Showing posts with label సోనియా గాంధి. Show all posts
Showing posts with label సోనియా గాంధి. Show all posts

Monday, 4 August 2014

ఆత్మకతలు


జంతువులు ఆలోచిస్తాయా? జంతువులకి ఆకలేస్తే ఆహారాన్ని వెతుక్కుంటాయి, కడుపు నిండిన తరవాత హాయిగా నిద్రపోతాయి. అంతేగానీ - అనవసరమైన ఆలోచనల్తో బుర్ర పాడుచేసుకోవని నా అభిప్రాయం. కానీ - మనిషికి జంతువులకున్నంత తెలివి ఉన్నట్లుగా అనిపించట్లేదు. ఎందుకంటే - మనిషి ఆలోచనాపరుడు!

మనిషి ఆలోచనల్ని బాహ్యప్రపంచం ప్రభావితం చేస్తుంటుంది. ఆకలితో ఉన్నవాడికి విప్లవ గీతం గుర్తొస్తుంది. కడుపు నిండినవాడికి కవి సార్వభౌముల కవిత్వం కమనీయంగా తోస్తుంది, మనసు మరింత వినోదాన్ని కోరుకుంటుంది. వినోదం నానా విధములు. కొందరికి వినోదం పేకాట క్లబ్బులో దొరికితే, మరికొందరు క్రికెట్ బెట్టింగుల్లో దొరుకుతుంది.

ఇట్లాంటి చౌకబారు వినోదానికి మేధావుల గుర్తింపు వుండదు. మరప్పుడు మేధావులు ఏ విధంగా వినోదం పొందుతారు? అసలు మేధావి అంటే ఎవరు? సరళమైన విషయాన్ని సంక్లిష్టంగా ఆలోచించేవాడే మేధావి అని నా నమ్మకం. అందువల్ల మేధావుల వినోదం కూడా సంక్లిష్టంగానే వుంటుంది!

కాఫ్కా శామ్సాని పురుగ్గానే ఎందుకు మార్చాడు? కుక్కగా ఎందుకు మార్చలేదు? శ్రీశ్రీ 'నేనొక యజ్ఞోపవితాన్ని' అని ఎందుకు రాశాడు? ఆయన కమ్యూనిస్టు బ్రాహ్మడా? లేక బ్రాహ్మణ కమ్యూనిస్టా? మేధావులు ఇట్లాంటి విషయాల్ని తీవ్రంగా ఆలోచించడమే కాక పుస్తకాలు కూడా రాస్తుంటారు!

ఇదే కోవకి చెందిన ఇంకో వినోదం ఆత్మకథలు. ఈ ఆత్మకథలు రాసేవారు అనేక రకాలు. హిట్లర్ కుక్కకి స్నానం చేయించినవాడు, ఇందిరాగాంధీ జుట్టుకి రంగేసినవాడు, మైఖేల్ జాక్సన్ చెఫ్.. ఇలా చాలామంది తమ బాసుల అలవాట్లు, ప్రవర్తనల గూర్చి పేజీల కొద్దీ రాశారు. ప్రజల జీవితాలకి ఏ మాత్రం సంబంధం లేని ఇట్లాంటి గాసిప్స్ చాలామంది ఇష్టపడతారు. తెలివైన పబ్లిషర్లు ప్రజల అభిరుచికి తగ్గట్టుగా ఇట్లాంటి పుస్తకాలు వండి వారుస్తూనే వున్నారు.

బాబ్రీ మసీదు కూల్చినప్పుడు పీవీ పూజామందిరంలో వున్నాడా? బెడ్రూములో వున్నాడా? బాత్రూములో వున్నాడా? అంటూ కొందరు పుస్తకాలు రాసి బాగానే అమ్ముకున్నారు. పీవీ ఏ రూములో వుంటే మాత్రమేంటి? మసీదు కూల్చివేతని అడ్డుకోలేకపోవటం పీవీ అసమర్ధతకి చిహ్నం. ప్రజలకి సంబంధించినంత మేరకు ఇదే ముఖ్యమైన పొలిటికల్ పాయింట్.

ఆత్మకథల్లో ఇంకోరకం (మాజీ) ప్రముఖులు రాసేవి. ఈ మాజీల ఆత్మకథలు చదివేవారు వుండరు. అంచేత వాళ్ళే మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి. ఒక పుస్తకాన్ని ప్రమోట్ చేసుకోవాలంటే చాలా ఖర్చవుతుంది. అంచేత వాళ్ళా పుస్తకంలో (బహుశా పబ్లిషర్లతో చేసుకున్న ఒప్పందం ప్రకారం) కొన్ని వివాదాస్పద అంశాలు ఉండేట్లు రాసుకుంటారు. ఇంక బోల్డంత ఫ్రీ పబ్లిసిటీ. మొన్న సంజయ్ బారు అనే ఒక మాజీ మీడియా ఎడ్వైజర్ ఇట్లాంటి సూత్రాన్నే పాటించి పుస్తకాలు అమ్ముకున్నాడు. ఇప్పుడు నట్వర్ సింగ్ వంతొచ్చింది! ఈ వరసలో రేపెవరో! అసలివన్నీ ఆత్మకథలు కావనీ, ఆత్మకతలు మాత్రమేనని మా సుబ్బు అంటాడు. 

నట్వర్ సింగ్ అనే ఒక మాజీ తన అనుభవాల్ని పుస్తకంగా రాసుకున్నాడు. సోనియా గాంధీ ప్రధాని కాకపోవటానికి రాహుల్ గాంధీ వత్తిడే కారణమట. అయితే ఏంటిట? ఇదేమంత వార్తని! అసలీ నట్వర్ సింగ్ ఎవరు? ఏదో ఉద్యోగం వెలగబెడుతూ, అవకాశం దొరగ్గానే కాంగ్రెస్ పార్టీలోకి దూకి, గాంధీ కుటుంబానికి సేవ చేసుకుంటూ ఏవో పదవులు అనుభవించాడు. అటు తరవాత సొనియమ్మ దయకి దూరమయ్యాడు. అప్పట్నుండి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ, ఖాళీగా ఉండటం దేనికని ఒక పుస్తకం రాసుకున్నాడు.

మొన్న మధ్యాహ్నం భోజనంలో నేను దోసకాయ పప్పు, కాకరకాయ వేపుడుకీ బదులుగా పప్పుచారు, గుత్తొంకాయతో తినుంటే ఎలా వుండేది? నిన్న నేను తెల్లచొక్కా కాకుండా చారల చొక్కా వేసుకున్నట్లైతే ఎలా వుండేది? ఈ విషయాలకి ఎంతటి ప్రాధాన్యం వుందో - 'మన దేశానికి ప్రధానిగా మన్‌మోహన్ సింగు కాకుండా సోనియా గాంధీ అయినట్లైతే ఎలా వుండేది?' అన్న విషయానికీ అంతే ప్రాధాన్యం వుంది. చదవడానికి కాస్త కఠినంగా వున్నా ఇది వాస్తవం. 

అసలంటూ మన్‌మోహన్ సింగు తనంతతానుగా ప్రజలకి ఏదైనా కీడో మేలో చేస్తే, ఆ పని సోనియా గాంధీ అయితే చేసేదా లేదా అని ఆలోచించేవాళ్ళం. కానీ మన్‌మోహన్ సింగు ఎప్పుడూ చేసిందేమీ లేదు. అణుఒప్పందం లాంటి ముఖ్యమైన నిర్ణయాలు సోనియా గాంధీ అనుమతి లేకుండా జరిగినవీ కావు. పోనీ 2 జి, బొగ్గు కుంభకోణాలు సోనియా గాంధీ అయినట్లేతే ఆపేదా? ఖచ్చితంగా ఆపేది కాదు. అందుకే - ఇంతోటి పాలనకి ఎవరైతేనేం (పళ్ళూడగొట్టుకోడానికి ఏ రాయైతే నేం)? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

చెప్పినట్లు చెయ్యకపొతే ఇంటి ఇల్లాలు ఎక్కడ గృహహింస కేసు పెడుతుందేమోననే భయంతో ఇంట్లో అంట్లు తోముతాం, బట్టలుతుకుతాం! అంతమాత్రానికే ఆ విషయాన్ని బయటకి చెప్పుకోలేం గదా? మరప్పుడు బయటకి ఏమని చెబుతాం? ఆలుమగలు సంసారం అనే బండికి రెండు చక్రాల్లాంటివారని నమ్మబలుకుతాం. అట్లాగే - పాపం సోనియమ్మ తన ముద్దుల కొడుకు వత్తిడి వల్ల ప్రధానమంత్రి పదవిని తప్పించుకుని, దానికి 'త్యాగం' అనే పేరు పెట్టుకుంది. అలా చేయబట్టే ఆమె వందిమాగధులు తమ నాయకురాల్ని మదర్ థెరీసా అని కీర్తించగలిగారు!

'ఆత్మకథలని అధమంగా చూడకు. ప్రముఖులు ఎదిగిన వైనము కడు స్పూర్తిదాయకము.' అని కొందరు అమాయకులు నమ్మవచ్చుగాక! నేను మాత్రం నమ్మను. నా స్నేహితుడోకడు గైళ్ళు చదివి మంచి మార్కులు సంపాదించేవాడు. ఆ విషయం నాకు తెలుసు. కానీ అతను మాత్రం అందరికీ తను చాలా కష్టపడి దిండ్లు లాంటి స్టాండర్డ్ టెక్స్టు బుక్కులు మాత్రమే చదువుతానని చెప్పుకునేవాడు. అంతేకాదు - గైళ్ళు చదవొద్దని జూనియర్లకి సలహా కూడా చెప్పేవాడు! ఎందుకు? అలా చెబితేకానీ తన ఇమేజ్ పెరగదని అతని అభిప్రాయం.

పోనీ ప్రతిభావంతుల అలవాట్లని స్పూర్తిదాయకంగా తీసుకుని, వాటిని అనుకరించి బాగుపడ్డవారున్నారా? మిగతావాళ్ళ సంగతేమో గానే - నేను మాత్రం లాభ పళ్ళేదు. మా గుంటూరు మెడికల్ కాలేజిలో చరిత్ర సృష్టించిన భీభత్సమైన గోల్డ్ మెడల్ స్టూడెంట్ ఒకాయనున్నాడు. ఆయన మాకు మూడేళ్ళు సీనియర్. ఎట్టకేలకి మా సూర్యం ఆ గోల్డ్ మెడల్స్ రహస్యం చేధించాడు.

ఆ గోల్డ్ మెడల్స్ పెద్దమనిషి ప్రతిరోజూ సరీగ్గా అర్ధరాత్రి పన్నెండింటికి బలరాం హోటల్లో ప్లేటు పూరీ (అనగా రెండు పూరీలు అని అర్ధం) పూరీకూరతో కాకుండా చపాతికి ఇచ్చే కుర్మాతో నంజుకుని తింటాడు. ఆపై నిదానంగా ఒక టీ తాగి స్టైలుగా ఒక రెడ్ విల్స్ సిగరెట్ ముట్టిస్తాడు. మా సూర్యం డిటెక్టివ్ యుగంధర్ వలె ఆయనపై అనేక రాత్రులు నిశిత పరిశీలన జరిపి సేకరించిన భోగట్టా ఇది.

ఆ గోల్డ్ మెడలిస్ట్ విజయ రహస్యాన్ని గ్రహించిన మా మిత్రబృందం కూడా పూరీ కుర్మా విత్ రెడ్ విల్స్ సిగరెట్ ఫార్ములాని అమలు చెయ్యడం ప్రారంభించింది. మొక్కవోని దీక్షతో ఎన్ని పూరీకుర్మాలు తిన్నా, ఎన్ని సిగరెట్లు కాల్చినా మాకెవరికీ గోల్డ్ మెడల్ దక్కలేదని ప్రత్యేకించి రాయనక్కర్లేదని అనుకుంటాను.


ముగింపు -

నా జీవిత చరిత్ర (రాస్తే గీస్తే) ఈ విధంగా రాయబోతున్నాను.

నేను చాలా పేద కుటుంబం నుండి వచ్చాను (ఒట్టు! నన్ను నమ్మండి). అనేక కష్టాలు పడుతూ వీధి దీపాల కింద చదువుకుంటూ డాక్టర్నయ్యాను (ఇప్పుడు కొద్దిగా చెమట తుడుచుకోనివ్వండి). స్త్రీలందరినీ నా సోదరీమణులుగా భావించాను (అందుకే నాకు భార్య దొరకడం కష్టమైంది). ఏనాడూ అసత్యం పలక లేదు (మళ్ళీ ఇంకో ఒట్టు). పేదరోగుల కష్టాలకి చలించిపోతుంటాను, కన్నీరు కారుస్తుంటాను (బిల్లు మాత్రం ఠంచనుగా వసూలు చేస్తాను). అనుక్షణమూ ఈ దేశానికి నేనేమిచ్చాను అని తపన పడుతుంటాను (కొద్దిగా గంభీరంగా ఉంటుందని రాశానే గానీ ఈ వాక్యానికి అర్ధం నాకు తెలీదు).

అన్నట్లు పదో చాప్టర్లో బాలగోపాల్ గూర్చి రాయబోతున్నాను. 

కొన్ని సందర్భాల్లో విషయం అర్ధం కాక తల పట్టుక్కూర్చున్న బాలగోపాల్‌కి సలహాలు చెప్పి చైతన్యవంతుణ్ణి చేశాను. ఒక్కోసారి ఆయన నిరాశ చెందేవాడు. అప్పుడు నేను 'తెలుగువీర లేవరా! దీక్ష బూని సాగరా!' అంటూ ఆయన్ని కర్తవ్యోన్ముఖుణ్ని చేసేవాణ్ణి. అందుకే బాలగోపాల్ ఎప్పుడూ అంటుండేవాడు 'రమణా! నువ్వు లేకపోతే నేను లేను' అని. అది వాస్తవమే అనుకోండి, కానీ - నాకు పొగడ్తలు గిట్టవు!

ప్రస్తుతానికి నా జీవిత చరిత్రలో ఈ విశేషాల శాంపిల్ చాలుననుకుంటున్నాను!


చివరి తోక -

'ట్రింగ్ ట్రింగ్' ఫోన్ అందుకున్నాను. 

"ఎందుకు? ఎందుకు నన్నంత మాట అన్నావ్? నా మనసు ఎంతలా గాయపడిందో తెలుసా?" మబ్బు లేని వర్షంలా నా స్నేహితుని వ్యధ.

"నేనేమన్నాను?" అయోమయంగా అడిగాను.

"అది తెలుసుకోవాలంటే త్వరలో రాబోయే నా ఆత్మకథ చదువుకో. నీకైతే ట్వెంటీ పర్సంట్ డిస్కౌంట్ కూడా!" అన్నాడు నా స్నేహితుడు.

"ఈ మాత్రం దానికి ఆత్మకథ ఎందుకు!" చికాగ్గా అన్నాను.

"ఏ? అదే సోనియా గాంధీ రాస్తానంటే ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తావు. నాకో నీతీ సోనియాకో నీతా?" ఫెడీల్మంటు ఫోన్ పెట్టేశాడు నా స్నేహితుడు.

(picture courtesy : Google)

Monday, 24 February 2014

కాలక్షేపం వార్తలు


"ఆ రెండు దెయ్యాల దుర్మార్గమే"

ఈ వార్త ఇవ్వాళ 'ఆంధ్రజ్యోతి' ఐదో పేజిలో వచ్చింది. తెలుగు వార్తా పత్రికల స్థాయి ఎప్పుడో దిగజారిపోయింది. ఇంకా జారటానికి అక్కడ మిగిలిందేమీ లేదు. ఒక వార్తని అర్ధవంతంగా రిపోర్ట్ చెయ్యటం వీరికి చేతకాదు. అందుకే వార్తలో సాధ్యమైనంతవరకూ తిట్లూ, బూతులు వెతుక్కుని.. వాటినే ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. 

నెల్లూరు జిల్లాకి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే ఓ చిన్నపాటి తెలుగు దేశం నాయకుడు సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్ లపై ఫైర్ అవుతూ చేసిన 'దెయ్యం' కామెంట్ ఇది. ఆ నాయకుడికి తన రాష్ట్రం విడిపోయినందుకు కోపం, బాధ ఉండి ఉండొచ్చు, లేదా తన నియోజక వర్గ ప్రజల దగ్గర మార్కులు కొట్టెయ్యడానికి ఈ భాష వాడి ఉండొచ్చు. కానీ ఆ వార్తని రిపోర్ట్ చెయ్యడానికి పత్రిక వాడిన శీర్షిక అభ్యంతరకరంగా ఉంది.  

తెలుగు దేశం నాయకుడు చేసిన విమర్శ రాజకీయమైనది. వాస్తవానికి ఈ వార్తని రాసేప్పుడు పత్రికలు దేవుళ్ళు, దెయ్యాల భాష (ఆ నాయకుడు అలా మాట్లాడినప్పటికీ) వాడకూడదు. అది పత్రికల బాధ్యత. ఎందుకంటే ఆయన దెయ్యాలుగా రిఫర్ చేసిన వ్యక్తులు స్త్రీలు, ఈ దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే రెండు పెద్ద రాజకీయ పార్టీల్లో ముఖ్యమైన స్థానంలో ఉన్నవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వారివారి పార్టీలు తీసుకున్న రాజకీయ నిర్ణయం. అప్పుడు వారిపై విమర్శలు కూడా రాజకీయంగానే ఉండాలి, పత్రికలు అటువంటి విమర్శలకే ప్రాధాన్యం ఇవ్వాలి కానీ, వ్యక్తిగత దూషణలకి కాదు. 

ఆ తెలుగు దేశం నాయకుడు చాలా విషయాలు చెబుతూ, మధ్యలో ఒక మాటగా ఈ దెయ్యాల భాష వాడి ఉంటాడు. కానీ పత్రిక వారికి దెయ్యాల ప్రస్తావన ఆకర్షణీయంగా ఉందనిపించింది. అందుకే అన్నీ వదిలేసి 'దెయ్యాలు' అంటూ హైలైట్ చేశారు. ఇట్లాంటి తిట్ల భాష వాడితేనే పత్రికల్లో ప్రచారం లభిస్తుందని ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు నమ్ముతున్నారు. అందుకు ప్రధాన కారణం రాష్ట్రస్థాయి నాయకులు. 

చంద్రబాబు నాయుడంతటి నాయకుడే తన రాజకీయ ప్రత్యర్ధుల్ని 'మొద్దబ్బాయ్, దొంగబ్బాయ్' అంటూ సంబోధించడం ఒక విషాదం. ఇదెక్కడి రాజకీయ భాష! జుగుప్సాకరమైన ఇట్లాంటి భాషని పెద్దస్థాయి నాయకులు మాట్లాడటం వల్లనే చిన్నస్థాయి నాయకులు ఇంకా రెచ్చిపోతున్నారు. ఇది రాజకీయాలకే నష్టం. 

ఇక ఆంధ్రజ్యోతి ఓనర్ గారు తమ పత్రిక విలువలకి కట్టుబడి నిస్వార్ధంగా నిలబడుతుందని (వారికి ప్రతి ఆదివారం ఇదో తంతు) గర్వంగా చెప్పుకున్నారు. మంచిది, ఆయన అభిప్రాయం ఆయనిష్టం. ఆ పత్రికకి తెలుగు దేశం పార్టీలో అంతా నిస్వార్ధమైన మంచే కనిపిస్తుంది, జగన్మోహనుడి పార్టీలో అంతా స్వార్ధపూరిత చెడ్డే కనిపిస్తుంది. తన పత్రికకి - తెలంగాణా జిల్లాల ఎడిషన్లలో సమైక్య దుర్మార్గం కనిపిస్తుంది, సీమాంధ్ర ఎడిషన్లలో విభజన దుష్టత్వం కనిపిస్తుంది. రెండు కళ్ళ సిద్ధాంతం మనకి బాగానే పరిచయం. కాబట్టి - ఆ పత్రిక ఓనరు గారి ద్వంద్వవిధానం వారి నిజాయితీగానే మనం భావించాల్సి ఉంటుంది. 

ప్రజలు తెలివైనవారని నా నమ్మకం. అందుకే వాళ్ళు మీడియా వండే మసాలా వార్తల్ని పట్టించుకోవటం మానేశారు. కొందరు మరీ పనిలేని వాళ్ళు టీ స్టాల్లో టీ తాగుతూ కాలక్షేపంగా ఏదో మాట్లాడుకుంటారు. అంచేత వీటిని కాలక్షేపం వార్తలుగా అనుకోవచ్చు. అంతకుమించి ఈ వార్తలకి ప్రాధాన్యం లేదు. 'మరి ఏ మాత్రం ప్రయోజనం లేని ఈ వార్తల్ని ఎందుకంతగా చదువుతారు? చూస్తారు?' సినిమాలో చివరికి గెలిచేది హీరోనే అని తెలిసినా, ఆ ఫైటింగుల్ని కూడా ప్రేక్షకులు ఆసక్తిగానే చూస్తారు. వారికదో సరదా. ఈ వార్తల గతీ అంతే!

(photo courtesy : Google)

Sunday, 31 March 2013

బీరువాల్లో పుస్తకాలు - బీభత్స అనుభవాలు


పై ఫోటో చూడండి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. సోనియా గాంధి వెనక ఎన్ని పుస్తకాలో!

'అక్కడున్న పెద్ద మనుషులకి కనీసం ఆ పుస్తకాల టైటిల్స్ అయినా తెలుసునా?'

'ఓయీ అజ్ఞాని! వాళ్ళంతా ఎవరనుకున్నావ్? ఈ దేశాన్ని నడిపిస్తున్న మహామేధావులు. వారికి ఆ పుస్తకాలన్నీ కొట్టిన పిండి. దంచిన కారం. వండిన కూర. పిండిన రసం.'

అలాగంటారా! అయితే మీరు నన్ను క్షమించాలి. ప్రతి మనిషి తన అనుభవాల నుండే జీవిత పాఠాలు నేర్చుకుంటాడు. ఆ దృక్కోణంతోనే జీవితాన్ని చూస్తుంటాడు. ఈ బీరువాలు, పుస్తకాలు పట్ల అనుమానాలు, అపార్ధాలు కలగడానికి చిన్నతనంలో నాక్కలిగిన కొన్ని బీభత్స అనుభవాలే కారణం.

కేస్ నంబర్ 1. ఎదురింటి ప్లీడరుగారు.


చిన్నప్పుడు మా ఇంటెదురు ఒక ప్లీడరుగారు ఉండేవారు. ఇంటి నిండా బీరువాలే! బీరువాల్నిండా దున్నపోతుల్లాంటి పుస్తకాలే! ఆయనెప్పుడూ వాటి మొహం చూసిన పాపాన పోలేదు. పొద్దస్తమానం ఇంటి ముందున్న మామిడి చెట్టు కాయలు ఎవరు కోసేసుకుండా కుక్క కాపలా కాస్తుండేవాడు. ఆయనకి బెయిల్ పిటిషన్ వెయ్యడం కూడా రాదని నాన్న చెప్పేవాడు. మరాయనకి అన్ని పుస్తకాలెందుకబ్బా!

కావున బీరువాల్లో పుస్తకాలకి, ఆ పుస్తక సొంతదార్లకీ సంబంధం ఉండవలసిన అవసరం లేదనే అనుమానం నాలో మొదలైంది. సంబంధం లేకపోతే మానె.. అసలీ బీరువా పుస్తకరాయుళ్ళ శీలాన్నే శంకించాల్సిన సంఘటనలు అటు తరవాత నా జీవితంలో చోటు చేసుకున్నాయి.

కేస్ నంబర్ 2. మామా! ఇదా నీ అసలు రహస్యం!


నా మేనమామ ఒకాయన మంచి ఇల్లు కట్టించాడు. ఇంట్లో టేకు బీరువాలు. వాటి నిండా సాహిత్య పుస్తకాలు! షేక్స్పియర్, మిల్టన్, కీట్స్.. గురజాడ, శరత్ చంద్ర చటర్జీ.. అన్ని పుస్తకాలు నీటుగా, ముద్దొచ్చేలా సర్ది ఉండేవి. ఏ యాంగిల్లో చూసినా నాకాయన ఓ గొప్ప మేధావిలా అనిపించేవాడు. తీరిక సమయాల్లో ఆ పుస్తకాల్ని సర్దుకుంటూ ఆయన కాలక్షేపం చేసేవాడు.

అయితే.. ఆయన అత్తతో ఒక విషయంలో తీవ్రంగా గొడవ పడుతుండేవాడు. మా మేనమామ మామ.. అనగా మా అత్త తండ్రి.. ఇస్తానన్న కట్నం పూర్తిగా ఇవ్వలేక బాకీ పడ్డాట్ట. ఆ బాకీకి వడ్డీ, ఆ వడ్డీకి చక్రవడ్డి వసూలు చేసాడు మా మామ మహానుభావుడు. ఆ బాకీ వసూలు నిమిత్తం మా అత్తని అప్పడంలా వణికించేవాడు. ఇంట్లో దుర్భర వాతావరణాన్ని సృష్టించేవాడు.

ఆంగ్లాంధ్ర సాహిత్యాలని నమిలి మింగేసిన నా మేనమామ ఇంత ఘోరానికి తలపడుతున్నాడేమి? ఎక్కడో ఏదో తేడాగా ఉంది. ఏమది? ఈ అనుమానం కలిగిన మీదట ఆయన సాహిత్య జ్ఞానంపై డిటెక్టివ్ యుగంధర్ లా పరిశోధన చేశాను.

దరిమిలా దిమ్మ తిరిగే వాస్తవాలు తెలిశాయి. మా మేనమామ ఆ పుస్తకాలేవీ చదవలేదు. చదవని ఆ పుస్తకాల పట్ల ఏల ఆయనకీ మమకారం! ఆయన పోయిన నాల్రోజులకే ఆ పుస్తకాలన్నీ కిలోల్లెక్కన అమ్మేసి మా అత్త తన కసి తీర్చుకుంది. అది వేరే విషయం.

కేస్ నంబర్ 3. పుస్తకం రూముకే భూషణం!


డిగ్రీ చదివే రోజుల్లో నాకో స్నేహితుడున్నాడు. అతగాడికి ఆంగ్ల భాషయన్న మిక్కిలి ఎలర్జీ. అంచేత వెర్బులు, నౌన్లు లేకుండా.. ఆంగ్లభాషని ఖండఖండములుగా ఖండించి మాట్లాడుతూ కసి తీర్చుకునేవాడు.

ఉన్నట్టుండి అతగాడి హాస్టల్ రూములో ఆంగ్ల పుస్తక దిండ్లు! విశాలాంధ్ర పుస్తకాల షాపు నుండి టన్ను పుస్తకాలు కొనుక్కొచ్చాడు. పెత్రోవ్, తీస్తొనాస్కీ.. అంటూ అర్ధం కాని పేర్లతో రచయితలు. అన్నీ కలిపి వంద రూపాయలు కూడా అవలేదుట!

'వామ్మో! మనోడిలో ఇంత విషయం ఉందా!' అని కంగారు పడ్డా.

నా కంగారు చూసి మావాడు చిద్విలాసంగా నవ్వాడు. కొద్దిసేపటికి అసలు రహస్యం చెప్పాడు.

'మనం తెలివైన వాళ్ళం. ఆ విషయం నీకూ నాకూ తెలుసు. కానీ ఎదుటి వాడికి ఎలా తెలుస్తుంది? మన గొప్ప మనమే చెప్పుకోలేం గదా! ఆ పని ఈ పుస్తకాలు చేస్తాయి.' అన్నాడు.

'నిజవే! కానీ ఇవి చదవాలంటే కష్టం కదా?' అన్నాను.

'ఓరి అమాయకుడా! ఇవి చదవడానికి కాదు. ఎదుటి వాణ్ని భయపెట్టడానికి. రూములో టేబుల్, టీపాయిల్లాగా ఈ పుస్తకాలూ ఫర్నిచర్లో భాగవే!' అన్నాడు.

దుర్మార్గుడు! పుస్తకం హస్త భూషణం అన్నారు పెద్దలు. వీడు పుస్తకాన్నిరూముకే భూషణంగా మార్చాడు.

కేస్ నంబర్ 4. పుస్తకాలు చేసిన పెళ్లి!


అతను నా జూనియర్. ఓ రోజు హడావుడిగా వచ్చాడు.

"గురూ గారు! మీ ఇంగ్లీష్ నవల్స్ ఓ రెండ్రోజులు అప్పివ్వాలి."

"అన్నీ ఒక్కసారిగా ఎందుకు! ఒకటొకటిగా తీసుకెళ్ళి చదువుకో."

"భలేవారే! అవన్నీ చదవడానికి నాకు పనీపాటా లేదనుకున్నారా! నాకు అమెరికా సంబంధం వచ్చింది. పిల్ల US సిటిజన్. పెళ్లివారు రేపు మా ఇంటికి వస్తున్నారు. నా దగ్గర మన్లెవలుకి తగ్గట్లుగా మధుబాబు, మల్లాది నవల్స్ ఉన్నాయి. నిన్నవన్నీ కట్టగట్టి అటక మీద పడేశాను. ఇప్పుడు మీరిచ్చే ఇంగ్లీషు పుస్తకాలు అద్దాల బీరువాలో నీటుగా సర్దాలి. పెళ్లి వాళ్ళ దగ్గర మార్కులు కొట్టెయ్యాలి." అన్నాడు.

"అన్నీ ఇంగ్లీషు పుస్తకాలైతే నమ్మరేమో! అంచేత పన్లో పని.. రావిశాస్త్రిని కూడా తీసుకెళ్ళు."

"రావిశాస్త్రా! ఎవరాయన?"

"ఆయన తెలుగు సాహిత్యవనంలో రావి వృక్షం వంటివాడు."

"వామ్మో! నాకు వృక్షాలు వద్దు. పుస్తకాలు చాలు. అయినా ఆ అమెరికా వాళ్ళ ముందు నేను తెలుగు పుస్తకాలు చదువుతున్నట్లు కనిపించకూడదు. చీప్ గా ఉంటుంది." అన్నాడు.

నా ఇంగ్లీషు నవల్స్ అట్టపెట్టెలో తీసుకెళ్ళాడు. ప్లాన్ విజయవంతంగా అమలు చేశాడు. అదే అట్టపెట్టెలో జాగ్రత్తగా పుస్తకాలు తీసుకొచ్చి థాంక్సులు తెలిపి వెళ్ళాడు. ఒక్క పుస్తకం కూడా మిస్సవ్వలేదు! పుస్తకాలు చదివేవాడైతే పుస్తకాలు కొట్టేస్తాడు గానీ.. చదవనివాడు నిజాయితీగా తిరిగిచ్చేస్తాడన్న సత్యం బోధపడింది. ఇప్పుడతను అమెరికాలో ఓ పెద్ద డాక్టరు. ఆ విధంగా పుస్తకాల వల్ల పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకోవచ్చని నిరూపించిన మేధావి.

ఇన్ఫరెన్స్ :-


అటు తరవాత పుస్తక ప్రియుల్ని రెండు రకాలుగా విభజించుకున్నాను. మొదటిరకం పుస్తకాలు కొంటారు. లేదా సంపాదిస్తారు. కానీ చదవరు. వారికి పుస్తకాలు కేవలం అలంకార ప్రాయం. స్టేటస్ సింబల్.

రెండోరకం వాళ్ళు పుస్తకాలు చదువుతారు. కొని చదువుతారా, కొనకుండా చదువుతారా సెకండరీ.. మొత్తానికి చదువుతారు. కానీ చదివినట్లు కనపడరు. వారి దగ్గర పుస్తక వాతావరణం కూడా ఉండదు. ISI ఏజంట్ల వలె గుంభనంగా ఉంటారు.

డిస్కషన్ (చర్చ) :-


ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ విషయంకి వద్దాం. పార్టీని గానీ, ప్రభుత్వాన్ని గానీ నడపడానికి ఆ పుస్తకాల అవసరం ఉందా? ఉండదని నా అభిప్రాయం.

'రాహుల్ ని ప్రధాని పదవికి ఒప్పించుట ఎలా? కరుణ లేని కరుణానిధి కరుణా కటాక్షములు తిరిగి సంపాదించుట ఎలా? మూలాయం మూలములేమి? మమత మమతానురాగములను ఏ విధమున పొందవలయును? మాయావతిని మాయలో పడవేయుట ఎట్లు?'

ఈ ప్రశ్నలకి సమాధానాలు ఆ పుస్తకాల్లో ఉండవు. ఆ సమాధానాల్లేని పుస్తకాలతో కాంగ్రెస్ పార్టీకి పన్లేదు. మరైతే అన్నేసి పుస్తకాలు ఆ పార్టీ మీటింగ్ హాల్లో ఎందుకు?!

మన మైండ్ అనేక విషయాలకి ట్యూన్ అయిపోయి ఉంటుంది. రోజువారి పనులకి అనుగుణంగా అనేక ప్రతీకలు మెదడు రిజిస్టర్లో ముద్రించుకుని ఉంటాయి. వాటిననుసరించి యాంత్రికంగా బ్రతికేస్తుంటాం. తేడా వస్తే మెదడులో రిజిస్టర్ ఒప్పుకోదు.

ఉదాహరణకి కాఫీ హోటల్లో గుడి గంట ఉందనుకోండి. కాఫీ పట్ల అనుమానం కలుగుతుంది. అదే విధంగా గుళ్ళో ప్రసాదంగా ఉప్మా పెసరట్టు పెడితే.. ఆ దేవుడి మహిమ పట్ల లేనిపోని అనుమానాలొస్తాయి. అంటే మనకి తెలీకుండానే.. ఒక గదిలో సామాను సర్దినట్లుగా.. మెదడులో రొటీన్ సమాచారం స్టోర్ అయి ఉంటుంది. అందుకే కొద్దిగా తేడా వచ్చినా బుర్రలో తికమక!

కంక్లూజన్ (ముగింపు) :-


అంచేత.. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ హాల్లో బీరువాలు, వాటి నిండా పుస్తకాలు ఉండటం చాలా సబబు. వెనకాల ఆ బీరువాలు, పుస్తకాల ఉండటం మూలానే వాళ్ళంతా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లుగా ఉంది. అవే లేకపోతే వాళ్ళు మేధోమధనం చేస్తున్నట్లుగా ఉండదు. మసాలా దోశలు ఆర్డరిచ్చి.. తినడం కోసం ఆశగా, ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది.

అప్పుడు దేశ ప్రజలకి కోపం వస్తుంది. పిమ్మట ప్రభుత్వాలు పడిపోతాయి. అలా జరగకుండా ఉండాలనే ఆ హాలు నిండా బీరువాలు, పుస్తకాలు ఉంచి.. పార్టీలు, ప్రభుత్వాలు ప్రజాక్షేమం గూర్చి సీరియస్ గా 'ఆలోచిస్తున్న' వాతావరణం కల్పిస్తుంటాయి. చూశారా! బీరువాలకి.. బీరువాల్లో పుస్తకాలకి ఉన్న పవర్!

చివరి తోక.. 

'అవునురే! పుస్తకాల బీరువాల గూర్చి ఇన్ని ఎదవ ఆలోచనలు రాశావు గదా! ఇంతకీ నువ్వే జాతి?'

'అదేందన్నా! ఇదంతా ఎలా రాశాననుకున్నావ్? ఒకప్పుడు నేను పుస్తకాలు చదివేవాణ్ని. ఇప్పుడు పుస్తకాలు కొని బీరువాల్లో 'దాచుకుంటున్నాను'. దొంగతనాల గూర్చి దొంగే చక్కగా రాయగలడు. ఆ మాత్రం తెలీదా!'


(photos courtesy : Google)

Friday, 8 June 2012

అమ్మా! నువ్వు కూడానా!?


"కన్నా! నీ కోసం మన వి.హనుమంతరావు దగ్గరుండి మరీ చేయించాడు, హైదరాబాదు నుండి ప్రత్యేక విమానంలో తెప్పించాను." అంటూ ఘుమఘుమలాడుతున్న హైదరాబాద్ బిరియానిని ప్రేమతో రాహుల్ గాంధీకి వడ్డించబోయింది సోనియా గాంధి.

మొహం చిట్లించాడు రాహులుడు.

"అమ్మా! బిరియాని నాకొద్దు, ఆ హైదరాబాదు పేరు వింటే చీమలు పాకినట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ నాయకులంటేనే నాకు ఎలెర్జీ!" అన్నాడు.

ఆశ్చర్యపోయింది సోనియా.

"అదేంటి కన్నా! తరతరాలుగా మన కుటుంబసేవలో తరించిపోతున్నారు ఆంధ్రానాయకులు. వాళ్ళు విశ్వాసానికి, వినయానికి మారుపేరు. ఏం? ఈ మధ్య నువ్వు కనపడినప్పుడల్లా పొర్లిగింతల దండాలు పెట్టటం తగ్గించారా? మరేం పర్లేదు. వయలార్ రవితో చెబుతాను. కావాలంటే రోజల్లా గుంజిళ్ళు తీయించుకో, గోడకుర్చి వేయించుకో." ఆనునయంగా అంది సోనియా.

"వాళ్ళు నన్ను ఉపఎన్నికల ప్రచారానికి రమ్మంటున్నారమ్మా!" కోపంగా అన్నాడు రాహుల్.

అర్ధమయ్యిందన్నట్లు తల పంకించింది సోనియా.

"నాకు తెలుసు, ఎండలు మండిపోతున్నాయి, నువ్వు తట్టుకోలేవు. అయినా నీవంటి గొప్ప దేశనాయకుణ్ణి ఉపఎన్నికల ప్రచారానికి పిలవటానికి వాళ్ళకసలు బుద్ధుందా? ఇదంతా ఆ గులాం నబి నిర్వాకం. నువ్వు సీరియస్ గా తీసుకోకు కన్నా!" అంది సోనియా.

"అమ్మా! నన్ను ప్రచారానికి రమ్మంటుంది మన పార్టీవాళ్ళు కాదు, జగన్ పార్టీవాళ్ళు. వాళ్ళకి తమ గెలుపు మీద డౌటుగా ఉందిట. నేవెళ్తే మన కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా డిపాజిట్లు కూడా రావన్నది వారి నమ్మకమట!" పళ్ళు పటపటా నూరాడు రాహుల్.

సోనియాకి కూడా కోపం వచ్చింది.

"ఎంత పొగరు. ఇప్పుడే అహ్మద్ పటేల్ కి పురమాయిస్తాను. చిదంబరంతో చెప్పి జగన్ మీద ఇంకో రెండొందల కేసులు వేయిద్దాం, బెయిల్ వచ్చేప్పటికి ముసలాడయిపోతాడు. తిక్క కుదుర్తుంది వెధవకి!" కసిగా అంది.

రాహుల్ ఒక్కక్షణం ఆలోచించాడు. అప్పటికప్పుడే ఒక స్థిరనిర్ణయానికొచ్చేశాడు.

"ఇంక ఊరుకుని లాభం లేదమ్మా! నేనిప్పుడే ఉపఎన్నికల ప్రచారం కోసం ఆంధ్రా వెళ్తున్నాను. జగన్ పార్టీవాళ్ళకి బుద్ధొచ్చేలా ప్రచారం నిర్వహిస్తాను." అన్నాడు.

సోనియా గాంధి కంగారుపడింది, ఆందోళన చెందింది, భయపడిపోయింది, తెల్లని మొహం నిండా చిరుచెమటలు!

"కన్నా! వద్దు, వద్దు. నువ్వంత కఠోరనిర్ణయాలు తీసుకోకు. ఇప్పటికే మన పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, ఈ సమయంలో నువ్వెళ్ళావంటే మొదటికే మోసం.. " అని సోనియా అంటూండగా..

'దబ్బు'మన్న శబ్దం!

రాహుల్  గాంధీ డైనింగ్ టేబుల్ మీద నుండి కింద పడిపోయాడు. దొర్లుతూ, వెక్కివెక్కి ఏడుస్తూ అన్నాడు.

"అమ్మా! నువ్వు కూడానా!!"

(photo courtesy : Google)

Wednesday, 14 March 2012

రాహులుని రోదన

అది టెన్ జన్‌పథ్. విశాలమైన ఇల్లు, పొడవాటి వరండా. చిన్నబాబు రాహుల్ గాంధి సీరియస్‌గా వున్నాడు. కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయ్. వరండాలో రాజ్యసభ సభ్యత్వం అడుక్కోడానికి వచ్చిన లీడర్లు గొడవారా వేసున్న చెక్కబల్లల మీద కునికిపాట్లు పడుతున్నారు. రాహుల్ బాబుని చూసి, ఒక్కసారిగా ఉలిక్కిపడి, తొట్రుపడుతూ గబుక్కున నించొని, వొంగొంగి నమస్కారాలు చేశారు. రాహులుడు వారిని కన్నెత్తి కూడా చూళ్ళేదు.

గదులన్నీ దాటుకుంటూ సరాసరి తల్లి బెడ్రూంలోకి వెళ్ళాడు. సోనియా గాంధి మంచం మీద దుప్పటి కప్పుకుని పడుకుని ఉంది. కొడుకు వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచింది.

"రా నాన్నా రా! ఇలావచ్చి నాపక్కన కూర్చో!" అంటూ ఆప్యాయంగా పిలిచింది.

రాహులుడు తల్లి పక్కన కూర్చున్నాడు. దిగులుగా ఉన్న కొడుకుని చూసి కంగారుపడింది సోనియా.

"ఎలక్షన్లలో ఓడిపోవడం బాధగానే ఉంటుంది కన్నా! గడ్డం చేయించుకొమ్మంటినే. అసలే ఎండాకాలం, దురద పెడుతుంది నాయనా." నీరసంగా అంది సోనియా.

రాహుల్ ఒక్కసారిగా చిన్నపిల్లాళ్ళా భోరున యేడవడం మొదలెట్టాడు! 

సోనియా భయపడిపోయింది. కొంపదీసి రాహుల్ని గర్ల్ ఫ్రెండ్ కూడా వదిలేసిందా ఏమిటి! 

కొద్దిసేపటికి తేరుకున్నాడు రాహుల్, కర్చీఫ్‌తో కళ్ళు తుడుచుకున్నాడు.

"అమ్మా! మనం మన ఇటలీ వెళ్లిపోదాం, ఈ దేశంలో ఉండొద్దు." ఏడుపు గొంతుతో అన్నాడు.

"ఏమైంది నాన్నా!" కన్నతల్లి తల్లడిల్లిపోయింది.

రాహుల్ గాంధి జేబులోంచి సెల్ ఫోన్ తీశాడు.

"పొద్దున్నించి వొకటే మెసేజిలు, చూళ్ళేక చస్తున్నా!" అంటూ ఫోన్లో మెసెజిలు తల్లికి చూపించాడు.

"విషయం ఏంటి బంగారం!" అయోమయంగా అడిగింది సోనియమ్మ.

"కంగ్రాట్స్ రాహుల్. ఎ కరెక్ట్ డెసిషన్ ఎట్ కరెక్ట్ టైం. వి ఆర్ ఎరేంజింగ్ ఎ ఫేర్ వెల్ పార్టీ టు యు." అన్న మెసేజ్‌ని తల్లికి చూపించాడు రాహుల్.

"ఎవరికో పంపాల్సిన మెసేజ్ పొరబాటున నీకు పంపారు కన్నా! డోంట్ వర్రీ." ధైర్యం చెప్పింది సోనియా.

"నా ఏడుపూ అదేనమ్మా! రిటైర్ అయ్యింది క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. జనాలేమో నేను రిటైరయ్యాననుకుని పండగ చేసుకుంటున్నారు! నా రిటైర్మెంటుని స్వాగతిస్తూ వేలకొద్ది మెసేజ్‌లు వస్తున్నాయమ్మా. మొదట్లో నేనూ పొరబాటున పంపుతున్నారనుకున్నాను, కానీ కాదు. రాహుల్ అంటే నేనేననుకుని ప్రజలు నా రిటైర్మెంటునే స్వాగతిస్తూ పండగ చేసుకుంటున్నారు!" మళ్ళీ బావురుమన్నాడు రాహుల్ గాంధి.

సోనియాకి రాహుల్ని ఎలా ఓదార్చాలో తెలీక అయోమయంగా చూస్తుండిపోయింది!

Monday, 27 June 2011

నాకు నచ్చిన విద్వాంసుడు


సితార్ రవిశంకర్, వీణ చిట్టిబాబు, ఈమని శంకరశాస్త్రి, షెహనాయ్ బిస్మిల్లాఖాన్ వంటి సంగీత విద్వాంసుల గూర్చి విన్నాను, కానీ వారినెప్పుడూ విన్లేదు. వీరంతా గొప్ప ప్రతిభావంతులని అందరూ అంటుంటారు కాబట్టి నేనూ అర్జంటుగా ఒప్పేసుకుంటున్నాను. అయితే నేనిప్పుడు రాయబోతున్న వ్యక్తి వేరు !

పూర్వపు నలుపు తెలుపు టీవీ రోజులు గుర్తున్నాయా? ఆ రోజుల్లోనే ఇందిరాగాంధి చనిపోయింది. వారం రోజులు సంతాపం. వినోద కార్యక్రమాలన్నీ రద్దు చేయగా - వయొలిన్ ప్రోగ్రాం ఒక్కటే వచ్చేది. ఆ వయొలిన్ వాద్యగాడు నల్లగా, పొట్టిగా ఉండే ఓ మధ్యవయసు ఆసామి. పొట్టి పంచెతో, నలిగిన కుర్తాతో, మాసిన గడ్డంతో - ఒక మహానాయకురాలు చనిపోయిన దేశంలో రోదనకి ప్రతీకగా ఉండేవాడు.

దించిన తల ఎత్తకుండా 'కువూయి, కువూయి' అంటూ తన ఏడుపుగొట్టు వయొలిన్ వాయిద్యాన్ని గంటలకొద్దీ వాయించేవాడు. అప్పుడప్పుడు 'చాలా? ఇంకా వాయించనా?' అన్నట్లు పక్కకి ఎవరికేసో చూస్తుండేవాడు. వార్తలు మొదలయ్యే సమయానికి హఠాత్తుగా వాయింపుడు ఆపేసి, వయొలిన్ పక్కన పెట్టేసి, రెండు చేతులు జోడించి 'నమస్కార్' అని చెప్పేవాడు. 

ఆయన నమస్కారం నాకు అనేకవిధాలుగా గోచరించేది. 'అమ్మయ్య! ఇవ్వాళ నాకు బియ్యానికి డబ్బులొచ్చేసాయ్!' అని ఆనందపడుతున్నవాడిగానూ, 'నాకు మళ్ళీ ఈ సంతాప కచేరీ అవకాశం ఎప్పుడొస్తుందోగదా!' అని ఆశ పడుతున్నవాడిలాగానూ అనిపించేది. ఆరోజుల్లో దూరదర్శన్ వారు అన్ని సంతాపాలకి ఆయన్నే పిలిచేవాళ్ళనుకుంటాను. ఒక దేశ పేదరికాన్నీ, దైన్యాన్నీ -  మొహంలోనూ, వాయింపుడులోనూ అంత తీవ్రంగా వ్యక్తీకరించడం అనితరసాధ్యం! 

పిమ్మట ఆయన రాజీవ్ గాంధి సంతాపదినాల్లోనూ దూరదర్శన్ని ఏలాడు. క్రమేణా కాంగ్రెస్ వాళ్ళకి అనుమానం వచ్చింది. 'సంతాప వాయింపుడు అవకాశాల కోసం ఈ వయొలిన్ విద్వాంసుడు పూజలూ గట్రా చేస్తున్నాడా?!' అని. ఈ లెక్కన తమ కాంగ్రెసు పార్టీకి దేశనాయకుడెవడూ మిగలడని ఒక నిర్ణయానికొచ్చిన కాంగ్రెస్సోళ్ళు ఆయన్ని పక్కన పెట్టేశారు. 

వయొలిన్ విద్వాంసులవారికి మళ్ళీ అవకాశం రాకపోడానికి ఒక బలమైన కారణం వుందని మా గోపరాజు రవి చెబుతాడు. ఆయన సోనియాగాంధి దగ్గరకి పోయి 'నమస్కార్!' అని ఒక నమస్కార బాణం వదిలి - 'అమ్మా! మీ అత్తగారికి నేనే వాయించాను. మీ ఆయనకి నేనే వాయించాను. మీకు కూడా నేనే వాయించే అవకాశం కలిపించండమ్మా!' అని వేడుకున్నాట్ట!

చివరాకరకి నే చెప్పొచ్చేదేమనగా - ఆవిధంగా నా అభిమాన విద్వాంసులవారు టీవీ (తెర) మరుగయ్యారు. సంతాపాలకి రోజులు కాకుండా పొయ్యాయి. కాంగ్రెస్సోళ్ళు 'అమ్మయ్య' అని ఊపిరి పీల్చుకున్నారు.  

(picture courtesy : Google)  

Sunday, 26 June 2011

ప్రణవ్ ముఖర్జీ జీడిపప్పుల కధ


సోనియా గాంధీ కొలువు తీరింది. అదే - కాంగ్రెస్ పార్టీ 'కోర్ కమిటీ' మీటింగ్ జరుగుతుంది. ప్రణవ్ ముఖర్జీ నేతిలో వేయించిన జీడిపప్పుని నోరు కదపకుండా చప్పరిస్తున్నాడు. ఆంటోని కూనికిపాట్లు పడుతున్నాడు. మొయిలీ దొంగచూపులు చూస్తున్నాడు. చిదంబరం సోడాబుడ్డి కళ్ళద్దాల్లోంచి శూన్యంలోకి చూస్తున్నాడు. అక్కడందరూ మీటింగ్ ఎప్పుడయిపోతుందాని ఎదురు చూస్తున్నట్లుగా వున్నారు. మరైతే అప్పుడీ మీటింగెందుకు? ఏలినవారు ఇట్లాంటి హంగామా చెయ్యటం మహాభారతం రోజుల్నుండీ ఆనవాయితీగా వస్తుంది.
               
దుర్యోధనుడు కూడా ఇట్లాగే చాలా కోర్ కమిటీ మీటింగులు పెట్టేవాడు. బోల్డంత జీతాలు తీసుకుంటున్న భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వంటి గడ్డం మేధావులు రారాజుకి మంచిసలహాలు ఇవ్వొచ్చు. "మై డియర్ దుర్యోదనా! ఎంతసేపూ ఆ ద్రౌపదిని నీ తొడమీద కూర్చోపెట్టుకోవాలనీ, బట్టలిప్పించాలనే వెకిలి ఆలోచనలు మానుకో. అసలు నీ పాండవుల obsession వదుల్చుకో. నువ్వు ఈ దేశాధినేతవి. ప్రజారక్షకుడిగా, జనరంజకంగా పాలించవోయి, అది నీ విధి." అని మాత్రం చెప్పరు.     
               
ఎందుకు? ఎందుకంటే - ఈ ముసలి సలహాదారులు పెద్ద అవకాశవాదులు. 'ఏం చెపితే ఏమవుతుందో! ఈరాజుగాడు ఎట్లా పోతే మనకేంటి? మనకి జీతం, గీతం బాగానే గిట్టుబాటవుతుందిగదా. అయినా ఈ దరిద్ర దుర్యోధనుడు శకుని మాటైతే వింటాడుగానీ మన మాటెందుకు వింటాడు? చచ్చినా వినడు. వీడు గనక యుద్ధంలో భీముడు చేతిలో చస్తే ధర్మరాజు కొలువులో చేరాలి. ఇంకొంచెం జీతం పెంచమని పైరవీలు చేసుకోవాలి.' అని మనసులో జీతభత్యాలు లెక్కలేసుకుంటూ - కనీసం చెప్పే ప్రయత్నం కూడా చెయ్యరు . 

ఇప్పుడు మీకు ఈ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ మీటింగుల కధాకమామీషు అర్దమైందికదూ! ప్రణబ్ ముఖర్జీ జీడిపప్పులు తినడం మాని - "దొరసానమ్మా! ధరలు తగ్గించు, సామాన్యజనం ఆకలిచావులు చచ్చేట్లున్నారు. కాశ్మీర్ సంగతేం చేద్దాం? పొద్దస్తమానం నీ కొడుకుని ప్రధానమంత్రిని చెయ్యాలనే తాపత్రయం తగ్గించుకో  తల్లీ! భాజాపా గూర్చి బుర్రబద్దలు కొట్టుకోకు. ప్రజలకి నువ్వు మంచి చేస్తే ప్రజలే భాజాపాని పక్కన పెడతారు." అని వాస్తవాలు మాట్లాడడు. ఎందుకంటే ప్రణవ్ ముఖర్జీ బ్రతక నేర్చినవాడు. 

మరి ఏం ఆలోచిస్తుంటాడు? 'ఈ పిచ్చిది మనం ఎంతచెప్పినా తనకొడుకు రాహుల్ గాంధీ చెప్పినట్లే చేస్తుంది. అందుకే నోరు మూసుకుని హాయిగా ఇంకొంచెం జీడిపప్పు తిందాం. ఎట్లాగూ రేపు భాజాపా గవర్నమెంట్ వస్తే నా దొంగసొత్తు బయటకి రాకుండా అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌లతో బేరం కుదుర్చుకున్నా. కాబట్టి నేను సేఫ్. తేడాలొస్తే ఈ సోనియా, దీని కొడుకే శంకరగిరిమాన్యాలు పడతారు. నాకెందుకొచ్చిన ఆయాసం.' అని ఆలొచిస్తుంటాడు!

(pictures courtesy : Google)