Showing posts with label జగన్. Show all posts
Showing posts with label జగన్. Show all posts

Tuesday, 9 April 2013

వొంసె సంకరం.. ఎంత గోరం!


"ఎంతన్నాయం! గోరం జరిగిపోతంది."

"ఏందిరా?"

"ఆళ్ళెవళ్ళో ఎన్టీవోడి బొమ్మని వయ్యస్ బొమ్మతో కలిపేసారంట!"

"అయితే యేంది?"


"మడిసన్నాక మంచీసెబ్బర ఉండక్కర్లా? ఎన్టీవోడు బాలయ్య బాబు సొత్తు. వయ్యస్ జగన్ బాబు సొత్తు. యాడైనా అబ్బల సొత్తు కలిపేత్తారా?"

"కలిపేత్తే ఏవవుద్ది?"

"అరే యెదవా! నీ పొలం నా పొలంలో కలుపుకు దొబ్బితే నీక్కాలదు?"

"నాకెందుక్కాలుద్ది? నువ్వు కలిపేసుకొటాకి నాదెగ్గిరసలు పొలవుంటేగా!"

"ఓరి తిక్కల నాయాలా! ఎన్టీవోడి వొంసెం, వయ్యస్ వొంసెం యేరేరు. ఆళ్ళు సేసిన అబివుర్దులు యేరేరు. పెళ్ళిసమ్మందం కలుపుకున్నట్లు యాడైనా అబివుర్దులు కలిపేసుకుంటారా? అట్టా అడ్డగోలుగా వొంసాలు, అబివుర్దులు కలిపేస్తే రేపు ఓటేసేవోడికి అరదం కావొద్దా?"

"అరదం కాపోతే మానె! ఓట్ల మిసనీ యాడ నొక్కినా 'కుయ్' మంటది గదా! దానికి వొంసెంతో పనేంది?"

"ఒరే యెదవన్నర యెదవా! మడిసి కన్నా వొంసెం గొప్పదిరా సన్నాసి. నీ అయ్య పుటో నా ఇంట్లో పెడితే నేనూరుకుంటానా యేంది?"

"ఊరుకోమాక. అయినా నువ్వెట్టుకొటాకి నాదెగ్గిర మా అయ్య పుటో ఉంటేగదా!"

"వామ్మో! ఓర్నాయనో! నీకు దండాల్రా బాబూ! రెండు దినాల్నించి టీవీల్లో ఈ ఇసయం మీద సొక్కాలు సించుకుంటా అరుస్తా వుండారు. నీ యెదవ మొకానికి ఎంత సెప్పినా అరదం అయ్యి సావదు. నిన్ను ఆడికి పంపిస్తే ఆళ్ళకి మెంటలెక్కుద్ది."

"ఎక్కనీ! నాకేంది? అయినా మా ఇంట్లో టీవీ యాడుండాది? ఆ టీవీ బొమ్మలోళ్ళు సెప్పే పోసుకోలు కబుర్లు ఇంటా కూకోటానికి నేన్నీలాగా పనీపాటా లేని యెదవననుకున్నావా యేంది!"

"ఆఁ!"

(photos courtesy : Google)

Wednesday, 28 November 2012

చంద్రబాబు.. ఒక నడుస్తున్న చరిత్ర!


'ఈ టీవీ' లో చంద్రబాబు నాయుడు పాదయాత్రని చూస్తున్నాను. మనిషి బాగా చిక్కిపోయ్యాడు. కర్రకి బట్టలు తోడిగినట్లున్నాడు. కోట్ల రూపాయిలున్నాయి. అయినా ఏం లాభం? పాపం! కడుపు నిండా తినలేడు. కంటినిండా నిద్రపోలేడు. ఏమిటీ ఖర్మ? నా మనసు దిగులుగా అయిపొయింది.

"రవణ మావా! కాఫీ." అంటూ వచ్చాడు సుబ్బు.

"కూర్చో  సుబ్బూ! పాపం  చంద్రబాబుని  చూడు. వృద్ధాప్యంలో ఎన్నికష్టాలు  పడుతున్నాడో!" దిగాలుగా  అన్నాను.

సుబ్బు ఆశ్చర్యపొయ్యాడు. క్షణకాలం టీవీలో చంద్రబాబుని చూశాడు.

"నీ దుఃఖానికి కారణం అర్ధం కావట్లేదు. చంద్రబాబు పాదయాత్ర చేస్తుంది తనకి పెన్షన్ అందట్లేదనో, ఇంటిస్థలం పట్టా కావాలనో కాదు. ఆయనక్కావలసింది ముఖ్యమంత్రి పదవి. అది మన చేతిలోనే లేదు. చూద్దాం. రాష్ట్ర ప్రజలంతా నీకులా జాలిపడి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేస్తారేమో. కానీ నాకెందుకో అది చాలా కష్టం అనిపిస్తుంది." అన్నాడు సుబ్బు.

"కష్టమా! ఎందుకని?" అడిగాను.

"అసలు చంద్రబాబు ఏం చెబుతున్నాడో నాకర్ధం కావట్లేదు. ఒక పక్క అభివృద్ధి చేశానంటాడు. ఇంకోపక్క తప్పులు తెలుసుకున్నానంటాడు. మారిన మనిషినంటాడు. అంటే ఇంతకుముందు ఆయన చేసిన తప్పు రాష్ట్రాన్నిఅభివృద్ధి చెయ్యడమేనా? అంటే తను చేశానని చెబుతున్న అభివృద్ధిని disown చేసుకుంటున్నట్లే కదా!" అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! చంద్రబాబు 'మారిన మనిషి' సందేశం పార్టీ కాడర్ కోసం. పార్టీపరంగా తప్పులు జరిగాయని ఆయన ఒప్పుకుంటున్నాడు." అన్నాను.

ఇంతలో కాఫీ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సుబ్బు.

"రాజకీయాల్లో లెక్కలు వేరుగా ఉంటాయి. ఆ మాటకొస్తే అసలు లెక్కలే ఉండవు! ఎక్కాల ప్పుస్తకంలో రెండురెళ్ళు నాలుగనే ఉంటుంది. రాజకీయాల్లో రెండురెళ్ళు పది అవ్వచ్చు. సున్నా కూడా కావచ్చు."

"సుబ్బు! నీకు లెక్కలు రావన్న సంగతి నాకు తెలుసు. కొంచెం అర్ధమయ్యేట్లు చెప్పు." విసుక్కున్నాను.

"రాజకీయంగా ఇవ్వాళ ఉన్నపరిస్థితి రేపు ఉండదు. కొత్తసమస్యలు రావచ్చు. పాతసమస్యలు పెద్దవిగా మారవచ్చు. ఉన్నట్లుండి కొన్నికారణాల వల్ల పరిస్థితి పూర్తిగా ఒకపార్టీకి అనుకూలంగా మారిపోవచ్చు. దరిద్రం నెత్తి మీదుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హత్యల్లాంటి పరిణామాలు కూడా సంభవించవచ్చు." నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"సుబ్బు! ఎప్పుడో అరుదుగా జరిగే ఎమోషనల్ సంఘటనలని ప్రస్తావించడం రాజకీయ విశ్లేషణ అవ్వదు. కష్టేఫలి అన్నారు పెద్దలు. గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు. చంద్రబాబు కష్టపడుతున్నాడు. కష్టపడ్డప్పుడు ఫలితం ఎందుకుండదు?" చిరాగ్గా అన్నాను.

"కూల్ డౌన్! ముందుగా నువ్వు గ్రహించవలసింది నేను చంద్రబాబు వ్యతిరేకిని కాదు. నా అభిప్రాయాలు చెబుతున్నానంతే. రాజకీయాల్లో భగవద్గీతలకీ, తెలుగు నిఘంటువులకీ కూడా చోటులేదు. అంచేత కష్టం, ఫలితం వంటి మాటలకి విలువ లేదు. అదృష్టం బాగుంటే పదవి ఫెవికాల్ లా పట్టుకుంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి ఏమాత్రం కష్టపడి ముఖ్యమంత్రి అయ్యాడు?"

"అవును గదా!" సాలోచనగా అన్నాను.

"చంద్రబాబు ఈ రాష్ట్రానికి CEO నని తనకితానుగా ప్రకటించుకున్నాడు. CEO లు ప్రభుత్వాలకి ఉండరు. కార్పొరేట్ కంపెనీలకి ఉంటారు. తధాస్తు దేవతలు ఆయన్ని దీవించారు. అందుకే తెలుగు దేశం పార్టీకి CEO గా మిగిలిపొయ్యాడు. అయితే ఈ TDP కంపెనీ పాతబడిపోయింది." అంటూ ఖాళీ కప్ టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

ఒకక్షణం ఆలోచించి నిదానంగా చెప్పసాగాడు సుబ్బు.

"ఒకప్పుడు కారంటే ఎంబాసిడర్ మాత్రమే కారు. కలర్ టీవీ ఒక పెద్ద డబ్బాలా ఉండేది. సెల్ ఫోన్ కిలో బరువుండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంబాసిడర్ కారు చూడాలంటే మ్యూజియంకి వెళ్ళాలి. అన్నిఇళ్ళల్లో విస్తరాకుల్లాంటి LED లు. అందరి చేతుల్లోనూ తమలపాకుల్లాంటి ఐ ఫోన్లు. మార్పు ప్రకృతి ధర్మం. ఇప్పుడెంత కష్టపడ్డా చంద్రబాబు తన పాత మోడల్ కారు, టీవీ, సెల్ ఫోనూ అమ్మడం కుదరదు. రాహుల్ గాంధీ, జగన్ మోహన్ రెడ్డిలు  కుర్రాళ్ళు. లేటెస్ట్ మోడల్ కార్లు, 3D LED, సామ్సంగ్ గెలాక్సీల్లాగా పెళపెళ లాడుతున్నవారు. వాళ్లకి ఆ మేర ఎడ్వాంటేజ్ ఉంది. మన CEO చంద్రబాబుకి ఈ సంగతి తెలియనిది కాదు. కానీ ఆయనకి ఇంకో ఆప్షన్ లేదు."

"సుబ్బు! నువ్వు చెప్పే కార్లు, టీవీల బిజినెస్ థియరీ రాజకీయాలకి వర్తించదు. నేను ఒప్పుకోను." అన్నాను.

"పోనీ ఇంకోభాషలో చెబుతా విను. తెలుగు దేశం పార్టీ ఒక పెద్ద ఇల్లు వంటిది. ఒకప్పుడు ఆ ఇల్లు లేటెస్ట్ మోడెల్. కళకళలాడింది. ఇప్పుడది పెచ్చులూడిపోయిన పాతబడ్డ బిల్డింగ్. మామూలు పరిస్థితుల్లో అయితే చంద్రబాబు మాసికలు వేయించి, దట్టంగా wall care పెట్టించి ఏదోరకంగా నెట్టుకొచ్చేవాడే. కాకపొతే ఆ పాతబిల్డింగ్ కి తెలంగాణా వాదం అనే పెద్ద తొర్ర పడింది. బిల్డింగ్ ఒక వైపు కూలిపోయింది. రిపైర్ చేయించడానికి ఇసుక, సిమెంట్ సమకూర్చుకునే పనిలో చంద్రబాబు ఉన్నాడు. అయితే రిపైర్ పనులు ముందుకు సాగనీయకుండా ఢిల్లీ KCR అనే మేస్త్రీని కాపలా పెట్టింది. KCR పని ఆ తొర్ర పూడకుండా, వీలయితే ఇంకా పెద్దదయ్యేట్లు చెయ్యటమే! అందుకే ఒక్కోసారి పాతఇల్లు రిపైర్ చేయించేకన్నా కొత్తఇల్లు కట్టుకోవటం సులువు." అంటూ టైం చూసుకుంటూ లేచి నిలబడ్డాడు సుబ్బు.

"సుబ్బూ! నువ్వు వంద చెప్పు. చంద్రబాబుని చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఈ వయసులో చంద్రబాబు అంత కష్టపడటం అవసరమా?" అన్నాను.

"పూర్తిగా అనవసరం. ఈ బుట్టలల్లడాలు, ఇస్త్రీ చెయ్యడాలు, చెప్పులు కుట్టడాలు చేస్తే మిగిలిది ఆయాసం తప్ప మరోటి కాదు. ఇవన్నీ ఎసెంబ్లి స్థాయి నాయకులు ఓట్లడుక్కునేప్పుడు చేసే చౌకబారు విన్యాసాలు. చంద్రబాబు స్థాయి చాలా ఎక్కువ. ఆయన తన హయాంలో ఆర్ధిక సంస్కరణలు ప్రజలకి మేలు చేస్తాయని నమ్మాడు. వేగవంతంగా అమలు చేశాడు. ఆ విధంగా భారత రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించాడు." అంటూ తలుపు తీసుకుని వెనక్కి తిరిగాడు సుబ్బు.

"మళ్ళీ చంద్రబాబే కావాలనుకున్నప్పుడు ప్రజలే వెతుక్కుంటూ వచ్చి ఆయనకి ఓట్లేస్తారు. అంతేగానీ చరిత్రకి రోడ్డెక్కవలసిన అవసరం లేదు. అనగా ట్రెండ్ కి తగ్గట్లు తను నమ్మిన ఆర్ధిక విధానాలు, రాజకీయాలు మార్చుకోవలసిన అవసరం చంద్రబాబుకి లేదు." అంటూ హడావుడిగా వెళ్ళిపొయ్యాడు సుబ్బు.


(photos courtesy : Google)

Tuesday, 5 June 2012

అధికారం - యుద్ధనీతి


"సుబ్బూ! నువ్వెన్నయినా చెప్పు. కాంగ్రెస్ మాత్రం దుర్మార్గమైన పార్టీ! రాజకీయంగా సీబీఐ ని వాడుకోవడం నీచం. ఇవ్వాళ జగన్ - మొన్నటిదాకా మూలాయం , మాయావతి , లాలూ.. ఈ లిస్ట్ ఇలా పెరుగుతూనే వుంటుందేమో?" అన్నాను.

కాఫీ సిప్ చేస్తున్న సుబ్బు ఆశ్చర్యంగా చూశాడు.

"ఇందులో దుర్మార్గం ఏముంది? ఇద్దరు వ్యక్తులు తన్నుకోవడం మొదలెట్టారు. ఒకడి చేతిలో కర్ర అనే ఆయుధం ఉంది. ఇంకోడి చేతిలో ఏ అయుధమూ లేదు. కర్ర చేతిలో ఉన్నవాడు, దాంతో వీలైనంత త్వరగా ఎదుటివాడి బుర్ర పగలగొట్టాలి. అలా చేతిలో ఉన్న ఆయుధం వాడుకోలేనివాడొట్టి పనికిమాలిన వాడి కింద లెక్క. అటువంటివాడిని యుద్ధభూమి నుండి తరిమివేయవలె! వాడికి యుద్ధం చేసే అర్హత లేదు." అన్నాడు సుబ్బు.

"ఏంటి సుబ్బూ? నేను రాజకీయాలు మాట్లాడుతుంటే.. నువ్వు కర్ర, యుద్ధం అంటూ ఏవో చెబుతున్నావ్!" విసుక్కున్నాను.  

"రవణ మావా! నే చెప్పేదీ రాజకీయాలే! నా ఉద్దేశ్యంలో కర్ర అంటే అధికారం! ఇప్పుడు రాష్ట్రంలో యుద్ధం మొదలయ్యింది. చతురంగ బలాలతో విజయమో, వీరస్వర్గమో తేల్చుకోడానికి అందరూ ఉపఎన్నికల క్షేత్రంలోకి దూకారు. కాంగ్రెస్ వాళ్ళు యుద్ధతంత్రంలో భాగంగానే జగన్ని లోపలేశారు." అన్నాడు సుబ్బు.

"అవుననుకో! కానీ - మరీ చౌకబారు ఎత్తుగడలు వేస్తున్నారు కదా?" అన్నాను.

"రాజకీయాల్లో చౌకబారు అన్న పదానికి అర్ధం లేదు. గెలవడమే యుద్ధానికి పరమావధి. రాజకీయ పరుగు పందెంలో రజత కాంస్య పతకాలుండవు. ఒకటే మెడల్, ఆ మెడల్ కి నీ ఇష్టమైన పేరు పెట్టుకో. గెలుపు అరంగుళంలో మిస్సయినా, ఆరడుగుల్లో మిస్సయినా ఐదేళ్ళపాటు కుక్కబ్రతుకు బతకాల్సుంటుంది." అన్నాడు సుబ్బు.

"కానీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. "

"రాజకీయాల్లో రాజ్యాధికారం అనేది అత్యున్నతమైనది, అత్యంత శక్తివంతమైనది కూడా! ఇందులో భాగస్వామ్యులైనవారికి అధికారంతో పాటు ధనకనకవస్తువాహానములు సంప్రాప్తించును. మధ్యతరగతి మేధావుల భాషలో జరిగేది ప్రజాపరిపాలన. సామాన్య ప్రజల కోణంలో చూస్తే జరుగుతుంది శాస్త్రబద్దంగా, రాజ్యాంగం సాక్షిగా ప్రజల్ని దోచుకోవటం అనే ప్రక్రియ." అన్నాడు సుబ్బు.

"మరీ అంత ఘోరమా!" ఆశ్చర్యపోయ్యాను. 

"రాజకీయాల్లో stakes చాలా ఎక్కువ, ఇక్కడంతా cut throat కాంపిటీషన్, winner takes it all, అందుకే రాజకీయాలు క్రూరమైనవి కూడా! అధికారంలో వున్నవారికి నీవల్ల రాజకీయంగా ఇబ్బందుందనుకుంటే నీ జాతకం మొత్తం తవ్వి తీస్తారు. పుట్టుక దగ్గర్నుండి నీ చరిత్ర మొత్తం పరిశోధించబడుతుంది, అందులో తొర్రలు కనుగొనబడతాయి. ఆ ఫైల్ దగ్గరుంచుకుంటారు, బెదిరిస్తారు. అప్పటికీ మాట వినకపోతివా? నీమీద కేసులు పెడతారు, అదేమంటే - చట్టం తన పని తను చేసుకుపోతుందంటారు." నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"అంటే జగన్ అమాయకుడంటావా?" అడిగాను.

"అస్సలు అనను. రాజకీయాల్లో అమాయకులకి స్థానం లేదు, ఇక్కడందరూ వాహినీ వారి పెద్దమనుషులే! అందరివీ రక్తచరిత్రలే. అందుకే సాధ్యమైనంతవరకూ బయటపడకుండా లోపాయికారిగా మేనేజ్ చేసుకుంటారు." అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"అవుననుకో! కానీ పాపం జగన్!" నిట్టూర్చాను.

"పాపం జగనేమిటోయ్! అతను కడప ఎంపీ. వేల కోట్లకి అధిపతి, పెద్ద పారిశ్రామికవేత్త, ముఖ్యమంత్రి క్యాండిడేట్. అందుకేగా చిన్న బెయిల్  పిటిషన్ కి కూడా ప్లీడర్లని ఢిల్లీ నుండి ప్రత్యేకంగా పిలిపిస్తున్నాడు. అతను జరుగుతున్న పరిణామాల్ని ముందే అంచనా వేసుకునుంటాడు, అసలీ యుద్ధం ప్రారంభించింది జగనే కదా! లేకపోతే - హాయిగా బెంగుళూరులోనే వ్యాపారం చేసుకుంటూ ఆస్థుల్ని ఈపాటికి ఇంకో వందరెట్లు పెంచేసేవాడు, సోనియా గాంధీ చెప్పేది కూడా అలా పెంచుకుని హేపీగా ఉండమనే గదా!" నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"నిజమే సుబ్బూ!" అన్నాను. 

"ఈ సత్యం బోధపడింది కాబట్టే కావూరి, లగడపాటి అధికారం అనే చల్లని మర్రిచెట్టు నీడకింద హాయిగా విశ్రమిస్తున్నారు. సోనియాకి ఎదురు తిరిగినట్లయితే, తమక్కూడా జైల్లో జగన్ పక్క సెల్ రిజర్వ్ అయిపోతుందని వీరికి తెలుసు. అందుకే వీరిది ఎల్లప్పుడూ ఢిల్లీ రాగం." అంటూ లేచి టైం చూసుకున్నాడు.

"మరి లగడపాటి ఎందుకంత హడావుడి చేస్తుంటాడు?" కుతూహలంగా అడిగాను.

"సినిమాలో హీరోతో పాటు కమెడియన్ షో కూడా సమాంతరంగా నడుస్తుంటుంది, అలాగే - లగడపాటిది ఓ సైడ్ షో. కాంగ్రెస్ లో ఎప్పుడేది జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఉన్నట్లుండి పదవేదైయినా ఒళ్ళోకొచ్చి వాలుతుందేమోనని లగడపాటి ఆశ. అందుకే లైమ్ లైట్ లో ఉండటానికి తిప్పలు పడుతుంటాడు. బెస్టాఫ్ లక్ టు లగడపాటి." అన్నాడు సుబ్బు.

"కానీ - కాంగ్రెస్ తన అధికారాన్ని ఉపయోగించుకుంటూ రాజకీయంగా బెదిరించడం అన్యాయం కదా." మళ్ళీ మొదటి పాయింటుకొచ్చాను.

సుబ్బు అర్ధం కానట్లు చూశాడు.

"అందుకు కాంగ్రెస్ ని తప్పు పట్టడం దేనికి? ఇక్కడ స్వచ్చమైన రాజకీయాలు నడిపేందుకు ఎవరూ లేరు. ఇదే అధికారం జగన్ చేతిలో ఉండుంటే.. ఇంతకన్నా కర్కశంగా, క్రూరంగా, నిర్ధాక్షిణ్యంగా ప్రత్యర్ధుల్ని అణిచేసేందుకు వాడుకునేవాడు. అసలు కాంగ్రెస్ వాళ్ళు చాలా సమయం వృధా చేశారు, జగనయినట్లైతే ఆర్నెల్ల క్రితమే అందర్నీ అరెస్ట్ చేయించేవాడు. కొందరు జైల్లోనే చచ్చేవాళ్ళు, ఈ మాత్రం వాతావరణం కూడా వుండేది కాదు." అంటూ నిష్క్రమించాడు  సుబ్బు!

(picture courtesy : Google)

Saturday, 26 May 2012

జగన్ అవినీతి - కాంగ్రెస్ రాజనీతి


ఉదయాన్నే కాఫీ తాగుతూ 'ఆంధ్రజ్యోతి' తిరగేస్తున్నా. 'జగన్ అవినీతిపరుడు.' ఒప్పుకున్నాం! ఇంకేమన్నా వార్తలున్నాయా? ఎంత వెతికినా వేరే వార్తలు కనిపించట్లేదు. ఈ ముక్క రాయడానికి ఇన్ని పేజీలు  దేనికబ్బా!

ఇంతలో "రవణ మావా! కాఫీ." అంటూ వచ్చాడు సుబ్బు.

"కూర్చో సుబ్బు! జగన్ని లోపలేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యవాదులంతా హర్షించదగిన మంచి పరిణామం. ఒక అవినీతిపరుణ్ణి లోపలేస్తే గాని మిగిలినవారికి బుద్ధిరాదు." అన్నాను.

సుబ్బు ఒకక్షణం ఆలోచించాడు.

"నేనలా అనుకోవడం లేదు. జగన్ని అరస్టు చెయ్యడం కాంగ్రెస్ చేస్తున్న చివరి తప్పిదం అవుతుందేమో. రాజకీయంగా ఆలోచిస్తే జైలుకెళ్ళడం జగన్ కే మంచిదిగా అనిపిస్తుంది. అవినీతి రాజకీయాల గూర్చి మాట్లాడే ముందు మనం ఒక విషయం ఆలోచించాలి. ఈ దేశంలో ఎవరు అవినీతిపరులు కాదు? ములాయం, మాయావతి, లాలూ, కరుణానిధి.. వీళ్ళంతా ఎవరు? సీబీఐ కేసులనేవి రాష్ట్రస్థాయి రాజకీయ నాయకుల్ని దారికి తెచ్చుకోవడానికి కేంద్రం చేతిలో ఉండే ముకుతాళ్ళు. నువ్వు నీతిసూత్రాల్ని, న్యాయసూత్రాల్ని ఖచ్చితంగా అప్లై చేస్తే ఈ దేశంలోని రాజకీయ నాయకులందరూ జైల్లోనే ఉండాల్సి వుంటుంది." అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! యువార్ టాకింగ్ నాన్సెన్స్! జగన్ని ఎలా సపోర్ట్ చేస్తావు?"అన్నాను.

"నేను ఎవ్వర్నీ సపోర్ట్ చెయ్యడం లేదు మిత్రమా! వాస్తవ పరిస్థితుల్ని అంచనా వేస్తున్నాను. మనది రాజకీయంగా నిరక్షరాస్య దేశం. మధ్యతరగతి మేధావులు ఎమోషనల్ గా, సెంటిమెంటల్ గా ఆలోచిస్తుంటారు. తల్లిని చంపేశారని రాజీవ్ గాంధీకి బంగారు పళ్ళెంలో అధికారమిచ్చాం. రాజీవ్ గాంధీని చంపేశారని సోనియాకి పట్టం కట్టాం. ఇంత పెద్దదేశంలో రాజకీయాలు ప్రజల జీవన ప్రమాణాలని మెరుగుపర్చే పథకాలతో కాకుండా సెంటిమెంటుతో నడుస్తున్నాయి. ఆశ్చర్యంగా లేదూ!" అన్నాడు సుబ్బు.

ఇంతలో కాఫీ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ చెప్పసాగాడు సుబ్బు.

"మన అనుభవంలో ఉన్న విషయాల్ని మాత్రమే మనం అర్ధం చేసుకోగలం, అనుభూతి చెందగలం. ఈ అనుభూతి లేనిదే ఫలానావాడు దుష్టుడు, దుర్మార్గుడు అని ఎంత చెప్పినా మనకి అర్ధంకాదు. ఇవన్నీ మన మైండ్ కి సంబంధించిన విషయాలు. ఉదాహరణకి - అమెరికావాడు అంతర్జాతీయంగా చేస్తున్న రౌడీయిజం మనకి పట్టదు. అదే ఒక వీధిరౌడీ అరాచకానికి మాత్రం కోపం తెచ్చుకుంటాం. విమానం కూలి నాలుగొందల మంది మరణించారన్నా పెద్ద బాధగా ఉండదు, అదే ఏ రైలేక్సిడెంట్లోనో ఇద్దరు చనిపోయినా చాలా బాధ పడతాం." అన్నాడు సుబ్బు.

"సుబ్బు! నువ్వు జగన్ అవినీతి గూర్చి మాట్లాడకుండా ఏదేదో చెబుతున్నావ్." గుర్తు చేశాను.

"నేను రిలవెంట్ గానే మాట్లాడుతున్నాను. అమెరికావాడి రాజకీయం లాగే, సమాజంలో సామాన్య జనాలకి అర్ధం కాని, ఐడెంటిఫై చేసుకోలేని అవినీతి ఉంటుంది. 2 జి స్పెక్ట్రమ్ అంటే ఏంటి? క్విడ్ ప్రోకో (quid pro quo) అంటే ఏదో తిట్టులా లేదు? గాలి జనార్ధనరెడ్డి చేసిన తప్పేంటి? ఏవో గనులు అక్రమంగా తవ్వాట్ట! మనకి మనూళ్ళో మునిసిపాలిటీవాడు అడ్డదిడ్డంగా తవ్వి పూడ్చకుండా వదిలేసిన గుంటలు మాత్రమే తెలుసు. అట్లాంటి మనం - ఎక్కడో కొండల్లో తవ్వే గనులు, గుంటలు ఎలా ఊహించుకోగలం? నువ్వూహించుకోగలవా?" అడిగాడు సుబ్బు.

"నావల్ల కాదు." అన్నాను.

"లక్షకోట్ల అవినీతి అంటారు. ఎవడన్నా కోటిరూపాయిలు ఎప్పుడన్నా లెక్కబెట్టాడా? కనీసం కంటితో చూశాడా? ఇవన్నీ మనం ఎమోషనల్ గా కనెక్ట్ కాని, కాలేని తెలివైన భారీనేరాలు. ఈ నేరాలు అర్ధం చేసుకోవాలంటే మనం సి.ఎ. చదివుండాలి." అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు.

"సుబ్బూ! నేరాన్ని, నేరస్థుల్ని పట్టించుకోని సమాజం మనది అంటావ్. అంతేనా?" అడిగాను.

"నా పాయింట్ అది కాదు! మనం మన స్థాయికి తగ్గ నేరాల్ని మాత్రమే గుర్తించగలం. జేబుదొంగల్ని తన్ని పోలీసులకి అప్పజెబుతాం. అర్ధరాత్రి ఇళ్ళల్లో పడే దొంగల్ని కరెంటు స్థంబానికి కట్టేసి చావగొడతాం. ఆస్పత్రిలో పది, ఇరవై అడుక్కునే వార్డ్ బాయ్ ని అసహ్యించుకుంటాం. అందుకే శంకర్ తీసిన 'భారతీయుడు' అంత హిట్టయ్యింది, అన్నాహజారే అంత పాపులరయ్యాడు." అన్నాడు  సుబ్బు.

"అవును కదా!" ఆశ్చర్యపొయ్యాను.

సుబ్బు చెప్పడం కొనసాగించాడు.

"ఒక తప్పుడు జీవోతో, అదే ఆస్పత్ర్లి భూమిని కాజేసి వందకోట్లు లబ్ది పొందే ప్రభుత్వ పెద్దల్ని పెద్దగా పట్టించుకోం. సూట్ కేస్ కంపెనీలు ఫ్లోట్ చేసి వేల కోట్ల అవినీతి చేస్తే, అసలా ప్రాసెస్సే అర్ధం కాక, కొద్దిసేపు బుర్ర గోక్కుని వదిలేస్తాం." అన్నాడు సుబ్బు.

"జగన్ అవినీతి సామాన్య ప్రజలు కనెక్ట్ అయ్యేది కాదంటావ్! అంతేగా? మరి జగన్ ఎన్నికల్లో గెలుస్తాడో, లేదో చెప్పలేదు." అడిగాను.

"కాంగ్రెస్ వాళ్ళు జగన్ ఎన్నికల్లో గెలిచే దాకా వదిలేట్టులేరు! నా లాజిక్ సింపుల్. దొంగని రెండు దెబ్బలేస్తే జనాలు తృప్తినొందుతారు, 'తిక్క కుదిరింది వెధవకి' అనుకుంటారు. అదే దొంగని చెట్టుకి కట్టేసి కొడితే 'అయ్యో పాపం!' అనుకుంటారు. కాంగ్రెస్ జగన్ని ఒకస్థాయిదాకా ఇబ్బంది పెడితే జనాలు పట్టించుకోరు. అవినీతికి శిక్ష పడిందనుకుంటారు. కానీ - దానికొక లక్ష్మణ రేఖ ఉంది, ఆ రేఖని కాంగ్రెస్సోళ్ళు దాటుతున్నారు. ఇది కాంగ్రెస్ కి సూసైడల్." అన్నాడు సుబ్బు.

"సోనియాగాంధీకి జగనంటే కోపం ఉండి ఉండొచ్చు." అన్నాను.

"రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలకి తావులేదు. ఇందిరాగాంధీకి బేడీలు వేయించి కక్ష తీర్చుకున్న చరణ్ సింగ్ ఏమైపొయ్యాడు? నిండు కొలువులో జయలలిత చీరని లాగించిన కరుణానిధి తరవాత ఎలక్షన్లో మట్టి కరిచాడు. ముసలి కరుణానిధిని అర్ధరాత్రి ఎత్తి అవతల పడేయించిన జయలలితని ఆ తరవాత ఎలక్షన్లో ప్రజలే ఎత్తి అవతల పడేశారు!" అన్నాడు సుబ్బు.

"అదంతా సానుభూతి కోసం రాజకీయ నాయకులు చేసిన నటన సుబ్బూ!" నవ్వుతూ అన్నాను.

"అదేంటి మిత్రమా నటనని అంత తేలిగ్గా తీసిపడేశావ్? 'రక్తసంబంధం'లో రామారావు, సావిత్రి నిజమైన అన్నాచెల్లెళ్ళనుకుని ఆంధ్రదేశం యావత్తూ రోదించిందా? ఎన్టీరామారావు నిజమైన రాముడని ప్రజల నీరాజనం అందుకున్నాడా? గత వారం రోజులుగా అన్ని న్యూస్ చానెళ్ళు జగన్ని తప్పితే వేరేదీ చూపించట్లేదు. జనాలు కూడా ఏడుపుగొట్టు సీరియళ్ళు చూడ్డం మానేసి జగన్ అరెస్టు గూర్చి ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. ఇది జగన్ కి విపరీతమైన పబ్లిసిటీ ఇస్తుంది. లక్ష్మణ రేఖని దాటుతున్న కాంగ్రెస్ నాయకత్వం జగన్ని అధికారం అనే గారెల బుట్టలోకి తంతుంది." అన్నాడు సుబ్బు.

"ఆ లక్ష్మణరేఖ ఎక్కడుందో నీకుమాత్రం ఎలా తెలుసు?" అడిగాను.

"నాకు తెలుసని నీకు చెప్పానా? నాకూ తెలీదు. కానీ అమ్మకి తెలుసు! ఆవిడ నిన్నట్నించి 'పాపం! తండ్రి లేని పిల్లాడు, ఆ అబ్బాయిని ఎందుకంతలా వేధిస్తున్నారు?' అనడం మొదలెట్టింది. ఇది కాంగ్రెస్ కి దుర్వార్త. మా పనమ్మాయి 'పాపం! వాళ్ళ నాన్న మా నాన్నకి ఫ్రీగా గుండాప్రీషన్ చేయించాడు. ఆ బాబుని జైల్లో యేయించినోడు పురుగులు పడి చస్తాడు.' అని పొద్దున్న అంట్లు తోముతూ అంది. ఇది జగన్ కి శుభవార్త. మన ప్రభుత్వాల్ని నిర్ణయించేది వీళ్ళే." అంటూ టైమ్ చూసుకున్నాడు సుబ్బు.

"రాజకీయ విషయాలు మాట్లాడేప్పుడు ఏ ఎన్.రామ్ నో, రామచంద్ర గుహానో కోట్ చెయ్యాలి. నువ్వు మీ అమ్మనీ, పనిమనిషినీ కోట్ చేస్తావేమిటి?" చికాగ్గా అన్నాను.

"ఆ పని నీలాంటి మేధావులు ఎలాగూ చేస్తున్నారుగా! ఇంక మళ్ళీ నేనెందుకు? ఈ దేశంలో మధ్యతరగతి మేధావులు వాస్తవాల్ని గుర్తించడం మానేసి చాలాకాలం అయ్యింది, అందుకే నేను వాళ్ళ ఆలోచనలు పట్టించుకోను. ఇంక నేవెళ్తా! దారిలో  చాలా  పనులున్నయ్." అంటూ నిష్క్రమించాడు సుబ్బు.

గమనిక : ఈ పోస్ట్ రాసేప్పటికి జగన్ అరెస్టవ్వలేదు.

కృతజ్ఞత :  ఆత్మీయ మిత్రుడు గోపరాజు రవికి.. 

(photo courtesy : Google)

Monday, 7 May 2012

ఉడిపి హోటళ్ళు.. రాజకీయ విశ్లేషణ


సమయం ఉదయం తొమ్మిది గంటలు, ఈ సమయంలో రోజూ నేను 'హిందూ'లో వార్తలు చదువుతూ తీవ్రంగా ఆలోచిస్తుంటాను. 

ఇంతలో హడావుడిగా సుబ్బు వచ్చాడు.

వస్తూనే - "రవణ మావా! కాఫీ. అర్జంట్." అంటూ కుర్చీలో కూలబడ్డాడు.

"ఇందాక  మన మైసూర్ కేఫ్ శంకరనారాయణ కొడుకు కనిపించాడు. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. ఎట్లాంటి గుంటూరు ఎట్లా అయిపొయింది మావా! ఒకప్పుడు మైసూర్ కేఫ్, శంకర విలాస్ ఊరికి మకుటాయమానంగా ఉండేవి. ఇప్పుడవి మాయమైపొయ్యాయి, ఎంతైనా ఆ రోజులే వేరు." నిట్టూర్చాడు సుబ్బు.

"సుబ్బూ! ఆపుతావా నీ వెధవ హోటళ్ళ గోల. దేశ రాజకీయ పరిస్థితి అస్సలు బాలేదు. నీకేమో పొద్దస్తమానం తిండి, హోటళ్ళే ప్రపంచం. వాటిల్లోంచి కొద్దిగా బయటకి రా! ఆలోచనా స్థాయి పెంచుకో!" విసుక్కున్నాను.

సుబ్బుకి నా మాటలు నచ్చలేదు.

"ఏంటీ? నాది వెధవ గోలా! 'హిందూ' చదివి దేశ రాజకీయాలు అర్ధం చేసుకునే దుస్థితిలో నువ్వున్నావు - నేన్లేను. కాదేది కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ, కాదేది రాజకీయ విశ్లేషణ కనర్హం అంటున్నాడీ సుబ్బు. కాఫీ హోటళ్ళ చరిత్రతోనే దేశ రాజకీయాలు కూడా అర్ధం చేసుకోవచ్చు, కానీ - ఆ విషయం నీకు తెలీదు. ఐ పిటీ యు!" అన్నాడు సుబ్బు. 

'హిందూ' పక్కన పడేశాను.

"ఏంటి సుబ్బూ నువ్వు చెబ్తుంది? కాఫీ హోటళ్ళకి దేశ రాజకీయాలకి సంబంధం ఉందా? ప్రూవ్ ఇట్." చాలెంజింగ్ గా అన్నాను.

సుబ్బూ ఒక్కక్షణం ఆలోచించాడు.

"ఓకే! మనకి ప్రతి ఊళ్ళో ఉడిపి హోటళ్లున్నాయ్. ఉడిపి వారు కష్టజీవులు, వారిలో ఎక్కువమంది అడ్డ పంచెలతో, పొట్టచేత పుచ్చుకుని ఉడిపి నుండి వలస వచ్చినవారే. వచ్చిన కొత్తలో తమ ఉడిపి హోటళ్ళలోనే వంటవాళ్ళగానో, సప్లైయర్లుగానో పనిచేస్తారు. వ్యాపార మెళకువలు నేర్చుకుంటారు, తెలుగు నేర్చుకుంటారు, స్నేహాలు పెంచుకుంటారు. కొంతకాలానికి హోటల్ వ్యాపారానికి అనువైన ప్రదేశం గుర్తిస్తారు. కొద్ది పెట్టుబడితో చిన్న టిఫిన్ సెంటర్ మొదలెడతారు. శుచి, శుభ్రత, రుచి మైంటైన్ చేస్తూ, చాలా కస్టమర్ ఫ్రెండ్లీగా, నిజాయితీగా వ్యాపారం చేస్తారు. సహజంగానే వారి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కొంతకాలానికి ఆ టిఫిన్ సెంటర్ ఒక చిన్నహోటల్ గా, అటుతరవాత ఒక పెద్దహోటల్ గా అభివృద్ధి చెందుతుంది."

ఇంతలో కాఫీ వచ్చింది. కాఫీని సిప్ చేస్తూ, ఆలోచిస్తూ మాట్లాడటం కోనసాగించాడు సుబ్బు.  

"ఇప్పుడు మనం ఈ హోటళ్ళ సక్సెస్ స్టోరీని రాజకీయాల్లోకి తీసుకొద్దాం. మనదేశంలో వామపక్షాలు, బిజెపికి (కనీసం ఆన్ పేపర్) కొన్ని సిద్ధాంతాలున్నాయ్. కాబట్టి వాటిని పక్కన పెడదాం. దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకవ్యక్తి పార్టీలే. ఆ పార్టీలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కులం, ప్రాంతం వంటి అంశాలని ఆధారం చేసుకుని ఏర్పడ్డాయ్. ప్రజల అవసరాలు, అవస్థలకి ప్రతిభావంతంగా స్పందించిన పార్టీలకి సహజంగానే ప్రజాదరణ వస్తుంది, అధికారమూ వస్తుంది. కాబట్టి - ఒక రాజకీయ పార్టీ పుట్టుక, ఎదుగుదల ఉడిపి హోటల్ చరిత్రని పోలి ఉంటుంది."

ఇంతలో నాకు ఫోనొచ్చింది.

"డాక్టర్ గారు! మా అబ్బాయికి ఎల్కేజీ పబ్లిక్ పరీక్షలో అరమార్కు తగ్గింది, ఇంక నేను బ్రతకడం అనవసరం, చచ్చిపోవాలనిపిస్తుంది." అంటూ ఓ కన్నతల్లి ఏడవసాగింది.

"అయ్యో! ఎంత ఘోరం జరిగిపోయింది! టెన్షనొస్తే వేస్కోమని ఓ మాత్రిచ్చా గదా? అది మింగి పడుకో తల్లీ!" అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేశాను. 

సుబ్బు చెప్పడం కొనసాగించాడు.

" మన ప్రాంతీయ పార్టీల పునాది, పెట్టుబడి ఆ పార్టీ స్థాపకునికి ఉన్న జనాకర్షణే. ఇందుకు ఎమ్జీఆర్, ఎన్టీఆర్ లే ఉదాహరణ. కొన్నాళ్ళకి వాళ్ళు ముసలాళ్ళైపోతారు. మారుతున్న సమాజానికి కొత్త సమస్యలు ఎదురౌతుంటాయి. కుర్రఓటర్ల ఆలోచనలకి తగ్గట్లుగా ఈ పార్టీలలో మార్పులు రావాలి. అనగా ఓటర్లలో తరం మారినట్లే నాయకత్వంలో కూడా తరం మారాలి. అయితే ఈ మార్పు ఎంత స్మూత్ గా ఉంటే అంత మంచిది. అంటే - నెమ్మదిగా తండ్రుల స్థానంలో కొడుకులు రంగంలోకి రావాలి, తండ్రి ఆస్థి చెందాల్సింది కొడుక్కే గదా!"  

ఇప్పుడింకో పేషంట్ దగ్గర్నుండి ఫోన్.

"డాక్టరు గారు! నాకు చేతబడి చేయించిన వాడెవడో తెలిసి పోయింది. వాడెవడో కాదు, మా బామ్మర్దే!" అవతలి గొంతు చాలా ఉత్సాహంగా ఉంది.

"ఇంత ముఖ్యమైన విషయం ఫోన్లో మాట్లాడుకుంటే కుదర్దు. మీరే రండి, మాట్లాడుకుందాం."అంటూ ఫోన్ పెట్టేశాను.

సుబ్బు చెప్పసాగాడు.

"నాకు తెలిసి హోటళ్లు మేన్ మేనేజ్మెంట్ కి గొప్ప ఉదాహరణ. క్లీనర్లు, సప్లయర్లు, వంటవాళ్ళు.. అనేక వయసులవారు నిరంతరం పన్జేస్తూనే ఉంటారు. కొందరు హోటల్ పుట్టుక నుండి విశ్వాసంగా ఉంటారు, ఇంకొందరు పనిదొంగలు. ఎవరేమిటి? అన్నది ఓనర్ గ్రహించాలి. హోటల్ కష్టమర్లూ రకరకాలు. ఎక్కువమంది రెగ్యులర్ కస్టమర్లు, వారితే సత్సంబంధాలు కలిగుండాలి. ఇదంతా చెయ్యాలంటే - ఎంతో తెలివి, ష్రూడ్ నెస్ కలిగుండాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఇవన్నీ ఆచరణలో పెట్టాడు గనకనే మన మైసూర్ కేఫ్ శంకరనారాయణ అద్భుత విజయం సాధించాడు. నా అభిప్రాయం ఆయనకి బిజినెస్ మేనేజ్మెంటులో ఒక గౌరవ డాక్టరేట్ ఇవ్వాలి. అంతేకాదు - IIM లో ఉపన్యాసం ఇప్పించాలి." 

"సుబ్బూ! మనం మైసూర్ కేఫ్ లో సాంబారు కనీసం లక్షలీటర్లు తాగుంటాం కదూ!" తన్మయత్వంతో అన్నాను.

"లక్షలీటర్లు కాదు, లక్షగ్యాలన్లు అన్నది కరెక్ట్. శంకరనారాయణ ఏనాడూ ఓనరుగా ప్రవర్తించలేదు. పనివాళ్ళతో కలిసిపోయి హోటల్ని నడిపాడు, చాలా కష్టపడ్డాడు. ఆయన పిల్లలు చదువుకున్నారు, అంచేత వాళ్లకి హోటల్ పని మోటుగా అనిపించింది. వయసు మీద పడటంతో తన హోటల్ వ్యాపారం కొడుకులకి అప్పజెప్పాడు శంకరనారాయణ. వాళ్ళవి రాంగ్ స్ట్రాటజీస్, అందుకే - డైరక్టుగా క్యాష్ కౌంటర్ ముందు కూర్చున్నారు. వంటగది వైపు తొంగి కూడా చూసేవాళ్ళు కాదు. ఫలితంగా ఇడ్లీ వేడి తగ్గింది, సాంబారు రుచి తగ్గింది, హోటలుకి బిజినెస్ తగ్గింది." అన్నాడు సుబ్బు.

"శంకరనారాయణ బిజినెస్ మోడల్ గూర్చి నీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ దాంతో దేశ రాజకీయాలకేం సంబంధమేంటి?" ఆసక్తిగా అడిగాను.

"చాలా సంబంధం వుంది. ఉదాహరణకి - ఉత్తర ప్రదేశ్ లో మూలాయం మంచి హోటల్ నడిపాడు. మనిషి పాతబడ్డాడు, బిజినెస్ తగ్గింది. ఈలోగా కొడుకు అఖిలేష్ చేతికందొచ్చాడు. అఖిలేష్ హోటల్లో డైరెక్టుగా క్యాష్ కౌంటర్లో కూర్చోకుండా, ప్లేట్లు కడగడం దగ్గర్నుండి దోశెలెయ్యడం దాకా అన్నిరకాల పనులు చేశాడు. వ్యాపారంలో కష్టనష్టాలు అర్ధం చేసుకోడానికి సైకిల్ యాత్రంటూ కష్టపడ్డాడు, పార్టీకి కొత్తరక్తం ఎక్కించాడు. ఫలితంగా హోటల్ వ్యాపారం మళ్ళీ పుంజుకుంది. ఇప్పుడు తండ్రి కొడుక్కి క్యాష్ కౌంటర్ అప్పచెప్పాడు. కుర్ర కస్టమర్ల అభిరుచులు కొడుకు చూసుకుంటుంటే, ముసలి కస్టమర్ల కోసం తండ్రి ఎలాగూ ఉన్నాడు. ఇది డెడ్లీ కాంబినేషన్." అన్నాడు సుబ్బు.

"ఓకే! మరి మన ఆంధ్రా రాజకీయాలు?" అడిగాను.

"తెలుగు దేశం పార్టీ అనే ఉడిపి హోటల్ని చంద్రబాబు బాగానే నడిపాడు. ఆయనకి వృద్ధాప్యం వచ్చేసింది. కుర్ర కస్టమర్లకి చంద్రబాబు మెనూ నచ్చడం లేదు. ఇప్పుడిక తెలుగు దేశం పార్టీ నాయకత్వ మార్పిడి స్మూత్ గా జరగవలసిన సమయం ఆసన్నమైంది." అన్నాడు సుబ్బు.

"మరింక లేటెందుకు? హాయిగా లోకేశ్ కుప్పం నుండి సైకిల్ యాత్ర మొదలెట్టెయ్యొచ్చుగా?" అడిగాను.

"వచ్చు, కానీ - ఇక్కడొక చిక్కుంది. తెలుగు దేశం హోటల్ ఓనర్షిప్ చంద్రబాబుది కాదు, ఆ హోటల్ ఆయనకి పిల్లనిచ్చిన మామది. వంటశాలలో ఓమూల ఇడ్లీలేసుకుంటూ బ్రతికేస్తానని మామని నమ్మబలికి, క్రమంగా మామ క్యాష్ కౌంటర్ కే ఎసరుబెట్టాడు చంద్రబాబు. అసలు ఓనరైన ఎన్టీఆర్ వారసులకి హోటల్ నడిపే ఓపికా, యోగ్యతా లేవు. కానీ - ఎప్పటికైనా ఆ హోటల్  తమమదేనని అప్పుడప్పుడు గర్జిస్తుంటారు. చంద్రబాబు మింగాలేడు, కక్కాలేడు. ఏమీ చెయ్యలేని పరిస్థితి." అన్నాడు సుబ్బు.

"మరి జగన్ సంగతి?"

"రాజశేఖర రెడ్డి 'కాంగ్రెస్' అనే హోటల్ని అద్భుతంగా నడిపాడు. అయితే - ఆయన 'కాంగ్రెస్ హోటల్'కి యజమాని కాదు, బ్రాంచి మేనేజర్ మాత్రమే. గాంధీ కుటుంబానికి చెందిన ఆ హోటల్ హెడ్డాఫీసు ఢిల్లీలో ఉంది. సోనియా గాంధీకి తన హోటల్ హైదారాబాద్ బ్రాంచి మీద హక్కులు జగన్ లాగేసుకుంటాడనే భయం పట్టుకుంది. తమ హోటల్ కి వ్యాపారం తగ్గినా పర్లేదు గానీ, అన్ని హక్కులు తన ముద్దుల కొడుకు రాహులుడికి చెంది ఉండాలని నిశ్చయించుకుంది. అందుకే జగన్ కి మొండిచెయ్యి చూపింది." అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"జగన్ తొందరపడ్డాడేమో?"

"నేనలా అనుకోవడం లేదు. ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డికి క్యాష్ కౌంటర్ అప్పచెప్పారో అప్పుడే జగన్ కి ఢిల్లీ తాత్పర్యం అర్ధమైపోయింది. అతనికి ఎదురుగా చెన్నారెడ్డి, విజయభాస్కరరెడ్డి కొడుకులు కనిపిస్తున్నారు. వాళ్ళు సంవత్సరాలు తరబడి సప్లయిర్లుగా పనిచేస్తూనే ఉన్నారు. సోనియాగాంధి వాళ్ళకి కనీసం జీతం పెంచిన పాపాన పోలేదు. ఆవిడ ఉద్దేశ్యం జగన్ని కూడా సప్లయిర్ గా నిరంతరం పని చెయ్యమనే!" అన్నాడు సుబ్బు.

"అవును గదా! ఈ పాయింట్ నాకు తట్టనేలేదు సుమీ!" అన్నాను.

"జగన్ క్యాష్ కౌంటర్ పోస్ట్ కి తప్ప దేనికీ ఒప్పుకోడు. అంచేత - అతనికిప్పుడు వేరే ఆప్షన్ లేదు. అందుకే ఫ్రెష్షుగా ఇడ్లీపాత్ర, పెనం కొనుక్కుని, కాంగ్రెస్ హోటల్ ఎదురుగానే చిన్నహోటల్ సొంతంగా మొదలెట్టాడు. తన తండ్రి వంట రుచి చూసి ఆదరించిన పాత కస్టమర్లు వస్తారని ఆశ. అలాగే కస్టమర్లక్కూడా జగన్ హోటల్ టిఫిన్ల గూర్చి అవగాహన ఉంది. సక్సెస్ కి అడ్డదారులు లేవు మిత్రమా! కష్టపడాలి, అందుకే - జగన్ కష్ట పడుతున్నాడు. ఎండనకా, వాననకా ఓదార్పు యాత్రంటూ తిరుగుతున్నాడు." అన్నాడు సుబ్బు. 

"కిరణ్ కుమార్ రెడ్డి?"

"మన ముఖ్యమంత్రికి ఇడ్లీకి, అట్టుకి తేడా తెలీదు. అతనికి ఇంతకుముందు రాజశేఖరరెడ్డి హయాంలో క్లీనర్ గా పనిచేసిన అనుభవం మాత్రమే ఉంది. ఈ తెలీకపోవడమే అతని అర్హత, అదే అతనికి ప్లస్సయింది.. ఢిల్లీ పెద్దలకి భలే నచ్చింది. అందుకే ఇప్పుడు క్యాష్ కౌంటర్లో కూర్చుని డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు. అందుకే - ఆయన కన్నా ఎక్కువ స్థాయిలో (సప్లయిర్లుగా) పన్జేసిన సత్తి బాబు, డి.ఎల్. రవీంద్రారెడ్డిలు కిరణ్ని చూసి గుర్రుమంటున్నారు." అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! బాగా చెప్పావు. ఉడిపి హోటళ్ళ చరిత్రని తెలుసుకుంటే దేశరాజకీయాలు కూడా అర్ధమైపొతాయన్నమాట! నీ హోటల్ రాజకీయ పురాణం బాగుంది." నవ్వుతూ అన్నాను.

సుబ్బూ టైమ్ చూసుకుంటూ లేచి నిలబడ్డాడు.

"రవణ మావా! నేవెళ్తున్నా. దార్లో అమ్మకి చింతలూరివారి మాదీఫల రసాయనం కొనుక్కెళ్ళాలి. నువ్వు నీ 'హిందూ' శ్రద్ధగా చదువుకుంటూ జ్ఞానాన్ని పెంచుకో. వస్తా!" అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు.

(picture courtesy : Google)

Saturday, 21 January 2012

జగన్.. జైలు.. 'చెక్'.. !


ఆంధ్రజ్యోతి  న్యూస్ పేపర్  తాపీగా  తిరగేస్తున్నాను. చలికాలం  కావున  ఉదయం  పేషంట్ల  తాకిడి  ఉండదు. పేపర్  అంతా  జగన్మోహనరెడ్డి  వార్తలే! నాకు  ఆంధ్రజ్యోతి వారి క్రియేటివిటీ  నచ్చుతుంది. రోజూ ఒకే  వ్యక్తి  గూర్చి  వ్యతిరేక వార్తలు  వండి వార్చాలంటే  ఎంత  కష్టం! తెలుగు జాతి  తరఫున.. అవినీతికి  వ్యతిరేకంగా  అహోరాత్రులు  శ్రమిస్తూ.. ఉత్తమ  జర్నలిస్టిక్ విలువల్ని  తన  వలువల  కన్నా  ప్రాణప్రదంగా   కాపాడుకుంటున్న ఆంధ్రజ్యోతి వారిని  చూస్తే  నాకు  ఆనందభాష్పాలు  ఆగవు!

"రవణ మావా! కాఫీ. అర్జంట్." సుడిగాలిలా  లోపలకొచ్చాడు  సుబ్బు.

"సుబ్బు! జగన్  జైలుకెళతాడా? లేదా? సమాధానం  తెలిసి  కూడా  చెప్పలేకపొయ్యావో.. నీ  తల  వెయ్యి చెక్కలగు గాక!" నవ్వుతూ  అన్నాను.

ఒక్క  క్షణం  ఆలోచించాడు  సుబ్బు. "నా  లెక్క  కరక్టయితే  జగన్  జైలు కెళ్ళడు."

"పేపర్లంతా  కోడై  కూస్తుంటే  నువ్వు  కాదంటావేమిటి!"




"కోడై  కూసినా, కుక్కై  కరిచినా  అంతే. అలనాడు  చంద్రబాబు  దెబ్బకి  గింగరాలు  తిరుగుతున్న కాంగ్రెస్  గతి  లేని  పరిస్థితుల్లో  రాజశేఖరునికి  ఫ్రీ హ్యాండ్  ఇచ్చింది. దాని  ఫలితం  వాళ్ళకి  త్వరలోనే  తెలిసిపోయింది. ఈ  లోపు  ఢిల్లీలో  కాంగ్రెస్ వారి  ఇల్లు  చక్కబడింది. ఇప్పుడు  కడప యువరాజుకి  పట్టాభిషేకం  చెయ్యాల్సిన  దుస్థితి  కాంగ్రెసుకి  లేదు. జగన్  ముఖ్యమంత్రి  పీఠం  కావాలన్నాడు. ఢిల్లీ బాసులు  'ఆ  ఒక్కటి అడక్కు!' అన్నారు. అప్పట్నుండి  ఎవరిది  పైచెయ్యో  తేల్చుకోటానికి  వీరిద్దరి  మధ్య  ఒక  ఆట  మొదలైంది. చదరంగం  ఆట  నీకు  తెలుసుగా. గెలిచిన వాడికి  ఒక  పాయింట్. డ్రా  అయితే  చెరో  హాఫ్ పాయింట్. మనం  గమనించాల్సింది  ఇక్కడ  ఇరు పక్షాలు  డ్రా  కోసం  ఆడుతున్నాయ్."

ఇంతలో  పొగలు గక్కుతూ  కాఫీ  వచ్చింది. కాఫీ  సిప్  చేస్తూ  చెప్పసాగాడు  సుబ్బు.



"జగన్ కి  'చెక్'  చెప్పేసి  జైలుకి  పంపడం  కాంగ్రెస్ పార్టీకి  క్షణంలో  పని. కానీ  రాజకీయాల్లో  'ప్లే ఫర్ ద ఫినిష్'  అస్సలు  పనికిరాదు. జగన్ని  జైలుకి  పంపితే  రాబోయే  ఎలక్షన్లలో  ముక్కోణపు  పోటీ  తప్పదు. అప్పుడు  కాంగ్రెస్  చావుదెబ్బ తింటుంది. అందుకని  జగన్ తో  ఆట  ఆడుతూనే  ఉంటుంది. గెలిచే  అవకాశం  ఉన్నా  గెలవదు. ప్రస్తుత  పరిస్థితుల్లో  ఓడిపోకుండా  చెస్  ఆడుతూ, నిలబడడం  జగన్ కి  చాలా  ముఖ్యం. ఆటలో  లాభనష్టాల  బేరీజు  ఇరుపక్షాలా  జరుగుతుంటుంది. అది  మనకి  కనపడని  సైడ్ షో! ఎవరికెన్ని  బలగాలు  చచ్చాయి? ఎంత  బలం  మిగిలింది? అనే  లెక్కల  మీద  ఆధారపడి  ఆట  కంటిన్యూ  అవుతుంటుంది."

"కానీ  ఈ  గెలుపోటములు  లేని  ఆట వల్ల  ప్రయోజనం?"




"రాజకీయాల్లో  పైచేయి  సాధించడమే  గెలుపు. ఏదీ  వెండిపళ్ళెంలో  సర్వ్  చెయ్యరు  నాయనా! నీ  దమ్ము, అర్హత  నిరూపించుకోవాలి. అప్పుడే  నువ్వు  రాజకీయంగా  బేరసారాలు  చెయ్యగల  డ్రైవర్  సీట్లో  కూర్చోగలవు. అప్పుడే  నువ్వు  చెప్పిన  మాటకి  విలువ. రాహుల్ గాంధీ  యూపీలో  తిప్పలు  పడేది  అందుకేగా!"

"అవుననుకో! కానీ  జగన్  దారులు  మూసుకుపోతున్నాయి గదా!"




"దారులదేముంది  బ్రదర్. టెన్ జన్ పథ్  దారి  తెరుచుకుంటే  మళ్ళీ  అన్ని  దారులు  అవే  తెరుచుకుంటయ్. రాజకీయుల  చెస్  ఆటలో 'డ్రా' చర్చలు రహస్యంగా  జరుగుతాయ్. ఆపై  ప్రజల్ని  మభ్య పెట్టటానికి  ఉత్తుత్తి  ఆట  కొంతకాలం  ఆడతారు. మనం  గుర్తుంచుకోవలసింది.. కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ  అవినీతిపరులకి  వ్యతిరేకం  కాదు. కాకపోతే  ఈ  సామంతరాజులు  ఢిల్లీకి  లొంగి  ఉండాలి. రావిశాస్త్రి  'మూడు కథల బంగారం'లో  సూర్రావెడ్డు  చెప్పేది  ఇదే గదా! దొంగలు  దొంగతనాలు  చెయ్యాలి. కానీ  పొలీస్  డిపార్ట్ మెంట్ కి  లొంగి  ఉండాలి. డిపార్ట్ మెంట్ కి  ఎదురు  తిరిగితే  పోలీస్  పవర్  రుచి  చూడాల్సి ఉంటుంది."

"మరి  గాలిని  లోపలేశారెందుకు?"




"ఇనప ఖనిజాన్ని  అక్రమంగా తవ్వీ  తవ్వీ  గాలి  బుర్రకి  తుప్పు  పట్టింది. జాతీయ పార్టీలకి  గాలి  లాంటివాడు  ఫండ్స్  కోసం  చాలా  అవసరం. బుద్ధిగా  ఖనిజాన్ని  తవ్వుకునో, భూములు  కబ్జా  చేసో  బాగా  డబ్బు  చెయ్యి. ఫెయిర్ షేర్  హై కమాండ్ కి  పంపు. హాయిగా  రాజకీయ భోగాన్ని  కూడా  అనుభవించు. అట్లా  అనుభవించమనే గదా  జాతీయ పార్టీలు  కూడా  చెబుతుంట! ఇంత  సింపుల్  విషయం  అర్ధం  చేసుకొలేని  గాలి, సుడిగాలిగా  మారదామని  ప్రయత్నించి.. పిల్లగాలయిపొయ్యాడు. అర్ధం  చేసుకున్న  మన  కెవిపి  సైలెంట్  అయిపొయ్యాడు. చెస్ లో  నువ్వొక  ఎత్తు  వేసి  ఎదుటివాడి  మూవ్  గూర్చి  ఆలోచించాలి. ఎదుటి  ఆటగాడి  ఆట  కట్టించటం  కోసం  వల  పన్నాలి. ఆ  పన్నాగం  పారకపోతే.. ప్లాన్  బి, ప్లాన్  సి.. ఆల్టర్నేట్  వ్యూహాలుండాలి. చాలా  మెటిక్యులస్  ప్లానింగ్  ఉండాలి. గాలికి  ఆట  ఆడటం  తెలీదు. తొందర  పడ్డాడు. బీజెపిని  పూర్తిగా  ఓడించి  ఒక  పాయింట్  సొంతం  చేసుకుందామనుకున్నాడు. పాపం  బీజేపికి  కూడా  ఆట  ముగించడం  తప్ప  వేరే  మార్గం  లేకుండా  అన్ని  మార్గాలు  మూసేశాడు. అందుకనే  బిజెపి  గాలిని  ఓడించింది."

"అంటే  జగన్  గాలి లాగా  బుర్ర  తక్కువ  ఆట  ఆడడంటావ్?"




"అనే  అనుకుంటున్నాను. గాలి  లాంటి  ఆట  ఆడితే  జగన్  కూడా  ఫలితం  అనుభవించాల్సిందే. తప్పదు. ఆట  ఓడిపోయే  పరిస్థితే  వస్తే  ఎప్పటికయినా డ్రా  ప్రపోజ్  చేసే  ఆప్షన్  జగన్ ఉంచుకోవాలి. కానీ  ఓపిగ్గా  గేమ్  కంటిన్యూ  చేస్తుండాలి. రాబందుకున్నంత  సహనం  ముఖ్యం. గద్ద లాగా  అవకాశాల్ని  తన్నుకుపోవాలి. పక్షులకున్నంత  బుర్ర  కూడా  లేని  చిరంజీవి  ఆట  మధ్యలో  లేచి  వెళ్ళి  పోయాడు. ఇప్పుడు  జగన్  చూపించే  మెళకువలు  కాంగ్రెస్  నిశితంగా  పరిశీలిస్తుంటుంది. జగన్  మగధీరలో  హీరోలా  యుద్ద్హనీతిలో  వీరోచితుడయినట్లయితే  కాంగ్రెస్  వెంటనే  డ్రా  ప్రపోజ్  చేస్తుంది. రాబోయే  ఎన్నికల్లో  జగన్  కాంగ్రెస్ కి  అవసరం. జగన్ కి  కాంగ్రెస్  అవసరం."

"ఆశ్చర్యంగా  ఉంది  సుబ్బు!"

"నువ్వు  కె.వి.రెడ్డి  తీసిన  కృష్ణార్జున యుద్ధం  సినిమా  చూశావు గదా. అందులో  కృష్ణుడు  అర్జునుడితో  యుద్ధం  చేస్తాడు. అర్జునుడి  పౌరుషాన్ని, ప్రతాపాన్ని  పరీక్షిస్తాడు. రాబోయే  కురుక్షేత్ర సంగ్రామంలో  అర్జునుడి  కేలిబర్  ఏంటో  టెస్ట్  చేస్తాడు. అర్జునుడు  ఏమాత్రం  తగ్గడు. శ్రీకృష్ణుడు  సంతోషించి.. 'వెరీ గుడ్'  అంటూ  కౌగిలించుకుంటాడు."

"ఇంతకీ  జగన్  జైలుకెళ్ళడంటావు?"

"జగన్  గాలి లాంటి  ఫూల్  అనుకోను. ఆ  పరిస్థితే  వస్తే  ఢిల్లీ  కాంగ్రెస్ తో  సంధి  చేసుకుంటాడు. చేసుకోవాలి. కాంగ్రెస్  కూడా  సిబీఐ  అనే  పేరు గల  మంత్రిని  చెస్  బోర్డ్  మీద  విచ్చలవిడిగా, భీతి  గొలిపేలా  ఎక్రాస్  ద  బోర్డ్  మూవ్  చేస్తూ  రాజగోపాల్, శ్రీలక్ష్మి, విజయసాయిరెడ్డి  అనే  ఏనుగుల్నీ, శకటుల్నీ  చంపేస్తుంటుంది. జగన్  కాజిల్ని ధ్వంసం  చేసేస్తుంది. చూశావా! ఏ  క్షణాన్నయినా  నీకు  'చెక్'  చెప్పి  ఆట  కట్టించేయగలమనే  బెదిరింపు  సంకేతాల్ని  ఇస్తుంటుంది. ఇదొక  సైకలాజికల్  వార్. ప్రస్తుతం  ఇరు వైపులా  ఆటగాళ్ళు  తమ  తరవాత   స్టెప్  గూర్చి  ఆలోచించుకుంటు్న్నారు. ఇది  అధికారం  కోసం  ఆడే  రాజకీయ  చదరంగం." అంటూ  ఖాళీ  కప్పు  టేబుల్  మీద  పెట్టాడు.

"మరి  మనం?"




"ఏదో  ఆట  జరిగిపోతుందని  ఫలితం  కోసం  ఆసక్తిగా ఎదురు  చూసే  వెర్రిబాగుల  జనాలం. సరదాగా  జరిగే  కుస్తీ పోటీలని  నిజమని  భ్రమింపజేసే  రన్నింగ్  కామెంటరీ  ఆంధ్రజ్యోతి  రాధాక్రిష్ణ లాంటి వాళ్ళు  ఇస్తుంటారు. ఈ  కామెంటరీ.. జరుగుతున్న  ప్రాక్సీ వార్ కి  శోభనిస్తుంది. అందుకోసం  రోజువారీ  వార్తలు  వండి  వడ్డిస్తుంటారు. ఇందులో  వారి  స్వప్రయోజనాలు  కూడా   ఇమిడి  ఉంటయ్." అంటూ  టైం  చూసుకున్నాడు  సుబ్బు.

"నేవెళ్ళాలి. అమ్మని  హోమియోపతి  డాక్టరు  దగ్గరకి  తీసికెళ్ళాలి" అంటూ  హడావుడిగా  నిష్క్రమించాడు  సుబ్బు.