Showing posts with label సునందా పుష్కర్. Show all posts
Showing posts with label సునందా పుష్కర్. Show all posts

Wednesday, 7 January 2015

సునంద పుష్కర్


నిన్నట్నుండి విసుగ్గా వుంది. వార్తా మాధ్యమాల స్థాయి ఎంతగా దిగజారింది! చివరాకరికి 'హిందూ' స్థాయి కూడా! శశి థరూర్ భార్య హత్య చేయబడిందట! అయితే ఏంటంట? (ఈ విషయంపై ఇంతకుముందు 'పాపం! సునంద పుష్కర్'  అంటూ ఒక పోస్ట్ రాశాను.)

మన్దేశంలో రోజూ అనేక కారణాలతో హత్యలు జరుగుతూనే వుంటాయి. కానీ - శశి థరూరుని భార్య హత్య గూర్చి అన్ని జాతీయ టీవీ చానెళ్ళల్లో చర్చించారు, దాదాపు అన్ని వార్తా పత్రికల్లో బేనర్ ఐటంగా వచ్చింది! మొదట్లో నాకు ఆశ్చర్యంగా అనిపించింది గానీ, తరవాత విసుగ్గా అనిపించింది.

ఒక ప్రముఖ స్త్రీ మరణానికి కొంచెం కవరేజ్ ఊహించవచ్చు. ఎందుకంటే - ప్రజలకి ఆసక్తి కలిగించే అంశాలని కవర్ చెయ్యడం అనేది వార్తాలతో వ్యాపారం చేసేవాళ్ళ వ్యాపార ధర్మం. కానీ - మరీ ఇంత అన్యాయమా!?  

ఈ వార్తకి సామాజికంగా ప్రాధాన్యత లేదు. పోనీ రాజకీయంగా ప్రాధాన్యం వుందా? ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీకే దిక్కూదివాణం లేదు. అట్లాంటి కాంగ్రెస్ కీకారణ్యంలో శశి థరూర్ అనేవాడు ఓ చిట్టెలుక. ఒక పక్క ముఖ్యమంత్రి స్థాయిలో పన్జేసిన వ్యక్తులే బీజేపీలోకి చేరడానికి సాగిలపడి పొర్లుదండాలు పెడుతుంటే - ఈ చోటా నాయకుడితో బీజేపీకి పనేంటి! లేదు కదా?

నా మటుకు నాకు శశి థరూర్ భార్యని ఎవరు చంపారో బొత్తిగా అనవసరం. అది ఆ నేరం జరిగిన పోలీస్ స్టేషన్ ఆఫీసర్ చూసుకుంటాడు. ఒకవేళ శశి థరూర్‌కి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యం వుంటే లోపలేస్తారు, రేపో మాపో శిక్ష వేస్తారు. అప్పుడాయన ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువంతపురం ప్రజల్లో ఒక్కడైనా ఒక్కపూట టీయైనా మానేస్తాడో లేదో తెలీదు. 

పాపం! శశి థరూర్ కూడా చీపుళ్ళతో రోడ్లూడుస్తూ మోడీ గుడ్ బుక్స్‌లో వుంటానికి నానా తిప్పలు పడుతున్నాడు. అతని కష్టానికి ప్రతిఫలం వుంటుందో లేదో తెలీదు గానీ - ఈలోపు సుబ్రహ్మణ్యన్ స్వామి వూరుకునేట్టు లేడు! చూద్దాం ఏమవుతుందో!

(picture courtesy : Google)