఇబ్బంది పెడితే జనాలు పట్టించుకోరు. అవినీతికి శిక్ష పడిందనుకుంటారు. కానీ - దానికొక లక్ష్మణ రేఖ ఉంది, ఆ రేఖని కాంగ్రెస్సోళ్ళు దాటుతున్నారు. ఇది కాంగ్రెస్ కి సూసైడల్." అన్నాడు సుబ్బు.

"సోనియాగాంధీకి జగనంటే కోపం ఉండి ఉండొచ్చు." అన్నాను.

"రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలకి తావులేదు. ఇందిరాగాంధీకి బేడీలు వేయించి కక్ష తీర్చుకున్న చరణ్ సింగ్ ఏమైపొయ్యాడు? నిండు కొలువులో జయలలిత చీరని లాగించిన కరుణానిధి తరవాత ఎలక్షన్లో మట్టి కరిచాడు. ముసలి కరుణానిధిని అర్ధరాత్రి ఎత్తి అవతల పడేయించిన జయలలితని ఆ తరవాత ఎలక్షన్లో ప్రజలే ఎత్తి అవతల పడేశారు!" అన్నాడు సుబ్బు.

"అదంతా సానుభూతి కోసం రాజకీయ నాయకులు చేసిన నటన సుబ్బూ!" నవ్వుతూ అన్నాను.

"అదేంటి మిత్రమా నటనని అంత తేలిగ్గా తీసిపడేశావ్? 'రక్తసంబంధం'లో రామారావు, సావిత్రి నిజమైన అన్నాచెల్లెళ్ళనుకుని ఆంధ్రదేశం యావత్తూ రోదించిందా? ఎన్టీరామారావు నిజమైన రాముడని ప్రజల నీరాజనం అందుకున్నాడా? గత వారం రోజులుగా అన్ని న్యూస్ చానెళ్ళు జగన్ని తప్పితే వేరేదీ చూపించట్లేదు. జనాలు కూడా ఏడుపుగొట్టు సీరియళ్ళు చూడ్డం మానేసి జగన్ అరెస్టు గూర్చి ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. ఇది జగన్ కి విపరీతమైన పబ్లిసిటీ ఇస్తుంది. లక్ష్మణ రేఖని దాటుతున్న కాంగ్రెస్ నాయకత్వం జగన్ని అధికారం అనే గారెల బుట్టలోకి తంతుంది." అన్నాడు సుబ్బు.

"ఆ లక్ష్మణరేఖ ఎక్కడుందో నీకుమాత్రం ఎలా తెలుసు?" అడిగాను.

"నాకు తెలుసని నీకు చెప్పానా? నాకూ తెలీదు. కానీ అమ్మకి తెలుసు! ఆవిడ నిన్నట్నించి 'పాపం! తండ్రి లేని పిల్లాడు, ఆ అబ్బాయిని ఎందుకంతలా వేధిస్తున్నారు?' అనడం మొదలెట్టింది. ఇది కాంగ్రెస్ కి దుర్వార్త. మా పనమ్మాయి 'పాపం! వాళ్ళ నాన్న మా నాన్నకి ఫ్రీగా గుండాప్రీషన్ చేయించాడు. ఆ బాబుని జైల్లో యేయించినోడు పురుగులు పడి చస్తాడు.' అని పొద్దున్న అంట్లు తోముతూ అంది. ఇది జగన్ కి శుభవార్త. మన ప్రభుత్వాల్ని నిర్ణయించేది వీళ్ళే." అంటూ టైమ్ చూసుకున్నాడు సుబ్బు.

"రాజకీయ విషయాలు మాట్లాడేప్పుడు ఏ ఎన్.రామ్ నో, రామచంద్ర గుహానో కోట్ చెయ్యాలి. నువ్వు మీ అమ్మనీ, పనిమనిషినీ కోట్ చేస్తావేమిటి?" చికాగ్గా అన్నాను.

"ఆ పని నీలాంటి మేధావులు ఎలాగూ చేస్తున్నారుగా! ఇంక మళ్ళీ నేనెందుకు? ఈ దేశంలో మధ్యతరగతి మేధావులు వాస్తవాల్ని గుర్తించడం మానేసి చాలాకాలం అయ్యింది, అందుకే నేను వాళ్ళ ఆలోచనలు పట్టించుకోను. ఇంక నేవెళ్తా! దారిలో  చాలా  పనులున్నయ్." అంటూ నిష్క్రమించాడు సుబ్బు.

గమనిక : ఈ పోస్ట్ రాసేప్పటికి జగన్ అరెస్టవ్వలేదు.

కృతజ్ఞత :  ఆత్మీయ మిత్రుడు గోపరాజు రవికి.. 

(photo courtesy : Google)

Monday, 27 June 2011

నాకు నచ్చిన విద్వాంసుడు


సితార్ రవిశంకర్, వీణ చిట్టిబాబు, ఈమని శంకరశాస్త్రి, షెహనాయ్ బిస్మిల్లాఖాన్ వంటి సంగీత విద్వాంసుల గూర్చి విన్నాను, కానీ వారినెప్పుడూ విన్లేదు. వీరంతా గొప్ప ప్రతిభావంతులని అందరూ అంటుంటారు కాబట్టి నేనూ అర్జంటుగా ఒప్పేసుకుంటున్నాను. అయితే నేనిప్పుడు రాయబోతున్న వ్యక్తి వేరు !

పూర్వపు నలుపు తెలుపు టీవీ రోజులు గుర్తున్నాయా? ఆ రోజుల్లోనే ఇందిరాగాంధి చనిపోయింది. వారం రోజులు సంతాపం. వినోద కార్యక్రమాలన్నీ రద్దు చేయగా - వయొలిన్ ప్రోగ్రాం ఒక్కటే వచ్చేది. ఆ వయొలిన్ వాద్యగాడు నల్లగా, పొట్టిగా ఉండే ఓ మధ్యవయసు ఆసామి. పొట్టి పంచెతో, నలిగిన కుర్తాతో, మాసిన గడ్డంతో - ఒక మహానాయకురాలు చనిపోయిన దేశంలో రోదనకి ప్రతీకగా ఉండేవాడు.

దించిన తల ఎత్తకుండా 'కువూయి, కువూయి' అంటూ తన ఏడుపుగొట్టు వయొలిన్ వాయిద్యాన్ని గంటలకొద్దీ వాయించేవాడు. అప్పుడప్పుడు 'చాలా? ఇంకా వాయించనా?' అన్నట్లు పక్కకి ఎవరికేసో చూస్తుండేవాడు. వార్తలు మొదలయ్యే సమయానికి హఠాత్తుగా వాయింపుడు ఆపేసి, వయొలిన్ పక్కన పెట్టేసి, రెండు చేతులు జోడించి 'నమస్కార్' అని చెప్పేవాడు. 

ఆయన నమస్కారం నాకు అనేకవిధాలుగా గోచరించేది. 'అమ్మయ్య! ఇవ్వాళ నాకు బియ్యానికి డబ్బులొచ్చేసాయ్!' అని ఆనందపడుతున్నవాడిగానూ, 'నాకు మళ్ళీ ఈ సంతాప కచేరీ అవకాశం ఎప్పుడొస్తుందోగదా!' అని ఆశ పడుతున్నవాడిలాగానూ అనిపించేది. ఆరోజుల్లో దూరదర్శన్ వారు అన్ని సంతాపాలకి ఆయన్నే పిలిచేవాళ్ళనుకుంటాను. ఒక దేశ పేదరికాన్నీ, దైన్యాన్నీ -  మొహంలోనూ, వాయింపుడులోనూ అంత తీవ్రంగా వ్యక్తీకరించడం అనితరసాధ్యం! 

పిమ్మట ఆయన రాజీవ్ గాంధి సంతాపదినాల్లోనూ దూరదర్శన్ని ఏలాడు. క్రమేణా కాంగ్రెస్ వాళ్ళకి అనుమానం వచ్చింది. 'సంతాప వాయింపుడు అవకాశాల కోసం ఈ వయొలిన్ విద్వాంసుడు పూజలూ గట్రా చేస్తున్నాడా?!' అని. ఈ లెక్కన తమ కాంగ్రెసు పార్టీకి దేశనాయకుడెవడూ మిగలడని ఒక నిర్ణయానికొచ్చిన కాంగ్రెస్సోళ్ళు ఆయన్ని పక్కన పెట్టేశారు. 

వయొలిన్ విద్వాంసులవారికి మళ్ళీ అవకాశం రాకపోడానికి ఒక బలమైన కారణం వుందని మా గోపరాజు రవి చెబుతాడు. ఆయన సోనియాగాంధి దగ్గరకి పోయి 'నమస్కార్!' అని ఒక నమస్కార బాణం వదిలి - 'అమ్మా! మీ అత్తగారికి నేనే వాయించాను. మీ ఆయనకి నేనే వాయించాను. మీకు కూడా నేనే వాయించే అవకాశం కలిపించండమ్మా!' అని వేడుకున్నాట్ట!

చివరాకరకి నే చెప్పొచ్చేదేమనగా - ఆవిధంగా నా అభిమాన విద్వాంసులవారు టీవీ (తెర) మరుగయ్యారు. సంతాపాలకి రోజులు కాకుండా పొయ్యాయి. కాంగ్రెస్సోళ్ళు 'అమ్మయ్య' అని ఊపిరి పీల్చుకున్నారు.  

(picture courtesy : Google)  

Sunday, 26 June 2011

ప్రణవ్ ముఖర్జీ జీడిపప్పుల కధ


సోనియా గాంధీ కొలువు తీరింది. అదే - కాంగ్రెస్ పార్టీ 'కోర్ కమిటీ' మీటింగ్ జరుగుతుంది. ప్రణవ్ ముఖర్జీ నేతిలో వేయించిన జీడిపప్పుని నోరు కదపకుండా చప్పరిస్తున్నాడు. ఆంటోని కూనికిపాట్లు పడుతున్నాడు. మొయిలీ దొంగచూపులు చూస్తున్నాడు. చిదంబరం సోడాబుడ్డి కళ్ళద్దాల్లోంచి శూన్యంలోకి చూస్తున్నాడు. అక్కడందరూ మీటింగ్ ఎప్పుడయిపోతుందాని ఎదురు చూస్తున్నట్లుగా వున్నారు. మరైతే అప్పుడీ మీటింగెందుకు? ఏలినవారు ఇట్లాంటి హంగామా చెయ్యటం మహాభారతం రోజుల్నుండీ ఆనవాయితీగా వస్తుంది.
               
దుర్యోధనుడు కూడా ఇట్లాగే చాలా కోర్ కమిటీ మీటింగులు పెట్టేవాడు. బోల్డంత జీతాలు తీసుకుంటున్న భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వంటి గడ్డం మేధావులు రారాజుకి మంచిసలహాలు ఇవ్వొచ్చు. "మై డియర్ దుర్యోదనా! ఎంతసేపూ ఆ ద్రౌపదిని నీ తొడమీద కూర్చోపెట్టుకోవాలనీ, బట్టలిప్పించాలనే వెకిలి ఆలోచనలు మానుకో. అసలు నీ పాండవుల obsession వదుల్చుకో. నువ్వు ఈ దేశాధినేతవి. ప్రజారక్షకుడిగా, జనరంజకంగా పాలించవోయి, అది నీ విధి." అని మాత్రం చెప్పరు.     
               
ఎందుకు? ఎందుకంటే - ఈ ముసలి సలహాదారులు పెద్ద అవకాశవాదులు. 'ఏం చెపితే ఏమవుతుందో! ఈరాజుగాడు ఎట్లా పోతే మనకేంటి? మనకి జీతం, గీతం బాగానే గిట్టుబాటవుతుందిగదా. అయినా ఈ దరిద్ర దుర్యోధనుడు శకుని మాటైతే వింటాడుగానీ మన మాటెందుకు వింటాడు? చచ్చినా వినడు. వీడు గనక యుద్ధంలో భీముడు చేతిలో చస్తే ధర్మరాజు కొలువులో చేరాలి. ఇంకొంచెం జీతం పెంచమని పైరవీలు చేసుకోవాలి.' అని మనసులో జీతభత్యాలు లెక్కలేసుకుంటూ - కనీసం చెప్పే ప్రయత్నం కూడా చెయ్యరు . 

ఇప్పుడు మీకు ఈ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ మీటింగుల కధాకమామీషు అర్దమైందికదూ! ప్రణబ్ ముఖర్జీ జీడిపప్పులు తినడం మాని - "దొరసానమ్మా! ధరలు తగ్గించు, సామాన్యజనం ఆకలిచావులు చచ్చేట్లున్నారు. కాశ్మీర్ సంగతేం చేద్దాం? పొద్దస్తమానం నీ కొడుకుని ప్రధానమంత్రిని చెయ్యాలనే తాపత్రయం తగ్గించుకో  తల్లీ! భాజాపా గూర్చి బుర్రబద్దలు కొట్టుకోకు. ప్రజలకి నువ్వు మంచి చేస్తే ప్రజలే భాజాపాని పక్కన పెడతారు." అని వాస్తవాలు మాట్లాడడు. ఎందుకంటే ప్రణవ్ ముఖర్జీ బ్రతక నేర్చినవాడు. 

మరి ఏం ఆలోచిస్తుంటాడు? 'ఈ పిచ్చిది మనం ఎంతచెప్పినా తనకొడుకు రాహుల్ గాంధీ చెప్పినట్లే చేస్తుంది. అందుకే నోరు మూసుకుని హాయిగా ఇంకొంచెం జీడిపప్పు తిందాం. ఎట్లాగూ రేపు భాజాపా గవర్నమెంట్ వస్తే నా దొంగసొత్తు బయటకి రాకుండా అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌లతో బేరం కుదుర్చుకున్నా. కాబట్టి నేను సేఫ్. తేడాలొస్తే ఈ సోనియా, దీని కొడుకే శంకరగిరిమాన్యాలు పడతారు. నాకెందుకొచ్చిన ఆయాసం.' అని ఆలొచిస్తుంటాడు!

(pictures courtesy : Google)