Sunday 25 December 2011

రెండుకళ్ళ సమాజం

ఈరోజు సుబ్బు ఇంకా రాలేదు. హాస్పిటల్లో ఒక్కోకేసు నిదానంగా చూస్తున్నాను. కొద్దిసేపటి క్రితం సూసైడ్ ఎటెమ్ట్ చేసిన ఒకావిడ కేసు చూశాను, ఆవిడ భర్త ధోరణికి విసుగేసింది. మనసేం బాగుండలేదు. కేసులేవీ చూడాలనిపించట్లేదు. ఈ సుబ్బు ఎక్కడ చచ్చాడో, తొందరగా వస్తే బాగుణ్ణు. సుబ్బుతో కప్పుడు కాఫీ కబుర్లు చెప్పుకుంటే గానీ రిలీఫ్‌గా వుండేట్లు లేదు.

"మిత్రమా! కాఫీ, అర్జంట్." అంటూ సుడిగాలిలా లోపలకొచ్చాడు సుబ్బు.

అమ్మయ్యా! సుబ్బు వచ్చేశాడు. 

డల్‌గా వున్న నన్ను చూసి ఆందోళనగా "ఏంటలా ఉన్నావ్! ఒంట్లో బాలేదా?" అడిగాడు సుబ్బు. 

"ఒంట్లో బాగానే ఉంది, మనసే బాలేదు. ఇప్పుడే ఒక కేసు చూశాను. ఒక దరిద్రుడు ఇంకో స్త్రీ మోజులో పడి భార్యని హింసిస్తున్నాడు. పాపం ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. రాన్రాను సమాజం ఇంత నికృష్టంగా తయారవుతుందేమిటి సుబ్బూ!" బాధగా అన్నాను.

"ఓస్ ఇంతేనా! నీ ఖాతాలో ఇంకో కొత్తకేసు, కంగ్రాట్స్!" నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! ప్లీజ్. నీ క్రూడ్ హ్యూమర్ కట్టిపెట్టవా." చికాగ్గా అన్నాను.

సుబ్బు ఒకక్షణం ఆలోచించాడు.

"మిత్రమా! ప్రతిమనిషీ తనకితాను 'నేనెవర్ని? నాకేం కావాలి?' అని ప్రశ్నించుకోవాలి. కన్ఫ్యూజన్ వుండరాదు. నువ్వు వృత్తిరీత్యా మానసిక వైద్యుడవు. మానసిక రోగాన్ని పోగొట్టటానికి డబ్బు తీసుకుని వైద్యం చేస్తావు. నువ్వేమీ సమాజసేవ చెయ్యట్లేదు. ఎక్కువ కేసులొస్తే ఎక్కువ సంపాదిస్తావు. నీ రోగులేమీ ఆకాశంలోంచి వూడిపడరు. అందువల్ల సమాజంలో ఎక్కువమందికి మానసిక రోగాలు రావాలని కోరుకోవాలి, అది నీ వృత్తిధర్మం." అన్నాడు సుబ్బు. 

"అయితే?" అడిగాను.  

"కావున పరాయి స్త్రీ మోజులో పడ్డ నీ పేషంట్ భర్త నీకు మిత్రుడే కానీ శత్రువు కాదు. అతని వల్లనే ఇవ్వాళ నీకో కొత్తకేసు వచ్చిందని గుర్తుంచుకో. సాధ్యమైనన్ని ఎక్కువ జంటల్లో తగాదాలు రావాలని కొరుకో. మంచి ర్యాంకుల కోసం పిల్లలు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడాలని కోరుకో. అప్పుడే నీ ప్రాక్టీస్ మూడుపువ్వులు ఆరుకాయలుగా వుంటుంది."

ఇంతలో వేడి కాఫీ పొగలు గక్కుతూ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ మళ్ళీ చెప్పసాగాడు సుబ్బు.

"ప్రపంచంలో ఏ దేశమైనా ఆరోగ్యంగా, ప్రశాంతంగా కళకళలాడుతూ వుందనుకో. అప్పుడు కొన్ని వృత్తులు మట్టికొట్టుకుపోతాయి. రోగాల్లేవు కాబట్టి హాస్పిటల్ వ్యాపారాలు దివాళా తీస్తాయి, అక్కడ పన్జేసే డాక్టర్లు నిరుద్యోగులైపోతారు. నేరాలు, ఘోరాలు లేకపోతే పోలీసులకి పనుండదు. లిటిగేషన్లే ప్లీడర్లకి జీవనాధారం." అన్నాడు సుబ్బు. 

"అవును." అన్నాను.

"సమస్యలు లేని సమాజం కావాలని కోరుకోవాల్సింది రాజకీయ వ్యవస్థ. ఆ విషయాన్ని వాళ్ళే నొక్కి వక్కాణిస్తుంటారు. వాస్తవానికి వారికి సమస్యలంటే చాలా ఇష్టం. వారి ప్రయోజనాల కోసం నిరుద్యోగం ఉండాలి, రైతుల ఆర్తనాదాలు ఉండాలి, ఆకలి చావులుండాలి. అప్పుడు మాత్రమే వారికి గిట్టుబాటు." అంటూ ఆగాడు సుబ్బు. 

"సుబ్బు! నువ్వు దారుణంగా మాట్లాడుతున్నావ్. నీ లెక్కప్రకారం నేను సమాజహితం గూర్చి మాట్లాడరాదు - conflict of interest వుంది కాబట్టి, అంతేనా?" అన్నాను.

"ఎందుకు మాట్లాడరాదు? భేషుగ్గా మాట్లాడొచ్చు. ఇట్లాంటి సమయాల్లో మనం రెండుకళ్ళ సిద్ధాంతాన్ని అరువు తెచ్చుకోవాలి. నీకు వృత్తి, ప్రవృత్తి అనేవి రెండుకళ్ళు! ఆస్పత్రిలో ఉన్నంతసేపూ డాక్టరువి కాబట్టి వృత్తిధర్మాన్ని అనుసరించి మానసిక రోగాలు ఎక్కువైపోవాలని కోరుకోవాలి. సమాజానికి హితం నీకు అహితం, తప్పు లేదు. ఇదే నీ మొదటి కన్ను." అన్నాడు సుబ్బు. 

"మరి రెండో కన్ను?" ఆసక్తిగా అడిగాను.  

"ఆస్పత్రి గుమ్మం దాటి బయటకి పోంగాన్లే మొదటి కన్ను మూసెయ్యి, రెండో కన్ను తెరువు. అనగా - నీ వృత్తిని సంచీలో పడేసి, ప్రవృత్తిని బయటకి తియ్యి. గుండెల నిండా గర్వంగా గాలి పీల్చుకో. ఇప్పుడు నువ్వు ఈ దేశం పట్ల భాధ్యత కలిగిన భీభత్సమైన పౌరుడివి. సమాజహితమే నీ లక్ష్యం, సమాజోన్నతే నీ ధ్యేయం. మెరుగైన సమాజం కోసం ఒక టీవీ ఛానెల్ సాక్షిగా చాలామంది తీవ్రంగా పరిశ్రమిమిస్తున్నారు, వారితోపాటు నువ్వూ నడుం కట్టు. ఆ టీవీల్లో కనిపించి నీతులు చెప్పేవాళ్ళకన్నా నువ్వేం తీసిపొయ్యావు? ఇది నీ రెండోకన్ను." అన్నాడు సుబ్బు. 

"ఇంటరెస్టింగ్" అన్నాను. 

"ఈ రెండుకళ్ళు నీవే. నీకు ఈ రెండు కళ్ళూ ముఖ్యమే. పరస్పర విరుద్ధమైన రెండు లక్ష్యాలు కలిగి వుండటం, రెండుకళ్ళు కలిగి వుండటంతో సమానం! అర్ధమైందా?" అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"ఏంటో సుబ్బూ! నీకు ప్రతిదీ ఎగతాళే. నా బాధని అర్ధం చేసుకోవు, నీ ధోరణి నీదే." భారంగా నిట్టూర్చాను.

"నీబాధ నేనెప్పుడో అర్ధం చేసుకున్నాను. రావిశాస్త్రి రాశాడు గదా - డాక్టర్లు, ప్లీడర్లు అడవిలో పులికన్నా అదృష్టవంతులు. పులి ఆహారాన్ని వెదుక్కుంటూ అడవంతా తిరుగుతుంది. మీకు మాత్రం ఆహారమే మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తుంది. మీరు ఆ ఆహారాన్ని తృప్తిగా భోంచేసి, 'బ్రేవ్'మంటూ త్రేన్పుతూ, మాగన్నునిద్ర ముంచుకొస్తుండగా, ఆవలిస్తూ, బద్దకంగా - అహింస గూర్చి, వేదాల గూర్చి, భాషాపరిరక్షణ గూర్చి, అవినీతి గూర్చి, సమసమాజం గూర్చి ఉపన్యసిస్తుంటారు." అంటూ టైం చూసుకుంటూ లేచాడు సుబ్బు. 

"ఓ! నువ్వా రూట్లో వచ్చావా!" నవ్వుతూ అన్నాను.  

"ఇవ్వాళ మీడియాలో కడుపు నిండిన (నింపుకున్న) మేధావులకి మంచి గిరాకి ఉంది. వాస్తవమేమంటే - మీరు మీ తిండి కొద్దిగా తగ్గించుకుంటే దానికన్నా మించిన సమాజసేవ లేదు. కానీ పొరబాటున కూడా మీరలా చెయ్యరు. నే వెళ్తున్నా మై డియర్ కడుపు నిండిన మేధావీ!" అంటూ హడావుడిగా నిష్క్రమించాడు మా సుబ్బు. 

14 comments:

  1. ఈ మారు సుబ్బు మిమ్మల్నే ఏకేసాడు! ఇది సీరియస్ టపా. కాబట్టి నా అంచనా జనాలు లైట్ గా తీసుకుంటారు. ఏమంటారు. మీరు సరదాగా రాసిన సప్త పది పడి పడి పదిగారాలు పోయింది! సో చూస్తాం ఏమవుతుందో దీని కథ!
    సరదాకి మీరు ఈ కామెంటుని కాస్త సేపు ప్రచురించకుండా వెయిట్ చేసి చూడవచ్చు. నా అంచనా రైటో కాదో తేలవడానికి!!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  2. *ఒక దరిద్రుడు పరాయి స్త్రీ మోజులో పడి భార్యని హింసిస్తున్నాడు. పాపం ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసింది.*

    డాక్టర్ గారు సానా పాత రోజుల్లో ఉన్నారు. ఇంకా పరాయి స్రీ మోజులో పడ్డ మగవారి గురించి రాస్తున్నారు. ఇప్పుడు పరాయి పురుషుని మొజులో పడ్డ స్రీల ను సమర్దవంతా గా వేనకేసుకు వస్తూ తెలుగులో నవలలు రాస్తున్నారు. మీరు ప్రస్తుత ట్రెండ్ ను గమనించకుండా 1970-80ల కాలం నాటి విలువలతో టపాలు రాస్తున్నారు. చూడబోతే బొత్తిగా డబ్బులు లేని, దిగువ మధ్యతరగతి పేషంట్స్ ను మీరు చూస్తున్నట్లు ఉన్నారు. దిగువ మధ్యతరగతి గురించి బ్లగులోకంలో ఎవరు పెద్దగా పట్టించుకోరు. బ్లాగుల్లో ఎక్కువగా రాసేది, చదివేది ఎగువ మధ్యతరగతివారు. త్వరగా కొ.కు. , రావిశాస్త్రిగారి ప్రభావం నుంచి బయటపడి, ట్రేండ్ కనుగుణంగా టపాలు రాస్తూ పేరు,ప్రఖ్యాతులు సంపాదించుకొండి. మీరు వారిని మరచిపోలేను అనుకొంటే ఎప్పుడైనా ఒకటపా వారి భావాలతో రాయండి. అప్పుడు చదివే వారు కూడా తమ పాత రోజులను గుర్తుకు చేసుకొని ఆనందిస్తారు.


    ప్రస్తుత ట్రెండ్ మీకు ఎక్లా ఉందో తెలుసుకోవటానికి ఈ క్రింది నవల చదివేది.

    ప్రేమ-పెళ్ళి ..... ఒక తన్హాయి!
    http://kalpanarentala.blogspot.com/

    ఇక మీరు చెప్పాలను కొన్నది అర్థమైంది. సమాజం ఎంత బ్రష్ట్టు పడితే అంత వ్యాపారం అభివృద్ది జరిగి, అవి కొనసాగే కొద్ది, అందరికి ఉద్యోగాలు వస్తాయి, అవి నిలుస్తాయి అని.
    Sri

    ReplyDelete
  3. మీ సుబ్బు సలహా విని ఇలాంటి టపాలు వ్రాయడం మానేస్తారా?
    కొంచెం 'ఘాటు' తగ్గించి వ్రాయడం మంచిదేమో ఆలోచించండి.

    ReplyDelete
  4. చాలా బాగున్నది. నాకు తెలియక ఇప్పటివరకు రెండు కళ్ళు ఒకే సారి తెరవటం, మూయటం చేసి చాలా నస్ఠపోయాను. ఇప్పుడర్ధమయినది. ఇక చూసుకో మీ సుబ్బు సుభాషితంతో ఇదిగో "ఇప్పటినుండే" నేను మారుతున్నాను........

    ReplyDelete
  5. పుచ్చా25 December 2011 at 20:02

    second one first:
    వ్రుత్తి, ప్రవ్రుత్తి అనేవి ప్రతి వాడికీ రెండు కళ్ళు. కానీ రాజకీయ నాయకులకి ఒకటే వ్రుత్తి; అది ప్రజల బలహీనతలతో ఆడుకోవడం. వారెవరికీ మనం ఏమవుతాం అని బాధ కాని, దేశాన్ని బాగు చేద్దామనే దురుద్దేశ్యం కానీ ఉన్వావు.
    మా గురువు గారు డాక్టర్ ఎస్ రావు గారు ( దిల్లి ఐ ఏ ఎస్ సర్కిల్) చెప్పేవాడు ..british have developed the nation in the name of exploitation; independent india is exploiting the nation in the name of development ... అని. అది అక్షర సత్యం.

    పొతే :
    సుబ్బు చెప్పిన రావి శాస్త్రి రాతలు ఈ నాటికి దర్పణాలు (atleast India లో). సుబ్బు చెప్పిన విధం గా మెడికల్ representative ల బాసులు ప్రార్ధించడం నేను చాలా సార్లు చూశా. వారిని అనుసరించడమాలేదా అనేది నీ ఇష్టం.
    - పుచ్చా

    ReplyDelete
  6. పుచ్చా గారు,
    మీ గురువు గారు అద్భుతంగా చెప్పారు.
    మొదటి 'in the name of' బదులు 'for the sake of' ఉంటే బాగుంటుందేమో?

    ReplyDelete
  7. Zilebi గారు..
    అనుమానమేల? మీరే కరెక్ట్!

    ReplyDelete
  8. Sri గారు..
    మీ స్పందనకి ధన్యవాదాలు.
    మీరన్నట్లుగానే నా ఆలోచనలు పాతవి. ఒప్పుకుంటున్నాను.
    కాబట్టి ఆ రకంగా నా రాతలు ప్రత్యేకమైనవే కదా!

    ReplyDelete
  9. "కడుపు నిండిన మేధావి", superb salutation!

    ReplyDelete
  10. కొత్త జనరెషన్ కొసం బ్లాగులు రాసేవాల్లు చాలా మంది వున్నారు..
    మీరు రాసే విధానం చాలా బాగుంది..ఇలాగే కొనసాగించండి..

    ReplyDelete
  11. bonagiri గారు..

    ఘాటు ఎక్కువయిందంటారా?

    ఇదంతా మా గుంటూరు మిర్చి మహిమ!

    ప్రయత్నిస్తాను.

    సలహాకి ధన్యవాదాలు.

    ReplyDelete
  12. మీ పోస్ట్స్ లో నాకు అన్నిటికన్నా నచ్చింది.
    interesting perspective
    ఈ డైలమా ఎడో ఒక స్థాయి లో ఉంటూనే ఉంటుంది. సమాజం లో పేదరికం, అసమానతలూ, exploitation ఉన్నంత వరకూ మార్క్సిస్ట్లు పోరాడటానికి ఒక cause ఉంటుంది. ఒక్క సారి సమసమాజం వచ్చేసి నిలదొక్కుకున్న తరువాత మార్సిస్ట్ లకి ఏమి relavance ఉంటుంది? అంటే మార్క్సిస్ట్ లు తమ అవసరం లేకుండా ఉండే దిశలో పోరాడుతున్నారన్న(?) మాట.
    ఇది ఏ political ideology కి ఐనా వర్తిస్తుంది. ఒక్క సారి తెలంగాణ వచ్చిన తరువాత, తెలంగాణ వాదం relevance కోల్పోతుంది. అలానే భారత జాతీయవాదం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత relavant కాకుండా పోయింది.

    ReplyDelete
  13. bonalapati గారు..

    సుబ్బు పోస్టులకి ప్రేరణ రావిశాస్త్రి.

    'ఆరు సారా కథలు' సంకలనం చదివే ఉంటారు.

    అందులో 'మాయ' కథ చాలా పాపులర్.

    ఆ కథలో ముత్యాలమ్మ కుర్ర ప్లీడర్ మూర్తికి దిమ్మ తిరిగిపోయే నిజాలు చెబుతుంది.

    మా సుబ్బుని ముత్యాలమ్మ అంత వాడిని చెయ్యాలనే దురాశ!

    స్పందనకి ధన్యవాదాలు.

    ReplyDelete
  14. సారా కథలు చదివాను కానీ అన్నీ గుర్తులేవు.
    మీ సుబ్బు మధ్యతరగతి ముత్తేలమ్మ అవ్వగలడు.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.