Showing posts with label అక్కినేని. Show all posts
Showing posts with label అక్కినేని. Show all posts

Tuesday, 16 December 2014

సావిత్రితో ఓ పాట


"శిష్యా! ఏవిఁటోయ్ లాప్‌టాప్‌నలా తినేసేలా చూస్తున్నావ్?"

"గురుగారు! యూట్యూబులో సావిత్రి పాటని చూస్తున్నాను - మైమరచిపోతున్నానండి."

"ఆహా అలాగా! ఏవిఁటో ఆ పాట?"

"సంతానం సినిమాలో 'చల్లని వెన్నెలలో'  అంటూ ఓ పాటుందండి! పాటలో సావిత్రి అందం గూర్చి ఏమని చెప్పను? చచ్చేంత అందంగా వుంది గురుగారు! సావిత్రినే చూస్తూ ఆనందంగా, హాయిగా పాడుతూ.. ఆహాహా! నాగేస్వర్రావు ఎంతదృష్టవంతుడు! అసూయగా వుందండి!"

"ఒహో అదా నీ సమస్య? నీ అసూయ తగ్గే మార్గం చెబుతా శిష్యా!"

"చెప్పండి గురుగారు."

"ఇంట్లో మంచం వుందా?"

"వుంది."

"దుప్పటుందా?"

"వుంది."

"ఒక పన్జెయ్! మంచం మీద పడుకుని, దుప్పటి కప్పుకుని సావిత్రినే తలచుకుంటూ - ఆ పాట నువ్వే పాడుతున్నట్లు, సావిత్రి ప్రేమగా నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నట్లు ఊహించుకో!"

"కానీ.. "

"ఊఁ! అడుగు, మొహమాటమెందుకు?"

"నాకు పాడ్డం రాదు గురుగారు!"

"నాగేస్సర్రావుకి మాత్రం పాడ్డం వచ్చా శిష్యా? ఘంటసాల స్టోన్‌ని అరువు తెచ్చుకోలేదూ?"

"అవును కదా!"

"లే మరి! ఇంక నీదే ఆలీసెం. దుప్పటి తన్ని కళ్ళు ఘాట్టిగా మూసుకుని - 'సావిత్రి రా! సావిత్రి రా!' అంటూ రిపీటెడ్‌గా పిలువు! దెబ్బకి సావిత్రి దిగొస్తుంది!"

"కానీ గురుగారు.. "

"మళ్ళీ డౌటా శిష్యా! సర్లే - అడుగు."

"నాకు పియానో వాయించడం కూడా రాదు గురుగారు!"

"ఓరి దరిద్రుడా! నీకు సావిత్రితో డ్యూయెట్ పాడుకునే మార్గం చెబుతుంటే దిక్కుమాలిన డౌట్లతో సమయం వృధా చేస్తావేం! ఇంక నిన్ను బాగు చెయ్యడం నావల్ల కాదు. ఎందులోనన్నా దూకి చావు, పీడా విరగడౌతుంది, నే వెళ్తున్నా!"

"గురుగారు! గురుగారు!!.... "

(picture courtesy : Google)

Monday, 1 July 2013

'దేవదాసు' వేదన - తెలుగువారి రోదన



నాగేశ్వరరావు నటించిన దేవదాసు సినిమా విడుదలై అరవయ్యేళ్ళయింది. తెలుగు పత్రికల్లో ఒకటే కథనాలు. నాకవి చదువుతుంటే నవ్వొస్తుంది. తెలుగు సినీజర్నలిజం సన్మాన పత్రాల స్థాయిలో పరమనాసిగా ఉంటుంది. ఈ సినిమాలో నాగేశ్వర్రావు చుక్కమందు కూడా తాగకుండా నటించాట్ట (నాకైతే ఆయన ఫుల్లుగా తాగి నటించినా అభ్యంతరం లేదు)!

అసలీ అరవైయ్యేళ్ల గోలేంటి? బహుశా షష్టిపూర్తి సన్మానమేమో! ఏదైతేనేం.. తెలుగు సినీప్రేమికులు దేవదాసుని గుర్తు తెచ్చుకుని తన్మయత్వం చెందుతున్న ఈ సందర్భాన దేవదాసు గూర్చి నేనూ నా ఆలోచనలు రాస్తున్నాను. అయితే నాగేశ్వరరావు సినిమా షూటింగులో గడ్డపెరుగు తిని నటించాడా? గొడ్డుకారం తిని నటించాడా? లాంటి చవకబారు వివరాలకి నేను పోదల్చుకోలేదు.

అరవైయ్యేళ్ల క్రితం (1953) ఈ దేవదాసు సినిమా ఎందుకంత అఖంఢ విజయం సాధించింది? ఇప్పుడు నేన్రాయబోయే అంశాలు మొత్తం ఈ ప్రశ్నకి సమాధానం చెప్పుకుంటూ రాస్తాను. దేవదాసు సినిమాకి ఆధారం బెంగాలీ పాపులర్ రచయిత శరత్ చంద్ర చటర్జీ రాసిన దేవదాసు అనే నవల.

నేను చిన్నప్పుడు శరత్ బాబు సాహిత్యం (దేశీ ప్రచురణలు) చదివాను. అప్పుడే దేవదాసు నవల కూడా చదివాను. వివరాలు సరీగ్గా గుర్తులేదు కానీ.. సినిమాలో ఉన్నంత నాటకీయత నవలలో ఉండదని గుర్తు. ఇప్పుడా చెత్త మళ్ళీ చదివే ఓపిక లేదు. అయితే నాగేశ్వర్రావు నటించిన దేవదాసు సినిమా చాలాసార్లు చూశాను.

నవల చదవాలంటే కష్టంగానీ.. సినిమా చూడ్డం చాలా సుఖం. హాల్లో కూర్చుంటే మన ప్రమేయం లేకుండానే వెనక కన్నాల్లోంచి తెరమీద సినిమా పడిపోతుంది. కాబట్టి ఇప్పుడు నా పోస్ట్ అక్కినేని నాగేశ్వర్రావు నటించిన దేవదాసు సినిమా కథకి మాత్రమే పరిమితం.

దేవదాసు సినిమాకి ముందు ఆరేళ్ళ క్రితం బ్రిటీష్ వాడి నుండి మనకి రాజకీయంగా అధికార మార్పిడి జరిగింది. సమాజంలో మాత్రం ఎటువంటి మార్పూ లేదు. ఆనాడు మన సమాజంలో కులం, మతం, డబ్బు చుట్టూ చాలా ఖచ్చితమైన గోడలు, లక్ష్మణరేఖలు ఉన్నాయి. సమాజ స్థితిగతులకి చాలా స్పష్టమైన నిర్వచనం ఇవ్వబడి ఉంది.

ప్రేక్షకుడు అన్నవాడు ఎక్కడో ఆకాశంలోంచి ఊడిపడడు. వాడు సమాజానికి ప్రతిబింబం. అంచేత  సాధారణ ప్రేక్షకుడు సమాజ చట్రం నుండి బయటపడి ఆలోచించగలిగే స్థితి, స్థాయిలో ఉండడు. ఆనాడు నిరక్షరాస్యత కూడా చాలానే ఉంది. (అయితే అక్షరాస్యతకి, ప్రోగ్రెసివ్ థింకింగ్ కి సంబంధం ఉంటుందనే భ్రమ నాకు లేదు).

ఈ సినిమా విజయానికి ముఖ్యకారణం.. కథ మొదటి నుండి చివరిదాకా సాంఘిక కట్టుబాట్లని గౌరవిస్తూ (ప్రమోట్) చేస్తూ ఉంటుంది. జమీందారు కొడుకైన దేవదాసు పక్కింటి పేదపిల్లతో స్నేహం కడతాడు. దేవదాసు పెద్దకులంవాడు, డబ్బున్నవాడు. కావున నేచురల్ గా పార్వతి దేవదాసుకి surrender అవ్వాలి. అయి తీరాలి (కాకుంటే ప్రేక్షకులు ఒప్పుకోరు).

జమీందార్ల పిల్లలు చదువుకోటానికి పట్నం పోవటం అనేది బ్రిటిష్ ఇండియాలో చాలా కామన్. కావున శరత్ కూడా కథ అలాగే రాసుకున్నాడు. దేవదాసు కూడా పట్నం పొయ్యి ఏవో చదువులు వెలగబెడతాడు. జట్కాబండి తోలుకుంటూ (పాట పాడుకుంటూ) ఊళ్లోకి వచ్చి పార్వతికి ఏదో నగ ప్రెజెంట్ చేసి తన ఖరీదైన తన ప్రేమని ప్రదర్శించుకుంటాడు (ఎంతైనా జమీందారు బిడ్డ కదా).

ఇలా కొంతకాలం శరత్ బాబు నాయికానాయకుల మధ్య స్వచ్చమైన ప్రేమని పూవులు పూయనిస్తాడు. కాయలు కాయనిస్తాడు. భవిష్యత్తులో వారి ప్రేమ అమరం కావాలంటే ఆ మాత్రం సన్నివేశాలు ఎస్టాబ్లిష్ కావాల్సిందే. వీళ్ళ ప్రేమ పెళ్ళిగా మారాలంటే పెద్దల అనుమతి కావాలని, అది అసాధ్యమని శరత్ కి కథ మొదట్లోనే తెలుసు. అయినా ఎక్కడా ఆ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడతాడు.

(కథని ముందుకు నెట్టడం కోసం) ఒక దుర్ముహోర్తాన దేవదాసు తన తండ్రి దగ్గర పెళ్లి ప్రసక్తి తెస్తాడు. ముసలి జమీందారు తమ వంశం పరువు, మర్యాద గూర్చి ఒక లెక్చర్ ఇస్తాడు. పాపం! ఆ ముసలాయన మాత్రం కొడుకు ప్రేమని ఎలా ఒప్పుకుంటాడు? ఛస్తే ఒప్పుకోకూడదు. మధ్యతరగతివారు దేవదాసు తండ్రి సమస్యని ఎంతో సానుభూతితో అర్ధం చేసుకుంటారు.

మనది పవిత్ర భారత దేశం. ఈ పుణ్యభూమిలో తండ్రి మాటకి కట్టుబడి ఒక యుగపురుషుడు అడవుల బాట పట్టాడు. ఇట్టి భూమిలో దేవదాసు తండ్రిమాట చచ్చినట్లు వినాల్సిందే. వినకపోతే జనాలకి నచ్చదు. అంచేత ప్రేక్షకుల కోరిక మన్నించి దేవదాసు పార్వతిని వదులుకుని పట్నం పోతాడు.

పట్నంలో భగవాన్ అనే ఒక సకలకళావల్లభుడు దేవదాసుకి ముఖ్యస్నేహితుడు. అతని ప్రోద్బలంతో దేవదాసు తాగుడు మొదలెడతాడు. (తాగుడు చెడ్డ అలవాటు. దేవదాసు వంటి సచ్చీలునికి స్వతహాగా ఇటువంటి దుర్బుద్ధి పుట్టరాదు). భగవాన్ అనేవాడు హీరోకి తాగుడు అలవాటు చెయ్యడానికి, వేశ్య దగ్గరకి తీసుకెళ్లడానికి రచయితచే సృష్టించబడ్డ ఓ అల్పజీవి.

దేవదాసు మీద ప్రేమని చంపుకోలేని పార్వతి అర్ధరాత్రి దేవదాసు ఇంటికొచ్చి తనని ఎక్కడికైనా తీసుకెళ్ళిపొమ్మంటుంది. దేవదాసు భయకంపితుడై పోతాడు (అవును. సమాజం, సంప్రదాయం దేవదాసు ఉఛ్వాసనిశ్వాసలు). పార్వతి ప్రపోజల్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తాడు. ధర్మబద్దుడైన దేవదాసు ఇప్పుడు మనకి ఇంకా నచ్చుతాడు.

దేవదాసు తిరస్కృతికి గురైన పార్వతి తన తండ్రి వయసున్న జమిందార్ని వివాహం చేసుకుంటుంది (ఆ రోజుల్లో పార్వతి వంటి చిన్నపిల్లల్ని పెళ్లి చేసుకోటానికి డబ్బున్న ముసిలి వెధవలు గుంటనక్కల్లా కాచుక్కూర్చుని ఉండేవాళ్ళనుకుంటా). పార్వతి ఆ ముసలి జమీందారు పిల్లల్ని సన్మార్గంలో పెడుతుంది. పార్వతి ఎంతటి మహాఇల్లాలు! పవిత్ర భారతీయ ధర్మాన్ని పాటించిన మహాపతివ్రతా శిరోమణి. పార్వతి ఇప్పుడు మనకి ఇంకా నచ్చుతుంది.

ఈ తాగుబోతు దేవదాసుని చంద్రముఖి అనే వేశ్య కూడా ఇష్టపడుతుంది. ఆవిడ వేశ్య అయినప్పటికీ ఉన్నత హృదయురాలు. అందువల్లనే ఆ వేశ్యామణి దేవదాసు పరిచయం వల్ల తన వృత్తి, బ్రతుకు హీనమైందని తెలుసుకుంటుంది. (ఆనాటికీ, ఈనాటికీ జనులు తమ శారీరక అవసరాల కోసం వేశ్యల వద్దకు వెళ్ళెదరు. కానీ ఆ వృత్తి మాత్రం ఎప్పటికీ హీనమైందే). ఈ పాయింట్ కూడా ప్రేక్షకకులకి బాగా పడుతుంది.


ఇప్పుడు శరత్ పాఠకుల్ని ఏడిపించటానికి కావలసిన దినుసులన్నీ సమకూర్చుకున్నాడు. రంగం సిద్ధం చేశాడు. ఈ దేవదాసు కథలో అందరూ ఉత్తములే. ఉన్నత హృదయులే. సమాజ చట్రంలో ఇరుక్కుపోయిన విధివంచితులు. లలాటలిఖితాన్ని ఎవరు మాత్రం తప్పించుకోగలరు? (శరత్ కథలన్నీ ఇట్లాంటి జీళ్ళపాకాలే). క్లినికల్ సైకాలజిస్టులు దేవదాసుని sadomasochist అంటారు.

మానసిక వైద్యంలో త్రాగుడు అలవాటుని alcohol dependence syndrome అంటారు. మానసిక వైద్యులు మద్యపానం అనేదాన్ని ఒక రోగంగా చూస్తారు. దేవదాసు మొదట్లో పార్వతిని మర్చిపోవటానికి (తన పిరికితనం వల్ల జరిగిన నష్టం మర్చిపోటానికి) త్రాగడం మొదలెట్టినా.. తర్వాత్తర్వాత ఆ అలవాటుకి బానిసైపొయ్యాడు. (దేవదాసు త్రాగుడు మొత్తం పార్వతి ఖాతాలో వేసేస్తాడు శరత్).

తాగుబోతు భగ్నప్రేమికులకి protagonist ఈ దేవదాసు. తాగుడు అలవాటుని దేవదాసు కథ romanticise చెయ్యటం వల్ల తెలుగు సమాజానికి నష్టం జరిగింది. అందుకే ప్రతి వెధవ ప్రేమ కోసం వెంపర్లాడటం (సాధారణంగా ఈ ప్రేమికుల జాతి చదువులో drop outs అయ్యుంటారు), ఆ ప్రేమ విఫలమైందని తాగుడు పంచన చేరడం చూస్తుంటాం ('ప్రేమించిన' అమ్మాయి మీద యాసిడ్ దాడి చేసేకన్నా alcohol  తాగితాగి, లివర్ చెడిపొయ్యి చావడం మంచిదే).

ప్రేక్షకుల్ని బాగా ఏడిపించటానికి కథలో శరత్ ఒక తెలివైన ఎత్తుగడ వేస్తాడు. చచ్చేముందు ఒక్కసారైనా తనకి సేవ చేసుకునే అదృష్టం కల్పించమని పార్వతి దేవదాసుని వేడుకొంటుంది (ఎందుకో తెలీదు). దేవదాసు చావటానికి ముందు భీకరమైన వర్షంలో దుర్గాపురం ప్రయాణం చేసి, చివరాకరికి ఓ చెట్టుకింద దిక్కులేని చావు చస్తాడు.

అరవయ్యేళ్ళనాడు నాటి కులాలు, కట్టుబాట్లను గౌరవించుటచేతనూ.. ప్రతిపాత్రా పాత్రోచితంగా పరమపవిత్రంగా ప్రవర్తించుటచేతనూ.. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాలని బలంగా తాకింది. ఆ రోజుల్లో కొద్దోగొప్పో చదువుకున్న తెలుగువారికి బెంగాలీ బాబుల్లాగా సున్నితంగా, ఉన్నతంగా ఆలోచించటం గొప్ప ఫ్యాషన్.

ఎగువ మధ్యతరగతి సెక్షన్ ప్రతినిధిగా వారి ఆలోచనలకి తగ్గట్టుగా శరత్ బాబు ఒక పవిత్రమైన, హృద్యమైన, విషాదకరమైన కథ వండాడు. ఈ బెంగాలి వంటకాన్ని గొప్ప తెలుగు వంటకంగా మార్చిన ఘనత వేదాంతం రాఘవయ్య, సముద్రాల రాఘవాచార్య, డియల్, సుబ్బురామన్, ఘంటసాలలకి దక్కుతుంది. ఈ ప్రతిభావంతులు నాగేశ్వరరావు, సావిత్రిలని దేవదాసు, పార్వతిలుగా ఆవిష్కరించి బోల్డంత సోమ్మునీ, కీర్తినీ మూటగట్టుకున్నారు.

ఈ కథ మనకి గొప్ప నీతిని చెబుతుంది. ఈ సమాజంలో మనం ఏమీ మార్చలేం. మనకి కావలసిందేదీ పొందలేం. సమాజ కట్టుబాట్లని మనం ఎలా కాదనగలం? మనం చేయగలిగిందల్లా.. మన చేతకానితనానికి ఏడ్చుకుంటూ బ్రతకటమే! అందుకే ఈ సినిమా అంత విజయం సాధించిందని నా అభిప్రాయం. అసలు ఈ సినిమాలో జనాలకి బాగా నచ్చిన పాయింట్.. పార్వతి, దేవదాసు పెళ్లి చేసుకోకపోవటం!

చివరి మాట :


మిత్రులారా! దేవదాసు సినిమాని ఇంత నిర్దయగా విశ్లేషించిన వ్యాసం మీరు ఎప్పుడూ చదివి ఉండరు (నేనూ చదవలేదు). ఆ సినిమాని చాలాసార్లు చూసి ఎంజాయ్ చేశాను (ఏడిచాను). ఇంత క్రిటికల్ రాయటం నాకూ ఇష్టం లేదు. ఆ సినిమా ఎందుకంతగా విజయం సాధించిందని ఆలోచించినప్పుడు నా మదిలో మెదిలిన ఆలోచనల్ని uncensored గా రాసేశాను. దేవదాసు సినీప్రేమికులు నన్ను మన్నించగలరు.

(photo courtesy : Google)

Friday, 12 April 2013

భార్యే మాయ! కాపురమే లోయ!!

హెచ్చరిక : ఈ టపా మగవారికి ప్రత్యేకం. ఆడవారు చదవరాదు.


అతనో చిరుద్యోగి. మంచివాడు. మృదుస్వభావి. పుస్తక ప్రియుడు. తెల్లనివన్ని పాలు, నల్లనివన్ని నీళ్ళనుకునే అమాయకుడు. సాధారణంగా ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి ఏదోక దుర్గుణం కలిగి ఉంటాడు. మనవాడి దుర్గుణం.. కవిత్వం పిచ్చి!

స్నేహితుడి చెల్లెల్ని చూసి ముచ్చటపడి ప్రేమించాడు. పెద్దల అంగీకారంతో ప్రేమని పెళ్ళిగా మార్చుకున్నాడు. కొత్తగా కాపురానికొచ్చిన భార్యని చూసి 'జీవితమే సఫలము.. రాగ సుధా భరితము.. ' అనుకుంటూ తెగ ఆనంద పడిపొయ్యాడు.

భార్య కూడా భర్త కవిత్వానికి తీవ్రంగా మురిసిపోయింది. ఆవిడకి తన భర్త కవిత్వంలో శ్రీశ్రీ మెరుపు, దాశరధి విరుపు, ఆత్రేయ వలపు కనిపించాయి. ఆయనగారి కవితావేశానికి కాఫీలందిస్తూ తన వంతు సహకారం అందించింది.

ఆ విధంగా ఆవిడ అతనిలో విస్కీలో సోడాలా కలిసిపోయింది. ఇప్పుడు వారి జీవితం మల్లెల పానుపు, వెన్నెల వర్షం. ఆ విషయం ఈ పాట చూస్తే మీకే తెలుస్తుంది.



కొన్నాళ్ళకి.. భార్యకి భర్త తాలూకా కవితామైకం దిగిపోయింది. కళ్ళు తెరచి చూస్తే ఇంట్లో పనికిమాలిన సాహిత్యపు పుస్తకాలు తప్పించి.. పనికొచ్చే ఒక్క వస్తువూ లేదన్న నగ్నసత్యాన్ని గ్రహించింది.

'ఏమిటీ కవితలు? ఎందుకీ పాటలు?' అని ఆలోచించడం మొదలెట్టింది. తత్ఫలితంగా ఆవిడకి దాహం వెయ్యసాగింది. అంచేత.. చల్లని నీటి కోసం లేటెస్ట్ మోడెల్ ఫ్రిజ్ కొందామని భర్తనడిగింది.

"ఫ్రిజ్ ఎందుకె చిన్నాదానా.. కష్టజీవుల మట్టికుండ లుండగా.. " అంటూ పాటెత్తుకున్నాడు మన భావుకుడు. భార్య నొసలు చిట్లించింది.

భర్త ఆఫీసుకెళ్ళినప్పుడు బోర్ కొడుతుంది. అంచేత లేటెస్ట్ మోడెల్ సోని LED టీవీ కొందామని భర్తనడిగింది..

"టీవీలెందుకె పిల్లాదానా.. పచ్చని ప్రకృతి పురులు విప్పి ఆడగా.. " అంటూ కవితాత్మకంగా చెప్పాడు మన కవి. భార్యకి చిరాకేసింది.

ఎండలు మండిపోతున్నాయ్. ఉక్కపోతగా ఉంది. లేటెస్ట్ మోడెల్ ఏసీ కొందామని భర్తనడిగింది.

"వట్టివేళ్ళ తడికెల తడిలో.. చెలి చల్లని చెక్కిలిపై నా మది సేద తీరగా.. " అంటూ లలితగీతం పాడాడు. భార్యకి మండిపోయింది. అన్నకి కబురు చేసింది.

అన్న పీకల్లోతు అప్పుల్లో, తీవ్రమైన కరువులో ఉన్నాడు. పీత కష్టాలు పీతవి! లేటెస్ట్ మోడల్ ఫ్రిజ్, టీవీ, ఏసీ కొనటం లేదని.. అతనికి భార్య తిండి పెట్టకుండా వారం రోజులుగా కడుపు మాడ్చేస్తుంది. చెల్లి కబురందుకుని పరుగున వచ్చాడు. చెల్లి కష్టాలు విన్న అన్న గుండె తరుక్కుపోయింది. హృదయం కదిలిపోయింది. కడుపు మండిపోయింది.

హుటాహుటిన చెల్లిని బజారుకి తీసుకెళ్ళి పేద్ద ఫ్రిజ్, ఇంకా పెద్ద సోనీ LED టీవీ, అతి నిశ్శబ్దంగా పంజేసే అత్యంత ఖరీదైన ఏసీ.. ఇంకా చాలా.. 'జీరో' డౌన్ పేమెంట్, 'ఆల్ పేమెంట్ ఓన్లీ ఇన్ ఇన్స్టాల్మెంట్స్' అనబడే వాయిదాల పద్ధతి స్కీములో (దీన్నే ముద్దుగా EMI అంటారు).. బావగారి పేరు మీద కొనిపించాడు. పన్లోపనిగా చెల్లెలి ఖాతాలో అవన్నీ తనూ తీసేసుకున్నాడు ముద్దుల అన్న!

'ఏమిటివన్నీ?' అంటూ ఆశ్చర్యంగా అడిగిన భర్తకి కాఫీ ఇచ్చి.. "పయనించే మన వలపుల నావ.. " అంటూ పాడింది భార్యామణి. మొహం చిట్లించాడు కవి. ఏసీ ఆన్ చేస్తూ "నీ మది చల్లగా.. స్వామి నిదురపో.. " అంటూ ఇంకో పాటెత్తుకుంది భార్య. ఖిన్నుడైనాడు కవి! హృదయం మూగగా రోదించింది. గోలగా ఘోషించింది. ఘోరంగా ఘూర్ఘించింది.

తనకొచ్చే జీతంతో EMI లు, కరెంట్ బిల్లులు కట్టలేక విలవిలలాడిపొయ్యాడు మన కవి పుంగవుడు. దిక్కు తోచక అప్పులు చెయ్యసాగాడు. అప్పులు చెయ్యడమే కానీ.. తీర్చే మార్గం కనబడ్డం లేదు. ఏం చెయ్యాలో తోచట్లేదు. దిగులుతో చిక్కి.. చూడ్డానికి రోగిస్టివాడిలా కనిపించసాగాడు. సహజంగానే కవితా గానం గాయబ్ అయిపోయింది.

ఆర్ధిక బాధలు తట్టుకోలేక.. ఓ మంచిరోజు ఇంట్లోంచి వెళ్ళిపొయ్యాడు. ఊరవతల ఓ కుళ్ళు వీధిలో కరెంట్ స్థంభానికి అనుకుని.. వీధి కుక్కని నిమురుతూ తన దుస్థితికి కుమిలిపోసాగాడు. అరె! చాల్రోజులకి మళ్ళీ కవిత్వం పొంగింది! దిగులుగా, ఆవేదనగా, ఆర్తిగా, నిర్వేదంగా, నిస్సారంగా, నీరసంగా.. జీవత సారాన్ని నెమరు వేసుకుంటూ పాడటం మొదలెట్టాడు.. పాపం!

అతను పాడుకుంటున్న పాట చూడండి.

< />
భర్త కనపడక భార్య తల్లడిల్లింది. భయపడిపోయింది. 'తన భర్త లేకపోతే.. EMI కట్టేదెవరు? ఈ టీవీ, ఫ్రిజ్, ఏసీ.. మైగాడ్.. ఇవన్నీ ఏమైపోవాలి? షాపువాళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోతే నే బ్రతికేదెట్లా? అయ్యో! భగవంతుడా! ఏ ఆడదానికీ రాని కష్టాన్ని నాకు కల్పించావేమయ్యా? ఇది నీకు న్యాయమా? ధర్మమా?' అంటూ దేవుణ్ని వేడుకుంది.

పిమ్మట తేరుకుంది. తదుపరి.. ఓ జట్కాబండి బాడుగకి మాట్లాడుకుని.. పారిపోయిన ఖైదీ కోసం పోలీసులు వెతికినట్లు.. భర్త కోసం వీధులన్నీవెదకసాగింది. మొత్తానికి భర్త దొరికాడు. EMI కట్టించే నిమిత్తం.. అతగాణ్ణి బలవంతంగా ఇంటికి లాక్కెళ్ళింది. కథ దుఃఖాంతం!

(photo courtesy : Google)

Friday, 5 April 2013

నందుని చరిత - ఘంటసాల ఘనత


నేను చిన్నప్పుడు ఘంటసాల పాటలు వింటూ పెరిగాను. అయితే ఆ పాటలు ఘంటసాల పాడినట్లు అప్పుడు నాకు తెలీదు. ఆ పాటలు రామారావు, నాగేశ్వరరావులే పాడుతుండే వాళ్ళనుకునేవాణ్ని. కొన్నాళ్ళకి ఆ గొంతు ఘంటసాలదని తెలుసుకున్నాను. ఇంకొన్నాళ్ళకి ఘంటసాల గొప్ప గాయకుడని అర్ధం చేసుకున్నాను. అయితే ఘంటసాల విశ్వరూప దర్శనం నాకు 'జయభేరి' సినిమా చూస్తుండగా కలిగింది.

సరే! 'జయభేరి' పాటల గొప్పదనాన్ని ఇవ్వాళ నేను ఇక్కడ రాసేదేమీ లేదు. దాదాపు అన్ని పాటలు (చివర్లో వచ్చే సౌందర్ రాజన్ పాట మినహాయింపు) బాగుంటాయి. బెస్ట్ ఆఫ్ జయభేరి? రకరకాల సమాధానాలు. క్లాసికల్ ప్రేమికులు 'రసికరాజ తగువారము కాదా.. ' చెబుతారు. విరహ ప్రేమికులు 'రాగమయి రావే.. ', 'యమునా తీరమున.. ' అంటుంటారు. నాకైతే 'నందుని చరితము.. ' పాట ఒక అద్భుతంగా తోస్తుంది.

'జయభేరి' చూడనివారి కోసం.. ఈ పాట సందర్భం బ్రీఫ్ గా రాస్తాను. హీరో పేరు కాశీనాథశాస్త్రి. గొప్ప సంగీత విద్వాంసుడు. కళకి క్లాస్ డిస్క్రిమినేషన్ ఉండరాదని నమ్ముతాడు. నమ్మిన సత్యాన్ని ఆచరించగలిగిన సాహసి. అందుకే గురువుని, అన్నావదినల్ని ఎదిరించి వీధి నాటాకాలాడే అమ్మాయిని వివాహం చేసుకుంటాడు.

మహారాజు కాశీనాథుని ప్రతిభని మెచ్చి ఆస్థాన విద్వాంసుడిగా నియమిస్తాడు. అతను ఇంత స్థాయి పొందడాన్ని సహించలేని రాజగురువు, రాజనర్తకిలు కుట్ర పన్ని తాగుబోతుగా మార్చేస్తారు. ఒకనాడు మహారాజు అజ్ఞాపించినప్పుడు కూడా పాడటానికి నిరాకరిస్తాడు. రాజాగ్రహానికి గురై వీధిన పడతాడు.

గుళ్ళో హరికథ జరుగుతుంటుంది. ఒక 'అంటరానివాడు' జ్వరంతో తీసుకుంటున్న తన కూతురితో కలిసి గుడి బయట నుండే దేవునికి మొక్కుతాడు. ఆగ్రహించిన గుళ్ళో బ్రాహ్మణులు అతన్ని నెట్టేస్తారు. మద్యం మత్తులో అటుగా వెళ్తున్న కాశీనాథశాస్త్రి ఆ తండ్రీకూతుళ్ళకి దేవుని దర్శనం చేయించడానికి విఫలయత్నం చేసి.. తను కూడా గెంటింపబడతాడు.

ఈ అరాచకానికి కాశీనాథశాస్త్రి కలత చెందుతాడు. ఆవేదన చెందుతాడు. మహారాజు కోరినా పాడనని మొరాయించిన ఆ స్వరం ఒక్కసారిగా జీవం పోసుకుంటుంది. ఆవేశంతో పరవళ్ళు తొక్కుతుంది. ఆగ్రహంతో కట్టలు తెంచుకుంటుంది. అందుకే ఆ మహాగాయకుడు గొంతెత్తి నందుని చరితాన్ని ఆలాపించడం మొదలెడతాడు. ఇదీ పాట సందర్భం. ఇక్కడీ పాట యూట్యూబులో చూడండి.



ఈ పాట సందర్భాన్ని పి.పుల్లయ్య పెండ్యాలకి వివరించి ఉంటాడు. పెండ్యాల నాగేశ్వరరావు వరసలు చక్కగా కట్టి ఉంటాడు. ఏ దర్శకునికైనా, సంగీత దర్శకునికైనా ఎన్నో కోరికలుంటాయి. కానీ గాయకులని దృష్టిలో ఉంచుకుని పరిమితులు ఏర్పరచుకుంటారు. డొక్కు కారుని వంద మైళ్ళ వేగంతో నడపితే యాక్సిడెంటవుతుంది.

ఘంటసాల వాయిస్ రేంజ్ అప్పుడే షో రూం డెలివరీ అయిన బెంజ్ కారు వంటిది. ఇక నడిపేవాడి ఓపిక. ఆకాశమే హద్దు. సంగీత దర్శకుడు ఏ బాణీనైనా, ఏ శృతిలోనైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 'ఘంటసాల లక్జరీ' ని ఎస్.రాజేశ్వరరావు దగ్గర్నుండీ అందరూ అనుభవించిన వారే!

మళ్ళీ 'అధికులనీ అధములనీ.. ' పాట దగ్గర కొద్దాం. ఈ పాట ఎత్తుగడే చాలా హై పిచ్ లో ఉంటుంది. అన్యాయానికి స్పందించిన ఒక మహాగాయకుని ఆవేదన, ఆర్ద్రత, ధర్మాగ్రహం.. అంతటినీ ఘంటసాల గీతాలాపనలో గాంచవచ్చు.

నటించింది అక్కినేని నాగేశ్వరరావయినా.. సన్నివేశానికి ఘంటసాల గొంతు పదిరెట్లు ఊపునిస్తుంది. ఈ పాటని నేను చాలాసార్లు చూశాను. ఎన్నిసార్లు చూసినా.. నాకీ పాట ఒక అద్భుతంగా తోస్తుంది. ('జయభేరి' మన మనసులో చిరస్థాయిగా మిగిలిపోడానికి ప్రధాన కారకుడు ఘంటసాల అని నా అభిప్రాయం.)

అయితే.. నాకు ఘంటసాలని ఫోటోల్లో చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంతటి అసమాన ప్రతిభావంతుడు అతి సామాన్యుడిలా, అమాయకంగా కనిపిస్తుంటాడు. ఘంటసాలకి తనెంతటి ప్రతిభాసంపన్నుడో తనకే తెలీనంత అమాయకుడని నా అనుమానం! ఘంటసాల తెలుగు పాటని హిమాలయాలంత ఎత్తున ప్రతిష్టించాడు. ఇది తెలుగువారి అదృష్టం.

మా వేలు విడిచిన మేనమామ ఒకాయనకి పెళ్ళీపెటాకులు లేవు. ఉద్యోగం సద్యోగం లేదు. పనీపాటా లేదు. ఆస్తిపాస్తులు బానే ఉన్నాయి. సాధారణంగా ఇట్లాంటివాళ్లకి ఏదొక హాబీ ఉంటుంది. మా మేనమామకి సినిమా పాటల హాబీ. అదో పిచ్చి. పొద్దస్తమానం ఏవో గ్రామ్ ఫోన్ రికార్డులు వింటూ, వాటిని తుడుచుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడు. సినిమా పాటల పరిజ్ఞానం చాలానే ఉంది.

ఓ సారి ఆయన ఏదో పెళ్ళిలో కనిపిస్తే అడిగాను. కచేరీల్లో ప్రతి తలకి మాసిన వెధవ ఘంటసాలలా తెగ ఫీలైపోతూ.. 'రాగమయి రావే.. ', 'నీలిమేఘాలలో..' అంటూ సెలెక్టివ్ గా కొన్ని పాటల్నే హత్య చేస్తారేమి! ఆ గార్ధభోత్తములు 'నందును చరితము.. ' జోలికి ఎందుకు పోరు? అని. ఆయన ఒక క్షణం ఆలోచించాడు. ఆపై విషయం తేల్చేశాడు.

"ఆ పాట పాడటం చాలాచాలా కష్టం. శృతి చాలదు. నా లెక్క ప్రకారం 'నందుని చరితము' పాడ్డానికి ఎవడు సాహసించినా.. పాటయ్యేలోపు గిద్దెడు నెత్తురు కక్కుకుని చస్తాడు. చావుకి తెగించి ఎవడైనా ఎలా పాడతాడు?" అన్నాడు.

నిజమే కదా! ఎవరికైనా తమ గానంతో జనాల ప్రాణాలు తియ్యాలనే సరదా ఉంటుంది గానీ.. తమ గానంతో తమ ప్రాణాలకే ఎసరు ఎందుకు పెట్టుకుంటారు?! మామా! నువ్వు కరెక్టుగానే చెప్పావు!

(photos courtesy : Google)

Thursday, 14 February 2013

'ఓహో మేఘమాలా.. '! కొంప ముంచితివి గదా!!


"గురు గారు! నాకు దిగులుగా ఉంది. ఈ మధ్య నా బ్రతుకు మరీ ఆఫ్ఘనిస్తాన్ లా అయిపోయింది."

"అంత కష్టమేమొచ్చి పడింది శిష్యా!"

"నా భార్య పోరు పడలేకున్నాను. ఆవిడకి నా సంపాదన చాలట్లేదుట."

"పోనీ నచ్చజెప్పి చూడకపొయ్యావా?"

"ఆన్నీ అయిపొయ్యాయండీ. నాకు జీవితం మీద విరక్తి పుట్టేసింది. మీరు మరో శిష్యుణ్ణి వెతుక్కోండి. సెలవు."

"తొందరపడకు శిష్యా! నే చెంతనుండగా నీకు చింతనేలా? సంగీత చికిత్సతో నీ భార్యలో పరివర్తన కలిగిద్దాం."

"సంగీత చికిత్సా?!అంటే?"

"పాత తెలుగు సినిమాల్లో బోల్డన్ని మంచి పాటలు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ఒక్కో పాటకి ఒక్కో రకమైన వైద్య గుణం ఉంటుంది. మొన్నొక నిద్ర లేమి రోగం వాడొచ్చాడు. రాత్రిళ్ళు మంచం మీద పడుకుని 'నిదురపోరా తమ్ముడా.. ' పాట వినమని సలహా ఇచ్చా. అంతే! ఆ రోజు నుండి వాడు రాత్రింబవళ్ళు గురకలు పెట్టి మరీ నిద్రోతున్నాడు."

"నిజంగానా! నా భార్యకి మీ సంగీత వైద్యం పని చేస్తుందంటారా?"

"నిస్సందేహంగా. సంగీతానికి రాళ్ళే కరుగుతాయంటారు. ఆడవారి మనసు కరిగించేందుకు ఒక మంచి పాట చెబ్తాను. అది చూపి నీ భార్యని నీకు చరణదాసిగా చేసుకో. ఈ విడియో చూడు."



"పాట చాలా బాగుందండి."

"ఎస్.రాజేశ్వరరావు సంగీతంలో తిరుమల లడ్డంత తియ్యదనం ఉందోయి. సదాశివ బ్రహ్మం కవిత్వం కాకరకాయ వేపుడంత కమ్మగా ఉంటుంది. ఘంటసాల, లీలల గానంలో వైబ్రేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి మల్టిప్లై అయ్యి అణుక్షిపణి వలే శక్తివంతమవుతాయి. ఆ క్షిపణి నీ భార్య చెవులో కర్ణభేరిని తాకి మెదడులో ప్రకంపనలు కలిగిస్తుంది. అంతే! కఠినమైన ఆమె మనసు క్వాలిటీ ఐస్ క్రీములా కరిగిపోతుంది. పిమ్మట నీ భార్య గుండమ్మకథలో సావిత్రంత అనుకూలవతిగా మారిపోతుంది."

"గురు గారు! ఈ పాటని నాగేశ్వర్రావు, సావిత్రి  పాడుకున్నారు. వాళ్ళు పాడిన పాట నా భార్యనెట్లా మారుస్తుంది?"

"చూడు శిష్యా! ఇక్కడ ఎవరు ఎవరి కోసం పాడారన్నది కాదు పాయింట్. పాటలోని కంపనలు, ప్రకంపనలు ముఖ్యం. మనసులోని భూతులు, అనుభూతులూ ప్రధానం. అందుకే గత యాభయ్యారేళ్ళుగా ఈ పాట తెలుగు వారిని మందు కొట్టకుండానే మత్తెక్కిస్తుంది."

"మీరు చెప్పేది సరీగ్గా అర్ధం కావట్లేదు గానీ.. వింటానికి బానే ఉంది. వర్కౌట్ అవుతుందంటారా?"

"నా సలహా గురి తప్పదు శిష్యా! అయితే ఒక కండిషన్. నీ భార్యని ఇంటికి ఈశాన్యం మూలకి తీసుకెళ్ళి ఈ పాటని చూపించు. ఆ సమయంలో లాప్టాప్ తూర్పు దిక్కుకి తిప్పి ఉంచాలి. గుర్తుంచుకో. పొమ్ము. విజయుడవై రమ్ము!"


           *                                *                                 *                            *

"గురు గారు! కొంప మునిగింది."

"ఏమిటి నాయనా ఆ కంగారు? సత్తుబొచ్చెకి సొట్టల్లా వంటి నిండా ఆ దెబ్బలేమిటి?"

"మీ సలహా విన్న ఫలితం. మీరు కొండ నాలుక్కి మందేశారు.. ఉన్న నాలుక పోయింది."

"తిన్నగా చెప్పి అఘోరించు శిష్యా!"

"మీరు చెప్పినట్లే నా భార్యకి 'ఓహో మేఘమాల.. ' విడియో చూపించాను. ఆవిడ ఆ పాట చూసి ఎంతగానో ఆనందించింది. మీ వైద్యం పంజేసిందని సంతోషించాను. సావిత్రి మెళ్ళో నాగేశ్వరరావు పెట్టిన హారం ఆవిడకి బాగా నచ్చిందిట. అదిప్పుడు అర్జంటుగా కావల్ట."

"అంత సొమ్ము నీ దగ్గరెక్కడిది?"

"నేనూ అదే సమాధానం చెప్పాను. 'సినిమాలో నాగేశ్వరరావు మాత్రం ఆ హారం కొని సావిత్రికి పెట్టాడా? కొట్టుకొచ్చిందేగా. ఆ మాత్రం నీకు చేత కాదా?' అంది."

"దొంగతనం మహాపాపం శిష్యా!"

"నేనూ ఆ ముక్కే అన్నాను. ఫలితంగా వంటి నిండా ఈ దెబ్బలు. హబ్బా! ఒళ్ళంతా ఒకటే సలపరంగా ఉంది. ఇప్పుడు నాకు దిక్కెవరు గురు గారు?"

"దిక్కులేని వాడికి ఆ దేవుడే దిక్కు నాయనా! అయినా.. తన్నుటకు నీ భార్య యెవ్వరు? తన్నించుకొనుటకు నీవెవ్వరు? అంతా వాడి లీల! మొహం మీదే తలుపేస్తున్నందుకు ఏమీ అనుకోకు. అసలే చలికాలం. నాకు నిద్ర ముంచుకొస్తుంది."

"గురు గారు! గురు గారు.. "


(photos courtesy : Google)

Thursday, 27 September 2012

'దేవి శ్రీదేవి.. ' భక్తిపాట కాదు!


నా చిన్నప్పుడు సినిమా పాటల అభిమానులకి రేడియోనే పెన్నిధి. ఇప్పుడంటే యూట్యూబు పుణ్యాన ఏ పాటనైనా క్షణాల్లో చూసేస్తున్నారు గానీ.. చిన్నప్పుడు ఇష్టమైన పాట వినడానిక్కూడా ఎన్నో తిప్పలు పడేవాళ్ళం.

ఈ తెలుగుదేశంలో ఘంటసాల అభిమానులు కానివారు నాకింతవరకూ కనబళ్ళేదు. నాకు దైవభక్తి లేదు. కానీ ఘంటసాల భక్తిపాటలు ఇష్టం! నాలో ఉన్న అనేక వైరుధ్యాలలో ఇదొకటి. 'సంతానం' సినిమాలో 'దేవి శ్రీదేవి.. ' అంటూ ఘంటసాల పాడిన భక్తిపాట నాకు చాలా ఇష్టం. 'సంతానం' సినిమా నేను చూళ్ళేదు. నటీనటులెవరో తెలీదు. కథ గూర్చి పైసా కూడా అవగాహన లేదు.

అయితే ఇంత powerful devotional song ని రేడియో స్టేషన్ వాళ్ళు ఉదయాన్నే ప్రసారం చేసే తమ భక్తిపాటల కార్యక్రమంలో వేసేవాళ్ళు కాదు. మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమంలో వినిపించేవాళ్ళు. ఈ సంగతి కనిపెట్టిన నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పనిచేస్తున్నవారు బుర్ర తక్కువ సన్నాసులనే అభిప్రాయానికొచ్చేశాను!

పెద్దయ్యాక గుంటూరు మెడికల్ కాలేజి గార్డెన్లో ఓరోజు సినిమా పాటల గూర్చి చర్చ జరుగుతున్న సందర్భంలో.. ఈ పాటని భక్తిపాటల slot లో చేర్చని ఆకాశవాణి వారి అజ్ఞానాన్ని ఎత్తి చూపాను.

"అది భక్తిపాట కాదనుకుంటా. లిరిక్ జాగ్రత్తగా ఫాలో అవ్వు. 'నీ కనుసన్నల నిరతము నన్నే హాయిగా ఓలలాడించ రావే!' అని గదా ఘంటసాల పాడింది. అంటే ఇది లవ్ సాంగ్ అయ్యుండొచ్చు." అన్నాడొక సినిమా పాటల జ్ఞాని.

ఆశ్చర్యపోయాను. కానీ నమ్మలేకపోయాను. "ఆ పాట శ్రుతి, తాళం, రాగం విన్నాక కూడా దాన్ని ప్రేమగీతం అంటావేంటి? కవులు భక్తిపాటల్లో కూడా క్రియేటివిటీ చూపిస్తారు. ప్రబంధ కవులయితే దేవతలకి లవ్ లెటర్లు కూడా రాస్తారు. నువ్వు చెప్పిన లైన్లు ఆ కోవలోకి చెందుతాయి." అని వాదించాను. గెలిచాను. నోరు గలవాడిదే గెలుపు!

కొన్నాళ్ళ క్రితం నా అభిమాన భక్తిపాట విందామని యూట్యూబులోకి వెళ్ళాను. వార్నీ! ఇంతకీ 'దేవి శ్రీదేవీ.. ' భక్తిపాట కాదు! నాగేశ్వరరావు సావిత్రికి తన గాఢప్రేమని వ్యక్తీకరిస్తూ ఘంటసాల స్టోన్లో పాడిన లలిత గీతం!

లోగడ 'పెళ్ళిచేసిచూడు' సినిమాలో 'యేడుకొండలవాడా వెంకటారమణా.. ' అంటూ భక్తిపాటలా అనిపించే ప్రేమగీతం విషయంలో కూడా ఇలాగే కంఫ్యూజయ్యాను. అయితే నేను 'పెళ్ళిచేసిచూడు' చూశాను. అక్కడ నర్స్ వేషంలో ఉన్న జి.వరలక్ష్మికి అట్లాంటి పాట పాడ్డానికి ఒక రీజనుంది.

నేను 'సంతానం' సినిమా చూడని కారణాన హాశ్చర్యపడటం మించి చేయగలిగింది లేదు. సుసర్ల దక్షిణాముర్తి శాస్త్రీయ సంగీతంలో ఎంత ఉద్దండుడైనా.. సందర్భశుద్ధి లేకుండా ఇంత హెవీ క్లాసికల్ బీటుతో లవ్ సాంగ్ చేస్తాడనుకోను.

సరే! కొద్దిసేపు ఈపాట సంగీతం గోలని పక్కన పెడదాం. పాట చిత్రీకరణ గూర్చి రెండు ముక్కలు. నాకీ పాటలో నాగేశ్వరరావు, సావిత్రి పిచ్చపిచ్చగా నచ్చేశారు. జంట చూడముచ్చటగా ఉంది. వీళ్ళ దుంపతెగ! ఎంత సున్నితంగా, ముద్దుగా ప్రేమని అభినయించారు! మధ్యలో తలుపు కూడా భలే నటించిందే! దీన్నే సహవాస దోషం అంటారనుకుంటా! ఈపాట మీ కోసం ఇక్కడ ఇస్తున్నాను.


Saturday, 1 September 2012

సినీ హీరోలు.. దర్శకులు.. ప్రేక్షకులు


మా శీనుగాడు ఎన్టీరామారావుకి వీరాశూరాభిమాని. రామారావు సినిమాలన్ని మొదటిరోజు మొదటిఆట చూడాల్సిందే. సినిమా చూస్తున్నంతసేపూ మావాణ్ని ఎన్టీరామారావు పూనేవాడు. రామారావు ఆవేశపడితే శీనుగాడు ఆవేశపడేవాడు. రామారావు ఏడిస్తే శీనుగాడిక్కూడా ఏడుపే! ఒక్కోసారి నాకు చూడ్డానికి తెరమీద బొమ్మకన్నా మావాడి మొహమే బాగుండేది. మా శీనుగాడిది George Bush పాలసీ! రామారావు అభిమానులు వాడికి ఆత్మీయులు. కానివారు పరమశత్రువులు! very simple!

నాకు కిష్టిగాడు ఇంకో స్నేహితుడు. నాగేశ్వర్రావు అభిమాని. నాగేశ్వర్రావుతో పాటూ మావాడు కూడా హీరొయిన్ని ప్రేమించేవాడు. హీరోయిన్ దూరమైన హీరోగారి విరహరోదనలో తానూ పాల్గొనేవాడు. అయితే వీడి అభిమానం శీనుగాడి అభిమానంలా మొరటుగా ఉండేదికాదు. 

ఆరోజుల్లో నాకు వీళ్ళద్దర్నీ చూస్తే ఎగతాళిగా ఉండేది. నవ్వొచ్చేది. ఇప్పుడు నా అభిప్రాయాలు చాలా మారిపొయ్యాయి. వెర్రి అభిమానంతో ఒక సినిమా నటుణ్ణి ఆరాధించేవారిపై ఒకప్పట్లా ఇప్పుడు నాలో తృణీకారభావం లేదు. పైగా అదొక అదృష్టం అనికూడా అనుకుంటున్నాను. 

ఇష్టం లేకుండా ఎవరూ ఏ పని చెయ్యరు. ఆకలితో ఉన్నవాడికి ఐశ్వర్యారాయ్ కన్నా అన్నం చాలా అవసరం. అట్లే.. కడుపు నిండినవాడికి ఐశ్వర్యారాయ్ తో చాలా అవసరం. ఎందుకో నా మెదడులో ఈ 'వీరాభిమాన నాడీవ్యవస్థ' సరీగ్గా develop అవ్వలేదు. చిన్నప్పట్నించి నా అభిమానం ఆ సినిమా వరకే పరిమితం.

నాకు రామారావు, నాగేశ్వర్రావులిద్దరూ ఇష్టం.. అయిష్టం కూడా! ముందు ఇష్టం ఎందుకో రాస్తాను. నాగేశ్వరరావు అత్యుత్తమ నటుడు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన 'దేవదాసు' నటన ఒక top class performance. 'రోజులు మారాయి'లో రైతుబిడ్డ వేణుగా చాలా సహజంగా పాత్రలో ఇమిడిపోయాడు. బాటసారి, విప్రనారాయణ, దొంగరాముడు, మూగమనసులు, పెళ్ళినాటి ప్రమాణాలు, మురళీ కృష్ణ.. ఇదొక endless list. 

ఇక నాకిష్టమైన ఎన్టీరామారావు సినిమాల list పలురకాలుగా ఉంటుంది. ముందుగా నా చిన్నప్పటి list. అగ్గి పిడుగు, బందిపోటు, గండికోట రహస్యం, చిక్కడు దొరకడు, కదలడు వదలడు. బుద్ధి వికసించిన తరవాత వీటికొక additional list. జయసింహ, మల్లీశ్వరి, మిస్సమ్మ, రక్తసంబంధం, గుండమ్మకథ, దేవత, దాగుడు మూతలు.. ఇదో చాంతాడు. ఇక రామారావు వేసిన పౌరాణికవేషాలు సరేసరి.

రామారావు, నాగేశ్వర్రావులు మంచిసినిమాల్లో గొప్పపాత్రలు పోషించిన ఉత్తమనటులు. వీరి ప్రతిభకి హేట్సాఫ్! నాకు ఇంతకుమించి వారితో ఏ emotional attachments లేవు. అందుకే వీళ్ళిద్దర్నీ చిన్నప్పుడు అంతగా ఇష్టపడినా.. తర్వాత్తర్వాత వాళ్ళ సినిమాలు నచ్చక పట్టించుకోడం మానేశాను. పాపం! మా శీను, కిష్టిగాళ్ళకి ఆ సౌకర్యంలేదు. తమ అభిమాన నటులు వృద్ధులైనా.. చచ్చినట్లు వారి సినిమాలు చూసేవాళ్ళు.

గతమెంతో ఘనమైన నాగేశ్వ్రర్రావు, రామారావులు డెబ్భైలలో ఏమయ్యారు? ఇద్దరికీ stardom అనే కిరీటం తలకన్నా పెద్దదైపోయింది. ముసలిహీరోని కుర్రాడిగా చూపించడానికి టెక్నీషియన్లకి తలప్రాణం తోకకొచ్చేది. శరీరంలో మార్పు ప్రకృతి సహజం. దాన్ని దాచటానికి ఎవరు తిప్పలుపడ్డా ఎబ్బెట్టుగా ఉంటుంది. 

ఇద్దరూ మహానటులే! అప్పటికే డబ్బు బాగా సంపాదించేసారు. చక్కగా, graceful గా వయసుతగ్గ పాత్రలు వెయ్యొచ్చుగా! ఈ కుర్ర look పాట్లు ఎందుకు? నాకీ పాయింట్ అర్ధంగాక నా మిత్రద్వయాన్ని అడిగేవాణ్ణి. 

శీనుగాడు కోపగించుకునేవాడు. రామారావుని ageless wonder అనేవాడు. నాకు సినిమా చూట్టం చేతకాదని కూడా దబాయించేవాడు. కిష్టిగాడు బయటకి నాతో ఏకీభవించినట్లే ఉండేవాడు. కానీ silent గా నాగేశ్వర్రావు సినిమాలు చూసేసేవాడు. వాళ్లు వారి అభిమాన నటులకి కట్టుబానిసలు! 

ఒకేనటుడు ఒకసినిమాలో అద్భుతం. ఇంకోసినిమాలో వికారం. పాలు, నీళ్ళలా వేరుగా కనిపించేవారు. నాకిదేమి సమస్య? శీనుగాళ్ళా రామారావు వెడల్పు బెల్టుని, bell bottom ప్యాంటుని ఎందుకు ఇష్టపళ్ళేకపొయ్యాను? కిష్టిగాళ్ళా నాగేశ్వర్రావు బుట్టవిగ్గు, తగరపు్ కోటుల్ని ఎందుకు enjoy చెయ్యలేకపొయ్యాను?

సుబ్బుది different వాదన. రామారావు, నాగేశ్వ్రర్రావులకి నటన ఒక వృత్తి. డబ్బులిస్తే కుర్చీ, బల్లతో కూడా duet డ్యూయెట్ పాడగల సమర్ధులు. వారికి లేని గొప్పదనాన్ని, పవిత్రతని ఆపాదిస్తూ ఒక ఉన్నతస్థానంలో కూర్చోబెట్టి.. మన ఊహకి తగ్గట్లుగా ప్రవర్తించాలనుకోడం కరెక్ట్ కాదంటాడు. 

ధనమూలమిదం జగత్ అన్నారు పెద్దలు. దశాబ్దాలపాటు శ్రమించి ఒక స్థానాన్ని చేరుకున్నాక.. ఆ brand image ని సొమ్ము చేసుకోకుండా ఎలా ఉంటారు! ఇప్పుడు సచిన్ టెండూల్కర్ చేస్తుందదేగదా! డబ్బులిచ్చి మరీ నటించమని బ్రతిమాలుతుంటే నటించాడానికేం? తీసేవాడికి, చూసేవాడికి లేని బాధ నాకేల!

నా దృష్టిలో నటులు కూరగాయల్లాంటివాళ్ళు. మంచి దర్శకుడు మంచి వంటగాడిలాంటివాడు. నాగేశ్వర్రావు, రామారావులు తాజాగా ఉన్నరోజుల్లో  బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, ఎల్వీప్రసాద్, ఆదుర్తి వంటి ప్రతిభావంతులు వారితో అనేక వంటలు చేశారు. ప్రేక్షకుల జిహ్వచాపల్యాన్ని తీర్చారు. వాళ్ళ గౌరవాన్ని నిలుపుకున్నారు. అది వారి అదృష్టం. ఈ గొప్పదర్శకులకే డెబ్భైల ముసలిహీరోల్ని ఇస్తే ఏం చేసేవారు?

అసలక్కడ చెయ్యడానికేముంది? అప్పటికే తెలుగు సినిమాల్లో కథ మాయమైపోయింది. హీరోగారి ఇమేజ్, అభిమానుల సరదాలకి తగ్గట్లు కథలు రాసుకోవటం మొదలైంది. పండిపోయిన, ముదిరిపోయిన కూరల్ని ఏ సాంబారులోనో వదిలినట్లు.. హిందీవాళ్ళు ముసలి హీరోలతో multi starrer అంటూ కలగూరగంప సినిమాలు తీసేవాళ్ళు. మనకా సౌలభ్యం లేదు. అందుకే బి.ఎన్.రెడ్డి శోభన్ బాబుతో సైలెంటుగా 'బంగారు పంజరం'
తీసుకున్నాడు.

ఇప్పుడు మీకో అనుమానం రావొచ్చు. తాజా కూరగాయల్తో వంట చెయ్యడం, మెప్పించడం ఎవరివల్లనైనా అవుతుందని. ఎంతమాత్రమూ కాదు. ముదిరిపోయిన కాయగూరల్తో నలభీములైనా చెయ్యగలిగేదేమీ ఉండదు. అట్లే.. వంట రానివాడికి ఎంత తాజా కూరగాయలిచ్చినా వంట చెడగోట్టేస్తాడు. 

దేవదాసు సినిమాని కె.రాఘవేంద్రరావు ఎలా తీస్తాడు? పట్నం నుండి వచ్చిన దేవదాసుని చూడంగాన్లే సిగ్గుతో పార్వతి పైట జారిపోతుంది. ఇంతలో వర్షం పాట. యాపిల్ పళ్ళ మధ్య చంద్రముఖి. ఆమె బొడ్డుపై బొంగరం. ఈ పార్వతి, చంద్రముఖిల నాభి జఘన ప్రదర్శనా పోటీని అత్యంత రసవత్తరంగా తీస్తాడు. సినిమా super hit కూడా కావచ్చు!

బాపు, రమణలు మిస్సమ్మ తీస్తే ఎలాగుంటుంది? సినిమా అంతా background బాపు గీసిన రామాయణం బొమ్మలు (మిస్ మేరీ ఇంట్లో గోడ మీద సహా)! పొద్దస్తమానం మిస్సమ్మ చెంపలు, కళ్ళ క్లొజప్పులు. సహజత్వం పేరిట చీకట్లో సినిమా. మిస్సమ్మ, ఎం.పి.రావుల మధ్య గోరింటాకు, గజ్జెలు.. అంటూ ఏవో పైత్యవికార చేష్టలతో పాటలు. మధ్యలో కొన్ని రామాయణం పిట్టకథలు. ఎల్వీప్రసాద్ బావురుమనేవాడు!

కె.విశ్వనాథ్ 'రోజులు మారాయి' ఎలా తీసేవాడు? దళితురాలైన హీరోయిన్ క్లాసికల్ డ్యాన్సులు చేస్తుంటుంది. రైతుబిడ్డయిన మన హీరోగారు సంగీత విద్వాంసుడు. అంచేత హీరోయిన్ నృత్యాలకి గొంతు కలుపుతాడు. హీరోయిన్ని చేరదీద్దామని విలన్ సిఎస్సార్ ప్రయత్నిస్తుంటాడు. ఆయన కూడా సంగీత ప్రియుడే! సినిమాలో భూమి సమస్య కాస్తా సంగీతనృత్య సమస్య అయిపోతుంది. దటీజ్ కళాతపస్వి!

మాయాబజార్ దాసరి తీశాట్ట. నేను చూళ్ళేదు. కానీ ఊహించుకోగలను. దాసరి పాత్రలు పేజీల కొద్దీ మాట్లాడుతుంటాయి. దాసరి సినిమా సంభాషణలు తూకం వేస్తే మన గాలి జనార్ధనరెడ్డి అక్రమంగా తవ్వుకుపోయిన ఇనుప ఖనిజం కన్నా ఎక్కువ బరువుంటాయని మా సుబ్బు చెబుతుంటాడు.

ఇప్పుడు దాసరి మాయాబజార్ లో ఒక సీన్ ఊహించుకుందాం. శశిని తన కోడలుగా చేసుకుందామనుకున్న సుభద్ర ఆశలపై బలదేవుడు నీళ్ళు చల్లుతాడు. కౌరవులతో వియ్యానికి plan చేస్తాడు. అప్పుడు సుభద్ర ఏమంటుంది? 

"అన్నయ్యా! నువ్వు చేస్తున్నది అన్యాయం. ఇదేనా నువ్వు తోబుట్టువుకి ఇచ్చే మర్యాద?" కట్! కె.వి.రెడ్డి సుభద్ర ఇక్కడితో ఆపేస్తుంది.

కానీ దాసరి సుభద్రకి ఇంకా డైలాగులున్నాయి. "ఆడదానికి భర్త ప్రత్యక్ష దైవం. పుట్టిల్లు చల్లని గూడు. ఆ ఇంటికి అన్నలు మొండిగోడలు. ఇప్పుడా గోడలే నా కొడుకి పెళ్ళికి మొండిగా, అడ్డు గోడలుగా నిలుస్తుంటే.. ఇక నాకు దిక్కెవ్వరు? ఈ కొంపకి ఆడపడుచుని. అత్తింటివారు పుట్టింటివారైనా.. పుట్టింటివారు అత్తింటివారైనా.. ఇచ్చిన మాట తప్పి అన్యాయం చేస్తూ.. " డైలాగులు ఇంకో నాలుగు పేజీలున్నై. సమయభావం వల్ల రాయలేకపోతున్నా! క్షమించగలరు.

నాకు గుత్తొంకాయ కూర చాలా ఇష్టం. అంతమాత్రాన గుత్తొంకాయలు ఎలాఉన్నా, కూర ఎలా వండినా తినను. వంకాయలు బాగోకపోయినా, రుచి కుదరకపోయినా పక్కన పెట్టేస్తాను.

చివరి తోక..

నే ప్రస్తావించిన దర్శకుల అభిమానులకి 'మనోభావాలు' దెబ్బతింటే.. వారికి నా క్షమాపణలు. మన ప్రముఖ దర్శకుల vision దశాబ్దాలుగా ఒకేవిధంగా ఉందనేదే నా point!

మన ఆలోచనలు, భావాలు (నాతోసహా) సాధారణంగా ఒక మూసలో ఉంటాయి. పెద్దగా variety ఉండదు. కమ్యూనిస్టు కాకరకాయ పులుసులో కూడా గొప్పకమ్యూనిజాన్ని కనగలడు. మతోన్మాది మజ్జిగన్నంలో కూడా మతాన్ని వెతుక్కుంటాడు. ఎవడిగోల వాడిది. అలాగే మన తెలుగు సినిమా దర్శకులు కూడా ప్రతికథలోనూ తమ మూస ఆలోచనలు జొప్పించి.. ఆ సినిమాని తమదైన శైలిలో రక్తి కట్టించారు. వారికి నా అభినందనలు!

(photo courtesy: Google)

Friday, 31 August 2012

బిరియానీయేనా? కాదుకాదు.. పులిహోరే

"నాకు మనసులొ ఒక ఆలోచన, బయటకో మాట ఉండదు డాక్టర్. ఉన్నదున్నట్లుగా మాట్లాడటం అలవాటు. అందుకే నాభార్యతో నాకు ఘర్షణ." ఆయన university professor. బట్టతల. పిల్లిగడ్డం. తనేదో న్యూటన్ కొత్తసూత్రం కనుక్కున్నట్లు వాపోయాడు. 
               
నాకు నవ్వొచ్చింది. ఈయనగారికి నరాల weakness కాదు. tongue weakness ఉందన్నమాట! ఉన్నదున్నట్లు మాట్లాడటానికి ఈయనేమన్నా సత్యహరిశ్చంద్రుడా? అందునా భార్యతో! అందుకే నా పేషంటయ్యాడు. 

మనసులోని ఆలోచనలకి సంబంధం లేకుండా అవతలవారికి నచ్చే అభిప్రాయాలు వ్యక్తం చెయ్యటం అనే కళలో నాకు చిన్నప్పుడే ట్రైనింగ్ అయిపోయింది. అందుకు నేను ఎన్టీరామారావుకీ, అక్కినేని నాగేశ్వరరావుకీ ఎంతైనా రుణపడివున్నాను.  

నాకు చిన్నప్పుడు ఎన్టీరామారావంటే అంతులేని ఆరాధన. ఆయనకి అసాధ్యం అనేదే లేదు. చైనా యుద్ధానికి రామారావుని పంపితే ఒకేఒక్కరోజులో యుద్ధం గెలిచేవాడని నమ్మేవాడిని. నెహ్రూకి నాఅంత తెలివిలేదు కాబట్టి రామారావుని వాడుకోలేదు. రామారావు నా super man, spider man, batman. 

కానీ.. నాకన్నా తెలివైనవాళ్ళని నేను అనుకునేవారందరూ.. ఏయన్నార్ అభిమానులు. నాగేశ్వరరావుతో నాకు చాలా ఇబ్బందులుండేవి. ఆయన ప్రేమ ఎంతకీ తెగదు. అసలు విషయం వదిలి ఘంటసాల పాటలు పాడుకుంటూ.. ఆత్రేయ రాసిన భారీడైలాగులు చెబుతూ.. వీలైతే మందు తాగుతూ.. కాలక్షేపం చేస్తుంటాడు. ఆపై హీరోయిన్ల త్యాగాలు, అపార్ధాలతో తలబొప్పి కట్టేది. ఈయనగారి ప్రేమకి మలబద్దకం లక్షణాలు కూడా ఉండేవి.    
               
ఇదే ఎన్టీవోడయితేనా.. "ఏం బుల్లెమ్మా" అంటూ హీరోయిన్ని ఒక్కలాగుడు లాగేవాడు. ఎంతలావు హీరోయినయినా (దేవిక , కేఆర్ విజయ, సావిత్రి నిజంగానే లావుగా ఉండేవాళ్ళు).. పక్కటెముకలు ఫటఫటలాడగా.. ప్రేమ చేతనో, ప్రాణభయం చేతనో రామారావు కౌగిలిలో ఒదిగిపోయేవారు. 

అందుకనే రామారావుకి ప్రేమ అనేది ఎప్పుడూ సమస్యే కాలేదు. కాబట్టే కధని ముందుకు నెట్టడానికి మొదట్లో రాజనాల.. తరవాత రోజుల్లో సత్యనారాయణ.. నడుం బిగించేవాళ్ళు. చివర్లో రామారావు చెయ్యబోయే ఫైటింగుల కోసం ఉగ్గబట్టుకుని ఎదురు చూసేవాణ్ణి. కొండల్లో, కోనల్లో, ఎడారుల్లో.. క్షణక్షణానికి సెట్టింగులు మార్చుకుంటూ.. గంటలకొద్దీ ఫైట్లు చేసిన రామారావు నన్నెప్పుడూ నిరాశ పరచలేదు. అవన్నీ నాజీవితంలో ఈనాటికీ మరువలేని మధుర క్షణాలు.

ఇంత భయంకరంగా ఎన్టీఆర్ ని అభిమానిస్తూ కూడా.. బయటకి మాత్రం రామారావు అంటే ఇష్టం లేనట్లుగా నటించేవాడిని. ఎందుకు? ఎందుకంటే.. మేధావి అన్నవాడు నాగేశ్వరరావు జీళ్ళపాకం ప్రేమనే మెచ్చుకోవాలి. రామారావుని మనసులోనే ఆరాధించుకుంటూ.. బయటకి మాత్రం.. 'ఛీ ఛీ! అవేం సినిమాలు. నేలక్లాసోళ్ళు విజిల్స్ వేసుకోటానికి తీస్తారనుకుంటా.. ఒక కథా పాడా!' అంటూ రామారావు సినిమాలని విమర్శిస్తూ.. నన్ను నేను class audience category లోకి నెట్టుకునేవాడిని.   

మనసులో ఒక అభిప్రాయం ఉంచుకుని, బయటికి వేరొకటి మాట్లాడటం అనే కళని ఈవిధంగా చిన్నప్పుడే వంటపట్టించుకున్నా. తద్వారా తెలివైనోళ్ళ మధ్య తెలివితేటలు ఒలకపోస్తూ మాట్లాడే విద్య అబ్బింది. నేను బయటకి బిరియానీలా కనిపిస్తాను. కానీ నామనసు మాత్రం పులిహోర. నేను pizza లా కనిపించే పెసరట్టుని. లేకపోతే మన సత్యహరిశ్చంద్ర ప్రొఫెసరుగారిలా పేషంటునయిపోయేవాడినేమో!   

Sunday, 18 March 2012

"ఇంకా ఎంతదూరం ఉంది నాయనా?" (ఒక నడక మిషన్ కథ)

"ఇంకా ఎంత దూరం ఉంది నాయనా?"

దేవదాసు సినిమా క్లైమాక్స్ గుర్తుంది కదూ! దుర్గాపురం చేరేదాకా బతుకుతానో లేదో అనే దేవదాసు ఆర్తి, ఆతృత.. పారుని చూడకుండానే చనిపోతానేమోననే ఆవేదన.. గుండెని కరిగించి కన్నీటిని వరదలా ప్రవహింపచేసే ఉద్వేగపూరిత ఘట్టం. సీతారాం (బండి నడిపిన వ్యక్తి) నటన అపూర్వం. తెలుగుసినిమా చరిత్రలో నన్ను ఇంతకన్నా ఏడిపించిన సన్నివేశం మరోటి లేదు.
               
ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే - ప్రతిరోజూ ఉదయం నేను కూడా దేవదాసులా ఫీలవుతుంటాను. దేవదాసుకి పార్వతి బాధ. నాకు ట్రెడ్‌మిల్ బాధ! ఈ డాక్టర్లు రాక్షసులకి తక్కువ, పిశాచాలకి ఎక్కువ. ఎక్సర్సైజులు చెయ్యకపొతే చస్తావని బెదిరిస్తుంటారు. ఆ డాక్టరే భార్య రూపేణా ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఎడారిలో ఎండమావి వంటిదని ప్రత్యేకంగా రాయనవసరం లేదనుకుంటాను.

కృష్ణకుమారి అక్కయ్యా! భార్యలకి భర్తల ఆరోగ్యం పట్ల తీవ్రమైన శ్రద్ధ ఎందుకు? మన పవిత్ర భారతదేశంలో భార్యలకి భర్తల పట్ల గల ఘోరప్రేమే కారణమని నేనూ, 'నీ బొంద! అది ప్రేమా కాదు, దోమా కాదు. మొగుడు చస్తే బాధ్యతలు నెత్తిమీద పడతయ్యనే బయ్యం! ప్రతిరోజూ నోరు  నొప్పెట్టేలా తిట్టుకోడానికి కొత్తమనిషి దొరకడనే అభద్రతా భావం!' అని నా స్నేహితుడూ వాదించుకుంటున్నాం. ఎవరు కరక్టో చెప్పండి. మీరు చెప్పేదాకా మేం వాదించుకుంటూనే ఉంటాం! చెప్పకపొతే కొట్టుకుని చచ్చిపోతాం!!

'ట్రెడ్‌మిల్ ఎందుకయ్యా? హాయిగా పొద్దున్నే గ్రౌండ్ లో వాకింగ్ చెయ్యొచ్చుగా?' అని మీకు అనుమానం రావొచ్చు. 'పొద్దున్నే నిద్రలేచి రోడ్డున పడకురోయ్! నిన్ను ఏ పేపరోడో, పాలపేకెట్లోడో అనుకుంటారు.' అని మా సుబ్బు భయపెడ్తాడు. కుక్కలు కరుస్తయ్యని కూడా బెదరగొడతాడు. అసలు విషయం - నేనెక్కడ వాకింగ్ చేసి ఆరోగ్యం మూట గట్టుకుంటామేమోనని సుబ్బు భయం! కానీ - నేను స్నేహితుల మాటకి విలువిచ్చే మనిషిని! అందుకే - ఉదయాన్నే లేవకుండా బారెడు పొద్దెక్కేదాకా నిద్రోవడం, పొరబాటున లేచినా వాకింగుకి దూరంగా ఉండడం చేస్తున్నాను. తప్పదు, స్నేహధర్మం!

అయితే అన్నిరోజులూ ఒకలా ఉండవు. నేను వాకింగ్ చెయ్యక తప్పని పరిస్థితులు వచ్చేశాయ్. కొన్నిరోజులు ఇంటికి దగ్గరగా వున్న గ్రౌండ్‌కి వెళ్లాను. అక్కడ నడిచేవాళ్ళని చూసి ఆశ్చర్యమేసింది. వాకింగ్ ట్రాక్ మీద క్రమబద్దంగా, హడావుడిగా నడుస్తున్న వారంతా గొర్రెల్లా కనిపించారు.

నడకలో కూడా ఒక్కోడిది ఒక్కో స్టైల్. ఒకరిది అడుగులో అడుగేస్తూ పెళ్లినడకయితే, ఇంకొకరిది 'పదండి ముందుకు పదండి తోసుకు' అన్నట్లు పరుగులాంటి నడక. అక్కడ చాలామంది వాకర్లు కాదు. టాకర్లు మాత్రమే! కొందరైతే మొక్కుబడిగా నాలుగు రౌండ్లు నడిచి పక్కనే ఉన్న హోటల్లో అరడజను నేతి ఇడ్లీలు ఆరగించి వెళ్తున్నారు! ఆరోగ్యంగా జీవించడానికి ఇన్ని కష్టాలు పడాలా? వామ్మో! నా వల్లకాదు.

కానీ 'నడక' లేని జీవితం గాలిలో దీపం వంటిదని డాక్టర్లు ఘోషిస్తున్నారు, భయపెడ్తున్నారు, అసలు వాళ్ళు పెట్టే ఈ భయంతో చచ్చేట్లున్నాం. అందువల్ల 'ట్రెడ్‌మిళ్ అని ఆంగ్లంలో పిలవబడుతున్న ఒక నడక మిషన్ని కొన్నాను.

ట్రెడ్‌మిల్ - బుజ్జిముండ! చూడ్డానికి అందంగా, గంభీరంగా ఉంటుంది. కానీ ఈ మిషన్ మీద నడవడం మాత్రం దుర్భరం. కింద పట్టా వెనక్కి కదిలి పోతుంటుంది. మనని వెనక్కి లాక్కెళ్ళి పోదామని, పడేద్దామని ఆ పట్టా తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. కింద పడితే మూతి పళ్ళు రాల్తాయి కావున, పడకుండా మనకి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ విధంగా కదిలే ఒక పట్టాతో మనం చేసే నిరంతర పోరాటన్నే 'ట్రెడ్‌మిల్ వాకింగ్' అంటారు!

మిషన్ ముందు ఒక బల్ల. దానిమీద ఎంత దూరం? ఎంత సమయం? ఎన్ని కేలరీలు? - ఇట్లా ఏవేవో లెక్కలు. 'జాగ్రత్త, ఇరువైపులా ఉన్న కడ్డీలని జాగ్రత్తగా పట్టుకోండి. ఈరోజుల్లో కరెంట్ యే క్షణాన్నైనా పోవచ్చును. మీ భద్రతకి మా బాధ్యత లేదు!' ఇలా అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ నడుస్తూ, అప్పుడప్పుడు పరిగెడుతూ- క్షణక్షణం ఆశగా ఎదురుగానున్న మీటర్లపై కాలము, దూరము అంకెలు చూసుకుంటూ - 'విధి ఒక విషవలయం, విషాద కథలకు అది నిలయం.' అని పాడుకుంటూ -

"ఇంకా ఎంతదూరం ఉంది నాయనా?"

నా ఏడుపు వాకింగ్ మా 'గుండెలు తీసిన బంటు' గోఖలేకి తెలిసింది. 'అలా ఏడుస్తూ ట్రెడ్‌మిల్ చెయ్యకు, ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి.' అన్నాడు. ఈ గోఖలేకి వొక్కటే పని - గుండె ఆపరేషన్లు చెయ్యడం. నేను మాత్రం చాలా బిజీ! అసలే దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ సమస్యలోంచి ఎలా బయటపడుతుంది? ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం చైనా ఇండియాకి సహకరిస్తుందా? లేదా? ఇలా ఎన్నో ముఖ్యమైన విషయాల గూర్చి ఆలోచించాల్సిన గురుతర బాధ్యతలు నామీదున్నాయి.

అయినా ఎంజాయ్ చేస్తూ ట్రెడ్‌మిల్ చెయ్యడమేమిటి! ఎంజాయ్ చెయ్యడానికి ఇదేమన్నా జ్యోతిలక్ష్మి డాన్సా? లేక సింగిల్ మాల్ట్ విస్కీయా? ఒరే మందుల కంపెనీ బాబులూ! జలుబుకీ, గజ్జికీ కూడా వందల కొద్దీ మందుల్ని మార్కెట్ చేస్తారు. పొద్దున్నే ఈ వాకింగులు, పీకింగులు లేకండా ఏదన్నా మందులు కనిపెట్టి చావండ్రా! నడవలేక ఇక్కడ కువసాలు కదిలిపోతున్నాయ్! 

Sunday, 23 October 2011

సినిమాలు మంచివే! కానీ మనం?


'సినిమాల్లో చెడు ఉండరాదు, బలహీన మనస్తత్వం కలవారు చెడిపోతారు.'

ఇది నేను నా చిన్నప్పట్నించీ వింటున్న సుభాషితం. ఓకే! ఒప్పుకుంటున్నా. ఇప్పుడు అట్టు తిరగేద్దాం. మరి - సినిమాల్లో మంచిని చూసి బాగుపడినవాళ్ళు ఎందరున్నారు? ఫలానా సినిమాలో ఫలానా పాయింటు నాకళ్ళు తెరిపించింది. కావున - ఫలానా విధంగా నా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాను, ప్రవర్తిస్తున్నాను. అన్నవాళ్ళు  మీకెక్కడైనా కనిపించారా? నాకైతే కనిపించలేదు.

'దేవదాసు'లో ఎస్వీరంగారావు - అంతస్తు తక్కువ పిల్లని చేసుకుంటే తుపాకీతో కాల్చుకు చస్తానని బెదిరించి మరీ నాగేశ్వర్రావుని సావిత్రి నుండి వేరు చేస్తాడు. ఆ తరవాత దేవదాసు, పార్వతిలు తెలుగువాళ్ళని దారుణంగా ఏడిపించారు. అరవైయ్యేళ్ళ క్రితం ఈ ఫార్ములా సూపర్ హిట్టు. కానీ ఈరోజుకీ తమ పిల్లలు దేవదాసు, పార్వతిల్లా భ్రష్టుపట్టిపోతారనే భయంతో  పిల్లల ప్రేమవివాహాలు ఒప్పుకునే దయార్ధ్ర హృదయులు నాక్కనిపించట్లేదు.
                             
నా చిన్నప్పుడు అమ్మ, పక్కింటి పిన్నిగారితో కలిసి ఎన్నో ఏడుపుగొట్టు సినిమాలు చూశాను. 'అన్నా! నీ అనురాగం' అంటూ గుండెలు పగిలే గుడ్డి చెల్లెలి ఆక్రందనల్ని ఎర్రటికళ్ళతో, మొహం వాచిపోయేలా బిగ్గరగా రోదిస్తూ సినిమాని చూశారు పిన్నిగారు. ఇంటికెళ్ళంగాన్లే బండెడు ఇంటి చాకిరీ సరీగ్గా చెయ్యలేదని తన విధవాడపడుచుని ఇల్లెగిరిపొయ్యేలా కేకలేసింది!

శారద నటించిన 'మనుషులు మారాలి'  సినిమా తెలుగువాళ్ళ హృదయాన్ని పీల్చి పిప్పి చేసింది. శోభన్ బాబు హత్య, ఆపై శారద దుర్భర దరిద్రాన్ని తట్టుకోలేక తన పిల్లల్ని చంపేసుకోవటం.. నాకు తెలిసి తెలుగులో ఇంతకన్నా సీరియస్ సినిమా మరోటి లేదు. జనాలు విరగబడి చూసి యేడ్చేశారు. ఆ సినిమా విజయవంతమై నిర్మాతలకి కాసులు తెచ్చింది గానీ జనాల్లో మార్పు తేలేకపోయింది. 

'రోజులు మారాయి'లో దళిత వర్గానికి చెందిన షావుకారు జానకిని వ్యవసాయ వర్గానికి చెందిన నాగేశ్వర్రావ్  ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఈ దళిత అగ్రవర్ణాల పెళ్ళి అలనాటి మాలపిల్ల దగ్గర మొదలై - కాలం మారింది, బలిపీఠం లాంటి సూపర్ హిట్ల మీదుగా చాలా పెద్దప్రయాణమే చేసింది. మనం కూడా సమాంతరంగా కారంచేడు, చుండూరు, నీరుకొండల మీదుగా ఇంకో పెద్దప్రయాణం చేస్తున్నాం!
                           
నేను ఈ ఉదాహరణల్ని సినిమా ప్రభావం సమాజం మీద ఉండదని చెప్పటానికి రాయట్లేదు. ఉంటుందని అన్డానికి తగినంత ఆధారాల్లేవని చెప్పటానికి మాత్రమే రాస్తున్నాను.
                             
సినిమా మన ఈగోని సంతృప్తి పరుస్తుంది. వాస్తవ ప్రపంచంలో మనకున్న తోర్రల్ని పూడ్చి ఆకాశంలో విహరించే ఆదర్శవంతమైన పాత్రల్ని భలే ఇష్టపడతాం. అసలా పాత్ర విలువల పట్ల కనీసం దర్శక రచయితలకే నమ్మకం ఉండదు. ఆదర్శవంతమైన ఆలోచనలు, సాధ్యంకాని కోరికలు, లేని విలువలు ఆపాదించుకోవటానికి డబ్బుతో కొనుక్కునే సాధనం సినిమా.

ఇవ్వాల్టికీ వాస్తవ జీవితంలో కులమతాలు, ఆస్తిఅంతస్తులు చాలా ముఖ్యం. కానీ సినిమాల్లో పడవ నడిపే వ్యక్తి ఆమాయక ప్రేమ (మూగమనసులు), నల్లటివాడి కవితాత్మక ప్రేమకథ (చెల్లెలి కాపురం), పనివాడి మొరటు ఆత్మీయత (ఆత్మబంధువు), రిక్షా కార్మికుని కుటుంబ మమకారాలు (శభాష్ రాముడు) ముచ్చట గొలుపుతయ్. అంటే - నిజ జీవితంలో మనకేది ఉండదో అదే సినిమాల్లో చూసుకుని తృప్తినొందుతాం!
                             
కాబట్టి నా పాయింటేంటంటే - జనం చెడిపోతున్నారని ఎవరూ గుండెలు బాదుకోనక్కర్లేదు. మీరూ నేనూ ఈ జనంలో భాగమే. ఎంత గొప్ప సినిమా చూసినా మీరూ నేనూ ఆవగింజంతైనా బాగుపడనట్లే, ఎవరూ కూడా చెడిపోరు. కాకపోతే తెలుగువాళ్ళల్లో కొందరు మేధావులున్నారు. వాళ్ళు సామాన్య ప్రజల కన్నా పైస్థాయివాళ్ళు కాబట్టి - సినిమాల్లో చెడు చూసి జనాలు చెడిపోతున్నారంటూ స్టేట్మెంట్లు పడేస్తారు! 

పోనీ - చిన్నపిల్లలయినా సినిమా ప్రభావానికి లోనవుతారా? ఇదీ అనుమానమే! గుండమ్మకథ పదిసార్లు చూసిన నా అన్న నన్ను ఎన్టీఆర్ నాగేశ్వర్రావుని చూసినట్లు ఆప్యాయంగా చూసుకోకపోగా, నామీద నాన్నకి పితూరీలు చెప్పి తన్నించేవాడు. 'రక్తసంబంధం'లో తీవ్రమైన అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ వుంది. సినిమా చూస్తూ హాల్లో కడవల కొద్దీ కన్నీరు కార్చిన అక్క - నేను తన పెన్సిలూ, ఎరేజరు వాడేస్తున్నాని రాక్షసిలా రక్తమొచ్చేట్లు గిచ్చింది. ఆరకంగా మాదీ రక్తసంబంధమైపోయింది! మరి పిల్లల మీద సినిమాల ప్రభావం ఏంటి!?

సినిమాల ప్రభావం ఉండదని నిరూపించడానికి అన్నీ నెగెటివ్ పాయింట్లు రాస్తున్నాను కదూ! కాబట్టి ట్రాక్ మారుస్తా. చిన్నప్పుడు సినిమాలు చూస్తున్నప్పుడు నాకు కొన్ని కోరికలు కలిగేవి. 'శభాష్ రాముడు' చూసి రామారావులా రిక్షా తొక్కుదామనే కోరికతో తహతహలాడాను. కాలేజీకి వచ్చాక నా రిక్షా తొక్కుడు కోరిక తీరింది. 

కొంచెం పెద్దయ్యాక ఏడుపుగొట్టు ఇల్లాళ్ళు నచ్చడం మొదలెట్టారు. మొగుడు 'ఇంకోదాన్తో పోతాను మొర్రో!' అంటున్నా పట్టించుకోకుండా మొగుడిగాడి కాళ్ళమీద పడి భీభత్సంగా కన్నీరుగార్చే పతివ్రతా శిరోమణులు నా మనసు దోచారు. ఆరోజుల్లో నాకు నచ్చిన డైలాగ్ - "ఏవఁండీ! మీ పాదాల దగ్గర ఇంత చోటివ్వండి, కనీసం మీఇంట్లో పనిమనిషిగా ఉండనిస్తూ ఇంత ముద్ద పడెయ్యండి." ఇట్లాంటి సీన్లు చూసినప్పుడల్లా అర్జంటుగా పెళ్లి చేసుకుని ఏడిచే భార్యతో బ్రతిమాలించుకోవాలని తెగ ముచ్చటపడేవాణ్ని. కానీ - పదోక్లాసులో పెళ్లి చేసుకునే సౌలభ్యం, సౌకర్యం లేక ఆగిపొయ్యా! రిక్షా ముచ్చటైతే తీరింది గానీ, ఈ పాదాల దగ్గర చోటు ముచ్చట తీరలేదని ప్రత్యేకంగా రాయడం అనవసరం. 

చివరాకరికి నే చెప్పొచ్చేదేమనగా - సినిమా చూడ్డం అనేది కేవలం కాలక్షేపం మాత్రమే. అది తీసేవాడికీ తెలుసు, చూసేవాడికీ తెలుసు. మరి తెలీన్ది ఎవరికి? 'సినిమాల్లో చెడు ఉండరాదు. బలహీన మనస్తత్వం గలవారు చెడిపోతారు.' అనేవాళ్లకి. ఇంతకీ ఆ చెడిపొయ్యే బలహీన మనస్తత్వ దుర్భలులు ఎక్కడ వుంటారో, ఎలా వుంటారో వాళ్ళు చెప్పరు. అదే తంటా!

(photo courtesy : Google)

Tuesday, 6 September 2011

సినిమా డాక్టర్లు


రాముడు మంచిబాలుడు, మన సినిమా డాక్టర్లంతా రాముళ్ళే! నున్నగా గీసిన గడ్డం, నూనెరాసి ఒద్దికగా దువ్వుకున్న తల, వెడల్పు ఫ్రేములో సోడాబుడ్డి కళ్ళద్దాలు, డాక్టరు కోటు (సాధారణంగా డాక్టర్ పాత్ర వేసేది చిన్నాచితకా నటుడైన కారణాన - అద్దె యాప్రాన్ పొడుగ్గానో పొట్టిగానో, వదులుగానో బిగుతుగానో ఉంటుంది), చేతిలో తోలుసంచి, శివుడి మెళ్ళో పాములా స్టెత్‌స్కోప్ - ఇదీ డాక్టరుగారి వేషం! రౌడీ పాత్రలకి బుగ్గన పులిపిరి, అడ్డచారల టీషర్టు, మెళ్ళో కర్చీఫ్ ఉంటేగానీ అతగాడు 'రౌడీ' అని ప్రేక్షకులకి తెలీదు. తెలుగు సినిమా డాక్టర్లదీ ఇదే దుస్థితి!

ఐతే - ఈ సినిమా డాక్టర్ గొప్ప ప్రతిభావంతుడు. నిజజీవితంలో డాక్టరు సాధించలేని అద్భుతాలు ఎన్నో చెయ్యగలడు. గుమ్మడి ఉత్కంఠతో ఎదురు చూస్తుంటుండగా - హీరో చెల్లెలి నాడిని అరక్షణం మాత్రమే పరీక్షించి, ఇంకో పావుక్షణం ఆలోచించి, ఆమె గర్భవతని తేల్చేస్తాడు! 

గుమ్మడి "పాపిష్టిదానా! మన వంశగౌరవం.. కుటుంబప్రతిష్ట.. " అంటూ కుంచెంసేపు ఆవేశపడి గుండె పట్టుకుని కూలబడిపోతాడు. అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి బావిలో దూకేస్తుంది (ఆడపిల్ల 'శీలం' పోయినా బ్రతకొచ్చనే సంగతి నాకు పెద్దయ్యేదాకా తెలీదు). పిమ్మట గుండెల్ని పిండేసే సన్నాయి వాయిద్యం, ఘంటసాల బూమింగ్ వాయిస్‌తో ఒక హెవీ సాంగ్.

కథకడ్డం రాకుండా, దర్శకుడు తనకిచ్చిన అరనిమిషంలో సమయపాలన చేస్తూ, కథని మలుపు తిప్పే గొప్పసన్నివేశంలో యాంత్రికంగా, వినయంగా తనపని తను చేసుకుపోయి క్రమశిక్షణ పాటించేవాడు మన సినిమా డాక్టర్! 

సినిమా డాక్టర్లది వాస్తవిక దృక్పథం. అందుకే వారికి - తెలుగు ప్రేక్షకలోకం హీరో చెల్లెలు గర్భవతైన తర్వాత వచ్చే సీన్లో ఘంటసాల పాట కోసం, గుమ్మడి గుండెపోటు కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు! అందుకే ఎక్స్‌రేలనీ, రక్తపరీక్షలనీ సమయం వృధా చెయ్యరు. వీళ్ళు నిజాయితీపరులు కూడా. అందుకే వాళ్ళు వున్న రోగానికే వైద్యం చేస్తారు గానీ, నిజజీవిత డాక్టర్లకి మల్లె లేని జబ్బులకి డబ్బులు గుంజరు!  

మన సినిమా డాక్టరు సాధించిన మరొక అద్భుత విన్యాసం రక్తమార్పిడి ప్రక్రియ! అందుకే రక్తం ఇస్తున్నవారి (డోనార్) రక్తం భూమ్యాకర్షణ సిద్ధంతానికి విరుద్ధంగా (తెలుగు సినిమాల్లో న్యూటన్ సూత్రాలెందుకు చెప్పండి) సెలైన్ స్టాండ్ మీదనున్న సీసాలోకి ఎక్కుతుంది! ఎన్నో సినిమాల్లో ప్రేక్షకుల్తో కడవలు కొద్దీ కన్నీళ్లు కార్పించిన ఈ మహత్తర విన్యాసం హాలీవుడ్‌వారిక్కూడా అర్ధం కాలేదు. దటీజ్ అవర్ సినిమా డాక్టర్!

ఈ బాక్సాఫీస్ ఫార్ములానే మన్మోహన్ దేశాయ్ అనే హిందీ దర్శకుడు ఇంకొకడుగు ముందుకేయించాడు. ఆయన 'అమర్ అక్బర్ ఆంథోనీ' అనే సినిమాలో ఏకంగా ముగ్గురు కొడుకుల రక్తాన్ని సెలైన్ స్టాండ్ పైనున్న సీసాల్లోకి పంపి, అక్కణ్ణించి తల్లి ఒంట్లోకి డైరక్టుగా ఎక్కే యేర్పాటు చేశాడు (హిందీసిన్మాలకి బడ్జటెక్కువ)! ఇలా తమ తల్లిప్రాణాన్ని దక్కించుకున్న ముగ్గురు హీరోల్ని చూసి యావద్దేశం పులకించిపోయింది, తద్వారా మన్మోహన్ దేశాయ్ బేంక్ బ్యాలెన్స్ కూడా పెరిగింది. 

సినిమా డాక్టర్లకి ఇలా అనేక గొప్ప ప్రతిభాపాటవాలు తప్ప లోపాలు లేవా? ఎందుకు లేవు! ఉన్నాయి. వీళ్ళకి దెబ్బలకి కట్టు కట్టటం సరీగ్గా రాదు. తెల్లటి గాజుగుడ్డకి మధ్యలో ఒకప్పుడు నల్లటి పెద్దమరక (బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో), ఇప్పుడు ఎర్రటి పెద్దమరక (కలర్ సినిమాల్లో) లేకుండా కట్టు కట్టలేడు. 'ఆ కట్లు మేం కట్టలేదు, మా కాంపౌండర్ కట్టాడు.' అని తప్పించుకుంటే చేసేదేం లేదు. 

సినిమాల బజెట్ పెరిగింది. తదనుగుణంగా సినిమా డాక్టర్ కూడా తోలుసంచితో పేషంట్ల ఇళ్ళకి రావటం మానేసి, కార్పొరేట్ ఆస్పత్రిలోకి మారాడు. ఈ కార్పొరేట్ ఆస్పత్రికి మొదటి పేషంట్ 'ప్రేమనగర్' నాగేశ్వర్రావు !

పాపం! వాణిశ్రీ ప్రేమ కోసం నాగేశ్వర్రావు విషం (అది నిఝంగా విషమే! సీసామీద తాటికాయంత అక్షరాల్తో 'poison' అన్రాసుంది) తాగేస్తాడు. హీరోగారు ఎంత పనీపాట లేని ప్రేమికుడైనా జమిందారు, పైగా ప్రేమనగర్ అనే పెద్ద బిల్దింగుకి ఓనర్. కాబట్టి సింపుల్‌గా విషం కక్కించేస్తే సన్నివేశం పండదు, తేలిపోతుంది! పైగా ప్రేక్షకులు నాగేశ్వర్రావు బ్రతుకుతాడా లేదా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు కూడాను. ఈ విధంగా సన్నివేశం, హీరో, బజెట్ డిమాండ్ చేసిన కారణంగా విషాన్ని కక్కించడానికి బదులుగా ఆపరేషన్ చేసేశాడు మన సినిమా డాక్టర్!   

సినిమాల్లో వాస్తవికతని వెదుక్కునే చాదస్తులు ఎప్పుడూ వుంటూనే వుంటారు. రేసుగుర్రంలా పరిగెట్టే సినిమాకథని ఫాలో అవ్వలేని అజ్ణానులు వీరు. అందుకే 'అప్రధాన' విషయాలపై దృష్టి పెడుతుంటారు. కథకి హీరో చెల్లెలి గర్భం ముఖ్యంగానీ అదెట్లా నిర్ధారింపబడిందన్నది అనవసరం. తల్లీకొడుకుల మమకారాన్నాపే శక్తి భూమ్యాకర్షణ సిద్ధాంతానికి వుంటుందా! 

ప్రియురాలు వాణిశ్రీ కోసం విషం త్రాగి, లక్షలు ఖరీదు చేసే సెట్టులో, ఘంటసాల గొంతుతో దిక్కులు పిక్కటిల్లేలా 'ఎవరికోసం' అంటూ ఒరిగిపోతూ, ఒంగిపోతూ, పడుతూ, లేస్తూ పాడుతుంటే.. కెమెరా ఊగిపోతూ తిరిగిపోతూ.. ఆబ్బ! ఎంత గొప్ప సీను! ఇంత భీభత్స చిత్రీకరణ తరవాత కూడా సాదాసీదాగా విషం కక్కించేసి హీరోని రక్షిస్తే - సత్యజిత్ రే వంటి మేధావులు మెచ్చుకునేవారేమో గానీ.. తెలుగు ప్రేక్షకుడు ఒక్కరూపాయి విదిల్చేవాడా?

మన తెలుగు దర్శకులు జ్ఞానులు. తెలుగు సినిమా కధలెప్పుడూ రేసుగుర్రాలే! అందుకే అవి ఆగకుండా పరుగులు తీస్తుంటాయి. బెంగాలీ, మళయాళీ సినిమాలు మన పీరుసాయిబు కుంటి జట్కాగుర్రంలా ముక్కుతూ మూలుగుతూ, పడుతూ లేస్తూ నడుస్తుండేవి. 

కావున చివరాకరికి చెప్పొచ్చేదేమంటే - మన దర్శకుల అభిరుచినీ, ప్రజల అభీష్టాన్నీ మన్నించి - సినిమా డాక్టర్లు కూడా తమవంతు పాత్ర(ల)ని పోషించారు. మనఇంట్లో, మనరోట్లో నూరిన గోంగూర పచ్చడి మనగ్గానీ ఎవడో పక్కింటోడి కోసం కాదుగాదా!

(picture courtesy : Google)